పండు -- పండ
పక్వమైనది పండు.మరి పండ అంటే పాండిత్యము,జ్ఞానము.పండగలిగితే పండితుడౌతాడు. కానీ ఈ వాక్యుములో ఒక చిన్న తిరకాసు వుంది, జాగ్రత్తగా పరిశీలించితే 'పండా కలిగియుండుటతోబాటూ పరిపక్వత కావాలి. అప్పుడే పాండిత్యమునకు సార్థకత. అంటే 'పండాయైనవాడు 'పండూ అయినప్పుడే ప్రజల నోళ్ళలో నానగలుగుతాడు. తన మాధుర్యమును ఆస్వాదింపజేయగలుగుతాడు. 'విద్య యొసగును వినయమ్మూ అనికదా పెద్దల మాట. అదే పెద్దలే ఈ మాట గూడా చెప్పినారు 'విద్యచే భూషితుండయి వెలయుచున్న తొడరి వర్జింపదగు సుమీ దుర్జనుండు' అని. అన్నీ వున్న ఆకు అణిగిమణిగి వుంటుందన్నవిషయము అందరికీ తెలిసినదేకదా!
విద్వాంసునికి ‘దోషజ్ఞుడు’ అని కూడా పేరు వుంది. అంటే దోషాన్ని తక్షణం కనిపెట్టగలిగిన సామర్థ్యత కలిగియుంటాడన్నమాట.దాని అర్థము అంతటితో సమకూరలేదు. మంచిని మెచ్చుకొనుట కాడా అతని బాధ్యతే. అది లేకుంటే అతనిని మంచివాడనరు మాత్సర్యపరుడంటారు.
గుణాలను ప్రశంసించాలి. దోషాలను ఎదుటివారు నొచ్చుకోకుండా చెప్పాలి. అదే విజ్ఞత. పెద్దలు అందుకే
సత్యంభ్రూయాత్ ప్రియం భ్రూయాత్
న భ్రూయాత్ సత్యమప్రియం
ప్రియంచ నానృతం భ్రూయాత్
ఏషాధర్మః సనాతనాః
అన్నారు. మనసుకు ప్రియమన సత్యము లేక వాస్తవమునే చెప్పవలె. నొప్పి కలిగించేది వాస్తవమైనా చెప్పకూడదు. అట్లని ప్రీతిగలిగించే అబద్ధము కూడా చెప్పగూడదన్నారు. కాబట్టి పౌరహితమైన వాస్తవము చెప్పవలసివచ్చినా భాషపై నియంత్రణతో మనసును మొత్తినట్లు కాకుండా హత్తినట్లు చెప్పవలెను.
ఈ విషయాన్నే పూర్వం ఒక కవి ఈ మధురభావాన్ని ఎంత బాగా చెప్పినాడో ఈ శ్లోకం చూడండి.
‘క్వ దోషాత్ర మయా లభ్య ఇతి సంచింత్య చేతసా
ఖలః కావ్యేషు సాధూనాం శ్రవణాయ ప్రవర్తతే’
‘పండితుడు అయినవాడు ప్రతిదానిలోనూ తప్పు ఎక్కడ కనబడుతుందా అని రంధ్రాన్వేషణ చేయరాదు.ఇలా చేసేవాడు మూర్ఖుడే అవుతాడు కానీ పండితుడు కాలేడు. కనుక పండితుడు అదేపనిగా తప్పులు వెదుకరాదు.
కానీ తప్పును తప్పక ఎత్తిచూపించవలసివస్తే చెప్పే వాక్యములో అక్షరాలను వెదకి వెదకి వేయవలసియుంటుంది.
ఇది తప్పక గుర్తుంచుకోవలసిన సత్యము.
No comments:
Post a Comment