Friday, 29 October 2021

అర్జనుని సందేహం

అర్జనుని సందేహం

https://cherukuramamohanrao.blogspot.com/2021/10/blog-post.html

కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ।

ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హవరిసూదన ।। 2-4 ।।

భీష్ముడు కురువృద్ధుడు, గుణవృద్ధుడు, జ్ఞాన వృద్ధుడు అందునా అర్జనునిపై అమితమైన 

అనురాగము కలిగినవాడు.

ఇక ద్రోణుడో!

శ్లో. ప్రణవో ధనుః శరో హ్యాత్మా

బ్రహ్మ త ల్లక్ష్య ముచ్యతే !

అప్రమత్తేన వేద్ధవ్యం

శరవత్ తన్మయో భవేత్ || (ముండకోపనిషత్తు)

ఓం అనే ప్రణవ నాద మంత్రమే ధనుస్సు. జీవాత్మయే ప్రాణం. బ్రహ్మమే అక్ష్యం. 

నిర్మలహృదయంతో ఏమరుపాటులేకుండా ఆ లక్ష్యాన్ని చేదించి తన్మయత్వం చెందాలి.

లక్ష్యాన్ని చేరాలంటే బాణం అవసరం కదా! ఆ బాణం సంధించడానికి ధనుస్సు అవసరం! 

అటువంటి ధనుస్సే ఓంకారం. ప్రణవార్ధాన్ని తెలుసుకోవడమే జ్ఞానంగా చెప్పబడుతోంది. 

అంటే ఇక్కడ ఏకాగ్రతను గూర్చి యోగమున దాని ప్రాధాన్యతను గూర్చి చెప్పబడినది. 

,గురువు ద్రోణాచార్యునివద్ద నేర్చుకొన్నఈ యోగ సాధనను ధనుర్విద్యకు 

అనుసంధించుటచే అర్జనుడు పక్షి యొక్క కంటిని మాత్రమే చూచి, బాణముచే గుడ్డును 

మాత్రమే తాకునట్లు వేయగలిగినాడు.

అంటే విలువిద్య అనే వ్యాజ్యంతో అనేక విద్యలు నేర్పినవాడు గురువు ద్రోణాచార్యుడు.

అర్జనుడంటూవున్నాడు

యోత్స్యమానాన వేక్షేఽహం ఏతేత్ర సమాగతాః

ధార్తరాష్ట్రస్య దుర్బుద్దేః యుద్దే ప్రియచికీర్షవః ।। 1-23 ।।

 దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రుని సంతోషపెట్టుట కొరకు అతని పక్షాన యుద్ధానికి 

వచ్చియున్న అందరిని ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది.

పాపిష్టి బుద్ధి గలవారైన ధృతరాష్ట్రుని తనయులు రాజ్యాన్ని అన్యాయంగా లాక్కున్నారు. 

వారు అధర్మానికి ప్రతీకలు కాబట్టి వారి పక్షంలో పోరాడే వారు కూడా దురుద్దేశంతో 

ఉన్నవారే, దుష్టులే! అట్టి దుష్టులను ఒకసారి చూడదలచినాడు. నిజానికి మొదట్లో 

అర్జునుడు పరాక్రమంతో యుద్ధానికి ఆతురతతో ఉన్నాడు. దుర్యోధనుడు ఎన్నో సార్లు 

పాండవుల వినాశనానికి కుట్రలు పన్నినాడు అని సూచిస్తూ, పాపిష్టి బుద్ధి వారైన 

ధృతరాష్ట్రుని తనయుల ను గుర్తు చేసాడు. అర్జునిడి దృక్పథం ఇలా వుంది. "మేము 

న్యాయ బద్ధంగా రాజ్యం లో సగ భాగానికి అర్హులము, కానీ అతను దాన్ని లాక్కోవాలని 

చూస్తున్నాడు. వాడు చెడు బుద్ది కలవాడు ఇంకా ఈ రాజులు వాడికి సహాయం 

చేయటానికి ఇక్కడ గుమికూడినారు, కాబట్టి వారు కూడా దుర్మార్గులే. యుద్ధం కోసం 

ఇంత ఆతురత తో ఉన్న యోధులని నేను పరికించి చూడాలి. వారు అధర్మం వైపు 

మొగ్గుచూపుతున్నారు, కాబట్టి మా చేత నాశనం అయిపోతారు."

పార్థ అన్న మాటకు పృథ అంటే కుంతీ కుమారుడు అన్న అర్థమే కాక విశాల భావములు 

కలిగిన వాడు అనికూడా ఒక అర్థము.

భగవద్గీతలో భగవంతుని ప్రోత్సాహక వాక్యములు

Decision tree, flow chart అన్న ఈ నేటిమాటలను వికల్పము అని సంస్కృతములో 

అంటారు.

శ్రీభగవానువాచ:

శ్లో॥ కుతస్త్వా కశ్మల మిదం విషమే సముపస్థితం |

అనార్యజుష్ట మస్వర్గ్యం అకీర్తకర మర్జున! ||         (2)

శ్లో॥ క్లైబ్యం మాస్మగమః పార్థ! నైతత్త్వ య్యుపపద్యతే |

క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప! ||     (3)

 తా ॥ భగవానుడంటున్నాడు, అర్జునా! యుద్ధానికి సిద్ధమైయున్న ఈ 

విషమసమయంలో ఈ కశ్మలం (మాలిన్యం) నీకు ఎక్కడి నుండి వచ్చింది? ఇది 

ఆర్యులకుఅనగా శ్రేష్ఠులకు  తగినది కాదు. స్వర్గాన్ని, కీర్తిని చెడగొట్టేది, పరంతపా! 

నపుంసకుడివి కావద్దు. ఇది నీకు శోభనివ్వదు. నీచమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని 

విడిచిపెట్టి లేచి నిలబడు.

వ్యాఖ్య :- ధనుర్బాణాలు పారవేసి, రథం వెనుక చతికిలబడి కూర్చున్న అర్జునుని

పోటుమాటలతో, అతడిలోని దుర్బలత్వాన్ని పారద్రోలాలనుకున్న భగవానుడు

తారాజువ్వల వంటి, పిడుగుల వంటి మాటలతో అర్జునునికి చురుకు ముట్టిస్తున్నాడు.

1) అనార్యజుష్టం : ఆర్యులు, అనార్యులు అని 2 జాతులు. ఆర్యులంటే సన్మార్గంలో 

నడిచేవారు, పవిత్రులు, తేజస్సు గలవారు, స్వధర్మాన్ని పాటించేవారు, ధర్మాన్ని 

నిలబెట్టేవారు. ఈ లక్షణాలు లేనివారు అనార్యులు. నీవు క్షత్రియ కులంలో 

జన్మించినవాడవు. ఆర్యపురుషుడవు. నీ పిడికిలిలో బలముంది, గుండెలో ధైర్యముంది

బాణాల్లోపదునుంది, చేతిలో అద్భుత విద్య ఉంది. అయినా పామరుడిలాగా 

ఏడుస్తున్నావు. చేతగాని చవటదద్దమ్మలా చేతులు ముడుచుకొని కూర్చున్నావు. నీకిదేం 

బుద్ధి? ఇది ఆర్యులకు తగినదేనా?

2) అస్వర్గ్యం : యుద్ధంలో జయిస్తే రాజ్యం వస్తుంది. ఒకవేళ మరణిస్తే వీరస్వర్గం 

లభిస్తుంది. యుద్ధం చేస్తే విజయమో - వీరస్వర్గమో ఏదో ఒకటి ఖాయం. కాని ఇలా 

చేతులు ముడుచుకు కూర్చుంటే విజయమూ లేదు, వీరస్వర్గమూ రాదు.

3) అకీర్తికరం : పోనీ రాజ్యసుఖం వద్దు, స్వర్గ సుఖం వద్దు. యుద్ధం మానేస్తే నీకేమైనా 

కీర్తి ప్రతిష్ఠలొస్తాయా? కీర్తి రాకపోగా కావలసినంత అపకీర్తిని నెత్తికెత్తుకుంటావు. 

ఇప్పటివరకు అర్జునుడంటే హడల్. ఈ దెబ్బతో అర్జునుడు ఒట్టి 'కాగితంపులి

అనుకుంటారు. 'పిరికిపంద' అంటారు. ఎగతాళి చేస్తారు.

కనుక అర్జునా! జాగ్రత్తగా ఆలోచించు. యుద్ధం మానేస్తే (1) రాజ్యం రాదు (2) స్వర్గం 

రాదు.

(3) కీర్తి రాదు (4) స్వధర్మం నుండి వెనుదిరిగిన వాడివవుతావు. (5) ధర్మరక్షణ జరగదు (6) 

అందరూ నిన్ను చూచి పరిహాసం చేస్తారు. ఇదంతా నీకు అవసరమా?

క్లైబ్యం మాస్మగమః : అర్జునా! పేడివి కావద్దు. ఖాండవ వన దహన సమయంలో అపూర్వ 

ధైర్యసాహసాలు ప్రదర్శించి దేవేంద్రుని జయించావు. దేవతలకే అసాధ్యులైన నివాతకవచ

కాలకేయులనే రాక్షసులను హతమార్చిన వాడివి. భీష్మద్రోణాది మహావీరులతో కూడిన 

కౌరవసేనను, ఉత్తరగోగ్రహణ సమయంలో నీవొక్కడివే అసహాయుడవై ఎదిరించి 

జయించావు. పరమేశ్వరునే ఎదిరించి పోరాడి, పాశుపతాస్త్రాన్ని సంపాదించావు. 

పరాక్రమం విషయంలోనే కాదు; నీవు స్వర్గలోకం వెళ్ళినప్పుడు, అప్సరస ఊర్వశి 

తనంతతాను వలచివచ్చి, నీ చెంత చేరి, తన కోరికను వెలిబుచ్చింది. అయినా ఆ 

సుందరిని తిరస్కరించి, ఇంద్రియనిగ్రహంలో మహామునులను, ఋషి పుంగవులను 

తలపింపజేశావు. అందుకు ఆగ్రహించిన ఊర్వశి నపుంసకుడవు కమ్మని శాపమిచ్చింది. 

ఆ శాపాన్ని విరాట నగరంలో వరంగా ఉపయోగించుకొని అందమైన అమ్మాయిలకు 

ఆటపాటలు నేర్పుతూ నిన్ను నీవే మరచిపోయావు. ఇప్పుడా శాపప్రభావం పోయినా 

ఇంకా నీకు ఆ లక్షణాలు పోలేదా? ఇప్పటికీ పేడిలాగానే భావించుకుంటున్నావా

నీకన్నా మీ అన్న భీమన్న చాలా నయం కదా! విరాటరాజువద్ద వంటలవాడిగా ఉండి

పప్పుదప్పళాలు వండి వార్చినా, ఇప్పుడు శతృవులపై పళ్ళు పటపట కొరుకుతున్నాడు. 

మరి నీవేమిటో! ఇంకా ఆ నపుంసక లక్షణాలను విడవలేకపోతున్నావు. లే, లేచి నిలబడు. 

హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టు - అని పిడుగులు కురిపిస్తున్నాడు భగవానుడు.

పరంతపా! అంటే శతృవులను తపింపజేసేవాడా! అని. ఇలా ఒకవైపు ప్రోత్సాహాన్నిస్తూనే

బాహ్య శత్రువులనే గాదు అంతః శతృవులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద

మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను కూడా తపింపజేయాలి అనే హెచ్చరికను అంతర్లీనంగా 

అందిస్తున్నాడు భగవానుడు సర్వమానవాళికీ.

శిష్యుడు, భక్తుడు స్నేహితుడు, అర్జనుడు శ్రీకృష్ణునికి.

చేతగానితనము వల్ల వచ్చిన దయ దయ కాదు.

బద్ధకము వలన వచ్చిన వైరాగ్యము వైరాగ్యము కాదు.

In his commentary on the text, Gandhi conceded, “I do not wish to suggest that violence has no place at all in the teaching of the Gita.” He acknowledged the ambivalence that “it is difficult to reconcile a few of the verses with the idea that the Gita advocates non-violence” but “still more difficult to reconcile the teaching of the work as a whole with the advocacy of violence.” Gandhi blamed this ambivalence on the author of the Gita.

భగవద్గీతపై తన వ్యాఖ్యానంలో, గాంధీ ఈ విధముగా తెలిపినారు: "గీత బోధనలో హింసకు అస్సలు స్థానం లేదని నేను తెలుపుదలచుకోలేదు." "గీత అహింసను సమర్ధిస్తుంది అనే ఆలోచనతో కొన్ని శ్లోకాలను అన్వయించుట కష్టం" అని అతను సందిగ్ధతను అంగీకరించినాడు, అయితే "మొత్తం గీతా బోధనను హింసను సమర్థించుచున్నది అనుట  ఇంకా కష్టం." గాంధీ ఈ సందిగ్ధతను గీతాకారునిపై వ్యక్తము చేసినాడు. ఇది ఆయన అవగాహనకు నిదర్శనము..

స్వస్తి.

Tuesday, 15 June 2021

రుద్ర న్యాసము - రుద్ర పంచ ముఖ శ్లోకములు

 

రుద్ర న్యాసము - రుద్ర పంచ ముఖ శ్లోకములు

https://cherukuramamohanrao.blogspot.com/2021/06/blog-post.html


శివుడు పంచ ముఖుడు. సింహానికి కూడా పంచ ముఖమన్న పేరు వుంది. అదట్లుంచితే 

బ్రాహ్మలు సంధ్యావందనమునకు పూజకు వాడే అర్ఘ్య పాత్రను పంచపాత్ర అంటారు. 

అర్ఘ్యజలము వదులుటకు రెండుచేతులలో నీరు తీసుకొని వదలవలసి వస్తుంది కాబట్టి 

ఆ పాత్ర యొక్క ముఖము వెడల్పుగా ఉంటుంది. అంతేకానీ అది పంచలోహములతో 

చేయబడినది అని కాదు. పంచపాత్రలు కంచు, రాగి, ఇత్తళి మొదలగు 

లోహ\లోహమిశ్రణముల ద్వారా కూడా చేయించుకొంటారు. పంచలోహములతో 

చేయించే వస్తువుల ఖరీదు చాలా ఎక్కువగా ఉంతుంది. అందుచే అది అందరికీ 

అందుబాటులో ఉండదు. పంచ అంటే వెడల్పయిన అని ఒక అర్థము. గంగ,చంద్రుడు

మూడుకన్నులు, వ్యోమకేశముల జటలు మరి ఇన్ని ఉన్నపుడు ఆయన ముఖము కూడా 

పంచముఖమే. పైపెచ్చు మహాన్యాసము ఆయనకు ఐదు ముఖాలు కూడా ఉన్నవని 

చెబుతూ వుంది. అంటే శివుడు అన్నివిధాలా పంచాస్యుడే!

 తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశానముఖ రూపాలలో ఉండే 

పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాల రూపంలో బోధాయనులు రచించారు. ఈ మహాన్యాస 

వివేచనము రావణ ప్రోక్త న్యాస ప్రక్రియలోనిది. ఆ శ్లోకాలు, తాత్పర్యము క్రింద. దీనినే 

శివ పంచానన స్తోత్రం అని కూడా అంటారు.

తత్పురుష ముఖ ధ్యానమ్

సంవర్తాగ్ని తటిప్రదీప్త కనక - ప్రస్పర్ధితేజోమయం

గంభీర ధ్వని మిశ్రితోగ్ర దహన - ప్రోద్భాసితామ్రాధరం

అర్ధేందుద్యుతిలోలపింగలజటా  - భారప్రబద్ధోరగం

వందే సిద్ధ సురాసురేంద్రనమితం - పూర్వం ముఖం శూలినః

తాత్పర్యము: ప్రళయ కాలము నందలి అగ్ని తేజము తోనూ,తటివిద్యుత్ 

(మెరుపు)తేజముతోను, కరిగిన బంగారు కాంతితోను పోటీ పడు తేజములను తన 

రూపముగా కలది, గంభీరధ్వనితో మిశ్రితమై భయంకరమైన అగ్నిశిఖలవలె వలె 

ప్రకాశించు ఎర్రని పెదవులు కలదియు, బాలేందు ద్యుతి (బాల చంద్ర రేఖలు)తో కూడిన  

పింగళ వర్ణపు జటాపటలమును కల్గి  (జడల గుంపు),భుజంగ భూషణములచే 

వలయితమై (చుట్టబడినదై), సిద్ధులు, సురాసురుల చేత నమస్కరించబడుతున్న, శూలికి 

సంబంధించిన తూర్పున ఉన్న ముఖమును నమస్కరించుచున్నాను. (ఇందు రజోగుణ 

ప్రధానమైన సృష్టి తత్వము ఇక్కడ స్తుతియింప బడినది)

అఘోర ముఖ ధ్యానమ్

కాలాభ్రభ్రమరాంజనద్యుతినిభం - వ్యావృత్తపింగేక్షణం

కర్ణోద్భాసితభోగిమస్తకమణి - ప్రోద్భిన్న దంష్ట్రాంకురం

సర్పప్రోత కపాలశుక్తి శకల - వ్యాకీర్ణ సంచారగం

వందే దక్షిణమీశ్వరస్య కుటిల - భ్రూభంగ రౌద్రం ముఖం

తాత్పర్యము: నల్లని మేఘములతోనూ, తుమ్మెదల నల్లదనముతోనూ పోలిన కాంతితో 

ప్రకాశించునదియు, మిక్కిలి వెడల్పయిన గోరోజనపు వర్ణపు కన్నులు కలదియు, చెవుల 

యందు మిక్కిలి ప్రకాశించుచుండు సర్ప శిరోరత్నములతో బాగా కలిసిపోవుచున్న

మొలకల వలె వాడియైన కోరలు  కలదియు, సర్పములతో పాటు హారముగా 

కూర్చబడిన కపాలములు కలదియు, శుక్తి ఖండములతోనూ (ముత్యపు చిప్పల ముక్కలు), ఎగుడు దిగుడగుచు, వంకరలుగా నున్న కనుల యొక్క కనుబొమల ముడులతో 

భయంకరముగా నున్న ఈశ్వరుని దక్షిణ ముఖమును నమస్కరించు చున్నాను. (తమో 

గుణ ప్రధాన లయకర్త తత్వము ఇక్కడ స్తుతి చేయబడింది)

సద్యోజాత ముఖ ధ్యానమ్

ప్రాలేయాచల చంద్రకుంద ధవళం - గోక్షీరఫేన ప్రభం

భస్మాభ్యక్తమనంగదేహ దహన - జ్వాలావళీలోచనం

బ్రహ్మేంద్రాది మరుద్గణైః స్తుతి పరై - రభ్యర్చితం యోగిభిః

వందేహం సకలం కళంకరహితం - స్థాణోర్ముఖం పశ్చిమం

తాత్పర్యము:  హిమవత్పర్వతము, చంద్రుడు, మొల్ల(మల్లె) పూవు వలె మరియు 

ఆవుపాలపై నురగ వలె తెల్లని కాంతి కలదియు, భసితోద్ధూళిత మైనదియు (విభూతి 

పూయబడినది), మన్మథుని శరీరమును దహించు జ్వాలల పంక్తితో నిండిన కన్ను 

కలదియు, స్తోత్రము చేయుచున్న బ్రహ్మేంద్రాది దేవ సమూహముల చేతను, యోగుల 

చేతను శ్రద్ధతో అర్చించ బడుచున్నదియు, నిర్మలమైన నిండు వదనముతో 

కనబడుచున్నదియును అగు శివుని పశ్చిమ ముఖమునకు నమస్కరించు చున్నాను. 

(సత్వ గుణ ప్రధాన రక్షణకర్త తత్వమును ఇక్కడ  స్తుతించ బడినది)

వామదేవ ముఖ ధ్యానమ్

గౌరం కుంకుమ పంకిలం సుతిలకం - వ్యాపాండు గండ స్థలం

భ్రూ విక్షేప కటాక్ష వీక్షణలసత్ - సంసక్త కర్ణోత్పలం

స్నిగ్ధం బింబ ఫలాధర ప్రహసితం - నీలాల కాలం కృతం

వందే పూర్ణ శశాంకమండల నిభం - వక్త్రం హరస్యోత్తరం

తాత్పర్యము:  గౌర (ఎరుపుతో కలిపిన తెలుపు) వర్ణము కలదియు, కుంకుమ పూతతో 

నిండినదియు,సొగసైన తిలకము కలదియు, అత్యంత తెల్లదనము కల చెక్కిళ్ళు 

కలదియు, కనుబొమ్మల కదలికతో ఒప్పుచుండు కడగంటి చూపుల ప్రకాశముతో పాటు

చెవికి అలంకారముగా నున్న తెల్ల కలువ పూవు కలదియు, నున్నని దొండపండు పోలు 

ఎర్రని క్రింద పెదవిపై స్పష్టమగు నవ్వు కలదియు, నల్లని తుమ్మెద రెక్కలవంటి 

ముంగురులచే అలంకరించబడిన, నిండు చంద్రుని మండలమును పోలు ప్రకాశము 

కలిగిన శివుని ఉత్తరముఖమునకు నమస్కరించు చున్నాను. (గుణత్రయ మిశ్రమమగు 

ఈశ్వర తత్త్వము ఇక్కడ స్తుతించ బడినది)

ఈశాన ముఖ ధ్యానమ్

వ్యక్తావ్యక్త గుణేతరం సువిమలం - శట్త్రింశతత్వాత్మకం

తస్మాదుత్తర తత్త్వమక్షరమితి - ధ్యేయం సదా యోగిభిః

వందే తామస వర్జితం త్రినయనం - సూక్ష్మాతి సూక్ష్మాత్పరం

శాంతం పంచమమీశ్వరస్య వదనం - ఖవ్యాపి తేజోమయం

తాత్పర్యము: వ్యక్తము, అవ్యక్తము అను రెండు రెండు లక్షణములే కాక తద్భిన్నమైన  

లక్షణములు  కలదియు, ముప్ఫై ఆరు తత్వముల రూపమున పరిణమించు నదియు,  

సకల తత్వముల కంటెను ఉన్నతమైఎల్లప్పుడును యోగులచే ధ్యానించబడ దగినదియు,  

తమో గుణ రహితమును, త్రినేత్రసహితమును, సూక్ష్మాతిసూక్ష్మమగు నదియు, శాస్తము 

మరియు ఆకాశము నందంటను వ్యాపించు తేజమే తన రూపముగా కలదియు అగు 

ఈశ్వరుని ముఖమును నమస్కరింతును (గుణాతీత బ్రహ్మతత్వమును ఇక్కడ 

స్తుతించబడినది)

స్వస్తి.


Monday, 31 May 2021

సౌభరి మహర్షి

 

సౌభరి మహర్షి

బ్రహ్మదేవుని పౌత్రుడగు ఘోరుని పౌత్రుడు సౌభరి మహర్షి. సౌభరి మహాతపస్వియగు కణ్వుని కుమారుడు. సౌభరి మహర్షి మహామాన్యులగు మహర్షులలో ఋగ్వేద వినియోగమునకు చెందినవారలగు బ్రహ్మ, అంగీర, ఘోర, కణ్వ, సౌభారులలో ఒకడు. ఈతని ప్రస్తావన మనకు భాగవత మహాపురాణములో తెలియవస్తుంది.

సౌభరి మహర్షిని గూర్చి మనకు శ్రీమద్ భాగవతం 9 వ స్కంధములో తెలియవస్తుంది. విశ్వనాథ చక్రవర్తి టి హకురా గారి ప్రకారము, సూర్య వంశపు రాజగు మాంధాత మధుర రాజ్యమును పరిపాలించే కాలములో తపస్సంపన్నుడగు ఈ మహర్షి, మధురకు సమీపములోని అరణ్యములో తపమాచరించుకొనేవాడు. ఈయన అత్యంత ఆయుష్మంతుడు. త్రేతా ద్వాపరములలో ఈయన ఉనికి తెలియవస్తూవుంది. ఆ ఋషి అడవులలో కఠోర తపమాచరించుకొను సమయమును ఇంద్రుడు,  ఆయన ఒకవేళ స్వర్గాధిపత్యమునకు ఈ తపమాచారించుచున్నాడేమోనని సందేహించి, ఆయన తపోభంగమునకై   దేవకాంతలను బంపి నృత్యగీత గోష్ఠులను ఏర్పాటు చెయించినాడు. చెక్కు చెదరలేదు మహర్షి. ఆ పిమ్మట ఇంద్రుడు ఎన్నోవిధములగు ప్రకృతి భీభత్సములను సృష్టించినాడు. సౌభరి ఋషి ఆ కడగళ్ళకు కూడా తలవంచలేదు. భూతలము అంతరాయముల నిలయమని భావించి  ఆయన తాను నేర్చిన జలస్తంభన విద్యతో,యమునా నదిలో లోతుగా మునిగి తపస్సాధనకు గడంగినాడు. అక్కడ  భూమిపై కలుగు ప్రళయములు సంభవించవు కదా! విషయమును అర్థము చేసుకొన్న ఇంద్రుడు ఆపైనెపుడూ ఆయనను పరీక్షించలేదు.  

ఒక సమయంలో, ఆయన తపోనిష్ఠ లేనపుడు, అతని దృష్టి ఆ నీటిలో తన భార్యా బిడ్డలతో సంతోషంగా ఉన్న ఒక చేపపై పడినది. అక్కడ ఆయన ఒక విషయమును  గమనించినాడు.

ఈ నీటిలో పెద్ద చేపలు, చిన్న చేపలూ పక్కపక్కనే తిరుగుతూ వున్నాయి. పెద్ద చేప చిన్న చేపను మింగటము ‘మాత్స్య న్యాయము’ అంటారు. మరి ఈ చిన్న చేపలు పెద్ద చేపలకు భయపడి దూరముగా వెళ్ళిపోవుట లేదు. తమ పని తాము చేసుకొంటూనే ఉన్నాయి. కావున సాధకుడనైన నేను ఇంద్రుని వంటివారు ఎన్ని ఆటంకములను అప్సరసల ద్వారా కానీ ఇంకేవిధముగానైనా కానీ ఏర్పరచినా కూడా తన సాధనలో తానుంటే అవేమీ చేయలేవుకదా! అన్న ఆలోచన వచ్చింది. తన తపఃశక్తితో దేవకాంతలను మించిన నాట్యకత్తెలగు సుందరీమణులను సృష్టించుకొని సుందర హర్మ్యమును నీటిలోనే నిర్మింపజేసి, అకుంఠిత తపస్సునకు పూనుకొన్నాడు.

ఒక సందర్భమున జరిగిన ఈ విషయమును చూడండి. దానిని తెలుపుతూ, నారాయణీయములో చెప్పబడిన ఈ శ్లోకమును ఒకపరి తిలకించండి. .

త్వత్పెవోత్కః సౌభారిర్నామ పూర్వం కాళింద్యంతర్వా ద్వాదశాబ్దం తపస్యన్ l

మీనవ్రాతే స్నేహవాన్ భోగలోలే తారక్ష్యం సాక్షాద్ధైక్షతాగ్రే కదా చిత్ ll

నీకు పరమ భక్తుడగు సౌభరి మహర్షి యమునా నదిలో జలస్తంభన విద్య సాయముతో తపస్సు చేసిన 12 సంవత్సరములలోని ఒక రోజు , ఎంతో ఆనందముగా అన్యోన్యముగా సంచరించుచున్న మీనముల పంక్తులను చూస్తూ సంతసించు సమయములో గరుత్మంతుడు అచట చేరి తినుటకు ఒక చేపను నోట కరచుకొన్నది చూచి మహర్షి యమునలో చేపలను గరుత్మంతుడు తిన ప్రయత్నించితే అతను మరణించును అని శపించినాడు.

కాళీయుడు ఒకసారి గరుత్మంతునికి చెందవలసిన హవిస్సులు తాను తినుటతో  ఆగ్రహావేశాములకు లోనయిన గరుత్మంతుడు కోపించి కాళీయుని విసరి వేసినాడు. ఆ విసరిన వేగామునకు కాళీయుడు వచ్చి యమునలో పడినాడు. ఒక విధముగా సౌభరి మహర్షి గరుత్మంతునికి ఇచ్చిన శాపము కాళీయునికి ఈ విధముగా మేలు చేసింది.

 

వేరొక సందర్భమున తన తపస్సుకు కాస్త విరామమునిచ్చి నీటిపైకి వచ్చి చేపల చలనమును చూడ దోడగినాడు. ఒక చేపల కుటుంబము ఆయన కంటబడింది. తనలో, అది చూసి చూసి వివాహేచ్ఛ కలిగింది.

ఆ ఆలోచన కలిగినదే తడవుగా అతను ఆ నీటిలోనుండి బయటకు వచ్చి,  మాంధాత వద్దకు వెళ్లి తనకు వివాహం చేసుకొనవలెననును తలంపు కలిగినది కావున ఆయనకున్న ఏబది కన్యకలలో ఒకరిని ఇవ్వమని అడిగినాడు.

శుష్కించిన శరీరం కలిగిన సౌభరి మహర్షిని తన పుత్రికలు వరించరు అన్న నమ్మకంతో, తన పుత్రికలలో ఎవరైనా తమరిని వరించినట్లయితే వారిని ఇచ్చి వివాహం చేస్తాను  అని సౌభరికి మాంధాత చెప్పినాడు. మాంధాత మనస్సులోని ఆలోచనను గమనించిన సౌభరి మహర్షి తన శరీరమును యౌవ్వనప్రాయముతో అలంకరించుకుని నవ మన్మధుడై అంతఃపురమున ఏరాజు వద్దకు వెళ్ళినాడు. అతనిని చూసిన మాంధాతయొక్క 50 మంది పుత్రికలూ అతనిని వరించినారు.

అతని తపః శక్తి తో వారంతా అత్యంత అనుకులమయిన భవనములు, భోగములు సమకూర్చుకున్నారు. ఎంతో వైభవమైన వస్త్రములు, తినుబండారములు, ఉద్యానవనములు ఏర్పరచుకుని సుఖంగా ఉన్నారు.

కొంతకాలం తరువాత సౌభరి మహర్షికి ఏకాంతంలో అతని ఈ పరిస్థితికి రాకముందు తాను ఎంత నిష్ఠగా తపస్సు చేసేవాడో గుర్తుకు వచ్చినది. ఒకనాడు, ఒక్కసారి సంసారముతో ఉన్న ఒక చేపల కుటుంబమును చుసిన తను ఇంతకాలము 50 మంది భార్యలతో, 5000 మంది బిడ్డలతో కాలక్షేపం చేయుట తప్పు అనిపించినది. కనుక వానప్రస్థఆశ్రమము స్వీకరించి అరణ్యమునకు వెళ్లి తపస్సు ప్రారంభించినాడు. అతని భార్యలు కూడా అతనిని అనుసరించినారు. అది నిర్జన కీకారణ్యము. అచట గురుకులమును గూడా ఏర్పరచి శిష్యులను విద్యావంతుల జేయదొడగినాడు. ‘విద్యాతురాణాం న సుఖం న నిద్రా’ అనికదా పెద్దల వాక్కు. అందుకే విద్యార్థులు కష్టమైనా ఆయన వద్ద విద్య నేర్చుకొనుటకు పుష్కలముగా వచ్చినారు.

మిగిలినది రేపు.....

సౌభరి మహర్షి - 2

ద్వాపరయుగము చివరిలో ధర్మరాజు  అశ్వమేధయాగ దీక్ష లో ఉన్నపుడు యాగాశ్వము వెంట అర్జనుడు పోవుట తటస్తించినది. శ్రీరిష్ణుని మాయచే అర్జునుడు గుఱ్ఱము మరుఇయు పరివారముతో సౌభరి మహర్షియున్న అటవీ ప్రాంతమునకు పోవుట తటస్తించినది. ఆ ప్రాంతములో ఉండే చండీశిలకు అతుక్కు పోయింది. అర్జునుడు సౌభరి ఋష్యాశ్రమమునకు వెళ్లి తనను పర్చయము చేసుకొని ఘర్మ రాజును గూర్చి చెప్పి, గుఱ్ఱము చండి శిలకు అతుక్కుపోయిన విషయము కూడా చెప్పిన పిదప, ఈ యాగమును ఎవరు చేయమని చెప్పినారు అని అడిగినాడు మహర్షి. అర్జునుడు శ్రీకృష్ణుడు చేయమన్నట్లు చెప్పినాడు. సౌభరి మహర్షి వెంటనే పరమాత్మ నీతో వచ్చినాడా అని అడిగినాడు. అందుకు అర్జునుడు అవును వెనకాల ఉన్నాడు అని చెప్పినాడు. ‘మరి పరమాత్మ తానే ప్రక్కన ఉంటూ మిమ్ము ఈ యజ్ఞమును చేయమన్నాడు అన్న విషయమును గూర్చి మీరు ఆలోచించినారా? అసలు ఈ యజ్ఞమునకు కర్తలు మీరు కాదు ఆ పరమాత్మయే కర్త. ప్రతిఫలాపేక్షతో కానీ, ఇంత మహా యాగమును చేస్తున్నామన్న అహంకారముతో కానీ చేయవద్దు. ఆయన పాదమును వీడవద్దు. ఈమాట ఆయన నాతో చెప్పించుటకే నిన్ను ఇచ్చటికి పంపినాడు. ఆయన లీలలు అంత సులభముగా అంతుపట్టవు’ అని తెలిపి తన మంత్రం శక్తితో యాగాశ్వమును విడిపించి పరమాత్మ దర్శనముతో అత్యంత సంతోషాంతరంగుడైనాడు.

ఈ విధముగా, తన తప్పులను తానూ తెలుసుకొని, మరణ సమయంలో అగ్ని ప్రవేశము చేసి, తపోదీక్షతో కలుషములను కడగివైచుకొని భగవంతుని అకుంఠితపదమునుచేరుకొన్నాడు. విశ్వనాథ చక్రవర్తి ఠాకుర్ గారు  సౌభరి ముని తన వైష్ణవ అపరాధ కారణంగా పడిపోయినాడని వ్యాఖ్యానించినాడు. ఎందుకంటే, గరుత్మంతుడు చేపను తినాలని అనుకున్నప్పుడు, సౌభరి ముని గరుడునికి  ప్రకృతి విరుద్ధమగు శాపము ఇచ్చి గొప్ప నేరం చేసినాడు. ఈ అపరాధ కారణంగా, సౌభరి ముని తన తపఃశక్తిని కొంత కోల్పోవలసి వచ్చింది. సౌభరి మునికి సంబంధించిన ఈ సంఘటన నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఇది. సౌభరి రిషి గొప్ప యోగి. ఆయన బఃవృచ(बह्वृच) అంటే ఋగ్వేదము ఆయనకు కరతలామలకము అని అర్థము. ఆయన అపార వేద సాధకుడు కాబట్టి తన పాండిత్యమును మరియు తపస్సును భౌతిక సంపద కోసం కొంత ఖర్చు చేసినాడు, ఈయన పేరుతో ఒక ఋగ్వేద సంహిత కూడా ఉన్నది. కానీ ఇది జీవితానికి పరిపూర్ణత కాదు అని తెలుసుకొనుటకు ఆలసించినాడు. కానీ కాలాంతరములో ఆ వాస్తవము తెలుసుకొన్నవాడై, అడవిని తిరిగి చేరి  అనితరసాధ్యమగు తపోనిష్ఠతో పరమపదమును సాధించినాడు. జీవితపు ఆధ్యాత్మిక విలువ తెలియని వారు, బాహ్య భౌతిక సంపదతో సంతృప్తి చెందవచ్చు, కాని ఆత్మ-తత్వ విచారమును ఎరుకలోనికి తెచ్చుకోన్నవారు ఐహిక సుఖములను తృణప్రాయముగానెంచి ఆముష్మికమును సాధించుతారు.  సౌభరి ముని జీవితం మరియు కార్యకలాపాల నుండి మనం పొందగల సూచన ఇది.

ఇక్కడ ఇంకొక ముఖ్యమగు విషయమును తెలుపుతాను. ఇది పురాణములు అబద్ధములు అను కొందరు భారతీయ ధర్మద్వేషులకు ఒక చురక వంటిది. సౌహరి మహర్షి ఇంచుమించు ద్వాపర యుగాంతము వరకు జీవించినాడు అనుటకు ఈ క్రింది యదార్థమును మనసు పెట్టి చదవండి.

జాగరణ్ సమన్వయకర్త యగు కమల్ మొరార్కర్ ఆర్ధిక సహయోగముతో, వ్రజ బృందావన్ (మధుర): మహర్షి సౌభరి ధ్యాన ప్రదేశమగు  సునరఖ్ కు చెందిన రామ్‌తాల్ కుండ్ భక్తుల ఆకర్షణ కేంద్రంగా మార్చినారు. అసలు ఎన్నో వేలసంవత్సరముల క్రితమే భూమిలోనికి కూరుకు పోయిన ఈ గుండమునకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పునరుజ్జీవనము కలిగించి సందర్శనాయోగ్యము చేసినారు.

సుమారు 2700 సంవత్సరాల పురాతనమైన ఈ కొలను యొక్క నిర్మాణాన్ని చూసి పురావస్తు శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయినారు. ఆ కోలనుకు వాడిన ఇటుకలు ప్రస్తుతపు ఇటుకల కన్నా చాలా రెట్లు పెద్దవి రియు ఆ కొలను పునాదిలో  రెండు అంగుళాల మందపాటి ఇనుప పలక కనుగొనబడింది, ఇది పురాతన నిర్మాణానికి అద్భుతమైన నమూనా.

బ్రజ్ ఫౌండేషన్ 2011 లో రామ్‌తాల్ కుండ్‌కు  పునర్వైభవమును సంతరింప  ప్రారంభించింది. సంస్థ ప్రతినిధి మన్సుఖ్ మాట్లాడుతూ, సుమారు ఆరు సంవత్సరముల కాలము మేము చేసిన ప్రయత్నములు ఫలించినాయి. సౌభరి ప్రార్థనా స్థలాన్ని అందంగా మార్చడానికి అన్నివిధములా శ్రద్ధాళువులు ప్రయత్నిస్తున్నారు.

భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గుండము చుట్టూ కూర్చునుటకు బెంచీలు, విడిదికి విశ్రాంతి గదులు ఏర్పాటు చేసినారు.

మహర్షి సౌభరి యొక్క యజ్ఞశాల యందు పురావస్తు అవశేషములకు మూలములు దెబ్బతినకుండా ఆధునీకరించుట జరిగినది. ఇది భారతీయ శాశ్వతమైన సంస్కృతి గురించి ఒక ఆలోచనను ఇస్తుంది.

ఈ విషయమును ప్రత్యేకముగా ఎందుకు వ్రాసినానంటే, ఈ భారత భూమి పసి ఇంకా కొందరు డబ్బును తృణప్రాయముగా చూసే మహనీయులు, ఈషణ్మాత్రపు స్వలభోపెక్ష లేకుండా, పేరుకు ప్రాకులాడకుండా 10వేల చందాయిచ్చి లక్ష రూపాయల ప్రకటనలు చేసుకోకుండా, వాడు తలపీట్టిన పని వాడే చేసుకొనీ, డబ్బు వాని వాడా ఉన్నదికదా అని నిమ్మకు నీరెత్తినట్లు ఉండకుండా ఉడుతా భక్తిగా తోచిన సహాయముచేసి తమవంతు బాధ్యతను తీర్చుకొనే పైన తెలిపినటువంటి మహానుభావులకు నమస్కరిస్తూ ఈ రచనను ఇచ్చట ముగిస్తున్నాను.

స్వస్తి.


Sunday, 16 May 2021

మాతృపంచకం - తెనుగున పద్యానువాదము

 


మాతృపంచకం

https://cherukuramamohanrao.blogspot.com/2021/05/blog-post.html

నాపై నమ్మకముతో శంకరులవారి ‘మాతృపంచకము’ను పద్యరూపమున తెనిగించు అదృష్టమును నాకు కలిగించిన వేదమూర్తులు శ్రీయుత రేమెళ్ళ అవధాన్లు గారికి మనఃపూర్వక  కృతజ్ఞతలు. వారి అభిమానము ఆజన్మాంతము నాకు ప్రాతఃస్మరణీయము. నా రచనను ఎంతగానో మెచ్చుకొన్న వారికి మనఃపూర్వక ధన్యవాదములు మరొకమారు సమర్పించుకోనుచున్నాను.

జగద్గురు శంకరాచార్య విరచిత 'మాతృపంచకము' ను నేను అనువదించిన తెలుగు పద్య సహితముగా మీ ముందు ఉంచుచున్నాను. 

https://cherukuramamohanrao.blogspot.com/2021/05/blog-post.html

మాతృపంచకం

1 .ముక్తామణిస్త్వం నయనం మమేతి

రాజేతి జీవేతి చిరం సుతత్వమ్

ఇత్యుక్తవత్యాస్తవ వాచి మాతః

దదామ్యహం తండులమేవ శుష్కమ్.

నామాణిక్యమ నాదు రత్నమ సదా నా కొంగు బంగారమా

నా మార్తాండ యటంచు ఎంతొ ధృతితో నన్నాదరింపంగ నే

నేమాత్రమ్ము నుపావృతమ్ము ఎదియున్ నీకివ్వలేదెప్పుడున్

ఓ మాతా ఇపుడివ్వ వచ్చితి యవల్  ఓ ముష్టి శుష్కాదృశల్

ఉపావృతము=తిరిగి ఇచ్చుట,

తా:– అమ్మా! నీవు నా ముత్యానివిరా! నా రత్నానివిరా! నా కంటి వెలుగువురా నాన్నా! నువ్వు చిరంజీవిగా ఉండాలి అని, నన్ను ప్రేమగా పిలిచిన నీ నోటిలో ఈనాడు కేవలం యిన్ని శుష్కమైన యవలు వేస్తున్నాను. నన్ను క్షమించు.

2. అంబేతి తాతేతి శివేతి తస్మిన్

ప్రసూతి కాలే యదవోచ ఉచ్చై :

కృష్ణేతి గోవింద హరే ముకుందే

త్యహో జనన్యై రచితోయమంజలిః.

ఎంతో బాధ భరించుచున్ కుములుచున్ ఏడ్పేమి రానీయకన్

అంతా గొంతుకలోనె మింగుచును నీవమ్మా హరా భార్గవీ

కాంతానాథ యటంచు నొప్పి పడుచున్ కన్నావు నీపాదముల్

ఎంతో దాంతము తోడ నింపి మదిలో ఇంపారగా మ్రొక్కెదన్

తా:–పంటిబిగువున నా ప్రసవకాలములో వచ్చే ఆపుకోలేని బాధను “అమ్మా! అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!” అనుకుంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.

3. ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథా

నైరుచ్యం తను శోషణం మలమయీ శయ్యాచ సంవత్సరీ

ఏకస్యాపినగర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమః

దాతుం నిష్కృతి మున్నతోపి తనయ: తస్యై జనన్యై నమః

శూలను పొందుచుండియును శుష్క శరీరివి యయ్యు నన్ను నీ

చేలము తోడ జుట్టుచును చెంత పరుండగ జేసి ఎంతయో

తాలిమి తోడ నా మలము తక్షణ రీతిన శుద్ధిచేసితీ

లాలన నిల్చె నామదిన లాతము వీడి నమస్కరించెదన్

అమ్మా! నన్ను కన్న సమయం లో నువ్వు ఎంతటి శూల వ్యథను అనుభవించావో కదా! శరీరం కళను కోల్పోయి శుష్కించి వుంటుంది. మలముతో శయ్య మలినమైనా ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావో కదా! ఎవరూ అలాంటి బాధను భరించలేరు. ఎంత గొప్ప వాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా? నీకు నమస్కారం చేస్తున్నాను.

 

4. గురుకులముపసృత్య స్వప్నకాలే తు దృష్ట్వా

యతిసముచితవేషం ప్రారుదో త్వం సముచ్చె:

గురుకుల మథ సర్వ౦ ప్రారుదత్తే సమక్షం

సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః

నీ కలలోన నేను ఒక నీమపు భిక్షువు నౌచు కన్పడన్

నీకగు బాధనంతయును నిర్గతిచేయక ఆతురాన నా

కాకరువైన గుర్కులము గాంచగ వచ్చిన నిన్నుజూచుచున్

శోకము పొంగె ఛాత్రులకు శుభ్ర కృపామతి నీకు మ్రొక్కెదన్

తా:–కలలో నేను సన్యాసి వేషం లో కనబడేసరికి బాధపడి, మా గురుకులానికి వచ్చి ఏడ్చావు. ఆ సమయం లో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్ప దానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను.

5. న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా

స్వధా వా నో దత్తా మరణ దివసే శ్రాద్ధ విధినా

న జప్త్వా మాతస్తే మరణ సమయే తారక మనూ

రకాలే సంప్రాప్తిః మయి కురు దయాం మాతురతులామ్

కాలము మీరె నీకు మరి కాలము మీరెను నాదు రాకలో

జాలము చేత నే జలము చల్లగ పోయగనైతి నోటిలో

కీలక తారకమ్ము చెవి కెక్కగ చేయగనైతి నే స్వధన్

మేలిమి తర్పణాన మది మెచ్చగ దత్తము చేయనైతి నన్

తాలిమితోడ నీవు దయ తప్పక కావుము మాతృదేవతా!

తా:–అమ్మా! సమయం మించిపోయాక వచ్చాను నీ మరణ సమయంలో కొంచెం నీళ్లు కూడా నేను గొంతులో పొయ్యలేదు. శ్రాద్ధ విధిని అనుసరించి “స్వధా ను” యివ్వలేదు. ప్రాణము పోయే సమయము లో నీ చెవిలో తారకమంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి, నాయందు దేనితోనూ సమానము కాని నీ దయ చూపించుము తల్లీ!

Sunday, 11 April 2021

శుభకృత్ నామ ఉగాది సందేశము

శుభకృత్ నామ ఉగాది సందేశము

https://cherukuramamohanrao.blogspot.com/2021/04/blog-post_11.html

దయతో ఈ సందేశమును ‘శుభకృత్’ ఇస్తూ ఉన్నట్లుగా గుర్తించండి. నాకు సందేశమునిచ్చే సామర్థ్యము లేదు.

ప్లవ లేక ప్లవనము అనగా తేలుట. నీటిలోతేలే తెప్పను ‘ప్లవ’అంటారు. 'కరోనా' అన్న కాలకూట విషపు కడలినుండి ప్లవ మనలను 'శుభకృత్' అన్న ఒడ్డునకు చేర్చింది. ఆ ఒడ్డు యొక్క పేరే 'శుభకృత్' కాబట్టి అది మనకు అంతా మేలే చేస్తుంది. శుభకృత్ అంటేనే శుభములు చేకూర్చేది.  కావున మంచికి చేయవలసిన ప్రయత్నములు మనము చేస్తే శుభకృత్ నిర్ద్వందముగా మనకు శుభముల సమకూర్చుతుంది.

పంచాంగ శ్రవణం ఉగాదినాటి ఒక ముఖ్య కార్యక్రమం. శుభకృత్ నామ సంవత్సరం అందరికీ నిరంతరం జయకరం, శుభకరం కావాలి. పంచాంగ శ్రవణం ఉగాదినాటి ఒక ముఖ్య కార్యక్రమం. దేశంలో, ప్రపంచంలో పాడి పంటలు, వర్షాలు, పాలకులు, పరిపాలన గురించిన రాబోయే సంవత్సర ఫలితాలను తెలుసుకోవాలనే జిజ్ఞాసతో వింటాము. రాజు, మంత్రి, సేనాని, మొత్తం పరిపాలక మండలి ఎలా ఉంటుంది? దేశపు పరిపాలకమండలిని మనం ఎన్నుకుంటాము. ప్రజా ప్రభుత్వములో మన ఎన్నికకు తగినవారు మనని పాలిస్తారు. అలాగే సృష్టిలో సృష్టికర్తయైన ఈశ్వరుడు, అనేక దేవతలు, గ్రహాలు. వీని స్థితిగతులు పంచాంగము ఇస్తుంది. 

ఈశ్వరుడే కాల స్వరూపము. కాలోస్మి అని చెప్పినవాడు ఆయన. ఆయన పరివారంలోని 

దేవతలు పాలకులు. ప్రజలు తమ పుణ్య పాప కర్మలతో ఫలాలను వ్యక్తులుగా, 

సమూహంగా తామే తెచ్చుకుంటారు. దేవతలు కేవలము కర్మ ఫలాలను ఇచ్చే 

ఉద్యోగులు. వారి కంటే మన సమీపవర్తులు గ్రహాలు. మన సూర్యమండలంలో 

భూమివలెనే గ్రహాలు కూడా మనతోపాటు పరిభ్రమణం చేస్తూ ఉంటాయి. కర్మను బట్టి 

ఫలములను ఇవ్వడం వారి ఉద్యోగ విధి. అందుచేత శనికి శాంతి చేయించే ముందు, 

ఈశ్వరుని పూజించాలి. జీవుల కర్మను బట్టి ఫలములను నిర్ణయించేవాడు దైవము (విధి). 

నేను సత్కర్మలేచేస్తాను. ధర్మమునే సర్వకాలములలో ఆచరిస్తాను అనేవానికి శుభాలే 

వస్తాయి. అతడు స్వతంత్రుడు. ఈశ్వరుని ప్రత్యేకం ప్రార్థించవలసిన పనేలేదు. కాని 

ఈశ్వరుడు సృష్టిలో జీవులకు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వివేకము, పుణ్యపాపాలు 

చేయడానికి స్వేచ్చ ఇచ్సినాడు. పాపకర్మలమీద ఆసక్తి, చేసే స్వేచ్చ ఇవ్వడం వలన 

మనుష్యుడు పాపంచేస్తూనే , నాకు శిక్షలేకుండా చేయమని భగవంతుని ప్రార్థిస్తున్నాడు. 

వివేకం, సద్బుద్ధి (discretion) ఉంటే పాపాలు చేయకుండా ఉంటాము. 

భగవంతుని పశ్చాత్తాపంతో వేడుకుంటే ఆయన కర్మ ఫలాలను నియంత్రింపగలడు. వేద 

పురాణ గాథలు ఇవి చెబుతాయి. మనం సామాన్యులం. మన జీవితకాలమంతా 

సంసారంలోనే గడచిపోతుంది. చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, వాళ్ళ సమస్యలు, 

దీనితోనే కాలమంతా గడిపిన మనం, మనకోసము, మన ఉత్తరగతుల కోసం 

ఏమిచేసుకుంటున్నాము? మళ్ళీ మళ్ళీ ఈ జనన మరణ చక్రమేనా? దీనిలో సారం 

ఏమున్నది? ఈ శుభేచ్ఛవచ్చినప్పుడు మనకు మార్గంకావాలి. పురాణాలు మనకు 

పెద్దమిత్రుడు. మార్గం చూపించేందుకు గురువు కావాలి. మనుష్యరూపంలో 

ఉండక్కరలేదు. ఆ జగద్గురువైన శ్రీకృష్ణునే గురువుగా భావించవచ్చును. ఆయన చెప్పిన 

భగవద్గీతవంటి ఆప్తవాక్యము మరొకటిలేదు.

ఇక్కడ కాలాన్ని గురించి ఆలోచించాలి. మంచికాలం, చెడు కాలం ఏమిటి? భీష్ముడు 49 

రాత్రులు అంపశయ్యపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకూ ఎందుకు 

నిరీక్షించినాడు? అతడు అష్టవసువులలో ఒకడు. శాపవశాన భూమిపై జన్మించినాడు. 

అతనికి స్వచ్ఛంద మరణమనే వరం ఉన్నది. ధర్మం బాగా తెలిసినవాడు. అందుకే 

అంపశయ్యను ప్రాయశ్చిత్త వేదిక గా మార్చుకున్నాడు. అధర్మము కొన్ని విషయాలలో 

చేసినాడు. అధర్మం వైపు నిలచి యుద్ధంచేసినాడు. ధర్మాత్ములైన పాండవుల సేనలో 

అధికభాగాన్ని తానే నాశనం చేసినాడు. 180 సంవత్సరాల వృద్ధుడు. ద్రౌపదిని నిండు 

సభలో అవమానిస్తే తన క్షాత్రధర్మం నిర్వర్తించలేదు. దుర్యోధనుని కొలువులో 

ఉన్నామనేది కుంటి సాకే. అలాగే ద్రోణుడు. ఉత్తమ బ్రాహ్మణుడే. తపశ్శాలి. 

ఉపపాండవులను నిద్రలో ఉండగా చంపిన అశ్వత్థామ ఆయన పుత్రుడు. అతడు 

చిరంజీవి అయినా కర్మ ఫలము అనుభవించక  తప్పదు కాబట్టి భగవంతుడే అతని 

నొసటి మణిని పెకలించి ఆరనిగాయమును కలిగించి అనవరతమూ ఆ కర్మ ఫలమును 

అనుభవింపజేయుచున్నాడు. పెద్దల, పాలకుల, ఉన్నత వర్గాల వారు వివిధ కారణముల 

మూలముగా చేసే పాపాలు సంఘాన్ని నాశనం చేస్తాయి. దేశానికి అరిష్టం. ఇది 

కలియుగము కదా! అసలు నాదృష్టిలో కలిపురుషుడు ఒకడే అయినా ఆయన అనేక 

నాయకుల రూపములో అనునిత్యమూ మనకు తన చేయిదములతో దర్శనమిచ్చుచునే 

యున్నాడు. కలిలో ధర్మము కలికమునకు కూడా కనబడనిరోజులు వస్తాయేమో!

ప్లవ నామ సంవత్సర పంచాంగ ఫలితములను ఎవరికి ఇష్టమగు పంచాంగమును చూసి 

వారు వారు తెలుసుకొనవచ్చును. అందువల్ల నేను ఆ విషయము జోలికి పోవుట లేదు.

మనము కోరుకొనవలసినదల్లా పరివర్తన. ఏవిధమైన పరివర్తన అంటే మనకు వేదము 

తెలియజేసిన పరివర్తన అదే:

అసతోమా సద్గమయ అంటే అసత్తు అనగా ఏది నిత్యమూ శాశ్వతము ఆచరణ 

యోగ్యము కాదో ఆ స్థితి నుండి ఏది సత్యము శాశ్వతము అనుష్ఠానయోగ్యము అయినదో ఆదారిన నడుద్దాము.

తమసోమా జ్యోతిర్గమయ, ఇక్కడ తమస్సు అంటే చీకటి అని మాత్రమే కాదు అర్థము అజ్ఞానములో మనము ఉన్నంతకాలము అంధకారములో ఉన్నట్లే. మరి వెలుగు ఎట్లు కనిపించుతుంది. అది మనము నడిచే దారినిబట్టి ఉంటుంది. అందుకే మొదటనే చెప్పుకొన్నాము కదా  అసత్ నుండి సత్ వైపునకు నడిపించమని పరమాత్ముని వేడుకొన్నాము కదా ఆ బాధ్యత ఆయనదే! అప్పుడే చీకటిలోనుండి వెలుగు లోనికి అడుగు పెట్టగలుగుతాము.  కానీ ఆయనకు గుర్తు చేసే బాధ్యత మాత్రం మనదే! అడగనిదే అమ్మయినా పెట్టాడు అన్న నానుడి మనకు ఎరుకనే కదా!

ఇక మృత్యోర్మా అమృతం గమయ అంటే ఎప్పుడయితే మన ప్రయాణము చీకటి నుండి వెలుగునకు సిద్ధపరుపబడినదో నశించే జీవిత తత్వమును దాటి అనశ్వరమగు పదమును చేరుటకు సిద్ధమయినట్లే! ఈ మర్త్యగుణమును దాటుకొని అమరత్వము వైపు నడక ప్రారంభించినట్లే!

భగవంతుని మన నాయకునిగా చేసుకొని ఆ కోరిక కోరుదాము. అచంచల ధర్మమార్గమున గతి తప్పక తాను నడుస్తూ మనల నడిపించగల ఏకైక నాయకుడు ఆయనే!

ఓం శాంతిః శాంతిః శాంతిః

స్వస్తి.