Saturday, 19 December 2020

హరిహరాద్వైతము (ముచ్చటగా మూడు కథలు)

 


హరిహరాద్వైతము (ముచ్చటగా మూడు కతము)

https://cherukuramamohanrao.blogspot.com/2020/12/blog-post.html

విష్ణువే దేవుడు, శివుడే దేవుడు అని వాదులాడుకొనే వారిని చూస్తూ ఉంటాము.  మన రాష్ట్రములో , ఇప్పుడు ప్రవచానాలతోను, షష్టి పూర్తి ఉత్సవములు, వివాహాది కార్యములు, అభినందన సభలు మున్నగు కార్యక్రములకు వెళ్ళే ఒక వైష్ణవ మతాచార్యుడు, శివనామము ఉచ్చరించడు, వినాయకుని పూజించడు. మరి సమాజమునకు ఇటువంటి వ్యక్తులిచ్చుచున్న సందేశమేమిటి.  ఈ పని ఈర్ష్యాసూయలకు నెలవు కాదా! ముందు 'శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే' అన్న వాస్తవమును  మనము అర్థము చేసుకోవాలి. కావున శంకరులు పిడివాదములు కలిగిన మతములవి ఏవయినా ఈ సనాతన ధర్మమునకుగొడ్డలిపెట్టే! ఆది శంకరులు ప్రతిష్ఠించిన అద్వైతము ఇటు లౌకికముగానైనా అటు పారలౌకికముగానైన అత్యంత శ్రేయస్కరము. ఇందులో తరతమ భేదములు లేవు. ఉచ్ఛనీఛములు లేవు.  ఎవరు ఎదేవుని కోరితే ఆదేవుని పూజించుకోనవచ్చును. ఈ అద్వైత మహాత్మ్యమును అందమైన, పై లంకెలో తెలిపిన  కథల రూపములో  ఎంతో  బాగా అర్థము చేసుకోగలరు. చదవండి. మంచిని గ్రహించండి. మంచిని ఆచరించండి.

*********

ఒకసారి ఒక సామాన్యుడు ఒక పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.

ఆ పండితునకు తెలుసు, తనను ఆశ్రయించిన వ్యక్తికి శివుడు అంటే పడదని. శివకేశవాభేదమును గూర్చిన అద్వైతము అతనికి తెలియదని.

ఆయన అలాగే నంటూ ఒక కాగితం మీద ఒక శ్లోకం వ్రాసి ఇచ్చినాడు. ఆ వ్యక్తి చదివి నివ్వెరపోయినాడు. ఆ శ్లోకము ఈ క్రింది విధముగా వుంది.

గవీశపాత్రో నగజార్తిహారీ

కుమారతాతః శశిఖండమౌళిః।

లంకేశ సంపూజితపాదపద్మః

పాయాదనాదిః పరమేశ్వరో నః॥

ఆశ్చర్య పోయాడు చదవగానే. ఆ శ్లోకము యొక్క అర్థము యథాతథముగా చదివితే ఏమి అర్థము వస్తుందో చూడండి.

గవీశపాత్రః ... గవాం ఈశః గవీశః .... ఆవులకు ప్రభువు అయిన వృషభం. అది వాహనం గా కలవాడు గవీశపాత్రః. అంటే సదాశివుడు.

నగజార్తి హారీ ... నగజ అంటే పర్వత పుత్రిక, అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే.

కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం ... కుమారస్వామి యొక్క తండ్రి అయినవాడు శివుడే నిస్సందేహంగా.

శశిఖండ మౌళి: ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.

లంకేశ సంపూజిత పాద పద్మ: ... లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడూ. అనాదిః ... ఆది లేని వాడూ ... అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడూ, అటువంటి పరమేశ్వరః నః పాయాత్ .... వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ, రావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం.

మీకు విష్ణువును గూర్చి వ్రాసేది రాకుంటే ఆ మాటే నాకు చెప్పవచ్చును కదా అని అతడు ఆ పండితుని పై కోపగించుకొన్నాడు.

అప్పుడు ఆ పండితుడు "నీకు సంస్కృతము సమగ్రముగా తెలియక పొరబడినావు. "అది విష్ణువును కీర్తించే శ్లోకమే!" అని చెప్పి అతనికి ఆశ్లోకార్థమును ఈ విధముగా వివరించినాడు. " నేను చివరలో వాడిన అనాది అన్న మాటకు అర్థమును,

నీవు తీసుకోవలసిన విధముగా తీసుకోన లేదు. న+ఆది, అంటే మొదటి అక్షరము తీసి చదువుకొమ్మన్నాను, అని అర్థము ఈ క్రింది విధముగా వివరించినాడు."

గవీశపాత్రః ... లో గ తీసివేస్తే వీశపాత్రః అవుతుంది. విః అంటే పక్షి అని అర్ధము. వీనామ్ ఈశః వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు,

గరుడు ని చేతచేత గౌరవింపబడువాడు, అంటే గరుడుని వాహనుడైన విష్ణువు.

నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసివేస్తే గజార్తి హారీ ... గజేంద్రుని ఆర్తిని దూరము చేసిన వాడు, విష్ణువు.

కుమారతాతః .... 'కు' తీసివేస్తే మారతాతః అంటే మన్మధుని తండ్రి అయిన విష్ణువు. (మదనో మన్మదో మారః... అమరము)

శశిఖండ మౌళి: ... '' తీసివేస్తే శిఖండమౌళిః. నెమలిపింఛము ధరించిన వాడు కృష్ణుడు, అనగా విష్ణువు.

లంకేశ సంపూజిత పాద పద్మ: మళ్ళీ ఆది లేనిదిగా అంటే 'లం' తీసివెయ్యండి ... కేశ సంపూజిత పాద పద్మ:

క అంటే బ్రహ్మ, ఈశః అంటే రుద్రుడు . అంటే బ్రహ్మ రుద్రాదులు పూజించు పాదపద్మములు కలవాడు, విష్ణువు.

గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ, బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ మరియు

 '' తీసివేస్తే రమేశ్వరః అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా! విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .

అడిగినతడు శిగ్గుతో తలవంచుకొన్నాడు.

గణిత, ఖగోళ, జ్యోతిష, జీవ, జంతు, భౌతిక, రాసాయనికాది ఏ శాస్త్రమునకైనా మహనీయులు వ్రాసిన రామాయణ భారత భాగవత రఘువంశాది గ్రంధములకైనా సుసంపన్నమైన భాష సంస్కృతము. ఇప్పటికయినా మేలుకొని పిల్లలకు సంస్కృతము, ఆభాషకు అనుంగు బిడ్డ అయిన ఆంధ్రము నేర్పించండి.

ఆపై ఏ భాష నేర్చుకోదలచినా అవలీలగా వస్తుంది.

మరియొక హరిహర సామ్యము చూడండి.

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవేI

శివశ్చ హృదయం విష్ణుం విష్ణోశ్చ హృదయం శివంII

 యథా శివమయోర్విష్ణుః ఏవం విష్ణుమయః శివఃI

యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషిII

 అని చెప్పుచున్నది మనకు వేదార్థము. ఈ శ్లోకములు చాలా మందికి తెలిసే వుంటాయి. ఈశ్వరునికి కాలుడు అని ఒకపేరు. పైగా ఆయన లయుడు. తమోగుణ ప్రతీక అంటారు ఆయనను. కానీ ఆయన శరీరము అంతా తెలుపే. దానికి తోడూ తెల్లనైన భస్మము ధరిస్తాడు. వెండికొండలో ఉంటాడు. స్వచ్ఛమైన చంద్రుని కలిగియుంటాడు. ఆయన వాహనము నంది తెలుపు. ఎప్పుడూ చల్లదనము కలిగియుంటాడు. అభిషేక ప్రియుడు. ఈవిధముగా అన్నీ సత్వగుణ ప్రధానములగు గుణములనే కలిగియుంటాడు. మరి విష్ణువో సత్వగుణ ప్రధానుడు. కానీ ఆయన నలుపు. ఆయన పవళించే ఆదిశేషుడు నలుపు. ఆయన వాహనము గరుత్మంతుడు నలుపు. ఆయన స్థితి నిరత నిద్ర.

మనము కాస్త పరిశీలనాత్మకముగా ఆలోచించితే శివుని స్వరూప స్థితిగతులు సత్వగుణ సూచకములు. కానీ ఆయన లయ కర్త. మరి విష్ణువో బాహ్యలక్షణములన్నీ తామసికములు కానీ కర్తవ్యము మాత్రము దుష్ట శిక్షణ లోక రక్షణ. ఈ విధమగు ఆలోచన చేస్తే వారిది అభేద వ్యాజ్యము అని మనకు అర్థమైపోతుంది.

ఈ చాటువు గమనించండి.

ఎంత చక్కగా మనకు ఆ అర్థము సార్థకమౌతుందో అర్థమౌతుంది.

వాసుదేవ ఇతి వామదేవ ఇతి ఆస్తి కల్పక మహీరుహద్వయం

యద్యపీహ సుమభేద సంభవః  నాస్తి తత్ర ఫలభేద సంభవః

వాసుదేవుడు అంటే విష్ణువు. వాసుదేవుని కొడుకైనందువల్ల వాసుదేవుడైనాడు కృష్ణుడు. మరి విష్ణువుకు ముందునుండియే వాసుదేవుడను నామము కలదు. ఆయన భూభర్త. అందుచే భూమినుండి లభ్యమయ్యే వసువులకు కూడా ఆయనే నాథుడు. అందుకే వాసుదేవుడు. ఇక వామదేవుడు అంటే శివుడు. వామదేవ శబ్దానికి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. సులభమైన అర్థమును గ్రహించుదాము. మనము తూర్పును చూస్తూ నిలబడి ధ్యానాదులు చేయవలెను. అప్పుడు మన ఎడమచేయి ఈశాన్యమును చూపిస్తుంది. అక్కడ వున్నవాడు వామదేవుడు. 'వామము' అంటే ఎడమ అని అర్థము. శివునికి ఎడమవైపు పార్వతివుంటుంది. ఆమెకు దేవుడు అంటే ఆమె భర్త.

 

ఇక విషయానికి వస్తాము.

పై శ్లోకము యొక్క అర్థము ఏమిటంటే 'వాసుదేవుడు' 'వామదేవుడు' అనునవి రెండు కల్పవృక్షములట. ఆ వృక్షములకు పూవులు వేరట కానీ ఫలమేమో ఒకటేనట. ఇది చోద్యము కాదా! ఇందులో వున్న నిగూఢార్థమును తెలుసుకొంటే ఆశ్చర్యపోతారు. వాసుదేవ లో 'సు' వామదేవ లో '' అంటే సు-మ మాత్రమె తేడా. (సుమము అంటే పూవే కదా!). మిగతా అంతా ఒకటే. ఇరువురిలో ఎవరిని ఆరాధించినా ఫలమొకటే! ఎంత గొప్ప సందేశమును ఎంత చమత్కారముగా చెప్పినారో చూడండి. శంకరులవారు ఉపదేశించినది ఈ అద్వైతమే!

'శివశ్చ హృదయం విష్ణుం - విష్ణోశ్చ హృదయం శివం' అన్న ఈ శ్లోకభాగము గాయత్రి మంత్రమును అనుష్టించే ఏ వైదీకి లేక స్మార్తుడు అయిన బ్రాహ్మణుడు నిత్యమూ చెప్పుకొంటాడు తన సంధ్యావందనములో. లోకములో హరిహర మూర్తి , శంకర నారాయణుడు , రామలింగం, రామేశ్వరం అన్న శివకేశావాభేదమైన ఇటువంటి పేర్లను పెట్టుకొంటారు.ఈ అద్వైతాన్ని ప్రతిష్ఠాపించిన అపర శంకరులు ఆదిశంకరులు. దానిని నిష్ఠగా అనుష్ఠించినవారు నడయాడే దేవునిగా కొనియాడబడిన కంచికామకోటి జగద్గురువులవారు. వారు తెలిపిన ఈ శ్లోకమును, కథను మీ ముందుంచుచున్నాను.

సంస్కృత సమాసములలో తత్పురుషము,బహువ్రీహి, కర్మధారయము అన్న మూడు 

సమాసాలు వున్నాయి. ఒకసారి 'రామేశ్వరుడు' అన్నది ఏ సమాసమని సందేహము కలిగినది దేవతలందరికీ. వెంటనే సర్వ వ్యాపి అయిన మహావిష్ణువు వద్దకు వెళ్ళినారు వారు. సందేహమును తెలిపినారు. విష్ణువు కూడా వెంటనే వారి సందేహము తీరుస్తూ ఇదియేమి అంత పెద్ద విషయమని ఇంత దూరము వచ్చినారు 'రామస్య ఈశ్వరః--రామేశ్వరః' అంటే రామునియొక్క ప్రభువు అనే కదా అన్వయము కావున ఇది షష్టీ తత్పురుష సమాసమన్నారు.దేవతలు తృప్తి చెందలేదు.వారు వెంటనే శివుని వద్దకు పోయి తమ సందేహమును విన్నవించుకొన్నారు.అంత పరమేశ్వరుడు ఇది ఏమంత పెద్ద విషయము అని 'రాముడే ఈశ్వరునిగా కలిగినవాడు రామేశ్వరుడు' ఇది అన్య పదార్థ ప్రదానము కదా కావున 'బహువ్రీహి సమాసము' అన్నాడు శివుడు.దేవతలకు తోచ లేదు. వారు బ్రహ్మలోకానికి బయలుదేరినారు. బ్రహ్మ వారి రాకను గూర్చి విచారించి ఇంత చిన్న విషయానికి ఇంత దూరము వచ్చినారా అని ' రాముడయినట్టి 

ఈశ్వరుడు' లేక 'ఈశ్వరుడైనట్టి రాముడు' అని విగ్రహ వాక్యమును తెల్పి వారి 

అభేదమును విశధము చేసినాడట.

అంతట దేవతలు ఈ విధముగా అనుకొన్నారు :

విష్ణు స్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరం

ఉభయోరప్య త్రుప్తానా మాత్మభూః కర్మధారయం

విష్ణుః=విష్ణుమూర్తి, తత్పురుషం= షష్టీ తత్పురుష సమాసమని

బహువ్రిహీం= బహువ్రీహి సమాసమని శివుడు తెల్పినాడు

ఉభయోరపి = ఆ ఇరువురి చేతనూ

అత్రుప్తానాం= తృప్తి చెందనట్టి (దేవతలకు)

అత్మభూః= బ్రహ్మదేవుడు

కర్మ ధారయం= కర్మధారయ సమాసమని

బ్రూతే=చెప్పుచున్నాడు

ఆ మహనీయుడు చెప్పిన మాటలోని నీతి ఏమంటే 'శివ కేశవ భేదమును మానండి అద్వైతము పాటించండి.'

నాదొక చిన్న మాట . ఒకే విధమైన పని జరుగుటకు ఒకే కార్యాలయమునకు ఐదు,ఆరు మంది పోతే ఉన్నతాధికారి గారిని చేరుటకు ఒక్కొక్కరు తమకు తెలిసిన ఒక్కొక్కరిని ఆశ్రయించి పై అధికారిగారి చేత తమ పని చేయించుకొంటారు. మరీ గొప్పవాడైతే నేరుగా ప్రధానాధికారిగారి వద్దకే పోతాడు. అంతే భక్తిలోకూడా ఎవరి సాధన వారిది. చివరకు చేరేది పైవానినే . ఆ పైవాడు అనేవాడు ఒకడే!

స్వస్తి.








 

 

 

 

No comments:

Post a Comment