Monday, 22 March 2021

జగద్గురు శంకరాచార్యుల చిత్రపటము

 

జగద్గురు శంకరాచార్యుల చిత్రపటము

https://cherukuramamohanrao.blogspot.com/2021/03/blog-post_22.html

రాజా రవివర్మ గారి పేరు విననివారుండరు, వారిని గూర్చి అంతగా తెలియక పోయినా!

భారతీయ చిత్రలేఖనమునకు ఆయన చిత్రములు పురాణ పాత్రల ఛాయాచిత్రములా 

(Photographs) అన్నట్లు ఒక దక్షిణభారత స్త్రీ రూపములోనో, పురుషరూపములోనో, 

ప్రతిబింబించుతూ వుంటాయి.

రాజా రవివర్మ ఈనాటి భారతదేశములోని కేరళలో తిరువనంతపురానికి 25 మైళ్ళ 

దూరంలోని కిలమానూరు రాజప్రాసాదములో ఉమాంబ తాంబురాట్టి, నీలకంఠన్ 

భట్టాద్రిపాద్ దంపతులకు ఏప్రిల్ 29, 1848న జన్మించినాడు. చిన్నతనములోనే ఇతను 

చూపిన ప్రతిభ వలన ఇతనిని, తిరువాన్కూరు మహారాజా అయిల్యమ్ తిరునాళ్ చేరదీసి 

ప్రోత్సహించినాడు. అక్కడి ఆస్థాన చిత్రకారుడయిన శ్రీ ‘రామస్వామి నాయుడు’, మనకు 

తెలియని, మనమేమాత్రము తెలుసుకోదలచుకోని, మన తెలుగు వాడయిన నాటి 

తిరువాన్కూరు సంస్థానమున ప్రసిద్ధుడయిన చిత్రకారునివద్ద, శిష్యరికం చేసినాడు. తైల 

వర్ణ చిత్రకళను బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్ జెన్సన్ వద్ద నేర్చుకున్నాడు. పాశ్చాత్య 

చిత్రకళలోని శక్తి, కొట్టొచ్చినట్లున్న భావ వ్యక్తీకరణ, రవివర్మను ఎంతగానో 

ఆకట్టుకున్నాయి. అవి భారతీయ చిత్రకళాశైలికి ఆయన రచించిన బొమ్మలలో 

ఎంతగానో ప్రతిఫలించినాయి.

1873 వియన్నా చిత్ర ప్రదర్శనలో మొదటి బహుమతి పొందిన తరువాత రవివర్మ బాగా 

వెలుగులోకి వచ్చినాడు. ఆయన తన చిత్రముల ఇతివృత్తముల కోసము భారత 

దేశమంతటా పర్యటించినాడు. తరచుగా ఆయన హిందూ దేవతాస్త్రీల చిత్రాలను దక్షిణ 

భారత స్త్రీలలాగా ఊహించి చిత్రించేవాడు. వారు ఎంతో అందంగా ఉంటారని ఆయన 

భావించేవారు. ముఖ్యముగా మహాభారతములోని నలదమయంతుల

శకుంతలాదుష్యంతుల కథలలోని ఘట్టాలను చిత్రాలుగా చిత్రించి ఎంతో పేరు 

సంపాదించినాడు. రాజా రవివర్మ తరువాత నుండి భారతీయుల ఊహలలో పౌరాణిక 

పాత్రలన్నీ రవివర్మ చిత్రాలలాగా మారిపోయాయి. రవివర్మ తరచుగా తన చిత్ర శైలిలో 

ప్రదర్శనాత్మకంగానూ, ఛాందసంగానూ ఉంటాడన్న విమర్శలను ఎదుర్కొన్నాడు. 

అయినా అతని పనితనం భారత దేశములో ఎంతో ప్రశస్తి ఎనలేని ఖ్యాతిని గడించింది.

1894 లో లిథోగ్రాఫిక్ యంత్రాలు, చిత్రించడానికి అనువైన రాళ్ళూ, సాంకేతిక 

నిపుణులను జర్మనీ నుంచి తెప్పించినాడు రవివర్మ. దేశంలోనే మొదటి సారిగా 

అత్యాధునిక ప్రెస్ ను ముంబైలో ప్రారంభించినాడు. అయితే అక్కడ స్థలాభావము 

మరియు భయంకరమైన ప్లేగు వ్యాపించడం వల్ల, కార్మికులు సరిగా 

లభించకపోవడముచే, నాలుగు సంవత్సరాల తరువాత మహారాష్ట్ర లోనే కొండ కోనల 

నడుమ ఉన్న మలవాలి అనే గ్రామాన్ని ఎంచుకుని చిత్రముద్రణా యంత్ర 

సముదాయమును అచటికి మార్చినాడు. పక్కనే తన నివాసాన్ని కూడా 

ఏర్పరుచుకున్నాడు. ప్రింటింగ్ పనులు బాగా సాగడంతో కేరళ నుంచి తరచుగా ఈ 

గ్రామానికి వస్తూపోతూ ఉండేవాడు.

రవివర్మ చనిపోవడానికి రెండేళ్ళ ముందు ప్రెస్ ను తన స్నేహితుడైన ఒక జర్మన్ 

సాంకేతిక నిపుణుడికి విక్రయించుట జరిగినది. దానితో పాటు వంద చిత్రాలకు కాపీరైట్ 

కూడా ఇచ్చినాడు. అయితే 1972లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రెస్ కు భారీ నష్టం 

జరిగింది. ఆ తర్వాత మిగిలిన చిత్రాలను, రాళ్ళనూ ప్రెస్ చుట్టు పక్కల నివసించేవారికి 

పంచి పెట్టినారు. ఆ తరువాత ముంబై, పుణే ప్రభుత్వాలు కొన్నింటిని మాత్రమే 

భద్రపరచగలిగినాయి.

రవివర్మ తననుగూర్చి వ్రాసుకొన్న చరిత్ర అనగా స్వీయచరిత్ర అంటూ లేదు. రవివర్మ 

తమ్ముడు, సి.రాజరాజవర్మ రాసిన దినచర్య ఎంతో ఉపయోగపడుతుంది. 

సి.రాజరాజవర్మ స్వతహాగా మంచి పేరున్న చిత్రకారుడు. ఆయన రవివర్మకు చిత్రాలు 

చిత్రించడంలో సహాయము చేసేవాడు, అతని ఆంతరంగిక సహాయకుడు. 1906లో, 58 

సంవత్సరాల వయసులో రవివర్మ మధుమేహముతో మరణించినాడు. ఈయన 

మరణించేనాటికి కిలామానూరు రాజభవనములో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని 

ప్రతీతి. ఆ తరువాత వాటిని అధికారికముగా తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ 

గ్యాలరీకి అందజేసినారు.

ఇపుడు జగద్గురు ఆది శంకరులవారి మొట్టమొదటి చిత్రలేఖనా బింబమును గూర్చి 

తెలుసుకొందాము. రవివర్మ గారు అస్వస్థులై ఇక కోలుకోలేని పరిస్థితి అని 

తెలియుటయే గాక తానూ ఇక చిత్రలేఖనము చేయలేదన్న విషయము కాదా ఆయనకు ద్యోతకమైపోయినది. శూలాఘాతము వలె ఆయన మదిలో ఒక చింత కలచివేయజోచ్చినది. అది ఏమిటంటే కేరళ కుమారుడై జగద్వ్యాప్తిచేంది జగత్తుకే గురువని అనిపించుకొన్న ఆదిశంకరులవారి చిత్రమును గీయలేకపోతినే అని కుమిలి పోజొచ్చినాడు. చివరి ఘడియలు చేరుఔతున్న సమయములో ఒకరోజు తెల్లవారుఝామున ఆయనకు శంకరులవారి చిత్రము సుస్పష్టముగా కలలో కనిపించగా తక్షణము తమ్మునితో , తనతో కూడా ఇంకా ఇద్దరు ముగ్గురు ముఖ్య శిష్యులను తోడు తెమ్మనిచేప్పి, అడుగడుగునా, అణువణువునా తన సహాయ సహకార సౌజన్యములనందించి  శంకరుల వారి చిత్తరువు గీయించినాడు.

ఆయన పెట్టిన భిక్షయే నేడు ప్రపంచమంతా పూజించే శంకరులవారి చిత్రము.

స్వస్తి.

 

No comments:

Post a Comment