Sunday, 11 April 2021

శుభకృత్ నామ ఉగాది సందేశము

శుభకృత్ నామ ఉగాది సందేశము

https://cherukuramamohanrao.blogspot.com/2021/04/blog-post_11.html

దయతో ఈ సందేశమును ‘శుభకృత్’ ఇస్తూ ఉన్నట్లుగా గుర్తించండి. నాకు సందేశమునిచ్చే సామర్థ్యము లేదు.

ప్లవ లేక ప్లవనము అనగా తేలుట. నీటిలోతేలే తెప్పను ‘ప్లవ’అంటారు. 'కరోనా' అన్న కాలకూట విషపు కడలినుండి ప్లవ మనలను 'శుభకృత్' అన్న ఒడ్డునకు చేర్చింది. ఆ ఒడ్డు యొక్క పేరే 'శుభకృత్' కాబట్టి అది మనకు అంతా మేలే చేస్తుంది. శుభకృత్ అంటేనే శుభములు చేకూర్చేది.  కావున మంచికి చేయవలసిన ప్రయత్నములు మనము చేస్తే శుభకృత్ నిర్ద్వందముగా మనకు శుభముల సమకూర్చుతుంది.

పంచాంగ శ్రవణం ఉగాదినాటి ఒక ముఖ్య కార్యక్రమం. శుభకృత్ నామ సంవత్సరం అందరికీ నిరంతరం జయకరం, శుభకరం కావాలి. పంచాంగ శ్రవణం ఉగాదినాటి ఒక ముఖ్య కార్యక్రమం. దేశంలో, ప్రపంచంలో పాడి పంటలు, వర్షాలు, పాలకులు, పరిపాలన గురించిన రాబోయే సంవత్సర ఫలితాలను తెలుసుకోవాలనే జిజ్ఞాసతో వింటాము. రాజు, మంత్రి, సేనాని, మొత్తం పరిపాలక మండలి ఎలా ఉంటుంది? దేశపు పరిపాలకమండలిని మనం ఎన్నుకుంటాము. ప్రజా ప్రభుత్వములో మన ఎన్నికకు తగినవారు మనని పాలిస్తారు. అలాగే సృష్టిలో సృష్టికర్తయైన ఈశ్వరుడు, అనేక దేవతలు, గ్రహాలు. వీని స్థితిగతులు పంచాంగము ఇస్తుంది. 

ఈశ్వరుడే కాల స్వరూపము. కాలోస్మి అని చెప్పినవాడు ఆయన. ఆయన పరివారంలోని 

దేవతలు పాలకులు. ప్రజలు తమ పుణ్య పాప కర్మలతో ఫలాలను వ్యక్తులుగా, 

సమూహంగా తామే తెచ్చుకుంటారు. దేవతలు కేవలము కర్మ ఫలాలను ఇచ్చే 

ఉద్యోగులు. వారి కంటే మన సమీపవర్తులు గ్రహాలు. మన సూర్యమండలంలో 

భూమివలెనే గ్రహాలు కూడా మనతోపాటు పరిభ్రమణం చేస్తూ ఉంటాయి. కర్మను బట్టి 

ఫలములను ఇవ్వడం వారి ఉద్యోగ విధి. అందుచేత శనికి శాంతి చేయించే ముందు, 

ఈశ్వరుని పూజించాలి. జీవుల కర్మను బట్టి ఫలములను నిర్ణయించేవాడు దైవము (విధి). 

నేను సత్కర్మలేచేస్తాను. ధర్మమునే సర్వకాలములలో ఆచరిస్తాను అనేవానికి శుభాలే 

వస్తాయి. అతడు స్వతంత్రుడు. ఈశ్వరుని ప్రత్యేకం ప్రార్థించవలసిన పనేలేదు. కాని 

ఈశ్వరుడు సృష్టిలో జీవులకు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వివేకము, పుణ్యపాపాలు 

చేయడానికి స్వేచ్చ ఇచ్సినాడు. పాపకర్మలమీద ఆసక్తి, చేసే స్వేచ్చ ఇవ్వడం వలన 

మనుష్యుడు పాపంచేస్తూనే , నాకు శిక్షలేకుండా చేయమని భగవంతుని ప్రార్థిస్తున్నాడు. 

వివేకం, సద్బుద్ధి (discretion) ఉంటే పాపాలు చేయకుండా ఉంటాము. 

భగవంతుని పశ్చాత్తాపంతో వేడుకుంటే ఆయన కర్మ ఫలాలను నియంత్రింపగలడు. వేద 

పురాణ గాథలు ఇవి చెబుతాయి. మనం సామాన్యులం. మన జీవితకాలమంతా 

సంసారంలోనే గడచిపోతుంది. చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, వాళ్ళ సమస్యలు, 

దీనితోనే కాలమంతా గడిపిన మనం, మనకోసము, మన ఉత్తరగతుల కోసం 

ఏమిచేసుకుంటున్నాము? మళ్ళీ మళ్ళీ ఈ జనన మరణ చక్రమేనా? దీనిలో సారం 

ఏమున్నది? ఈ శుభేచ్ఛవచ్చినప్పుడు మనకు మార్గంకావాలి. పురాణాలు మనకు 

పెద్దమిత్రుడు. మార్గం చూపించేందుకు గురువు కావాలి. మనుష్యరూపంలో 

ఉండక్కరలేదు. ఆ జగద్గురువైన శ్రీకృష్ణునే గురువుగా భావించవచ్చును. ఆయన చెప్పిన 

భగవద్గీతవంటి ఆప్తవాక్యము మరొకటిలేదు.

ఇక్కడ కాలాన్ని గురించి ఆలోచించాలి. మంచికాలం, చెడు కాలం ఏమిటి? భీష్ముడు 49 

రాత్రులు అంపశయ్యపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకూ ఎందుకు 

నిరీక్షించినాడు? అతడు అష్టవసువులలో ఒకడు. శాపవశాన భూమిపై జన్మించినాడు. 

అతనికి స్వచ్ఛంద మరణమనే వరం ఉన్నది. ధర్మం బాగా తెలిసినవాడు. అందుకే 

అంపశయ్యను ప్రాయశ్చిత్త వేదిక గా మార్చుకున్నాడు. అధర్మము కొన్ని విషయాలలో 

చేసినాడు. అధర్మం వైపు నిలచి యుద్ధంచేసినాడు. ధర్మాత్ములైన పాండవుల సేనలో 

అధికభాగాన్ని తానే నాశనం చేసినాడు. 180 సంవత్సరాల వృద్ధుడు. ద్రౌపదిని నిండు 

సభలో అవమానిస్తే తన క్షాత్రధర్మం నిర్వర్తించలేదు. దుర్యోధనుని కొలువులో 

ఉన్నామనేది కుంటి సాకే. అలాగే ద్రోణుడు. ఉత్తమ బ్రాహ్మణుడే. తపశ్శాలి. 

ఉపపాండవులను నిద్రలో ఉండగా చంపిన అశ్వత్థామ ఆయన పుత్రుడు. అతడు 

చిరంజీవి అయినా కర్మ ఫలము అనుభవించక  తప్పదు కాబట్టి భగవంతుడే అతని 

నొసటి మణిని పెకలించి ఆరనిగాయమును కలిగించి అనవరతమూ ఆ కర్మ ఫలమును 

అనుభవింపజేయుచున్నాడు. పెద్దల, పాలకుల, ఉన్నత వర్గాల వారు వివిధ కారణముల 

మూలముగా చేసే పాపాలు సంఘాన్ని నాశనం చేస్తాయి. దేశానికి అరిష్టం. ఇది 

కలియుగము కదా! అసలు నాదృష్టిలో కలిపురుషుడు ఒకడే అయినా ఆయన అనేక 

నాయకుల రూపములో అనునిత్యమూ మనకు తన చేయిదములతో దర్శనమిచ్చుచునే 

యున్నాడు. కలిలో ధర్మము కలికమునకు కూడా కనబడనిరోజులు వస్తాయేమో!

ప్లవ నామ సంవత్సర పంచాంగ ఫలితములను ఎవరికి ఇష్టమగు పంచాంగమును చూసి 

వారు వారు తెలుసుకొనవచ్చును. అందువల్ల నేను ఆ విషయము జోలికి పోవుట లేదు.

మనము కోరుకొనవలసినదల్లా పరివర్తన. ఏవిధమైన పరివర్తన అంటే మనకు వేదము 

తెలియజేసిన పరివర్తన అదే:

అసతోమా సద్గమయ అంటే అసత్తు అనగా ఏది నిత్యమూ శాశ్వతము ఆచరణ 

యోగ్యము కాదో ఆ స్థితి నుండి ఏది సత్యము శాశ్వతము అనుష్ఠానయోగ్యము అయినదో ఆదారిన నడుద్దాము.

తమసోమా జ్యోతిర్గమయ, ఇక్కడ తమస్సు అంటే చీకటి అని మాత్రమే కాదు అర్థము అజ్ఞానములో మనము ఉన్నంతకాలము అంధకారములో ఉన్నట్లే. మరి వెలుగు ఎట్లు కనిపించుతుంది. అది మనము నడిచే దారినిబట్టి ఉంటుంది. అందుకే మొదటనే చెప్పుకొన్నాము కదా  అసత్ నుండి సత్ వైపునకు నడిపించమని పరమాత్ముని వేడుకొన్నాము కదా ఆ బాధ్యత ఆయనదే! అప్పుడే చీకటిలోనుండి వెలుగు లోనికి అడుగు పెట్టగలుగుతాము.  కానీ ఆయనకు గుర్తు చేసే బాధ్యత మాత్రం మనదే! అడగనిదే అమ్మయినా పెట్టాడు అన్న నానుడి మనకు ఎరుకనే కదా!

ఇక మృత్యోర్మా అమృతం గమయ అంటే ఎప్పుడయితే మన ప్రయాణము చీకటి నుండి వెలుగునకు సిద్ధపరుపబడినదో నశించే జీవిత తత్వమును దాటి అనశ్వరమగు పదమును చేరుటకు సిద్ధమయినట్లే! ఈ మర్త్యగుణమును దాటుకొని అమరత్వము వైపు నడక ప్రారంభించినట్లే!

భగవంతుని మన నాయకునిగా చేసుకొని ఆ కోరిక కోరుదాము. అచంచల ధర్మమార్గమున గతి తప్పక తాను నడుస్తూ మనల నడిపించగల ఏకైక నాయకుడు ఆయనే!

ఓం శాంతిః శాంతిః శాంతిః

స్వస్తి.

Wednesday, 7 April 2021

ఉగాది -శుభకృత్

 

సంవత్సరాది లేక ఉగాది

  https://cherukuramamohanrao.blogspot.com/2021/04/blog-post.html

సదాశయులకు, సత్వ సంపన్నమగు భారతీయ ధర్మ పరిరక్షకులకు, మనకు అత్యంత 

విజ్ఞాన సంపదను వారసత్వముగా ఇచ్చిన మన ఋషివరేణ్యులను నిరంతరమూ 

కృతజ్ఞతాపూర్వకముగా భక్తితో కొలుచు మహానుభావులందరకూ, వారి సకల 

కుటుంబ సభ్యులకు  మనఃపూర్వక 'శుభకృత్ నామ సంవత్సర' శుభాకాంక్షలు 


పూర్వము అంటే మేము పిల్లవాళ్ళగా ఉన్న రోజులలో ఉగాదిని సంవత్సరాదిగా కూడా 

ఉచ్చరించేవారము. ఇఒప్పుడు ఉగాది అని మాత్రమే అంటున్నారు. పండుగ క్రొత్త 

సంవత్సరమునకు మొదటి రోజు చేస్తాము కాబట్టి దానిని సంవత్సరాది అని 

పిలిచేవారు. ఉగాది అన్నపుడు అర్థము ఇంకా లోతునకు పోతుంది. కావున ఉగాది 

అన్న పదము కడుంగడు సమంజసము అన్నది నా తలపు. ఈ ఉగాదిని గూర్చి కాస్త 

ఈ పండుగకు ముందు ముచ్చటించు కొందాము. ఉగాది శోభను వన వధూటికి 

వసంతునికి(మన్మధునికి) పెళ్లి జరిగే శుభాదినముగా ఊహించుకొంటూ నేను 

వ్రాసిన ఈ పద్యముతో చదువ ప్రారంభించండి. కఠిన పదములకు అర్థములు కూడా తెలియజేసినాను. నా ఉద్దేశ్యము తెలుగు లోతయిన భాష అని తెల్పుట. నా పాండిత్యమును వెలిబుచ్చుట కాదు.

ద్విజ కలరవము వాదిత్ర  నాదము గూర్చ

                              నికర పిక రవాల నెలవు గాగ

ఘన పుష్ప రజమేమొ గంధంపు పొడి గాగ

                              విరివి సత్ఫలశ్రేణి విందు గాగ

తుమ్మెద బారులు ధూమ మేఘము గాగ

                            అరుణ పుష్పోత్కర మగ్ని గాగ

చూత శాఖములేమొ సూపార్థములు గాగ

                          స్రవ పుష్పరస మేమొ సర్పి గాగ   

తనకు సద్వన వధూటికి దనర జమిలి

పాణిగ్రహణము కై దాను బయలుదేరె

చిలుక   తత్తడి   రౌతు   రాచిలుక  పైన

కదిలె వనమంత కళ్యాణ ఘడియ జూడ

ద్విజ= పక్షులు (రెండు మార్లు జన్మనెత్తునవి)

వాదిత్రములు= వాద్యములు

నికరము = శ్రేష్ఠము

ఘన పుష్పరజము = గొప్పదియైన పుప్పొడి

విరవి = మిక్కుటమైన , అతిశయించిన

ధూమ మేఘము = దట్టమైన పొగ

అరుణ పుష్పోత్కరము = ఎర్రనగు పూవుల రాశి

చూత శాఖములు = మామిడి కాయలు ఆకు కూరలు  (ద్వంద్వ సమాసము)

సూపార్థము = పప్పునకు వలసినవి

స్రవ పుష్ప రసము = పూవులనుండి స్రవించు మధువు

సర్పి = నేయి

జమిలి = జంట

దనర = కలుగగా

చిలుక తత్తడి రౌతు = చిలుక వాహనము పై స్వారి చేయు వాడు (మన్మధుడు)

 సౌందర్యము వెల్లివిరియుచున్న వన వధూటిని పెల్లియాడుటకు మన్మధుడు తన 

చిలుకవాహనము పై బయలుదేరినాడట.

పూదేనెన్ దనివార గ్రోలి  విలసామోదమ్ములై తుమ్మెదల్

మాధుర్యంబుగ ఝుంకృతుల్ సల్పుచున్ మత్తెక్కి నర్తించెడిన్

రోధస్యంతము పిక్కటిల్ల వనినారొహించి క్రొమ్మావులన్

తాదాత్మ్యమ్మున శారికల్ మధుర గీతాలాపముల్ చేసెడిన్

కలయో వైష్ణవ మాయయో యనగ కాంక్షాళిన్ సదా తీర్చుచున్

ఇలపై శోభన సౌమనస్యములు ఇంపారంగ పారంగ సం

తులతన్ తత్పర రీతిగన్ శుభకృతుల్ శోభిల్లగా పాడుచున్

తలపోయన్ శుభకృత్ వరించె నిను తాదాత్మ్యంబు పెంపొందగన్  

కవిత్వమును ఇక్కడ నిల్పి కాస్త ఉగాదిని గూర్చి తెలుసుకొందాము. మొదట ఈ 

శ్లోకమును గమనించండి.

స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం   న్యాయేన మార్గేణ మహీం మహీశాం

గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం  లొకాస్సమస్తా      స్సుఖినోభవంతు

ఇది ఉగాది నాడు తప్పక మనన చేసుకొనవలసిన శ్లోకము. న్యాయము ధర్మము 

సత్యము శాంతి దాంతి వంటి సత్వ గుణ సంపన్నులైన మన ఋషులు ప్రతి వత్సరము 

శుభము సుఖము ను కాంక్షించిన వారు.

మరి ఈ శ్లోకములో గో బ్రాహ్మణ జాతులు సుఖముగా వుంటే చాలని కదా 

చెప్పుచున్నాయి మిగత వారిని గూర్చిన ఊసు ఎత్తలేదు కాబట్టి వారందరూ 

ఏమయినా ఫరవాలేదా! అన్నది అందరికీ వచ్చే అనుమానము.  ఒక శ్లోకము  రెండు 

చిన్న పంక్తులు కలిగియుంటాయి. వాటి భావమును పదముల మాధ్యమముతో గ్రహించరాదు. అందు గల గూడార్థమును మనము గ్రహించ వలసి యున్నది. ప్రజలు కలకాలము చల్లగా పాలింపబడవలెను. న్యాయ మార్గములో రాజులు భూమిని ఏల వలెను . గోవులకు బ్రాహ్మణులకు శుభము సర్వదా సమకూరవలెను. సమస్త లోకములు సుఖముగా ఉండవలెను.

అన్నీ బాగున్నాయి. మరి అన్నీ బాగుంటే ఆలోచనెందుకు అంటే గోవులకు 

బ్రాహ్మణులకు  ఈ శ్లోకములో ప్రత్యేకముగా పెద్ద పీట వేసినారు. పోనీ గోవులు 

సుఖముగా వుండవలసినదే! వానిని తల్లితో పోల్చినారు కాబట్టి. మరి బ్రాహ్మణులు 

ఎందుకు. మిగతా వాళ్ళు ఏమయినా ఫరవాలేదా! అన్న సందేహము నేటి పాఠక 

శ్రేణిలో తల ఎత్తక మానదు. గోవులు  తమ నుండి, తాము ఇవ్వగలిగిన  ప్రతి 

వస్తువును  పుష్కలముగా ఇవ్వగలవు. ఎప్పుడు అవి పుష్కలముగా ఉంటాయో 

యజ్ఞయాగాదులు నిరాఘాటముగా కొనసాగుతాయి. వానిని నిరాఘాటముగా 

కొనసాగించేటందుకు బ్రాహ్మణ సంతతి అవసరము. అందువల్ల యజ్ఞయాగాదులు 

నిరంతరాయముగా వారు జరిపితే సకాల వర్షములు కురుస్తాయి. సకాల వర్షములు 

కురిస్తే పంటలు బాగా పండుతాయి.  పంటలు బాగా పండితే ప్రజలు సుఖిస్తారు. 

వారు సుఖిస్తే లోకమంతా సుఖముగా వుంటుంది. అంతా తమతమ నిత్య విధులను 

కర్మలను, సక్రమముగా నిర్వహించుతూ వుంటే సమస్త లోకములూ చల్లగా 

వుంటాయి. మరి ఇందులో బ్రాహణ శబ్దముండుటలో అనర్థమేమి వుంది. ఈ శాంతి పాఠము ఇక్కడ ఆగలేదు . ఈ శ్లోకములు వినండి.

కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ!

దేశోయం క్షోభ రహితో బ్రాహ్మణా స్సంతు నిర్భయాః!!

ఇందులో ఏమి చెప్పబడినదో గమనించండి. సకాలమునకు వర్షములు కురవాలి. ఈ 

భూమి కలకాలమూ ధనధాన్య సంవృద్ధ యై వుండాలి. దేశము క్షోభరహితమై 

వుండాలి. సత్వ గుణసంపన్నులై  బ్రతికినంతకాలము తమ అనుష్ఠానములతో లోక 

కల్యాణమును అంటే సకల ప్రజల హితమును కాంక్షించే  బ్రాహ్మణులు నిర్భయముగా 

సంచరింతురు గాక! ఇక అదే శాంతిపాఠము లోని ఈ రెండు శ్లోకములు గూడా 

చూడండి.

 అపుత్రా: పుత్రిణస్సంతు, పుత్రిణస్సంతు పౌత్రిణ: |

అధనా స్సధనాస్సంతు జీవంతు శరదాం శతమ్ ||

ఇక్కడ బ్రాహ్మణుల ప్రస్తాపనే లేదు. సంతు లేని వారికి సంతానము కలుగు గాక! 

వారికి తిరిగీ సంతు కలుగు గాక! నిర్భాగ్యులకు సౌభాగ్యము చేకూరు గాక! నూరు 

సంవత్సరములు సుఖముగా శుభముగా, సౌభాగ్యముతో  జీవింతురు గాక! ఈ చివరి 

శ్లోకము చూడండి:

సర్వేపిః సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః

సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్

అందరూ సుఖముగా వుందురు గాక! ఎవ్వరికీ రోగ బాధలు లేకుండు గాక! అందరూ 

కలకాలము మంచిని మాత్రమే చూచెదరు గాక! ఎవరికీ దుఃఖము అన్న అనుభూతి 

కూడా కలగకూడదు అనేది సనాతనధర్మం యొక్క ఆశయం. అసలు సమస్త ప్రజలు 

సమస్త జీవ జంతువులు ‘శంనో అస్తు ద్విపదే శం చతుష్పదే’  సుఖముగా వుండవలె 

నన్నారు. అని అన్నారు. ఇది వేద వాక్యము. ఇటువంటి విశ్వహిత మతము దుర్భిణి 

పెట్టి వెదకినా ప్రపంచములో వేరెక్కడా దొరుకదు. కావున ఎక్కడ ఏమి చెప్పవలేనో 

అదే చెప్పినారు మన ఋషులు. పక్షపాటాము, వలపక్రము, తిరస్కార భావము కలిగి 

ఖలోక్తులనాడువారు కారు నాటి ఋషివరేణ్యులు.

న్యాయము ధర్మము సత్యము శాంతి దాంతి వంటి సత్వ గుణ సంపన్నులైన మన ఋషులు ప్రతి వత్సరము శుభము సుఖమును కలుగజేయవలెనని కాంక్షించినారు.

వారు ఏర్పరచిన 'యుగాది' రాను- రాను "ఉగాది" అయిన దంటారు. సృష్ట్యాదిని 

యుగాది  అన్నారని అప్పటినుండి కాలమును అణిమ (మైక్రో) మహిమ (మాక్రో) ల 

వరకు నిర్దుష్ఠము గా విభజించిన మహనీయులు వారు.

కానీ ఇక్కడ ఒక చిన్న విషయము చెప్పు కొనవలసి వున్నది. పై మాటను 

యథాతథముగా గ్రహించినా కూడా ఇచట వేరొక విశ్లేషణ కూడా 

చెప్పుకోనవలసియుంటుంది. ఉత్+గ+ఆది=ఉగాది. ఉత్ అంటె నక్షత్రము. గ అంటె 

గమనము ఆది అంటె ఆరంభము. భూమి నుండి మనము చూచినప్పుడు 

నక్షత్రములు భ్రమించుచున్నటులనే కనపడును. దీనిని తెలుగులో సాపేక్ష చలనమని 

అంగ్లములో relative motion అని అంటారు. కావున నక్షత్ర మరియు గ్రహ 

చలనారంభమే ఉగాది అని తెలియనగును.

ఉగాది చైత్ర శుధ్ధ పాడ్యమి ఉదయంతో ప్రారంభమౌతుంది. చంద్రుడు ఆ నెలలోని 

పున్నమికి చిత్రా నక్షత్రమునకు దగ్గరౌతాడు కావున అది చైత్ర మాసమైంది. మనము 

ఆంద్ర దేశములో అమావాస్యతో అంతమయ్యే నెలను వాడుకలో ఉంచుకొన్నాము. 

పున్నమితో అంతమయ్యే నెలను తమ ఆచారముగా కలిగిన వారు కూడా ఉన్నారు. 

బహుశ ఆ కారణము చేతనే పున్నమికి చంద్రునికి దగ్గరయిన నక్షత్రము పేరుతో ఆ 

రాబోవు మాసము ఏర్పడియుండవచ్చును.

అసలు దీనికి ఇంకొక అన్వర్థము కూడా వున్నది. "చత్రస్యభావహ ఇతి చైత్రం " 

అంటారు. అంటె ఏ కాలమైనా పనికి వచ్చే గొడుగు లాగా మనలను కాపాడుతుందని 

ఒక అర్థమైతే అన్ని ఋతువులనూ తన గొడుగు కింద అంటే control లో 

వుంచుకొని ప్రజలకు వలయు విధంగా అందిస్తుందని కూడా అన్వయము.

మొదటి నెల చైత్ర మైతే  మొదటి సంవత్సరం 'ప్రభవ'. "ప్రకర్షేణ ఇతి ప్రభవః" 

అంటారు పెద్దలు. ప్రకర్ష అంటే 'మేలు' అని అర్థం. మన 60 సంవత్సరాల 

కాలమానం లో  'ప్రభవ' మొదటిదైతే  'అక్షయ' చివరిది. అంటె ఈ మేలు కలకాలం 

తరిగి పోకుండా కరిగి పోకుండా వుండాలని కోరుతున్నారు మన కాల వ్యవస్థ 

నిర్ణయించిన ఆ మహానుభావులు. అక్షయము అంటే క్షయము కానిది అనియే కదా 

అర్థము. అంటే కాల చక్రము తిరుగుతూనే ఉంటుంది కావున చివరి సంవత్సరము 

'అక్షయమైకాల చక్రములోని మొదటి సంవత్సరముము ‘ప్రభవ’ గా ప్రభావించుతూ 

వుంది.

ఇది తెలుసా: ఈ 60 సంవత్సరములకూ పేర్లున్నయి. ఇది శుభకృత్ నామ సంవత్సరము. 

ఈ సంవత్సరములో  పుట్టి తిరిగి 60 సంవత్సరముల తరువాతి వచ్చే శుభకృత్

చూచిన వాళ్ళు షష్ట్యబ్ద పూర్తి జరుపుకుంటారు.

కాల విభజన ఆధారంగా ఏర్పడిన పండుగ ఉగాది కనుక కాల ప్రమాణాన్ని పన్నెండు 

విభాగాలుగా చేసి మనం అనుసరిస్తున్నాం. వీటినే నిమేషం, కళ, కాష్ట, ముహూర్తం

జాము, దినం, వారం, పక్షం, మాసం, ఋతువు, అయనం, సంవత్సరాలుగా 

ప్రాచీనులు పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల సముదాయాన్ని యుగంగా పేర్కొన్నారు. 

యుగాల విభజనను పరిశీలిస్తే నవగ్రహాలు ప్రదక్షిణం చేసే కాలాన్ని పూర్ణ సంఖ్యగా 

గణించి 432 కోట్ల సంవత్సరాలను ఒక కల్పముగా పేర్కొన్నారు. ఈ 

కల్పములో1000వ వంతును ఒక మహా యుగ మన్నారు. మహాయుగాన్ని తిరిగి 

నాలుగు యుగాలుగా విభజించినారు.

17, 28,000(4,32,000X4) సంవత్సరాల కాల ప్రమాణాన్ని కృతయుగము గాను

12, 96,000(4,32,000X3) సంవత్సరాల కాల ప్రమాణాన్ని త్రేతాయుగం గానూ, 8

64,000(4,32,00000X2) సంవత్సరాల కాల ప్రమాణాన్ని ద్వాపర యుగము 

గాను4,32,000 సంవత్సరాల కాల ప్రమాణాన్ని కలియుగము గానూ పేర్కొన్నారు.

మామూలుగా మన పెద్దలు, ధర్మము కృతయుగమున 4 పాదములతోనూ, 

త్రేతాయుగమున 3 పాదములతోనూ, ద్వాపర యుగమున 2 పాదములతోనూ, 

కలియుగమున ఒక పాదముతోనూ నడుస్తుందని. ఈ మాటకు పైన చెప్పినది 

శాస్త్రీయమైన అన్వయము.

అలాగే 70 మహాయుగాలను ఒక మన్వంతరంగా, 14 మన్వంతరాలను ఒక 

కల్పముగానూ పేర్కొన్నారు. ఇలా విభజించిన కాల ప్రమాణంలో ఒక కల్పము కాలం 

బ్రహ్మకు ఒక పగలు గానూ, మరో కల్పము  రాత్రి కాలము  గాను ఉంటాయని 

పురాణ ప్రశస్తి. ఇలా పరిశీలిస్తే  కృతయుగము కార్తీక శుద్ధ నవమి నాడు

త్రేతాయుగము వైశాఖ శుద్ధ తదియ నాడు ద్వాపరయుగం వైశాఖ శుద్ధ తదియ 

నాడు, కలియుగము చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమవుతాయి అన్నది విజ్ఞుల 

వాక్కు . కృతయుగంలో నాలుగు పాదాలలోనూ, త్రేతాయుగంలో మూడు 

పాదాలలోనూ, ద్వాపరయుగంలో రెండు పాదాలలోనూ, కృతయుగంలో ఒక 

పాదంలోనూ ధర్మం నడుస్తుంది అని ముందే పైన చెప్పుట జరిగింది.

కృష్ణ యజుర్వేద తైత్తరీయ బ్రాహ్మణము పదవ ప్రకరణము పాఠములోని నాల్గవ 

అనువాకము

''యుగంభవేత్‌ వత్సర పంచకేన యుగాని తు ద్వాదశ వర్ష షష్ఠ్యాం'' అని 

చెబుతున్నది. దీని ప్రకారం ప్రభవాది మొదలైన 60 సంవత్సరాలలో ప్రతి ఐదు 

సంవత్సరాలను ఒక యుగముగా పేర్కొంటే 12యుగాలు అవుతున్నాయి.  అసలు 

సూర్యుడు చంద్రుడు మకర రాశి లో ప్రతి 5 సంవత్సరములకు ఒకసారి కలుస్తారు.  

కలయికను యుగము అంటారు.  అందువల్ల ఈ ప్రకారముగా 60 సంవత్సరముల 

కాలములో 12 యుగములు వచ్చును. వేదాంగమైన జ్యోతిష్య భాష్యములో 

యుగంలోని సంవత్సరాలను విశదీకరిస్తూ విద్యారణ్యుడు ''సంవత్సరోసి

పరివత్సరోసి, ఇదావత్సరోసి, ఇదువత్సరోసి, ఇద్వత్సరోసి'' అని భాష్యం చెప్పినాడు.

అంటే ప్రతి యుగంలోని ఐదు సంత్సరములను వరుసగా సంవత్సరము

పరివత్సరము, ఇద వత్సరము, అను వత్సరము, ఇద్వత్సరము అనే పేర్లతో పిలుస్తారు. 

ఐదు సంవత్సరాలు పూర్తి కాగానే తదుపరి యుగానికి సంబంధించి మొదటి 

సంవత్సరం మళ్ళీ ప్రారంభమవుతుంది. అదేవిధముగా సూర్యుని చుట్టూ బృహస్పతి 

భ్రమణ కాలము 12 సంవత్సరములు అది ఒక యుగము అవుతుంది. అప్పుడు ఈ 

వర్ష సముచ్చయమునకు 5 యుగాలు ఏర్పడుతాయి. దానినే పుష్కరము అంటారు. 

సూర్య చంద్ర బృహస్పతుల కలయిక 865  బృహస్పతి సంవత్సరములకు ఒకసారి 

జరుగుతుంది. అట్టివి 5 గడిస్తే ఒక  కల్పము అంటారు.

మనం శ్వేతవరాహకల్పము లోని ఏడవది అయిన వైవస్వత మన్వంతరంలోని 28వ 

మహాయుగము నందలి కలియుగ ప్రథమ పాదములోని 5123 సంవత్సరములు 

గడిచినవి. ఇక ప్లవ నామ సంవత్సరమును గూర్చి మీరు పంచాంగము నుండి 

తెలుసుకొనగలరు కావున ఆ విషయమును మీకే వదలి పెట్టినాను.

ఉగాది పండుగ నాడు మనం సాంప్రదాయ సిద్ధమైన కొన్ని ఆచారాలను పాటించడం 

కూడా పరిపాటిగా వస్తున్నది. అందులో ఒకటి వేప పువ్వు పచ్చడి సేవించడము. వేప 

పువ్వు పచ్చడి సేవించడాన్ని 'నింబ కుసుమ భక్షణం'' అనే పేరుతో ''ధర్మసింధు'' 

వర్ణించింది.

''అబ్దాదౌ నింబ కుసుమం! శర్కరామ్ల ఘృతైద్యుతమ్‌

''భక్షితం పూర్యయామేతు! తద్వర్షం సౌఖ్య దాయకమ్‌''

అంటే సంవత్సరారంభమున మొదటి ఝాము నందు వేప పువ్వు, పంచదార అంటే 

నిజానికి పటికబెల్లము లేక బెల్లము కూడా సముచితమే!, కానీ మనము కాఫీ లోకి 

వాడే చక్కర మాత్రము కాదు, చింతపండు, నెయ్యి తదితరాలను తీసుకుంటే ఆ 

సంవత్సరమంతా సౌఖ్యంగా ఉండును అని అర్థం. ఈ పచ్చడి తినడం వలన త్రి 

దోషములు (వాత, పిత్త, కఫములు) నశించి శరీర తత్త్వములో మార్పు వస్తుంది.

శాస్త్రీయంగా చూస్తే హేమంత రుతువులో శరీరంలో ఏర్పడిన కఫము వసంతంలో 

సూర్యుని వేడికి కరిగి శరీర మంతటా వ్యాపించి రోగాలు కలిగించును. ఈ రకంగా 

ఏర్పడిన రోగాలలో మశూచి ఒకటి. ఇది ఎక్కువగా వసంత రుతువులో వచ్చు వ్యాధి 

కాబట్టి దీనికి 'వసంత సంభవా' అనే పేరు కూడా వున్నది. శరీరానికి మేలు చేకూర్చి 

మశూచి రాకుండా చేసే శక్తి వేపపువ్వుకు ఉండుట వలన ఈ ఋతువునందు వేప 

పువ్వు తినుట ఆచారమైంది. వాస్తవానికి వసంత రుతువు పూర్తయ్యే వరకూ వేప 

పువ్వు తినాల్సి వుంది. కనీసం శ్రీరామనవమి వరకు తినాలి. కాలక్రమమున ఈ ఆచారం అడుగంటి ఉగాది ఒక్కరోజునే అది సూర్యోదయం తరువాతనే వేపపువ్వు పచ్చడి తీసుకుంటున్నారు. సూర్యోదయానికి ముందుగానే తలస్నాన మాచరించి వేపపువ్వు పచ్చడి తినడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

పాపపు పనులకు, భూత ప్రేత పిశాచములకు  ఆలవాలమౌ అర్ఢరాత్రి సంబరాలు 

మానివేసి ,రాలిపోయే కాలములో క్రొత్త సంవత్సర వేడుకలు చేసుకొనే హీన 

సాంప్రదాయానికి ఆనకట్ట కట్టి వసంతముతో మొదలయ్యే ఉగాదిని 

జరుపుకుందాము.

స్వస్తి.    

   VN Rao

I can't refrain myself from commenting "Excellent"! Many don't know the importance of 'సంవత్సరాది'. Well explained sir. Best regards & respects🙏🙏🙏

· Reply · 6h

Cheruku Ramamohanrao

I honestly thank you very much for taking out a little time and going through the article.

· Reply · 5h

VN Rao

Cheruku Ramamohanrao Sir, I am too happy to carry your article to my family members including grand-children. All are delighted. After going through your earlier article, we arranged tutor to teach Telugu to our grandchildren. That's why it is said "knowledge is divine". The impact of passing it onto future generations, will be a great service to our society & nation.

· Reply · 4h

It is a great job Sir. I am happy I could hand over the mantle to a responsible and thus a right person who committed himself to carry it on to the posterity. God Bless You and All Your Family Members Sir,

 · Reply · 22h