Sunday, 26 August 2018

సర్వదృగ్వ్యాసః


సర్వదృగ్వ్యాసః
విష్ణు సహస్ర నామ స్తోత్రము మహాభారతం లోని అనుశాసనిక పర్వంలో 149వ అధ్యాయంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠిరునకు ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణము సకల వాంఛితార్థ ఫలదాయకమని నమ్మకము. స్తోత్రము యొక్క ఉత్తర పీఠిక (ఫలశ్రుతి) లో ఈ శ్లోకము "ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును" అని చెప్పబడటయే కాకుండా తరతమ భేదములు లేకుండా చాతుర్వర్ణములవారూ ఆచరింపబడతగినది అని చెప్పబడినది.  క్రీ.పూ. 6వ శతాబ్దమునకు చెందిన అద్వైత స్థాపకులగు జగద్గురువులాది శంకరులు తాము వ్రాసిన అనేకానేక భాష్యములలో మొదటిగా  వ్రాసినది విష్ణుసహస్రనామమునకే!
భారతము ఇతి-హాఁ-సమ్ అంటే జరిగినది, చరిత్ర అని అర్థము. దీనిని జరిగినది జరిగినట్లుగా వివరించినది వేదవ్యాసులవారు. వేదాలను క్రమబద్ధము చేసి లోకమునకు అందించినందుకు ఆయనకు యావత్తు ప్రపంచమే ఋణపడివుంది. అందుకే ఆయనను;
ఆచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః
అఫాలలోచనశ్శంభుః భగవాన్ బాదరాయణః
త్రిమూర్తిస్వరూపమని చెప్పినారు. భారతమున ‘విష్ణుసహస్రనామము’ వంటి కొన్ని విషయములు యధాతధముగా భారతములోని ఆయా  వ్యక్తులు చెప్పినవి తీసుకొనుట జరిగినది అన్న వాస్తవమును నడిచే దేవునిగా పరిగణింపబడుచున్న శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వాములవారు ఒకానోకసారి తమ అనుగ్రహ భాషణములో చెప్పిన ఈ విషయము వల్ల తేటతెల్లమగుచున్నది. నకులుడు ఒక అత్యంత శుద్ధ స్పటికమును తన మెడలో ధరించేవాడట. స్పటికము దానియొక్క శుద్ధతనుబట్టి మాటలను గ్రహించి కోరినపుడు తెలియబరచే గుణము ఉంటుందట. భీష్ముని ఉపదేశ సమయమున అచటనే వున్న నకులునివల్ల ఈ మహత్తర నామావళి  మానవాళికి అందినది అని వారు తెలియజేసినారు.
ఈ ప్రధాన స్తోత్ర భాగంలో 108 శ్లోకాలలో వేయి నామములు పొందుపరచబడి ఉన్నాయి. పరమాత్ముని వివిధ లక్షణ గుణ స్వభావ రూపములు వివిధనామములలో కీర్తించబడ్డాయి. అనంత గుణ సంపన్నుడైన భగవానుని వేయి ముఖ్యగుణములను కీర్తించే పుణ్యశబ్దాలుగా ఈ వేయి నామాలను సాంప్రదాయికులు విశ్వసించుతారు.
క్రీ.పూ. 6వ శతాబ్దములో ఆది శంకరాచార్యులు రచించిన విష్ణుసహస్రనామ భాష్యము అన్నింటికన్నా  ప్రథమము. అద్వైత సిద్ధాంతము ననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మ తత్వమునకు, ప్రాధాన్యతనిచ్చి వ్యాఖ్యానించినారు.
ఈ సహస్రానామావళిలో కొన్ని నామములు పునరావృతమైనట్లుగా ఉంటాయి. ఉదాహరణకు విష్ణుః (మూడు సార్లు) ; శ్రీమాన్, ప్రాణదః (ఒక్కొక్కటి నాలుగు సార్లు) ; కేశవః, పద్మనాభః, వసుః, సత్యః, వాసుదేవః, వీరః, ప్రాణః, వీరహా, అజః, మాధవః (ఒక్కొక్కటి మూడు సార్లు) ; పురుషః, ఈశ్వరః, అచ్యుతః, అనిరుద్ధః, అనిలః, శ్రీనివాసః, యజ్ఞః, మహీధరః, కృష్ణః, అనంతః, అక్షోభ్యః, వసుప్రదః, చక్రీ (ఒక్కొక్కటి రెండేసి సార్లు) - ఇలా చెప్పబడినాయి. మొత్తము 90 నామములు ఒకటికంటె ఎక్కువసార్లు వస్తాయి. కాని వారు ఒకే నామానికి వివిధ సందర్భాలలో వివిధ అర్ధాలను వివరించి, పునరుక్తి దోషం లేదని నిరూపించినారు. తరువాత ఈ విష్ణుసహస్రనామమునకు భాష్యములు వ్రాసిన వారంతా ఇదే పంథాను అనుసరించినారు.
శంకరాచార్యులు "గేయం - గీతా - నామ సహస్రం" అని తమ భజగోవింద శ్లోకములలో చెప్పి, ఈ రెండు పవిత్ర వచనములకు ఎంతో ప్రాముఖ్యతను సంతరింపజేసినారు.
వెయ్యి నామములు గలిగిన ఈ స్తోత్రములో దివిస్పృక్ సర్వదృగ్వ్యాసఃఅన్నది 572వ నామము. ఇది 61వ శ్లోకములో వస్తుంది. 61వ శ్లోకము ఈ విధముగా వుంటుంది.
61. సుధన్వా ఖణ్డపరశుః దారుణో ద్రవిణః ప్రదః|  
     దివస్పృక్సర్వ దృగ్వ్యాసో వాచస్పతి రయోనిజః||
ఈ శ్లోకములో కనిపించే సర్వదృగ్వ్యాసః అన్న పదాన్ని తీసుకొని శంకరులవారు ఏమేమి అర్థములను తెలియజేసినారో తెలుసుకొందాము.
సర్వ దృశాం, సర్వ జ్ఞానానాం విస్తారకత్వాత్ వ్యాసః,  అథవా సర్వాత్ సర్వాచ సాదృక్
చేతి సర్వ ద్రుక్. సర్వాకారం జ్ఞాతం. సర్వస్య ద్రుష్టిత్వాద్వా సర్వదృక్. ఋగ్వేదాది విభాగేన చతుర్థా వేదం వ్యస్తాః కృతః.
ఇంతచేసిన ఆ మహానుభావుడు చేయ పూనుకొన్నప్పుడు ఏడు కోట్ల మంత్రములు లభ్యమయినాయట. ‘అనంతోవై వేదాః’ అన్నది మనకు తెలిసిన విషయము. ఈ అనంతమగు వేదము మనకు అందించని విషయము లేదు. కానీ ఈ అనంత వేదసంపద లో  అధికాధికము   మృగ్యమైనట్లు  మనకు తెలియుచున్నది. అనంతము నుండి ఆయన కాలమునకే 7 కోట్ల మంత్రములు దొరకినాయంటే ఈనాటి పరిస్థితి మనము ఊహించుకోవచ్చు. యుగము మారేకొద్దీ మానవుని గ్రహణ శక్తి తగ్గిపోతూ వచ్చింది. ఎవరయినా తాము నేర్చుకోన్నంత, తమకు తెలిసినంత మాత్రమే కదా చెప్పగలుగుతారు.
భారత యుద్ధము 52౦౦ సంవతసరముల కాలమున జరిగినదని పురాతత్వ శాస్త్రవేత్తలు నిర్ధారించినారు. దానికి ఒక మూడువందల సంవత్సరములకు పూర్వము వేదవిభజన జరిగి ఉండవచ్చు అని ఊహించుకొంటే అప్పటికి మిగిలిన మంత్రములు 7 కోట్లు. మిగతా మంత్రరాశి అంతా పరిపరి విధముల కొన్ని లక్షల సంవత్సరముల కాలములో కనుమరుగై ఉండవచ్చును. ఇక మిగిలినవయినా లోకానికి అందించవలెనన్న తలంపుతో వేదవాక్య లక్షణములను ఆధారముగా చేసుకొని విభజన తలపెట్టినారు వ్యాసులవారు. ఈ వేదమంత్రములలో కొన్నింటిని   ఋక్కులు అంటారు. కొన్నింటిని యజుస్సులు అంటారు. మరికొన్నింటిని సామములు అంటారు.
ఋక్‌ పాదబద్ధా, గీతంతు సామ, గద్యం యజుర్మంత్రః అన్నది శాస్త్రము. ఋగ్వేదము చందోబద్ధమగు శ్లోకరూపములో వుంటుంది. యజుర్వేద మంత్రములకు కూడా ఛందస్సు వున్నా అవి గద్య రూపములో వుంటాయి. ఇక సామవేదము సంగీత భరితము. అధర్వణ వేదము ఋగ్యజుస్సామముల లోని కొన్ని ముఖ్యమగు మంత్రములు కలిగియుంటుంది. అందుకే మనకు పురాణములలో 3 వేదముల ప్రసక్తి విరివిగా వస్తూ వుంటుంది. కొన్ని మంత్రములు అన్ని వేదములలో కూడా వస్తాయి. ఇన్ని విషయముల నెరిగి ఆయన వేదం విభజనకు ఉపక్రమించినారు. 'సర్వదృశానాం సర్వజ్ఞానానాం'  అంటే అర్థమిది.  అందుకే వ్యాసాయ విష్ణురూపాయ అన్నారు. ఆయన విష్ణువే కాబట్టి ఆపని చేయగలిగినాడు. అందువల్ల శ్రీ మహావిష్ణువు సర్వదృగ్వ్యాసః అయినాడు. 
ఇక సర్వాచ సాదృక్ అన్న విషయమును విశ్లేషించుదాము. దృక్ అన్న మాటకు చూపు అని అర్థము. శ్రీమదాంధ్ర మహా భాగవతమున ప్రహ్లాద చరిత్రలో 'కంజాక్షునకు గాని కాయంబు కాయమే' అన్న పద్యములో 'కమలేశు జూడని కన్నులు కన్నులే? తను కుడ్య జాల రంధ్రములు గాక' అన్న పాదము వస్తుంది. పరమాత్ముని చూచేది చూపు కానీ కామ వాంఛతో చూసే చూపు కలిగిన కన్నులు గులకరాళ్ళ ను కలిగిన గూళ్ళుగాక మరేమిటి? అందులోనే ఇంకొకమాట 'కమలాక్షు నర్చించు కరములు కరములు' అన్న పద్యములో 'సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు.' ఇటువంటి ఒకమాట మనకు ‘మనుధర్మ శాత్రములోకూడా వినిపిస్తుంది ‘ వేదఃచక్షుస్సనాతనం’ కళ్ళు అంటే చూపు అంటే  అది వేదము అని. కావున పరమాత్మను వేదము అన్న కళ్ళద్వారా చూడవలెనని అర్థము. అట్లని అందరూ వేదము నేర్చుకొనవలెనని కాదు. అది అంత సులభమూ కాదు. ఒక వేదపండితుడు, ఒక వేదాధ్యయన పరుడు, సామాన్యులమైన మనకు దీపము వంటి వాడు. ఆ వెలుగులో మనము మనకు వలసినది వెదుకుకొన వచ్చును. రఘువంశములోని 4వ అధ్యాయములో కాళీదాసు కూడా ‘చక్షుస్మత్తా’ అని వాడుతాడు. వేదాధ్యనము చేసినది చూపు కానీ అన్యధాకాదు అని. అందుకే వేదము చదువని, తమ నిర్ణీతమైన పనులచే  చదువనవకాశములేని వారంతా ఎంతో ఉత్సాహముగా పురాణ కాలక్షేపమునకు హరికతలకూ సాయంసంధ్యలలో  పోయేవారు. పరమాత్మ వ్యాసుని రూపమున వేదములందలి సమస్త జ్ఞానమునూ చూడగాలిగినాడు. అందుచేత కూడా ఆయన జ్ఞానదృక్ వ్యాసః అయినాడు.
మరియొక విశ్లేషణ చూద్దాము. వ్యాసులవారి కాలమునకు సప్తకోటి మంత్రములు మాత్రమే మిగిలియుండినవని మనము ముందుగానే చెప్పుకొన్నాము. ఆ మంత్రములను నాలుగు వేదములుగా ఆయన విభజించినారు. ఇది ఉజ్జాయింపుగా ఒక 24౦౦,25౦౦ B.C. నాడు జరిగి ఉండవచ్చు. ఒకవేళ 24౦౦ B.C. తీసుకొన్నా అంతవరకూ 7కోట్ల మంత్రములు ఉనట్లే! మహర్షియగు ఆ మహనీయుడు రాబోయే కలికాలపు మనుజుల మేధస్సును అంచనావేసి ఈ మంత్రములను విభజించియుంటాడు. వారు తమ శిష్యులగు పైలునకు ఋగ్వేదమును, వైశంపాయనునికి యజుర్వేదమును, జైమినికి సామవేదమును, సుమంతునకు అధర్వణ వేదమును పంచియిచ్చి వానిని లోకమున గురు శిష్య పరంపరగా విస్తృతపరచమన్నారు. ఈ విషయమును భాగవతములోని ద్వాదశ స్కంధములో మనము గ్రహించ వచ్చును. కలియుగము ప్రారంభమయిన ఇంచుమించుగా ఒక,  5౦ సంవత్సరములకే ప్రజల జ్ఞాపకశక్తి క్షీణించిపోయినదట. ఆవిధముగా తరిగిపోయిన ఆ వేదశాఖలలోని రుగ్వేదమును 21 శాఖలుగానూ, యజుర్వేదమును 1౦1  (85+16) శాఖలుగానూ, సామవేదమును 1౦౦౦ శాఖలుగానూ  అధర్వణ వేదమును 9 శాఖలుగానూ విభాజించినారట.అంటే మోత్హము 7 కోట్లకు గానూ మిగిలిన మంత్రములు 11౩1. ఈ విధమగు విభజనను గూర్చి మనకు చెప్పిన మహనీయులు జగద్గురు ఆదిశంకరులవారు. దీనికి ముందు ఈ విషయమును పతంజలి మహర్షి తన సంస్కృత వ్యాకరణ మహాభాష్యములో చెప్పినట్లు కానవచ్చుచున్నది. కానీ పతంజలి మహర్షి కాల నిర్ధారణము  ఇంతవరకూ జరుగలేదు. అత్యంత బాధా కరమగు విషయమేమిటంటే స్వాతంత్ర్యమునకు మునుపు విదేశీ పాలనలో ఈ 1131శాఖలు ఇంకా సన్నగిల్లి, ఇప్పుడు కేవలము 7 అధ్యయనము జరుగుతూ వున్నదని, 6 (స్వరరహిత గ్రంథస్థశాఖలు) వారి అవిరళ కృషివల్ల లభ్యమయినాయని, ఈ విషయమై ఎక్కడలేని శ్రమకోర్చి కూర్చిన   మాన్యులు రేమేళ్ల అవధానులవారు బాధాతప్త హృదయముతో వారిని నేను కలిసినపుడు వారు చెప్పినమాట.  మరి మిగతవి ఏ విధముగా మాయమైనాయి అంటే ఎన్నో గురుశిష్య పరంపరలను నిర్దాక్షిణ్యముగా చంపివేయుట చేత? 1131 కి 7  అనుకొంటే 1% కూడాకాదు లేక 13 అనుకొన్నా అతి కష్టము మీద 1%.  ఆ మిగిలిన  వానిలో  2 పరిష్కరింపబడలేదు ఆ కార్యము కొరకై నియుక్తులయిన మహా వేదపండితుల చేత. వీటిని పరిరక్షించుకొనుటకు ఇంచుమించు 25 సంవత్సరముల క్రితము వేద భారతి సంస్థను నెలకొల్పి, 1992-97 మధ్యకాలమున రాష్ట్రపతిగా పనిజేసిన దయాళువగు శంకర్ దయాళ్ శర్మ గారు వేదములపై ఉన్న గౌరవముచే, శ్రీయుతులు అవధానుల వారి నిర్విరామ కృషిని గుర్తించి, నాటి రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ బైరాన్ సింగ్ షెకావత్  గారి సహాయ సహకారములతో ముద్రింపజేయించినారు. ఇతర ఏ రాష్ట్రమునుండి వారికి స్పందన లభించలేదు. అది గ్రంధ రూపములో 2010 కి వెలుగు చూడగలిగింది. ఆ గ్రంధరాజము 2 అడుగుల పొడవు 11/2 అడుగు వెడల్పు 6 అంగుళముల మందము, 4౦౦౦ పుటలు, 20 KG ల బరువు వుంది.
తిరిగీ విషయములోనికి వస్తే వ్యాసులవారు ఈ అనంత వేదరాశిలోని మిగిలిన మంత్రములను 4 వేదములుగా విభజించిన తరువాత ఋగ్వేదము  21 భాగములుగా విభజింపబడినది. యజుర్వేదము 101 శాఖలుగా విభజింపబడినది. సామవేదము 1౦౦౦ శాఖలుగా విభజింపబడినది , అధర్వణవేదము 9 శాఖలుగా విభజింపబడినది. ఇవికాక పురాణ ఉప పురాణ ఇతిహాసములను రచించినాడు. అందుకే ఆయన పరబ్రహ్మ కాక వేరెవరని ముందే చెప్పుకొన్నాము. యజుర్వేదములోని తైత్తిరీయశాఖలోని 82 పన్నములలో  ఒక పన్నము అరుణము. ఈ విశ్వమును గూర్చి అందులో, నేటి Scientists ఇప్పటికి కనుగొన్నవి , ఇంకా కనుగోనవలసినవీ, ఎన్నియో విషయములు వున్నవి. అణువు మొదలు అజుని(పరబ్రహ్మ) వరకు అన్నీ వున్నవి. అంతటి మహానీయుడు వేదవ్యాసుడు. అట్టి ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి అవతారము కావుననే, విష్ణుసహస్ర నామావళిలో ‘విశ్వదృగ్వ్యాసః’ అన్న నామము చేరినది.
శ్రీ వేదవ్యాస స్తుతి
కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం
వేదాబ్జ భాస్కరం వందే శమాదినిలయం మునిం
వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం
శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం
అచతుర్వదనో బ్రహ్మో ద్విబాహురపరో హరిః
అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః
శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం
సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః
వేదాంత వాక్య కుసుమాని సమాని చారు
జగ్రంథ సూత్రనిచయేన మనోహరేణ
మోక్షార్థిలోకహితకామనయా మునిర్యః
తం బాదరాయణమహం ప్రణమామి భక్త్యా
స్వస్తి.

No comments:

Post a Comment