ఉగాది (వికారి నామ సంవత్సరము)
ఈ క్రింది పద్యములు ఉగాది కొరకు నేను వ్రాసినవి.
ద్విజ కలరవము వాదిత్ర ధ్వానము గాగ
నికర పిక రవాల నెలవు గాగ
ఘన పుష్ప రజమేమొ గంధంపు పొడి గాగ
విరివి సత్ఫలశ్రేణి విందు గాగ
తుమ్మెద బారులు ధూమ మేఘము గాగ
అరుణ పుష్పోత్కర
మగ్ని గాగ
చూత శాఖములేమొ సూపార్థములు గాగ
స్రవ పుష్పరస మేమొ
సర్పి గాగ
సద్వన వధూమణికిని వసంతునకును
పాణి గ్రహణము జేయింప బయలుదేరె
చిలుక తత్తడి రౌతు
రాచిలుక పైన
కదిలె వనమంత కళ్యాణ ఘడియ జూడ
ద్విజ=
పక్షులు (రెండు మార్లు జన్మనెత్తునవి)
వాదిత్రములు=
వాద్యములు
నికరము
= శ్రేష్ఠము
ఘన
పుష్పరజము = గొప్పదియైన పుప్పొడి
విరివి
= మిక్కుటమైన , అతిశయించిన
ధూమ
మేఘము = దట్టమైన పొగ
అరుణ
పుష్పోత్కరము = ఎర్రనగు పూవుల రాశి
చూత
శాఖములు = మామిడి కాయలు ఆకు కూరలు
(ద్వంద్వ సమాసము)
సూపార్థము
= పప్పునకు వలసినవి
స్రవ
పుష్ప రసము = పూవులనుండి స్రవించు మధు వు
సర్పి
= నేయి
చిలుక
తత్తడి రౌతు = చిలుక వాహనము పై స్వారి చేయు వాడు
ఈ క్రింది
పద్యము వనాంతర సీమలో వసంతాన్ని తలపించుతుంది.
మాధుర్యంబుగ ఝుంకృతుల్ సలుపుచున్ మత్తెక్కి నర్తించెడిన్
రోధస్యంతము పిక్కటిల్ల వనినారోహించి
క్రొమ్మావులన్
తాదాత్మ్యమ్మున కోయిలల్ మధుర గీతాలాపముల్ చేసెడిన్
ఈ దిగువ మన తెలుగు భాష కు కలిగిన దుస్థితికి విలపించుతూ నా బాధను రెండు పద్యముల రూపములో వికారి సంవత్సర ఉగాదినుద్దేశించుతూ వెలిబుచ్చుకొనుచున్నాను.
ఈ దిగువ మన తెలుగు భాష కు కలిగిన దుస్థితికి విలపించుతూ నా బాధను రెండు పద్యముల రూపములో వికారి సంవత్సర ఉగాదినుద్దేశించుతూ వెలిబుచ్చుకొనుచున్నాను.
ఎల్లలు లేని నా, నుడిని ఏర్పడ వాడుక భాష పేరుతో
వెల్లువయై జెలంగుటకు వీలును గల్గగనీక హద్దులన్
కొల్లలు గాగ నేర్పరచి కోరిన రీతిని కావ్యసంపదల్
చల్లగ కుళ్ళ జూచు దొర సాముల గాంచు వికారి ఏహ్యతన్
భారతమాయె భారముగ భాషను వాడుక భాష జేయగా
దారము లేని మాలగ విదారక మయ్యెను కావ్య పుష్పముల్
సార సమస్త సంగ్రహము సాంతము గల్గినయట్టి పొత్తముల్
చేరువయయ్యెలే చెదకు చేవను గూర్చ వికారి చూడగన్
స్వస్తి
అంటే శుభము సుఖము సంతోషము సంపద సామరస్యము అన్నీ కలిగి యుండుట. అందుకే ప్రతి పూజ
పునస్కారములోనూ ఈ స్వస్తివాచనము అన్నది చోటుచేసుకొంటుంది. ఆ మంత్రములోని ఈ శ్లోకము
ఏమి చేబుతూవున్నదో చూద్దాము.
స్వస్తి
ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ
మహీం మహీశాం
గో
బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం లొకాస్సమస్తా
స్సుఖినోభవంతు
ఇది
ఉగాది నాడు తప్పక మనన చేసుకొనవలసిన శ్లోకము. న్యాయము ధర్మము సత్యము శాంతి దాంతి
వంటి సత్వ గుణ సంపన్నులైన మన ఋషులు ప్రతి వత్సరము శుభము సుఖము ను కాంక్షించిన
వారు.
మరి
ఈ శ్లోకములో గో బ్రాహ్మణ జాతులు సుఖముగా వుంటే చాలని కదా చెప్పుచున్నాయి మిగత
వారిని గూర్చిన ఊసు ఎత్తలేదు కాబట్టి వారందరూ ఏమయినా ఫరవాలేదా! అన్నది అందరికీ
వచ్చే అనుమానము. ఒక శ్లోకము రెండు చిన్న పంక్తులు కలిగియుంటాయి. వాటి
భావమును పదముల మాధ్యమముతో గ్రహించరాదు. అందు గల గూడార్థమును మనము గ్రహించ వలసి
యున్నది. ప్రజలు కలకాలము చల్లగా పాలింపబడవలెను. న్యాయ మార్గములో రాజులు భూమిని ఏల
వలెను . గోవులకు బ్రాహ్మణులకు శుభము సర్వదా సమకూరవలెను. సమస్త లోకములు సుఖముగా
ఉండవలెను.
అన్నీ
బాగున్నాయి. మరి అన్నీ బాగుంటే ఆలోచనెందుకు అంటే గోవులకు బ్రాహ్మణులకు ఈ శ్లోకములో ప్రత్యేకముగా పెద్ద పీట వేసినారు.
పోనీ గోవులు సుఖముగా వుండవలసినదే! వానిని తల్లితో పోల్చినారు కాబట్టి. మరి
బ్రాహ్మణులు ఎందుకు. ఎందుకంటే గొ సంతతి బాగుంటే యజ్ఞ యాగాది క్రతువులకు తమ నుండి
వలసిన ప్రతి వస్తువును అవి పుష్కలముగా
ఇవ్వగలవు. ఎప్పుడు అవి పుష్కలముగా ఉంటాయో యజ్ఞయాగాదులు నిరాఘాటముగా కొనసాగుతాయి.
వానిని నిరాఘాటముగా కొనసాగించేటందుకు బ్రాహ్మణ సంతతి అవసరము. అందువల్ల
యజ్ఞయాగాదులు నిరాఘాటముగా వారు జరిపితే సకాల వర్షములు కురుస్తాయి. సకాల వర్షములు
కురిస్తే పంటలు బాగా పండుతాయి. పంటలు బాగా
పండితే ప్రజలు సుఖిస్తారు. వారు సుఖిస్తే సకల లోకం సుఖముగా వుంటుంది. అంతా తమతమ
నిత్య విధులను కర్మలను, సక్రమముగా నిర్వహించుతూ వుంటే సమస్త లోకములూ చల్లగా వుంటాయి. మరి ఇందులు
బ్రాహణ శబ్దముండుటలో అనర్థమేమి వుంది. ఈ శాంతి పాఠము ఇక్కడ ఆగలేదు . ఈ శ్లోకములు
వినండి.
కాలే
వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ l
దేశోయం
క్షోభ రహితో బ్రాహ్మణా స్సంతు నిర్భయాః ll
ఇందులో
ఏమి చెప్పబడినదో గమనించండి. సకాలమునకు వర్షములు కురవాలి. ఈ భూమి కలకాలమూ ధనధాన్య
సంవృద్ధ యై వుండాలి. దేశము క్షోభరహితమై వుండాలి. అంటే యజ్ఞ యాగాది క్రతువులను
సక్రమముగా నిర్వహించుతూవుంటే దేశము క్షోభరహితముగా వుంటుంది. సత్వ
గుణసంపన్నులై బ్రతికినంతకాలము తమ
అనుష్ఠానములతో లోక కల్యాణమును అంటే సకల ప్రజల హితమును కాంక్షించే బ్రాహ్మణులు నిర్భయముగా సంచరింతురు గాక!
ఇంకొక
విషయమును గమనించండి.
అగ్నిహోత్రం
గావాలంబం సన్యాసం పలపైత్రుకంI
దేవేరాచ్చ
సుతోత్పత్తిః కలౌ పంచ వివర్జయేత్II
కలియుగములో
అగ్నిహోత్రము, (కొందరు అశ్వమేధం అనిగూడా అంటారు) గోమాంసము, సన్యాసము,
తద్దినములందు మాంస వినియోగము, కట్టుకొన్న
భార్యకు సంతాన లేమి ( అంటే దత్తత గానీ ఆమె అనుమతిపై వేరొక స్త్రీని వివాహము
చేసుకోనుటగానీ చేయవచ్చును అని శాస్త్రము.)కలియుగములో పాటింప నవసరములేదు. కానీ, మనము చేయనవసరము లేకున్నా, నేటికీ విశ్వ శ్రేయస్సుకై నిస్వార్థ బుద్ధితో
ఎన్నో యజ్ఞాలు చేసే పీఠాధిపతులు, హిమాలయ యోగులు, ఋషులు ఇప్పటికీ ఉన్నారు. వారి
ఉనికి మరియు సకల జీవ శ్రేయోచింతన ఈ లోకమును ప్రగతివైపు నడిపించుచున్నది అన్నది
సత్యము.
అదే
శాంతిపాఠము లోని ఈ రెండు శ్లోకములు గూడా చూద్దాము.
అపుత్రా:
పుత్రిణస్సంతు, పుత్రిణస్సంతు పౌత్రిణ: |
అధనా
స్సధనాస్సంతు జీవంతు శరదాం శతమ్ ||
ఇక్కడ
బ్రాహ్మణుల ప్రస్తాపనే లేదు. సంతు లేని వారికి సంతానము కలుగు గాక! వారికి తిరిగీ
సంతు కలుగు గాక! అంటే నిరాఘాతముగా సంతానాభివృద్ధియగుచునే యుండుగాక. నిర్భాగ్యులకు
సౌభాగ్యము చేకూరు గాక! నూరు సంవత్సరములు సుఖముగా శుభముగా జీవింతురు గాక! ఈ చివరి
శ్లోకము చూడండి:
సర్వేపిః
సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః l
సర్వే
భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్ ll
అందరూ
సుఖముగా వుందురు గాక! ఎవ్వరికీ రోగ బాధలు లేకుండు గాక! అందరూ కలకాలము మంచిని
మాత్రమే చూచెదరు గాక! ఎవరికీ దుఃఖము అన్న అనుభూతి కూడా కలగకూడదు అనేది సనాతనధర్మం
యొక్క ఆశయం. అసలు సమస్త ప్రజలు సమస్త జీవ జంతువులు ‘శన్నో అస్తు ద్విపదే శం
చతుష్పదే’ సుఖముగా వుండవలె నన్నారు. అని
అన్నారు. ఇటువంటి విశ్వహిత మతము దుర్భిణి పెట్టి వెదకినా ప్రపంచములో వేరెక్కడా
దొరుకదు.
న్యాయము
ధర్మము సత్యము శాంతి దాంతి వంటి సత్వ గుణ సంపన్నులైన మన ఋషులు ప్రతి వత్సరము శుభము
సుఖము ను ఈ లోకము కొరకు కాంక్షించిన వారు. వారు ఏర్పరచిన 'యుగాది' రాను- రాను "ఉగాది" అయిన దంటారు. సృష్ట్యాదిని యుగాది అన్నారని అప్పటినుండి కాలమును అణిమ (మైక్రో)
మహిమ (మాక్రో) ల వరకు నిర్దుష్ఠము గా విభజించిన మహనీయులు వారు.
కానీ
ఇక్కడ ఒక చిన్న విషయము చెప్పు కొనవలసి వున్నది. ఉత్+గ+ఆది=ఉగాది. ఉత్ అంటె
నక్షత్రము. గ అంటె గమనము ఆది అంటె ఆరంభము. భూమి నుండి మనము చూచినప్పుడు
నక్షత్రములు భ్రమించుచున్నటులనే కనపడును. దీనినిఆంధ్రము లో లేక సంస్కృతములో ‘సాపేక్ష
గతి’ యని, అంగ్లములో relative motion అని అంటారు. కావున నక్షత్ర మరియు
గ్రహ చలనారంభమే ఉగాది అని తెలియనగును.
మిగిలినది రేపు ........
వేద
కాలములో సాపేక్ష సూర్య చలనమునకు అనుసంధించి, మధు (చైత్ర), మాధవ (వైశాఖ), శుక్ర (జ్యేష్ట), శుచి (ఆషాఢ), నభ (శ్రావణ), నభస్య (భాద్రపద), ఈశ (ఆశ్వయుజ), ఊర్జ (కార్తీక), సహ (మార్గశిర), సహస్య (పుష్య), తప (మాఘ), తపస్య (ఫాల్గుణ), అన్న పేర్లతో పిలచేవారు.
కాలానుక్రమణములో, మాసములను చంద్ర చలనమునకు అనుసంధించుట జరిగినది. అయినా ఇప్పటికీ
తమిళ మళయాళ వంగ మొదలగు దేశములలో సౌర సంవత్సరమునే పాటించుతారు. అందువల్ల వారికి
ఇంచుమించుగా ఏప్రిల్ 14 న వస్తుంది. అదే ఆంధ్ర, కర్నాటక, మారాఠ మొదలగు దేశములలో చాంద్రమానమును
పాటించుతారు. ఇది చైత్ర శుద్ధ పాడ్యమినాడు వస్తుంది.
ఉగాది
చైత్ర శుధ్ధ పాడ్యమి ఉదయంతో ప్రారంభమౌతుంది అని పైనే చెప్పుకొన్నాము. చంద్రుడు ఆ
నెలలోని పున్నమికి చిత్రా నక్షత్రమునకు దగ్గరౌతాడు కావున అది చైత్ర మాసమైంది.
అసలు
దీనికి ఇంకొక అన్వర్థము కూడా వున్నది. "ఛత్రస్యభావహ ఇతి చైత్రం" అంటారు.
అంటె ఏ కాలమైనా పనికి వచ్చే గొడుగు లాగా మనలను కాపాడుతుందని ఒక అర్థమైతే అన్ని
ఋతువులనూ
తన
గొడుగు కింద అంటే control లో వుంచుకొని ప్రజలకు వలయు విధంగా అందిస్తుందని కూడా అన్వయము.
మొదటి
నెల చైత్ర మైతే మొదటి సంవత్సరం 'ప్రభవ'.ప్రకర్షేణ ఇతి ప్రభవః అంటారు పెద్దలు. ప్రకర్ష అంటే 'మేలు' అని అర్థం. మన 60 సంవత్సరాల కాలమానం లో 'ప్రభవ' మొదటిదైతే 'అక్షయ'
చివరిది. క్షయము లేనిదే అక్షయము. అంటె ఈ మేలు కలకాలం తరిగి పోకుండా
కరిగి పోకుండా వుండాలని కోరుతున్నారు మన కాల వ్యవస్థ నిర్ణయించిన ఆ మహానుభావులు.
ఇది
తెలుసా: ఈ 60 సంవత్సరములకూ పేర్లున్నయి. ఇది వికారి నామ సంవత్సరము. ఈ
సంవత్సరములో పుట్టి తిరిగి 60 సంవత్సరముల
తరువాతి వచ్చే వికారి చూచిన వాళ్ళు షష్ట్యబ్ద పూర్తి జరుపుకుంటారు.
కాల
విభజన ఆధారంగా ఏర్పడిన పండుగ ఉగాది కనుక కాల ప్రమాణాన్ని పన్నెండు విభాగాలుగా చేసి
మనం అనుసరిస్తున్నాం. వీటినే నిమేషం, కళ, కాష్ట, ముహూర్తము, ఝాము, దినము,
వారము, పక్షము, మాసము,
ఋతువు, అయనము, సంవత్సరములుగా
ప్రాచీనులు పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల సముదాయాన్ని యుగంగా పేర్కొన్నారు.
యుగాల విభజనను పరిశీలిస్తే నవగ్రహాలు ప్రదక్షిణం చేసే కాలాన్ని పూర్ణ సంఖ్యగా
గణించి 432 కోట్ల సంవత్సరాలను ఒక కల్పముగా పేర్కొన్నారు. ఈ కల్పములో1000వ వంతును
ఒక మహా యుగ మన్నారు. మహాయుగాన్ని తిరిగి నాలుగు యుగాలుగా విభజించారు.
17, 28,000 సంవత్సరాల కాల
ప్రమాణాన్ని కృతయుగము గాను, 12, 96,000
సంవత్సరాల కాల ప్రమాణాన్ని త్రేతాయుగం గానూ, 8, 64,000 సంవత్సరాల కాల ప్రమాణాన్ని ద్వాపర యుగము గాను, 4,32,000 సంవత్సరాల కాల ప్రమాణాన్ని కలియుగము గానూ పేర్కొన్నారు. అలాగే 7o
మహాయుగాలను ఒక మన్వంతరంగా, 14 మన్వంతరాలను ఒక
కల్పకంగా పేర్కొన్నారు. ఇలా విభజించిన కాల ప్రమాణంలో ఒక కల్పము కాలం బ్రహ్మకు ఒక
పగలు గానూ, మరో కల్పము
రాత్రి కాలము గాను ఉంటాయని పురాణ
ప్రశస్తి. ఇలా పరిశీలిస్తే త్రేతాయుగం వైశాఖ శుద్ధ తదియ నాడు, కృతయుగం కార్తీక శుద్ధ నవమి నాడు, ద్వాపరయుగం వైశాఖ
శుద్ధ తదియ నాడు, కలియుగం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు
ప్రారంభమవుతాయి అన్నది విజ్ఞుల వాక్కు . కృతయుగంలో నాలుగు పాదాలలోనూ, త్రేతాయుగంలో మూడు పాదాలలోనూ, ద్వాపరయుగంలో రెండు
పాదాలలోనూ, కృతయుగంలో ఒక పాదంలోనూ ధర్మం నడుస్తుంది.
ముగింపు రేపు......
ఉగాది --- చివరి భాగము
కృష్ణ
యజుర్వేద తైత్తరీయ బ్రాహ్మణము పదవ ప్రకరణము పాఠములోని నాల్గవ అనువాకము
''యుగంభవేత్ వత్సర పంచకేన యుగాని తు ద్వాదశ వర్ష షష్ఠ్యాం'' అని చెబుతున్నది. దీని ప్రకారం ప్రభవాది మొదలైన 60 సంవత్సరాలలో ప్రతి ఐదు
సంవత్సరాలను ఒక యుగముగా పేర్కొంటే 12యుగాలు అవుతున్నాయి. అసలు సూర్యుడు చంద్రుడు మకర రాశి లో ప్రతి 5
సంవత్సరములకు ఒకసారి కలుస్తారు. కలయికను
యుగము అంటారు. అందువల్ల ఈ ప్రకారముగా 60
సంవత్సరముల
కాలములో
12 యుగములు వచ్చును. వేదాంగమైన జ్యోతిష్య భాష్యములో యుగంలోని సంవత్సరాలను
విశదీకరిస్తూ విద్యారణ్యుడు
''సంవత్సరోసి, పరివత్సరోసి, ఇడావత్సరోసి,
అనువత్సరోసి, ఇద్వత్సరోసి, '' అని భాష్యం
చెప్పినాడు.
అంటే
ప్రతి యుగంలోని ఐదు సంత్సరములను వరుసగా ''సంవత్సము, పరివత్సరము, ఇడావత్సరము, అనువత్సరము, ఇద్వత్సరము అనే పేర్లతో
పిలుస్తారు. ఐదు సంవత్సరాలు పూర్తి కాగానే తదుపరి యుగానికి సంబంధించి మొదటి
సంవత్సరం మళ్ళీ ప్రారంభమవుతుంది. అదేవిధముగా సూర్యుని చుట్టూ బృహస్పతి భ్రమణ కాలము
12 సంవత్సరములు అది ఒక యుగము అవుతుంది. అప్పుడు ఈ వర్ష సముచ్చయమునకు 5 యుగాలు
ఏర్పడుతాయి.
దానినే
పుష్కరము అంటారు. సూర్య చంద్ర బృహస్పతుల కలయిక 865 బృహస్పతి సంవత్సరములకు ఒకసారి జరుగుతుంది.
అట్టివి 5 గడిస్తే ఒక కల్పము అంటారు. మనము
శ్వేతవరాహకల్పము లోని ఏడవది అయిన వైవస్వత మన్వంతరంలోని 28వ మహాయుగము నందలి కలియుగ
ప్రథమ పాదములోని 5120 సంవత్సరములు గడిచినవి. ఇక మిగతా విషయములు ఉత్సాహము ఉంటే వికారి నామ
సంవత్సర పంచాంగము నుండి తెలుసుకొనగలరు
కావున ఆ విషయమును మీకే వదలి పెట్టినాను.
ఉగాది
పండుగ నాడు మనం సాంప్రదాయ సిద్ధమైన కొన్ని ఆచారాలను పాటించడం కూడా పరిపాటిగా
వస్తున్నది. అందులో ఒకటి వేప పువ్వు పచ్చడి సేవించడము. వేప పువ్వు పచ్చడి
సేవించడాన్ని 'నింబ కుసుమ భక్షణం'' అనే పేరుతో ''ధర్మసింధు'' వర్ణించింది.
''అబ్దాదౌ నింబ కుసుమం! శర్కరామ్ల ఘృతైర్యుతమ్
''భక్షితం పూర్యయామేతు! తద్వర్షం సౌఖ్య దాయకమ్''
అంటే
సంవత్సరారంభమున మొదటి ఝాము నందు వేప పువ్వు, పంచదార, చింతపండు, నెయ్యి తదితరాలను తీసుకుంటే ఆ సంవత్సరమంతా సౌఖ్యంగా ఉండును అని అర్థం. కొందరు
‘మధురామ్ల లవణ తిక్తకటు కషాయాః' అని అంటుంటారు. అంటే మధురం(తీపి,
బెల్లం), ఆమ్లం(పులుపు, కొత్త చింతపండు), లవణం(ఉప్పు), తిక్తం(చేదు, వేపపూవు), కటు(కారము, మిరియము), కషాయం(వగరు, లేత మామిడికాయ )
వాడుతారు.
కొన్ని
ప్రాంతాలలో ఈ పచ్చడి తయారి కొంత భిన్నంగా వున్నప్పటికీ, వేపపూవు తప్పనిసరిగా
వుంటుంది
ఈ
పచ్చడి తినడం వలన త్రి దోషములు (వాత, పిత్త, కఫములు) నశించి
శరీర తత్త్వములో మార్పు వస్తుంది.
శాస్త్రీయంగా
చూస్తే హేమంత రుతువులో శరీరంలో ఏర్పడిన కఫము వసంతంలో సూర్యుని వేడికి కరిగి శరీర
మంతటా వ్యాపించి రోగాలు కలిగించుతాయి. ఈ రకంగా ఏర్పడిన రోగాలలో మశూచి ఒకటి. ఇది
ఎక్కువగా వసంత రుతువులో వచ్చు వ్యాధి కాబట్టి దీనికి 'వసంత సంభవా' అనే పేరు కూడా వున్నది. శరీరానికి మేలు చేకూర్చి మశూచి రాకుండా చేసే శక్తి
వేపపువ్వుకు ఉండుట వలన ఈ ఋతువునందు వేప పువ్వు తినుట ఆచారమైంది. వాస్తవానికి వసంత
రుతువు పూర్తయ్యే వరకూ వేప పువ్వు తినాల్సి వుంది. కనీసం శ్రీరామనవమి వరకు తినాలి.
కాలక్రమమున ఈ ఆచారం అడుగంటి ఉగాది ఒక్కరోజునే అది సూర్యోదయం తరువాతనే వేపపువ్వు
పచ్చడి తీసుకుంటున్నారు. సూర్యోదయానికి ముందుగానే తలస్నాన మాచరించి వేపపువ్వు
పచ్చడి తినడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
పాపపు
పనులకు, భూత
ప్రేత పిశాచములకు ఆలవాలమౌ అర్ఢరాత్రి
సంబరాలు మానివేసి ,రాలిపోయే కాలములో క్రొత్త సంవత్సర వేడుకలు
చేసుకొనే హీన సాంప్రదాయానికి ఆనకట్ట కట్టి వసంతముతో మొదలయ్యే ఉగాదిని
జరుపుకుందాము.
ఈ
పద్యమును మనసు పెట్టి ఒకసారి చదవండి. భయపడకండి. నేను వ్రాసినది కాదు లెండి.
వన
నివహంబులెల్ల మృదువల్లుల, నా మృదువల్లులెల్ల లే
గొనల
దనర్చు, లేగొనలు
గుత్తుల, గుత్తులలో చిగుళ్ళు పెం
పొనరు
చిగుళ్ళు క్రొవ్విదుల, పొందగు క్రొవ్విరులెల్ల తేటులన్
మునుకొని
తేటులెల్ల నునుమ్రోతల నెంతయు నొప్పె నామనిన్
–మంచన కవి విరచిత కేయూరబాహు చరిత్రము
వసంతకాలము సమీపించినది. వసంతము రాకతో వనములలో వడలిన వల్లులు(తీగలు)
సౌకుమార్యమును
సంతరించుకొన్నాయి. ఆ మృదు వల్లులు లేత
కొసలను వేసినాయి.
ఆ
కొనలు నెమ్మదిగా చివుళ్ళను తొడిగినాయి, వాని నుండి మొగ్గలు వానినుండి
పూవులు,
వాని
చుట్టూ తుమ్మెదలు తమ బృందగాన సంగీత సంరంభముతో వసంతము శ్రావ్యంగానూ,
దృశ్యముగానూ, కూడా మనోహరంగా
తయారయింది.
బహుధా
ప్రశంసనీయమగు ఈ శిల్ప వైచిత్రితో
వసంతరుతువును ఒక
క్రమమగురీతిలో
మన కనులకు కట్టునట్లు నిలబెట్టిన ఈ పద్య శిల్పకారుడగు మంచన కవికి
మంచి
మనసుతో సాష్టాంగ సంయుక్తముగా నమస్కరించి స్వస్తి పలుకుతాను.
సర్వేజనాః
సుఖినోభవంతు.
స్వస్తి.
చాలా బాగుంది
ReplyDeleteచాలా విషయాలు వివరంగా ఉగాది గురించి వ్రాస్తున్నారు
పద్యాలు శ్లోకాలు బాగున్నాయి
ఒకటికి పదిసార్లు చదవవలసిన విషయం సార్ మీరు ప్రతి విషయం చాలా వివరంగా తెలిపినారు
ఉగాది గురించి చక్కగా వివరించి చెప్పినారు
ReplyDelete