Friday, 18 October 2019
ఐకమత్య సూక్తమ్
Wednesday, 16 October 2019
ఆంధ్ర భాగవత వినీలాకాశము లోని కొన్ని నక్షత్రములు
పైరెండు పద్యముల సారము ఒకటే. చెట్టు పుట్ట గుట్ట మనము ఉండేఇల్లు, మన వాహనము, చూసే దూరదర్శనము (TV) ను కూడా పూజ్యమానముగా భావించుతాము. ఈ భావము భగవంతుని విశ్వవ్యాపకతను తెలుపుతుంది. దుష్టులుగా ముద్రపడిన అసురులగు హిరణ్యకశిప హిరణ్యాక్షులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్త్రులు ఆదిగాగల వారందరూ మహావిష్ణువుచే సంహరింపబడినవారే! కానీ వారు చేరింది వైకుంఠమే! కారణం శ్రీహరి యొక్క ప్రతిపనినీ, ద్వేషించినా, గమనించినారు, అనుక్షణమూ తలపోసినారు. ఆ తలపోతాయే వారిని విష్ణు సాయుజ్యమును చేర్చినది. నేటి సామాజిక సహజీవానములో ఈ పంథాను అవలంబించలేము. అందువల్ల 'నోరు నొవ్వంగ హరికీర్తి నుడువుటే' మన కర్తవ్యము. అసలు 'హరి' అన్నా 'హర' అన్నా ఒకటే! ఇరువురూ హరిన్చేవారే! ఏమి హరిన్చుతారు అంటే మన దోషములను, ఎప్పుడు హరించుతారు అంటే మనము వారిని నమ్మినపుడు. 'శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే' అనికదా శాస్త్రవచనము. ఈ విషయమును గమనించండి. విష్ణువు శయనించే శేషుడు శివుని కాలి కంకణము. శివుడు నేత్తికెత్తుకొన్న గంగ యొక్క పుట్టుక విష్ణు పాదములు. ఈ ఒక్క మాట చాలు వారిరువురు అభేదులు అనుటకు. మనకు కావలసినది, వారిరువురిలో ఎవరయినాకానీ, అచంచల భక్తి అకుంఠిత విశ్వాసము.
3. 8.75.
Ramachandra Rao Bhandaru: Ramamohana Rao Garu,
ఆంధ్ర భాగవత వినీల ఆకాశంలో నక్షత్రములు అను మీ వ్యాసాలను మళ్లీ చదివాను . ఎన్ని సార్లు చదివినా తనివి
తీరని ఆ భాగవత పద్యాలను , మీ సరళ మైన వ్యాఖ్యానం మళ్లీ చదివాను .ముఖ్యంగా గజేంద్ర మోక్షము మీద మీరు రాసిన వివరణ చాలా బాగుంది .
నన్నయ్య , తిక్కనలు భాగవతాన్ని రాసే
మహత్తర మైన అవకాశం తనకు మిగిల్చారు అని చెప్పుకోవడం పోతన గారి హృదయ విశాలము ను సూచిస్తుంది. ధన్యవాదములు .
మరొకమారు మరొక పద్యముతో .............................
7. 8-96-మ.
7.8.96.
మ. సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ
జీరఁడభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క
నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు
గజప్రాణావనోత్సాహియై.
భక్త సంరక్షణయే
లక్ష్యముగా గలిగిన విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు,
శంఖచక్రములను చేతులలో
ధరించలేదు, సేవకులను తనతో రమ్మనలేదు,
వాహనమయిన గరుత్మంతుని
అధిరోహించ తలువలేదు, చెవికుండలాల వరకు
జారిన జుట్టుముడిని
సరిచేసుకోలేదు. అంతెందుకు, ప్రణయ కలహములో పట్టిన
లక్ష్మీదేవి
పైటకొంగును కూడా వదలక పరుగిడసాగినాడు పరమాత్ముడు. ఆర్తికి
ఆర్త రక్షణకు
గజేంద్రుడు గోవిందుడు కొలమానములైనారు.
ఈ పద్యమునకు సంబంధించి
ఒక కథ ప్రాచుర్యములో ఉన్నది. శ్రీనాథుడు పోతన్నకు తన చేల్లెలునిచ్చిన బావగారు.
నేను నిజానిజాలు చర్చించ దలచలేదు. ఒకసారి ఆయన తన భార్యాపుత్రునితో చెల్లెలి
యింటికి వస్తాడు. ఆయన వచ్చుటకు కొన్నిరోజులనుండి భాగవతములో గజేంద్రమోక్ష ఘట్టమును
పోతన వ్రాస్తూవుండినారు. ‘అలవైకుంఠ పురంములో.....’పద్యమును ముందుకు నడిపించుటకు
తోచక అట్లే వదలి వెళితే ఆయన రూపములో వచ్చి ఆ పద్యమును పూరించి ఆ ఇల్లాలి చేతి వంట
తిని వెళుతాడు. పరమాత్మ వెడలిన మరుక్శనము ఇల్లుజేరిన పోతన అద్భుతమైన ఆపద్య పూరణ
చూసి ఎవరు పూరించినారు అని అడిగితే ‘మీరే కదా’ అని ఆ ఇల్లాలు చెప్పుటతో ఒక నిముసనమునకు
అప్రతిభుడైనా తేరుకొని వాస్తవమును అర్థము చేసుకొని ‘నాకు కనిపించకుండా పోయినావా’
అని విలపించుతాడు. ఆ పద్యము అంతటి మహత్తు కలిగియుండగా ఈ పద్యమును గూర్చిన కథ,
నిజానిజాలు ప్రక్కనబెట్టి, తెలియని వారి కొరకు తెలియజేస్తున్నాను.
భోజనము ముగిసిన పిమ్మట, శ్రీనాథుడు కుటుంబ సమీతముగా వచ్చుటకు కొంచెము ముందే పూర్తిచేసిన పై పద్యమును శ్రీనాథునికి చూపుతాడు. శ్రీనాథుడు అది చూసి చేత చక్రము గద కూడా లేకుండా పోయి ఏమిచేస్తాడు మహావిష్ణువు అని కొంత హేళనతో కూడిన స్వరములో అంటాడు. ఆ మాట విన్న పోతన కుమారుడు మల్లన పెరటిలోకి పోయి అక్కడ ఉన్న ఒక బండరాయిని నూతిలోకి బలంగా విసురుతాడు.
శబ్దము విని ఉలికి
పడిన ఇంటిలోని వారితో శ్రీనాథుని కొడుకు బావిలో పడినట్లు చెబుతాడు మల్లన. భుజము పై
ఉత్తరీయము కూడా లేదని చూచుకోకుండా శ్రీనాథుడు బావి వద్దకు పరుగు తీస్తాడు. అప్పుడు
మల్లన్న ‘మామగారు చూసినారా! మీ కుమారుడు పడినాడు అంటూనే వంటిపై వస్త్రము కూడా
లేకుండా పరుగెత్తినారే మరి బిడ్డలకన్నా మిన్నయైన భక్తులు ఆపదలో ఉంటే మరి ఆయుధాభరణములు
ధరించి నింపాదిగా వెళ్తాడా! అని నింపాదిగా అడిగినాడట. శ్రీనాథుడు పోతన ముందు తన తప్పు ఒప్పుకొన్నాడట.
ఈ కథలోని నిజానిజాలు
ప్రక్కన ఉంచితే ఆర్తత్రాణ పరాయణుడగు పరమాత్మ భక్తుని కాపాడుటకు సందేహము లేకుండా
ఆలస్యము కాకుండా వస్తాడు అన్నది మనము గ్రహించవలసిన విషయము. కానీ అది భక్తిలో
త్రికరణ శుద్ధి ఉన్న వ్యక్తికే సాధ్యము.
కావున చిత్తము మొత్తము
పురుషోత్తము పై నిలిపి ఆ ఆకలంకుని సేవించుదాము.
స్వస్తి.
మరొక సారి మరొక
పద్యముతో.........
8. 8-98-మ.
తనవెంటన్ సిరి; లచ్చివెంట
నవరోధవ్రాతమున్; దాని వె
న్కనుఁ బక్షీంద్రుఁడు; వాని పొంతను
ధనుఃకౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును; నారదుండు; ధ్వజినీకాంతుండు రా
వచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం
గలుగువా రాబాలగోపాలమున్.
అంత హటాత్తుగా
లక్ష్మీదేవి కొంగు కూడా వదలకుండా శ్రీమన్నారాయణుడు
బయలుదేరటంతో, ఆయన వెనుక లక్ష్మీ
దేవి, ఆమె వెనుక అంతఃపుర
స్త్రీలు,
వారి వెనుక గరుడుడు, ఆయన తోకూడా విల్లూ గదా
శంఖచక్రాలు
నారదుడు,సైన్యాధ్యక్షుడు( విష్వక్సేనుడు)
బయలుదేరగా, వారి వెంట వరసగా
వైకుంఠపురంలో ఉన్న
వాళ్ళందరు కూడా బయలుదేరినారు.
ద్రుశ్యమానము చేయు ఈ
పద్యము పోతన్న సృష్టించిన పరమాద్భుత
పద్యములలో
ప్రముఖమైనది. నడకలో భావంలో ఉత్తమ మయినది. ఇక్కడ
పోతన పద్యమును
నడిపించలేదు, పరుగులేత్తించినాడు. ఏమి జరుగుతూవుందో
అన్న అందోళన
మహావిష్ణువు పరిజనములందేగాక పాఠకులలో కూడా
ఉత్కంఠత
నెలకొల్పినాడు. ఆయుధములు కూడా ఆయన వెంట పరుగిడినవంటే
ఎంత నిబద్ధత కలిగియున్నాయో చూడండి. ఆయన భక్తులపై ఎంత నిబద్ధ్గత
కలిగియున్నాడో గమనించండి.
మనము జాగ్రత్తగా గమనించితే, భాగవత పద్యాల్లో చూస్తే.. ‘ఈశ్వరా’ అన్న
సంబోధనలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ ఈశ్వరుడంటే శివుడు కాదు, విష్ణువూ
కాదు. బ్రహ్మా కాదు. ఈ ముగ్గురికీ మూల పురుషుడైనట్టి పరబ్రహ్మ, పరంధాముడు,
పరమేశ్వరుడు. అండ పిండ బ్రహ్మాండాలకు అధిపతియైున అట్టి పరమేశ్వరుడు.
ఆత్మచైతన్యస్వరూపుడు అయిన భగవంతుణ్ని ప్రార్థించినాడు. మరి ' విష్ణువు
చక్రాయుధుడై వచ్చి కాపాడటమేమిటి' అంటే మనం భగవంతుణ్ని ‘ఫలానా
రూపంలో వచ్చి నన్ను కాపాడు’ అంటే అలాగే వస్తాడు. ఏ రూపమో ప్రత్యేకించి
చెప్పకపోతే.. స్థితికర్త, పాలన, పోషణ చూసే బాధ్యత కలవాడు కాబట్టి విష్ణువు
రూపములో ఆయన వచ్చినాడు.
ఇక్కడ ఆలోచించవలసిన విషయము ఒకటుంది. ఆ పరబ్రహ్మను 'అయ్యా! నీవు వచ్చి
నన్ను రక్షించు' అని అన్నాడు. ఆయుధాలతో దాసీ జనముతో, వాహనాలతో, లక్ష్మీ
దేవితో రమ్మనలేదు. ఆర్తిలో ఆ పరమాత్మునికి చ్వేరగల విన్నపము ఉంటె అదిచాలు.
భక్తునికి కావలసినవి అన్నీ తన తోడు తెస్తాడు. అందుకే గజేంద్రుడు కేవలం
భగవంతుణ్ని వచ్చి తన ప్రాణాలు కాపాడాల్సిందిగా కోరితే, ఆయన తన వెంబడి
లక్ష్మీదేవి, అంతఃపుర స్త్రీలు, గరుత్మంతుడు, విల్లు, గద మొదలైన ఆయుధాలు, ఆపై
వైకుంఠానికి విష్ణు దర్శనానికి వచ్చిన నారదుడు. ఈ విధముగా వైకుంఠములో
ఉండే అందరూ ఎందుకు వచ్చినట్లు? దీనికి ఒక అర్థము ఒక అన్వయము ఉంది.
మనం భగవద్దర్శనము చిత్తశుద్ధితో కోరితే చాలు, ఆ దర్శనముతోనే సిరిసంపదలన్నీ
వస్తాయి. దాసదాసీజనం సమకూరుతారు. వస్తువాహనాలు కొనగలిగే శక్తి
సమకూరుతుంది. మనల కాపాడుటకు, మనకు సహకరించుటకు, సర్వాయుధాలూ
వస్తాయి. అత్యున్నత అధికారులందరూ మనచుట్టూ తిరుగుతారన్నమాట.
ఈ రహస్యం తెలిసినవాడు కాబట్టే పోతన మహాకవి రాజుల చుట్టూ మంత్రుల
చుట్టూ తిరగడం మాని ఒక్క పరమాత్మును చుట్టూ మాత్రమే మనసును ప్రదక్షిణం
చేయిస్తూ భాగవతం రచించినాడు. అందుకే, శ్రీనాథునిలా కాకుండా, ఆయనకు
ఇహలోక జీవితములో వచ్చిన కష్టాలు కడగళ్ళనన్నింటినీ దాటుకొని, పరలోకంలో
మోక్షమును దక్కించుకొన్నాడు. కావున మనము ఈ రహస్యమును గ్రహించి
భగవంతుని యందు నమ్మకముంచి ఆత్మవిశ్వాసంతో మన పని మనము
నిర్వర్తించితే ఇహమూ పరమూ రెండూ దక్కుతాయి.
వేరోకమారు వేరొక
పద్యముతో......
9-8-103 (తేదీ. 10\09\20)
క. అడిగెద నని కడువడిఁ జను
నడిగినఁ దను మగుడ
నుడుగఁ డని నడ యుడుగున్
వెడవెడ సిడిముడి తడఁబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడు
గిడునెడలన్.
అప్పుడు
శ్రీమహాలక్ష్మీదేవి భర్తను అడుగుదామని వేగంగా అడుగులు వేస్తుంది.
అడిగితే మారు పలుకడేమో
అని వెనుకకు తగ్గుతుంది. కలబోసిన తొట్రుపాటు
చీకాకుతో అడుగు ముందుకు వేసేది. అంతలోనే అడుగును ఉపసంహరించుకొనేది.
ఈ పద్యము ఒక చమత్కారమయిన పద్యము. మొదట ఇది సర్వ లఘు కందము.
గణ భంగము కాకుండా 2,4 పాదాంతములందు ‘న’కారము చేర్చుట
తప్పించితే అన్నీ
లఘువులే. ఎందుకు అంటే మరి లక్ష్మీదేవి మనసు కిం కర్తవ్య
విమూఢత ముప్పిరిగొని వుంది. అందువల్ల అడుగు
లఘువుగా పడుతూవున్నది
కాబట్టి అన్నీ లఘువులే
ఆయన వాడినారేమో! ఇక తడబాటులో ప్రధానాక్షరము
‘డ’. అందువల్లనే నెమో
‘డ’ ను వృత్యనుప్రాసలో అలవోకగా అమర్చినాడు. శబ్ద
సౌందర్యమే కాకుండా ఈ
పద్యములో అపురూపమయిన భావ సంపద కూడా
జొప్పించిన ఘనుడు మన పోతన్న.
మరొక పద్యముతో మరొకమారు.........
10-8-114
క. మకర మొకటి రవిఁ జొచ్చెను;
మకరము మఱియొకటి ధనదు
మాటున డాఁగెన్;
మకరాలయమునఁ దిరిగెఁడు
మకరంబులు కూర్మరాజు
మఱువున కరిగెన్.
భావము:
మకరము అంటే మొసలి అన్నది మనకు తెలిసినదే! భూలోకంలో ఒక
మడుగులో ఉన్న
గజేంద్రుని హరించ
సిద్ధపడ్డ ఒక మకరమును విష్ణువు తన
చక్రముతో ఖండించుటచే
విశ్వవ్యాప్తముగా ఉన్న వివిధ మకరములు విపరీతమగు భయందోళనములకు
గురియైనాయట. కవి చమత్కారం యిది.
ద్వాదశరాశులలో ఉండే
మకరము (1మేషము 2వృషభము 3మిథునము
4కర్కాటకము 5సింహము
6కన్య 7తుల 8వృశ్చికము 9ధనుస్సు 10మకరము
11కుంభము 12మీనము
అనబడే ద్వాదశ రాశులలోని మకరము) సూర్యుని
చాటున నక్కింది.
నవనిధులలో ఉండే మకరము (1మహాపద్మము 2పద్మము
3శంఖము 4మకరము
5కచ్ఛపము 6ముకుందము 7కుందము 8నీలము
9వరము అనబడే నవనిధులు
కుబెరునివద్దఉన్నాయి.) కుబేరుని చాటున
దాక్కుంది. సముద్రంలో
ఉన్న మకరాలు అంటే మొసళ్ళు ఆదికూర్మం(విష్ణువు
ఆది కూర్మావతారుడు
కదా!) చాటునకు చెరుకొన్నాయి. ఇది కవి
చమత్కారమును
ప్రస్ఫుటము చేసే పద్యము.
ఉపసంహారము
శతభిషం - శత భిషజ -
శతతార
శతభిషము అన్న పదమునకు
బదులుగా ఈ శతతార అన్న అన్న మాటను విక్రమార్కుని నవరత్నములలో ఒకడగు వరరుచి
మొదటిసారిగా వాడినట్లు తెలియవస్తూవుంది. దానినే, అదే రాజాస్థానము లోని కాళిదాసు - 1, రఘువంశ, కుమారసంభవాది కావ్య నాటక రచయిత, 'మండలాభ శతతారక పురైః' అని తాతన కావ్యములయండు ఒకదానిలో వాడినాడు. ఫలానా కావ్యమన్నది నిర్దుష్ఠముగా నాకు జ్ఞాపకము లేదు.
శత అన్న పదము నూటికి
సంకేతమని మనకు తెలిసినదే! శతభిషము అంటే శతతార అంటే నూర్లకొద్దీ తారలను కలిగినది
అని అర్థము, నూరు తారలు మాత్రమె అనికాదు. మనపూర్వులు 27 నక్షత్రాలను గుర్తించి వానికి అశ్వని, భరణి, కృత్తిక మొదలగు 27 పేర్లను పెట్టినారు. ఖగోళ శాస్త్రములో వాణి వర్ణన
విస్తారముగా చేసినారు. అవి నిజానికి కొన్ని తారకల సమూహములు. దేని దేనిలో ఎన్నెన్ని వున్నాయన్నది వారే వాకృచ్చినారు. ఆవిధముగా
చెప్పబడినదే శతభిషము.
ఇక్కడ మనము ఒక విషయమును
గ్రహించవలసియుంటుంది. మనము మన పూర్వుల వ్రాతలకు కొన్ని కొన్ని అన్వయములను
చేసుకొంటున్నాము, ఎందుకని?
కారణమేమిటంటే పూర్వులు తరువాతి తరములవారు
సులభముగా గుర్తుంచుకొనుటకు గానూ తాము చెప్పదలచినది శ్లోకరూపములో వ్రాసినారు.
సాధారణముగా శ్లోకమునకు రెండు పాదములు. మరి తెలుపదలచిన భావమును స్థలాభావము లేకుండా
చెప్పుటకు మరియు పాఠకుడు సులభముగా గుర్తుంచుకొనుటకునూ ఈ విధముగా వ్రాయుట జరిగినది.
అందుకే ధారణ గలిగినవారు నేటికీ, మహా కావ్యములను కూడా కంఠస్థము చేసియుండుట మనము
చూస్తూనే ఉన్నాము. పై పెచ్చు శ్లోకము అంటే చందోబద్ధమై వుంటుంది. కావున అర్థము
చెడకుండా తగిన పదమును వారు ఆచితూచి వేస్తారు. కావున విశ్లేషణ తప్పదు. అసలు ఈ
విధముగా కంఠస్థము చేసుకొని ఉంచుకొనుట చేతనే వేదశాస్త్రపురాణాదులు భూమిపై నిలచినవి.
లేకుంటే అన్నీ అగ్నికి ఆహుతాయి ఉండేవి తురుష్క పాశ్చాత్య పాలనలలో!
తిరిగీ విషయమునకు వస్తే శతభిషము కుంభరాశికి చెందినది. దానికి
అధిపతి వరుణుడు. ఆతని వాహనము మకరము. ఎందుకంటే ఆకాశములో క్రింద మకర రాశి పైన
కుంభరాశి ఉంటుంది. రాసుల పేర్లు చెప్పేసమయమున మకరము తరువాతనే కదా కుంభము వస్తుంది.
ఈ కుంభరాశికి అధిపతి వరుణుడు. వరుణునికి క్రింద మకరము వున్నది కావున, వరుణుని వాహనము
మకరమైనది. ఒకవేళ అదే కుంభమునకు పైన వుండి వుంటే ధ్వజమై వుండేది.
ఈ 27 నక్షత్రములు సూర్య గతితో సంబంధమున్నవి. ఇవికాక అనంతమగు
నక్షత్రములు నింగిలో మనకు కనిపించుతాయి. అందులో దక్షిణార్ధగోళములో కనిపించే ఒక
నక్షత్రము అగస్త్య నక్షత్రము. ఇది మన భారతీయ ఋషులు ఆ నక్షత్రమునకు పెట్టుకొన్న
పేరు. దీనినే ఆంగ్లములో Canopus అంటారు. ఆవిధముగా దానికి దగ్గరగా కనిపించే ఇంకొక నక్షత్రము
‘ఇంద్రద్యుమ్న’ నక్షత్రము. ఇది చాలా పొడవైన నక్షత్రమని చెబుతారు. బహుశ ఆయన కీర్తి
అంతగా విస్తరించినది అన్న మాట అందుకే చెబుతారేమో! ఆంగ్లములో FOMALHAUT అని వ్రాస్తారు FOMALO అని పలుకుతారు. ఇక్కడ
మేరు పర్వతమందు ద్రోణము అంటే లోయలో వరుణుని వనము అందు తటాకము అందు ఆయన వాహనము
మొసలి వున్నది.
కృతయుగకాలంలో ఇంద్రద్యుమ్నుడు అనే చక్రవర్తి ఈ భూలోకాన్ని
ధర్మబధ్ధంగా పరిపాలిస్తూండేవాడు. ఎన్నో యజ్ఞకార్యాలు కూడా చేయడంతో అతను మరణించిన
పిదప స్వర్గము చేరినాడు. ఆయన స్వర్గంలో
సుఖభోగాలు అనుభవిస్తూ ఆనందిస్తూ ఎంతకాలం వుండినాడో అతనికే తెలియదు. ఒకరోజు
ఇంద్రద్యుమ్నుని వద్దకు దేవదూతలు వచ్చి, ‘నీవు చేసుకున్న పుణ్యఫలము ముగిసింది తిరిగీ భూలోకమునకు వేరొక జన్మతో వెళ్లవలయు’ నన్నారు.
‘మరి నేను ఇంకా కొంతకాలము ఇచట వుండే అవకాశము లేదా అన్నాడు’
ఇంద్రద్యుమ్నుడు. అప్పుడు
ఇంద్రుడు ‘నీవుచేసిన పుణ్యకార్యములవల్ల ఇంకా నీపేరు భూమిపై తలచుకొనబడుతూ వుంటే
నీకు ఇచట ఇంకా వుండే అవకాశము వుంటుంది’ అని అన్నాడు. ఇంద్రుని మాటకు వల్లెయని ఆయన
దేవదూతలతో భూలోకమునకు
బయలుదేరినాడు. తన తదనంతరము ఎన్నో మార్పులు వచ్చుటచేత ఇంద్రద్యుమ్నునకు భూలోకము
కొత్తగా కనిపించింది. తెలిసిన వారెవరూ కనిపించలేదు. భూలోకవాసులలో అతి వృద్ధుడగు
మార్కండేయునివద్దకువెళ్ళి తననుగూర్చి
అడిగితే ‘నేనపటికి పుట్టలేదేమో! అందుచే నాకు తెలియదు, నాకన్న వృద్ధుడు
‘ప్రావారకర్ణుడు’ అనే గుడ్లగూబను అడిగితే విషయము తెలియగలదు’ అన్నాడు మార్కండేయుడు.
అందరూ కలిసి ఆ గుడ్లగూబ వద్దకు వచ్చి అదే ప్రశ్న అడిగితే ‘మీరెవరో నాకు తెలియదుకానీ నాకన్న వృద్ధుడగు ‘నాళీకజంఘుడు’ అను కొంగను అడిగితే తెలుసుకొనే అవకాశము వున్నది’ అని
చెబుతూ అందరూ
కలిసి ఆ కొంగ దగ్గరకు బయలుదేరినారు. ఇంద్రద్యుమ్నుని అదే ప్రశ్నకు ‘నాకన్న
పెద్దయగు ‘ఆకూపారుడు’ అన్న తాబేలు కు తెలియవచ్చు,వెళ్లి అడుగుదాము రండి ’ అనుటచే అందరూ కలిసి నాడీజంఘుని వద్దకు వచ్చినారు.
యథాలాపముగా రాజు ‘నేనెవరో
తెలుసా’ అని అడిగినాడు అకూపారుని. అందుకు అకూపారుడు ‘మిమ్ము నేనెలా మర్చిపోగలను.
మీరు ఎన్నో యజ్ఞములు చేసి అపారమగు గోదానములు
ఇచ్చుటచే లక్షలసంఖ్యలో తోలుకోనిపోబడుచున్న ఆ ఆవుల కాలి గిట్టల తొక్కుడు చేత ఈ
కొలను ఏర్పడగా మాకిది వాసయోగ్యమైనది. ఎడతెగని నీటియూట గల్గిన ఈ హ్రదమునొదిలి
వేరేచోటికీ వెడలు అవసరము మాకు కలుగలేదు అందుకే ఈ కొలనుకు ‘ఇంద్రద్యుమ్నము’ అని మీ
పేరే పెట్టుకొన్నాము. నా సంతతి వారంతా ఈ కొలనులోనే ఇప్పటికీ నివసిస్తున్నారు’
అన్నాడు ఆకూపారుడు. దేవదూతలు ఆ సమాధానంతో తృప్తిచెంది. ఇంద్రద్యుమ్నుని తిరిగి
స్వర్గానికి తీసుకుని వెళ్లటంజరిగింది. ఆయన తన పుణ్య ఫలము తీరిన తరువాత భూమిపై పుట్టి
ప్రజారంజకముగా పాలన సాగించుచూ, ఎదో కారణమున అదే పర్వతమున తపము నాచారించు సమయమున వచ్చిన
అగస్త్యునికి సముచిత గౌరవము సేయలేకపోయినందున అగస్త్యుడు "మదముచే కన్నూమిన్ను
కానక వ్యవహరించినందుకు మదగజమువై పుట్టుము, నీ పరివారము కూడా ఏనుగులై నీతో ఉండుగాక!"" అని శపించుతాడు.
ఆ గజేంద్రుడే మన గజేంద్రమోక్షము లోని గజేంద్రుడు.
ఇపుడు ఈ కథకు మన నక్షత్రమండలమునకు గల పోలిక చూస్తాము. బేయర్ అన్న
పాశ్చాత్య శాస్త్రజ్ఞుడొకడు దక్షిణార్ధములోని అంటే మన దక్షిణాపథమునకు ఇంచుమించు
17౦౦ క్రీ.శ. లో వచ్చి ఆకాశమున కొంగను
బోలిన నక్షత్ర సముదాయమును జూసి దానికి Gruss అన్న పేరును
పెట్టినాడు. Gruss అంటే లాటిను భాషలో కొంగట. అట్లే అతను గుడ్ల గూబ ఆకారమును బోలిన
నక్షత్రతతిని జూచి Phoenix అన్న పేరు పెట్టినాడు. క్రీ.శ. 1752 లో Lokeyt అన్న పాశ్చాత్య
శాస్త్రజ్ఞుడు తాబేలు వంటి నక్షత్ర సముదాయమును మన దక్షిణ దేశమున గమనించి దానికి Sculptor అన్న పేరును
పెట్టినాడు. ఇపుడు కథలో వచ్చిన ముఖ్యమగు పేర్లతో నక్షత్రములున్నట్లు మనకు
పాశ్చాత్యులు చెప్పుటచే, వారు మనకు ఆరాధ్యులగుటచే, రూఢియైనది. కథ జరిగినదా లేదా అన్న తర్కమును వదలి పెద్దలు ఆకాశములో
కనిపించే వాస్తవాలతో చెప్పిన కథ మనము మరువము కదా!
భాగవత కథనము ప్రకారము ఈ మకరి బారిన పడి గజేంద్రుడు మోక్షము
పొందుతాడు. పైన తెలిపిన ఇంద్రద్యుమ్నుడు అగస్త్యుని శాపముచే మదించిన ఏనుగుల
రాజవుతాడు. పైన తెలిపిన అగస్త్య,ఇంద్రద్యుమ్న
శతభిష నక్షత్రములున్నపుడు అక్కడ ఈ మత్తగజ నక్షత్రము ఉన్నదేమో! లేక ఇంద్రద్యుమ్న
నక్షత్రమే ఆరూపమున ఉన్నదేమో! ఏనుగు శరీరము ఎక్కువ పొడవును కలిగియుంటుంది కదా! అదీ
అంతరిక్షములో గజేంద్రుని కథ. నాకయితే ఈ విషయము తారసిల్లలేదు. ఇంకా శాస్త్రజ్ఞులు
కనుగొనవలసి ఉందేమో!
స్వస్తి
భాగవతము-అష్టమస్కంధము-బలిచక్రవర్తి కథ
1-8-574
క. వ్యాప్తిం జెందక వగవక
ప్రాప్తంబగు లేశమైనఁ
బదివే లనుచుం
దృప్తిం జెందని
మనుజుఁడు
సప్తద్వీపముల నయినఁ
జక్కంబడునే?
తనకు ప్రాప్తించిన
లేశమయినా, విర్రవీగకుండా
విచారించకుండా ,
అదే పదివేలుగా భావించి
తృప్తి పొందవలెను. ఆవిధముగా
తృప్తిపడనివారికి
సప్తద్వీప సంపదలు వచ్చిచేరినా ఉపయోగము లేదు.
మానవుడు మొదట గ్రహించవలసినది తన శరీరము నశ్వరము లేక క్షణ
భంగురము అన్నది.
జనన మరణ చక్రవలయ నిలయం. ఆత్మ నిత్యము, సత్యము, శాశ్వతము,అనంతము, ఆనంద మయము. అనేకులు అజ్ఞానాంధకారానికిలోనై శరీరమే శాశ్వతమని భ్రమించి
అరిషడ్వర్గాలను ఆశ్రయించి అధోగతిపాలైపోతారు. కొంతమంది ఆధ్యాత్మిక శిఖరాల్ని
అధిరోహించి తత్మాన్వేషణతో ఆత్మను తెలుసుకొని ప్రయోజకులై సమాజాన్ని ఉద్ధరించి
జీవన్ముక్తులవుతారు.
కానీ నేటి కాలములో
చాలామంది పరతత్వము తమ ఎరుకలోనికి రాకుండానే దానిని బోధించే ప్రయత్నమూ చేస్తారు.
అందులోని నిజాయితీ వారికే తెలియవలెను. అసలు పరతత్వము అన్నది శుభ్రమగు మంచినీరు
అనుకొంటే, అనీతిని త్రుప్పు లేక చిలుము పట్టిన లోటాతో త్రాగము. నీరు త్రాగాలంటే
లోటా లోపల బయట శుభ్రముగా ఉండితీరవలసినదే! కావున ముందు దేహమును ‘స బాహ్య అభ్యంతర
శుచి’ అంటే లోపల బయట శుభ్రపరచుకోవలసిందే! జీవితమంతా పైమేరుగులకు ప్రాధాన్యత ఇచ్చిన
వ్యక్తి కారణాంతరములచే వైద్యా లయములో చేరినాడనుకొందాము. అంటే అంతశుద్ధి లేదనియే
కదా అర్థము. నేలరోజులకూ ఆస్పత్రిలో ఉంటే మేకప్పు అనే పైకప్పు మాయమౌతుంది. అప్పుడు
అడ్డమే అతనిని వెక్కిరిస్తుంది. అందువల్ల మనసు వాకు కర్మ ఎప్పటికీ పరిశుద్ధముగా
ఉండవలెను. అప్పుడు పరతత్వ సాధన చేసి పరమాత్మను సాధించవచ్చును. మానవడు మొదట
శుచిత్వము పొందవలెనంటే అలవికాని ఆశ, అసంతృప్తిని మొదట విడనాదవలసియుంటుంది. అతిగా
తింటే అజీర్ణమే, అజీర్ణమైతే అనర్థమే!
శ్రీ
మదాంధ్రమహాభారతంలో విధురుడు ధృతరాష్ట్రుడికి బోధించిన నీతుల్లో అసంతృప్తి గురించి
చెప్పాడు. అది అనేక చెడ్డ గుణాల్లో ఒకటని తెలుపుతూ
కోపము నుబ్బును గర్వము
నాపోవకునికి దురభిమానము ని
ర్వ్యాపారత్వముననునివి
కాపురుషగుణంబులండ్రు కౌరవనాధా! (ఉద్యోగపర్వము-ద్వితీయాశ్వాసములో
కలదు)
కోపము, పొగడ్తలకు
పొంగిపోవటము, అహంకారము, అపోవకునికి అన్న మాటను కాస్త విశధపరుస్తాను. ఆపోవుట ఆటే
తృప్తి చెందుట, ఆపోవక అంటే తృప్తి చెందక, ఉనికి అంటే ఉండుట. వెరసి జీవితమును
అసంతృప్తితో నడుపుట లేక గడుపుట,. అవసరము మీరిన అభిమానము, పనిపాట లేకుండా కాలము
గడుపుట అనునవి కుత్సితుల లక్షణములు. అత్యాశకు ధృతరాష్ట్రుడిని, దురాశకు దుర్యోధనుడిని
ఉదాహరణగా పోల్చుతారు విద్వాంసులు. అత్యాశ, దురాశల వల్లే కౌరవ వంశం నాశనమైంది. ఈ ప్రమాదాన్ని పసికట్టుతచే హెచ్చరించినాడు విదురుడు. దుర్యోధనుని మొండిపట్టు అసంతృప్తే అతన్ని ఆహవములో అంటే
యుద్ధములో, అంతము చేసినది. రావణుడు కూడా మొండిగా,
సీతను చెరబట్టి శ్రీరాముని కోదండముతో కూలిపోయాడు. అసంతృప్తికి దుర్యోధన రావణాసురులు
ప్రబలతార్కాణములు.
అందుకే
తృప్తి సుఖమయజీవితానికి కల్పవృక్షం, అది సమాజ అభ్యున్నతికి అమేయ ఆనంద లక్ష్యము. మానవులు అజ్ఞానాంధకారానికి
నిలయమైన అసంతృప్తిని అణగత్రొక్కి జ్ఞానామృతానికి నిలయమైన తృప్తిని ఔదలదాల్చి
విశ్వవికాసానికి తోడ్పడితే బాగుంటుంది అన్నది ఈ పద్యము యూక్క సారాంశము.
భారతము చెప్పినా
భాగవతము చెప్పినా మంచి ఒకటిగానే ఉంటుంది. చెప్పే మార్గములు వేరుకావచ్చు.
కానీ అత్యంత ఆచరణ
యోగ్యము.
పై భాగవత పద్యము ;’పిట్ట
కొంచెము కూత ఘనము’ అన్న నానుడికి అద్దము పడుతూవున్నది.
మరొక మారు మరొక
పద్యముతో.......
2-8-585
ఆ. వారిజాక్షులందు
వైవాహికము లందుఁ
బ్రాణవిత్తమానభంగమందుఁ
జకిత గోకులాగ్ర
జన్మరక్షణ మందు
బొంకవచ్చు నఘము పొందఁ
దధిప!
ఓ బలిచక్రవర్తీ!
స్తీలతో సంభాషించునపుడుగానీ , పెళ్ళిళ్ల విషయమునగానీ,
ప్రాణహాని కలుగు తరిన
గానీ, ధన, గౌరవ భగము
కలుగునపుడుగానీ,
భీతిచెందిన గోవులను, విప్రులను కాపాడే
తరుణమునగాని అబద్ధం చెప్పవచ్చు.
దాని వల్ల పాపం
కలుగదు. ఒక 45 సంవత్సరములకు పూర్వము ఈ
పద్యమును చెప్పి శుక్రుడు మనకు సాధికారికమగు అనుమతిని ఇచ్చినాడు అని
సరస సంభాషణా సమయములలో చెప్పుకొనేవారు.
ఈ పద్యమునకు ముందు
మరొక పద్యము ఉన్నది. అది విష్ణువును తూలనాడుతూ శుక్రాచార్యుడు చెప్పినది. దేవుని
తూలనాడినాడే అని ఆలోచించకుండా ఒక నిజమయిన గురువు తన శిష్యుడు ఆపదలో ఉన్నాడు అంటే
తాను ఎదురించబోయేది ఎవరు అన్న ఆలోచన లేకుండా తన వినేయుని అనగా శిష్యుని తనుస్త్రాణమై
ఎంతగా రక్షించుతాడో చూడండి. అద్సి గురుధర్మము అంటే! ద్రోణుడు కూడా ఉప్పుతిన్న
నేరానికి దుర్యోధనునికి తన ప్రాణములనే పణముగా పెడతాడు. గురువు అన్న మాటకు అంతటి
మహత్తరమైన అర్థము ఉన్నది.
ఇపుడు ఆ పద్యమును
తిలకించండి.
సర్వమయినచోట
సర్వధనంబులు
నడుగ లే దటంచు
ననృతమాడు
చెనటి పందనేమి చెప్పఁ
బ్రాణము తోడి
శవము వాఁడు; వాని జన్మ మేల?
ఏ దానము దాతయొక్క సంపద
అంతటికీ సమానమో, దానిని అడుగుతూ; నేను అడిగేది స్వల్పమే సమస్త సంపదలూ కాదు అని ఆ మాయామానుషరూపుడు అబద్ధమునే
చెప్పుచున్నాడు కదా! ఆ విధంగా చెప్పేవాడు నీచుడు, పిరికివాడు; వాడు ప్రాణమున్న పీనుగ; వాడి బ్రతుకు వ్యర్ధము అని ఇన్ని విధముల తూలనాడినాడు. అయినా ఆడిన మాటను
విడుచుట పాడికాదని, మాటకు కట్టుబడి మాట నిలుపుకొన్న మహా ఘనుడు బలిచక్రవర్తి. మన
పురాణములలో నాయకుడు సల్లక్షణములు కలిగియు సంచిత ప్రారబ్ధ కర్మల వశమున చేసిన పొరాబాటులకు
గానూ అనుభవించవలసిన శిక్షలను అనుభావించుతారు కానీ, వారి ప్రతినాయకులు పాపకులు లేక
దుషుస్తులగుతవల్లకాదు. మదము కామోన్మాదము చేత రావణుడు, మాత్సర్యము చేత దుర్యోధనుడు
అసువులు బాసినారు కానీ వారు ప్రక్జలకు తండ్రితో సమానమగు రాజులు. అందుకే వారు
ప్రతినాయకులు మాత్రమే! ఖల నాయకులు కాదు.
స్వస్తి.
మరొకమారు మరొక
పద్యముతో.........
కారేరాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ
సిరిమూటఁగట్టుకొని పోవంజాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం
బ్రీతిన్ యశః కాములై
యీరేకోర్కులు? వారలన్ మఱచిరే
యిక్కాలమున్? భార్గవా!
భర్గుని సూనుడైన
శుక్రాచార్యా! గతములో ఎందరో రాజులు ఉండినారు, వారికి
రాజ్యములూ ఉండినవి, వారికి వల్లమాలిన
అహంకారమూ వుండినది. కాని
వారిలో ఎవరైనా సిరి
సంపదలు మూటగట్టుకొని పోయినారా! ప్రపంచంలో
వారి నామరూపములు
ఏమయినా మిగిలినవా! కీర్తికాముకులైన శిబి
చక్రవర్తివంటి వారు
సంతోషముగా అడిగినవారి కోరికలు తీర్చి నేటికీ
లోకములో అమరులై
నిలచినారు కదా!
అంటూ వామనునికి
మూడడుగులు దాన మివ్వటానికి శుక్రుని అభ్యంతరాలు
తోసిపుచ్చుతున్నాడు ఆ
సత్యానువర్తి, దానవ స్ఫూర్తి, బలిచక్రవర్తి. ఈసందర్భాములో నేను వ్రాసిన ఈ పద్యము మీ ముందుంచుత అసందర్భము
కాదని తలచుతూ మీ ముందుంచుచున్నాను.
వాసనెపుడు గాలి వాటపు
నేస్తము
అరయ కీర్తిగంధ మటుల
కాక
అన్నిదిశల ప్రాకు అది
నీవు గమనించు
రామమోహనుక్తి రమ్య
సూక్తి
మనము ఇహలోకమును వదలినా
మన పేరు చిత్తశుద్ధితో మనము చేసే మంచిపనులవల్ల మన తదనంతరము కూడా నిలుస్తుంది.
శిబి, రంతిదేవుడు, కర్ణుడు మొదలగువారి పేరు చరిత్రలో శాశ్వతముగా నిలిచి పోయినది. అంతెందుకు దేశ స్వతంత్రము కొరకుశివాజీ
కుమారుడు శంభాజి మరియు హిందూ బ్రాహ్మణులకొరకు, దేశ రక్షణ కొరకు ఔరంగజేబును ఎదురించి,
అతనిచే మోసపూరితముగా పట్టుబడి ప్రాణములను తృణప్రాయముగానెంచి, అత్యంత దారుణ హింసకు
లోనై, సమర్పించిన తేగ్ బహదూర్ సింగులను ఇప్పటికీ
మనము ఆరాధించుచున్నాము కదా! కావున
మంచిపేరు ముఖ్యము కానీ కేవలము బ్రతుకుట కాదు. పేద పురుగు బ్రతుకు ఒక బ్రతుఎనా
ఆలోచించండి.
మరొకసారి మరొక
పద్యముతో.......
మ. నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు
ర్మరణంబైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ము పో;
హరుఁడైనన్, హరియైన, నీరజభవుం
డభ్యాగతుండైన నౌఁ;
దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా; ధీవర్య! వే యేటికిన్?
శుక్రుడు ఎంతగానో బలిచక్రవర్తికి నచ్చజెప్ప ప్రయత్నించినా బలి వాటన్నింటినీ త్రోసిరాజని,
ఈ విధముగా అంటాడు: నే బంధింప బడటం కాని, నాకు దుర్మరణం కలగటం కాని, నాకు నరకము దాపురించుట కాని, నా కులమే నాశనమగుట కాని, భూమండలము బద్దలగుట కాని, వస్తే రానీ; జరిగితే జరుగనీ; నేను మాత్రం అబద్దమాడ లేను. దానం పట్టడానికి వచ్చిన వాడు సాక్షాత్తు ఆ పరమ శివుడే అయినా, ఆ విష్ణుమూర్తే అయినా, ఆ బ్రహ్మదేవుడే అయినా సరే నా నాలుకకు ఆడిన మాట తప్పటం రాదు. ఓ సుధీవర్యా శుక్రాచార్య! వేయేల నా నిర్ణయము ఎన్నటికీ మారదు. మరి ఒక దానవుడు అంత నిశ్చయముతో కూడిన నిర్ణయము తీసుకొంటే మానవులమై కూడా అంతలో కొంతకు కొంతయినా తీసుకొన వలయును కదా!
ఒక్క మాటలో చెప్పవలసివస్తే, నరకము దాపురించినా సరే (నిరయంబైన), నన్ను
కట్టివేసినా సరే (నిబంధమైన), రాజ్యము సర్వ నాశనం అయిపోయినా సరే, దుర్మరణం
వచ్చినా సరే, కులాంతమైనా సరే, వచ్చినవాడు, హరిహరబ్రహ్మాదులలో ఎవ్వరయినా సరే,
వేయి మాటలేల, అభ్యాగతుడు ఆడిగిన తరువాత ఈ దానమును నేను ఇచ్చితీరుతాను.
ఈ పద్యమునకు కాస్త విశ్లేషణ జతచేసి తీరవలసినదే! శిష్య వాత్సల్యముతో
శుక్రాచార్యులవారు ఎన్నోవిధముల బలికి చెప్పిచూసినారు. అంతా అంధేందూదయమే
అయినది. అంతావిని ‘ఈ లోకమే తల్లక్రిందులయినా పాడి కాదు కావున ఆడిన మాట
తప్పను’ అని అంటూ తన ‘సాత్విక దాన వ్రతనియమమునకు అచంచల మనస్కుడై
కట్టుబడినాడు. సత్యవ్రతాభిలాషియై గురువు మాట వినుట తన గురుతరమైన బాధ్యత
అయివుండి కూడా త్రోసిరాజని, మిన్ను విరిగి మీదబడినా సరే, దానమిచ్చుటకే
కట్టుబడినాడు.
కుల గురువు కోపం ఏపాటిది? దుర్మరణమే వచ్చినా తాను మాట తప్పను అన్నాడు. ఆత్మార్థే
పృథ్వీం త్యజేత్’ అన్నది ఆర్య వాక్కు. ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకొందాము.ఈ పరిస్త్తే
మనకు వస్తే ఆయన వాలే అచంచాలముగా మాటపై నిలువగాలుగుతామా! విదేశీ సాహిత్యములలో ఇటువంటి ఉదంతములు మంకు దొరకవు. అందుకే ముందు మన భాష మన సంస్కృతి నేర్చుకొనుట ఎంతో అవసరము. ఇక్కడ ఒక చిన్న ఉదంతము కర్ణుని గూర్చి తెలియజేస్తాను.
దానం గొప్ప గుణం. త్యాగం సాటిలేని గుణం. చరిత్రలో కొంతమంది ఈ అత్యున్నత
లక్షణాలు కలిగిన వాళ్ళున్నారు. వాళ్ళని ప్రపంచమెప్పటికీ మరచిపోదు. అట్లాంటివాళ్ళలో కర్ణుడు ఒకడు. అందుకే అతన్ని దానకర్ణుడు అని అన్తోఉన్నది లోకము. ఎప్పుడు ఎవరు ఏమి అడిగినా తటపటాయింపు అన్నది లెకుండా ఇచ్చేవాడు కర్ణుడు. ఇవ్వడంలో ఔదార్యమే తప్ప అన్యథా ఆలోచనలకు తావివ్వనివాడు కర్ణుడు. ఇవ్వడంలో ఎంత ఆనందముందో ఇచ్చే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఇస్తే తమ దగ్గరవున్నదంతాపోయి తాము బికారులుగా మిగిలిపోతామేమో అని భయపడేవాళ్ళు ఎప్పుడూ ఇవ్వలేరు.
కానీ దానం చేసే వాణ్ణి దైవం చల్లగా చూస్తుంది. అతని ఆత్మ అపూర్వ ఆనంద
తరంగితమవుతుంది. అతను నిర్ధనుడయిపోయినా ఎప్పుడూ తను కోల్పోయినానను తపన
కలిగియుండడు. తనవల్ల ఒకరు బాగుపదినారన్న సంతృప్తిని
కలిగియుంటాడు..
కర్ణుని దానపరత్వమునకు నిర్ణీత సమయమంటూ ఏదీ లేదు. అవసరంవున్న వాళ్ళు ఏ
సమయంలో వచ్చినా ఆదుకునే అలవాటు కలిగినవాడు.
ఒకరోజు కర్ణుడు తల స్నానం చేయుటకు ఒక వజ్రాలు పొదిగిన గిన్నెలోనున్న నూనెతో తల
అంటుకొంటూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు అప్పుడే కర్ణుని ఇంటికి రావటము తటస్థించింది.
అక్కడున్న వజ్రాలగిన్నె కృష్ణుని కంట బడింది. కృష్ణుడు ఎప్పుడూ ఎదుటి వాళ్ళని
ఆటపట్టిద్దామనుకునే వాడు కదా! కర్ణుని పరిక్షిద్దామనుకున్నాడు. వెంటనే కర్ణునితో
“కర్ణా! నిన్ను ఒకటి కోరాలనుకుంటున్నాను” అన్నాడు. “కృష్ణా! నిరభ్యంతరంగా
అడుగు, అది ఒకవేళ నా ప్రాణమే అయినాసరే!” అన్నాను కర్ణుడు. కృష్ణుడు “ నీ ప్రాణము
నేను తీసుకొను, నాకు ఈ వజ్రాలు తాపిన నూనె గిన్నె ఇవ్వు. అది చాలును” అన్నాడు కృష్ణుడు.
“దానికేం భాగ్యం. తప్పక తీసుకో” అని కర్ణుడు తన ఎడమ చేతితో ఆ వజ్రాల గిన్నెను
కృష్ణుడికి అందించబోయినాడు, కుడిచేతిలో వున్న తైలంతో తలను అంటుకొంటూ
ఉండినాడు కాబట్టి. కృష్ణుడు “ఎడం చేతితో ఇవ్వడం మర్యాదకాదుగదా!” అన్నాడు.
అప్పుడు కర్ణుడు “కృష్ణా! నాకు ఎడంచేతితో నీకు ఇవ్వాలన్న అహంకారం లేదు. నేను
కుడిచేతితో తలపై తైలం రుద్దుకుంటున్నాను. అందుకని నువ్వు ఎడం చేతిలో వున్న గిన్నెను
తీసుకో, ఏమి చెప్పగలము గిన్నె చేయిమారేలోపు మనసుకూడా మారవచ్చు” అన్నాడు. నత్తి
నిస్వార్థ దాత్రుత్వామో చూడండి.
ఈ కథను కాస్త నాకు జరిగిన సంఘటనతో పోల్చి చెబుతాను.. దారిలో ఒక బిచ్చగాడు
కనిపించి ‘3రోజులనుండి తిండిలేదు. భోజనము
పెట్టించండి బాబు’ అని అడిగినాడు.
ఆర్తితో అతను అడిగిన వెంటనే, ఈ కాలపు పరిస్థితులకు ఒక 50 రూపాయలయినా
ఇవ్వనిదే అతనికి త్రుఫినిచ్చే భోజనము దొరుకదనిపించి, జేబులో చేయి పెట్టినాను. 50
రూపాయల కాగితముతోబాతూ 20 రూపాయల కాగితము కూడా బయటికి వచ్చినది.
వెంటనే ణా ఆలోచన గతి తప్పినది. నేను “అతనికి 20 రూపాయలు ఇస్తే మిగిలిన 30 తో
నేను అల్పాహారము తీసుకొనవచ్చును కదా!” అని. అంటే అతనికి 20 రూపాయలు
ఇచ్చినాను. ఇక్కడ బాహ్యముగా దానమైతే చేసినాను కానీ నిజానికిది ఆత్మవంచనతో కూడినది. ఇది పుణ్యకార్యముగా జమకట్ట వీలుకానిది. పరమాత్ముని అభిశంశ తప్పించితే ప్రశంశ దొరకదు. మరి ఇంత చిన్న విషయములోనే అంతపెద్ద మానసిక దౌర్బల్యము కలిగిననేను ఆసలు బలిచక్రవర్తి కథను వ్రాయుటకు, చదువుటకు కూడా అర్హుడను కాదేమో! మరి చక్రవరి అనా రాజులకు రాజులగు మహారాజులకు రాజు చక్రవర్తి అనబడుతాడు. అటువంటి వ్యక్తి తన సర్వస్వమును ధారపోయుతఎగాక తలపై కాలు కూడా పెట్టించుకొని పాతాళము చేరుచున్నాడు. ఎంతటి వదాన్యుడో చూడండి.
ఈ సందర్భములో వివేకానందుని సూక్తి ఆత్మ పరిశీలనకై మీ ముందుంచుచున్నాను. "నీవు
దానమిచ్చే సమయములో గ్రహీతకు కృతజ్ఞుడవై ఉండు. నీవు అతనికి ఎప్పుడో బాకీ ఉన్నట్లు
భావన చేసి దానము చేయి. చిత్తశుద్ధితో మనఃపూర్వకముగా చేసినదే సాత్వికదానము".
ఇంతకన్నా గొప్పమాట ఉండదు.
మిగతా రెండూ రాజసిక తామసిక దానములు. ఒకటి అహంకారమును కలిగియుంటే
మరొకటి అలసత్వము కలిగియుంటుంది. రెండూ నిరర్థకములే!
స్వస్తి.
మరొకమారు మరొక పద్యముతో.........
నంతై తోయదమండలాగ్రమున
కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై
ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం
డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై
పూర్వము ఈ పద్యమును ఏదో ఒక సందర్భంలో వాడని వారు, వినని వారు,
ఉండరనుకుంటాను. ఒక సామాన్యుడిగా బ్రతుకు ప్రారంభించి. అంచెలంచలుగా ఎదిగి
ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తిని గురించో From Scratch to Summit అని
ఆంగ్లములో), అలాగే ఒక చేతిపని తో మొదలై అది కుటీర పరిశ్రమయై ఆపై
లఘుపరిశ్రమ స్థాయినిజేరి, ఇంకా ఒక గొప్ప సంఘటిత వ్యవస్థగా క్రమక్రమాభివృద్ధి
గాన్చినదాని గూర్చి చెప్పునపుడో (రెంటికీ ఉదాహరణ అంబానీ, Reliance) ‘ఇంతింతై
వటుడింతయై’ అన్న పద్య ప్రథమ పాదమయినా చెప్పుట పరిపాటి. అంతగా ప్రజల
నాలుకల మీద నిలిచిపోయింది ఈ పద్యము. ఈ పద్యంలోని ప్రసన్నమైన శైలి చెప్పకనే
చెబుతుంది. ఇది బమ్మెర పోతన కవివరెంయుడు కాక వేరెవరు ఈ శైలిని
బడయగలరు. పాండితీ దురీణులగు ఉత్కృష్ట కవివరేణ్యులుకరుణశ్రీ వంటి వారికీ, నికృష్ట కవినగు నాకూ ఆయన ఆదర్శమే. ఆయన మానస సరోవరమైతే అందులోని హంస కరుణశ్రీ గారు. నేనందున ఒక కప్పను. వామనుడు త్రివిక్రముడై పెరిగిపోయే దృశ్యాన్ని అత్యంత సహజసుందరంగా వర్ణించిన పద్యం ఇది.
బలి చక్రవర్తి వద్ద నుంచి మూడడుగుల నేలను దానంగా పొంది, ఒక అడుగును
భూమిపై మోపి, రెండో అడుగుతో బ్రహ్మాండాన్ని ఆక్రమించుటకు ఎంతగా మహావిష్ణువు
ఉద్యమించినాడు అన్నది వర్ణించిన ఆయన తీరును వర్ణించుటకు నా మాటలు చాలవు.
క్రిందనుండి ఒక్కొక్క పదమును దాటుకుంటూ బ్రహ్మాండము వ్యాపించుటకు ఎంతగా
విజృంభించాడో, ఏ విశేషణాలూ లేకుండా, ఒక మహాద్భుత దృశ్యాన్ని కండ్ల ముందు
రూపు కట్టించినాడు పోతన. బహుశ ఆయన బలిచక్రవర్తి కథనము ఆనాడు కన్నులారా
చూసినాడేమో!
బలిచక్రవర్తి మూడడుగుల
మేర దానమును గ్రహించిన వామనుడు
ఇంతలింతలుగా
ఎదగనారంభించినాడు. మరికొంచెము పొడవయినాడు,
ఆవిధముగా ఎదుగుతూ
ఆకాశమునంటినాడు, మేఘాల పైకి
పెరిగిపోయినాడు;
పాలపుంత, చంద్రమండలం అన్నీ దాటినాడు, ధ్రువ నక్షత్రం కూడ
దాటినాడు,
ఏడు ఊర్ధ్వ లోకములలోని
నాల్గవ లోకమయిన మహర్లోకమును మించినాడు.
ఏడవ లోకమగు సత్యలోక
కన్నా పైకి చేరి మొత్తము బ్రహ్మాండభాడమును
ఆవరించి
వెలిగిపోతున్నాడు; త్రివిక్రమరూపము
చూచుటకు ఎన్ని జన్మల
పుణ్యము కావలెనో! ఎంత
తపస్సు చేసియుండవలేనో, ఎంత అచంచలమైన భక్తి కలిగియుండవలెనో కదా!
ఈ మహత్తేజమును భూమిమీదినుండి మునులూ, బలి చక్రవర్తీ, శుక్రుడూ నివ్వెరపోయి
చూస్తున్నారు. క్షణం పూర్వం కండ్లముందు నిలుచున్న బడుగు, బుడుగు బాలకుడు
క్రమక్రమముగా ఎదిగి భూనభోంతరాళములను నిండిపోవడాన్ని ఇంతకన్నా
అందంగా రూపు కట్టించడం అసాధ్యమనుకుంటాను. పద్యం పద పదానికీ విరుగుతూ,
వామనుడు పదపదానికీ పెరుగుతూ పోయే క్రమతను చూపించి రూపించిందీపద్యము.
ఇది ఒక గొప్ప దృశ్యాన్ని ప్రత్యక్ష ప్రసారము చేసిన ఘనత కవులకన్న పోతన్నది.
ఇంతేకాదు. ఈ పద్యం తరువాతనే మరో పద్యం ఉంది. క్రిందినుంచి వామనుడు
క్రమక్రమంగా పైకి పోయే కొద్దీ పైనున్న సూర్యబింబాన్ని ఈ పెరిగే పెద్దమనిషితో కలిపి
చూపిస్తూ ఆ రవిబింబపు దశల్లోని వివిధరూపాలని వర్ణించిన పద్యం అది. ఇంతకు
ముందు చూపిన దృశ్యాన్నే మరో కోణంలో చూపించడమన్నమాట. వామనుడు
పెరిగేకొద్దీ సూర్యబింబం ఎలా ఉందంటే, ముందు ఒక గొడుగు లాగా అతని తలపై
కనిపించి, క్రమంగా శిరోరత్నం గానూ, చెవి కమ్మగానూ, నగగానూ, బంగారు
జాజుబందీ లాగానూ, కరకంకణం లాగానూ, నడుముకు కట్టిన మొలతాటి బంగారు
గంట గానూ, పాదాల అందె గానూ ఆఖరుకు పాదపీఠం గానూ ఉపమించడానికి
యోగ్యంగా కనిపించిందట. ఆ పద్యం కూడా
చిత్తగించండి.
రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై
శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై
ఛవి మత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై
నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండ
మున్నిండుచోన్
మహానుభావుడు పోతన. కథ పాటికి కథ నడిచిపోతున్నా, భగవంతుని లీలలను
వర్ణించే ఘట్టం వచ్చేసరికి పోతనకి ఒళ్ళు తెలియనంత తాదాత్మ్యం ఆవహిస్తుంది. ఆ తాదాత్మ్యంలో వ్రాసే పద్యాలు ఒక మహాభక్తుని ఆంతరంగము యొక్క పరవశ నర్తనను కంటిముండు సాక్షాత్కారిమజేస్తుంది. మహద్భక్తి భావ గర్భితంబయిన భాగవతము మన తెలుగన్న పోతన్న చేతికి చేరుకొన్నదంటే అది మనము చేసుకొన్న అదృష్టము కన్న మిన్న కాదని ఎన్నెన్నో విధములుగా అన్నట్లున్నది. తెలుగును ఇంకా ఇంకా దిగజార్చి పోతన ఎవరు అన్న స్థితికి దిగమన భాషను ఉద్ధరిద్దాం. కవికిరీటులను కాపాడుకొందాం.
స్స్వస్తి.
ఈసారి భాగవతము –దశమస్కంధము-కృష్ణలీల-నరకాసుర
వధ నుండి కొన్ని పద్యములతో మీ
ముందుకు వస్తాను.