3 0
స్వస్తి.
https://cherukuramamohanrao.blogspot.com/2019/11/blog-post_18.html
శీర్షిక
పేరు చూస్తూనే ఇది మాకు తెలిసిందేలే! ఏముంది దీనిలో చదివేది అని పాఠకులు తలచుట
ఎంతో సహజము. తెలిసినది కాకుండా వేరేమయినా యున్నదా అన్న జిజ్ఞాసతో నైనా చదువండి.
భారతము ఇతిహాసము (History)
అని మన పూర్వులు ముద్ర వేసి చెప్పినా, మనము విశ్వసించే పాశ్చాత్యులు ఆ విషయమును
తేటతెల్లము చేసేవరకూ మనము ససేమిరా నమ్మలేదు. మనవారు రామాయణ భారతములను 'ఇతిహాసములు అనే కదా మన తండ్రి తాత ముత్తాతలు అన్నారు. మన సంస్కారము,
మన గ్రంధములు, మన సంస్కృతము, మన సంస్కృతి, మన ఐకమత్యము అన్న విషయములను ఇకనైనా
పరిగణన లోకి తీసుకోకుంటే ఈ దేశము పరమతములకు ప్పజెప్పినట్లే!
భారతేతిహాసములో
ధర్మజ ,
భీష్మ, కృష్ణ దుర్యోధన, విదుర
వంటి విభిన్న పాత్రల నియమ నిష్ఠలను మనమెంతో ఆకళింపు చేసుకొనవలసినది ఉంది. నేను పై
శీర్షిక కల్గిన ఈ వ్యాసములో బ్ర.శ్రీ. రేమేళ్ల అవధానులవారి సహకారముతో, భీష్ముని జన్మ కుండలిని తీసుకొని కొంత విశ్లేషణ చేయుట జరిగినది. నా
వ్యాసములో నేను వాడిన రెండు బింబములు (Images) నా తమ్ముడు
మండెం కృష్ణ మూర్తి తన ఉద్యోగము నుండి అలసివచ్చి కూడా రాత్రి 11.30, 12గం. లకు నేను చేతి వ్రాతగా పంపిన కుండలిని చక్కగా తయారుచేసి పంపినాడు.
తాను నా ధన్యవాదములు కోరడు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే నేను వ్రాసే ఒక
వ్యాసానికి, ఫలాపేక్ష లేకుండా, నాపై
గౌరవముతో ఉన్న వారిని కూడా ఉపయోగించుకొని కొన్ని వ్యాసములు తయారు చేయవలసివస్తుంది.
మ్నారి ఇంతటి సహృదయుల సహాయ సహకారముతో ప్రచురించే అపురూపమయిన వ్యాసములు పాఠకులుగా
మీరు చదువక పోతే నా శ్రమ 'బూడిదలో పోసిన పన్నీరే!'
అసలు
ఇటువంటివి చదివి మన పూర్వుల ప్రతిభ, మన చరిత్ర గుర్తించుటకుగానూ,చదువుట అన్నది మన ప్రాథమిక కర్తవ్యము. కొంతమంది మిడి మిడి జ్ఞానముతో మన
వేద శాస్త్ర పురాణేతిహాసాలను దుయ్యబడుతూ ఏవేవో వ్రాస్తూవుంటారు. ఆ వ్రాతలకు
ప్రాధాన్యతనిచ్చేవారు కొందరైతే పట్టించుకోని వారు కొందరు. కానీ మన దేశములోని పరమతస్తులు తమ తమ
మతగ్రంధములను తాము దుయ్యబట్టక పోగా, అట్లు ఎవరయినా
మాట్లాడితే తలలు తెంచుతారు.
అంత
దాష్టికమునకు మనము పాలుబదనవసరము లేదు. అసలు మన పురాణేతిహాస శాస్త్ర గ్రంధములు
ఏమిచేబ్యుతున్నాయో కాస్త శ్రద్ధబూని చదువుదాము.
మన
సనాతన ధర్మము పగలు రాత్రి లేకుండా ప్రకాశించే దివ్యమణి. దానిని కాపాడుకొనుట మన
పని.
విద్య-ఆచార్యుడు-ఆచారము.
https://cherukuramamohanrao.blogspot.com/2019/11/blog-post.html
‘విద్’ అన్న ధాతువునకు స్థూలముగా అర్థము జ్ఞానము
అని అన్వయించుకోవచ్చు. విద్య అంటే విజ్ఞానము. విద్య
నేర్చుకోవటమంటే, ఈనాటి అర్థములో, విజ్ఞానాన్ని(పూర్వులు
విజ్ఞానమును బ్రహ్మత్వముగా నిర్వచించినారు) సంపాదించుట. ఒకసారి ఈ
శ్లోకమును చూడండి.
విద్యాదదాతి వినయమ్
వినయాద్యాతి పాత్రతామ్l
పాత్రత్వాత్ ధనమాప్నోతి
ధనాద్ధర్మం తతస్సుఖమ్ll
అని విద్యాప్రయోజనాలను
ఏనాడో వివరించినారు భర్తృహరి తన సుభాషిత గ్రంథములోని నీతి శతకములో. పై విషయాన్నే
ఏనుగు లక్ష్మణ కవి తానాంధ్రీకారించిన భర్తృహరి సుభాషితములలో
విద్య యొసగును వినయంబు
వినయమునను
బడయు పాత్రత; పాత్రత వలని ధనము
ధనము వలనను ధర్మంబు; దానివలన
నైహికాముష్మిక సుఖంబు
లందు నరుడు
అని అన్నాడు.
అనగా విద్య వలన వినయము, ఆ వినయము వలన పాత్రత
(యోగ్యత), దానివలన ధనము, ధనము ధర్మాచరణమునకు మాత్రమే ఉపయోగించవలెను.
ఆ ధర్మమే ఇహపర సుఖసాధానము.
వినయానికి ప్రథమ శత్రువు
అహంకారమనిఅంటారు శ్రీరామకృష్ణ పరమహంస. ఆయన తన కథామృతంలో అహంకారం యొక్క
స్వరూపమేమిటోఈ విధముగా తెలుపుతాడు. మిణుగురు పురుగు సూర్యుడు అస్తమించిన వెంటనే
ప్రపంచం అంతా చీకటి ఆవరించినప్పుడు, ప్రపంచానికంతటికీ తానే వెలుగునిస్తున్నానని
భావిస్తుంది. ఇంతలో నక్షత్రాలు ప్రకాశిస్తాయి. అవి ప్రకాశిస్తూ, ప్రపంచం అంతా తామే
వెలుగునిస్తున్నామని అనుకుంటాయి. అంతలో చంద్రుడు వచ్చి, తన కాంతి వల్లే భూమి
వెలుగుతోంది అనుకుంటాడు. సూర్యోదయం కాగానే ఇవ్వన్నీ కనుమరుగవుతాయి. ఇలా ఒకదాన్ని
మించి మరొకటి ఉంటాయని తెలియక, మిడి మిడి జ్ఞానంతో తామే గొప్పవాళ్ళమని
అహంకారులు మిడిసిపడుతుంటారు. కానీ నిరంతరమూ ఏదో ఒకటి నేర్చుకుంటూ, తాను తెలుసుకోవలసినది
జీవితాంతమూ ఉంటుందని, అసలు జీవితము చాలదని భావించేవాడు అహంకారానికి లోనుకాడు.
వినయసంపన్నమైన విద్యే
మనిషికి అలంకారం అని తెలుసుకుంటాడు. తన తల్లిదండ్రుల పట్లా, గురువులు, పెద్దల పట్లా వినయ
విధేయతలతో ప్రవర్తిస్తూ, వారి అనుభవాల సారం తాను గ్రహిస్తూ, తన వివేకాన్ని, విజ్ఞానాన్ని
పెంపొందించుకుంటాడు.
విద్య గొప్పతనాన్ని
తెలిపే ఈ శాస్త్ర వాక్యమును చూడండి.
నచోర హార్యం నచ రాజ
హార్యం
న భ్రాతృ భాజ్యం నచ భార
కారీ
వ్యయే కృతే వర్ధతయేవ
నిత్యం
విద్యా ధనం సర్వ ధన
ప్రధానం
చోరులచే దొంగిలింప బడలేనిది, రాజులచే ఆక్రమింపబడలేనిది, అన్నదమ్ములు
పంచుకోలేనిది, ఎంత సంపాదించినా భారము కానిది, దానిని పదుగురికీ
పంచేకొద్దీ ఇంకా పెంచేదీ అయినటువంటి విద్యాదానము అన్నివిధములగు సంపదలకూ ప్రధానము. అంతేగాక భర్తృహరి సంస్కృత భాషలో వివరించిన విద్యాప్రయోజనాలను తెలుగు భాషలో
ఏనుగులక్ష్మణకవి
విద్య నిగూఢ గుప్తమగు
విత్తము, రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు విదేశ
బంధుడున్
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు
లేదిలన్,
విద్య నృపాల పూజితము, విద్య నెఱుంగని వాడు
మర్త్యుడే?
విద్య పరులకు కనిపించని
పెన్నిధి, విద్య ఎనలేని గౌరవమును ఆర్జించి పెట్టేది, ఇహపర భోగములకు ఆలంబనమైనది, విదేశములలో గుర్తింపు
తెచ్చేది, విద్య అన్నది మన బాగును వెంట వుండి చూస్య్కొనే విశిష్టమగు దైవసమానము, ఈ భువిలో విద్యకు సాటి
ధనము లేదు, పైపెచ్చు విద్య రాజ సన్మానములను లభింప జేస్తుంది. అట్టి విద్య లేని వానిని మనిషిగా జమ కట్టగలమా! అసలు ఈ భర్తృహరి సుభాషితములను
తెనుంగు జేసిన ఎలకూచి బాలసరస్వతి అన్న కవి 'విద్య లేనివాడు వింత పశువు' అన్నాడు.
అటువంటి
విద్యనేర్చుకోవటానికి ప్రాచీన కాలంలో గురుకులాలుండేవి. ఊరికి దూరంగా జనావాసంలేని
చోట వనాల లో ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పాటు చేయబడిన గురుకు లాలలో విద్యార్థులు
చేరి, గురుశుశ్రూష గావించి విద్య నేర్చుకునే వారు. తరతమ బేధాలు లేకుండా అంతా
గురుపుత్రుల వలె మెలగి సేవచేస్తూ విద్యాసముపార్జన గావించేవారు. అందుకే ఆనాడు విద్య
నేర్పు వ్యక్తిని గురువనేవారు. నేర్చుకునే వ్యక్తిని శిష్యుడు అనేవారు.
గురుశిష్యులకు పితా పుత్ర సంబంధం ఉండేది. గురువుకు శిష్యుల పట్ల పుత్రవాత్సల్యం
ఉండేది. శిష్యులకు గురువు పట్ల పితృభావన ఉండేది. ఈ విద్య విద్యార్థికి బ్రతుకును
ఫలవంతంగా సాగించటానికి ఉపయోగపడేది. విద్య నేర్చుకొనేవారికి జ్ఞానసముపార్జనే
పరమావధి. ఆ జ్ఞానాన్ని అవసరమైన మేరకు జీవనాన్ని గడుపుకోవటానికే వినియోగించేవారు. ఈ
విద్యను నేర్చుకునే విధానంలో నాలుగు భాగాలుగా వినియోగించుకునేవారు.
ఆచార్యాత్ పాదమాదత్తే, పాదం శిష్యః స్వమేథయా ।
పాదం సబ్రహ్మచారిభ్యః, పాదం కాలక్రమేణ చ ॥
ఇది శాస్త్ర వచనము.
ఆచార్యుడు లేదా గురువు వద్ద నుండి విద్యార్థి నిజముగా నేర్చుకునేది నాలుగవ వంతు మాత్రమే. మరియొక నాలుగవంతు భాగం తన యొక్క స్వంత మేధా
శక్తితోను, విషయ పరిజ్ఞానపరిశోధనతోను, తన యొక్క విశ్లేషణా శక్తితోనూ
నేర్చుకుంటాడు. మరి యొక, నాలుగవ వంతు భాగాన్ని సహబ్రహ్మచారుల అనగా తన సహా పాఠకుల' నుండి చర్చలద్వారా నేర్చుకుంటాడు. తన యొక్క సంపూర్ణ విద్యాసముపార్జన, జ్ఞాన సముపార్జనలోని
చివరి నాలుగవ భాగాన్ని, కాలక్రమేణా తన జీవితానుభవముల ద్వారా, తన జిజ్ఞాసతో కూడిన
నిరంతర గ్రంథ పఠనాల, పరిశోధనల ద్వారా నేర్చుకుని పరిపక్వత సాధిస్తాడు. అనగా, సమగ్రమైన విద్యాభ్యాసం విద్యాలయాలతో పరిసమాప్తి కాదు. అది జీవితాంతమూ జరిగే
నిరంతర ప్రక్రియ అన్న వాస్తవాన్ని ఈ శ్లోకము తెలియజేస్తూవుంది. దీనికి 1. తొలగింపులు(Deletions),2. మార్పులు(Modifications), 3. సవరణలు (Corrections) అవసరము. ఈ విధానమును
చిత్తశుద్ధితో ఆచరించితే మనము చైతన్య వంతులమగుతయే గాక దేశమునే చైతన్యవంతము
చేయవచ్చును.
నిజానికి ఇపుడు పాఠశాలలు, కళాశాలలలో నేర్పించే విద్య
విద్యయే కాదు. దానివల్ల కలిగే ఉపయోగమూ లేదు. స్థానిక కళాశాలలో లక్షలు కట్టి చదివి B.Tech
పట్టా తెచ్చుకొంటారు,ఏ Bank లోనో గుమస్తాగా చేరిపోతారు. అదే IIT లో పుచ్చుకొన్న B.Tech
పట్టా ఎంతో విలువైనది. దానిని పుచ్చుకొన్నవాళ్ళు ధనార్జన కొరకు తమ
మేధస్సును విదేశాలకమ్ముకొంటారు. రెండూ దేశ ప్రగతికి నష్టమే. ప్రభుత్వము వేల కోట్ల
డబ్బును చదువుకు వెచ్చించుతూవుంది. ఎక్కువ భాగము బూడిదలో పోసిన పన్నీరే! దీనికి ఒక
ముఖ్యమైన కారణము మనము మన సాంప్రదాయము నుండి ఎంతో దూరము పయనించి ఈరోజు
మనమలవరచుకొన్న ఎంగిలి సంప్రదాయమే మనదిగా భావించుచున్నాము.
కాస్త ఓపికతో మన
సంస్కృతి అంటే ఏమిటో స్తాళీ పులాకముగా పరిశీలించుదాము. మనకు నిజానికి సంస్కృతి 4
విధములుగా లభ్యమౌతూవుంది. 1. మన దేశీయ ఆచార వ్యవహారాలూ, 2. మన దైవచింతనా విధానములు,
3. మన సారస్వతము, 4. మన వివిధ
శాస్త్రవిజ్ఞానము (Scientific and technological Knowledge).
మన ఆచార వ్యవహారములను
తిరిగీ మూడు భాగములుగా విభజించవచ్చును. 1. సదాచారము, 2. దురాచారము, 3. అనాచారము.
1. సదాచారము: ఇది సర్వదా
పాటించదగినది. మరి మనము, మన అవసరములకొరకు అనేకమయిన ఊళ్లు, పట్టణాలు
తిరుగుతూ ఉంటాము కదా! అప్పుడెట్లు? అంటే దానికి కూడా పెద్దలు
ఒక వెసలుబాటును తెలియబరచినారు.
స్వగ్రామే పూర్ణమాచారం
అన్యగ్రామే తదర్థకంl
పట్టణేషుచ తత్పాదం
యాత్రే బాల సమాచరేత్ll
తనవయిన నిత్య దినచర్య
కలిగిన వ్యక్తి తన స్వంత ఊరిలోనున్నా, లేదు మాటవరుసకు తన అత్త గారి యింటికి
వెళ్ళినా, లేక అంతే ముఖ్యమైన బంధువుల ఇంటికి వెళ్ళినా తన
ఆచారమును పూర్తిగా పాటించే అవకాశముంటుంది. అదే పరాయి ఊరికి పోయినపుడు తన
ఆచారములలోని అర్ధ భాగము పాటించితే చాలును. అదే నగరాలకు, పట్టణాలకు
పోతే మనదయిన రీతిలో నడచుకొను అవకాశము బాగా తగ్గిపోతుంది. అప్పుడు 1\4 వంతు ఆచారము పాటించితే చాలు. ఇక యాత్రలు అంటే ఏవిదేశాలకో పోతే పిల్లలవలె
కట్టుబాట్లు లేకుండా ఉండవచ్చును. కానీ, స్వదేశస్థుల వలె
కాకుండా, విదేశమునే స్వదేశముగా భావించిన వారు తమ ఆచారముల
కాపాడుకొనుటకు ప్రయత్నము చేయుచున్నారు. ఇది సంతోషించదగ్గ విషయము. అసలు ఏ
పరిస్థితులలో కూడా ఆచారము పాటించవలసిందే అన్న నైష్ఠికులు కొందరు ఉంటారు. దానికి
కూడా శాస్త్రము సమాధ్జానము చెప్పినది.
తాతస్య కూపోయం ఇతి
బ్రువాణ కాపురుషః క్షారజాలం పిబతి.
తండ్రి త్రవ్వించిన
బావియని తనయులు అందలి ఉప్పునీరు త్రాగ గలరా! అంటే ఇక్కడ పరిశీలన అవసరము. కావున మన
ఆచారమునకు పరిశీలన, చిత్తశుద్ధి కూడా అవసరమే!
ఈ పరిశీలనకు
సహకరించేవాడే ఆచార్యుడు.
ఆచినోతిచ శాస్త్రార్థాన్
శిష్యాన్ సాధయతే సుధీ
స్వయం ఆచరతీచైవ సహా
ఆచార్య ఇతిస్మృతాం
ఎంతటి గోప్పమాటో చూడండి.
తండ్రి త్రవ్వించిన బావియని రోజూ అందలి ఉప్పునీరు త్రాగాలేము కదా! కాబట్టి
సమంజసతకు చిత్తశుద్ధిని చేర్చి, విశ్లేషించి, వితర్కించి ఒక ఆచారమును
మనము అవలంబించవలసియుంటుంది. పాతదని త్రోసివేయనూ అక్కర లేదు, క్రొత్తదని
అక్కున చేర్చుకోనూ అక్కరలేదు. నా అనుభవమే చెబుతున్నాను. ఒక 50 సంవత్సరాల క్రితము
నా మిత్రుడగు ఒక ఆధునిక Doctor తో మాట్లాడు సమయములో
ఆరోగ్యమును గూర్చిణ చర్చ వస్తే సూర్య నమస్కారములు ఆరోగ్యమునకు చాలామంచిది అన్నాను.
అప్పుడు ఆయన ఒక చిరునవ్వుతో ఆమాటను కొట్టివేసినాడు. నేను కూడా అటుపిమ్మట ఆ
ప్రస్తాపన తేలేదు.
కానీ ఈనాడు Indian Institute of Medical sciences అత్యుత్తమ ఆరోగ్య సాధనగా, అంటే ఈ సాధనాలకు రారాజుగా ‘సూర్య నమస్కారము’ను నిర్ణయించినారు.
ఒక మంత్రమును వేద
సదస్సులో వింటున్నామనుకొండి. అది మరీ మంద్రస్థాయి లోనో మరీ తారాస్తాయిలోనో
ఉచ్చరించక మధ్యమ స్థాయిలో ఉచ్చరించుతుంటారు. మనకు అర్థము కాకపోయినా ఆ ఉచ్చారణలోని
లయకు తన్మయులమౌతూ ఉంటాము. నిజానికి ఈ వినికిడికి భక్తి భావము మాత్రమే కారణము
కాకపోవచ్చును. మన మెదడులో ఊరుచున్న 24 విధములగు వినాళ రసములు (Harmones) స్రవించి
మెదడునందలి తరంగములు 13.8 cycles\second గా ఉండునట్లు నియంత్రింప బడుతుంది. అది మన గుండె కొట్టుకొను వేగమును 68+or- గా నియంత్రించుతుంది.
దీనిని Neuro linguistic effect అంటారు. ఆవేదమంత్రము
వినునపుడు శరీరములో జీవరసాయన క్రియలు (Biochemical) సంభవించుతాయి. యోగమును అనుసరించేవారు దీనిని ‘β’Level Meditation కు చెందుతుంది అంటారు. ఈ
తరంగములు 8.3 కు వస్తే దానిని ‘α’ Level Meditation అంటారు. అదే 4 కు వస్తే దానిని ‘Θ’ Level Meditation అంటారు. 10
నిముసముల ‘Θ’ Level Meditation 10 గంటల
నిదురకు సమానము. ఈ వేదమంత్ర శ్రవణము రక్తపు వత్తిడి (Blood Pressure)ని నియంత్రించుటయే కాక మెదడు తరంగములను 3 వద్దకు
తెస్తాయి. ఈ విషయమును నేటి సైంటిస్టులు కూడా బలపరచినారు. అందుకే వేదమంత్రపఠనము
జరుగునపుడు మౌనము పాటించవలయునన్నది మన పెద్దలు ఏర్పరచిన ఆచారము.
తల ఉత్తరమువైపు
పెట్టుకోకూడదన్నది మన పెద్దలు చెప్పిన ఆచారము. శరీరమునకు తల ఉత్తరధృవము. మరి తల
ఉత్తరమువైపు ఉంచితే ‘అభిన్న ధృవములు వికర్షణ చెందుతాయని నేటి Science చేబుతూవుందికదా!
కావున తూర్పునకు గానీ పడమరకు గానీ తలయుంచి పడుకొనుట
శ్రేష్ఠము. అధమము
దక్షిణము వైపు తల ఉంచడము. ఉత్తరమున మాత్రము ఉంచరాదన్నది మన పూర్వాచారము.
భూమిపై ఏదయినా చాప, పట్టా, పీట లాంటివి వేసుకొని కూర్చొనుట ఆచారము. నేటి సైన్సు దానిని కూడా
బలపరుచుతూ వుంది. కూర్చునుటకు అవి వాడుట చేత శరీరములోని Bio-Static
Electricity నేరుగా భూమిని అంటదు. అవి Non-Conductors కాబట్టి.
23% పరుపు పై నుండి
తటాలున లేచుటవల్ల హృద్రోగములు వస్తూ వున్నాయి అన్నది 1993 లో WHO ద్రువపరచిన మాట.
సముద్ర వసనే దేవీ పర్వత
స్తన మండలే |
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ||
రాత్రి నిదురించిన
వ్యక్తి ఉదయము పడకపైనుండి లేచినవెంటనే దిగ్గున లేయకూడదు. అట్లు లేయుట అనేక
హృద్రోగములకు కారణము కావచ్చును. అందుకే మనము ప్రక్కలకు తిరిగి నెమ్మదిగా నిదురలేచి
పరుపుపైనే కూర్చుని, ఈ క్రింది శ్లోకమును చెప్పుకొని క్రిందికి దిగమన్నారు.
కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతిl
కరమూలె స్థితా గౌరీ
ప్రభాతే కరదర్శనంll
ఇక మన ఆచారమగు మొదట
చెప్పిన ‘సముద్ర వసనే దేవీ’ శ్లోకాన్ని తాను వినియుండకపోయినా Fritj of Capra అన్న Scientist పై శ్లోకమును ఎంత బలపరచుచున్నాడో చూడండి.
The Bio-Static
electricity in your body that you gained by rolling on the bed should not get
defused by keeping your legs on the carpet or some such thing other than the
floor. This may lead to arthritis over a period of 25 years or so.
Fritj of Capra:
Berkley University
Theoretical Physics Head of the Department and
A sitting scientist of
17 US Universities in US. He is the author of several books, including The Tao
of Physics (1975), The Turning Point (1982), Uncommon Wisdom (1988), ‘The Web of Life (1996)’,
The Hidden Connections (2002) and The Systems View of Life (2014).
Where the ultramodern
physics has come to an abrupt end then starts the ancient Indian Upanishadic
philosophy. -Einstein
మరి
పాశ్చాత్యులు ఇంతగా మెచ్చుకొంటూ వున్నా మన గొంగడి మాత్రము వేసిన చోటే వుంది.
ఈ
సందర్భములో ఈశావాస్యోపనిషత్ లోని ఈ శ్లోక సారమును తెలుసుకొందాము.
.
ఈశావాస్యోపనిషత్ లోని ఈ
మొదటి శ్లోకమును చూడండి.
ఈశావాస్యమిదం సర్వం
యత్కించ జగత్యాం జగత్
తేనత్యక్తేన భుంజీథాః
మాగృథః కస్యస్విద్ధనం
ఏవేవయితే మన
ఇంద్రియానుభూతులద్వారా కలవు అని తలచుతూ ఉన్నామో వానియందంతా ఆపరమేశుడు
వసించుచున్నాడు.
జగత్యాం జగత్: భూమి ఒక
ఇరుసుపై తన కక్ష్యలో తిరుగుతూ వున్నదని మనకు తెలుసు.;
జగత్ అన్న పదమునకు
అర్థమేమిటంటే ‘పునః పునః గచ్చతి ఇతి జగత్’ ‘ప్రకర్షేణ గచ్ఛతి
ఇతి జగత్’. పరివర్తన అంటే పరిభ్రమించుతూ వుంటుంది కావున ఇది జగత్
ఈ పరిభ్రమించే జగత్తులో
పరివేష్టితమైయున్న పదార్థమే జగత్తు. అంటే ఏదయితే తన అక్షముచుట్టూ పరిభ్రమించుతూ
వుందో అందులోవుందేదే జగత్తు. ఆజగత్తునిండా
వ్యాపితమైయున్నవాడు భగవంతుడు.
అసలు గణిత శాస్త్ర పరముగా
ఈ శ్లోకమును విశ్లేషించుట అత్యంత సలభము, సుకరము. పూర్ణము అన్న మాటకు Zero అన్న అర్థమును Infinity అన్న అర్థమును
చెప్పుకోవచ్చు. ఈ శ్లోకము ఏమి చెప్పుచున్నదంటే సున్నా నుండి సున్నా తీసివేసినా,
కూడినా సున్నాయే వస్తుంది. సున్నాను సున్నాతో హెచ్చవేసినా, భాగించినా సున్నాయే వస్తుంది. అదేవిధముగా అనంతము (Infinity) నుండి అనంతము తీసివేసినా, కూడినా అనంతమే వస్తుంది.
అనంతమును అనంతముతో హెచ్చవేసినా, భాగించినా అనంతమే వస్తుంది
ఇది చాలు పరమాత్మ తత్వము తెలుసుకొనుటకు.
ఇంకొక ఆచారము చూద్దాము.
అరుణ ప్రశ్న లో ఈ విధముగా
వున్నది.
'నాప్సో
మూత్ర పురీషం కుర్యాత్ న నిష్ఠిరేత్ తద్ వ్రతం
జీవనమునకు ప్రవహించు జలము
ఉన్నచోట మూత్రపురీషములు చేయకూడదు. అలాగే ఉమ్ముట చీదుట చేయరాదు. మరి నేడు నెత్తిన
నోరుపెట్టుకొని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చెబుతున్నది ఇదేకదా!
ఈ శ్లోకమును చూడండి.
భూమిరాపోనలోవాయుః ఖమ్మనో
బుద్ధిరేవచ
అహంకారమితీయమ్మే భిన్నాః
ప్రకృతిరష్టద
పంచాభూతములకు తోడూ, మనసు, బుద్ధి,
అహంకారము అన్న ఈ 8 ప్రకృతి గుణములు. ఏది అతిశయించినా మానవునికి అది
ప్రళయమే!
అత్యుత్తమమైన అతి సాధారణ
ఆచారాలు మరచినాము. 1. బియ్యపు పిండితో ముగ్గు పెట్టుట- భూత తర్పణము అంటే చీమల వంటి
జీవులకు ఆహారమును అనునిత్యము ఒసంగుట. ఆవు ప్దెఅ కలిపినా నీటితో కళ్ళాపి
చల్లడము-అనారోగ్య హేతువులైన క్రిమికీటకములను ఇంటిలోనికి చేరనీయకుండుట
పంచ(ధోవతి) కట్టుకొనుట-
నడుము క్రిందినుండి పాదములవరకు గాలి ప్రసరించి ఆయా అంగములను ఆరోగ్యముగా నుంచుట.
ఇటువంటివన్నీ సదాచారములు. దోగాడే పిల్లల శరీరమును శీతోష్ణ స్థితి అనుకూలముగా
బట్టలు వేయుటకు బదులు బిగుతు బట్టలు వేసి, అది చాలదని diapers బంధించి
యుంచుట మొదలయినవి అనాచారములు. బొట్టు, మెట్టెలు, గాజులు, తాళి, పాపిట, జడ ఇవన్నీ వదిలి పెళ్ళయిన స్త్రీలేర్పరచుకొన్న కొత్త దురాచారము. ఆచారములను
ఇట్లు 3 తెగలుగా విభజింపవచ్చును.
చివరిగా ఒక్కమాట చెప్పి ఈ
వ్యాసమును ముగించుతాను. ఒక ఆధునిక పండితుడు వేదములకు తెలుగులో భాష్యము వ్రాసినాడు.
అది సాయన భాష్యమంత సమగ్రమా కాదా అన్నది ప్రక్కనుంచితే నేడది హిందువులకన్నా
హైదవేతరులు మన ధర్మమును తప్పు పట్టుటకు బహుళముగా ఉపయోగపడుచున్నది. వ్రాయుసమయమును
ఆయన ఈ పరిణామమును ఊహించియున్డక పోవచ్చు. పాండిత్యము చూపించుట గొప్పదనము కాదు అది
సంఘమునకు ఎంతవరకూ శ్రేయోదాయకము అన్నది గుర్తుంచుకొనవలసిన విషయము. వేదార్థమును
గ్రహించుట అంత సులభము కాదు అన్న విషయము సులభముగా అర్థమగుటకు ఈ విషయము తెలుపుచున్నాను. .
అధర్వణ వేదము 12వ కాండలో
మాతా భూమిః పుత్రోహం
పృథివ్యా అని చెప్పబడినది.
ఈ భూమి మనకు తల్లి. మనమంతా
ఆమె సంతానమే! ఈ మాట మనము భూమిని ఎంతగా అరాధించవలెనో తెలియ జేస్తూ వున్నది. ఆమె
వసువువులను ధరించి వసుంధర అయినది. మరి వానిని స్వార్థబుద్ధితో అతిగా త్రవ్వి
వెలికి దీసి అమ్ముకొని వేలకోట్లు సంపాదిన్చుచున్నామే మరి చివరిరోజు ఈ సంపదను వెంట
తీసుకొని పోగలమా! అటువంటప్పుడు ఎందుకు ఈ తపన.
సువర్ణము అన్న మాటకు
బంగారము అన్న లౌకికమైన అర్థము ఉన్నాకూడా నిజానికి అది వేదము
లో సు+వర్ణము అన్న మాట వస్తుంది. సువర్ణము అనగా అత్యంత శ్రేష్ఠమైన వర్ణము అనగా
అక్షరము. అదే ‘ఓంకారము’. ఓంకారమే సువర్ణము.
అది తెలుసుకోలేక బంగారము వెంట పరుగు పెడుతూ ఉన్నాము. ఈ మాట ఎందుకు చెప్పినానంటే
ఒక్కొక్కసారి వేదములో ఉపయోగించిన ఒక్కొక్క పదము ఎన్నో అర్థములు కలిగియుంటుంది.
సాధారణ మానవులము. మనము వేదభావమును ఆకళింపు చేసుకోలేము. మామిడి కాయ అతిపులుపుగా
వుంటుంది. దానితో చేసిన పప్పు, పచ్చడి లొట్టలు వేసుకొంటూ తింటాము. అంతగా మామిడి కాయను
తినలేము కదా! అందుకే మనకు పురాణ శాస్త్ర ఇతిహాసములను మన పెద్దలు మనకు అందజేసినది.
అర్థము చేసుకొంటే మనకూ, మన భావితరాలకూ మంచిది.
అదే విధముగా ఇంకొక మాట
చూద్దాము. వరాహము అంటే కేవలము సూకరము, పంది అన్నది మాత్రమే అర్థము కాదు. దానిని
వర+ అహముగా విడదీయవచ్చు. వర అంటే వరించదగినది. అహము అంటే ‘నాది’ అని
అర్థము అన్న విషయము మనకు తెలిసినదే! అంటే నాదిగా తీసుకొనవలసినది. 'నాది' అని
స్వంతము చేసుకోవలసిన క్షేత్రములో నాటవలసిన ఓంకారము అన్న బీజము అని అర్థము
చేసుకొంటే జగమంతా సౌభాగ్యమే!
స్వస్తి.