Tuesday, 1 October 2019

శంకరాచార్యుల వారి శ్రీలలితా అనుభవము


శంకరాచార్యుల వారి శ్రీలలితా అనుభవము

శంకరులు కాశీలో ఉన్న కాలములో కేదారేశ్వర ఘట్టములో ఉండేవాడట. ఇప్పుడు ఆది గతములో మణికర్ణిక ఘట్టమని పిలువబడే పురాతన మణికర్ణికా ఘట్టమునకు దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు భక్తులు విరివిగా వెళ్ళే మణికర్ణికా ఘట్టము కొత్తది.
సౌందర్య లహరి వ్రాయుటకు ఎన్ని కథలు కారణాలు చెప్పుకొంటారు. అందులో ఇదీ ఒకటి. నిజానిజాల మాట ఎటులున్నా, మనకు ఆదర్శప్రాయులైన శంకరులవారి అచంచల భక్తిని, ఆత్మానుభావమును కొట్టిపారవేయలేము.
ఒకసారి పైన తెలిపిన కేదారేశ్వర ఘట్టమునుండి శంకరులవారు ప్రదోష కాలమున విశాలాక్షీ విశ్వేశ్వర దర్శనమునకు బయలుదేరినారట. దర్శనము ముగించుకొని వచ్చులోపల చీకటి పడినది. నాడు దారులు ఇప్పటి వలె కాదు. దీపకాంతి లేదు. స్వామీ ఆస అటవీ మార్గమున వస్తూ, కనిపించక, ఊబిలో చిక్కుకొనుట జరిగినదట. ఎవరూ కనిపించలేదు. శరీరము ఊబిలోనికి క్రున్గిపోతూ వుంది. అప్పుడు ఒక పండుముసలి అయిన స్త్రీ ఆయన కంటికి అగుపించింది.
అప్పుడు ఆయన ఆమె తన మాట వినగలిగిన దూరమునకు వచ్చినవెంటనే ‘అమ్మా! ఊబిలో కూరుకు పోతున్నాను, నాకు శక్తిలేదు కాస్త సాయము చెయ్యి’ అని అడిగినాడట. అప్పుడు ఆమె ‘శక్తిలేకనే చైతన్యవంతమైన జగతిని చూడగాలుగుసున్నావా! శక్తిలేకనే బయట పాడుటకు ప్రయుఅత్నించుచున్నావా’ అని ప్రశ్నించింది. మహనీయుడైన ఆ తపస్వి కనులు మూసుకొని యోగమున, ఆ ముసలమ్మను, ఆమె అన్న మాటలను ఒకసారి గమనించినాడు. ఆయన మనోనేత్రము తెరుచుకొన్నది. ఆమె ఎవశ్రు అన్నది తెలుసుకొన్నాడు. వెంటనే ఆయన కంఠము నుండి ఈ క్రింది శ్లోకము జాలువారినది. దీనిని సౌందర్య లహరిలో ఏడవ శ్లోకముగా చూడగలము.
క్వణః కాంచీ దామా కరికలభ కుంభఃస్తననతా
పరిక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదనా
ధనుర్బాణానుపాశం సృణిన విదధానా కరతలైః
పురస్తాదాస్తాం నః పురమధిపురాహో పురుషికాll

ఆమె వఢ్యాణమునాకున్న గజ్జలు గలగలా శబ్దములు చేస్తూ వున్నాయి. ఆ తల్లి స్తనములు
ఏనుగు కుభాస్తలమును బోలి ఉన్నాయి. (పూర్వపు మహనీయులకు, స్త్రీ దేవతల విశేషాంగముల వర్ణించునపుడు ఆయా దేవతలను తమ తమ తల్లులకన్నా మిన్నగా ఊహించుకొని ప్రార్థించినారు తప్పించి నేటి కాలము వలె వయోభేదమును పాటించక కామ దృష్టితో స్త్రీలను, దేవతా స్వరూపములను, దర్శించేవారు కారు.), ఆమె అతి సన్నని నడుముతో అలరారుచున్నది. పరిణత శరశ్చంద్ర వదనా అంటే, చంద్రుడు పూర్ణిమ చంద్రుడైతేనే అంటే పూర్ణ చంద్రుడైతేనే పరిణత చంద్రుడౌతాడు. అమ్మవారి ముఖబింబము పూర్ణచంద్రునివోలె దేదీప్యమానముగా ప్రకాశించుచున్నది. ధనుర్బాణాంకుశములతో ఆ తల్లి హస్తములు అలరారు చున్నవి. మణిమయ మకుట ధారిణియైన ఆమె పురుషికా అంటే పౌరుషము శక్తి ఇత్యాది పురుష గుణములు కలిగియున్నట్లు కనిపిస్తూ వున్నది.
ఊబిలో పడిన వ్యక్తి వెంటనే, గుంతలో నీళ్ళు పోసినట్లు తక్షణం లోపలికి వెళ్ళిపోడు.  జగద్గురువులు ఊబిలో పడుతూనే, ఆయనకు కనబడిన, నిలబడిన అమ్మవారి స్వరూపము కటి నుండి కనిపించసాగింది. అందుచేత శ్లోకములోని వర్ణన ఆక్కడినుండి మొదలయ్యి కొద్దికొద్దిగా ముఖము వరకూ వ్యాపించింది. ఈవిధమగు తార్కిక దృష్టి తో చూస్తె మనము కథలుగా వినే విషయములు వాస్తవములనిపించక మానవు. తల్లి ప్రసన్న మానసయై శంకరులవారిని ఊబినుండి బయల్వేడలజేసిందట. అటుపిమ్మట ఆయన ఆశ్రమము చేరి సౌందర్య లహరిలో ఆ శ్లోకమును చేర్చి,  మిగతా శ్లోకములను వ్రాసి పూర్తిచేసినాడన్న  ఒక ప్రచారము విశేషముగా ఉన్నది.
స్వస్తి.

No comments:

Post a Comment