Saturday, 31 October 2015

"శృంగేరి" (పరిచయము)

"శృంగేరి"
(పరిచయము)

శృంగేరి అనే పేరు "శృంగగిరి " అనే పర్వతం నుంచి వచ్చింది .  శృంగేరికి 15  కిలో మీటర్ల  దూరంలో "శృంగగిరి " అనే పర్వతం వుంది.  శృంగేరి  పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది ఆది శంకరాచార్యుల వారు ప్రభోదించిన " అద్వైత సిద్దాంతం ". "అద్వైత సిద్దాంతం" అంటే మన కళ్ళ ముందు కనిపించేవి ప్రతిదీ ఏదో ఒక రోజున ప్రస్తుతం వున్న రూపాన్ని పోగొట్టుకుని ఆ పంచ భూతాల్లో కలసి పోవడం తప్పని సరి కనుక , మన కళ్ళ ముందు కనిపించే ఆ ప్రస్తుత రూపం కేవలం మాయా రూపమే కదా ! అంటే కొంతకాలం పాటే  ఆ రూపం వుండి , ఆ తరువాత మార్పు చెందుతుంది కదా! అందువల్ల మనం చూసే ఈ సృష్టి లో ప్రతి ఒక్కటీ " మాయ " అన్నారు ఆది శంకరాచార్యుల వారు. తను ప్రభోదించిన ఈ అద్వైత సిద్దాంతాన్ని అందరికి తెలియచెబుతూ, భారత దేశం మొత్తం అంటే , బదరి వరకు పర్యటించి , అప్పటి పండితులందరి చేత తన సిద్దాంతాన్ని ఆమోదింపచేసి, దక్షిణ భారతానికి తిరిగి వచ్చిన శంకరాచార్యులు,  ఈ శృంగగిరి  ప్రాంతములో పర్యటిస్తూ వుండగా  ఒకరోజు, ఒక చోట, ఒక గర్భిణిగా వున్న కప్ప  ఒకటి పడుకుని వుండగా, దానికి ఎండ తగలకుండా, ఒక నాగుపాము తన పడగ  విప్పి  ఆ కప్ప మీద తన పడగనీడ పడేటట్లు నిలబడి వుండటం చూసారు. ఆజన్మ శత్రువులైన ఆ రెండు అలాటి స్థితిలో ఉండటానికి, ఈ స్థలంలో   ఏదో పవిత్రత వుందని అర్ధం చేసుకున్న శంకరాచార్యుల వారు, సరిగ్గా ఈ స్థలంలోనే తన ప్రధాన కార్యాలయమైన "శృంగేరి  మఠము"  నెలకొల్పినారు. తన తరువాత తను ప్రతిపాదించిన అద్వైత సిద్దాంతం భారత దేశమంతటా నిరాటంకంగా కొనసాగింపబడటానికి  అనుకూలంగా, తూర్పున పూరిలో,  పశ్చిమాన ద్వారకలో, ఉత్తరాన బదరిలో, మూడు మఠములను నెలకొల్పినారు.  

                        శృంగేరి  ఒక చిన్న గ్రామం . బస్సు స్టాండు నుండి శారదాదేవి ఆలయం అర కిలోమీటర్ దూరం లో వుంది . శారదాదేవి ఆలయం " తుంగానది " ఒడ్డునే వుంది . ఆదిశంకరాచార్యుల వారు , తాను నిత్యమూ అర్చించుకునేందుకు గాను, తన ఇష్ట  దైవమైన శారదా దేవి మూర్తిని, మంచి గంధపు చెక్కతో చేయించి ప్రతిష్టించుకున్నారు. ఆ తరువాత విద్యారణ్య స్వామి ( శృంగేరి రెండవ పీఠధిపతి) తన గురువు గారి మీద భక్తితో, చందనపు విగ్రహానికి బదులు ఒక బంగారపు విగ్రహం చేయించి  ప్రతిష్టించారు . 
                      శారదాదేవి ఆలయం కొంత ప్రత్యేకత కలిగి వుంటుంది . సాదారణంగా ప్రసిద్దమైన ఆలయాన్ని కొండ రాళ్లతో నిర్మింపబడి వుంటాయి. కానీ శారదాదేవి ఆలయపు విమాన భాగం ఎర్ర రాయి కట్టడం. అటు గుండ్రంగాను, నలుచదరంగాను కాకుండా, కొణాలు,  కొణాలుగా  వుంటుంది . లోపల మడపం చాల పెద్దదిగా బాగా విశాలంగా వుంటుంది. ప్రతి స్తంభం మీద ఆశ్చర్యం కలిగించే చెక్కడాలు, శిల్పాలు ఎన్నో వున్నాయి. అమ్మవారి  గర్భగుడి నల్ల చలువ రాతి నిర్మాణం . అద్భుతమైన చెక్కడాలతో, నిగనిగా  మెరిసే ఆ గర్భగుడి లో ఎన్నో ఆభరణాలతో ధగ ధగ లాడుతూ  వుండే అమ్మవారి విగ్రహాన్ని తనివితీరా చూడటానికి రెండు కళ్ళు చాలవేమో అనిపిస్తుంది . 
శారదా దేవి ఆలయానికి కుడి వైపున విద్యాశంకర ఆలయం వుంది . 105 సంవత్సరాల పాటు పీఠాధిపత్యం వహించిన శ్రీ విద్యాశంకరుల వారికి  కృతజ్ఞతగా  విద్యారణ్య స్వామి ఈ ఆలయాన్ని నిర్మింపచేసారట. ఈ దేవాలయంలో విద్యాశంకర స్వామి వారు లింగాకారంగా వుంటారు. స్వామికి ఇరుప్రక్కల వినాయకుడు, అమ్మవారు వుంటారు.  ఈ  ఆలయపు ముఖ మడపంలో వుండే  12 స్థంబాలు, 12 రాశుల పేర్లను కలిగి వుంటాయి. సూర్యుడు సంవత్సరం పొడుగునా  ఒక్కొక్క నెల ప్రారంభంలో  ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు కదా, సరిగ్గా ఆ రోజున ఆ సూర్య భగవానుని కిరణాలు ఆ రాశి పేరు కల స్థంభం మీద పడతాయి . జ్యోతిష్య, ఖగోళ, గణిత, వాస్తు శాస్త్రాలన్నింటి లోను  పట్టు ఉంటేనే ఇలాంటి ఆలయ నిర్మాణం సాధ్యపడుతుంది . ఈ ఆలయపు స్థంబాల మీద వుండే సింహపు ఆకారాన్ని పోలిన దేవా మృగపు మూర్తులు, ఆ విగ్రహాల నోటిలోనుంచి వేళ్ళాడుతూ వుండే బంతులు, పై కప్పు మీద నుండి వేళ్ళాడుతూ వుండే రాతి గొలుసులు, అన్ని ఏకశిలా నిర్మితాలే . ఆ ఆలయపు బయట భాగం కూడా విచిత్రంగా వుంటుంది . మొత్తం గోడలు కోణాలు , కోణాలుగా   వుంటుంది . పొడుగాటి రాతి పలకలు ఒక దాని ప్రక్కన ఒకటి నిలబెట్టి అతికించినారా అనిపిస్తుంది . ఆ విధముగా కూడా గోడ మొత్తం ఎన్నో రకాల మూర్తులు , శిల్పాలతో నిండి వుంటుంది . 
        ఈ ప్రాంగణం లోనే వెనుక వైపున ఆది శంకారాచార్యుల వారి ప్రధమ శిష్యుడైన సురేశ్వరుని  ఆలయం, శ్రీరాముని ఆలయం, హనుమ, దుర్గ, భైరవ, కాళిక  ఆలయాలు వున్నాయి. ఈ ప్రాంగణాన్ని ఆనుకుని, దక్షిణపు అంచున తుంగానది ప్రవహిస్తూ వుంటుంది. ఆలయ ప్రాంగణపు ఒడ్డు  నుంచి అవతలి వైపు వరకు ఒక వంతెన వుంది. అవతలి వైపు కొబ్బరి, పోక, అరటి, పనస మొదలైన చెట్లతో  ఒక చిన్న సైజు అడవిలాగా వుంటుంది. ఈ వనాన్ని నారాయణవనం అంటారు. ఇక్కడ   శృంగేరి పీఠాధిపతుల నివాస గృహము, ఆలయ కార్య నిర్వాహక కార్యాలయము, ఇంతకు ముందువున్న  పీఠాధిపతుల విగ్రహ మూర్తులువున్నమ్యూజియం, ఈ వనం మధ్య వున్నాయి. ఇప్పుడు వున్న 36వ  పీఠాధిపతులు  శ్రీ భారతీ తీర్ధ స్వామి వారు, ప్రతి రోజు రాత్రి ఎనిమిది  గంటలకు చంద్రమౌళీశ్వర స్వామికి అభిషేకం చేస్తారు .  
ఆలయపు ముందు భాగంలో ఉచిత గదులు ఇచ్చే సత్రాలు , అద్దెకు ఇచ్చే గదులు వున్నా సత్రాలు వున్నాయి సెలవు రోజుల్లోనూ ,పండుగ రోజుల్లోనూ రూములు దొరకటం చాల కష్టం . అందువల్ల  
THE ADMINISTRATOR ,
SRI SRINGERI MATH &ITS PROPERITIES,
CHIKMANGULOOR DISTRICT 
SRINGERI-577139
అనే అడ్రస్ కు ముందుగా డబ్బులు పంపి,మనకు కావలసిన రోజుకు  రూం రిజర్వు చేసుకోవచ్చు  . 

వసతి సౌకర్యాలు

  1. శ్రీ శంకర కృప 
  2. శ్రీ శారద కృప 
  3. యాత్రి నివాస్ 
  4. శ్రీ భారతీ తీర్ధ విహార 
  5. శ్రీ శంకర సదన 
  6. శ్రీ భారతీ తీర్ధ కృప 
ఫోన్ నంబర్స్ : 08265-250123
                   08265-250594
                   08265-250192

ప్రయాణ సౌకర్యాలు

శృంగేరి, ఉడిపికి తూర్పుగా, అంటే సముద్ర తీరానికి  80 కిలోమీటర్ల  దూరంగా పడమటి కనుమల మధ్యలో వుంది . అందువల్ల  శృంగేరికి ఎటు  ప్రక్క నుంచి వెళ్ళాలన్నా , పడమటి కనుమల గుండా ప్రయాణిస్తూ బస్సులో, వెళ్ళాల్సిందే. అయితే  ధర్మస్థల, ఉడిపి, కుందాపూర్, చిక్ మంగుళూర్, షిమోగా, మొదలైన చోట్ల నుండి శృంగేరి వరకు డైరెక్ట్ బస్సులు వున్నాయి. మంగళూరు నుండి తరచు బస్సు సౌకర్యం ఉంది. షిమోగా నుండి కూడా తరచు బస్సు సౌకర్యం ఉంది. శృంగేరి నుండి ఉడిపికి బస్సు ఆగుంబె అనే ఊరి మీదుగా మలనాడు పర్వతశ్రేణుల మధ్య నుండి వెళ్తుంది. 24 సన్నటి హైర్ పిన్ ఘాట్ రోడ్డులో ఉడిపి చేరు కోవచ్చు.
శృంగేరిలో ముఖ్యమైన దర్శనీయ విశేషాలు:
  1. శారదాంబ దేవాలయం
  2. విద్యాశంకర దేవాలయం
  3. ఆది శంకురల దేవాలయం
  4. నరసింహవనం
  5. తుంగ నది
  6. శృంగేరి వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది. శృంగేరి పట్టణానికి మంగుళూరు సమీప విమానాశ్రయం. శృంగేరి పట్టణం బెంగుళూరుకు 330 కి.మీ. దూరం, మంగుళూర్ నుండి 110కి.మీ. దూరం, ఉడిపి నుండి 80 కి.మీ. దూరం, షిమోగా నుండి 105  కి.మీ. దూరం, చిక్ మంగులూర్ నుండి 100  కి.మీ. దూరంలో ఉండి, సౌకర్యవంతమైన బస్ సర్వీస్ కలిగి ఉంది. దీనికి సమీప రైల్వే స్టేషన్లు, షిమోగా మరియు       కడూర్ లు.


శృంగేరి  చుట్టు   ప్రక్కల  ముఖ్యమైన దర్శనీయ విశేషాలు:
1. ఆగుంబే ( సూర్యాస్తమయం ఇక్కడి నుంచి  చూస్తె చాల అద్భుతంగా వుంటుంది( sunset point ), దేశములో రెండవ విస్తారముగా వర్షాలు కురిసేది ఇక్కడే.     దీనిని రైన్ ఫారెస్ట్ అని కూడా అంటారు . 
2. కిగ్గ  ( రిష్య శృంగ లింగం ) ---- శృంగేరి నుంచి 9 kms 
3. అనేగుడ్డే ( వినాయక దేవాలయం )
4. హొరనాడు ( అన్నపూర్ణేశ్వరి దేవాలయం ) -- శృంగేరి నుంచి                                                                                      60 kms 
5. కలస( కాళేశ్వర స్వామి ) --- హొరనాడు నుంచి 8 kms 
6. కొల్లూరు ( మూకాంబిక దేవాలయం ) ---శృంగేరి నుండి 110  kms 
7. ఉడిపి ( శ్రీ కృష్ణ దేవాలయం)--- శృంగేరి నుండి 80 kms 
8. ధర్మస్థల ( శ్రీ మంజునాధ స్వామి ఆలయం ) ---శృంగేరి నుండి 120 kms 
9. కుక్కే (సుబ్రహ్మణ్య  ఆలయం )-- ధర్మస్థల నుండి 60 kms 

ఆది శంకారాచార్యుల వారు 12 సంవత్సరాలు పైగా నివసించిన ఈ శృంగేరి క్షేత్రం  ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన పవిత్ర ప్రదేశం. 


Sunday, 18 October 2015

ౘదరంగము - చెద రంగము

ౘదరంగము - చెద రంగము
అట్ట మీద వున్నవరకె ఆగుచూవున్నది యాట
అట్ట మడిచివేయగనె అయిపోయిందన్న మాట
ఆనాడది  చదరంగము  ఈనాడిది  చెదరంగము
ఎంతకాల మీఎత్తులు ఎందుకు నక్కల జిత్తులు
నేలపైన  నిలుచు వరకు   నీవు వేరు నేను వేరు
ఆపై  మన ఆత్మలేమొ  అచ్చటికే  పోయి  చేరు
చేరు గోడ  చిత్రమ్ములు  చెత్త  నకలు మాలలతో
మాటలాడ వలసినదే మరి నీవిక  మూలలతో
రాజు మంత్రి రౌతు బంటు రోజు కూడబెట్టు గంటు
పరికించిన   కనికట్టు  పనికిరాదు   నీకు   బెట్టు
అట్ట  పైనె  రాజు   రౌతు  ఆపై   మరి ఎవరి  కేవరొ
ఈ భువి పై నట్లు  గాక  ఎవ్వరైనను   వుండగలరొ
ఆటలోన ఉన్నవరకె అమీతుమీ యనుచుందువు
ఆపై నొక పెట్టె లోనె అంగాలార్చు  కొనుచుందువు
నీ   బంటులు  నీ  ఒంటెలు  నీ   గుర్రాలేనుగులు
నీకోసము బలియగుచు  నిష్క్రమించు పీనుగులు
అవి పోయిన పిదప నీకు అగచాట్లే అహరహము
ఆమాత్రపు భోగానికి  అవసరమా అంత అహము
చెరుకు రామ మోహన్ రావు





Wednesday, 23 September 2015

गुरु ब्रह्म गुरु विष्णु गुरु देवो महेश्वरः 
गुरु साक्षात् पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः 
अखंड मंडला कारम व्याप्तं येन चराचरम 
तत्पदम् दर्शितम् येन तस्मै श्री गुरवे नमः


బేంకంటే బేంకు స్టేటు బేంకురా .....

https://cherukuramamohanrao.blogspot.com/2015/09/blog-post_23.html

ఇంచుమించు 40 సంవత్సరాలు నాకు నా కుటుంబానికీ అన్నం పెట్టి పోషించిన తల్లి 

కాని తల్లి SBI ని గురించిన నా కృతజ్ఞత మీతో పంచుకోవాలని అనిపించింది. అందులొ 

భాగమే ఈ ప్రయత్నము.

అవి నేను తిరుపతి ప్రాంతీయ కార్యాలయములో అధికారులలో (Officers) ఒకనిగా పని 

చేయుచున్న రోజులు. అప్పుడు శ్రీ శంకర్ నారాయణన్  గారు మా ఉప మహా 

నిర్వహణాధికారిగా(Dy. General Manager) ఉండేవారు. ఆయన తమిళుడై యుండి 

కూడా తెలుగుపై అమిత అభిమానమును చూపేవాడు. ఒకసారి తిరుపతికి కరుణశ్రీ 

జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రావటం తటస్థించింది. మాడుగుల నాగ ఫణి శర్మ గారు 

గురుతుల్యులైన వారిని అనుసరించి యుండినారు. అప్పుడప్పుడే శర్మగారు 

అవధానములు మొదలుపెట్టి కూడా యుండినారు.  మా DGM గారు నా మిత్రులైన బాల 

కృష్ణా రెడ్డి గారిని, నన్ను పిలిచి వారితో ఉపన్యాసము ఇప్పించితే బాగుంటుందన్నారు. 

రెడ్డిగారు స్థానికులు తెలుగు హిందీ లో స్నాతకోత్తర పట్టా  పుచ్చుకొన్నవారు. వెంటనే 

ఇరువురము వారిరువురి వద్దకు వెళ్లి నొప్పించక మెప్పించి ఒప్పించి మా 

కార్యాలయమునకు ఆహ్వానించినాము. శర్మ గారు  కరుణశ్రీ గారిని గూర్చి ఎంతో 

హృద్యంగమముగా మాటలాడినారు. తరువాత శాస్త్రిగారు యువకుడైన శర్మ గారి 

ప్రతిభను గూర్చి తెలుపుతూ ఆయనను ఆశీర్వదించి తనకిష్టమైన పోతన్నను గూర్చి చెప్ప 

మొదలుపెట్టినారు.  ఆనందాతిరేకముతో నిండిన కరతాళ ధ్వనుల మధ్య తన 

ఉపన్యాసమును చాలించిన వెంటనే ఇరువురిని గూర్చి మాట్లాడిన వక్తలలో నేనూ 

ఒకడిని .  మనలో మన మాట నాది వందన సమర్పణమే లెండి .వారిని గూర్చి చెరియొక 

పద్యము వంతున ఈ విధముగా చెప్పినాను. మీ కోసం ఈ దిగువన :

సుందరమైన శైలి బహు సుందరమైనటువంటి భావముల్

విందును గూర్చె వీనులకు విస్మృతినొందగ మేను చిత్తమున్

వందన మొండు దక్క మరి వారికి నేమియు నివ్వలేక, మే

మందర మొక్కటై నిలిచి యర్చి భజించితిమాత్మసాక్షిగా

శ్రీధర మూర్తులౌ కరుణ శ్రీయుత పాపయ శాస్త్రి వర్యులున్

నాద వినోద పుష్ఠి పద నాధుడు నాగ ఫణీంద్ర శర్మయున్

మాదగు తిక్త చిత్తముల మాధురి నింపిరి పెంపు మీరగన్

చేదగు కాఫి పౌడరుకు చేర్చిన చక్కర వేడి పాలుగన్

వ్యక్తిగతంగా శాస్త్రి గారి ఆశంసనములు శర్మ గారి అభినందనలు సభ ముగిసిన పిదప 

నాకు దక్కిన బహుమతులు.

రెండు రోజులతరువాత మా DGM గారు రెడ్డి గారిని, నన్ను పిలిచి మీరు  ఒక భాషా 

సమాఖ్యను మన Bank తరఫున ఏర్పాటు చేయకూడదా అన్నారు. రాజు తలచితే దూషణ 

కైనా భూషణ కైనా కొదవ లేదు కదా! రెండు రోజులలోనే 'భావన' అన్న పేరుతో  తెలుగు 

భాషా సమితిని ఏర్పాటుచేసి , రెడ్డిగారు బదిలీ అయిన పిదప TG రామకృష్ణ గారు నేను 

కలిసి , రామ కృష్ణ గారు కూడా బదిలీ అయినతరువాత నేనొక్కడనే అవిశ్రాంతముగా 

నడిపినాము. తరువాత భావన భాస్వరము పాలైపోయినది.

ఆ మద్య కాలములో ఒకసారి నేను DGM గారి వద్దకు పోవుట జరిగినది. ఆయన ఎంతో 

అభిమానముతో ఏమైనా వ్రాసినారా అన్నారు. సర్, నేను మన Bank ని గూర్చి ఒక పాట 

వ్రాసినాను అన్నాను. ఆయన అది వినకుండానే ఒక కాగితము పై వ్రాసి నాకు ఇవ్వండి

నేను మధ్యాహ్నము వాయుయానమున హైదరాబాదు పోవుచున్నాను మీ పాట మన 

'Circle News Bulletin' లో ప్రచురింప జేయించుతాను అన్నారు. అంతవరకూ నా రాత 

(తలరాత ) నే రాతల పత్రిక లంట నివ్వలేదు. వారడిగినదే తడవుగా నేను చేతులు పిసుకు 

కొంటూ వుంటే ఆయనే తెల్ల కాగితమిచ్చి వ్రాయమన్నారు. వ్రాసిన పిదప 

చదువమన్నారు. చదివిన వెంటనే bank ని గురించి కూడా ఇంత బాగా పాట 

వ్రాయవచ్చునా అన్నారు. సర్, ఆధునిక కవిత్వానికి ఆద్యులలో ఒకరైన శ్రీ శ్రీ గారే 'కాదేదీ 

కవిత కనర్హం' అన్నారు అని అన్నాను. నవ్వి ఆ కాగితము భద్రముగా తన BRIEFCASE 

లో వుంచుకొని ఇక పోయి రమ్మన్నారు.

రెండు రోజుల తరువాత వారు హైదరాబాదునుండి వచ్చి తిరిగి ఆసనమునందాసీనులై 

నాకొరకు పిలువనంపినారు. నేను వారి వద్దకు వెళ్ళిన వెంటనే MAGAZINE నా చేతిలో 

ఉంచినారు.  హైదరాబాదులో కూడా చాలామంది బాగున్నదన్నారండి.  MAGAZINE 

editor ఇప్పుడే latest magazine ప్రింట్ కు పోయి వస్తూవుంది మీకు copy కూడా 

ఇచ్చిపంపుతాను అని అంటూ ఉండగానే Messenger అందించిన రెంటిలో ఒకటి  నా 

చేతికి ఇచ్చి పంపినారని  పత్రిక నాచేతికి ఇచ్చినారు. నా ఆనందమునకు అవధి లేదు. 

ఆయను కృతజ్ఞత సమర్పించుకొని ఆనందాతిరేకము తో నా కుర్చీని చేరుకొన్నాను. 

వారు ఆనతి కాలములో transfer అయి తరువాత వచ్చిన వారు కూడా transfer అయిన 

తరువాత కొంత కాలము శ్రీ భండారు రామ చంద్ర రావు గారు DGM గా officiate 

చేయవలసి వచ్చినది. వారికి సాంస్కృతిక విషయముల పై మక్కువ ఎక్కువ. 

అనుకోకుండా అప్పటి HYDERABAD CIRCLE Chief General Manager శ్రీ K.S. 

పురోహిత్ తిరుపతికి వస్తున్నారన్న కబురు వారికి అందింది. వారు నన్ను అప్పటి 

Official Languages Officer హీరాలాల్ కర్నావట్ గారిని పిలిపించి తెలుగులో bank ని 

గూర్చి మీరు వ్రాసిన పాట పాడండి హిందీలో కర్నావట్ గారు ఒక పాట వ్రాస్తారు అదికూడా పాడుతురుగానీ అన్నారు . కర్నావట్ గారు నేను వచనమైతే వ్రాయ గలను గానీ పాట వ్రాయలేనన్నారు . ఆశపోతును కాబట్టి అవకాశము జారవిడువలేదు. అదికూడా నేనే వ్రాస్తానన్నాను. రామ చంద్ర రావు గారు సరేనన్నారు.

ఆరోజు రానే వచ్చింది. రెండు పాటలూ నేను chorus తో కూడా పాడటము జరిగినది. 

పురోహిత గారు హైదరాబాద్ వెళ్లి అభిమాన పూర్వకముగా నా పేరున ఉత్తరము 

వ్రాయుట గూడా జరిగినది. మా DGM రామచంద్ర రావు గారు ఎంతోసంతోషించినారు

ఆజ్ఞాపకాల దొంతరనుండి హిందీ పాటది పల్లవి మాత్రమే వ్రాస్తూ తెలుగు పాట పూర్తి 

పాఠమును పొందుపరచు చున్నాను. ఇవి మనసును హత్తుకొన్న విషయములు కాబట్టి 

మరచి పోలేదు, మరచిపోలేను. అందుకే ఆప్తులుగా భావించి మీ ముందుంచుతున్నాను.

హిందీ పాటల పల్లవులు :

आप है हम सब के नेता

बात आप की कृष्ण गीता

माननीय महामहोदय

स्वागतम शुभ स्वागतम .........

हम भारतीय स्टेट बैंक वाले हैं

हम तेरे तेरे दौलत के रखवाले हैं......

అని వ్రాసినాను. రెండవ పాట మాత్రము 'హం కాలే హై తో క్యాహువా దిల్వాలే హైఁ ...... 

అన్న 'గుమ్నాం' అన్న హిందీ సినిమాలోని పాట యొక్క బాణీకి అనుకరణ. ఎక్కువ 

మంది హిందీ చదువరని తలచి పూర్తి పాఠము వ్రాయలేదు.

ఇక తెలుగు పాట :

బేంకంటే...

బేంకంటే బేంకు స్టేటు బేంకిరా

అది నీదీ నాదీ అందరిదిరా

ధనమే దాచాలన్నా ఋణమే చేయాలన్నా

మనకోసం పాటుబడే మనసుండే మనుషులున్న     ||బేంకంటే ||

చేతనున్న చిల్లిగవ్వ బేంకున జమ చేయరా

కూడబెట్టుకొన్న రూక రూపాయవుతుందిరా

ముందు జీవితాన నీవు విందు భోజనాలు చేయు

కళలు నిజాము చేసేసే కాతాలను తెరచు బ్యాంకి       ||బేంకంటే ||

కాడిగట్టి సాగుచేసి కష్టపడే రైతన్నా

కండలరగ శ్రమ జేసే ఓ రిక్ షా రంగన్నా

నీకూ నీకూ నాకు అందరికీ మేలుజేయు

పథకాలను సూచించి  ఋణ సహాయమిచ్చు బేంకి  ||బేంకంటే ||

సూటు బూటు వేసినా టక్కు టయ్యి కట్టినా

చెవికి పోగులుంచినా తలకు గుడ్డ చుట్టినా

అందరినొకటిగ జూచి  ఆదరాన చేరబిలచి

అడిగిన సదుపాయమిచ్చు అస్సలు సిసలైన బేంకి  ||బేంకంటే ||

అదండీ కథ ఇదండీ పాట.

(ఇది చదివి సంతోషించుటకే విమర్శలకు తావు లేదు.)

స్వస్తి.

Tuesday, 22 September 2015

శ్రీ శ్రీ  శ్రీ అభినవ విద్యాతీర్థుల జవాబు క్రైస్తవులకు


శ్రీ శ్రీ శృంగేరీ శారదాపీఠము యొక్క ముప్పైఐదవ జగద్గురువులైన శ్రీ అభినవ విద్యాతీర్థుల వారి కాలములో [1973] ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది.

గురువుల వద్దకు దర్శనానికి ఒక క్రైస్తవ మత ప్రచారకులు వచ్చినారు. ఆయన ఉద్దేశము , వారి మతము సర్వశ్రేష్ఠమయినది , కాబట్టి తమ మతానికి జనులను ఆకర్షించి వారికి స్వర్గ ప్రాప్తికి మార్గాన్ని చూపించవలెను. అందుకోసము జగద్గురువులను ఒప్పించి జనాలను క్రైస్తవ మతానికి చేర్పించాలని కోరడానికి వచ్చినారు. విషయము తెలిసిన జగద్గురువులు , వారి మతపు గొప్పదనము యేమిటో తెలుసుకోవలెనని ఆదరముతో ఆహ్వానించి సంభాషించినారు. యోగక్షేమాలు , కుశల ప్రశ్నలతర్వాత జగద్గురువులు అడిగినారు , జగద్గురువులు :" మీరు ఇక్కడికి వచ్చిన కార్యమేమిటి ? " "
క్రైస్తవ మత ప్రచారకులు [ క్రై. మ. ప్ర. ] : " స్వామీ , నేను మీ ఊరిలో , మీ మఠము సమీపములో ఒక క్రైస్తవ సంస్థను తెరవాలనే ఉద్దేశముతో వచ్చినాను. "
గురువులు : " ఇక్కడ సంస్థను తెరచుటకు కారణము ?"
క్రై. మ. ప్ర.: " నేను ప్రజలకు ఇక్కడనుండే ధర్మోపదేశమును ఇవ్వాలని ఆశిస్తున్నాను. "
గురువులు : " మీరు ఉపదేశించునది యేమి ?"
క్రై. మ. ప్ర.:" "మా మతమును గురించి, దాని శ్రేష్ఠతను గురించీ , జనులకు ఉపదేశము చేసి , వారందరినీ మా మతానికి మార్చుకోవాలనుకొంటున్నాను. "
గురువులు :" మీరు జనులకు ఉపదేశము ఇచ్చే ముందు నాకు కూడా మీ మతమును గురించి తెలిపితే , నేను కూడా తెలుసుకుంటాను గదా ? "
క్రై. మ. ప్ర.:" అట్లే కానివ్వండి, మీరు నన్ను ప్రశ్నలు అడగండి, నేను వాటికి సూక్త సమాధానములను ఇవ్వగలవాడను "
గురువులు : " మీ మతము మొదలై ఎన్ని సంవత్సరాలయినది ?"
క్రై. మ. ప్ర.:" మా మతము పుట్టి 1973 సంవత్సరాలయినాయి "
గురువులు :" సంతోషము , మీ మతపు ఆరంభమును గుర్తించుటకు ఒక నిర్దిష్టమైన కాలము , సమయము ఉన్నాయని స్పష్టమైంది. మీ మతము పుట్టుటకు ముందు ప్రజలు ఉన్నారా లేరా ? మీ మతము లేనప్పుడు జనులు జీవిస్తుండేవారా లేదా ?"
క్రై. మ. ప్ర.:" జనులే లేకపోతే మేము మతబోధ ఎవరికి చేస్తాము ? మేము మా మత విషయములను నేర్చుకొని ప్రచారము చేయుటకు ముందు కూడా ప్రజలు ఉండనే ఉన్నారు. "
గురువులు : మీ మతములోకి జనులు మారితే వారికి కలుగు ప్రయోజనమేమి?"
క్రై. మ. ప్ర.:" మా మతములో చేరిన వారందరికి మాత్రమే తప్పక స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. నరకము తప్పుతుంది " గురువులు :" సరే , మీరు మీ మతమును అనుసరించే వారికి మాత్రము స్వర్గప్రాప్తి కలుగుతుందంటున్నారు. ఇతరులకు నరకప్రాప్తి అంటున్నారు. కానివ్వండి , మీ మతము పుట్టుటకు ముందు బ్రతికి జీవించిన కోటానుకోట్ల ప్రజలు స్వర్గానికి వెళుతుండేవారా లేక నరకానికి వెళుతుండేవారా ? "
క్రై. మ. ప్ర.:" వారంతా నరకానికే వెళుతుండేవారు. మా మత ధర్మాన్ని పాలించనందువల్ల. "
గురువులు :" ఇదెక్కడి న్యాయము ? ఈ కాలపు ప్రభుత్వాలూ , న్యాయస్థానాలు కూడా ఇటువంటి చట్టాన్ని చేయవు కదా , మీరు మీ ధర్మాన్ని, నియమాన్నీ ఏర్పరచక ముందు ఉన్నవారు మీ ధర్మాన్ని పాలించుట లేదు అన్న కారణానికి వారు నరకభాజనులవుతారు అనేది న్యాయమేనా ? ముందెప్పుడో రచించబోయే నియమాలను ఊహించుకొని వారు అనుసరించుట ఎక్కడైనా సాధ్యమా ? కాబట్టి , మీరు మీ మతమునకు సంబంధించిన నియమాలను రచించుటకు ముందే ఉన్నవారు నరకానికే వెళ్ళినారు అని చెప్పుట సమంజసమా ?"
క్రై. మ. ప్ర.:" [ బిక్క చచ్చి ], ఔను స్వాములూ , వారు అందరూ నరకానికి కాదు , స్వర్గానికే వెళ్ళిఉండాలి " గురువులు :" ఇది కూడా అన్యాయమే అవుతుంది, ఎందుకంటే మీ మతపు నియమాలను రాయుటకు ముందు పుట్టి పెరిగిన వారందరూ స్వర్గానికే వెళ్ళేవారు కదా? ఇప్పుడు మీరు రచించిన మత నియమాల వల్ల , వాటిని అనుసరించే కొందరు మాత్రమే స్వర్గానికి వెళుతున్నారు. అనుసరించని వారు నరకానికే వెళుతారు అన్నట్లయింది కదా ? అందువల్ల , మీరు మీ మత నియమాలను రచించకుండా ఉండిఉంటే అందరూ తప్పక స్వర్గానికే వెళ్ళేవారు. ఇప్పుడు మీ నియమాల వల్ల అనేకులకు అన్యాయము జరిగింది కదా ?"
క్రై. మ. ప్ర.:" [ తన మాటలకు తానే చిక్కుకొని గాభరా పడి] స్వామీ , మీరు నన్ను ఇటువంటి ప్రశ్నలను అడుగుతున్నారే ? దయచేసి నన్ను వదిలేయండి " అన్నాడు.
గురువులు :" సరే , అట్లాగే కానివ్వండి , ఆ సంగతి వద్దు. చూడండి , ఈ ప్రపంచములో ప్రజలు అనేక విధములైన దుఃఖ కష్టాలకూ , సుఖ సంతోషాలకూ లోనగుటను చూస్తున్నాము కదా , దానికేమిటి కారణము ?"
క్రై. మ. ప్ర.:" దీన్నంతటినీ భగవంతుడే చేసినాడు "
గురువులు :" ఒకడికి ముష్టి అడుక్కోవలసిన హీన స్థితినీ , ఇంకొకడికి దానము చేయునట్టి ఉత్తమ స్థితినీ దేవుడు అనాదిగా ఇస్తున్నాడంటే , భగవంతుడు తనకు ఇష్టమైనవాడిని సుఖములోనూ , తనకు అప్రియమైన వాడిని దుఃఖములోనూ ఉండేటట్టు చేసినాడనే చెప్పవలెను కదా ?"
క్రై. మ. ప్ర.:" అది భగవంతుని స్వంత ఇఛ్చ , స్వామీజీ , మనమేమీ చేయలేము. వాడు ఏమికావాలన్నా చేయగలడు. అది వాడిష్టము. "
గురువులు :" భగవంతుడు ఏమి కావాలన్నా చేయవచ్చు అన్నట్టయితే , అందరికీ సుఖాన్నే ఇవ్వవచ్చును కదా ? ఆ సుఖాన్ని కొందరికి మాత్రమే ఎందుకు ఇచ్చినాడు ?దానికి కారణమేమయి ఉంటుంది ?"
క్రై. మ. ప్ర.:" [అప్రతిభుడై], అదంతా భగవంతునికి చెందిన విషయము. నేనేమి చెప్పగలను ? "
గురువులు :" మీ వాదానికి ఒక యుక్తి గానీ , తర్కము గానీ ఉన్నట్టే కనిపించుట లేదు. సరే , అదీ ఉండనివ్వండి , మరొక విషయము ; చిన్న పిల్లలుగా ఉన్నపుడే కొందరు చనిపోతారు. కొందరేమో వయసయిన తర్వాత. ఇలాగున్నపుడు , చిన్నపిల్లలు చనిపోయాక స్వర్గానికి వెళతారా లేక నరకానికా ? "
క్రై. మ. ప్ర.:" చిన్న పిల్లలు పాపము ఎలాచేయగలరు ? వారు ఒక తప్పును కూడా చేయలేరు. వారింకా చిన్నపిల్లలే కాబట్టి వారికి పాపపుణ్యాల ప్రసక్తే రాదు. వారికవి అంటవు "
గురువులు : " అందుకే అడిగినాను , వారు వెళ్ళేది స్వర్గానికా , లేక నరకానికా ?"
క్రై. మ. ప్ర.:" చిన్న పిల్లలందరూ స్వర్గానికే వెళతారు "
గురువులు :" అట్లయితే మన తల్లిదండ్రులంతా మనగురించి చాలా పెద్ద తప్పే చేసినారు అనవలెను. మనలనందరినీ చిన్న పిల్లలుగా ఉన్నపుడే చావడానికి వదిలేయకుండా పెంచి పోషించి పెద్ద చేసినారు. ఇది చాలా పెద్ద తప్పు కదా ? శిశువులను పుట్టగానే చంపి వేసుంటే, మనము పెరిగి పెద్దయి, తప్పు చేసేందుకు అవకాశమే ఉండేది కాదు. మనందరకూ స్వర్గమే దొరికేది ? కాదా ?"
క్రై. మ. ప్ర.:"[ మరలా చిక్కుకొని], స్వామీ మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తే నేను జవాబివ్వలేను "
గురువులు :" సరే , వదిలేయండి, చనిపోయే వారందరూ స్వర్గానికో లేక నరకానికో వెళతారు తప్పదు కదా, ఎప్పుడు వెళతారు అన్నది చెపుతారా ?"
క్రై. మ. ప్ర.:" భగవంతునికి ఎప్పుడు నిర్ణయించాలనిపిస్తే అప్పుడు నిర్ణయిస్తాడు , అప్పుడే పోతారు "
గురువులు :" ఇదేమయ్యా ఆశ్చర్యము ? భగవంతుడు పిచ్చివాడా యేమి , తనకిష్టమొచ్చినపుడు న్యాయ నిర్ణయము చేయుటకు ?"
క్రై. మ. ప్ర.:" అలాగ కాదు , అక్కడ అదంతటికీ ఒక క్రమ విధానముంటుంది "
గురువులు :" సరే , మీ పుస్తకములో అదేమి క్రమ విధానమును వివరించినారో కొంచము చెపుతారా ? [ ఆయన మాట్లాడేందుకు తటపటాయించినాడు; గురువులే కొనసాగించినారు] మీ మతములో ఈ విషయము గురించి ఏమి సిద్ధాంతము ఉందో , దాన్ని నేను చెపుతాను. అది సరియా కాదా మీరే చెప్పండి"
క్రై. మ. ప్ర.:" కానివ్వండి స్వామీ , చెప్పండి "
గురువులు :" ఈ ప్రపంచములో ఉన్నవారందరూ చనిపోయిన తరువాత , దేవుడు , ఏదో ఒకరోజు , న్యాయ నిర్ణయమును చేసి, కొందరికి స్వర్గాన్నీ , కొందరికి నరకాన్నీ ఇస్తాడు. కదా ? సరియేనా ? "
క్రై. మ. ప్ర.:" ఔనౌను , తమరు చెప్పింది సరిగ్గా ఉంది"
గురువులు :" ఈ ప్రపంచములోనే జరుగుతున్న సంగతిని చూడండి , ఎప్పుడైనా ఎవరైనా ఒక తప్పు చేసినారంటే , విచారణకు మొదట , ఆ తప్పు చేసినవాడిని పోలీసులు కొన్నిరోజులు నిర్బంధములో ఉంచుతారు. దాని తర్వాత కూడా అతడిని పోలీసులు లాకప్ లో ఉంచాలంటే ,దానికి న్యాయాధీశుల అనుజ్ఞను పొందవలసి ఉంటుంది. అలాగ , కారణమూ , అనుమతీ లేకుండా , విచారణ చేయకుండా ఎక్కువ రోజులు ఉంచుటకు వీలు లేదు. న్యాయాధీశులు ఒప్పుకోకుంటే అతడిని పోలీసులు నిర్బంధము నుండీ వదిలివేయ వలసి ఉంటుంది. ఇలాగున్నపుడు , ఒకడు మృతుడయిన తరువాత వాడికి , " ఈ ప్రపంచములో ఉన్నవారందరూ చచ్చిపోయే వరకూ , అనగా , కోటి కోటి సంవత్సరాలయ్యే వరకూ జనాలు పుట్టుతూ చస్తూ ఉంటారు కాబట్టి , అదంతా అయ్యే వరకూ , ’ నువ్వు విచారణ లేకుండానే కాచుకొని ఉండాలి" అంటూ ఆ భగవంతుడు చెబితే ,అది న్యాయమనిపించుకుంటుందా ? మీరే చెప్పండి?" జగద్గురువుల ఈ మాటను విని ఆ క్రైస్తవ మత ప్రచారకుడు దిక్కుతోచనివాడైనాడు. అప్పుడు గురువులు ఆతనికి సమాధనము చెబుతూ , " మీకు మీ మతమే గొప్పది. మీరు దానిని అత్యంత శ్రద్ధతో అనుసరించవలెను. అంతే కానీ , ఇతరులతో , ’ మా మతమే శ్రేష్ఠమైనది, దానినే అందరూ అనుసరించవలెను, అలాగ ఏమైనా మీరు మా మతాన్ని అనుసరించకపోతే మీకు , నరకమూ , దుఃఖమే గతి’ అని చెప్పుట సాధువైనది కాదు. మీకు మీ తల్లి పూజనీయురాలు. ఇతరులకు వారి వారి తల్లులు పూజనీయులు. ’ మాతల్లి మాత్రమే పూజనీయురాలు , ఇతరుల తల్లులు కాదు’ అంటూ మీరు చెప్పితే అది మీ మూఢత్వమే అవుతుంది. నా తల్లి కూడా ఇతరుల తల్లులవలె సమానముగా పూజనీయురాలు అని తెలుసుకున్నపుడే మనలను ప్రపంచము ఆదరిస్తుంది. లేకుంటే ఛీత్కరిస్తుంది. " అని ఉపదేశించినారు. ఆతడిని వీడ్కొనునప్పుడు ఆతనికి జగద్గురువులు ఎప్పటివలెనే ఫలమునిచ్చి సత్కరించినారు. అతడు దానిని ఆదరముతో స్వీకరించి వెళ్ళిపోయినాడు. ఆ తరువాత గురువులు భక్తులను ఉద్దేశించి , || సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః | అనేన ప్రసవిష్యధ్వమేష వోఽత్తిష్వ కామధుక్ || " మొదట యజ్ఞములతోపాటు ప్రజలను సృష్టించి ప్రజాపతి, ’ ఈ యజ్ఞములు మీకు కామధేనువులగు గాక ’ యని అంటాడు. బ్రహ్మ దేవుడు , జగత్తును సృష్టి చేయునపుడే అది సరిగ్గా నడుస్తూ ఉండుటకు అవసరమైన విధి-నియమములను రచించినాడు. ఇది మన మతపు గొప్పతనము. మన సనాతన ధర్మపు సిద్ధాంతము ప్రకారము , భగవంతుడు అనాదియైనవాడు. అలాగే ఈ ప్రపంచమూ , మన ధర్మమూ కూడా అనాదిగా ఉన్నవి. జీవరాశులకు వాటి వాటి కర్మలకు తగినట్లు ఫలము ప్రాప్తిస్తుంది. దుష్టులకు దుష్టఫలము , సత్కర్ములకు మంచి ఫలము. కర్మలు అచేతనమైనవి-అంటే జడమైనవి. ఫలము నిచ్చేది భగవంతుడే. భగవంతుడు దయాళువు అనునది దిటమైన మాట.. తప్పుచేసినవాడు తన తప్పును ప్రామాణికముగా ఒప్పుకొని క్షమాభిక్ష వేడితే న్యాయాధీశులు శిక్షను తగ్గిస్తారు కదా ? కానీ ఇతడు పదే పదే తప్పులు చేస్తూ ప్రతిసారీ క్షమాభిక్షను కోరితే న్యాయాధీశుడు క్షమిస్తాడా ? భగవంతుడు కూడా అట్లే. ప్రామాణికులైనవారిని క్షమిస్తాడు. కానీ పదే పదే తప్పుచేసే వాడిని ఖచ్చితముగా క్షమించడు. మన శాస్త్రములు శ్రద్ధతో పాటూ వివేకము కూడా ఉండవలెనని బోధిస్తాయి. ఇతరమతాలు శ్రద్ధ ఒక్కటీ ఉంటే చాలని చెబుతాయి. మత ధర్మములలో భావుకత మాత్రమే కాక విచారము చేయు ప్రవృత్తి కూడా ఉండవలెను. శ్రీరామచంద్రుడు , శ్రీ కృష్ణుడు వంటి అవతారాలు మన ధర్మములో మాత్రమే కనిపిస్తాయి. మన ధర్మము వారివల్ల యేదో కొత్తగా స్థాపించబడినది కాదు. మన ధర్మము , అటువంటివారిని ఈ జగత్తుకు ప్రసాదించింది. ఇంతటి మహాత్మ్యమున్న సనాతన ధర్మములో మనందరమూ జన్మించినాము. ఈ సనాతన ధర్మపు బోధనలను పాలించి మనమందరమూ శ్రేయస్సుకు తగినవారము కావలెను. " అని ఉపదేశించినారు.
[ శ్రీ శృంగేరీ శారదా పీఠము వారు కన్నడ భాషలో ప్రచురించిన " శృంగేరీ పుణ్యక్షేత్రము " పుస్తకమునుండీ అనువాదము }

Monday, 21 September 2015

చేమకూర వెంకట కవి  ( చొప్పకట్ల సత్యనారాయణ గారు వ్యాఖ్యానించిన పద్యము.)

చమత్కారానికి అనేకమార్గాలు.కొందరు అర్ధంతో,మరికొందరు, శబ్దంతో,వేరొకరు అలంకారంతో, యిలాయెన్నోరీతులచమత్కారాలనుప్రదర్శించారు. నాయకరాజులయుగంలో"చేమకూరవెంకటకవి" ఉండేవాడు.ఆయనమాటకూడా చమత్కారమే! అంతగడుసుపిండం! ఆకవి,సారంగధర చరిత్ర మనే3ఆశ్వాసాలగ్రంధంవ్రాశాడు.అందులోఒకపద్యంమీకోసం,
సారంగధరుడుపావురంకోసంచిత్రాంగి యింటికివచ్చాడు.అతనిరాకకోసమేయెదురుచూసేచిత్రాంగి,అతనిమాటవినిపించుకోకుండాగబగబాపడకగదిలోకిలాక్కుపోయింది. అక్కడచాలాశృంగారచిత్రాలున్నాయి.వాటిలోఒకదాన్నిచూపిస్తూ,
ఉ: అల్లన గాధిరాజసుతు డర్మిలిమేనకముద్దొనర్ప,రా
గిల్లి కుచంబులాన గమకించుట గంటివెరాకుమార?యౌ
నల్ల నగాధిరాజసుతు డర్మలి మేనక ముద్దొనర్ప, రా
గిల్లి, కుచంబులాన గమకించుట బాల్యము గాదె భామినీ!
ఇందులో రెండుభాగాలున్నాయి.మొదటిరెండుపాదాలూ చిత్రాంగిప్రశ్న.చివరిరెండుపాదాలూసారంగ ధరునిసమాధానం.చూడవయ్యా!చూడు, గాధిరాజసుతుడు(విశ్వామిత్రుడు) మేనకయందాన్నిచూచి రాగంతోపరవసించియామెస్తనములను గ్రహింపప్రత్నించుటను చూచితివా?యన, సారంగధరుడామెయందనురక్తిలేనివాడగుట(పినతల్లియనిపవిత్ర భావము) ఔనమ్మా! నీవన్నదినిజమే! అల్ల నగాధి రాజ సుతుడు( ఆహిమవంతునికుమారుడు మైనాకుడు) అర్మిలిన్=ప్రేమతో;ముద్దొనర్ప= ముద్దుచేయగా ; రాగిల్లి= ఏడ్చుచు; కుచంబులాన= స్తనపానముచేయుటకు ప్రయత్నించుట, బాల్యముగాదె =బాల్యవశముననేకదా! యనిసమాధానం!
ఇక్కడ,మేనకావిశ్వామిత్రులశృంగారఘట్టాన్ని సారంగధరునకుజూపి,యతనినిరెచ్చగొట్టాలనిచిత్రాంగిప్రయత్నం.
ఆమాటలనేమార్చి,హిమవంతునిరాణిమేనకముద్దుసేయగా,పాలుగుడుచుటకుజూచుటనుజెప్పి,తప్పించుకొనుటసారంగధరునిప్రయత్నం.అభంగ,సభంగశ్లేష,వక్రోక్తి,ఈరెండూకలిసియీచమత్కారాన్ని ప్రతిపాదిస్తున్నాయి.

చేమకూరదే మరోపద్యం పరిశీలిద్దాం. ఇదికూడాచిత్రాంగీ, సారంగధరుల మాటలసందర్భంలోనిదే.
ఉ: నిక్కగ జూడు చిత్రమిది నెమ్మది వేడుక నోలలాడు, న
మ్మక్కల గుట్టు బట్టబయలై కనుపింపగ శౌరి కొమ్మపై
కెక్కి, రమించుచున్కి, యౌలే, మగువా! యిది చిత్రమౌట దా
నిక్కము; కృష్ణలీలగద నీ విపుడెన్నిన మార్గమంతయున్;
ఇందులో చిత్రము కొమ్మ రమించు, అనేపదాల నానార్ధల గణింపులోనేఉందిచమత్కారమంతా.చిత్రాంగిఅంటోంది" ఇదిగిదిగో యీచిత్రంచూడవయ్యా! కృష్ణుడు గోపికతో యెలారమిస్తున్నాడో?" అంటోంది.( యిక్కడ, కొమ్మ- అనేపదం ఆడదానికిపర్యాయపదం. రమించు =క్రీడించు;చిత్రం!= ఆశ్చర్యం!) దానికిసారంగధరునిసమాధానం" ఔనులే అదిచిత్రమే(చిత్రపటమే) (అతడావంకకైనాతిరిగిచూడలేదు) నీవుచేప్పినదికృష్ణలీలను గురించిగదా" అంటున్నాడు.శ్రీకృష్ణుడుగోపికలుజలకమాడువేళవారిచీరలనుగొనిపోయి,పొన్నచెట్టుకొమ్మపైగూర్చుండి పైకి రమ్మనిసరసమాడెనుగదా ఆవిషయమునుప్రస్థావించినాడు.ఈరెండవపక్షమున కొమ్మ=వృక్షశాఖ; చిత్రము=ఫొటో; రమించు= ఆటలాడు; చూచితిరాచేమకూరచమత్కారము.చిత్రాంగిగడుసుదనానికి,సారంగధరునిమాటకారి తనంతో సమాధానమిప్పించినాడు.

ఈరోజు మనమొక ప్రహేళికను పరిచయంచేసికొందాం.మనతెలుగులోపొడుపుల వంటివన్నమాట!
శ్లో: "కాచిత్ బాలా! రమణ వసతిం ప్రేషయంతీ కరండం
దాశీహస్తాత్ , సభయ మలిఖత్ వ్యాళమస్యోపరిష్టాత్
గౌరీకాంతం పవనతనయం చంపకం, చాత్రభావం
పృఛ్ఛత్యార్యో నిపుణతిలకో, మల్లినాధహ కవీంద్రహ";
అర్ధం: కాచిత్=ఒకానొక;బాలా=యువతి;కరండం=చిన్నపెట్టెను;దాశీహస్తాత్=దాశీచేతికియిచ్చి; రమణవసతిం=ప్రియునియింటికి; ప్రేషయంతి=పంపుచున్నది;అస్య=దానియొక్క; ఉపరిష్టాత్=పైభాగమందు; సభయం=భయమందుచున్న;వ్యాళం=పామును;గౌరీకాంతం=శివుని;పవనతనయం=హనుమంతుని; చంపకం=సంపెంగపూవును; అలిఖత్=లిఖించినది; ఆర్యహ=పెద్దలు;నిపుణతిలకహ=తెలివైనవారు;కవీంద్రహ=కవీశ్వరులను; మల్లినాధ=మల్లినాధుడు;అత్రభావం=ఇందలిఅర్ధమును;పృఛ్ఛతి= అడుగుచున్నాడు;
భోజునిఆస్థానానికి మల్లినాధసూరిపంపినప్రశ్నాపత్రమిది.మీలోనెవరైనదీనియర్థమును వివరంపగలరా? ఆలోచించండి! మీకుతోచకపోతే రేపుభాషాభారతిలోచూడండి!
(జవాబు రేపు వేచి చూడగలరు )

కవులకు యెప్పుడేవూహ కలుగుతుందో యెవరుచెప్పగలరు.ఒకకవికి ఒకఅందాలసుందరిని నిర్మించాలనేబుధ్ధిపుట్టింది.యెలా? ఛందోవృత్తాలతో,ఆవృత్తాతంవిందాంరండి!
మ: గతి మత్తేభము, నాసచంపక,మొగిన్ కైశ్యంబు 'కందంబు', సం
గత వాక్యంబులు' మత్త కోకిలలు' ;దృగ్వాపారమ'యుత్పల'
ద్యుతి, మో'మంబురుహంబు' దేహరుచి'విద్యున్మాల' యీమానినీ
తత వృత్తస్థితు లెన్నగాదరమె, తద్వాగ్జానికైనన్ ధరన్ ?;
మత్తేభము,చంపకము,కందము,మత్తకోకిల,ఉత్పలమాల, అంబురుహము, విద్యున్మాల, ఇవన్నీవృత్తాలు(పద్యాలు) యిందులో జాతికిచెందినకందంఒక్కటీకలిసింది.కలపకతప్పలేదుమరి.యీసువృత్తాలతోమానినీమణినిసృష్టించాడుకవి.
ఆమెగమనం మత్తేభంలాగ,ముక్కుచంపకం(సంపెంగ) లాగ, సన్నగాననున్న మేనుకందంలాగ,(ఉన్నవాటిలో కందమేచిన్నది)ఆమెమాటలుమత్తకోకిలలాగ(కోకిలకూతలవలె) కన్నులు ఉత్పలమాలలలాగ,(కలువలవలె)మోము అంబురుహంలాగ(అంబురుహం వృత్తం) పద్మంలాగ,అనిభావం.శరీరకాంతి విద్యున్మాల(మెరపుతీగె) లాగ,ఉన్నది.ఈమెయందాన్ని బ్రహ్మకూడావర్ణింపలేడేమో? నంటాడుకవిగారు.
ఇదేదో వినటానికికొంచెంయిబ్బందిగాఉన్నా,కవియూహనుమెచ్చుకోకుండాఉండగలమా? మీరేచెప్పాలిమరి!


సాహిత్య క్షేత్రంలో విహరిస్తూ ఉంటే యెన్ని వింతలు, విడ్డూరాలో! అవి మనం ఊహించలేం.అది అంతే ! కవుల ప్రతిభ! దక్షిణాంధ్ర యుగంలో మేటి చమత్కార ప్రయోగంలో ఘనాపాటి, చేమకూర వేంకట కవి యెంత చమత్కారాన్ని రంగరించాడో యీపద్యంలో చిత్తగించండి!
ఉ: చిత్తజుఁ డల్గి తూపు మొనఁ జేసిన జేయగనిమ్ము ; పైధ్వజం
బెత్తిన నెత్తనిమ్ము ; వచియించెద కల్గిన మాట గట్టిగా ,
నత్తరళాయతేక్షణ ,కటాక్ష ,విలాస, రస ప్రవాహముల్
కుత్తుకబంటి తామరలకున్ ;ఁదలముల్కలు గండుమీలకున్;
సుభద్ర సోయగాన్నిఃవర్ణించే సందర్భం . ఆమెజగదేక సుందరి , ఆమెకళ్ళు విరసిన కమలాలు, సొరచేపల వటివి, అనిచెప్ప వలసినదానికి పెద్ద నేపధ్యాన్ని కల్పిస్తున్నాడు వెంకన్నగారు.
" ఈమాట చెపితే మన్మధుడు అలుక బూని నాపై బాణంయెక్కు పెడతాడేమో? నామీద యుధ్ధాన్నిప్రకటిస్తూ, తనరధంమీదనున్నజండా నెగరేస్తాడేమో? యేమైనా గానీ ఉన్నమాట యేదో అది అనేస్తా! ఆచంచల నేత్ర చూపులు ఆచూపులలోని రసప్రవాహములు, తామరలకు కుత్తుక బంటియౌతున్నాయి. సొరచేపలకు తలముల్క లౌతున్నాయి" అంటాడు.
తామరపూ లెప్పుడూ పీక వరకూ నీీళ్ళలోనేఉంటాయి. అవిఅలాఉండటానికి కారణం కోపమట! యెవరిమీద?సుభద్ర కన్నిలపై, ( తామరలకన్నా అందంగాఉన్నాయనిచెప్పటం) యిక సొరచేపలకు తలముల్క లౌతున్నాయట! చేపలు నీటిలో మునిగే ఉంటాయి. దానినేకవి, సుభద్ర కనులను పోలలేక, సిగ్గుతో నీళ్ళలో తలదాచుకుంటున్నాయట!
మరి యీవిధంగా తన పరివారాన్ని గురించి చెపితే యెవరికైనా కోపంవస్తుందిగదా! కోపంవస్తే పరిణామం దాడిచేస్తారు. అంటే యుధ్ధానికి రావడం. వచ్చేవారు రధంమీద జండాయెగరేస్తారు. యీయనృమీనాంకుడేగదా! యికనేం నాపరివారంగొప్పదనిచెప్పటమేగదా! యికపోతే యుధ్ధంలో బాణప్రయోగం ఉంటుంది. ఉన్నదిగదాఅరవిదం అదేనండీ పద్మం.దాన్నే వింటికి తొడగవలసి యుంటుంది. ఆవి ధంగా రెటిపగ తీర్చినట్లేగదా!( ఆమెచూపులు మన్మధబాణాలే - ఆనెక్రీగంటి చూపులు మన్మధ ధవజారోహణమే! యనిభావం)
యిక మీనాలు ప్రవాహంలోనే ఉంటాయి, పద్మాలేమో రసం- జలం లోనేకదా ఉండేది. మొత్తానికి ఆమెవాలుచూపులు శృంగార రసప్రవాహాలు, మన్మధబాణాలు. అనికవిగారి యభిప్రాయం!

********************************************************************************************************************

వృత్త సుందరి సోయగం!
శా: గతి మత్తేభము, నాస చంపక, మొగిం గైశ్యంబు కందంబు , సం
గత వాక్యంబులు మత్తకోకిలలు , దృక్పాండిత్య మయ్యుత్పల
ద్యుతి , మో మంబురుహంబు , దేహరుచి విద్యున్మాలిగా, మానినీ 
తత వృత్తస్థితు లెన్నఁగాఁ దరమె, తద్వాగ్జాని కైనన్ దగన్;
కాణాదం పెదసోమయాజి; ముకుంద విలాసం ;
కవిసమయాలతో నాయికను వర్ణించటం శ్రీనాధాదుల నుండీ మనమెరిగినదే. కాణాదంవారి వర్ణనలో భావుకత గమనింపఁదగిన విషయం. మత్తేభం . చంపకం . కందం, మత్తకోకిల ,అంబురుహం ,విద్యున్మాలి , మానినీ, అనే ఛందస్సుల పేర్లతో వర్ణించటం కాణాదం పెద్దన గారి భావుకతకు నిదర్శనం.
నాయిక మందగమన అందువల్ల మత్తేభం; ముక్కు సంపెంగ , అందువల్ల చంపకం; కందం- అంటే నలుపు. కురులు నల్లగాఉన్నాయి .అందువలన కందం; మాటలు మత్తకోకిలలట; యిక చూపులు కలువలకాంతిని తలపిస్తున్నాయి, అందువలన కన్నులు ఉత్పలాలు.(ఉత్పలమాలికలు) ముఖమేమో పద్మం - అందుకే అంబురుహం; దేహకాంతి మెఱపుతీగె- అందువలన విద్యన్మాలిక; మానినీ తత వృత్త స్థితులను ఆబ్రహ్మకుగూడా వర్ణింప నలవిగాదు. అని కవిగారు ఘంటాపథంగా చెపుతున్నారు. మరి మీరేమంటారు?

Tuesday, 15 September 2015

హేరంబా --- వందే వందే గజాననా

హేరంబా
హేరంబా యని ఆలపించెదను
అంబా సుత ఆరంభామునే
అక్షరమౌ నీ భిక్ష కొరకు
సంరక్షక చక్షుర్వీక్షణమ్మునకు
మనసేమో మరి మరిగే నీరది
నిలకడ లేకయే నీల్గుచున్నది
చిత్రమైన నీ చేతి చలువతో
చిత్తము నీపై చిత్తగించుమా            ||హేరంబా||
ఆగమ యోగామవేమో ఎరుగను
రాగభోగ సంరక్తుడను
నీపై రాగము నీ భోగమె, నా
కిహపర సాధనమిక ఇభవక్త్రా         ||హేరంబా||

వందే వందే గజాననా

వందే వందే గజాననా
గౌరీ ప్రియసుత గజాననా
హారతిగొని మాకలుషమెల్లను
హరియించుమయా హరుతనయా       || వందే వందే గజాననా ||

సకల కార్యముల కాద్యుడవీవే
సర్వ శుభములను కూర్తువు నీవే
నీదు పాదములు మదిలో నిలిపి
నిన్నే నిన్నే వినుతిన్తుమయా             || వందే వందే గజాననా ||                                    

మాతా పితరుల పాద సేవలో
మహిమమను నాదే చూపిటివి
జగతినేల్ల కాదు శీఘ్రగమనమున
చుట్టి కొమరుని ఓడగొట్టితివి                || వందే వందే గజాననా ||

కార్య నిరతి కర్తవ్య దీక్షలో
కలకాలము మము నిలుపుమయా
గరికే పోచల గంపెడు ఆకుల
పూజలందుకొని భువిని బ్రోవుమా        || వందే వందే గజాననా ||

ఆగ్రహ నిగ్రహ శక్తి యుతుడవు
అనుగ్రహించుము మాపైన
కరములు కలిపి వేడుకొందుము
కనికరించుమా కరుణాహృదయా           || వందే వందే గజాననా ||