నైమిశారణ్యమున సూత మహర్షి శౌనకాది మునులతో ఈ విధముగా చెప్పుటకారంభించినాడు
అని మనము ప్రతి పురాణ శ్రవణమున ప్రారంభమున వింటూవుంటాము. మొదట ఆ నైమిశారణ్యమును గూర్చి కాస్త తెలుసుకొందాము.
దివ్య విశ్రాంత తీర్థాడ్యే నైమిశారణ్య పట్టణే
పుండరీక లతా నాథో దేవరాజహ్వాయో హరిః
విమానం శ్రీహరిం ప్రాప్య ప్రాచీ వక్త్ర స్థితి ప్రియః
దేవర్షేంద్ర సుధర్మాక్షి ప్రత్యక్షః కలిజిన్నుతః
దేవ, ఋషీంద్రులచే కలిని జయించినవాడు, వాయు మూర్తిచే కీర్తింపబడు వాడు, ఆది మధ్యాంతరహితుడై,
పద్మలతానాథుడై, ప్రశాంతమైన దివ్య తీర్థ సన్నిభమైన
నైమిశారణ్య పట్టణంలో దేవతలందరకూ రాజుగా పేరుగాంచిన శ్రీహరి, విమానము అనగా రాజ సౌధము నందు స్థిరనివాసుడై ఉన్నాడు అన్నది
పురాణవచనము.
వేద వ్యాసుడు మహాభారతాన్ని రచించినది, వేదాలను, ఇతర
పురాణాలను తన శిష్యులకు బోధించినది కూడా ఈ ప్రదేశంలోనే. ఇక్కడ వ్యాసమహర్షి ఆశ్రమమె
కాకుండా, దధీచి ఆశ్రమముతో పాటు మరికొన్ని దేవాలయాలు కూడా
ఉన్నాయి. మహా భారత, రామాయణ, వాయు పురాణ,
వరాహపురాణములలో నైమిశారణ్య ప్రస్తావన ఉంది. శ్రీరాముడు అశ్వమేధ యాగమును
చేసినది ఇక్కడే, లవకుశులను కలుసుకున్నది కూడా ఇక్కడే. సీతా
దేవి పేరుతో రాముడు బ్రాహ్మణులకు దానం చేసిన ప్రాంతమే సీతాపూర్ అని చెప్పుకుంటారు.
శివపురాణంలోనూ నైమిశారణ్య ప్రస్తావన ఉంది. అప్పటి పాంచాల, కోసల
రాజ్యాల మధ్య నైమిశారణ్యము ఉండేది అని చారిత్రికులు చెబుతారు.
ఇక్కడికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిశ్రిక్ అనే ప్రాంతంలో దధీచి
కుండం ఉంది. ఇంద్రుని కోరిక మీద వృత్రాసురుని వధించుటకు దధీచి మహర్షి ఈ కుండంలో స్నానం
చేసి తన ఎముకలను వజ్రాయుధముగా మలచి ఇంద్రునికి సమర్పించినాడని స్థలపురాణము.
వాయు పురాణాన్ని అనుసరించి దీనికి సంబంధించిన ఒక కథ ప్రాచుర్యంలో
ఉంది. మహాభారత యుద్ధ అనంతరం కలియుగ ఆరంభ సమయంలో శౌనకాది మహామునులు కలియుగ ప్రభావం
లేని పవిత్ర ప్రదేశాన్ని యజ్ఞ నిర్వహణ కోసం చూపించమని బ్రహ్మను ప్రార్థిస్తారు. బ్రహ్మ
ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి, ఈ చక్రం వెంట కదిలి వెళ్లండి, ఈ మనోమయ చక్రం ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశం చాలా పవిత్రమైంది,
యజ్ఞార్హత కలిగినది అని వివరిస్తాడు. ఆ చక్రం ఆగి, విరిగిపడిపోయిన ప్రదేశంలో ఉధృత రూపంలో జలం ఉద్భవించి, అది లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది. దాన్ని మహాశక్తి ఆపేస్తుంది. ఆ
పవిత్ర ప్రాంతం శక్తిపీఠంగా రూపొంది, లింగధారిణి శక్తి
రూపంలో లలితా దేవి ఆలయంగా పేరుగాంచింది. అదిశంకరులు ఇక్కడి లలితా దేవిని దర్శించి
లలితా పంచకాన్ని రచించినట్టు చెబుతారు. చక్రము ఆగిన ప్రదేశం చక్ర తీర్థము. నిమి
అంటే చక్రమునకు వెలుపలి వైపునకు వేయబడిన ఇనుప కవచము. అరణ్యము అంటే అడవి అని మనకు
తెలిసినదే! చక్ర కవచము విరడిపడిన అరణ్యము
కాబట్టి ఇది నైమిశారణ్యమైనది. వరాహ పురాణం ప్రకారం విష్ణువు అసురులను సంహరించిన
ప్రాంతమిది. నిమేష కాలములో అంటే 3 లవములు
అంటే 3 x 0.4 సెకనులు = 1.2 సెకనుల కాలములో అసురులను
మట్టుపెట్టిన ప్రాంతముగా చెప్పబడింది. అందుకే ఇది
నైమిశారణ్యమయ్యింది అని కూడా అంటారు.
ఇక సూతుని గూర్చి తెలుసుకొందాము.
నైమిశారణ్యంలో పురాణేతిహాసాల కథకునిగా కీర్తిగన్న సూత పౌరాణికునికి
భారతీయ సంస్కృతిలో అవిస్మరణీయమైన స్థానం ఉన్నప్పటికీ, ఆయనను
గూర్చి తెలిసిన వారు తక్కువ. ఆయన అసలు పేరు రోమహర్షణుడు. సంస్కృతములో ‘రలయోరభేదః’ అంటారు.
అందువల్ల ఆయనను లోమహర్షణుడని కూడా అంటారు. రోమహర్షణుడంటే వెంట్రుకలు నిక్కబొడుచుకొనేంత
ఉత్కంఠతను కలిగిస్తూ శ్రోతలను ఆనందింప జేసేవాడు అని అర్థము. ఆయన కథాకథన కౌశలము అంత
గొప్పది.
“లోమాని హర్షయాంచక్రే శ్రోతౄణాం యత్ సుభాషితైః
కర్మణా ప్రథిత స్తేన లోకేస్మిన్ లోమహర్షణః.”
అని వాయు పురాణ వచనం.
కృష్ణద్వైపాయనుడు అనగా వ్యాస మహర్షి పురాణములను నేర్పుతుంటే తనువు
పులకరించినందువల్ల కూడా ఈయనకు రోమహర్షణుడన్న పేరు కలిగిందనికూడా అంటారు.
“తస్య తే సర్వరోమాణి వచసా హర్షితాని యత్
ద్వైపాయన స్యానుభావా త్తతోఽభూద్రోమహర్షణః.”
అని స్కాంద పురాణం ఈ విషయాన్ని చెప్పింది.
నైమిశారణ్యంలో శౌనకాది మునులకు అగ్ని, కూర్మ,
గరుడ, బ్రాహ్మ, బ్రహ్మవైవర్త,
బ్రహ్మాండ,వామన, స్కాంద
పురాణాలను, శ్రీమద్భాగవతాన్ని, శ్రీ
దేవీ భాగవతాదులనన్నిటినీ బోధించినది సూతుడే! పురాణ ప్రవచానములో సూతుడు కడుంగడు
ప్రసిద్ధుడు . నైమిశారణ్యంలోనే ఈయన శౌనకాదులకు శ్రీ మహాభారతాన్ని వినిపించినాడు. మాఘ
పురాణములో రోమహర్షణుని కొడుకుగా ఈయనను చెప్పుట జరిగినది. అందువల్ల ఈయనకు రౌమహర్షణి
అని అంటారు. భారత కథానంతరం దాని పర్యంత భాగమైన హరివంశం కూడా ఈయన చెప్పినదే.
నిఘంటుపరముగా చూస్తే‘సూత శబ్దానికి రథచోదకుడని
ఒక అర్థము ఉన్నది. కర్ణుని పెంపుడు తండ్రి సూతుడే. చాతుర్వర్ణముల నడుమ
వర్ణసాంకర్యము కలుగుటచే పుట్టిన వారిని సూతులు అంటారు. వీరిని 11 విధములుగా
విభజించినారు.వారు:
కరణుడు (వైశ్యునికి శూద్రస్త్రీ యందు జన్మించినవాడు), అంబష్ఠుడు
(బ్రాహ్మణునికి వైశ్యస్త్రీ యందు జన్మించిన వాడు), ఉగ్రుడు
(క్షత్రియునికి శూద్రస్త్రీ యందు జన్మించిన వాడు), మాగధుడు
(వైశ్యునికి క్షత్రియస్త్రీ యందు జన్మించిన వాడు), మాహిష్యుడు
(క్షత్రియునికి వైశ్యస్త్రీ యందు జన్మించినవాడు), క్షత్త
(శూద్రునికి క్షత్రియస్త్రీ యందు జన్మించినవాడు), సూతుడు
(క్షత్రియునికి బ్రాహ్మణ స్త్రీ యందు జన్మించినవాడు), వైదేహకుడు
(వైశ్యునికి బ్రాహ్మణ స్త్రీ యందు జన్మించి నవాడు), రథకారుడు
(మాహిష్యునికి కరణ స్త్రీ యందు జన్మించినవాడు), పారశవుడు
(బ్రాహ్మణునికి శూద్ర స్త్రీ యందు జన్మించిన వాడు), చండాలుడు
(శూద్రునికి బ్రాహ్మణస్త్రీయందు జన్మించినవాడు). చండాల శబ్దము ఏ విధముగా
ప్రాచ్ర్యమునకు వచ్చినదో తెలిసినది కదా ఇప్పుడు. అసలు మత్స్యదేశపు రాజు విరాటుని
బావ కీచకుడు కూడా సూతుడే.
తగిన పరిమితులతో వేదాధ్యయనము యజ్ఞోపవీతధారులకు పరిమితమైన రోజులలో వేద విజ్ఞానానికి అనర్హులుగా
భావింపబడిన ప్రతిలోమ వివాహ సంజాతులైన వర్గములవారిని సంఘ బహిష్కృతులను చేసినారు.
ఇక్కడ ఒక మాట చెప్పవలసి వస్తుంది. శూద్రులలోకూడా సాలె, శేట్టిబలిజ, భట్రాజు
ఆదిగాగల వర్ణములవారు యజ్ఞోపవీతధారులు. కాలాంతరములో వారు విసర్జించినారు. ఈ మాట
శూద్రులను పూర్వము చిన్న చూపు సూసేవారు అన్న అభిప్రాయము కలిగినవారికి కనువిప్పుగా చెప్పటము
జరిగినది. సూత పౌరాణికులు తమ కృషితో బ్రహ్మత్వమును పొంది విద్వత్తు మూలమున పురాణ
వక్తలుగా గుర్తింపును పొందినారని పెద్దలంటారు. జన్మతః బ్రాహ్మణులైన శౌనకాది మహా
మునులు పవిత్రమైన యాగ దీక్షామధ్యంలో ఈ సూత పౌరాణికుని నుండి విజ్ఞాన వివేకాలను
అభ్యసించటానికి వెనుకాడలేదు. ఆ ప్రకారం ఆలోచించి చూస్తే శౌనకుడు తన కాలానికంటె
ఎంతో ముందుచూపు కల సమచిత్తు డని, కులాల పట్టింపులు అంతగా లేనివాడని తోచక
మానదు. అంతే కాదు. శూద్రులకు విద్యాధికారం లేదని, కులబాహ్యులైనందు
వల్ల వారికి సంతానం లేనప్పుడు దత్తస్వీకారానికి సైతం అధికారం లేదని, ఎందుకంటే దత్తస్వీకారం సమయంలో పఠించే స్మార్త మంత్రాలను వారు వినకూడ దని,
ఆ స్వీకార మంత్రాలను వారి యెదుట ఉచ్చరింపకూడ దని ఆ రోజుల్లో ఉండిన
విశ్వాసాన్ని త్రోసిరాజని శౌనకుడు తన శౌనక స్మృతిలో వారికి ఆ అధికారాన్ని అంగీక
రించినాడు. శూద్రుడు కూడా బ్రాహ్మణుని పౌరోహిత్యానికి కుదుర్చుకొని దత్తస్వీకారం చేసుకోవచ్చునని
అనుమతించినాడు. నైమిశారణ్యంలో భగవత్కథలను వింటూ సమచిత్తాన్ని, స్థితప్రజ్ఞతను అలవరచుకొన్న శౌనకుడు ఆ విధంగా భారతీయ సంస్కృతిలో పెక్కుమార్పులకు
ఆద్యుడైనాడని భావించటంలో ఎటువంటి తప్పూలేదు.
నైమిశారణ్యంలో ఋషులు తనను పెద్దల ముందు పెద్దను చేసి
గౌరవించినప్పటికీ, ఆనాటి జనారణ్యం ప్రభావం వల్ల కాబోలును, సూత పౌరాణికుని వినయమును ఒకసారి గమనించండి. ఋషులు తనను భగవన్మహిమను వర్ణించి చెప్పమని
అడిగినప్పుడు బృహన్నారదీయంలో స్వయంగా సూతుడు ఈవిధముగా అంటాడు:
ఆ విషయము రేపు చూద్దాము.....................
సూతపౌరాణికుడు - 2
“విలోమజోఽపి ధన్యోఽస్మి య న్మాం పృచ్చథ సత్తమాః” “నాబోటి విలోమజాతుడిని చెప్పమని అడిగినారే, ఓ మహాత్ములారా! నా జన్మ ధన్యమయింది”. తర్వాతి కాలములో బ్రాహ్మణులు కూడా ఆయన పాండిత్యాని కి ముగ్ధులై ఆయన గోస్వామితను అంగీకరించి, ఆయనను ద్విజునిగానే పరిగణించినట్లు కనబడుట జరిగినట్లగుపడుతుంది. అందుకే
గర్గసంహితా కారుడు “సూతాః పౌరాణికాః ప్రోక్తాః” అని మెచ్చుకొన్నాడు. అగ్నిపురాణమైతే ఆయన విద్యావివేకాతిశయాన్ని మరీ మరీ
ప్రశంసించింది:
“పృషదాజ్యసముత్పన్నః సూతః పౌరాణికో ద్విజః
వక్తా వేదశాస్త్రాణాం త్రికాలానలధర్మవిత్”
– అని ఆయన వైదుష్యాన్ని తలకెత్తింది.
సంస్కృతంలో “పృషదాజ్యసముత్పన్నః” అంటే ఏమిటి? పృషత్ అంటే బ్రహ్మబిందువు. పృషదాజ్యమంటే యజ్ఞవేళ హవిస్సును మంత్రించేందుకు
ముంచే పవిత్రమైన నేయి. ఆ యజ్ఞగుండంలో పుట్టినవాడు పృషదాజ్యసముత్పన్నుడు. ఆ
పృషదాజ్యసముత్పన్నునికి సూతుడని ఎందుకు పేరువచ్చింది? అంటే, అందుకు మరియొక కథ ఈ విధముగా తెలియవస్తూ వుంది.
స్వాయంభువ మనువు కాలంలో జన్మించిన
చాక్షుష మనువుకు మనుమడైన అంగుని కొడుకు వేనరాజు. రాజ్యానికి వచ్చినతరువాత వేనుడు
వేదశాస్త్రాల పట్ల అవిధేయుడైనాడు. పాపములు చేయుట మొదలుపెట్టినాడు. మదాంధత తలను
దాటిన అతని అకృత్యాలను చూసి సహింపలేక మునులు దర్భలను దివ్యాస్త్రాలుగా మంత్రించి
అతని శరీరంలో నాటారు. అతను మరణించిన వెంటనే మృతకళేబరంలోని తొడ భాగాన్ని అరణిగా
(యజ్ఞంలో అగ్నిని మథించేందుకు వాడే కొయ్యసాధనం) చేసుకొని, ప్రాణోత్సర్గమంత్రములతో అతనిలోని పాపాలన్నిటినీ ఒక
ప్రాణమయతనువుగా బయటికి తీసి, దానిని అడవులకు పంపివేశారు. పాపాపనోదనము అంటే పాప
సంహారము, జరిగిన తరువాత
మునులు ఆ కళేబరంలోని కుడి భుజమును తిరిగీ మథించినారు. ఆ దక్షిణ భుజాస్తంభారణి నుంచి సత్త్వగుణోపేతుడు, ధర్మశీలుడు, అజేయ పరాక్రమశాలి అయిన పృథు చక్రవర్తి సద్యోయౌవనుడై
ఉద్భవించాడు. అతని పాలనలో ధరణి సస్యశ్యామలమయింది.
పాతకకృత్యాల మూలాన ప్రాభవాన్ని కోల్పోయిన లోకంలో
మళ్ళీ ధర్మతేజాన్ని వెలుగొందజేయాలని పృథు చక్రవర్తి పృథుపైతామహం అనే మహాయజ్ఞాన్ని
సంకల్పించాడు. సర్వసమర్థులైన ఋత్విజులను ఆహ్వానించి, తానే యజమానుడై వేదోక్తమంత్రాలతో శాస్త్రోదితక్రమాన యజ్ఞాన్ని అనుష్ఠించినాడు.
ఆ శుభతరుణాన క్రతుహోమంలో ఆహుతిగా సమర్పించిన మంత్రాల
మహిమ వల్ల యజ్ఞవేదిక నుంచి “సూత”, “మాగధ” నామాలతో శిశువులిద్దరు జన్మించారు. మునులు ఆ పసివాళ్ళ
చూడచక్కని రూపానికి, ప్రసన్నమైన తేజానికి, వీణ మీటినట్లున్న వారి కంఠస్వరానికి ముగ్ధులై, వారిని మనసారా ఆశీర్వదించారు. “విశ్వశ్రేయాన్ని కోరి పృథువు నిర్వహించిన మహాయజ్ఞంలో
ఆవిర్భవించే మహావకాశం మీకు కలిగింది. ఏతత్పుణ్యఫలంగా చిరంజీవులై వర్ధిల్లండి.
పృథువు యశోగానం చేసి ధన్యాత్ములై మెలగండి” అని దీవించినారు.
ఇది విష్ణుపురాణంలో పరాశరుడు మైత్రేయునికి చెప్పిన
ఉదంతము. వాయు పురాణంలో ఇదే కథ మరికొంత వివరంగా ఉన్నది. వేనపుత్రుడు పృథువు యజ్ఞం
చేస్తుండగా, అగ్నిగుండం నుంచి సూతుడు జన్మించినాడు. దేవతలకు రాజైనందువల్ల
ఇంద్రునికి హోమమంత్రాలలో “క్షత్త్రియు”డని సంకేతం. దేవగురువైన బృహస్పతికి “బ్రాహ్మణు”డని వ్యవహారం. యజ్ఞంలో హోత పొరపాటు వల్ల
హవిస్సులను సమర్పించేటప్పుడు బృహస్పతికి ఇస్తున్నదానిలో ఇంద్రునికై ఇవ్వవలసినది
కూడా కలిసిపోయింది. ఆ కలయిక వల్ల అగ్నిగుండం నుంచి మంత్రఫలంగా సంతానోదయం జరిగింది. “సూతి” నుంచి – అంటే, సోమరసాన్ని పిండే యజ్ఞవేదిక నుంచి జన్మించినందున ఆ
శిశువుకు “సూతు”డని పేరువచ్చింది. లింగానుశాసనంలో జరిగిన వర్ణవ్యత్యయాన్ని
పురస్కరించుకొనే క్షత్త్రియ – బ్రాహ్మణీ సంగమం వల్ల కలిగిన వర్ణసంకరమని వైదిక పరిభాషలో వ్యవహరించటం జరిగిందట.
“వైన్యస్య తు పృథో ర్యజ్ఞే వర్తమానే
మహాత్మనః
సుత్యాయా మభవ త్సూతః ప్రథమం వర్ణవైకృతమ్.
ఇన్ద్రేణ హవిషా తత్ర హతిః పృక్తం బృహస్పతేః
జుహావేన్ద్రాయ దైవేన తతః సూతో వ్యజాయత.
ప్రమాదాత్ తత్ర సఞ్జజ్ఞే ప్రాయశ్చిత్తం చ కర్మసు
శిష్యహవ్యేన యత్ పృక్త మభిభూతం గురో ర్హవిః
అధరోత్తరచారేణ జజ్ఞే త ద్వర్ణవైకృతః.”
అని వాయు పురాణము 62-వ అధ్యాయంలోని కథనము.
బ్రహ్మపురాణంలోని కథకూడా విష్ణుపురాణం వంటిదే. వాయుపురాణంలో చెప్పబడిన విశేషాలకు
తోడు అందులో మరికొన్ని వివరాలున్నాయి. ఋషులు సూత – మాగధులను పృథువు యశోగానం చెయ్యమని ఆదేశించినప్పుడు వారిద్దరూ
– సద్యోజాతులు కనుక – రాజును గురించి మాకేమీ తెలియదే, మేమేమని స్తోత్రం చెయ్యగలము? అని తమ అశక్తతను వెల్లడించారట. ఋషులు వారికి
వాక్శుద్ధిని ప్రసాదించి, ఆనాటినుండి వారు ఏమని స్తోత్రం చేస్తే పృథువు ఆ
మహాకార్యాన్ని నెరవేర్చగలడని వారికి సత్యవాణిని వరంగా ఇచ్చారట. అప్పుడు వారు చేసిన
యశోగానం పూర్తయిన తరువాత రాజు సంతోషించి మాగధుని మగధ దేశానికి, సూతుని అనూప దేశానికి పంపించాడని అందులో ఉన్నది:
తస్మిన్నేవ కాలే చ యజ్ఞే పైతామహే శుభే
సూతః సుత్యాం సముత్పన్నః సౌత్యేఽహని మహామతిః.
తస్మిన్నేవ మహాయజ్ఞే జజ్ఞే ప్రాజ్ఞోఽథ మాగధః
పృథో స్త వార్థం తౌ తత్ర సమాహూతౌ మహర్షిభిః.
తా వూచు రృషయః సర్వే స్తూయతా మేష పార్థివః
క్రమైతదనురూపం వా పాత్రం చైవ నరాధిపః.
తా వూచతు స్తదా సర్వాం స్తా నృషీన్ సూతమాగధౌ
ఆవాం దేవా నృషీంశ్చైవ ప్రీణయామః స్వకర్మభిః.
న చాస్య విద్మో వై కర్మ నామ వా లక్షణం యశః
స్తోత్రం యేనాస్య కుర్యావో రాజ్ఞ స్తేజస్వినో
ద్విజాః.
ఋషిభి స్తౌ నియుక్తౌ తు భవిష్యైః స్తూయతా మితి
యాని కర్మాణి కృతవాన్ పృథుః పశ్చా న్మహాయశాః.
తతః ప్రభృతి వై లోకే స్తవేషు మునిసత్తమాః
ఆశీర్వాదాః ప్రయుజ్యన్తే సూత మాగధ వన్దిభిః.
తయోః స్తవాన్తే సుప్రీతః పృథుః ప్రదాత్ ప్రజేశ్వరః
అనూపదేశం సూతాయ మగధాం మాగధాయ చ.”
అని బ్రహ్మపురాణంలోని 4-వ అధ్యాయంలో ఉన్నది. అనూప దేశం అంటే
నేటి నర్మదా నదీతీర ప్రాంతం. ఆ పక్షాన సూతుడు నర్మదాతీరనివాసి అని; పురాణప్రవచనార్థమో, యాగసందర్శనకో అక్కడినుంచి నైమిశారణ్యానికి వస్తూ పోతూ ఉండేవాడని – ఊహించటము కూడా సబబే అవుతుంది. పద్మ పురాణం (2:36 అధ్యాయం, 5:1 అధ్యాయం) బ్రహ్మాండ పురాణం (2:36 అధ్యాయం) కూడా ఈ సూత జన్మవృత్తాంతాన్ని ఇదే విధంగా
ప్రస్తావించినాయి. వేదాధికారం లేని సూతునికి ఈ ప్రకారం అలౌకికావతారమూ, ద్విజత్వాంగీకారమూ సిద్ధించిన తర్వాత ఇతరసూతులతో ఈయన విడిపడినట్లున్నది.
అర్థశాస్త్రంలో కౌటిల్యుడు, “వైశ్యా న్మాగధౌ వైదేహకౌ.
క్షత్త్రియాత్ సూతః. పౌరాణిక స్త్వన్యః సూతో; మాగధశ్చ బ్రహ్మక్షత్త్రా ద్విశేషతః” (అర్థ. 3-7) అని పౌరాణిక సూతుడు క్షత్రియ – బ్రాహ్మణీ సుతుడైన సూతుడు కాడని ఒక విశేషనిర్ణయాన్ని
చెప్పటము జరిగింది. కూర్మ పురాణం మరొక్క అడుగు ముందుకువేసి, యజ్ఞకుండంలో ఆవిర్భవించిన సూతుడు స్వయంగా శ్రీ మహావిష్ణువే అని, ఆయన సర్వశాస్త్రకోవిదుడని, ధర్మవేత్త అని ప్రశంసించింది:
“నియోగాద్బ్రాహ్మణః సార్ధం దేవేన్ద్రేణ
మహౌజసా
వేనపుత్త్రస్య వితతే పురా పైతామహే మఖే.
సూతః పౌరాణికో యజ్ఞే మాయారూపః స్వయం హరిః
ప్రవక్తా సర్వశాస్త్రాణాం ధర్మజ్ఞో గురువత్సలః.”
అన్నది. నైమిశారణ్యంలోని మునులు కూర్మపురాణం
వినిపించమని సూతుని ప్రార్థించినపుడు “నీవు పురాణసంహితను చెప్పటానికి మనుష్యరూపంలో
దిగివచ్చిన సాక్షాత్పురుషోత్తముడివి” అనే అన్నారు.
త్వం హి స్వాయంభువే యజ్ఞే సుత్యాహే వితతే సతి
సంభూతః సంహితాం వక్తుం స్వాంశేన పురుషోత్తమః.
అని.
కథ చెప్పే వ్యక్తి గొప్పదనాన్ని బట్టి కథకు
ప్రామాణికత వస్తుందని వారికి తెలుసు. ఇంచుక సత్యమైన కల్పిత కథకు ప్రబంధము అని
అర్థము. కావున పాలు నీరు కలిసిన తీరయిన ప్రబంధమునుండి పాలను అనగా వాస్థవాలను
మనకందించిన మహనీయునికి మనసారా ఒకసారి నమస్కరిద్దాము.
స్వస్తి.