ఆశ్చర్యమగు
ప్రత్యేకతలు కలిగిన కొన్ని దక్షిణ దేశ దేవాలయాలు
ఈ దిగువ తెలిపిన
విషయములు నేను వ్రాసినవి కావు. ఎవరో ఒక మహానుభావుడు సేకరించిన సమాచారమును నా
మిత్రుడు WhatsApp మూలముగా నాకు పంపితే
పదిమంది చదివి సంతోషిస్తారని ఆస్యగ్రంది ద్వారా మీకు అందజేస్తున్నాను. మన పూర్వుల
ఘనత, వారు పొందిన దైవ
కృపను గమనించండి.
*పూర్వ కాలంలో దేవాలయములు నిర్మించేటప్పుడు ఒక ప్రత్యేకత కలిగి ఉండేటట్టు
నిర్మించినారు. ఒక్కొక్క దేవాలయానికీ ఒక్కొక్క ప్రత్యేకత వుండేది.
*:ఉదాహరణకు కొన్ని*
1. ఉత్సవ విగ్రహం లేకుండా మూల విగ్రహమే మాడవీధులలోనికి వచ్చేది చిదంబరం నటరాజ
స్వామి.
2. కుంభకోణంలో ఐరావతేశ్వర స్వామి కోవెల తారాశురం అనే గ్రామంలో వుంది. అక్కడ
శిల్పకళా చాతుర్యం చాల అద్భుతంగా చెక్కబడి వుంది. ఒక స్తంభము నుండి చూస్తే వాలి
సుగ్రీవుల యుద్ధం మాత్రమే తెలుస్తుంది. కొంచెం దూరంలో ఇంకొక స్తంభములో రాముడు
ధనుర్దారిగా ఉండే విధముగా చెక్కబడి వుంది.
ఇందులో గొప్ప ఏమిటి
అంటే మొదటి స్థంభము దగ్గర నుండీ, అంటే వాలి, సుగ్రీవుడు యుద్ధం చేస్తున్నట్టు చెక్కబడిన స్తంభం దగ్గర నుండీ చూస్తే శ్రీ
రాముడు (ధనుర్ధారిగా చెక్కబడిన స్తంభం) కనపడడు కాని రెండవ స్తంభము, అంటే శ్రీ రాముడు ధనుర్ధారిగా వున్న స్తంభం దగ్గర నుంచి చూస్తే వాలి సుగ్రీవుల యుద్దము చాల బాగుగా
తెలుస్తుంది. (అంతరార్ధం అర్ధమైనదనుకుంటాను), ఎందుకయినా మంచిది కాస్త విశధీరించుతాను, వాలీ సుగ్రీవుల, రామాయణములో, యుద్ధభూమి నుండి చూస్తె రాముడు చెట్టు మాటున దాగి ఉంటాడు కాబట్టి కనిపించడు, అదే ధనుర్ధారియైన రాముని శిల్పము నుండి చూస్తే వాలీ సుగ్రీవుల ద్వంద్వయుద్ధము అగుపించుతుంది. అంటే రామునికి వారు అగుపించితేనే కదా వాలిపై బాణము వేయగాలుగుతాడు, అది అన్నమాట విషయము. ఆశిల్పికి ఎంతటి గణిత శాస్త్ర ప్రతిభ ఉండినదో చూడండి.
3. ధర్మపురి (తమిళనాడు)
మల్లికార్జున స్వామి
కోవెలలో నవంగాల్ మంటపం (అంటే తొమ్మిది స్తంభముల మంటపం అన్నమాట) లో రెండు స్థంభములు
భూమిపై ఆనకుండా అంతరిక్షంలో వుంటాయి.
4. కరూర్ (కోయంబత్తూర్) సమీపం లోని కుళిత్తలై అనే ఊరిలో కదంబవననాధస్వామి
కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒక మంటపములో ప్రతిష్ఠ గావింపబడి వున్నాయి. సాధారనముగా ఒక మంటపములో ఒకటే ఉంటుంది.
5. గరుడుడు నాలుగు కరములతో అందులో రెంటిలో శంఖ చక్రములతో దర్శనము ఇచ్చేది
కుంభకోణం పక్కన వేల్లియంగుడి అనే గ్రామ కోవెలలో.
6. కుంభకోణంలో నాచ్చియార్ కోవిల్ అనే స్థలంలో విష్ణు గుడి వుంది.
అక్కడ గరుడ వాహనం
రాతితో చేసినది. స్వామి సన్నిధిలో
వున్నప్పుడు, ఆ గరుడ వాహనం బరువు, నలుగురు మోసే బరువు వుంటుంది క్రమంగా ఒక్కొక్క ప్రాకారం దాటి బయటికి తీసుకు
వస్తుంటే, బరువు పెరుగుతూ, రాను రాను ఎనిమిది
మంది ... పదహారు మంది... ముప్పైరెండు మంది ...
బయట వీదిలోకి వచ్చేటప్పటికి అరువదినాలుగు మంది మోసేంత బరువు
అయిపోతుంది. తిరిగి స్వామి గుడిలోనికి తీసుకువెళ్తున్నప్పుడు అదేవిధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది. ఇక బయట వీధికి వచ్చేటప్పటికి గరుడ విగ్రహమునకు
చెమట పట్టడం ఇంకా విచిత్రం.
7. చెన్నై సమీపంలో శ్రీ పెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల కోవెల వుంది అక్కడ
మూల స్థానంలో ఉన్నటువంటి విగ్రహం శిల కాదు ... పంచలోహ విగ్రహమూ కాదు కేవలం
కుంకుమపూవు, పచ్చ కర్పూరం మూలికలతో
చేసినది.
8. తిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథ స్వామి కోవెలలో
స్థల వృక్షం ఒక మారేడు చెట్టు. మారేడు కాయలు ఎలా ఉంటాయో మనకు తెలుసు... కానీ ఆ
చెట్టుకు కాచే కాయలు లింగాకారంలో ఉంటాయి.
9. కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుడి గుడి వుంది అక్కడ
శివలింగం రోజుకు ఐదు వర్ణములుగా మారుతూ వుంటుంది. అందుకే ఆ కోవేలని పంచ వర్నేస్వరుడి కోవెల అని పిలుస్తారు
10. విరుదునగర్ పక్కన చొక్కనాధన్పుదూర్ అనే ఊరిలోని తవ (తపస్)నందీశ్వరుడి
కోవెలలో నందికి కొమ్ములు, చెవులు, వుండవు.
11. ఆంధ్రప్రదేశ్ సామర్లకోటలో మూడువీదుల సంగమములో ఒక పెద్ద ఆంజనేయ విగ్రహం
వుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆంజనేయ విగ్రహం కనులు, భద్రాచల శ్రీ రామ సన్నిధిలో వున్న శ్రీ రాముడి పాదములు ఒకే ఎత్తులో వుండడం.ఇది కూడా అద్భుత గణిత శాస్త్ర విశేషమే!
12. వేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరి కోవెలలో ఒక స్థంభములో అర్ధ
చంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు, ఆరు నుండి పండ్రెండు వరకు అంకెలు చెక్కబడి వున్నాయి. పైన వుండే పల్లమునుడి మనము ఒక పుల్లను పెడితే
నీడ ఏ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం. ఇది కూడా అద్భుత గణిత శాస్త్ర విశేషమే!
13. చెన్నైనుండి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి కోవెలలో
మూలవిగ్రహం శిరస్సు నుంచి నడుము వరకు మానవ ఆకారంతోనూ... నడుము నుండి పాదముల వరకు
మత్స్య ఆకారంలో వుంటుంది
14. ధర్మపురి (తమిళనాడు) పక్కన పదుహారు అంటే పది మైళ్ళ దూరంలో అభీష్టవరద స్వామి
అనే విష్ణువు గుడిలో నవగ్రహములు స్రీ రూపముతో ఉంటాయి.
ఇలా మనకు తెలియని
ఎన్నో ప్రత్యేకతలు పూర్వకాలంలో ఆగమ శాస్త్ర విధానంగా కట్టిన దేవాలయాలలో వున్నాయి.
హంపీ లోని ఒక మంటపము యొక్క రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమపదని స్వరములు ఒక చిన్న ఘాతము కలిగించితే వినిపించుతాయి.
చెప్పుకొంటూ పోతే ఇంకా ఎన్నో ఎన్నెన్నో!ఒకానొక కాలములో కళకళలాడిన ఈ కళను గూర్చి తెలుసుకొనేవారు లేక వెలవెల పోతూ ఉంది.
రాసినవారికి కృతజ్ఞతలు
.
నిజమిది వేదభూమి గన నిత్యము నీభువి పైన నెద్దియో
అజుని,మహాధి దైవమగు ఆ పరమాత్ముని లీల కన్పడున్
సుజన సుధామతుల్ విపుల సూక్ష్మ సునిశ్చిత భద్ర గ్రాహకుల్
గజహితకారి లీలలను గాంతురు రేపును మాపులందునన్
స్వస్తి.
No comments:
Post a Comment