మాట - వరహాల మూట
కొందరికి మాటలాడుట ఒక కళ, మరికొందరికి మాటలాడుట కేవలము
కల. మాట నిజముగా వరహాల మూట. అభ్యసించితే ఆనందమే! అవమానము దరిజేరదు.
మాట
వలన జరుగు మహిలోన కార్యముల్
మాట
వలన పెరుగు మైత్రి ,కనగ
మాట
నేర్వకున్న మనుగడ లేదిది
రామమోహనుక్తి
రమ్య సూక్తి
నా
ఉద్దేశ్యంలో మాటకు ఇంత ప్రాధాన్యత వుంది.
మాటే జంత్రము(సంగీత వాద్యము)మాటే మంత్రము ,మాటే యంత్రము ,మాటే
తంత్రము.
గాలికి
కదిలే మీ కురులు వేయి వీణియల తంత్రులై నా
హృదయములో అనురాగామనే రాగాన్ని మీటుతున్నాయి అంటే అప్పుడు మాట జంత్రమేకదా.
(జంత్రమంటే సంగీత పరికరమని ఒక అర్థము)
సరియైన
సమయములో సరియైన సలహాచేప్పి సమస్యను సర్దుబాటు చేయగలిగిన నిజమైన స్నేహితుని మాట
మంత్రము కాదా!
సమయానికి
సాయపడే యజమాని మాట మనలను యంత్రము లాగా పనిచేయనివ్వదా!
తంత్రము
అంటే ఆలోచన. నేటి ‘టెంగ్లీషు’ లో చెప్పవలసి వస్తే ‘Sketch వేయుట’ అంటారు. యుద్ధమున
భీష్ముని కూలగొట్టుటకు కృష్ణుడు చేసినది ‘తంత్రమే’ కదా!
అన్నీ
మాటలే. కొన్ని తేనె ఊటలు కొన్ని బంగారు గొలుసు పేటలు, కొన్ని మంచికి బాటలు, కొన్నిహాయిని కలిగించే పాటలు,
కొన్ని అందాలీనే తోటలు, కొన్ని రక్షించే కోటలు, కొన్ని అతి మెత్తని దూటలు (దూటను
అరటి బొందె అనికూడా అంటారు),కొన్ని కష్టాలిచ్చేపూటలు,
కొన్ని చెడ్డను చెరిగే చేటలు, కొన్ని ఎండిన
చెట్లకు తాటలు ( అంటే చెట్టు బెరడు, Bark),కొన్ని జీవితముతో
ఆడుకొనే ఆటలు,కొన్ని గాయము చేసే ఈటెలు,తుపాకి
పేల్చే తూటలు, కొన్ని నీటి మూటలు,కొన్ని
పదును కత్తులు, కొన్ని నక్క జిత్తులు. కొన్ని విషపు విత్తులు,
కొన్ని ఆపదల గుత్తులు. కానీ సుమతి శతక కారుడు మాటను,
సత్యము అనే ఒక మేకు తో గోడకు తగిలించినాడు. అదేమిటంటే
మాటకు
ప్రాణము సత్యము
కోటకు
ప్రాణంబు సుభట కోటి ధరిత్రిన్
బోటికి
ప్రాణము మానము
చీటికి
ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ
అన్నాడు. కోటకు భటులు, నాతికి అంటే స్త్రీ కి మానము,
వ్రాతకోతలకు చేవ్రాలు ఎంత ముఖ్యమో మాటలకు సత్యము అంతకన్నా ముఖ్యము.
మాట ఎంత విలువ కలదో చూడండి.
ధృతరాష్ట్రుడు
భారతములో తన కొడుకు చర్యలు సరియైనవి కావని చెబుతూనే తనకు గల పుత్ర వ్యామోహము ఆ
విధంగా చేయిస్తున్నదని బాధ పడతాడు. కర్ణుడు తాను కుంతీ పుత్రుడని తెలిసిన పిదప
గూడా తన మాటకు కట్టుబడి దుర్యోధనునితో ఉండిపోతాడు. యుద్ధానికి ఆరంభములో ధర్మజునికి, తగిన సమయములో తన
మరణ రహస్యము తెలిపెదనని తాను ఇచ్చిన మాటకు కట్టుబడి భీష్ముడాతనికి తన మరణ
రహస్యమును ఆ విధంగానే తెలుపుతాడు .
దుర్యోధనుడు తానూ చేసేది తప్పే అని తెలిసినా, తాను దాయాది మాత్సర్యము వీడలేనంటాడు.
అంటే మంచయినా చెడ్డయినా మనపూర్వుల సత్య నిష్ఠా గరిష్ఠత మనకవగతమౌతుంది. ఇందులో మంచి
వారు చెడ్డవారు అన్న తారతమ్యము లేదు. అసలు
నిజము గజము వంటిది. అందుకే మరి ఏనుగు నడుస్తూవుంటే ఎంత హుందాగా ఉంటుందో చూడండి.
నిజము గజమైతే అబద్ధము అజగరము అంటే పాము. కాబట్టి పాముతో చెలగాటమెన్నటికీ మంచిది
కాదు.
ఈ
పద్యము చదవండి.
వినదగు
నెవ్వరు చెప్పిన
వినిననంతనే
వేగుపడక వివరింపదగున్
కనికల్ల
నిజము తెలిసిన
మనుజుడెపో
నీతి పరుడు మహిలో సుమతీ
ఇది
కూడా సుమతి శతక కారుని ఇంకొక పద్యము. సక్రమముగా వినుట, లేక మనసు పెట్టి
చదువుట, విన్నది ఆకళింపు చేసుకొనుట,ఆకళింపు
చేసుకోన్నదాని అర్థమేరిగి ప్రవర్తించుట మనిషి కి చాలా ముఖ్యము. అంటే ఒక మాటను
ఆకళింపు చేసుకోనేదానికి ఎంత అవగాహన అవసరమో అర్థము చేసుకోన గలరు. అసలు ఇవన్నీ
డబ్బుతీసుకొని చెప్పే Management Science లోని భాగాలే!
నేను
వ్రాసిన ఈ రెండు పద్యములను చదవండి.
మనసు
మాటలోన మాటేమొ పనిలోన
పనికి
పట్టుదలను పదిలపరచి
కష్ట
పడెడు వాడు కడు గొప్ప వాడురా
రామ
మొహనుక్తి రమ్య సూక్తి
పాటకు
పల్లవి ప్రాణము
ఆటకు
‘లయ’యౌను ప్రాణమాలోచింపన్
మనిషికి
నడతే ప్రాణము
మాటకు
ప్రాణమ్ము’నిజము’మరువకు రామా!
అంటే
మాట త్రికరణ శుధ్ధి గా ఉండాలన్న మాట. త్రికరణములు అంటే మనోవాక్కాయకర్మలు. భావము
మొదట మనస్సులో కలుగుతుంది. అది వాకు ద్వారా బహిర్గతమౌతుంది. దానిని క్రియారూపమున
పెట్టె కర్మమునాచరించితే మనము ఒక కార్యమును బాహ్యాభ్యన్తరశ్శుచితో చేసినట్లు.
అప్పుడే మనసుకు తృప్తి,మనిషికి ఆనందము.
తల్లి
తన సంతుకు మొదటి గురువు. ఒక వ్యక్తిని చూపి యితడు మీనాన్న అంటే అది ఆశిశువు
తక్షణము గ్రహించుటయే కాక నాన్న అని పిలుస్తూ అనుబంధము ఏర్పరచు కోవడము జరుగుతుంది.
తండ్రి వ్రేలు పట్టుకు నడుస్తూ ఎన్నో విషయాలు తెలుసుకొన్న పిదప గురువుకు
అప్పగించడం జరుగుతుంది. 'గురువు' 'teacher' కు సమానార్తకము కాదు. teacher
అంటే one who teaches. అతని బాధ్యత అక్కడితో
ముగుస్తూంది. 'గురుత్వ'మది కాదు. అసలు గురుత్వము అంటే 'density',అంటే గాఢమైన అని అర్థము . పాఠము చెప్పి ఇక పోయిరమ్మనుట కాదు గురువు యొక్క
బాధ్యత. శిష్యుడు తనంతవాడయ్యేవరకు తన చత్ర ఛాయా (గొడుగు నీడ)లోనే వుంచుకొంటాడు
కావున వానిని ఛాత్రుడు అన్నారు. ఎంత మంచి మాటో చూడండి.అదే student అనే మాటకు one who studies అనే గదా అర్థము. కావున
గురుశిష్య సంబంధమునకు teacher--student సంబంధమునకు
హస్తిమశకాంతరము, అజగజ సామ్యము,పర్వత
పరమాణు సారూప్యము. కావున గురువు ఏమి మాట్లాడవలె ఎట్లు మాట్లాడవలె ఎంత మాట్లాడవలె
అన్నవి కూడా తన శిక్షణ లో భాగంగా చెబుతాడు. అందుకే నే నంటాను:
అమ్మ
మాట సద్ది యన్నంపు మూటౌను
అయ్యా
మాట చూడ అందు పెరుగు
గురువు
గారి మాట గురుతుంచు లవణము
రామమోహనుక్తి
రమ్య సూక్తి
మనకు
నచ్చని విషయాలు సూన్నితముగా చెప్పడమనేది ఒక కళ. ఇందులో చెప్పేవానికి చెప్పించుకొనే
వానికీ అవగాహన వుంటే వారి మధ్యన పొరపొచ్చులు రావు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ :
పెళ్లి
పెత్తనానికి వచ్చిన అబ్బాయి యొక్క తండ్రి ఒక కుర్చీ పై కూర్చొని, మిగత
నలుగురిముందు భార్యతో ఇట్లన్నాడు. ఇందూ ! రా యిలా కూర్చో. చెప్పింది ఒక మాటే అయినా
అర్థాలు మాత్రము రెండు. ఒకటి నా ప్రక్కనవచ్చి కూర్చో ఐతే రెండవది మాట్లాడకుండా
రాయి లాగా కూర్చోమనుట. ఇది ఆమెకు మాత్రమే అర్థమౌతుంది. ఎందుకంటే వారి మధ్యన అవగాహన
వుంది కాబట్టి.
మాటకున్న
ఇంకొక ప్రాధాన్యత చూస్తాము.
భర్తృహరి
సుభాషితాలలో 'విద్యా దదాతి వినయం'అన్న ఒక శ్లోకాన్ని ఈ విధమైన పద్యంగా తెనుగించినారు ఏనుగు లక్ష్మణ
కవి గారు.
విద్య
యొసగును వినయంబు వినయమునను
బడయు
పాత్రత పాత్రత వలని ధనము
ధనము
వలనను ధర్మంబు దాని వలన
నైహికాముష్మిక
సుఖంబు లందు నరుడు;
మనము
నేర్చుకొనే విద్య వినయప్రదానమై వుండాలి. అప్పుడే మనలపెద్దల ఆదరమును పొందే పాత్రత
లభించుతుంది. పాత్రత వలన అంతా మంచే జరుగుతుంది. జిజ్ఞ్యాస, వయసు తో
నిమిత్తము లేకుండా, అందరికీ ఉండవలసిందే. అడిగే పధ్ధతి
ఎదుటివారికి ఆనందము కలిగించాలి. కొందరి మాటలు వింటే మొక్క బుద్ధి పుడుతుంది
కొందరివి వింటే మొట్ట బుద్ది పుడుతుంది. మన మాటలో ఎపుడూ నిజము నిజాయితీ నిండి
ఉండాలి,
నిండుకొని
గాదు(అంటేఅయిపోవడం. )
హనుమంతుడు
మారువేషములోవెళ్లి మొదటి సారి రామలక్ష్మణులను చూసి వారిని ప్రశ్నించిన తీరును
రాములవారు వాల్మీకి రామాయణము లో ఈ విధంగా మెచ్చుకొంటాడు :
నానృగ్వేద
వినీతస్య నా యజుర్వేద ధారిణః
న
సామవేద విదుషః సక్యమేవాభ్యభాషణం
అంటే
ఋగ్వేద వినీతుడు అంటే వేదమును గురువు వద్ద అధ్యనం చేసిన వాడు.యజుర్వెద ధారిణుదు
అంటే ఉదాత్త అనుదాత్త స్వరాలతో షడంగ సముపెతమైన వాక్ శుధ్ధి, సందర్భోచిత
సమాధానాలు కలిగిన వాడు. సామ వేద విదుషః అంటే శాస్త్ర సంగ్రహుడే కాక గాన
ప్రాధాన్యమైన సామవేదం సాంగోపాంగంగా నేర్చి తన ఊహా వైదుష్యంతో శ్రోతలకు రససిద్ధి
కలిగించినవాడు. మాటకు అంత ప్రాధాన్యత
వుంది. అడుగుటలో అణకువ వుండాలి.
మనకు
తెలియనివి తప్పులుకావు అన్న తెనాలి రామకృష్ణు ని మాటతో ముగించుతూ నన్ను తప్పుగా
తలవ వద్దని తెలుపుకొను చున్నాను . జ్ఞానము అనంతము. జ్ఞానము అసలే లేనివారు ఎవరూ
వుండరు కావున అంతో ఇంతో ఎంతో కొంత అందరమూ జ్ఞానులమే. అట్లని పరిశోధన లేక విచికిత్స చేయకుండా ఒకరిని
తూలనాడుట తప్పు.
ఒకసారి
రాయల ఆస్థానమునకు ప్రెగ్గడ నరసరాజు వచ్చి ఇంతవరకు వ్రాసిన కవుల కవిత్వాలలో తప్పులు
క్షణంలో పడతానంటాడు కానీ రామకృష్ణుడు ఒక పద్యమిచ్చి తప్పు చూపించమంటే ఏదో ఒక పదము
తప్పని చెబుతాడు ప్రెగ్గడ. రామకృష్ణుడు ఆ పదము తప్పుకాదు అని సహేతుకముగా
నిరూపించుతాడు. ఆ సందర్భములో ఈ పద్యాన్ని చెబుతాడు:
తెలియనివన్ని
తప్పులను దిట్ట తనాన సభాంతరంబునన్
తెలుపగా
రాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ
పలికిన
నోట దుమ్ముపడ భాయమేరున్గాక పెద్దలైనవా
రాల
నిరసింతువా ప్రెగడరాణ్ణరసా విరసా తుసా బుసా
కావున
మన విమర్శా పెదవి దాటకముందే మెదడుకు పంపి జల్లింపబడిన తరువాత (after scanning ) దాటించడము
శ్రేయోదాయకము.
ఈ
భర్తృహరి పద్యానికి ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగు సేత ఒక సారి తిలకించండి .
భూషలు
గావు మర్త్యులకు భూరిమయాంగద తార హారముల్
భూషిత
కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలు
గావు పూరుషుని భూషితు జేయు పవిత్ర వాణి వాగ్
భూషణ
మే సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్
ఇదండీ
మాట యొక్క మహిమ
'అనంతో వై వేదాః' అన్నారు ఆర్యులు. అవి కల్గిన భూమిలో
పుట్టినందుకు గర్విద్దాం.
మనసు
పెట్టి మాట్లాడుతారని ఆశ. మనసారా చదువుతారని అత్యాశ.
ఇక
విమర్శను గూర్చి ఒక్క మాట. విమర్శ అన్నది నోటికొచ్చినట్లు మాట్లాడుట కాదు.
చదరంగములో పావులను ఆలోచించి కదిలించిన రీతిలో అక్షరములను ఏర్చి పేర్చి కూర్చవలె.
అప్పుడే ఆమాటకు కలుగుతుంది అర్థము అడిమనకందిస్తుంది పరమార్థము. అందుకే
విమర్శ చిరుజల్లులు కురిసినట్లుండాలి కానీ జడివాన లాగా
కాదు. అంటే ఎదుటి వారికి బాధ కలిగించుట కానేకాకూడదు. హాయిగా పూల జల్లు వలె
ఉండవలెను.
ఎంత హాయిగా వుండాలనుటకు సుమతి శతకకారుని మాటే కొలబద్ద :
ఎప్పటికెయ్యది
ప్రస్తుత
మప్పటికా
మాటలాడి అన్యుల మనముల్
నొప్పింపక
తానొవ్వక
తప్పించుక
తిరుగువాడు ధన్యుడు సుమతీ
అని
అన్నాడు.
దీనిని
సరదాగా నేను ఇంగ్లీషుతో కలిపి ఇట్లు చెప్పినాను (యతి ప్రాసలు చూడవద్దు, నవ్వొస్తే
నవ్వుకొండి )
ఎప్పటికెయ్యది
వాంటెడొ
అప్పటికా
టాకు టాకి అన్యుల హార్టుల్
హర్టింపక
హర్టవ్వక
ఎస్కేపై
తిరుగు వాడు ఎక్స్పర్ట్ సుమతీ
కాబట్టి
ఒక వ్యక్తిని 'మీకు బుద్దిలేదు' అనుటకంటే 'మీరు
ఈ పని చేయుటలో బుద్ధినుపయోగిన్చినట్లు లేదు' అని అనుట ఎంత
ఉభయతారకముగా ఉంటుందో గమనించండి. అందుకే మాట మహిమాన్వితమైనది.
అసలు
ఈ చాటువు మాటను గూర్చి ఎంత మంచిమాట చెప్పిందో చూడండి
మాటలచేత
దేవతలు మన్నన చెంది వరంబులిత్తురున్
మాటలచేత
భూవరులు మన్నన చెంది పురంబులిత్తురున్
మాటలచేత
భామినులు మన్నన చెంది మనంబులిత్తురా
మాటలు
నేర్వకున్న అవమానము న్యూనము మానభంగమున్
దేవతలనుండి
వరములు పొందుటకు, వారిని ముందు ప్రసన్నులను చేసుకొని పిదప మన కోరికలను నివేదించుకోనవలె.
అందుకే సహస్రానామాలతో ఆష్టోత్తరాలతో ఆరాధిస్తూవుంటాము దేవతలను. అత్యంత ముఖ్యమైన ఈ
చాటువు ఒక సారి చదువుదాము.
న
తథా శశీ న సలిలం న చందన రసో న శీతలచ్ఛాయా
ప్రహ్లాదయతి
హి పురుషం యథా మధురభాషిణీ వాణీ
మాట
వరహాల మూట . నోరు మంచిదైతే వూరు మంచిదంటారు. పూర్ణచంద్ర బింబము కానీ, సమశీతల నీరము
కానీ, మధురభాషణమును పోలలేవు. ఎప్పటికీ పరుషముగా మాటలాడరాదు.
అందుకే
పెద్దలు
సత్యం
భ్రూయాత్ ప్రియం భ్రూయాత్
నభ్రూయాత్
సత్యమప్రియం
ప్రియంచ
నానృతం భ్రూయాత్
ఏషా
ధర్మః సనాతనః
అన్నారు.
ప్రియకరమైన సత్యమును పలుకవలెను, అట్లని ప్రియము కలిగించే అబద్ధమును పలుకనేరాదు.
మరి మనిషికి బాధను కూర్చే నిజామును పలుకవచ్చునా అంటే అదీ పనికిరాదు. ఇదే మన సనాతన
ధర్మము. ఇంతమంచి ఉపదేశములు కలిగిన మన సంస్కృతిని, సంస్క్రుతమును విడువ వద్దు.
మనకున్న అనేక శాస్త్రములలో ‘నీతి’ కూడా ఒక శాస్త్రము. శాస్త్రము అంటే శాసించేది.
ఇది మారాడు. అర్థము చేసుకొని దానికి అనుగుణముగా మనము మారవలసినదే! ఇది పాశ్చాత్యుల
సమయాన్ని బట్టి మారె Science కాదు.
తొందరపాటు
తనముతో ఏర్పడిన ఆవేశము వలన మాటలాడే మాటలు ఇతరులను ఎంతకాలము నొప్పించుతాయో మనము
ఊహించలేము . కావున కఠినమైన భావాన్ని కూడా కడుమెత్తగా చెప్పవలెను . మన మాట, తన కోరల తో
చీరేసే పులి తన చంటి బిడ్డలను తన పళ్ళతో ఎంత మెత్తగా పట్టుకొని ఒక ప్రదేశము నుండి
వేరొక ప్రదేశమునకు పోతుందో, అంత మెత్త గా ఉండవలెను. ఇది
సహజంగానూ సమకూరవచ్చు సాధన వలననూ సంభవించ వచ్చు.
ఒక
చిన్న కథ చదవండి.ఒక విద్యాధికుడైన ముదుసలి వచ్చి ఒక దేశ ప్రధానిని చూడ వెళ్ళినాడు.
విషయము ప్రధాని గారి కార్యదర్శి ఏర్పాటు చేసి ప్రధానికి చెప్ప మరచినాడు.ముఖ్యమైన
పాత్రికేయులు మాత్రము అనుమతింపబడినారు. మాటలు చాలా సుహృద్భావ వాతావరణములో
ముగిసినట్లు కనిపించినాయి. ఆ విద్యాధికుడైన ముదుసలి బయలుదేరిన వెంటనే శ్రవణ
సాధనములట్లే వున్నాయని గమనించకుండా తన అనుచరులను, అసలతనిని లోనికి ఎందుకు
రానిచ్చినారని గట్టిగా కేకలు వేసినాడు, తన భావము నణచుకోలేక.
అంతే ,అంతా రసాభాసమే! ఆతను మళ్ళీ ఎన్నికలలో గెలుచుట
జరుగలేదు.
అందుకే
పెద్దలు,చంద్రుడు,చల్లని పానీయము,గంధపు
పూత,హాయిని గొలిపే నీడ,సహజంగా మానవుని
ఆనందపరుస్తాయి . కానీ వీటన్నిటికంటే మధురమైన సంభాషణ హృదయాన్ని ఎంత ఉల్లాస
పరుస్తుందో చెబితే మాటలు చాలవు.
దీనిని
సాధించ దలచినవారు ఆనన గ్రంధి (Face Book) లో వ్రాసే విమర్శ (comment) తో మొదలుపెట్టవచ్చు . చివరిగా పెద్దల మాటతో ఈ వ్యాసమును ముగించుచున్నాను.
ప్రియమైన మాటలు
అందరిని దగ్గర చేస్తాయి కటువైన మాటలు దూరం చేస్తాయి
దీన్ని గురించిన ఈ
శ్లోకం చూడండి-
ప్రియవాక్య ప్రదానేన
సర్వే తుష్యన్తి జన్తవఃl
తస్మాత్తదేవ వక్తవ్యం
వచనేకా దరిద్రతll
ఎదుటివారికి ప్రియంగా మాట్లాడటం వలన అందరూ సంతోషిస్తారు. మెచ్చుకొంటారు. అందుచేత ఓ సంఘజీవీ నీవు ప్రియంగా మాట్లాడుతూం ఉండు. మాటలకు దరిద్రం(లోటు) ఉండదుకదా మాట్లిడితే పోయేదేముందీ - అని భావం
స్వస్తి.
Ravi
Sudhakar Musunuri మంచి మాటలకు ప్రపంచంలో ఎప్పుడూ కొరత వుంటుంది.
అందుకే వాటిని ఎప్పుడూ వృధా చేయద్దు.
Sadanandeeswaraiah
Vallamkondu మంచి మాట చెప్పారు
VR
Ganapathi మంచి మాట!!
Satyanarayana
Choppakatla మీమాటలు వరాల మూటలు!
Sarada
Rupakula మీరు రాసినవి అన్నీ నేను చదువుతాను. ఒక్కసారి కాదు ఇష్టం
వచ్చినన్ని సార్లు. ఈ రోజు ఈ విషయాలు చదువుతుంటే మాకు తెలుగు చెప్పిన
భాస్కరశాస్త్రిగారు గుర్తు వచ్చారు. మనసుకి హత్తుకొనేటట్లు చెప్పే వారు.
గురు
శిష్య సంబంధం మీరు చెప్పిన విధంగా కాదు కదా teacher - student లా కూడ లేదు. చెప్పే
వారికి చేవ లేదు వినేవారికి ఓర్పు లేదు. అందుకే వచ్చే జ్ఞానం లేకపోగా వెకిలిగా
మారింది విద్యావ్యవస్థ.
ఉదయం
నుండి నాకు ఎవరికీ శుభాకాంక్షలు చెప్పబుద్ది కాలేదు అంటే అతిశయోక్తి కాదు.
“గురు పూజోత్సవ శుభాకాంక్షలు.”
Gowrishankar
Gowri
Gowrishankar
Gowri Mata gurinchi chala chakkaga Aneka sandarbalalo kavula matalu Teliyajesi
mamulanu anandaparachinaru.Mee matalu maku mantrambulu. Meeru Bahumukhapragnasali.
Namaste. Namaste.