నీ పాద కమల సేవయు
https://cherukuramamohanrao.blogspot.com/2023/10/blog-post.html
నీ పాద కమల సేవయు
నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయును
తాపస మందార! నాకు దయసేయగదే!’ (భాగవతము)
ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు? అనేవి ఈ చిన్న
పద్యం తెలియజేస్తుంది.
కంస వధకు ముందు బలరామకృష్ణులు మథురా నగరంలో ప్రవేశించినారు.
పురజనులు వారిని సందర్శించి మురిసిపోతున్నారు. బలరామకృష్ణులు ఆ దృశ్యాలను చూస్తూ
రాజవీధిలో ముందుకు నడిచి వస్తూవున్నారు. తమను ధిక్కరించిన రజకుడిని భంగపరచి, అతని మూటలోని
ధౌతవస్త్రాలు(ఉతికిన బట్టలు) తీసుకొని ధరించినారు. దారిలో పరమ భక్తుడైన సుదాముడనే
మాలాకారుని గృహానికి చేరుకున్నారు.
వారిద్దరికీ సుదాముడు ప్రణమిల్లి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి తగురీతిన
సత్కరించినాడు.వారు కోరిన వరాలిస్తామన్నారు. అప్పుడు అతను పైపద్యంలో చెప్పిన
విధంగా కోరుకున్నాడు. మాధవుడు తదాస్తు అన్నాడు.
ఇపుడు పైపద్యంలో
సుదాముడు ఏమి కోరినాడు అన్నది తెలుసుకొందాము. ఆ పరమ భక్తుడు అధికారం కోరలేదు.
దానివల్ల అహంకారం పెరుగుతుంది కాబట్టి. అది రజోగుణ లక్షణం. అది చివరికి దుఃఖదాయకం
అవుతుంది. ధనం కోరుకోలేదు. ‘ధనమెచ్చిన మదమెచ్చును’ అనేది ఉండనే ఉన్నది. ‘ పద్మముల
బోలిన నీ పాదసేవను ప్రసాదించు, నిన్నుఅర్చించే భక్తుల సహవాసము కావలెనన్నాడు,అధికము, అవ్యయము అగు
భూత దయ అంటే సాటి ప్రానులపై దయ, అనగా జీవహింస చేయకుండా ఉండు సుగుణమును కోరుచున్నాడు.
భగవంతుని తాపస మందార అని సంబోధించుచున్నాడు, అంటే భక్తులకు కల్పవృక్షము వంటివాడు అని అర్థము.
సుదాముడు పుట్టుకచే ఒక బ్రాహ్మణుడో, క్షత్రియుదో కాదు. అయినా ఎంతటి ఉన్నత భావములు
కలిగినాడో మనము గమనించితీరవలసిన విషయము. భగవంతుడు సేవ్యుడు (సేవించదగిన వాడు).
భక్తుడు సేవకుడు- ఈ సేవ్యసేవక భావమే మనము అనుసరించవలసిన సాధనామార్గము. ఇది
కలియుగానికి ఎంతగానో తగినది. భగవానుడి పాదసేవ వల్ల అహంకారం అడుగంటిపోతుంది. అదే
సత్వ గుణ లక్షణం. ఈ సత్వగుణమే క్రమంగా దివ్యానంద ప్రదమైన భగవత్ సన్నిధానానికి
దారితీస్తుంది.
స్వస్తి.