Tuesday, 24 December 2019

మాట - వరహాల మూట


మాట - వరహాల మూట


కొందరికి మాటలాడుట ఒక కళ, మరికొందరికి మాటలాడుట కేవలము కల. మాట నిజముగా వరహాల మూట. అభ్యసించితే ఆనందమే! అవమానము దరిజేరదు.
మాట వలన జరుగు మహిలోన కార్యముల్
మాట వలన పెరుగు మైత్రి ,కనగ
మాట నేర్వకున్న మనుగడ లేదిది
రామమోహనుక్తి రమ్య సూక్తి
నా ఉద్దేశ్యంలో మాటకు ఇంత  ప్రాధాన్యత వుంది. మాటే జంత్రము(సంగీత వాద్యము)మాటే మంత్రము ,మాటే యంత్రము ,మాటే తంత్రము.
గాలికి కదిలే మీ కురులు వేయి వీణియల తంత్రులై  నా హృదయములో అనురాగామనే రాగాన్ని మీటుతున్నాయి అంటే అప్పుడు మాట జంత్రమేకదా. (జంత్రమంటే సంగీత పరికరమని ఒక అర్థము)
సరియైన సమయములో సరియైన సలహాచేప్పి సమస్యను సర్దుబాటు చేయగలిగిన నిజమైన స్నేహితుని మాట మంత్రము కాదా!
సమయానికి సాయపడే యజమాని మాట మనలను యంత్రము లాగా పనిచేయనివ్వదా!
తంత్రము అంటే ఆలోచన. నేటి ‘టెంగ్లీషు’ లో చెప్పవలసి వస్తే ‘Sketch వేయుట’ అంటారు. యుద్ధమున భీష్ముని కూలగొట్టుటకు కృష్ణుడు చేసినది ‘తంత్రమే’ కదా!
అన్నీ మాటలే. కొన్ని తేనె ఊటలు కొన్ని బంగారు గొలుసు పేటలు,  కొన్ని మంచికి బాటలు, కొన్నిహాయిని కలిగించే పాటలు,  కొన్ని అందాలీనే తోటలు, కొన్ని రక్షించే కోటలు,  కొన్ని అతి మెత్తని దూటలు (దూటను అరటి బొందె అనికూడా అంటారు),కొన్ని కష్టాలిచ్చేపూటలు, కొన్ని చెడ్డను చెరిగే చేటలు, కొన్ని ఎండిన చెట్లకు తాటలు ( అంటే చెట్టు బెరడు, Bark),కొన్ని జీవితముతో ఆడుకొనే ఆటలు,కొన్ని గాయము చేసే ఈటెలు,తుపాకి పేల్చే తూటలు, కొన్ని నీటి మూటలు,కొన్ని పదును కత్తులు, కొన్ని నక్క జిత్తులు. కొన్ని విషపు విత్తులు, కొన్ని ఆపదల గుత్తులు.  కానీ సుమతి శతక కారుడు మాటను, సత్యము అనే ఒక మేకు తో గోడకు తగిలించినాడు. అదేమిటంటే
మాటకు ప్రాణము సత్యము
కోటకు ప్రాణంబు సుభట కోటి ధరిత్రిన్
బోటికి ప్రాణము మానము
చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ
అన్నాడు.  కోటకు భటులు, నాతికి అంటే స్త్రీ కి మానము, వ్రాతకోతలకు చేవ్రాలు ఎంత ముఖ్యమో మాటలకు సత్యము అంతకన్నా ముఖ్యము. మాట ఎంత విలువ కలదో చూడండి.
ధృతరాష్ట్రుడు భారతములో తన కొడుకు చర్యలు సరియైనవి కావని చెబుతూనే తనకు గల పుత్ర వ్యామోహము ఆ విధంగా చేయిస్తున్నదని బాధ పడతాడు. కర్ణుడు తాను కుంతీ పుత్రుడని తెలిసిన పిదప గూడా తన మాటకు కట్టుబడి దుర్యోధనునితో ఉండిపోతాడు. యుద్ధానికి ఆరంభములో ధర్మజునికి, తగిన సమయములో తన మరణ రహస్యము తెలిపెదనని తాను ఇచ్చిన మాటకు కట్టుబడి భీష్ముడాతనికి తన మరణ రహస్యమును ఆ విధంగానే  తెలుపుతాడు . దుర్యోధనుడు తానూ చేసేది తప్పే అని తెలిసినా, తాను దాయాది మాత్సర్యము వీడలేనంటాడు. అంటే మంచయినా చెడ్డయినా మనపూర్వుల సత్య నిష్ఠా గరిష్ఠత మనకవగతమౌతుంది. ఇందులో మంచి వారు చెడ్డవారు అన్న తారతమ్యము లేదు.  అసలు నిజము గజము వంటిది. అందుకే మరి ఏనుగు నడుస్తూవుంటే ఎంత హుందాగా ఉంటుందో చూడండి. నిజము గజమైతే అబద్ధము అజగరము అంటే పాము. కాబట్టి పాముతో చెలగాటమెన్నటికీ మంచిది కాదు.
ఈ పద్యము చదవండి.
వినదగు నెవ్వరు చెప్పిన
వినిననంతనే వేగుపడక వివరింపదగున్
కనికల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతి పరుడు మహిలో సుమతీ

ఇది కూడా సుమతి శతక కారుని ఇంకొక పద్యము. సక్రమముగా వినుట, లేక మనసు పెట్టి చదువుట, విన్నది ఆకళింపు చేసుకొనుట,ఆకళింపు చేసుకోన్నదాని అర్థమేరిగి ప్రవర్తించుట మనిషి కి చాలా ముఖ్యము. అంటే ఒక మాటను ఆకళింపు చేసుకోనేదానికి ఎంత అవగాహన అవసరమో అర్థము చేసుకోన గలరు. అసలు ఇవన్నీ డబ్బుతీసుకొని చెప్పే Management Science లోని భాగాలే!
నేను వ్రాసిన ఈ రెండు పద్యములను చదవండి.
మనసు మాటలోన మాటేమొ పనిలోన
పనికి పట్టుదలను పదిలపరచి
కష్ట పడెడు వాడు కడు గొప్ప వాడురా
రామ మొహనుక్తి రమ్య సూక్తి

పాటకు పల్లవి ప్రాణము
ఆటకు ‘లయ’యౌను ప్రాణమాలోచింపన్
మనిషికి నడతే ప్రాణము
మాటకు ప్రాణమ్ము’నిజము’మరువకు రామా!


అంటే మాట త్రికరణ శుధ్ధి గా ఉండాలన్న మాట. త్రికరణములు అంటే మనోవాక్కాయకర్మలు. భావము మొదట మనస్సులో కలుగుతుంది. అది వాకు ద్వారా బహిర్గతమౌతుంది. దానిని క్రియారూపమున పెట్టె కర్మమునాచరించితే మనము ఒక కార్యమును బాహ్యాభ్యన్తరశ్శుచితో చేసినట్లు. అప్పుడే మనసుకు తృప్తి,మనిషికి ఆనందము.
తల్లి తన సంతుకు మొదటి గురువు. ఒక వ్యక్తిని చూపి యితడు మీనాన్న అంటే అది ఆశిశువు తక్షణము గ్రహించుటయే కాక నాన్న అని పిలుస్తూ అనుబంధము ఏర్పరచు కోవడము జరుగుతుంది. తండ్రి వ్రేలు పట్టుకు నడుస్తూ ఎన్నో విషయాలు తెలుసుకొన్న పిదప గురువుకు అప్పగించడం జరుగుతుంది. 'గురువు' 'teacher' కు సమానార్తకము కాదు. teacher అంటే one who teaches. అతని బాధ్యత అక్కడితో ముగుస్తూంది. 'గురుత్వ'మది కాదు.  అసలు గురుత్వము అంటే 'density',అంటే గాఢమైన అని అర్థము . పాఠము చెప్పి ఇక పోయిరమ్మనుట కాదు గురువు యొక్క బాధ్యత. శిష్యుడు తనంతవాడయ్యేవరకు తన చత్ర ఛాయా (గొడుగు నీడ)లోనే వుంచుకొంటాడు కావున వానిని ఛాత్రుడు అన్నారు. ఎంత మంచి మాటో చూడండి.అదే student అనే మాటకు one who studies అనే గదా అర్థము. కావున గురుశిష్య సంబంధమునకు teacher--student సంబంధమునకు హస్తిమశకాంతరము, అజగజ సామ్యము,పర్వత పరమాణు సారూప్యము. కావున గురువు ఏమి మాట్లాడవలె ఎట్లు మాట్లాడవలె ఎంత మాట్లాడవలె అన్నవి కూడా తన శిక్షణ లో భాగంగా చెబుతాడు. అందుకే నే నంటాను:
అమ్మ మాట సద్ది యన్నంపు మూటౌను
అయ్యా మాట చూడ అందు పెరుగు
గురువు గారి మాట గురుతుంచు లవణము
రామమోహనుక్తి రమ్య సూక్తి

మనకు నచ్చని విషయాలు సూన్నితముగా చెప్పడమనేది ఒక కళ. ఇందులో చెప్పేవానికి చెప్పించుకొనే వానికీ అవగాహన వుంటే వారి మధ్యన పొరపొచ్చులు రావు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ :
పెళ్లి పెత్తనానికి వచ్చిన అబ్బాయి యొక్క తండ్రి ఒక కుర్చీ పై కూర్చొని, మిగత నలుగురిముందు భార్యతో ఇట్లన్నాడు. ఇందూ ! రా యిలా కూర్చో. చెప్పింది ఒక మాటే అయినా అర్థాలు మాత్రము రెండు. ఒకటి నా ప్రక్కనవచ్చి కూర్చో ఐతే రెండవది మాట్లాడకుండా రాయి లాగా కూర్చోమనుట. ఇది ఆమెకు మాత్రమే అర్థమౌతుంది. ఎందుకంటే వారి మధ్యన అవగాహన వుంది కాబట్టి.
మాటకున్న ఇంకొక ప్రాధాన్యత చూస్తాము.
భర్తృహరి సుభాషితాలలో 'విద్యా దదాతి వినయం'అన్న ఒక శ్లోకాన్ని  ఈ విధమైన పద్యంగా తెనుగించినారు ఏనుగు లక్ష్మణ కవి గారు.
విద్య యొసగును వినయంబు వినయమునను
బడయు పాత్రత పాత్రత వలని ధనము
ధనము వలనను ధర్మంబు దాని వలన
నైహికాముష్మిక సుఖంబు లందు నరుడు;

మనము నేర్చుకొనే విద్య వినయప్రదానమై వుండాలి. అప్పుడే మనలపెద్దల ఆదరమును పొందే పాత్రత లభించుతుంది. పాత్రత వలన అంతా మంచే జరుగుతుంది. జిజ్ఞ్యాస, వయసు తో నిమిత్తము లేకుండా, అందరికీ ఉండవలసిందే. అడిగే పధ్ధతి ఎదుటివారికి ఆనందము కలిగించాలి. కొందరి మాటలు వింటే మొక్క బుద్ధి పుడుతుంది కొందరివి వింటే మొట్ట బుద్ది పుడుతుంది. మన మాటలో ఎపుడూ నిజము నిజాయితీ నిండి ఉండాలి,
నిండుకొని గాదు(అంటేఅయిపోవడం.  )
హనుమంతుడు మారువేషములోవెళ్లి మొదటి సారి రామలక్ష్మణులను చూసి వారిని ప్రశ్నించిన తీరును రాములవారు వాల్మీకి రామాయణము లో ఈ విధంగా మెచ్చుకొంటాడు :

నానృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః
న సామవేద విదుషః సక్యమేవాభ్యభాషణం

అంటే ఋగ్వేద వినీతుడు అంటే వేదమును గురువు వద్ద అధ్యనం చేసిన వాడు.యజుర్వెద ధారిణుదు అంటే ఉదాత్త అనుదాత్త స్వరాలతో షడంగ సముపెతమైన వాక్ శుధ్ధి, సందర్భోచిత సమాధానాలు కలిగిన వాడు. సామ వేద విదుషః అంటే శాస్త్ర సంగ్రహుడే కాక గాన ప్రాధాన్యమైన సామవేదం సాంగోపాంగంగా నేర్చి తన ఊహా వైదుష్యంతో శ్రోతలకు రససిద్ధి కలిగించినవాడు. మాటకు అంత  ప్రాధాన్యత వుంది. అడుగుటలో అణకువ వుండాలి.
మనకు తెలియనివి తప్పులుకావు అన్న తెనాలి రామకృష్ణు ని మాటతో ముగించుతూ నన్ను తప్పుగా తలవ వద్దని తెలుపుకొను చున్నాను . జ్ఞానము అనంతము. జ్ఞానము అసలే లేనివారు ఎవరూ వుండరు కావున అంతో ఇంతో ఎంతో కొంత అందరమూ జ్ఞానులమే.  అట్లని పరిశోధన లేక విచికిత్స చేయకుండా ఒకరిని తూలనాడుట తప్పు.
ఒకసారి రాయల ఆస్థానమునకు ప్రెగ్గడ నరసరాజు వచ్చి ఇంతవరకు వ్రాసిన కవుల కవిత్వాలలో తప్పులు క్షణంలో పడతానంటాడు కానీ రామకృష్ణుడు ఒక పద్యమిచ్చి తప్పు చూపించమంటే ఏదో ఒక పదము తప్పని చెబుతాడు ప్రెగ్గడ. రామకృష్ణుడు ఆ పదము తప్పుకాదు అని సహేతుకముగా నిరూపించుతాడు. ఆ సందర్భములో ఈ పద్యాన్ని చెబుతాడు:
తెలియనివన్ని తప్పులను దిట్ట తనాన సభాంతరంబునన్
తెలుపగా రాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ
పలికిన నోట దుమ్ముపడ భాయమేరున్గాక పెద్దలైనవా
రాల నిరసింతువా ప్రెగడరాణ్ణరసా విరసా తుసా బుసా
కావున మన విమర్శా పెదవి దాటకముందే మెదడుకు పంపి జల్లింపబడిన తరువాత (after scanning ) దాటించడము శ్రేయోదాయకము.
ఈ భర్తృహరి పద్యానికి ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగు సేత ఒక సారి తిలకించండి .
భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తార హారముల్
భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలు గావు పూరుషుని భూషితు జేయు పవిత్ర వాణి వాగ్
భూషణ మే సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్
ఇదండీ మాట యొక్క మహిమ
'అనంతో వై వేదాః' అన్నారు ఆర్యులు. అవి కల్గిన భూమిలో పుట్టినందుకు గర్విద్దాం.
మనసు పెట్టి మాట్లాడుతారని ఆశ. మనసారా చదువుతారని అత్యాశ.


ఇక విమర్శను గూర్చి ఒక్క మాట. విమర్శ అన్నది నోటికొచ్చినట్లు మాట్లాడుట కాదు. చదరంగములో పావులను ఆలోచించి కదిలించిన రీతిలో అక్షరములను ఏర్చి పేర్చి కూర్చవలె. అప్పుడే ఆమాటకు కలుగుతుంది అర్థము అడిమనకందిస్తుంది పరమార్థము. అందుకే
విమర్శ  చిరుజల్లులు కురిసినట్లుండాలి కానీ జడివాన లాగా కాదు. అంటే ఎదుటి వారికి బాధ కలిగించుట కానేకాకూడదు. హాయిగా పూల జల్లు వలె ఉండవలెను.
 ఎంత హాయిగా వుండాలనుటకు   సుమతి శతకకారుని మాటే కొలబద్ద :
ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి అన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ
అని అన్నాడు.
దీనిని సరదాగా నేను ఇంగ్లీషుతో కలిపి ఇట్లు చెప్పినాను (యతి ప్రాసలు చూడవద్దు, నవ్వొస్తే నవ్వుకొండి )
ఎప్పటికెయ్యది వాంటెడొ
అప్పటికా టాకు టాకి అన్యుల హార్టుల్
హర్టింపక హర్టవ్వక
ఎస్కేపై తిరుగు వాడు ఎక్స్పర్ట్ సుమతీ
కాబట్టి ఒక వ్యక్తిని 'మీకు బుద్దిలేదు' అనుటకంటే 'మీరు ఈ పని చేయుటలో బుద్ధినుపయోగిన్చినట్లు లేదు' అని అనుట ఎంత ఉభయతారకముగా ఉంటుందో గమనించండి. అందుకే మాట మహిమాన్వితమైనది.
అసలు ఈ చాటువు మాటను గూర్చి ఎంత మంచిమాట చెప్పిందో చూడండి
మాటలచేత దేవతలు మన్నన చెంది వరంబులిత్తురున్
మాటలచేత భూవరులు మన్నన చెంది పురంబులిత్తురున్
మాటలచేత భామినులు మన్నన చెంది మనంబులిత్తురా
మాటలు నేర్వకున్న అవమానము న్యూనము మానభంగమున్

దేవతలనుండి వరములు పొందుటకు, వారిని ముందు ప్రసన్నులను చేసుకొని పిదప మన కోరికలను నివేదించుకోనవలె. అందుకే సహస్రానామాలతో ఆష్టోత్తరాలతో ఆరాధిస్తూవుంటాము దేవతలను. అత్యంత ముఖ్యమైన ఈ చాటువు ఒక సారి చదువుదాము.
న తథా శశీ న సలిలం న చందన రసో న శీతలచ్ఛాయా
ప్రహ్లాదయతి హి పురుషం యథా మధురభాషిణీ వాణీ
మాట వరహాల మూట . నోరు మంచిదైతే వూరు మంచిదంటారు. పూర్ణచంద్ర బింబము కానీ, సమశీతల నీరము కానీ, మధురభాషణమును పోలలేవు. ఎప్పటికీ పరుషముగా మాటలాడరాదు.
అందుకే పెద్దలు
సత్యం భ్రూయాత్ ప్రియం భ్రూయాత్
నభ్రూయాత్ సత్యమప్రియం
ప్రియంచ నానృతం భ్రూయాత్
ఏషా ధర్మః సనాతనః

అన్నారు. ప్రియకరమైన సత్యమును పలుకవలెను, అట్లని ప్రియము కలిగించే అబద్ధమును పలుకనేరాదు. మరి మనిషికి బాధను కూర్చే నిజామును పలుకవచ్చునా అంటే అదీ పనికిరాదు. ఇదే మన సనాతన ధర్మము. ఇంతమంచి ఉపదేశములు కలిగిన మన సంస్కృతిని, సంస్క్రుతమును విడువ వద్దు. మనకున్న అనేక శాస్త్రములలో ‘నీతి’ కూడా ఒక శాస్త్రము. శాస్త్రము అంటే శాసించేది. ఇది మారాడు. అర్థము చేసుకొని దానికి అనుగుణముగా మనము మారవలసినదే! ఇది పాశ్చాత్యుల సమయాన్ని బట్టి మారె Science కాదు.
తొందరపాటు తనముతో ఏర్పడిన ఆవేశము వలన మాటలాడే మాటలు ఇతరులను ఎంతకాలము నొప్పించుతాయో మనము ఊహించలేము . కావున కఠినమైన భావాన్ని కూడా కడుమెత్తగా చెప్పవలెను . మన మాట, తన కోరల తో చీరేసే పులి తన చంటి బిడ్డలను తన పళ్ళతో ఎంత మెత్తగా పట్టుకొని ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు పోతుందో, అంత మెత్త గా ఉండవలెను. ఇది సహజంగానూ సమకూరవచ్చు సాధన వలననూ సంభవించ వచ్చు.
ఒక చిన్న కథ చదవండి.ఒక విద్యాధికుడైన ముదుసలి వచ్చి ఒక దేశ ప్రధానిని చూడ వెళ్ళినాడు. విషయము ప్రధాని గారి కార్యదర్శి ఏర్పాటు చేసి ప్రధానికి చెప్ప మరచినాడు.ముఖ్యమైన పాత్రికేయులు మాత్రము అనుమతింపబడినారు. మాటలు చాలా సుహృద్భావ వాతావరణములో ముగిసినట్లు కనిపించినాయి. ఆ విద్యాధికుడైన ముదుసలి బయలుదేరిన వెంటనే శ్రవణ సాధనములట్లే వున్నాయని గమనించకుండా తన అనుచరులను, అసలతనిని లోనికి ఎందుకు రానిచ్చినారని గట్టిగా కేకలు వేసినాడు, తన భావము నణచుకోలేక. అంతే ,అంతా రసాభాసమే! ఆతను మళ్ళీ ఎన్నికలలో గెలుచుట జరుగలేదు.
అందుకే పెద్దలు,చంద్రుడు,చల్లని పానీయము,గంధపు పూత,హాయిని గొలిపే నీడ,సహజంగా మానవుని ఆనందపరుస్తాయి . కానీ వీటన్నిటికంటే మధురమైన సంభాషణ హృదయాన్ని ఎంత ఉల్లాస పరుస్తుందో చెబితే మాటలు చాలవు.
దీనిని సాధించ దలచినవారు ఆనన గ్రంధి (Face Book) లో వ్రాసే విమర్శ (comment) తో మొదలుపెట్టవచ్చు . చివరిగా పెద్దల మాటతో ఈ వ్యాసమును ముగించుచున్నాను.

ప్రియమైన మాటలు అందరిని దగ్గర చేస్తాయి కటువైన మాటలు దూరం చేస్తాయి

దీన్ని గురించిన ఈ శ్లోకం చూడండి-

ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యన్తి జన్తవఃl

తస్మాత్తదేవ వక్తవ్యం వచనేకా దరిద్రతll

ఎదుటివారికి ప్రియంగా మాట్లాడటం వలన అందరూ సంతోషిస్తారు. మెచ్చుకొంటారు. అందుచేత ఓ సంఘజీవీ నీవు ప్రియంగా మాట్లాడుతూం ఉండు. మాటలకు దరిద్రం(లోటు) ఉండదుకదా  మాట్లిడితే పోయేదేముందీ - అని భావం

స్వస్తి.

Ravi Sudhakar Musunuri మంచి మాటలకు ప్రపంచంలో ఎప్పుడూ కొరత వుంటుంది. అందుకే వాటిని ఎప్పుడూ వృధా చేయద్దు.
Sadanandeeswaraiah Vallamkondu మంచి మాట చెప్పారు
VR Ganapathi మంచి మాట!!
Satyanarayana Choppakatla మీమాటలు వరాల మూటలు!
Sarada Rupakula మీరు రాసినవి అన్నీ నేను చదువుతాను. ఒక్కసారి కాదు ఇష్టం వచ్చినన్ని సార్లు. ఈ రోజు ఈ విషయాలు చదువుతుంటే మాకు తెలుగు చెప్పిన భాస్కరశాస్త్రిగారు గుర్తు వచ్చారు. మనసుకి హత్తుకొనేటట్లు చెప్పే వారు.
గురు శిష్య సంబంధం మీరు చెప్పిన విధంగా కాదు కదా teacher - student లా కూడ లేదు. చెప్పే వారికి చేవ లేదు వినేవారికి ఓర్పు లేదు. అందుకే వచ్చే జ్ఞానం లేకపోగా వెకిలిగా మారింది విద్యావ్యవస్థ.
ఉదయం నుండి నాకు ఎవరికీ శుభాకాంక్షలు చెప్పబుద్ది కాలేదు అంటే అతిశయోక్తి కాదు.
గురు పూజోత్సవ శుభాకాంక్షలు.”
Gowrishankar Gowri
Gowrishankar Gowri Mata gurinchi chala chakkaga Aneka sandarbalalo kavula matalu Teliyajesi mamulanu anandaparachinaru.Mee matalu maku mantrambulu. Meeru Bahumukhapragnasali. Namaste. Namaste.


Saturday, 23 November 2019

వేద గణితము ఒక సంఖ్య వర్గమును వర్గ మూలమును కనుగొనుట (Finding out Square of a number)


వేద గణితము
ఒక సంఖ్య వర్గమును, వర్గమూలమును కనుగొనుట
(Finding out Square of a number)
(కాలక్షేపం కబురులు నేను వ్రాయటము లెదు. అవి సమయమును సంహరించుతాయి.
మనసునకు కలుగవలసిన వికాసమును హరించుతాయి. మనలో నిత్రాణమైయున్న అసురీ శక్తులను ప్రేరేపించూతాయి. అందువల్ల ఉబుసుపోకకు కబుర్లాడుకొన్నా అదే జీవిత పరమావధి కాకూడదు. ఈ దిగువ నా మనసు మీ ముందుంచుచున్నాను.
అక్కరకు రానిమాటలు
ఎక్కడనూ పనికి రావు ఎందులకనగా
మక్కువ దంటును నమిలిన
చిక్కనిదౌ చెరుకు రసము చిక్కునె రామా!
ఒక మంచి విషయమును కొంత ఓపిక వెచ్చించి తెలుసుకొన గలిగితే మీరు దానిని పదిమందికి పంచగలుగుతారు. ఉమ్మెత్త పూవులు ఎంత మెత్తగా ఉన్నా చందన గంధము పంచలేవు కదా!
అసలు విషయానికి వద్దాము. ఈ శ్లోకమును గమనించండి.
స్థాప్యోంత్యవర్గో ద్విగుణాంత్య నిఘ్నాఃl
స్వస్వోపరిష్టాచతథా-పరేంకాః
త్యక్త్వాంత్యముత్సార్య పునశ్చ రాశింll
ఈ శ్లోకము భాస్కరాచార్యుడు-2 తన 'లీలావతీ గణితము'లో చెప్పిన విషయము. ఇది శ్లోకరూపములో చెప్పిన 'వర్గమును కనుగొను అత్యద్భుత విధానము. ఈ విధానమును ఒకపరి ఆకళింపు చేసుకొన్నారంటే ఒక సంఖ్య యొక్క వర్గము కనుగొనుట ఎంత సులభము అన్నది మనకు అర్థమౌతుంది.పాశ్చాత్య విధానములో అంటే మనము పాఠశాలలో నేర్చుకొన్న గణిత విద్యలో ఒక సంఖ్య వర్గమును కనుగొనవలెనంటే ఆసంఖ్యను అదే సంఖ్యతో హెచ్చవేసి ఫలితము తెలుసుకోవలసియుంటుంది. ఉదాహరణకు 352 యొక్క వర్గము కనుగొనవలెనంటే
352x352 చేస్తే 1,23,904 వస్తుంది. వేరొక మార్గము లేదు. అదే 5 అంకెల సంఖ్య అయితే పని ఇంకా కష్టమౌతుంది. కానీ భాస్కరాచార్యులవారు చెప్పిన ఈ విధానమును ఆకళింపు చేసుకొని అనుసరించితే ఆపని అత్యంత సులభమౌతుంది. వ్యావహారికముగా ఈ పని అవసరమా అంటే చాలా అవసరము. అభియంతలకు (Engineers) స్థపతులకు (Archeticts) ఎంతో అవసరమౌతుంది. అట్టివారిని తయారు చేసే ఉపాధ్యాయులకు, ఆచార్యవర్యులకు కూడా మిక్కిలి అవసరము.
ఈ శ్లోకమును అర్థము చేసుకొనుటకు ముందు అవగాహన కొరకు ఈ క్రింది వివరణ అత్యవసరము.
ఒక ఇచ్చిన అంకెను రెండు విధములుగా చదువవచ్చును. ఎడమ నుండి కుడికి చదువుట ఒక విధమైతే కుడి నుండి ఎడమకు చదువుట ఒక విధము. వేదగణితము నందు ‘అంకానాం వామతో గతిః’ అన్న ఒక సూత్రము వుంది. అంటే ఒక సంఖ్య లోని అంకెలను మన కుడిచేతి వైపునుండి ఎడమ చేతివైపుకు చదువుట అని అర్థము. ఈ విషయాన్ని గతములో కూడా పలుమార్లు తెలియజేసినాను. రెండవది పాశ్చాత్య విధానము. ఎడమ నుండి కుడికి చదువుట. ఈ శ్లోకము గొప్పదనమేమిటంటే ఇచ్చిన అంకె యొక్క ఫలితమును అటునుంచియైనా ఇటునుంచి అయినా మొదలు పెట్టి ఫలితమును సాధించ వచ్చు.
పై శ్లోకమునకు అర్థము ఉదాహరణ రూపములో తీసుకొందాము. ఆ ఉదాహరణ కూడా పైన చెప్పిన 352 నే తీసుకొందాము. వర్గ మూలము కనుగొను విధానమును ఇటు 3 నుండి కానీ అటు 2 నుండి కానీ మొదలు పెట్టవచ్చును.
ముందు ఒకట్ల స్థానములో ఉన్న 2 వైపునుండి ఫలితము పొందు ప్రయాణము చేద్దాము.
1.    మొదట 2 యొక్క వర్గమును గ్రహించాలి అంటే 22= 4
ముందు 352 క్రింద ఒక గీత గీచుకొందాము. గీచుకొని 4 ను ప్రక్కన చూపిన విధముగా వేసుకొందాము. ఇప్పుడు 2ను ద్విగుణీకృతము చేద్దాము.(We are doubling the last digit. Incidentally in this case it is 2, which when squared or multiplied by 2 yield the same result). వచ్చిన ఫలితమును ఈ విధముగా వేసుకొందాము. తరువాత 10ల స్థానములో ఉన్న 5 కు వర్గమును ఇప్పుడు 100 ళ స్థానములో 140 కి దిగువ పంక్తిలో వ్రాసుకొందాము. తరువాత 5ను 2తో  హెచ్చించి ఆ లబ్ధమును 25 లోని రెండు క్రింద వేసుకోవాలి. తరువాత 352 లోని 3కు వర్గము కనిపెట్టి 1 క్రింద వేసుకోవాలి. ఇపుడు మొత్తం కూడాలి.
                      3   5   2
                               4
                1   4    0
                2   5
            3  0
            9
123904  ఇదే జవాబు.
ఈ విధముగా, ముందు, మీకు తోచిన మూడు అంకెల సంఖ్యల యొక్క వర్గమును సాధించేది. ఉత్సాహవంతులు తప్పక ప్రయత్నించుతారని ఆశ. రెండు మూడు రోజుల తరువాత 4 లేక 5 అంకెల సంఖ్య యొక్క వర్గము కనుగొందాము.
ఇపుడు ఇదే 352 ను తీసుకొని ఎడమ వైపు నుండి అంటే 3 నుండి మొదలుపెట్టి సాధిద్దాం.
ముందు (1) 32 = 9 (2) 3x2=6  (3) 6x5 = 30 (4) 52  = 25 (5) 35x2x2(This 2 is the last digit of the given number, 35 is 3 and 5 of the given number) = 140 (It is just doubling 5) (6) 10x2 =20 (2 in 352)  (7) = 22 = 4
                 3  5  2    
       9
       3  0
          2     5
           1    4   0
                        4

    1 2 3 9 0 4 ఇదే జవాబు.

ఇపుడు ఒక పెద్ద సంఖ్యను తీసుకొని దాని వర్గము కనిపెడుదాము.
450232 = 2027070529
వరుస క్రమములో పైన తెలిపిన విధానముతో స-క్రమముగా వ్రాసుకొంటూ పోతాము.
పంక్తి
  1.  = 32 = 9    
 2.  = 2x3x4502 = 27012
 3.  = 22 = 4
4.  = 2x2x450 = 1800
5.  = 02 = 0
6.  = 2x0x45 = 0
7. = 52 = 25
8. = 2x5x4 = 40
9. = 42 = 16
పై విలువలను గతములో చెప్పిన విధమగు వరుసక్రమములో వ్రాయగా:
                                          9
                            2 7 0  1  2
                                     4
                           1 8 0 0
                                0
                             0
                       2 5
                    4 0
                 1 6
­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­2 0 2 7 0 7 0 5 2 9: ఇది జవాబు – పైన ఇచ్చిన కలన యంత్రపు జవాబుతో పోల్చుకొనేది.
ఇపుడు మీరు ఎడమవైపు నుండి మొదలు పెట్టి ఇదే సంఖ్యకు వర్గము కనుగొనగలరు.

 ఈ దిగువ వర్గమూలము వేదగణిత విధానములో కనుగొనుట తెలుప బడినది. ఇది భాస్కరాచార్య-2 గారి లీవతి గణితము లోనూ పావులూరి మల్లన గణితములోనూ తెలుపబడినది.


స్వస్తి.



Monday, 4 November 2019

భీష్మ జాతకము - భీష్మార్జున యుద్ధము

                     భీష్మార్జున యుద్ధము

https://cherukuramamohanrao.blogspot.com/2019/11/blog-post_18.html

శీర్షిక పేరు చూస్తూనే ఇది మాకు తెలిసిందేలే! ఏముంది దీనిలో చదివేది అని పాఠకులు తలచుట ఎంతో సహజము. తెలిసినది కాకుండా వేరేమయినా యున్నదా అన్న జిజ్ఞాసతో నైనా చదువండి. భారతము ఇతిహాసము (History) అని మన పూర్వులు ముద్ర వేసి చెప్పినామనము విశ్వసించే పాశ్చాత్యులు ఆ విషయమును తేటతెల్లము చేసేవరకూ మనము ససేమిరా నమ్మలేదు. మనవారు రామాయణ భారతములను 'ఇతిహాసములు అనే కదా మన తండ్రి తాత ముత్తాతలు అన్నారు. మన సంస్కారము, మన గ్రంధములు, మన సంస్కృతము, మన సంస్కృతి, మన ఐకమత్యము అన్న విషయములను ఇకనైనా పరిగణన లోకి తీసుకోకుంటే ఈ దేశము పరమతములకు ప్పజెప్పినట్లే!

భారతేతిహాసములో ధర్మజ , భీష్మ, కృష్ణ దుర్యోధన, విదుర వంటి విభిన్న పాత్రల నియమ నిష్ఠలను మనమెంతో ఆకళింపు చేసుకొనవలసినది ఉంది. నేను పై శీర్షిక కల్గిన ఈ వ్యాసములో బ్ర.శ్రీ. రేమేళ్ల అవధానులవారి సహకారముతో, భీష్ముని జన్మ కుండలిని తీసుకొని కొంత విశ్లేషణ చేయుట జరిగినది. నా వ్యాసములో నేను వాడిన రెండు బింబములు (Images) నా తమ్ముడు మండెం కృష్ణ మూర్తి తన ఉద్యోగము నుండి అలసివచ్చి కూడా రాత్రి 11.30, 12గం. లకు నేను చేతి వ్రాతగా పంపిన కుండలిని చక్కగా తయారుచేసి పంపినాడు. తాను నా ధన్యవాదములు కోరడు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే నేను వ్రాసే ఒక వ్యాసానికి, ఫలాపేక్ష లేకుండా, నాపై గౌరవముతో ఉన్న వారిని కూడా ఉపయోగించుకొని కొన్ని వ్యాసములు తయారు చేయవలసివస్తుంది. మ్నారి ఇంతటి సహృదయుల సహాయ సహకారముతో ప్రచురించే అపురూపమయిన వ్యాసములు పాఠకులుగా మీరు చదువక పోతే నా శ్రమ 'బూడిదలో పోసిన పన్నీరే!

అసలు ఇటువంటివి చదివి మన పూర్వుల ప్రతిభ, మన చరిత్ర గుర్తించుటకుగానూ,చదువుట అన్నది మన ప్రాథమిక కర్తవ్యము. కొంతమంది మిడి మిడి జ్ఞానముతో మన వేద శాస్త్ర పురాణేతిహాసాలను దుయ్యబడుతూ ఏవేవో వ్రాస్తూవుంటారు. ఆ వ్రాతలకు ప్రాధాన్యతనిచ్చేవారు కొందరైతే పట్టించుకోని వారు కొందరు.  కానీ మన దేశములోని పరమతస్తులు తమ తమ మతగ్రంధములను తాము దుయ్యబట్టక పోగా, అట్లు ఎవరయినా మాట్లాడితే తలలు తెంచుతారు.  

అంత దాష్టికమునకు మనము పాలుబదనవసరము లేదు. అసలు మన పురాణేతిహాస శాస్త్ర గ్రంధములు ఏమిచేబ్యుతున్నాయో కాస్త శ్రద్ధబూని చదువుదాము.

మన సనాతన ధర్మము పగలు రాత్రి లేకుండా ప్రకాశించే దివ్యమణి. దానిని కాపాడుకొనుట మన పని.

భీష్మ జాతకము - భీష్మార్జున యుద్ధము
నేటి చరిత్రకారుల అంచనాలకు అందని కాలములోనే అనంత సృష్టి పై దృష్టి సారించి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యజనకమైన విషయములను సాదికారికముగా గుర్తించి మనకు అందించిన ఆ ఋషి ముని వరేణ్యులకు మనసా పాదములంటి సాష్టాంగ దండప్రణామములాచారించి నాకు తోచిన నాలుగు మాటలు చెబుతాను. అనంతమైన మన పూర్వుల సకలశాస్త్ర విజ్ఞాన సంపద ఇంత అని మన కొలమానమునకు అందనిది.
ఖగోళ శాస్త్రము అన్న సంస్కృత పదమునకు Astronomy సమాంతర నిర్వచనము కాదు. మొత్తము విశ్వాంతరాళమును ఖగోళముగా నిర్వచించినారు మన పూర్వులు. పాశ్చాత్యుల Astronomy ఆకాశములో అగుపించే తారాతోరణాల వరకే పరిమితము. వారి ఈ మాటే మన భూమి ఆకాశము అన్నీ చద్ఫరముగా ఉన్నట్లే సూచిన్చుచున్నాయి తప్పించి గోళాకృతిని నిర్వచించవు. ఇక Astrology అన్న మాటకు అర్థము ఆంగ్ల నిఘంటువులో ఈ విధముగా వుంటుంది.
Astrology is the study of the movements of the planets, sun, moon, and stars in the belief that they can influence people's lives.
అదే మన జ్యోతిషము అన్న పదమునకు వివిధ, నక్షత్ర, గ్రహ, వివిధ గ్రహకూటముల వెలుగు యొక్క ప్రభావము మానవులపైనే గాక సకల చరాచర సృష్టిపై ఏర్పడు ప్రభావమును తెలుపుతాయి. ఈరోజు గ్రహస్థితిని ఒక ప్రమాణముగా తీసుకొని కొన్ని వేల సంవత్సరముల గ్రహ గమనమును గూర్చి, గ్రహణముల గూర్చి నిర్దుష్టముగా చెప్పగలిగిన శాస్త్రములను మనకు అందించిన ప్రజ్ఞాశాలురు మన పూర్వులు. ఇట్లు మనము వారి ఘనతను గూర్చి ఎంతయో చెప్పుకొంటూ పోవచ్చును.
ఇక అసలు విషయమునకు వద్దాము. బహిరంగాముగానూ, మన పిల్లలకు ఆంగ్లము అనర్గళముగా వస్తుందన్న ఆశతో చేర్పించిన మిషనరీ స్కూల్స్ లోనూ మన రామాయణ భారతములు మైత్\మిత్ అని పదేపదే చెప్పి, ఇటు మన బుర్రల్లోనూ, అటు అమాయకులైన పసిపిల్లల బుర్రల్లోనూ ఈ ఇతిహాసములు జరిగినవికాడు. అన్నీ కట్టుకతలే! అని నమ్మించినారు. నిజము నిప్పు అన్న వాస్తవమును విస్మరించినారు. వారిలోనే నిష్పక్షపాతులగు చరిత్రకారులు అవి చరిత్రయే అని రుజువులతో సహా నిరూపించినారు. వారు చెప్పినదగుతచే దానికి ఇప్పుడు వంత పాడుట మొదలు పెట్టినాము.
ఈ వ్యాసములో భీష్మార్జున యుద్దమును తీసుకొని ఇటు చరిత్రను అటు జ్యోతిషమును అనుసంధించి నాకగుపించినది, నాకనిపించినది వ్రాయుచున్నాను.
నక్షత్రములు 27 అన్నది మధ్యవయస్కులకు తెలిసిన విషయమే! యువతలో ఎక్కువ మందికి తెలిసే అవకాశము తక్కువ. ఒకప్రక్క చెప్పేవారి సంఖ్య తరిగిపోతూ వుండగా మరొక ప్రక్క వినే ఉత్సాహము యువతలో కూడా రాను రానూ కుంచించుకొని పోతూ వుంది. అసలు విషయానికొస్తే అప్పుడపుడు జ్యోతిశ్శాత్ర వేత్తలు 28 వ నక్షత్రమును గూర్చి చెబుతూ వుంటారు. దానిపేరు అభిజిత్తు. ఇది ఆ 27 నక్షత్రములవలె పూర్ణ మండలము కలిగిన నక్షత్రము కాదు. అశ్వని భరణి ఆదిగా గల పేర్ల నక్షత్రములు చర్మ చక్షువునకు ఒకటిగా కనిపించినా అవి కొన్ని తారకల గుంపును తమలో కలిగి ఉంటాయి. అభిజిత్తు ఉత్తరాషాఢ లోని నాలుగవ వంతు శ్రవణములోని మొదటి 15వ వంతు కలిగి ఉంటుంది. పై విషయములు అసంగతములు అని అనుకొంటుంటారు. పనిలో పనిగా ఇప్పుడు చెప్పకపోతే వానిని గూర్చి తెలియని పాఠకులు తెలుసుకొనే అవకాశము ఎగిరిపోతుంది.
అసలు విషయమునకు వద్దాము. భీష్ముని నక్షత్రము ‘ధనిష్ఠ’. ధనిష్ఠ 8 నక్షత్రములు కలిగిన మండలమని ఖగోళ శాస్త్రము చెబుతూ వుంది. 8 అష్టవసువులకు సంకేతము. అంటే వీరు ధనిష్ఠకు అధిష్టాన దేవతలన్నమాట. అష్ట వసువులు అనగా దేవలోకం లో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం సాక్షాత్తూ బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధృవులు అను వీరలను అష్ట వసువులు.
ఒక సారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్టుని ఆశ్రమంలో ఉండే నందిని  అనబడు కామధేనువు యొక్క బిడ్డ. దానిని వారు దొంగతనంగా తీసుకుని వెళతారు వారు. అందులో ఆవును పట్టుకొని తోలుకుపోయినవాడు 8 వ వాడు. వశిష్ఠుడు తన దివ్యదృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్టుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడుగురు వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని కానీ కామధేనువుని తీసుకుని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెబుతాడు.
వారు ఆ శాపం గురించి ఆలోచిస్తుండగా గంగాదేవి వారి వద్దకు వస్తుంది. వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనిచ్చి, పుట్టిన వెంటనే నదిలో పారవేయ వలసిందిగా కోరతారు. గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది. తరువాతి కథ మీకు తెలిసినదే! దేవవ్రతుడన్న నామధేయము గలిగి భీషణ ప్రతిజ్ఞ చేయుటచే మహాభారత సంగ్రామము ముగిసి తానూ ప్రాణత్యాగము చేసేవరకూ భీష్మునిగానే నిలిచిపోయినాడు. తన ప్రతిజ్ఞ మేరకు పెళ్లి చేసుకోనూ లేదు రాజ్యాధికారమును పొందనూ లేదు. మరి ఆయన జన్మపత్రిక ఏమి తెలుపుచున్నదో చూద్దాము.



జాతక చక్రమున మీనము తరువాత నుండి వచ్చే ఖాళీ గదులలో వరుసగా, మేషం, వృషభం,కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ఊహించుకోనేది. 12 గళ్ళలో 12 రాసులు ఉన్నాయి. మనకు అవసరమైనవి ఆయా గదులలో వ్రాసుకొన్నాము.
ప్రతి నక్షత్రమూ నాలుగు పాదాలు కలిగియుంటుంది. ప్రతి రాశీ ప్రతి మూడు వరుస నక్షత్రములనుండి, వరుసగా, 9 పాదములు కలిగియుంటుంది. పైన కనపరచిన కుండలిలోని ధనుస్సు, మకరం, కుంభం, మీనం అన్న రాశులను తీసుకొందాము. ధనుస్సు: మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదము కలిగియుంటుంది. దానితరువాత వచ్చే మకరం: ఉత్తరాశాధలోని మిగిలిన 3 పాదాలు,శ్రవణం లోని 4 పాదాలు, ధనిష్టలోని 1,2 పాదాలు కలిగి వుంటుంది. అదేవిధముగా మిగిలిన రాసులు కూడా! ధనిష్ఠ యొక్క మొదటి రెండు పాదాలూ మకరం లోనూ మిగతా రెండు పాదాలూ కుంభం లోనూ ఉన్నాయి.



నాలుగు పాదాలూ కలిపి చూసుకొన్నా ధనిష్టకు ఇటు కన్య గానీ అటు మిధునము కానీ చాలా దూరములో ఉన్నట్లు పై చిత్రము చూస్తే మనకు తెలుస్తుంది. అందుకే భీష్ముడు బ్రహ్మచారియై అవివాహితునిగా ఉండిపొయినాడు. ఇది ప్రసిద్ధ జ్యోతిష్కులైన దువ్వూరి అవధానిగారు చెప్పిన మాట. ఇక ఎదే జాతక రీత్యా ఇంకొక విషయమును చూద్దాము. ప్రతియొక్క యోధుని స్వంత రథమునకూ ఒక జెండా కలిగి యుంటుంది. అంటే దానివల్ల ఆ రథము ఎవ్వరిది అన్నది చూపరులకు అర్థమౌతుంది. మనకందరకూ తెలిసినది పార్థుని రథము యొక్క జండా పై కపిరాజు. మరి భీష్మునికో?
భీష్ముని ధ్వజకేతము తాటి చెట్టు. మరి జాతకలో దీనికి కూడా అన్వయము లభ్యమౌతుందేమో చూద్దాము.
ధనిష్ఠ 1,2 పాదాలు మకరం లో వుంటే 3,4 పాదాలు కుంభములో వున్నాయి. అంటే ధనిష్ఠ కుంభములోనికి విస్తరించి ఉన్నది అన్నమాట. ఆ లంకె ఏమిటి అన్నది చూద్దాము. కుంభమునకు అధిష్టాన దేవత వరుణుడు. వారుణి అన్న శబ్దము ‘వరుణ’ శబ్దము నుండి పుట్టినదే! ‘వారుణి’ అన్న మాటకు అర్థము ‘కల్లు’ అని. ‘కల్లు’ లో మొదటిస్తానము తాటి కల్లుది. దానిని తాతిచేట్టునుండి తీస్తారు.
మనము ఇపుడు ధనిష్ఠ 1,2 పాదములు రథము పై ఉన్నాయంటే 3,4 ధ్వజము జండాలను గుర్తు చేస్తాయి. కాబట్టి జెండా పై తాటిచెట్టు వెలసింది. ఇటువంటి విషయములు తెలుసుకొనుటకు సహేతుకమగు తర్కము ఎంతయో అవసరము.
ఇక భీష్మార్జున యుద్దమును గూర్చి తెలుసుకొందాము. మహా భారతమును చదివితే, భీష్మునికి అర్జనునికి యుద్ధము, రెండు పర్యాయములు జరిగినట్లు తెలియవస్తూ వుంది. 1. ఉత్తర గోగ్రహణ సందర్భము. ఇక్కడ జరిగిన యుద్ధము ప్రానాన్తకము కాదు. ఎందువల్లనంటే ఇక్కడ అర్జనుని ధ్యేయము గోవులను మరలించుటయే! తిక్కన భారతము ప్రకారము దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని, ద్రోణ, అశ్వత్థామాది కురువీరులను మూర్చిలజేసిన తరువాత భీష్ముడొకడూ మిగులుతాడు. తాతకు తన ప్రతాపమును చూపనెంచి, శివుని నుండి పొందిన పాశుపతాస్త్రము మరియు దేవదానవ యుద్ధములో దేవతలకు సహాయమోనర్చి తానూ బహుమతిగా పొందిన వివిధ అస్త్ర శస్త్ర పటుత్వమును చూపనెంచి
ఆయనపై అలుగులనొదులుతాడు.  హోరాహోరీగా జరుగుచున్న ఆ యుద్ధములో భీష్ముడు వేసిన ఒక బాణము అర్జనుని భుజమున నాటినది. చలించని అర్జనుడు తాను రెండు బాణములను సంధించి భీష్ముని గుండెను తాకునట్లు వదలినాడట.  ఆయన తూలి పడబోతూ రథము యొక్క స్థంభమును పట్టుకొని నిలువగాలిగినాదట. భీష్ముడు యోధానుయోధుడు. అర్జనుడూ సమాన శౌర్య సంపన్నుడు.
ఇక్కడ మనము గమనించవలసినది ఏమంటే భీష్ముని అంతగా నిలువరించగల యోధుడు కురుపాండవ బలగములలో వేరెవరూ లేరు. దేవతలను మెప్పించి అస్త్రశస్త్రములను భీష్ముడు సాధించితే, దేవతలు మేచ్చుటచే అస్త్రశస్త్రములను సాధించినవాడు అర్జనుడు. అర్జనుని విలువిద్యా కౌశాలును గూర్చి ఒక్క మాట ఇక్కడ చెబుతాను.
వీక నెదిర్చి ఇట్లు కురువీరులకున్ ప్రమదంబొనర్చుచున్
తాకిన క్రోధవేగ సముదగ్రత నెర్రని చూడ్కి జూచి పే
రాకలి తోడనున్న జమునాకృతి భీషణ రేఖ యొప్పగా 
వ్రేకని నారసంబు దొడి క్రీడి కరిన్ దృఢ ముష్టి వేసినన్
ఫాల కుంభ సంధి బడి వాలమున వెస
నుచ్చి పోవుటయును నుర్వి యద్రువ
గూనె నగ్గజంబు కువిశచండాహతి
పడు మహా నగంబు భంగి దోప
మహాభారత యుద్ధము తీవ్రముగా జరుగుతూ వుంది. అర్జనుని ముందు కౌరవసేన నిలువలేక వెన్నుజూపి పారిపోతూ వుంది. వారికి ధైర్యము చెబుతూ మదించిన సుశిక్షితమైన మరియు కౌరవ గజబలములో శ్రేష్ఠమైన ఏనుగునెక్కి అర్జనుని ఢీకొన, వికర్ణుడు బయలుదేరినాడు. కౌరవ సేన ధైర్యము పుంజుకొని వికర్ణుని వెంట నడిచింది. ఇదిగామనించి, వికర్నుడా నన్నేదిరించేవాడని, అర్జనుడు ఆగ్రహోదగ్రుడై విడిచిన బాణము, ఏనుగు కుభస్థనుండి లము నడుమనుండి దూసుకొని పోయి తోకవైపు నుండి బయల్వెడలినదట. అంతబలము బాణము వదిలే ఆయన ముష్టి అంటే పిడికిలికి ఉండినదంటే ఆయన ఎంత బలవంతుడో అర్థము చేసుకొండి.
అంతటి మహా బలశాలి బాణము వేసినాడు కాబట్టే భీష్ముడు తూలినాడు. మరి అంతటి బలశాలి వేసిన బాణమునకు ఎదురొడ్డి నిలువగలిగినాడంటే భీష్ముడెంత బలశాలియో గ్రహించండి.
ఇక మహాభారత యుద్ధానికి వస్తాము. కురుక్షేత్ర సంగ్రామములో ప్రథమ సైన్యాధ్యక్షుడు భీష్ముడు అన్నది మనకు తెలిసినదే! ఆయనకు సైన్యాధ్యక్ష పదవిని కట్టబెట్టినంతనే తాను 10,000 రథికులను మట్టుబెట్టిన తరువాతనే నేల వాలుతాను అని దుర్యోధనుని ముందు శపథము చేస్తాడు. యుద్ధము ప్రారంభమయిన 9 రోజులలోనే మాట నిలబెట్టుకొంటాడు. కృష్ణుడు ధర్మరాజు సమేతంగా ఆ రోజు రాత్రి భీష్మునివద్దకు వెళ్లి ఆయన మరణ రహస్యము అడుగుతాడు. తనది ఇచ్చా మరణమే అయినా నేలకు ఒరగాలంటే అర్జనుని, శిఖండిని ముందుంచుకొని, యుద్ధము చేయమంటాడు. వారు ఆయనకు తమ కృతజ్ఞత చాటుకొని తమ శిబిరమునకు వెళ్ళిపోతారు. తెల్లవారి యుద్ధములో శిఖండి అర్జనుని ముందు నిలబడతాడు. సమారా శంఖములు పూరించిన వెంటనే యుద్ధము ప్రారంభమవుతుంది.
ఒకసారి మనము పైన ఉన్న కుండలిని పరిశీలించినట్లయితే కన్య గదికి పైన ఒక చుక్క గుర్తు కనిపిస్తుంది. అది ఉత్తర ఫల్గుణీ నక్షత్రము. ఆ గదికి ఎదురుగా మకరం, దానిపై కుంభం రాసులలో ధనిష్ఠ ఉన్న 1,2 మరియు 3,4 పాదాలుగా ఉన్నదికదా!  అయినాకూడా అవి 180 డిగ్రీల కోణములో లేవు. మరి ఇద్దరు పోరుతున్నపుడు వారి మధ్య కోణము 180 డిగ్రీలు ఉంటుంది కదా!  ఇప్పుడు కుండలిని భీష్మార్జున యుద్ధముతో సమన్వయపరిస్తే ఆయుద్ధములో భీష్మార్జనులు ఎదురెదురుగా కాక కొంచెము ఏటవాలుగా వున్నారు. అంటే ధనిష్ఠ ఉత్తరఫల్గుణీ నక్షత్రములు ఒకదానికొకటి 180 డిగ్రీలలో లేవు. మరి ధనిష్టతో ఆ కుండలిలో మరొక నక్షత్రము ఎదురుగా వున్నదన్నమాట. ఆ నక్షత్రమే శిఖండిది. అదే శిఖండిని ముందుంచుకొని భీష్మునితో యుద్ధము చేయుటకు సంకేతము. ఆయుద్ధములో భీష్ముడు అర్జనునితో తనపై బాణ వర్షము ఇంకా ఇంకా కురిపించమని చెబుతూవుంటాడు. ఆయన తన సారధితో ఈవిధంగా అంటాడు. నాశరీరానికి కొన్ని బాణములు పూవులు తాకినట్లుగా ఉన్నాయి. కొన్ని అలుగులు  గుంతను త్రవ్వే పలుగులవలె  క్రుచ్చుకొంటున్నాయి.  పూలతాకిడి కల్గినవి శిఖండి బాణాలయితే  పలుగుల బోలినవి అర్జనుని బాణాలు అని భీష్ములవారు చెబుతున్నారు.
అర్జునస్య ఇమే బాణాః నేమే బాణాః శిఖండినః l
కృదంతి మమ గాత్రాణి మాఘమాసే గవామివll   
పై శ్లోకము వ్యాస భారతమునందు ఎంతో ప్రముఖమైనది. ఆ ప్రాముఖ్యత ఏమిటో చూద్దాము. భీష్ముడు సారధితో చెబుతున్నాడు. “ ఈ బాణాలన్నీ అర్జనునివే. ఇవి శిఖండివి కావు. ఈ బాణముల తాకిడితో నా శరీరములోని భాగాలు తునాతునియలైపోతూవున్నాయి. ఏ విధముగా అంటే ‘మాఘమాసే గవాం ఇవ’ అని పోల్చినాడు. ఇక్కడ విషయమునకు కాస్త దూరము జరిగి వ్యాస గణేశ సంవాదమును గూర్చి చెప్పవలసియున్నది. భారతము చెప్పు నా వాగ్వేగమునకు నిలిచి,  వ్రాయుటకు నీవే తగిన వ్రాయసకానివని గణేశునికి చెప్పి తనకు సహకరించమన్నాడు. అప్పుడు గణేశుడు కూడా నా వ్రాత వేగమునకు దీటుగా నీవు చెప్పలేకపోతే వ్రాయుట చాలించి వెళ్లిపోతానన్నాడు. సరే అట్లయితే నా శ్లోకార్థమును తెలుసుకొని నీవు వ్రాయవలెనన్నాడు వ్యాసుడు. గణేశుడూ వల్లె యన్నాడు. ఈవిధముగా అక్కడక్కడ సంస్కృత భారతములో కొన్ని శ్లోక పాదములలో చూస్తాము. వీనిని వ్యాస ఘట్టములు అని అంటారు. అటువంటి ఒక వ్యాస ఘట్టమే ‘మాఘమాసే గవాం ఇవ’. మరి ఇందలి సామాన్యార్థము గూడార్థము చూద్దాము. ‘మాఘమాసే గవాం’ అంటే మాఘమాసపు వాతావరణము గోవులకు పట్టదు కాబట్టి ఆ మాసములో వాటి సంఖ్య బహుళముగా క్షీణించుతుంది. ఆవిధంగా ఆయన శరీరావయవాలు క్షీణించిపోతున్నాయి అని సామాన్యమగు అర్థములో చెప్పుకోనవలసి ఉంటుంది. ఇక గూఢార్థమేమిటో చూద్దాము. ఇప్పుడు ఆ సమాసములోని పదవిభజన మారుద్దాము. ‘మాఘమా+సేగవాం ఇవ’  
‘మాఘమ’ అంటే ఎండ్రకాయ అని అర్థము. సేగవాం అంటే సంతానము ఇవ అంటే వలె. ఈ విశేషార్థాన్ని విపులీకరించితే ప్రసవ కాలములో నరకములోని యాతనలన్నీ ఒక్కచోట చేరి ఒక్కరే అనుభవించవలసి వస్తే ఎంత దుర్భరముగా వుంటుందో కర్కాటకము పిల్లలను కనే సమయమున కూడా అట్లే ఉంటుంది. ఆ ఎండ్రి కడుపు చీలడము, పిల్లలు బయల్పడడము ఒకేసారి జరుగుతాయి. అంతటి హృదయవిదారకముగా ఉన్నదట అర్జనుని అలుగుల వల్ల భీష్మునికి కలిగే బాధ.  ఇంతటి చారిత్రిక వాస్తవాన్ని తెలుపుతుంది భీష్సముని జాతకము. సక్రమమగు కుండలికి తపోతత్పరుని వాక్కు కలిస్తే తప్పకుండా జాతకము చక్కటి ఫలితాలను తెలియజేస్తుంది. ఇపుడు జాతకములు చెప్పుట వ్యాపారమైపోయినది.
స్వస్తి.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              









ఈ నక్షత్రాలను చుక్కలుగా (Points) గా అనుకొంటే అవి ఈ ధనిష్ట మండలములో ఏ ఆకారములో వున్నాయి అంటే అవి ‘మద్దెల’ ఆకారములో ఉన్నవట.