Friday, 14 December 2018

బసవా!బసవా! వృషాధిపా!


బసవా!బసవా! వృషాధిపా!
తొలి శతకకర్తగా పేరుగాంచిన శివకవి పాల్కురికి సోమనాథ కవీంద్రుని వృషాధిపశతకంలోని ఈ పద్యరత్నమును గమనించండి. ఇందు మకుటమైన వృషాధిపా! అన్న పదము తప్ప పద్యమంతా జాను తెనుగులో నడచినది.పద్యము తెనుగుదయినా దురదృష్టకరమగు విషయమేమిటంటే అందు ఒక పదమునకు కూడా అర్థము మనకు తెలియదు. ఏమీ తెలుసుకోకుండా చదువుతూ ఉన్నాకూడా మనసులో ఎదో ఒక ఆనందము. ఆ గొప్పదనము భాస్ధడైనా ఉండాలి లేక భక్తిదయినా వుండాలి. ప్రస్తుతానికి ఆ రెండూ వున్నా సోమనకు మనకు తెలిసిన రీతి మనసా నమస్సులను సమర్పించి ముందునకు సాగుదాము.
శివకవులు నాటి శుద్ధ తెనుగును వ్యవహారములో ఉపయోగించుతూ దానినే గ్రంథరచనకు తగినదిగా ఎన్నుకొని పెద్ద పీత వేసినారు.
బలుపొడతోలు సీరయును బాపసరుల్ గిరుపారుకన్ను, వె
న్నెలతల, చేదుకుత్తుకయు,బన్నిన వేలుపుటేఱు, వల్గుపూ
సలుగల ఱేని లెంకనని జానుతెనుంగున విన్నవించెదన్
వలపు మదిందలిర్ప బసవా!బసవా! వృషాధిపా!
ప్రతి పదార్ధములు ఈ దిగువన గమనించగలరు:
బలుపొడతోలుసీర = అనేక మచ్చలుగల చర్మాంబరము.
పాపసరులు = సర్పభూషణములు
కిరుపాఱు = మండుచున్న
కన్ను= కన్నులు
వెన్నెలతల =తలపై గల చంద్రవంక
చేదు కుత్తుక = విషపూరిత కంఠము
బన్నిన – చిక్కగా కట్టిన
వేల్పుటేఱు = గంగ
నల్గుపూసలు-పుర్రెలనుపూసలపేరు (గల్గిన)
ఱేని-రాజుయొక్క
లెంకనని-సేవకుడనని
జాను తెనుంగున = జాను తెనుగులో
వలపు మది దలర్ప = ప్రేమ అనగా భక్తి తో కూడిన మనస్సుతో
విన్నవించెదన్ = తెలుపుకొనెదను
బసవా! బసవా! = బసవేశ్వరా బసవేశ్వరాఅని ఆర్తితోకూడిన స్వరముతో పిలుస్తున్నాడు.
ఈ పద్యమున  వృషాధిపా! అన్న ఒక్క మాట తప్ప  తక్కినవి దేశ్యములే!
పులితోలు ధరించినవాడు పాములను ఆభరణములుగా కలిగినవాడు, నిప్పుకంటిని గలిగినవాడు,చందమామను తలదాల్చినవాడు, విషమును గోతున కలిగినవాడు, పుర్రెల మాలను మెడకు వేసుకొన్నవాడు, నగు నాపమేశ్వరుని బంటునై మరులుగొన్న మనసుతో విన్నవించెదను అని భావము.
స్వస్తి.

Thursday, 13 December 2018

శృతి గీతలు


శృతి గీతలు
 పరీక్షిన్మహారాజు శుక మహర్షి తో "స్వామీ! వేదములు పరమాత్మను యే విధంగా ప్రతిపాదించుచున్నాయి ?" అని ప్రశ్నించగా, శుకుడు శృతులలో ప్రతిపాదింపబడిన భగవత్ తత్వాన్ని వివరించినవి శృతి గీతలుగా పిలువబడుతున్నాయి.  భగవంతుని నిశ్శ్వాసము చేత పుట్టిన వేదములు, ప్రళయ కాలమునందు యోగనిద్రను పొందిన ఆ పరమాత్మను, ఏవిధంగా ప్రస్తుతించుచున్నాయని నారదుడు నారాయణుని అడుగగా, ఆయన, పూర్వము సనక సనందనాదుల చర్చలో సనందుడు చెప్పిన తత్వమును నారదునకు చెప్పినాడు. దానినే  ఇప్పుడు శుకుడు పరీక్షిత్తునకు చెప్పుట తటస్తించినది. 
1. జయ జయ హరి! దేవ! సకల జంతువులకు ఙ్ఞానప్రదుండవు గాన వారి
వలన దోషంబులు గలిగిన సుగుణ సంతానంబుగా గొని ఙ్ఞాన శక్తి
ముఖ్య షడ్గుణ పరిపూర్ణ జేసి మా యాత్మ విశిష్టుండవగుచు గార్య
కారణాత్మకుడవై కడగి చరించుచు నున్న నీయందు బయోరుహాక్షా!
తివిరి యామ్నాయములుప్రవర్తించు గాన
ప్రకట త్రిగుణాత్మకంబైన ప్రకృతి తోడి
యోగ మింతయు మంపవే! యోగిమాన
సాంబు జాత మధువ్రత! యని నుతించి
 భావం:ఓ విష్ణు దేవా! నీకు జయమగు గాక! తామరల వంటి కన్నులు కలవాడవును, యోగీశ్వరుల మనసులనెడు కమలములందు తుమ్మెదల వలె ఆసక్తితో వసించుచున్నట్టి వాడవును, ప్రళయ కాలమున సకల లోకములను నీలో లయింప చేసుకొను వాడవును అయిన ఓ స్వామీ! నీవు సర్వోత్కృష్టుడవు.సకల జీవులకూ ఙ్ఞానాన్ని ప్రసాదించేవాడవు కాబట్టి నీవే ఆ ప్రాణముల వలన కలిగిన దుర్గుణములను కూడా సుగుణములుగానే ఎంచి రక్షించునట్టి వాడవు; సర్వఙ్ఞత్వము, సర్వేశ్వరత్వము, సర్వ నియంతృత్వము, సర్వ స్రష్టత్వము, సర్వాంతర్యామిత్వము, సర్వ భోక్తృత్వము అనెడు ఆరు గుణముల చేతను నిండుకొన్న వాడవై; మాయా సంబంధమగు జీవాత్మలను మీరినవాడవై ఆయా ప్రాణుల్లో ఆత్మ రూపంతో నీవు ఉంటావు. ప్రపంచ స్వరూపుడవు నీవే, ప్రపంచ సృష్టికి కారణములైన అవ్యక్త మహదహంకార పంచ తన్మాత్ర, పంచభూత స్వరూపుడవు నీవే. రజస్తమో గుణాలతో కూడిన కార్య కారణాత్మకుడవై నీవు వర్తిస్తావు. అటువంటి నీలోనే సకల వేదాలూ ప్రవర్తిస్తాయి. నీ స్వరూపమైన మాకు సత్వ రజస్తమో గుణాలతో కూడిన మూల ప్రకృతితో ఉన్న సంబంధాన్ని సంపూర్తిగా ఛేధించు తండ్రీ!          
2.  పరమ విఙ్ఞాన సంపన్నులైనట్టి యోగీంద్రులు మహిత నిస్తంద్ర లీల
బరిదృశ్యమానమై భాసిల్లు ని మ్మహీ పర్వత ముఖర ప్రపంచమెల్ల
బరగ బ్రహ్మ స్వరూపము గాగ దెలియుదు రెలమి నీవును జగద్విలయ వేళ
నవశిష్టుడవు గాన ననఘ!నీయందు నీవిపుల విశ్వోదయ విలయములగు
ఘట శరా వాదులగు మృద్వికారములు మృ
దాత్మకంబైన యట్లు పద్మాయతాక్ష!
తవిలి కారణ రూపంబు దాల్చి లీల 
గడగు నీయందు బుద్ధి వాక్కర్మములను 
భావం: ఓ స్వామీ!  ఙ్ఞానుులు  బ్రహ్మవేత్తలు పరమ యోగీశ్వరులు,  స్థావర జంగమాత్మకమైన భూమి, పర్వతాలు మొదలైన వాటితో కూడి ఉన్న ఈ ప్రపంచాన్ని బ్రహ్మ స్వరూపముగా భావించుతారు.  ప్రళయ కాలమందు నీవు మాత్రమే మిగిలి ఉంటావు.  ఈ విశ్వము యొక్క సృష్టిస్థితిలయములకు నీవే కారణభూతుడవు. బ్రహ్మ స్వరూపియైన నిన్ను మనసా వాచా కర్మణః సేవచేయ  అనుగ్రహింపుము. 
 3.   అలవడ జేయుచు నుందురు బలువై ఇల బెట్టబడిన పదవిన్యాసం
బులు పతన కారణముగా, నలవున సేవించుచును గృతార్థులు నగుచున్.
భావం:  విఙ్ఞాన సంపన్నులైన వారు జన్మమెత్తుటను పతన కారణముగా  గ్రహించి త్రికరణ శుద్ధితో సకల దేవతా స్వరూపుడవైన నిన్నే సేవిస్తూ కృతార్థులవుతారు. 
 4.  లీలం ప్రాకృత పూరుష
కాలాదిక నిఖిలమగు జగంబుల కెల్లన్
మాలిన్య నివారకమగు
నీ లలిత కథా సుధాబ్ధినింగ్రుంకి తగన్
భావం: ఓ సర్వాత్మకా!కాలస్వరూపమైన ఈ ప్రపంచంలో నీ మనోహర కథామృత వారిధిలో వేసిన ఒక్క మునక సకల పాపములనూ  హరించివేస్తుంది.   
5. భరిత నిదాఘ తప్తుడగు పాంథుడు శీతల వారి గ్రుంకి దు
ష్కరమగు తాపమొందొరగు కైవడి సంసరణోగ్రతాపమున్
వెరవున బాయుచుండుదురు నిన్ను భజించు మహాత్మకుల్ జరా
మరణ మనోగుణంబుల క్రమంబున బాయుట సెప్ప నేటికిన్?
భావం: లోకమునందు బుద్ధిమంతులగు వారు తీవ్రమైన ఎండచేత బాధపడే బాటసారి చన్నీళ్ళ స్నానం చేసి తన పరితాపాన్ని పోగొట్టుకునే విధంగా, నిన్ను పూజించే మహాత్ములు సంసారమనే అధికమైన భయమును కలుగచేయునట్టి దుర్భర తాపాన్ని నిన్ను ఉపాసించటం అనే జలమును మునుగుట అనెడి ఉపాయము చేత నేర్పుతో తొలగించుకుంటారు. అట్లుండగా ఎల్లప్పుడు నిన్ను సేవించునట్టి పుణ్యాత్ములు ఇక ముసలితనము, మరణము అనే వాటిని క్రమంగా పోగొట్టుకొంటారన్న మాట ప్రత్యేకంగా చెప్పటం దేనికి?
 6. అనయంబు దేహి నిత్యానిత్య సద్విలక్షణమున పంచకోశ వ్యవస్థ
నభివృద్ధి బొరయుచు నందులోపల నున్న ప్రాణాన్న బుద్ధి విఙ్ఞాన మయము
లను చతుష్కోశంబు లవ్వల వెలుగొందు నానందమయు డీవు గాన దేవ!
సురుచిర స్వప్రకాశుండవు నీ పరిగ్రహము కల్గుటం జేసి కాదె ప్రకృతి
మహదహంకార పంచతన్మాత్ర గగన
పవన తేజోంబు భూ భూత పంచకాది
కలిత తత్వముల్ బ్రహ్మాండ కార్య కరణ
మందు నెపుడు సమర్థంబు లగుట జూడ. 
భావం: దుర్లభమైన మనుష్య దేహమును ధరించిన ప్రాణులు శాశ్వతము, అశాశ్వతము అనే ఈ రెండు లక్షణాల కంటే విలక్షణమైన పరబ్రహ్మ స్వరూపము చేతను; అన్న, ప్రాణ, మనో, ఙ్ఞాన, ఆనంద మయాలనే పంచకోశాల వల్ల వ్యష్టి, సమిష్టి దేహమును ధరించియును అబివృద్ధి పొందుతూ ఉంటాయి. ఈ పంచకోశాలలో చివరిదైన ఆనందమయ కోశమే స్వరూపంగా వెలుగునట్టి శుద్ధ స్వరూపము చేత నీవు స్వయం ప్రకాశుడవై వెలుగొందుతుంటావు. నీ అధీనంలో ఉన్నందువల్లనే కదా ఈ ప్రకృతీ, మహత్తు, అహంకారము; పంచతన్మాత్రలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు; పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మొదలైన పంచ మహా భూతాలు అను వానికి చేతనత్వము కలుగచేసి, వాని చేత బ్రహ్మాండమును పుట్టించి, అందు ప్రవేశించి వెలుగుతూ, ఈ సమస్త సృష్టి స్థితి లయ కార్యాలను సర్వ సమర్థంగా నిర్వహిస్తున్నావు.   
7.  కోరి శరీరులు భవదను
సారంబున నిహపరైక సౌఖ్యంబుల బెం
పారగ నందుచు నుందురు
ధీరజనోత్తములనంగ దివిజారి హరా!
భావం: ఓ దైత్యహారీ! హరీ! నిన్ను అనన్య భక్తితో శ్రవణ మనన నిధి ధ్యాసలచేత భజిస్తూ బ్రహ్మ వేత్తలు శ్రేష్ఠులై ఇహ పరలోక సౌఖ్యములను కొరత లేక పొంది ధీరజనోత్తములుగా పేరెన్నిక గంటారు.  
 8. నిన్ను ననుసరింప నేరని కుజనులు
పవన పూర్ణ చర్మ భస్త్రి సమితి
యోజ జేయుచుందు రుచ్ఛ్వసనంబులు
బలసి యాత్మ దేహ భజను లగుచు
భావం: మూర్ఖులు ఈ దేహాన్నే ఆత్మ అనే భావంతో భజిస్తూ ఉంటారు.  9. దేవ! కొందరు సూక్ష్మ దృక్కులైనట్టి మహాత్మకు లుదరస్థుడైన వహ్ని
గా మది దలతురు కైకొని మరికొంద రారుణులను పేర నమరు ఋషులు
లీల సుషుమ్న నాడీ మార్గ గతుడవై హృత్ప్రదేశమున జరించుచున్న
రుచి దహరాకాశ రూపిగా భావింతు రట్టి హృత్పద్మంబునందు వెడలి
వితత మూర్ధన్య నాడికా గతుల నోలి
బ్రహ్మ రంధ్రంబు ప్రాపించి పరమ పురుష!
సుమహితానందమయ పరంజ్యోతి రూపి
వైన నిను బొంది మరి పుట్ట రవని యందు
భావం:  ఓ భగవంతుడా! వేదాంత శాస్త్రములందు చెప్పబడిన సంప్రదాయములైన ఉపాసనా మార్గములను అనుభవ జన్య ఙ్ఞానముల చేత ఎరిగిన సూక్ష్మ దర్శనులైన మహితాత్ములు నిన్ను నాభి స్థానమందలి మణిపూరక చక్రమున ఉండునట్టి జఠరాగ్ని స్వరూపునిగా భావిస్తారు. మరికొందరు అరుణులనబడే ఋషీశ్వరులు వినోదంగా సుషుమ్నా నాడీ మార్గంలో సంచరిస్తూ హృదయ ప్రదేశంలో గల అనాహత చక్రంలో పరమాకాశంలో సంచరించే సూక్ష్మాకార రూపంకలవాణ్ణిగా నిన్ను గ్రహిస్తారు. మరికొందరు బ్రహ్మ నిష్ఠులు ఆ విధమైన హృదయ పద్మం నుంచి వెలువడి ముక్కు రంధ్రముల యందలి మూర్ధన్య నాడి, అనగా ఇడా పింగళ మార్గము ద్వారా బ్రహ్మ రంధ్రం చేరుకుని సహస్రారమును పొంది ఆనందమయ పరంజ్యోతి స్వరూపుడవై వెలుగు నిన్ను చేరి నీయందు ఐక్యమై మునులు ముక్తులౌతారు. మళ్ళీ వారికి జన్మమంటూ ఉండదు. 
10.  అనఘ!దుర్గమమైన ఆత్మ తత్వంబు ప్రవర్తించు కొరకు దివ్యంబులైన
యంచిత రామకృష్ణాద్యవతారముల్ భజియించియున్న నీ భవ్య చరిత
మను సుధాంభోనిధి నవగాహనము సేసి విశ్రాంత చిత్తులై వెలయుచుండి
మోక్షంబు బుద్ధినపేక్షింప నొల్లరు మరియు గొందరు భవచ్చరణ పంక
జముల దగిలి పుణ్యతములైన హంసల
వడువు నొంది భాగవత జనముల
నొనరు వారు ప్రకట యోగిజన ప్రాప్య
మైన ముక్తిగోర రాత్మలందు.
భావం: పాపరహితుడవైన పరమాత్మా! పొందశక్యము కానిదైన ఆత్మ తత్వమును ప్రవర్తిల్ల చేయుట కొరకు ప్రకృతి సంబంధములు కాని రామావతారము, కృష్ణావతారము మొదలగు అవతారములెత్తి వర్తించునట్టి నీ చరిత్రము పాల సముద్రము వలె స్వచ్ఛమును, అపారమును అయి ఉండగా అట్టి చరిత్రముల స్మరణ, మనన, పఠనాక్రియలయందు,  మునిగి తేలుచు నెమ్మది పొందిన మనసు గలవారు అగుచూ కొందరు మోక్షమును అపేక్షించక మెలగుచుందురు. మరికొందరు నీ పాద పద్మములను ఆరాధించుట యందు ఆసక్తి గలవారై మిక్కిలి పుణ్యాత్ములైన పరమహంసల వలె భగవంతుడవైన నిన్ను సేవించుచూ శుద్ధులగుదురు. అట్టి వారు ప్రసిద్ధములైన యోగముల వలన సిద్ధినొందిన యోగులకు పొంద తగినదైన మోక్షమును మనసులలో మాటవరుసకైననూ  తలంపరు.   

11. కొందరు నీ శరీరము లకుంఠిత భక్తి భవద్వశంబులై
చెందగ నీ పదాబ్జములు సేరి భజించుచు దత్సుఖాత్ములై
యుందురు కొందరీ తనువు లోలి ధరించి భవత్పదాబ్జముల్
పొందుగ గొల్వలేక నిల బుట్టుచు జచ్చుచు నుందు రవ్యయా! 
భావం: అవ్యయా!స్వామీ! కొందరు పొందరానిదైన మానవ దేహమును పొందిన మాత్రముననే ఆ దేహమును నీకు అధీనము చేసి సమస్త ప్రాణులకు అధీశ్వరుడవు నీవేయని తెలుసుకొని మిక్కుటమైన భక్తితో నీ చరణారవిందములను సదా సేవిస్తూ పరమానందము అనుభవిస్తూ ఉంటారు. మరికొందరు నీ పాద పద్మాలను భజింపలేక ఈ లోకంలో జీవన్మరణ వలయమున దగుల్కొని కొట్టుమిట్టాడుతూ వుంటారు. 


 12.     యమ నియమాది యోగ మహితాత్మకులైన మునీంద్రులున్ విరో
ధమున దలంచు చైద్య వసుధావర ముఖ్య నృపుల్ ఫణీంద్ర భో
గము లన నొప్పు బాహువులు కల్గిన నిన్ను భజించు గోపికల్
క్రమమును నేమునున్ సరియ కామె భవత్కృప కంబుజోదరా!
భావం: యమ నియమములు మొదలైన యోగములు అభ్యసించి వాని వలన సిద్ధి పొందిన మునీశ్వరులును, శత్రు భావంతో నిన్ను తలపోసే శిశుపాలుడూ మొదలైన దుష్ట రాజన్యులూ, ఆలింగనాదుల చేత నిన్ను భక్తితో ఆరాధించే గోపికా స్త్రీలూ, ఎల్లప్పుడూ స్తుతి చేయునట్టి మేమూ నీ కృపకు సమానంగా పాత్రులమగుటలో సందేహము లేదు. అనగా నీకు శతృవులు, మిత్రులు, సేవకులు అనువారు అందరునూ సమానమే!
13.     అరవిందాక్ష! భవత్స్వరూపమిల బ్రత్యక్షంబునం గాన నె
వ్వరికిం బోలదు శాస్త్రగోచరుండవై వర్తింతు వీ సృష్టి ముం
దర సద్రూపుండ వైన నీ వలననే ధాత్య్రాద్య మర్తుల్ జనిం
చిరి ని న్నంతకు మున్నెరుంగ గలమే చింతింపనే మచ్యుతా!   
భావం: ఓ స్వామీ! నీ అసలైన స్వరూపమునుఉపనిషత్తుల వల్ల తెలుసుకోన వలసినదేకానీ ప్రత్యక్షంగా చూడట మా తరమా!  ఈ ప్రపంచ సృష్టికి పూర్వం నీవు ఎప్పుడును చెడని దివ్య స్వరూపము కలవాడవై వెలుగొందుతున్న పరమాత్మ స్వరూపుడవై ఉండి నీ వల్లనే బ్రహ్మాది దేవతలు ప్రభవింపజేసితివి. నీవు ఏ రూపంలో ఉంటివో తెలుసుకొనుటకు మేము ఏపాటి? నీ సచ్చిదానంద స్వరూపమును మేము గుర్తించగలమా?    
 14.     వనజాతాక్ష! భవత్పదాబ్జ యుగ సేవాసక్తులైనట్టి య
జ్జనముల్ మృత్యు శిరంబు దన్ని ఘన సంసారాంబుధిన్ దాటి పా
వనులై లోకములుం బవిత్రములుగా వర్తించుచున్ నిత్య శో
భనమై యొప్పెడి ముక్తి బొందుదురు శుంభద్వైభవోపేతులై
భావం: దేవా! నీ పాద కమలములను మిక్కిలి ఆసక్తితో కొలుచుట యందు నిరంతర నిమగ్నులైన వారు మృత్యువును జయించి, సంసారమహోదధిని అలవోకగా దాటి,  జనన మరణ పరంపరలకు గురి కాక పవిత్రులై, లోకాలను పవిత్రం చేస్తూ ముక్తికి యోగ్యులై ప్రకాశించెదరు. 
15.     మిము సద్భక్తి భజింప నొల్ల కిల దుర్మేధం ప్రవర్తించు నీ
చ మతివ్రాతము నేర్పునం బసుల బాశ శ్రేణి బంధించు చం
దమునం బెక్కగు నామ రూపముల చేతన్ వారి బంధించి దు
ర్గమ సంసార పయోధి ద్రోతువు దళత్కంజాత పత్రేక్షణా!
భావం:  దళత్కంజాత పత్రేక్షణా!  శ్రీ కృష్ణా! ఎవరు నిను భక్తితో సేవించకుండా దుర్మదాంధులై భూమి యందు చరింతురో అట్టి నీచ బుద్ధి గల పామరులను పశువులను  మోకుతో కట్టు విధముగా నానా రీతుల బంధించి సంసారము అనెడి సముద్రము నందు పడదోస్తావు.
 16.     మది దలపోయగ జల బు
ద్బుదములు ధర బుట్టి పొలియు పోలిక గల ఈ
త్రిదశాది దేహములలో
వదలక వర్తించు నాత్మ వర్గము నోలిన్.
భావం: ఆలోచించగా  బుద్బుదప్రాయమైన ఈ శరీరాల్లో అంతరాత్మవై నీవు వర్తిస్తావు. 
 17. ప్రళయ వేళ నీవు భరియింతు వంతకు
గారణంబ వగుట కమలనాభ!
భక్త పారిజాత! భవ భూరి తిమిర ది
నేశ! దుష్ట దైత్య నాశ! కృష్ణ!
భావం: ఓ కమలనాభా! భక్త పారిజాతా! కారుచీకటిని పారద్రోలు దినకరుడా! దుష్ట దైత్య వినాశకా! శ్రీకృష్ణా! ప్రళయ సమయమున సమస్త విశ్వమునూ నీవే భరింతువు.
18. అనఘ! జితేంద్రియ స్ఫురణులయ్యును జంచలమైన మానసం
బను తురగంబు బోధ మహితాత్మ వివేకపు నూలి త్రాట న
ల్లన గుదియంగ బట్టను దలంచుచు ముక్తి కుపాయ లాభ మే
యనువును లేమికిన్ వగల నందెడు నాత్మలువో తలంపగన్.
భావం: అనఘా! జితేంద్రియులు కాగాలియు, చపల స్వభావము గల మనస్సు అనెడి గుర్రమును, బ్రహ్మ ఙ్ఞానము అనెడు నూలు తాడు చేత మెల్లగా బిగబట్టుటకు యత్నించుచు సఫలత నొందలేక మోక్ష మార్గము  కనబడక నీ పాదారవింద భజన లేని జీవులు విచారము పొందుచున్నారు.  

 19.     గురు పద పంకజాతములు గొల్వని వారలువో మహాబ్ధి ని
స్తరణకు గర్ణ ధార రహితంబగు నావము సంగ్రహించు బే
హరి గతి భూరి దుస్తర భవాంబుధిలోన మునుంగుచుందురు రం
బురుహదళాక్ష! నీవు పరిపూర్ణుడవై తనరారంగా నొగిన్.
భావం: ఓ తామరసాక్షా! గురు పాద పద్మములను సేవించని పామరులు పెద్ద సముద్రము దాటుటకు ఓడ వాడు లేని ఓడ యందు కూర్చుండి, బేరమాడబోవు వర్తకుని వలె జనన మరణ పరంపరలనబడు అపార్తావార సంసార సంద్రమున మునిగి పోతున్నారు. విశ్వా వ్యాప్తమైన నీ వెలుగును గాంచలేక నిన్ను చేరలేకున్నారు.
 20.  పుత్ర దార గృహ క్షేత్ర భూరి విషయ
ఘన సుఖాసక్తుడగుచు నే మనుజుడేని
నర్థి జరియించు వాడు భవాబ్ధి లోన
జెంది యెన్నాళ్ళకును దరి జేర లేడు.
భావం:    యే మనుష్యుడు నిరంతర సంసార లంపటముల యందు ఆసక్తి కలవాడై, విశేషమైన విషయ సుఖములు పొందగోరునో అటువంటి మానవుడు ఈ సంసార సాగరము ను ఎన్నటికీ దాటలేడు.
21.జగతిపై బహు తీర్థ సదనంబు లనగల్గి పుణ్యాను వర్తన స్ఫురితులగుచు
బాటించి నీ యందు బద్ధ మత్సరములు లేక భక్తామరానోకహంబ
వగు భవత్పాదాబ్జ యుగళంబు సేవించి భవ పాశముల నెల్ల బారదోలి
సమ మతులై యదృచ్ఛాలాభ తుష మేరు సమముగా గైకొని సాధులగుచు
బాద తీర్థంబు గల మహా భాగవత జ
నోత్తమోత్తము లైనట్టి యోగి వరుల
వారకెప్పుడు సేవించు వాడు వొందు
బ్రవిమలానందమయ మోక్షపదము. 
భావం:    ఈ భూలోకమునందు పుణ్య నదులను, పుణ్య క్షేత్రములను సేవించుచూ,తమ పూర్వ పుణ్య విశేషము వలన  వివేకులు నీయందు విరోధ బుద్ధి లేక, భక్తుల పాలిట కల్పవృక్షమైన నీ పాద కమలములను కొల్చి, జన్మ బంధములను తొలగించుకుని, శతృవులు, మిత్రులు అను బేధ బుద్ధి లేక ఎల్లరి యెడల సమముగా వర్తించుచు తనంతట దొరికిన అల్ప వస్తువునైనను మేరు పర్వతముతో సమానముగా నెంచుచు సాధువులై, పరిశుద్ధులైన భగవద్భక్తుల పాద తీర్థములను కోరి అట్టి యోగీశ్వరులను సేవించి వర్తించును. అట్టి పుణ్యాత్ముడు నిర్మలమైన ఆనందమును కలుగ చేయునట్టి మోక్ష స్థానమును పొందును.