మహారాజా
అగ్రసేన్
https://cherukuramamohanrao.blogspot.com/2020/11/blog-post.html
శ్రీ అగ్రసేన్ భవన్ హైదరాబాద్ లోని బోవెన్ పల్లిలోని సైఫర్ లేన్ వద్ద ఉన్న అత్యంత
ప్రతిష్టాత్మక ఫంక్షన్ హాల్. హైదరాబాద్ లోని శ్రీ అగ్రసేన్ భవన్ పుట్టినరోజులు,
నిశ్చితార్థం, నామకరణ కార్యక్రమం, వివాహం మరియు ఇతర సామాజిక
కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తుంది. ఇది పాట్నీ Bus Junction కు దగ్గరగా
Audi Car Service Center ప్రక్కన ఉన్నది. ఎంతమంది గమనిన్చియుంటారో
నాకు తెలియదు. ఇటువంటి ధార్మిక సంస్థలను తన పేరుపై కలిగిన ఆ మహానుభావుని గూర్చి తెలుసుకొందాము.
అజరామర సూక్తి-64
ప్రాతరుత్థానం చ యుద్ధం చ సంవిభాగం చ బంధుషు l
స్వయమాక్రమ్య భుక్తం చ శిక్షేచ్చత్వారి కుక్కుటాత్ ll - చాణక్య
నీతి
లో రాజా అగ్రసేన్ ను గూర్చి వివరముగా తెలుపుతానని చెప్పియుండినాను. ఆ
మాటలోని వాస్తవమును మీముందుంచున్నాను.
మహారాజా అగ్రసేన్ అగర్వాల్ కులపితామహుడు. అతను కలియుగ సంధికాలములో
సుమారు 5,187 సంవత్సరాల తరువాత సూర్యవంశి క్షత్రియ వంశానికి చెందిన
మహారాజా వల్లభ సేన్ ఇంట శ్రీ రాముని కుమారుడైన కుశుని యొక్క 34 వ తరం లో
అశ్వయుజ శుక్ల పాడ్యమినాడు జన్మించినట్లు తెలియవస్తూ ఉంది. స్వయముగా
‘అగ్రవాల్’ వంశజుడయిన ప్రసిద్ధ చరిత్రకారుడగు భారతేందు హరిశ్చంద్ర గారి వలన
మనకు అగ్రసేనుని చరిత్ర చాలావరకూ ఆయన రచించిన ‘అగ్రవాలోన్ కి ఉత్పత్తి’ ద్వారా
తెలియవస్తూ వున్నది.
ఆయన రాజధాని యగు అగ్రోహా (ప్రతాప్ నగర్ అని కొందరంటారు) రాజస్థాన్
మరియు హర్యానా రాష్ట్రాల మధ్య సరస్వతి నది ఒడ్డున ఉంది. వల్లభసేనునకు కు
అగ్రసేన్ మరియు శూరసేన్ అనే 2 కుమారులు ఉన్నారు. అగ్రసేన్ వల్లభసేనుని పెద్ద
కుమారుడు. అగ్రసేనుడు జన్మించిన సమయంలో, గర్గమహర్షి వల్లభునితో అగ్రసేనుడు
గొప్ప పేరుపొందిన రాజగుటయేగాక దేశమున ప్రజా హితమునకై పెను మార్పులు
చేస్తాడని చెబుతూ ఆయన పేరు అమరమై భూమిపై నిలుస్తుందని చెప్పినాడు.
పురాతన గ్రంథాలలో పేర్కొన్న అగర్వాలల యొక్క మూలము నేడు కూడా మనకు
అగ్రోహా లో లభించుతుంది. ‘మహారాజా అగ్రసేన్’ పేరుతోనున్న రాష్ట్రీయ రహదారి సంఖ్య
-10 హర్యానాలోని హిసార్-సిర్సా బస్సు మార్గంలో, దిల్లీ నుండి 190 కిలోమీటర్లు
మరియు హిసార్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకప్పుడు మహారాజా
అగ్రసేన్ రాజధానిగా ఉన్న ఈ నగరం నేడు ఐదు వందల కుటుంబాల జనాభా కలిగిన
సాధారణ గ్రామంగా ఉంది. దాని సమీపంలో, పురాతన రాజధాని అగ్రెహ్ (అగ్రోహా)
యొక్క అవశేషాలు 750 ఎకరాల విస్తీర్ణము గల ఈ నేల బంజరుభూమిగా విస్తరించి
ఉన్నది. ఇది అగ్రసేన్ మహారాజ్ యొక్క అగ్రోహా నగర్ యొక్క అద్భుతమైన చరిత్రను
చూపిస్తుంది.
భారత యుద్ధమున వల్లభసేనుడు పాండవ పక్షమున యుద్దముచేసి 10వ రోజున
భీష్ముని చేతిలో నిహతుదయినట్లు చరిత్రకారులు చెబుతారు. అప్పుడు 15 సంవత్సరముల
వయసు కలిగిన అగ్రసేనునికి పట్టము న్కట్టినట్లు తెలియ వస్తూవున్నది.
ఒకసారి అగ్రసేనుడు శివుని అనుగ్రహాన్ని కోరి వారణాసిలో ఘోరతపస్సు సాగించినాడట.
అగ్రసేనుని తపశ్చర్యకు మెచ్చుకుని పరమేశ్వరుడు ప్రత్యక్షమై, మహాలక్ష్మిని కూడా
ప్రసన్నం చేసుకోమని సలహాను అందించాడట. అంతట అగ్రసేనుడు మహాలక్ష్మికై
తపస్సు సాగించగా, లక్ష్మీదేవి ప్రత్యక్షమై ప్రజల సౌభాగ్యం కోసం వైశ్యవృత్తిని చేపట్టమనీ,
వారి కోసం ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించమనీ సూచించిందట. ఆమె చెప్పినట్లుగానే
అగ్రసేనుడు నూతనంగా రాజ్యాన్ని స్థాపించేందుకు అనువైన ప్రదేశం కోసం వెతకడం
మొదలుపెట్టగా, ఒకచోట పులిపిల్లలూ, తోడేలు పిల్లలూ కలిసి ఆడుకోవడం
కనిపించిందట. తన రాజ్యస్థాపనకు అదే సరియైన ప్రదేశముగా భావించి, అక్కడ
అతను అగ్రోదయ అనే రాజ్యమును స్థాపించి, దానికి రాజధానిగా 'అగ్రోహా' ను
చేసుకొని ఆరాజ్యమును పాలించినాడు.
హర్యానాలోని హిసార్ జిల్లాలో ఇప్పటికీ ఈ పట్టణం ఆనవాళ్లు కనిపిస్తుంటాయి.
ఇక్కడ త్వవకాలను జరిపిన పురాతత్వ శాఖకు క్రీస్తు పూర్వం నాటి అవశేషాలెన్నో
కనిపించినాయి.
ఆయన జీవిత కాలమంతా అచంచల లక్ష్మీభక్తునిగా ఉండిపోయినాడు. ఆ తల్లిని
ప్రసన్నము చేసుకొని తనకుయ్ కలిగిన 18 కుమారులకు పద్దేనిమిద్ది గోత్రములను
ఈ దిగువ తెలిపిన విధముగా కల్పించి, వారు లక్ష్మీ దేవిని శ్రద్ధా భక్తులతో పూజించినంత
కాలము వంశాభివృద్ధి కల్గినవారై వర్ధిల్లుతూ ఉండవలెనన్న వరమును పాయిందినారు.
అగ్రసేనుడి వంశజ్ఞులైన అగ్రర్వాల్లు 11వ.శ వరకు "అగ్రోహ రాజధానిగా పరిపాలన
కొనసాగించారు. మనదేశంపై మహ్మద్ఘోరి దండయాత్ర వలన అగ్రోహ వారు
దూరప్రాంతాలకు వలస వెళ్లినారు. ఆ కారణంగా వేలాది మంది నిరాశ్రయులగుటయే
గాక జీవనోపాధి కోసం భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు వలస రావటము జరిగింది
కానీ, వారు తమ గుర్తింపును వదల్లేదు. వారు ఇప్పటికీ ఆ 18గోత్రనామాల్తోనే లోకపరిచయము ఏర్పరచుకొనియున్నారు.
ఆ 18 గోత్రములవారు:
గార్గ్, గోయల్, కుచ్చల్, కన్సల్, బిందాల్, ధారన్, సింఘాల్, జిందాల్, మిట్టల్, టింగల్,
తాయల్, బన్సాల్, భాండాల్, నంగల్, మంగళ్, అయిరన్, మధుకుల్. గోయన్.
కావున ఈ 18 గోత్రములవారూ అగ్రసేనుని సంతానమే!
మహారాజా అగ్రసేన్ లౌకిక వాదమునకు చక్కని నిర్వచనమునిచ్చినాడు. తన ప్రాంతంలో
నిజమైన సమసమాజమును నెలకొల్పుటకు, తన దేశములోని ఏ ప్రాంతమునకు వచ్చి
నిలిచిపోవలేనని తలచినా ఆ వ్యక్తికి ఆప్రాంతవాసులందరూ, అతనికి 1 రూపాయి
(ఆ కాలమున రూపాయిని ఏమనేవారో నాకు తెలిసిరాలేదు) మరియు 1 ఇటుకను
ఇవ్వవలసినదిగా దేశమంతటా ఉత్తరువును జారీ చేసినాడు. తద్వారా ఆయన
ఆ అగంతుకునికి స్థిరనివాసము వ్యాపార అవకాశాన్ని కలుగాజేసినాడు. దానివల్ల
వచ్చిన వానిహృదయములో కృతజ్ఞతా భావము వెల్లివిరిసి ఉత్తమ జీవితమును
నెరిపి ధర్మ యుక్తముగా ఆర్జన చేసేవాడు. అగ్రసేన మహారాజు ఆ విధముగా ఒక కొత్త
వ్యవస్థకు జన్మనిచ్చినారు. సనాతన వేద సంస్కృతి యొక్క ప్రాథమిక సూత్రములను
వర్తింపజేసి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో వ్యవసాయ-వ్యాపార, పరిశ్రమ, గోపోషణతో బాటు నైతిక విలువల స్థాపనకు కంకణము కట్టుకొని వానిని ప్రతిష్ఠించిన మహానుభావుడు ఆయన.
అగ్రసేనుడు 108 సంవత్సరములు అవిశ్రాంతముగా, నియమ నిబద్ధతలను పాటించుతూ, జనరంజకముగా, ఆదర్శవంతముగా పాలించినట్లు జనవాక్యం. ఆయన శాస్త్రములలో వైశ్య వర్ణానికి దర్శకత్వం వహించిన కార్యాచరణ విదానములకు ప్రాధాన్యత నిచ్చి పట్టము కట్టి అందుకు అనుకూలముగా సముచిత శాసనములను చేసినారు. మరోవైపు దేశ పురోగతికి కొన్ని ఆదర్శ సూత్రములను నెలకొల్పినారు. ఆయన 3 ఆదర్శ ప్రాథమిక సూత్రములకు ప్రాదాన్యతనిచ్చినాడు. అవి:- ప్రజానురంజక పాలన, ఆర్థిక సమత మరియు సామాజిక సమతత్వము. ఆయన 18 ఆశ్వమేధములను జేసి 18వ యాగము నుండి చేసిన మిగతా యజ్ఞములయందు పశుబలులను మాన్పివేసినాడు.
ప్రతి వ్యక్తి తన రాష్ట్ర మరియు మతపరమైన పనుల కోసం తన ఆదాయంలో పదోవంతు దైవ కైంకర్యమునకై నిర్దేశించినాడు. అంటే దైవ, మత, మానవపరమైన ధర్మకార్యములకై ఉపయోగించవలెనను ఆదేశములనొసంగినాడు. రాష్ట్రములోని ప్రతి వ్యక్తి తన జీవనోపాధిని ఇతర ధర్మమార్గాల ద్వారా లేదా వాణిజ్యము ద్వారా సంపాదించుకొంటూ ఉండినా దేశంపై విపత్తు సమయంలో, అన్ని వర్గాల ప్రజలు ఆయుధాలతో పోరాడటానికి సిద్ధముగా ఉండునట్లు కట్టడి చేసినాడు. సమసామాజ వ్యవస్థను అకుంఠిత దీక్షతో పాటించి సనాతన ధర్మ గౌరవమును తన పదవీ కాలములో కాపాడుతూ వచ్చినాడు.
107 సంవత్సరములు రాజ్యపాలన సాగించి తన 108 ఏట వాన
ప్రస్తమును బూని
అడవులకు వెళ్ళి తపమాచారించుతూ పరమాత్మ సాయుజ్యమును
పొందినాడు.
నేటికీ, వారి వారసులందర, మహారాజ్ అగ్రసేన్ దర్శకత్వం వహించిన మార్గాన్ని
అనుసరించి సమాజ సేవలో నిమగ్నమై ఉన్నారు. ‘అగ్రసేన్ కి బావోలి’ అంటే అగ్రసేన
మహారాజు త్రవ్వించిన అతి పెద్ద దిగుడు బావి, దిల్లీలోని కన్నాట్ ప్లేస్ సమీపంలో హైలీ
రోడ్లో ఉంది. ఇది 40 మీటర్ల పొడవు మరియు 15 మీటర్ల వెడల్పు గలిగియుంది. ఇది
పురావస్తు సర్వేక్షణ మరియు అవశేషాల చట్టం, 1956 ప్రకారం భారత పురావస్తు శాఖ
పర్యవేక్షణలో ఉంది. 2012 లో, భారతీయ తపాలా శాఖవారు , అగ్రసేన్ శాసనం కలిగిన
ఈ బావి యొక్క తపాలా
బిళ్ళ కూడా జారీ చేసినారు.
ఇంతటి చరిత్రపురుషుని గూర్చి, ఎంత మందికి తెలుసును అన్నది మన
చేతకానితనమును చెప్పుకోలేని రహస్యము. అసలు అహింసను గౌతమ బుద్ధునిని కంటే
ఎంతోముందే, సనాతన ధర్మ పరిధిలోనే, వ్యాప్తి లోనికి తెచ్చిన మహానుభావుడీయన.
అట్టి మహానుభావుని ఇకనైనా జ్ఞాపకము ఉంచుకొని పదుగురికి ఆయన
గొప్పదనమును తెలియజేద్దాము.
స్వస్తి.