Friday, 14 December 2018

బసవా!బసవా! వృషాధిపా!


బసవా!బసవా! వృషాధిపా!
తొలి శతకకర్తగా పేరుగాంచిన శివకవి పాల్కురికి సోమనాథ కవీంద్రుని వృషాధిపశతకంలోని ఈ పద్యరత్నమును గమనించండి. ఇందు మకుటమైన వృషాధిపా! అన్న పదము తప్ప పద్యమంతా జాను తెనుగులో నడచినది.పద్యము తెనుగుదయినా దురదృష్టకరమగు విషయమేమిటంటే అందు ఒక పదమునకు కూడా అర్థము మనకు తెలియదు. ఏమీ తెలుసుకోకుండా చదువుతూ ఉన్నాకూడా మనసులో ఎదో ఒక ఆనందము. ఆ గొప్పదనము భాస్ధడైనా ఉండాలి లేక భక్తిదయినా వుండాలి. ప్రస్తుతానికి ఆ రెండూ వున్నా సోమనకు మనకు తెలిసిన రీతి మనసా నమస్సులను సమర్పించి ముందునకు సాగుదాము.
శివకవులు నాటి శుద్ధ తెనుగును వ్యవహారములో ఉపయోగించుతూ దానినే గ్రంథరచనకు తగినదిగా ఎన్నుకొని పెద్ద పీత వేసినారు.
బలుపొడతోలు సీరయును బాపసరుల్ గిరుపారుకన్ను, వె
న్నెలతల, చేదుకుత్తుకయు,బన్నిన వేలుపుటేఱు, వల్గుపూ
సలుగల ఱేని లెంకనని జానుతెనుంగున విన్నవించెదన్
వలపు మదిందలిర్ప బసవా!బసవా! వృషాధిపా!
ప్రతి పదార్ధములు ఈ దిగువన గమనించగలరు:
బలుపొడతోలుసీర = అనేక మచ్చలుగల చర్మాంబరము.
పాపసరులు = సర్పభూషణములు
కిరుపాఱు = మండుచున్న
కన్ను= కన్నులు
వెన్నెలతల =తలపై గల చంద్రవంక
చేదు కుత్తుక = విషపూరిత కంఠము
బన్నిన – చిక్కగా కట్టిన
వేల్పుటేఱు = గంగ
నల్గుపూసలు-పుర్రెలనుపూసలపేరు (గల్గిన)
ఱేని-రాజుయొక్క
లెంకనని-సేవకుడనని
జాను తెనుంగున = జాను తెనుగులో
వలపు మది దలర్ప = ప్రేమ అనగా భక్తి తో కూడిన మనస్సుతో
విన్నవించెదన్ = తెలుపుకొనెదను
బసవా! బసవా! = బసవేశ్వరా బసవేశ్వరాఅని ఆర్తితోకూడిన స్వరముతో పిలుస్తున్నాడు.
ఈ పద్యమున  వృషాధిపా! అన్న ఒక్క మాట తప్ప  తక్కినవి దేశ్యములే!
పులితోలు ధరించినవాడు పాములను ఆభరణములుగా కలిగినవాడు, నిప్పుకంటిని గలిగినవాడు,చందమామను తలదాల్చినవాడు, విషమును గోతున కలిగినవాడు, పుర్రెల మాలను మెడకు వేసుకొన్నవాడు, నగు నాపమేశ్వరుని బంటునై మరులుగొన్న మనసుతో విన్నవించెదను అని భావము.
స్వస్తి.

Thursday, 13 December 2018

శృతి గీతలు


శృతి గీతలు
 పరీక్షిన్మహారాజు శుక మహర్షి తో "స్వామీ! వేదములు పరమాత్మను యే విధంగా ప్రతిపాదించుచున్నాయి ?" అని ప్రశ్నించగా, శుకుడు శృతులలో ప్రతిపాదింపబడిన భగవత్ తత్వాన్ని వివరించినవి శృతి గీతలుగా పిలువబడుతున్నాయి.  భగవంతుని నిశ్శ్వాసము చేత పుట్టిన వేదములు, ప్రళయ కాలమునందు యోగనిద్రను పొందిన ఆ పరమాత్మను, ఏవిధంగా ప్రస్తుతించుచున్నాయని నారదుడు నారాయణుని అడుగగా, ఆయన, పూర్వము సనక సనందనాదుల చర్చలో సనందుడు చెప్పిన తత్వమును నారదునకు చెప్పినాడు. దానినే  ఇప్పుడు శుకుడు పరీక్షిత్తునకు చెప్పుట తటస్తించినది. 
1. జయ జయ హరి! దేవ! సకల జంతువులకు ఙ్ఞానప్రదుండవు గాన వారి
వలన దోషంబులు గలిగిన సుగుణ సంతానంబుగా గొని ఙ్ఞాన శక్తి
ముఖ్య షడ్గుణ పరిపూర్ణ జేసి మా యాత్మ విశిష్టుండవగుచు గార్య
కారణాత్మకుడవై కడగి చరించుచు నున్న నీయందు బయోరుహాక్షా!
తివిరి యామ్నాయములుప్రవర్తించు గాన
ప్రకట త్రిగుణాత్మకంబైన ప్రకృతి తోడి
యోగ మింతయు మంపవే! యోగిమాన
సాంబు జాత మధువ్రత! యని నుతించి
 భావం:ఓ విష్ణు దేవా! నీకు జయమగు గాక! తామరల వంటి కన్నులు కలవాడవును, యోగీశ్వరుల మనసులనెడు కమలములందు తుమ్మెదల వలె ఆసక్తితో వసించుచున్నట్టి వాడవును, ప్రళయ కాలమున సకల లోకములను నీలో లయింప చేసుకొను వాడవును అయిన ఓ స్వామీ! నీవు సర్వోత్కృష్టుడవు.సకల జీవులకూ ఙ్ఞానాన్ని ప్రసాదించేవాడవు కాబట్టి నీవే ఆ ప్రాణముల వలన కలిగిన దుర్గుణములను కూడా సుగుణములుగానే ఎంచి రక్షించునట్టి వాడవు; సర్వఙ్ఞత్వము, సర్వేశ్వరత్వము, సర్వ నియంతృత్వము, సర్వ స్రష్టత్వము, సర్వాంతర్యామిత్వము, సర్వ భోక్తృత్వము అనెడు ఆరు గుణముల చేతను నిండుకొన్న వాడవై; మాయా సంబంధమగు జీవాత్మలను మీరినవాడవై ఆయా ప్రాణుల్లో ఆత్మ రూపంతో నీవు ఉంటావు. ప్రపంచ స్వరూపుడవు నీవే, ప్రపంచ సృష్టికి కారణములైన అవ్యక్త మహదహంకార పంచ తన్మాత్ర, పంచభూత స్వరూపుడవు నీవే. రజస్తమో గుణాలతో కూడిన కార్య కారణాత్మకుడవై నీవు వర్తిస్తావు. అటువంటి నీలోనే సకల వేదాలూ ప్రవర్తిస్తాయి. నీ స్వరూపమైన మాకు సత్వ రజస్తమో గుణాలతో కూడిన మూల ప్రకృతితో ఉన్న సంబంధాన్ని సంపూర్తిగా ఛేధించు తండ్రీ!          
2.  పరమ విఙ్ఞాన సంపన్నులైనట్టి యోగీంద్రులు మహిత నిస్తంద్ర లీల
బరిదృశ్యమానమై భాసిల్లు ని మ్మహీ పర్వత ముఖర ప్రపంచమెల్ల
బరగ బ్రహ్మ స్వరూపము గాగ దెలియుదు రెలమి నీవును జగద్విలయ వేళ
నవశిష్టుడవు గాన ననఘ!నీయందు నీవిపుల విశ్వోదయ విలయములగు
ఘట శరా వాదులగు మృద్వికారములు మృ
దాత్మకంబైన యట్లు పద్మాయతాక్ష!
తవిలి కారణ రూపంబు దాల్చి లీల 
గడగు నీయందు బుద్ధి వాక్కర్మములను 
భావం: ఓ స్వామీ!  ఙ్ఞానుులు  బ్రహ్మవేత్తలు పరమ యోగీశ్వరులు,  స్థావర జంగమాత్మకమైన భూమి, పర్వతాలు మొదలైన వాటితో కూడి ఉన్న ఈ ప్రపంచాన్ని బ్రహ్మ స్వరూపముగా భావించుతారు.  ప్రళయ కాలమందు నీవు మాత్రమే మిగిలి ఉంటావు.  ఈ విశ్వము యొక్క సృష్టిస్థితిలయములకు నీవే కారణభూతుడవు. బ్రహ్మ స్వరూపియైన నిన్ను మనసా వాచా కర్మణః సేవచేయ  అనుగ్రహింపుము. 
 3.   అలవడ జేయుచు నుందురు బలువై ఇల బెట్టబడిన పదవిన్యాసం
బులు పతన కారణముగా, నలవున సేవించుచును గృతార్థులు నగుచున్.
భావం:  విఙ్ఞాన సంపన్నులైన వారు జన్మమెత్తుటను పతన కారణముగా  గ్రహించి త్రికరణ శుద్ధితో సకల దేవతా స్వరూపుడవైన నిన్నే సేవిస్తూ కృతార్థులవుతారు. 
 4.  లీలం ప్రాకృత పూరుష
కాలాదిక నిఖిలమగు జగంబుల కెల్లన్
మాలిన్య నివారకమగు
నీ లలిత కథా సుధాబ్ధినింగ్రుంకి తగన్
భావం: ఓ సర్వాత్మకా!కాలస్వరూపమైన ఈ ప్రపంచంలో నీ మనోహర కథామృత వారిధిలో వేసిన ఒక్క మునక సకల పాపములనూ  హరించివేస్తుంది.   
5. భరిత నిదాఘ తప్తుడగు పాంథుడు శీతల వారి గ్రుంకి దు
ష్కరమగు తాపమొందొరగు కైవడి సంసరణోగ్రతాపమున్
వెరవున బాయుచుండుదురు నిన్ను భజించు మహాత్మకుల్ జరా
మరణ మనోగుణంబుల క్రమంబున బాయుట సెప్ప నేటికిన్?
భావం: లోకమునందు బుద్ధిమంతులగు వారు తీవ్రమైన ఎండచేత బాధపడే బాటసారి చన్నీళ్ళ స్నానం చేసి తన పరితాపాన్ని పోగొట్టుకునే విధంగా, నిన్ను పూజించే మహాత్ములు సంసారమనే అధికమైన భయమును కలుగచేయునట్టి దుర్భర తాపాన్ని నిన్ను ఉపాసించటం అనే జలమును మునుగుట అనెడి ఉపాయము చేత నేర్పుతో తొలగించుకుంటారు. అట్లుండగా ఎల్లప్పుడు నిన్ను సేవించునట్టి పుణ్యాత్ములు ఇక ముసలితనము, మరణము అనే వాటిని క్రమంగా పోగొట్టుకొంటారన్న మాట ప్రత్యేకంగా చెప్పటం దేనికి?
 6. అనయంబు దేహి నిత్యానిత్య సద్విలక్షణమున పంచకోశ వ్యవస్థ
నభివృద్ధి బొరయుచు నందులోపల నున్న ప్రాణాన్న బుద్ధి విఙ్ఞాన మయము
లను చతుష్కోశంబు లవ్వల వెలుగొందు నానందమయు డీవు గాన దేవ!
సురుచిర స్వప్రకాశుండవు నీ పరిగ్రహము కల్గుటం జేసి కాదె ప్రకృతి
మహదహంకార పంచతన్మాత్ర గగన
పవన తేజోంబు భూ భూత పంచకాది
కలిత తత్వముల్ బ్రహ్మాండ కార్య కరణ
మందు నెపుడు సమర్థంబు లగుట జూడ. 
భావం: దుర్లభమైన మనుష్య దేహమును ధరించిన ప్రాణులు శాశ్వతము, అశాశ్వతము అనే ఈ రెండు లక్షణాల కంటే విలక్షణమైన పరబ్రహ్మ స్వరూపము చేతను; అన్న, ప్రాణ, మనో, ఙ్ఞాన, ఆనంద మయాలనే పంచకోశాల వల్ల వ్యష్టి, సమిష్టి దేహమును ధరించియును అబివృద్ధి పొందుతూ ఉంటాయి. ఈ పంచకోశాలలో చివరిదైన ఆనందమయ కోశమే స్వరూపంగా వెలుగునట్టి శుద్ధ స్వరూపము చేత నీవు స్వయం ప్రకాశుడవై వెలుగొందుతుంటావు. నీ అధీనంలో ఉన్నందువల్లనే కదా ఈ ప్రకృతీ, మహత్తు, అహంకారము; పంచతన్మాత్రలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు; పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మొదలైన పంచ మహా భూతాలు అను వానికి చేతనత్వము కలుగచేసి, వాని చేత బ్రహ్మాండమును పుట్టించి, అందు ప్రవేశించి వెలుగుతూ, ఈ సమస్త సృష్టి స్థితి లయ కార్యాలను సర్వ సమర్థంగా నిర్వహిస్తున్నావు.   
7.  కోరి శరీరులు భవదను
సారంబున నిహపరైక సౌఖ్యంబుల బెం
పారగ నందుచు నుందురు
ధీరజనోత్తములనంగ దివిజారి హరా!
భావం: ఓ దైత్యహారీ! హరీ! నిన్ను అనన్య భక్తితో శ్రవణ మనన నిధి ధ్యాసలచేత భజిస్తూ బ్రహ్మ వేత్తలు శ్రేష్ఠులై ఇహ పరలోక సౌఖ్యములను కొరత లేక పొంది ధీరజనోత్తములుగా పేరెన్నిక గంటారు.  
 8. నిన్ను ననుసరింప నేరని కుజనులు
పవన పూర్ణ చర్మ భస్త్రి సమితి
యోజ జేయుచుందు రుచ్ఛ్వసనంబులు
బలసి యాత్మ దేహ భజను లగుచు
భావం: మూర్ఖులు ఈ దేహాన్నే ఆత్మ అనే భావంతో భజిస్తూ ఉంటారు.  9. దేవ! కొందరు సూక్ష్మ దృక్కులైనట్టి మహాత్మకు లుదరస్థుడైన వహ్ని
గా మది దలతురు కైకొని మరికొంద రారుణులను పేర నమరు ఋషులు
లీల సుషుమ్న నాడీ మార్గ గతుడవై హృత్ప్రదేశమున జరించుచున్న
రుచి దహరాకాశ రూపిగా భావింతు రట్టి హృత్పద్మంబునందు వెడలి
వితత మూర్ధన్య నాడికా గతుల నోలి
బ్రహ్మ రంధ్రంబు ప్రాపించి పరమ పురుష!
సుమహితానందమయ పరంజ్యోతి రూపి
వైన నిను బొంది మరి పుట్ట రవని యందు
భావం:  ఓ భగవంతుడా! వేదాంత శాస్త్రములందు చెప్పబడిన సంప్రదాయములైన ఉపాసనా మార్గములను అనుభవ జన్య ఙ్ఞానముల చేత ఎరిగిన సూక్ష్మ దర్శనులైన మహితాత్ములు నిన్ను నాభి స్థానమందలి మణిపూరక చక్రమున ఉండునట్టి జఠరాగ్ని స్వరూపునిగా భావిస్తారు. మరికొందరు అరుణులనబడే ఋషీశ్వరులు వినోదంగా సుషుమ్నా నాడీ మార్గంలో సంచరిస్తూ హృదయ ప్రదేశంలో గల అనాహత చక్రంలో పరమాకాశంలో సంచరించే సూక్ష్మాకార రూపంకలవాణ్ణిగా నిన్ను గ్రహిస్తారు. మరికొందరు బ్రహ్మ నిష్ఠులు ఆ విధమైన హృదయ పద్మం నుంచి వెలువడి ముక్కు రంధ్రముల యందలి మూర్ధన్య నాడి, అనగా ఇడా పింగళ మార్గము ద్వారా బ్రహ్మ రంధ్రం చేరుకుని సహస్రారమును పొంది ఆనందమయ పరంజ్యోతి స్వరూపుడవై వెలుగు నిన్ను చేరి నీయందు ఐక్యమై మునులు ముక్తులౌతారు. మళ్ళీ వారికి జన్మమంటూ ఉండదు. 
10.  అనఘ!దుర్గమమైన ఆత్మ తత్వంబు ప్రవర్తించు కొరకు దివ్యంబులైన
యంచిత రామకృష్ణాద్యవతారముల్ భజియించియున్న నీ భవ్య చరిత
మను సుధాంభోనిధి నవగాహనము సేసి విశ్రాంత చిత్తులై వెలయుచుండి
మోక్షంబు బుద్ధినపేక్షింప నొల్లరు మరియు గొందరు భవచ్చరణ పంక
జముల దగిలి పుణ్యతములైన హంసల
వడువు నొంది భాగవత జనముల
నొనరు వారు ప్రకట యోగిజన ప్రాప్య
మైన ముక్తిగోర రాత్మలందు.
భావం: పాపరహితుడవైన పరమాత్మా! పొందశక్యము కానిదైన ఆత్మ తత్వమును ప్రవర్తిల్ల చేయుట కొరకు ప్రకృతి సంబంధములు కాని రామావతారము, కృష్ణావతారము మొదలగు అవతారములెత్తి వర్తించునట్టి నీ చరిత్రము పాల సముద్రము వలె స్వచ్ఛమును, అపారమును అయి ఉండగా అట్టి చరిత్రముల స్మరణ, మనన, పఠనాక్రియలయందు,  మునిగి తేలుచు నెమ్మది పొందిన మనసు గలవారు అగుచూ కొందరు మోక్షమును అపేక్షించక మెలగుచుందురు. మరికొందరు నీ పాద పద్మములను ఆరాధించుట యందు ఆసక్తి గలవారై మిక్కిలి పుణ్యాత్ములైన పరమహంసల వలె భగవంతుడవైన నిన్ను సేవించుచూ శుద్ధులగుదురు. అట్టి వారు ప్రసిద్ధములైన యోగముల వలన సిద్ధినొందిన యోగులకు పొంద తగినదైన మోక్షమును మనసులలో మాటవరుసకైననూ  తలంపరు.   

11. కొందరు నీ శరీరము లకుంఠిత భక్తి భవద్వశంబులై
చెందగ నీ పదాబ్జములు సేరి భజించుచు దత్సుఖాత్ములై
యుందురు కొందరీ తనువు లోలి ధరించి భవత్పదాబ్జముల్
పొందుగ గొల్వలేక నిల బుట్టుచు జచ్చుచు నుందు రవ్యయా! 
భావం: అవ్యయా!స్వామీ! కొందరు పొందరానిదైన మానవ దేహమును పొందిన మాత్రముననే ఆ దేహమును నీకు అధీనము చేసి సమస్త ప్రాణులకు అధీశ్వరుడవు నీవేయని తెలుసుకొని మిక్కుటమైన భక్తితో నీ చరణారవిందములను సదా సేవిస్తూ పరమానందము అనుభవిస్తూ ఉంటారు. మరికొందరు నీ పాద పద్మాలను భజింపలేక ఈ లోకంలో జీవన్మరణ వలయమున దగుల్కొని కొట్టుమిట్టాడుతూ వుంటారు. 


 12.     యమ నియమాది యోగ మహితాత్మకులైన మునీంద్రులున్ విరో
ధమున దలంచు చైద్య వసుధావర ముఖ్య నృపుల్ ఫణీంద్ర భో
గము లన నొప్పు బాహువులు కల్గిన నిన్ను భజించు గోపికల్
క్రమమును నేమునున్ సరియ కామె భవత్కృప కంబుజోదరా!
భావం: యమ నియమములు మొదలైన యోగములు అభ్యసించి వాని వలన సిద్ధి పొందిన మునీశ్వరులును, శత్రు భావంతో నిన్ను తలపోసే శిశుపాలుడూ మొదలైన దుష్ట రాజన్యులూ, ఆలింగనాదుల చేత నిన్ను భక్తితో ఆరాధించే గోపికా స్త్రీలూ, ఎల్లప్పుడూ స్తుతి చేయునట్టి మేమూ నీ కృపకు సమానంగా పాత్రులమగుటలో సందేహము లేదు. అనగా నీకు శతృవులు, మిత్రులు, సేవకులు అనువారు అందరునూ సమానమే!
13.     అరవిందాక్ష! భవత్స్వరూపమిల బ్రత్యక్షంబునం గాన నె
వ్వరికిం బోలదు శాస్త్రగోచరుండవై వర్తింతు వీ సృష్టి ముం
దర సద్రూపుండ వైన నీ వలననే ధాత్య్రాద్య మర్తుల్ జనిం
చిరి ని న్నంతకు మున్నెరుంగ గలమే చింతింపనే మచ్యుతా!   
భావం: ఓ స్వామీ! నీ అసలైన స్వరూపమునుఉపనిషత్తుల వల్ల తెలుసుకోన వలసినదేకానీ ప్రత్యక్షంగా చూడట మా తరమా!  ఈ ప్రపంచ సృష్టికి పూర్వం నీవు ఎప్పుడును చెడని దివ్య స్వరూపము కలవాడవై వెలుగొందుతున్న పరమాత్మ స్వరూపుడవై ఉండి నీ వల్లనే బ్రహ్మాది దేవతలు ప్రభవింపజేసితివి. నీవు ఏ రూపంలో ఉంటివో తెలుసుకొనుటకు మేము ఏపాటి? నీ సచ్చిదానంద స్వరూపమును మేము గుర్తించగలమా?    
 14.     వనజాతాక్ష! భవత్పదాబ్జ యుగ సేవాసక్తులైనట్టి య
జ్జనముల్ మృత్యు శిరంబు దన్ని ఘన సంసారాంబుధిన్ దాటి పా
వనులై లోకములుం బవిత్రములుగా వర్తించుచున్ నిత్య శో
భనమై యొప్పెడి ముక్తి బొందుదురు శుంభద్వైభవోపేతులై
భావం: దేవా! నీ పాద కమలములను మిక్కిలి ఆసక్తితో కొలుచుట యందు నిరంతర నిమగ్నులైన వారు మృత్యువును జయించి, సంసారమహోదధిని అలవోకగా దాటి,  జనన మరణ పరంపరలకు గురి కాక పవిత్రులై, లోకాలను పవిత్రం చేస్తూ ముక్తికి యోగ్యులై ప్రకాశించెదరు. 
15.     మిము సద్భక్తి భజింప నొల్ల కిల దుర్మేధం ప్రవర్తించు నీ
చ మతివ్రాతము నేర్పునం బసుల బాశ శ్రేణి బంధించు చం
దమునం బెక్కగు నామ రూపముల చేతన్ వారి బంధించి దు
ర్గమ సంసార పయోధి ద్రోతువు దళత్కంజాత పత్రేక్షణా!
భావం:  దళత్కంజాత పత్రేక్షణా!  శ్రీ కృష్ణా! ఎవరు నిను భక్తితో సేవించకుండా దుర్మదాంధులై భూమి యందు చరింతురో అట్టి నీచ బుద్ధి గల పామరులను పశువులను  మోకుతో కట్టు విధముగా నానా రీతుల బంధించి సంసారము అనెడి సముద్రము నందు పడదోస్తావు.
 16.     మది దలపోయగ జల బు
ద్బుదములు ధర బుట్టి పొలియు పోలిక గల ఈ
త్రిదశాది దేహములలో
వదలక వర్తించు నాత్మ వర్గము నోలిన్.
భావం: ఆలోచించగా  బుద్బుదప్రాయమైన ఈ శరీరాల్లో అంతరాత్మవై నీవు వర్తిస్తావు. 
 17. ప్రళయ వేళ నీవు భరియింతు వంతకు
గారణంబ వగుట కమలనాభ!
భక్త పారిజాత! భవ భూరి తిమిర ది
నేశ! దుష్ట దైత్య నాశ! కృష్ణ!
భావం: ఓ కమలనాభా! భక్త పారిజాతా! కారుచీకటిని పారద్రోలు దినకరుడా! దుష్ట దైత్య వినాశకా! శ్రీకృష్ణా! ప్రళయ సమయమున సమస్త విశ్వమునూ నీవే భరింతువు.
18. అనఘ! జితేంద్రియ స్ఫురణులయ్యును జంచలమైన మానసం
బను తురగంబు బోధ మహితాత్మ వివేకపు నూలి త్రాట న
ల్లన గుదియంగ బట్టను దలంచుచు ముక్తి కుపాయ లాభ మే
యనువును లేమికిన్ వగల నందెడు నాత్మలువో తలంపగన్.
భావం: అనఘా! జితేంద్రియులు కాగాలియు, చపల స్వభావము గల మనస్సు అనెడి గుర్రమును, బ్రహ్మ ఙ్ఞానము అనెడు నూలు తాడు చేత మెల్లగా బిగబట్టుటకు యత్నించుచు సఫలత నొందలేక మోక్ష మార్గము  కనబడక నీ పాదారవింద భజన లేని జీవులు విచారము పొందుచున్నారు.  

 19.     గురు పద పంకజాతములు గొల్వని వారలువో మహాబ్ధి ని
స్తరణకు గర్ణ ధార రహితంబగు నావము సంగ్రహించు బే
హరి గతి భూరి దుస్తర భవాంబుధిలోన మునుంగుచుందురు రం
బురుహదళాక్ష! నీవు పరిపూర్ణుడవై తనరారంగా నొగిన్.
భావం: ఓ తామరసాక్షా! గురు పాద పద్మములను సేవించని పామరులు పెద్ద సముద్రము దాటుటకు ఓడ వాడు లేని ఓడ యందు కూర్చుండి, బేరమాడబోవు వర్తకుని వలె జనన మరణ పరంపరలనబడు అపార్తావార సంసార సంద్రమున మునిగి పోతున్నారు. విశ్వా వ్యాప్తమైన నీ వెలుగును గాంచలేక నిన్ను చేరలేకున్నారు.
 20.  పుత్ర దార గృహ క్షేత్ర భూరి విషయ
ఘన సుఖాసక్తుడగుచు నే మనుజుడేని
నర్థి జరియించు వాడు భవాబ్ధి లోన
జెంది యెన్నాళ్ళకును దరి జేర లేడు.
భావం:    యే మనుష్యుడు నిరంతర సంసార లంపటముల యందు ఆసక్తి కలవాడై, విశేషమైన విషయ సుఖములు పొందగోరునో అటువంటి మానవుడు ఈ సంసార సాగరము ను ఎన్నటికీ దాటలేడు.
21.జగతిపై బహు తీర్థ సదనంబు లనగల్గి పుణ్యాను వర్తన స్ఫురితులగుచు
బాటించి నీ యందు బద్ధ మత్సరములు లేక భక్తామరానోకహంబ
వగు భవత్పాదాబ్జ యుగళంబు సేవించి భవ పాశముల నెల్ల బారదోలి
సమ మతులై యదృచ్ఛాలాభ తుష మేరు సమముగా గైకొని సాధులగుచు
బాద తీర్థంబు గల మహా భాగవత జ
నోత్తమోత్తము లైనట్టి యోగి వరుల
వారకెప్పుడు సేవించు వాడు వొందు
బ్రవిమలానందమయ మోక్షపదము. 
భావం:    ఈ భూలోకమునందు పుణ్య నదులను, పుణ్య క్షేత్రములను సేవించుచూ,తమ పూర్వ పుణ్య విశేషము వలన  వివేకులు నీయందు విరోధ బుద్ధి లేక, భక్తుల పాలిట కల్పవృక్షమైన నీ పాద కమలములను కొల్చి, జన్మ బంధములను తొలగించుకుని, శతృవులు, మిత్రులు అను బేధ బుద్ధి లేక ఎల్లరి యెడల సమముగా వర్తించుచు తనంతట దొరికిన అల్ప వస్తువునైనను మేరు పర్వతముతో సమానముగా నెంచుచు సాధువులై, పరిశుద్ధులైన భగవద్భక్తుల పాద తీర్థములను కోరి అట్టి యోగీశ్వరులను సేవించి వర్తించును. అట్టి పుణ్యాత్ముడు నిర్మలమైన ఆనందమును కలుగ చేయునట్టి మోక్ష స్థానమును పొందును. 

Saturday, 10 November 2018

ఖగోళము - ఆశ్లేష నక్షత్రము


ఖగోళము - ఆశ్లేష నక్షత్రము
(https://cherukuramamohanrao.blogspot.com/2018/11/blog-post.html)
నేను ఆశ్లేష నక్షత్రమును గూర్చిన వివరములను ఖగోళ పరముగా తప్ప జ్యోతిష పరముగా విశ్లేషించుట లేదు.
ఆశ్లేష నక్షత్రమునకు  అధిదేవత పాము. అది ఎట్లు అన్నది ఒకసారి గమనించుదాము. ఆచార్య వరరుచి భూమినుండి ఆకాశములోని ఆశ్లేషా నక్షత్రమును జూసి 'సర్ప ఋతు' అన్నాడు. భారతీయు గణిత శాస్త్రములో భూత సంఖ్యలు, కటపయాది సంఖ్యలను గూర్చి సవిస్తారముగా నేను మన పూర్వులు π” విలువను "గోపిభాగ్యం...." అన్న శ్లోకములో ఏవిధముగా బంధించినారు అన్నవిషయమును తెలుపుటకు ముందు, తెలిపినాను. భూత సంఖ్యలలో మనకు ఎరుకలోని ఒక విషయము ఏ సంఖ్య లేక అంకెను తెలుపుతుందో, ఆపేరును వాడినపుడు ఆ అంకెను లేక సంఖ్యకు ప్రతీక వుండే సంజ్ఞను తీసుకొంటాము. ఉదాహరణకు ఋతు అంటే 6, ఋషి అంటే సప్తర్షులు 7, ఆవిధముగా.
ఆశ్లేష విషయములో వరరుచి గారు సర్ప ఋతు అని వాడినారు. సర్ప అంటే పాము, అది వంకర టింకరగా వుంటుంది. ఋతు అంటే ఋతువులు. అవి ఆరు. అంటే మొత్తము అర్థమును క్రోడీకరించితే ఆశ్లేషా నక్షత్ర సముదాయము 6 నక్షత్రములను కలిగి పాముచుట్ట ను బోలి లేక పామువలె వంకరటింకరగా వుంటుంది అని గ్రహించవచ్చు. ఈ విషయమునే దీపికాకారుడు 'చక్రాకృతిః షణ్ణక్షత్రాత్మకం' అన్నాడు. ఇదే విషయమును వేదము 'ఆశ్రేషా నక్షత్రం- సర్పో దేవతా' అంటూవుంది. ఇంకా 'తేన సర్పాసో హవమాగమిష్టాః ఏ రోచనే సూర్యస్యాపి సర్పాః' అని చెబుతుంది. దీనినిట్లుంచి సూర్యుని విషయమును గూర్చి పాశ్చాత్యుల పరిశోధనలను ఒకసారి చూద్దాము.
మనము భౌతిక శాస్త్రము(Physics)లోని కాంతి శక్తి (Light Energy) లో కాంతికిరణము ఒక గాజు పట్టకము(Glass Prism) గుండా పయనించినపుడు వర్ణవికిరణము(Divergence of Light) జరిగి VIBGYOR అన్న 7 రంగులుగా మారుతుందని చదివియుంటాము.
(Intermediate కు వస్తే 10th Syllabus గుర్తుంచుకోనక్కరలేదు అన్న మహనీయుల నీతివాక్యము విన్న వాడిని కాబట్టి, ఆ కోవకు చెందిన వారికి బహుశ ఇది గుర్తుండక పోవచ్చునని సంశయించుచున్నాను.)
1670 ప్రాంతములో అంటే 17వ శతాబ్దములో కాంతికిరణమును గూర్చి విస్తారమయిన ప్రయోగములు చేసి జగతికి చాటినవాడు Newton. దీనిని Corpuscular Theory అంటారు. Corpuscle అంటే ఒక అతిచిన్న పొట్లము (Packet) గా అనుకొనవచ్చు.  అంటే ఒక కాంతి కిరణము సూర్యునినుండి కొన్ని కోట్ల కోట్ల  పాకెట్స్ గా అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన, ఒక packet కు ఇంకొక packet కు గల, మధ్య దూరముతో సరళ రేఖలో  ప్రయాణము చేయుచున్నట్లు ఆయన ప్రతిపాదించినాడు. ఆయన తన ప్రతిపాదనను, పరావర్తనము, వక్రీకరణ సిద్ధాంతములతో సమర్థించుకొన్నాడు. అదే 1678 ప్రాంతములో Hygiene అనే Dutch Scientist వెలుతురు కిరణములు తరంగముల రూపములో పయనించుచున్నట్లు తెలిపినాడు. దీనిని Interfearence మరియు Difraction అన్న సిద్ధాంతాల సహకారముతో ఆయన తన వాదనను సమర్థించుకొన్నాడు.
ఒకే కాలము వారయినాకూడా తమ తమ సిద్దాంతముల మధ్య సమన్వయ సాధనకు వారు కృషి చేయలేదు.ఎవరి సిద్ధాంతమునకు వారు కట్టుబడి మొండిగా కూర్చొని ఉండిపోయినారు. పరిష్కారమునకన్నా పట్టుదల ముఖ్యమనుకొన్న మహనీయులు వారు. ఇందులో కూడా మనకు Newton పేరు మాత్రమే తెలుసు Hygiene మనలో చాలామందికి అగంతకుడే! దీనిని బట్టి Newton వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్తకు స్వార్థము, అర్థము(ధనము)  తప్ప లోకహితార్థము లోపించినదని అర్థమగుట లేదా!
మిగిలినది మరొకసారి......
           ఖగోళము - ఆశ్లేష నక్షత్రము
                                 (2వ భాగము) 
ఈ పరస్పర వైరుధ్యములచే సమస్య సందిగ్ధముగానే ఉండిపోయినది 19వ శతాబ్దము వరకు. 
 Einstein 19వ శతాబ్దములో పై రెంటినీ సమన్వయము చేస్తూ Quantum theory ని ప్రతిపాదించినాడు. ఒక నావంటి పామరునికి అర్థమయ్యే రీతిలో చెప్పవలసి వస్తే ఈ corpuscles అన్నీ ఒకదానినొకటి ఆనుకొని తరంగ రూపములో పోతున్నాయి అన్నది ఈ ప్రతిపాదన. అంటే ఒక 12౦ సంవత్సరాలుగా ఇది Scientists అంగీకరిస్తున్న విషయము. అంటే అంతకు ముందుకాలము వరకు అయోమయావస్థలోనే ఆలోచనలను కలిగియుండినారు. ఇపుడు గ్రహ, గ్రహణ సంబంధితమైన వివరములు, వివరణలు ఈ సిద్ధాంతముననుసరించియే లోకమునకు చాటబడుచున్నవి. మన మహర్షులు ఈ విషయమును ఎన్నో లక్షల సంవత్సరముల క్రితము, అపౌరుషేయములైన మన వేదములలో చెప్పిన ఈ మాటను, మనకు అందించినారు. ఇంతటి విషయమును పాశ్చాత్యులు 12౦ సంవత్సరముల క్రితము మాత్రమే పుష్టి చేసుకొనగలిగినారు.
ఇపుడు మన వేదశాస్త్రములలో ఏమని తెలిపినారో ఒకసారి పరిశీలించుదాము.
అంతకన్నా ముందు శాస్త్ర చోదితమైన ఈ విషయమును గమనించండి.
రథస్యేకం చక్రం భుజగయమిత సప్తతురంగః
నిరలంబో మార్గః చరణరహితహ్ సరథిరపి.
 రవిర్యార్తేవంత్యం  ప్రతిదినమపారస్య నభసః 
క్రియాసిద్ధిః సత్వే భవతి మహతాం నోపకరణే.    

రథానికి చక్రమా ఒకటే!, కళ్ళెములా పాములు,గుర్రములా ఒకటి కాదు ఏడూ, మార్గమా సరళరేఖ కాదు, సారధి చూస్తామా అసలు కాళ్ళే లేవు, అయినా సూర్యుడు లోకానికి వెలుగు పంచుటకు తాను ప్రతిరోజు ఆ కష్టాన్ని అనుభవించుతూనే వున్నాడు/ఉంటాడు. మహనీయులు కేవలము ఆశయము-ఫలితముపై ధ్యాసనుంచుతారు కానీ తమకు కలిగే కంటకాలను గూర్చి కాదుఅన్న విషయాన్ని అక్షరాలా పాటించి ఉన్నతి సాధించిన శ్రేష్ఠులను  ఆదర్శముగా తీసుకుని వీరు అడుగు ముందుకు వేయటం జరిగింది.
శ్లోకార్థము అంతా మనకు ఈ సందర్భములో అవసరము లేదు. కావలసినది మాత్రమె తీసుకొందాము. పైశ్లోకములో ఎంత నిర్ద్వంద్వముగా, నిశితముగా  నిస్సంకోచముగా, చెప్పినారో గమనించినారు కదా! చక్రము ఒకటే అంటే రథము ఒక చక్రముతో నడువలేదు. ఒక వేళ రథమునకు మధ్యలో ఉంచితే నడువవచ్చునుు
అనుకొంటే నిశ్చలత లోపిస్తుంది, అంటే సూర్యుడు రథములో ఉంటాడు కానీ  కదలడు. చక్రమా కాలచక్రము. అది తిరుగుతూనే ఉంటంది, stand వేసి pedal త్రోక్కుతూవుంటే తిరిగే cycle చక్రము లాగా! ఇక సారధికి నడుము వరకే శరీరము. అతనూ కదలడు. 7 గుర్రములు, వర్ణ వికిరణము చెందే 7 రంగులు. పగ్గాలు పాములుఅంటే వంకరటింకరగా వుంటాయి. ఇంతకంటే గొప్పగా ఏ scientist కూడా చెప్పలేదు సూర్యుని గూర్చి.
అంతటి గొప్ప విషయములు చెప్పినవారు ఎల్లపుడూకిం అర్థం దుఃఖబాజనం అనుకొన్నారు. అందుకే patent అన్న ఊహ కూడా వారికి రాలేదు.

మనము ఈ పాము నడకను బోలిన వెలుగు కిరణ ప్రయాణమును వేదములో ఏ విధముగా వర్ణింపబడినదో ఇపుడు చూద్దాము.
చివరి భాగము మరొక రోజు.........
  ఖగోళము - ఆశ్లేష నక్షత్రము (చివరి భాగము)
భుజగ నమితాః సప్త తురగాః
ఏదో రోచనే దివో, ఏవా సూర్యస్య రశ్మిషు
ఏషామప్సుషదః కృతం తేభ్యః సర్పేభ్యో నమః   
ఇక్కడ పైన చెప్పిన భుజగ నమితాః సప్త తురగాః అన్నది తీసుకొంటే ఏడు గుర్రములు పాములవలే, వంకరటింకరగా, వంగి వున్నాయి. ఇక రెండవ వచనములో సూర్యస్య రశ్మిషు అన్న మాట వస్తుంది. రశ్మి అంటే కళ్ళెము మరొక అర్థము కిరణము. కిరణము అన్న అర్థము మనకు తెలిసినదే!
ఏడు గుర్రములకు కళ్ళెములు పాములు కదా! అవి  నిటారుగా వుండవు కదా! నిటారుగా వుంటే గుర్రములు నిలచిపోతాయి.
మరొక ఆశ్చర్యకరమగు వాస్తవమును పరిశీలించుదాము. జాతకాలు వ్రాయునపుడు రాశి, అంశ చక్రములను వేస్తాము. అందు మనము రాశి చక్రమును గమనించితే ఆశ్లేష నాలుగు పాదములు కర్కాటక రాశికి చెందుతాయి. ఆ చక్రములో దానికి పూర్తి వ్యతిరేక దశలో మకర రాశి వుంటుంది. మకరములో శ్రవణా నక్షత్రము తన నాలుగు పాదములనూ కలిగియుంటుంది. శ్రవణము విష్ణుమూర్తి నక్షత్రము. విష్ణువు వుంటే గరుత్మంతుడు అక్కడ వున్నట్లే! ఇందుకు సంబంధించి మనకు విష్ణు సహస్రనామములో 21వ శ్లోకము ఈ విధముగా వుంది.
మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః
భగవద్గీతలో శ్రీ కృష్ణుడు విభూతి యోగములో తనను గూర్చి ఈ విధముగా చెప్పుకొన్నాడు.
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్|
మృగాణాం చ మృగేన్ద్రోహం వైనతేయశ్చ పక్షిణామ్  || 10-30 ||
నేను దైత్యులలో ప్రహ్లాదుడీనిలెక్కలు కట్టేవాళ్ళల్లొ కాలాన్నిమృగాలలో మృగేంద్రుడినిపక్షులలో గరుత్మంతుడిని.
గరుత్మంతునకు  సుపర్ణ అన్నది ఒక పేరు. ఈయన పక్షులకు రాజు. వైనతేయుడు అన్నది కూడా గరుత్మంతునియొక్క మరొక పేరు.అఖిల చరాచర జీవరాశులలో ఏదయితే శ్రేష్ఠమో అది శ్రీ మహావిష్ణువే! ఆవిధముగా ఒకే స్వరూపమును వేర్వేరు పాత్రలు అనగా శ్రీకృష్ణుడు, భీష్ముడు తెలియజెప్పినా అందు అభిప్రాయ భేదములు లేవు. అదే విధముగా నాగులలో శ్రేష్ఠుడగు అనంతుడు కూడా విష్ణ్వంశ సంభూతుడే!
మరి గరుడునికీ నాగులకూ వైరము కదా! ఇక్కడ ఈ విషయమును ఖగోళ పరముగానూ, కొంత లౌకికముగానూ చర్చించుదాము. గరుడుడు విష్ణు వాహనమే! ఆయన ప్రయాణమునకు ఉపయోగపడుతాడు.పరమాత్మ యోగములో ఉన్నపుడు ఆయన సమయమంతా అనంతునితోనే.
ఆశ్లేషా నక్షత్రము సర్పాకారము అని నిర్దారించుకొన్నాము. ఆశ్లేషా నక్షత్రము కర్కాటక రాశికి చెందినది. అదేవిధముగా విష్ణువు నక్షత్రము శ్రవణము. ఇది మకరరాశికి చెందినది. ఈ రెండు రాశులూ ఎల్లపుడూ 18౦డిగ్రీల కోణములో వుంటాయి. మరి సర్పము విష్ణు నక్షత్రమునకు సరళరేఖలో (180 డిగ్రీలు) ఉంటె విష్ణువు గరుత్మంతునితో ఉన్నట్లే కదా! కావున సుపర్ణుడగు విష్ణువు భుజగోత్తముడగు విష్ణువునకు 180 డిగ్రీల కోణములో వున్నాడు. సాపేక్షముగా ఈ రాశులు క్షితిజము నుండి ఉద్భవించి 180 డిగ్రీల కోణమును పాటీంచుతూ పయనించుచుంటాయి. అంటే మకరము పుట్టే సమయమునకు కర్కాటకము అస్తమించబోతూ వుంటుంది. అంటే గరుడుని చూస్తే పాము కనుమరుగౌతుంది అన్న లౌకిక, ప్రాకృతిక వాస్తవము ఇక్కడ ప్రతిఫలించుతూ వున్నది.
ఒక కర్కాటక రాశియేగాక సింహ,కన్య, తులా రాశులు కూడా సర్పాకృతి కలిగియుండుటతో అంతాకలుపుకొంటే అది మహా సర్పమౌతుంది. ఆవిధముగా ఆ ఆకృతిని ఆదిశేషునిగా ఊహించవచ్చు. ఆవిధముగా మనకు పై విషయములు అన్నింటికీ సమన్వయము కుదురుతుంది.
మరొక విషయమును గమనించుదాము.

ఒక దినము యొక్క సూర్యోదయాత్ ఏ నక్షత్రము ఉదయించుతుందో ఆ నక్షత్రము యొక్క అధిదేవత యొక్క వ్రతమును, పూజను, పండుగను పాటించుతారు. ఉదాహరణకు భాద్రపద శుక్ల చతుర్థి నాడు వినాయక వ్రతమును ఆచరించుతాము. మనకు తెలిసిన 27 నక్షత్రములు గాక ఆకాశములో అనంత నక్షత్ర సముదాయాలున్నాయి. వానిలో వినాయక నక్షత్ర సముదాయమొకటి.
తరువాతి రోజయిన పంచమిని మనము ఋషిపంచమిగా గుర్తించి ఆచరించుతాముఖగోళ విషయములో ఋషి అంటూనే మనకు జ్ఞాపకమునకు వచ్చేది సప్తర్షి మండలము. ఇది 27 నక్షత్రమండలములలో లేకున్నా దీనికి కూడా ఉదయాస్తమానాలు వుంటాయి. ఆశ్లేష తరువాత వచ్చే మఖ నక్షత్రముతో బాటూ ఇవి కూడా చవితి తరువాతి రోజు అనగా పంచమి రోజున ఉదయించుతాయి కాబట్టి ఆరోజు ఋషి పంచమి అయినట్లే చవితి రోజు వినాయక నక్షత్రములు కూడా అత్యంత స్వల్ప భేదముతో ఆశ్లేషకు ముందు ఉదయించుటచే వినాయకుని జన్నిదమయినది సర్పాకృతి కల్గిన ఆశ్లేష. అదే మాటను మనము శ్రీ గణనాధాష్టకము లోని ఈ శ్లోకములో చూచుటయే గాక
ఈ శ్లోకము వేదవాక్కును సమర్థించుట కూడా చూస్తాము.
శ్లోll ముంజీ కృష్ణమృగాజినధరం నాగయజ్ఞోపవీతం
     బాలేందు సకళా ద్మౌళే వందేహం గణనాయకం 2
పై శ్లోకమును నాగ యజ్ఞోపవీతనం అన్న వేదవాక్యము ఈ విధముగా పుష్టి చేయుచున్నది.
ఎంతటి విజ్ఞానమో గమనించినారు కదా! పరమతములలో వలె, వాళ్లకు ఉన్నాయి కాబట్టి మనకు వువుండవలెనను రీతిలో ఏర్పడినవి కావు. మన పండుగలు శాస్త్రార్థము సమన్వయము సహేతుకము అగు పర్వదినములు. 
అంతో ఇంతో ఎంతో కొంత తెలిసిన వారు, లేక, నాలాంటి తెలుసుకొన్నవారు చెబుతున్నపుడు మనసు పెట్టి చదవండి. ఉబుసుపోకకు ఊకదంపుడు కబుర్లు చెప్పుట లేదు. మన పూర్వుల ప్రతిభ గుర్తించండి.
చర్మ చక్షువులను జ్ఞాన చక్షువులుగా చేసి Telescopes(దుర్భిణులు) యొక్క సహాయము లేకుండా చూడగల్గిన మన సనాతన ఋషిగణమునకు మనఃపూర్వకముగా సాష్టాంగ దండప్రణామము తప్ప వేరేమి చేయగలము.

స్వస్తి
Madhavi Latha
Intha chakkati vishayalu vrasi, vedha vignanni panchuthunna meeku vinayapoorvaka namassulu. Dheenni poorthi sthayilo akalimpu cheskuney gnanam naku lenappatiki, Quantum theory and Astro Science meedha asakthi Walla chadivi ardham cheskogaliganu..mukhyam ga meeru vrasina theeru Chala asakthikaramga undhi 🙏




Thursday, 18 October 2018

వృషభము-మిధునము-ఖగోళము


వృషభము-మిధునము-ఖగోళము

https://cherukuramamohanrao.blogspot.com/2018/10/blog-post.html
కాళిందీం శుక్ష సలిలాం నిరీక్ష్య 'వృషకేతనః'l
ప్లక్షజాం స్నాతు మగమడంతర్దానంచశాగతా ll
కాళింది లో నీరు ఎండియుండుట జూచి ప్లక్షజా నదిలో స్నానము చేద్దామని చూడగా అక్కడా నీరు ఎండిపోయి ఉండుట శంకరునకు అగుపించినది. ఈ సందర్భమున ఈశ్వరునకు 'వృషకేతనుడు' అన్న పదమును వాడుట  వామన పురాణము పరమేశ్వర బ్రహ్మహత్యాపాతక నివారణ ఘట్టము నందు మనము చూడగలము.
శివ సహస్ర నామములోని 6వ శ్లోకము ఈ విధముగా వున్నది.
విశ్వరూపో విరూపాక్షో వాగీశః శుచిసత్తమః ।
సర్వప్రమాణసంవాదీ వృషాఙ్కో 'వృషవాహనః'
ఇందు వృషవాహనః అన్న ప్రయోగమును ఈశ్వరునికి మనము చూడవచ్చు.
దీనిని బట్టి శివునకు ‘వృష కేతనుడు’ ‘వృష వాహనుడు’ అన్న రెండు పేర్లూ గలవని మనకు రూఢియగుచున్నది. ఇక అసలు విషయమునకు వద్దాము.                                                                                                                                                                                                                                                        
                                            
                               

మనము గమనించితే ఆకాశము అర్ధ గోళముగానూ భూమిని దాని వ్యాసముగానూ ఊహించుకొనవచ్చును. B తూర్పు దిక్కు అనుకొంటే A పడమర అవుతుంది అని నేను చెప్పనవసరము లేదు. మనకు ప్రతి దినమూ B నుండి సూర్యుడు ఉదయించినట్లు అనిపిస్తుంది. దీనిని సాపేక్షత అనవచ్చు. ఇపుడు సూర్యుదయసమయమున మిధునరాశి ఉన్దినదిఒ అనుకొందాము. అంటే సూర్యోదయమునకు పూర్వము ఉన్న వృషభరాశి పైకి జరిగినది. ఎందువలన అంటే రాశుల వరుసక్రమములో వృషభము ముందు పిదప మిధునము వస్తుంది కాబట్టి. ఆ విధముగా ఒక్కొక్క ర్రషి వద్ద ఉదయించుతూబోతే ఒకర్తోజు ఈ వృషభరాశి వద్ద సూర్యుడు అస్తమించ వలసి వస్తుంది. అప్పుడు మిధున రాశి వృషభ రాశి పైన ఉండుట తటస్థించుతుంది. ఇప్పుడు మొదట చెప్పిన ఉదయమును ఇప్పుడు చెప్పిన అస్తమానమును పరిగణన లోనికి తీసుకొందాము.
పై చిత్రములో ఉదయమున మిధునము క్రింద వృషభము పైన వున్నది. ఊహాజనితముగా మిధునము ఉన్న రథమునకు వృషభము కేతనము లేక ఝండా అనవచ్చు. వృషభము అంటే నంది. శివునికి ‘వృషకేతనుడు’ అన్న పేరుందని పైన తెలుసుకొన్నాము. మరి ఇక్కడ మిధునము కదా వుండేది అన్న సందేహము మీలో కలిగి వుంటుంది. మిథునము అంటే దంపతులు అన్నది మనకు తెలిసిన విషయమే! దంపతులు అంటే ఆదిడంపతులే. ఆది దంపతులన్న పేరు పార్వతీపరమేశ్వరులకు మాత్రమే వుంది. వారిది అర్ధనారీశ్వర తత్వము. ఆవిధముగా మిథునమునకు  వృషభము కేతనమైనది. ఈ 12 రాశులూ జరిగి జరిగి చివరకు A వద్దకు వస్తాయి. అప్పుడు వృషభము క్రింద మిధునము పైన వుంటుంది. కావున మిదునమునకు వృషభము ఇపుడు వాహనమౌతుంది. వేద వేద పురాణ రూపమునగాక ఖగోళ శాస్త్ర ప్రమాణముతో మనము ఇపుడు పరమేశ్వరుడు అర్ధనారీశ్వరునిగా కూడా ‘వృష కేతనుడు’ వృష వాహనుడు’ అయినాడు. పై పెచ్చు శాస్త్రము ఈ విధముగా తెలుపుచున్నది.
‘యస్యయో వాహనః ప్రోక్తః ధ్వజస్తస్య సయేవతు’
దేవతా వాహనమే ఆదేవత రథ కేతనమౌతుంది. కావున ఇంతవరకూ చేసిన వివరణలో సందిగ్ధమునకు తావు లేదు.
ఇక ఆది దంపతులగు పార్వతీపరమేశ్వరులను రఘువంశ కావ్యములో స్థుతిస్తూ కాళీదాసు
 వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ||
వాక్కు అర్థములవలే కలసి ఉన్న , సమస్త జగత్తునకు మాతాపితరులగు పార్వతీ పరమేశ్వరులకు, వాక్కు అర్థముల ప్రతిపత్తి కొరకు నమస్కరిస్తున్నాను. వారి ఆదిదాంపత్యము మనకిక్కడ తెలియవస్తూవున్నది. చెప్పినది శ్యామలా ఉపాసకుడు కాళిదాసు కదా!
భాగవతము రుక్మిణీ కళ్యాణ ఘట్టములో గౌరీ పూజ సమయమున అమ్మవారిని ఈ విధముగా ప్రార్థించుతూ వున్నది.
'నమ్మితి నామనంబున సనాతనులైన యుమామహేశులన్
మిమ్ము ఋరాణదంపతుల మేలు భజింతు'
ఈ మాట వాళ్ళ కూడా పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అని తెలయస్తూవున్నది.
ఇక రెండవ విషయమునకు వద్దాము. అది ‘క్షీరసముద్రము-గంగావతరణము’.
కాశీ ఖండములో శ్రీనాథ కవి సార్వభౌముడు శివుని రాకను గూర్చి, ఆయన కార్తీక శుద్ధ పాడ్యమి నాడు భూమిపై కాశీ క్షేత్రమున అవతరించినట్లు మనకు తెలియవస్తుంది.
మరొక విషయము చెప్పవలసినది వుంది. కార్తీక మాసములో  ఆర్ద్రా నక్షత్రమును సాయం సమయములో మనము చూడవచ్చు. ఆనెలలో మనము నక్తము వుండి నక్షత్రదర్శనము చేసి భోజనము చేయుట కద్దు. మరి నక్షత్ర దర్శనము అంటే ఏ నక్షత్రము?

శ్రుతిగత ప్రభయా ప్రభాయుతం
హరి పదాబ్జ భవా శిరసా ధృతం’
బ్రహ్మాండ భాండ సంపత్తి కుక్షిన గల్గు
పద్మనాభుని పదాబ్జమున బుట్టి
అఖిల లోకాధ్యక్షుడై మించి విహరించు
శివ జటా జూటాగ్ర సీమ నిలిచి
ఈశుడు ‘సర్వలోకాధ్యక్షుడు’ అని మనకు తెలియవస్తూ వుంది. శ్రీ మహావిష్ణు పాదోద్భవ యగు గంగను నిలువరిమ్పగలిగిన వాడు  లోకాధ్యక్షుడైన శివుడే! వేదము కూడా ఇదే మాట చెబుతుంది. ‘ఈశాన స్సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం ....బ్రహ్మా శివోమే’ అన్నది వేదవాక్కు. అంతక్తి ఉధృతి గలిగిన గంగను ఆయనే నిలువరించ గలడు. అందుకే ఆయన ఈశానుడు . ఈశానుడు అంటే Controler అని ఆంగ్లములో అర్థము. సర్వభూతములకు ఆయన ఈశుడు. అందుకే ఆయన దేనినయినా, గంగను కూడా, నియంత్రించగలిగినాడు. ఆ కారణము చేతనే  ఆయన ఈశాన్యమునకు అధిపతి అయినాడేమో!
ఇక పాల కడలిని గూర్చి తెలుసుకొందాము. మనము రాత్రిపూట ఒక మైదానములో నిలబడి ఆకాశము వంక చూస్తే  దక్షిణము నుండి ఉత్తరమునకు చిక్కని పాల వెలుగు వ్యాపించి ఉంటుంది. ఆ వెలుగు నిజమనకు కొన్ని కోట్ల కోట్ల కోట్ల నక్షత్రముల సమూహము. మనవారు దానిని ‘పాలపుంత’ (Milky Way)అనుట కద్దు. ఇది ద్మోదట దట్టముగా ఉంటూ రానురానూ ఉత్తరము వైపునకు వచ్చుసరికి పలుచబడుతుంది. ఈ దట్టముగా వున్నా వెలుగే క్షీర సముద్రము. పలుచగా వున్నా వెలుగును ఆక్కాష గంగ అంటూ వుంటారు. ఈ పలుచటి తెల్లటి జలపాతమును బోలిన వెలుగు ఏటవాలుగా ఈశాన్యమునకు జారుతూ వున్నట్లుంటుంది. ఆ ప్రవాహము ఒక నక్షత్రము పైన పడుచున్న చందమున మనకు గోచరించుతుంది. ఆ నక్షత్రమే ఆర్ద్రా నక్షత్రము. శివునిది ఆర్ద్రా నక్షత్రమే! ఇక్కడ మనము గ్రహించావలసినది ఏమిటంటే శ్రీమహావిష్ణువు పాద కమలముల నుండి బయలుదేరిన గంగ శివుని తలపై జటాజూటములచే బంధింపబడి వున్నది అని మనము అన్వయించుకోవలసి యుంటుంది. అసలు మరొక విషయము ఈ చిక్కటి పలుచని వెలుగుల నడుమ వెలుతురు వున్నట్లు అగుపిస్తుంది గానీ పిండి ఆరబోసినట్లు ఉండదు. సంకేతముగా అక్కడ హంసలు విహరించుతాయని చెప్పబడినది. ఈ హంసల గూర్చి నేను ఇంకా తెలుసుకొనవలసి యున్నది.
ఎంతటి విజ్ఞానము మన ఖగోళ శాస్త్రము కలిగి యున్నదో చూడండి. పురాణములను తెలియనితనముతో  పుక్కిటి పురానములని కొట్టివేయవద్దు.
మన పూర్వులు జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన సంపన్నులు. అణువు మొదలు ఆకాశము వరకు, ఆకాశము మొదలు అనంతము వరకు, ఆ అనంతమునకు అధిపతివరకూ అన్నీ తెలిసినవారు వారు.
ఈ భూమిపై పుట్టుటయే మన పురాకృతము. అందుకు ఆ భగవంతునికి అంజలి ఘటించుదాము.
స్వస్తి.