Sunday, 11 April 2021

శుభకృత్ నామ ఉగాది సందేశము

శుభకృత్ నామ ఉగాది సందేశము

https://cherukuramamohanrao.blogspot.com/2021/04/blog-post_11.html

దయతో ఈ సందేశమును ‘శుభకృత్’ ఇస్తూ ఉన్నట్లుగా గుర్తించండి. నాకు సందేశమునిచ్చే సామర్థ్యము లేదు.

ప్లవ లేక ప్లవనము అనగా తేలుట. నీటిలోతేలే తెప్పను ‘ప్లవ’అంటారు. 'కరోనా' అన్న కాలకూట విషపు కడలినుండి ప్లవ మనలను 'శుభకృత్' అన్న ఒడ్డునకు చేర్చింది. ఆ ఒడ్డు యొక్క పేరే 'శుభకృత్' కాబట్టి అది మనకు అంతా మేలే చేస్తుంది. శుభకృత్ అంటేనే శుభములు చేకూర్చేది.  కావున మంచికి చేయవలసిన ప్రయత్నములు మనము చేస్తే శుభకృత్ నిర్ద్వందముగా మనకు శుభముల సమకూర్చుతుంది.

పంచాంగ శ్రవణం ఉగాదినాటి ఒక ముఖ్య కార్యక్రమం. శుభకృత్ నామ సంవత్సరం అందరికీ నిరంతరం జయకరం, శుభకరం కావాలి. పంచాంగ శ్రవణం ఉగాదినాటి ఒక ముఖ్య కార్యక్రమం. దేశంలో, ప్రపంచంలో పాడి పంటలు, వర్షాలు, పాలకులు, పరిపాలన గురించిన రాబోయే సంవత్సర ఫలితాలను తెలుసుకోవాలనే జిజ్ఞాసతో వింటాము. రాజు, మంత్రి, సేనాని, మొత్తం పరిపాలక మండలి ఎలా ఉంటుంది? దేశపు పరిపాలకమండలిని మనం ఎన్నుకుంటాము. ప్రజా ప్రభుత్వములో మన ఎన్నికకు తగినవారు మనని పాలిస్తారు. అలాగే సృష్టిలో సృష్టికర్తయైన ఈశ్వరుడు, అనేక దేవతలు, గ్రహాలు. వీని స్థితిగతులు పంచాంగము ఇస్తుంది. 

ఈశ్వరుడే కాల స్వరూపము. కాలోస్మి అని చెప్పినవాడు ఆయన. ఆయన పరివారంలోని 

దేవతలు పాలకులు. ప్రజలు తమ పుణ్య పాప కర్మలతో ఫలాలను వ్యక్తులుగా, 

సమూహంగా తామే తెచ్చుకుంటారు. దేవతలు కేవలము కర్మ ఫలాలను ఇచ్చే 

ఉద్యోగులు. వారి కంటే మన సమీపవర్తులు గ్రహాలు. మన సూర్యమండలంలో 

భూమివలెనే గ్రహాలు కూడా మనతోపాటు పరిభ్రమణం చేస్తూ ఉంటాయి. కర్మను బట్టి 

ఫలములను ఇవ్వడం వారి ఉద్యోగ విధి. అందుచేత శనికి శాంతి చేయించే ముందు, 

ఈశ్వరుని పూజించాలి. జీవుల కర్మను బట్టి ఫలములను నిర్ణయించేవాడు దైవము (విధి). 

నేను సత్కర్మలేచేస్తాను. ధర్మమునే సర్వకాలములలో ఆచరిస్తాను అనేవానికి శుభాలే 

వస్తాయి. అతడు స్వతంత్రుడు. ఈశ్వరుని ప్రత్యేకం ప్రార్థించవలసిన పనేలేదు. కాని 

ఈశ్వరుడు సృష్టిలో జీవులకు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వివేకము, పుణ్యపాపాలు 

చేయడానికి స్వేచ్చ ఇచ్సినాడు. పాపకర్మలమీద ఆసక్తి, చేసే స్వేచ్చ ఇవ్వడం వలన 

మనుష్యుడు పాపంచేస్తూనే , నాకు శిక్షలేకుండా చేయమని భగవంతుని ప్రార్థిస్తున్నాడు. 

వివేకం, సద్బుద్ధి (discretion) ఉంటే పాపాలు చేయకుండా ఉంటాము. 

భగవంతుని పశ్చాత్తాపంతో వేడుకుంటే ఆయన కర్మ ఫలాలను నియంత్రింపగలడు. వేద 

పురాణ గాథలు ఇవి చెబుతాయి. మనం సామాన్యులం. మన జీవితకాలమంతా 

సంసారంలోనే గడచిపోతుంది. చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, వాళ్ళ సమస్యలు, 

దీనితోనే కాలమంతా గడిపిన మనం, మనకోసము, మన ఉత్తరగతుల కోసం 

ఏమిచేసుకుంటున్నాము? మళ్ళీ మళ్ళీ ఈ జనన మరణ చక్రమేనా? దీనిలో సారం 

ఏమున్నది? ఈ శుభేచ్ఛవచ్చినప్పుడు మనకు మార్గంకావాలి. పురాణాలు మనకు 

పెద్దమిత్రుడు. మార్గం చూపించేందుకు గురువు కావాలి. మనుష్యరూపంలో 

ఉండక్కరలేదు. ఆ జగద్గురువైన శ్రీకృష్ణునే గురువుగా భావించవచ్చును. ఆయన చెప్పిన 

భగవద్గీతవంటి ఆప్తవాక్యము మరొకటిలేదు.

ఇక్కడ కాలాన్ని గురించి ఆలోచించాలి. మంచికాలం, చెడు కాలం ఏమిటి? భీష్ముడు 49 

రాత్రులు అంపశయ్యపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకూ ఎందుకు 

నిరీక్షించినాడు? అతడు అష్టవసువులలో ఒకడు. శాపవశాన భూమిపై జన్మించినాడు. 

అతనికి స్వచ్ఛంద మరణమనే వరం ఉన్నది. ధర్మం బాగా తెలిసినవాడు. అందుకే 

అంపశయ్యను ప్రాయశ్చిత్త వేదిక గా మార్చుకున్నాడు. అధర్మము కొన్ని విషయాలలో 

చేసినాడు. అధర్మం వైపు నిలచి యుద్ధంచేసినాడు. ధర్మాత్ములైన పాండవుల సేనలో 

అధికభాగాన్ని తానే నాశనం చేసినాడు. 180 సంవత్సరాల వృద్ధుడు. ద్రౌపదిని నిండు 

సభలో అవమానిస్తే తన క్షాత్రధర్మం నిర్వర్తించలేదు. దుర్యోధనుని కొలువులో 

ఉన్నామనేది కుంటి సాకే. అలాగే ద్రోణుడు. ఉత్తమ బ్రాహ్మణుడే. తపశ్శాలి. 

ఉపపాండవులను నిద్రలో ఉండగా చంపిన అశ్వత్థామ ఆయన పుత్రుడు. అతడు 

చిరంజీవి అయినా కర్మ ఫలము అనుభవించక  తప్పదు కాబట్టి భగవంతుడే అతని 

నొసటి మణిని పెకలించి ఆరనిగాయమును కలిగించి అనవరతమూ ఆ కర్మ ఫలమును 

అనుభవింపజేయుచున్నాడు. పెద్దల, పాలకుల, ఉన్నత వర్గాల వారు వివిధ కారణముల 

మూలముగా చేసే పాపాలు సంఘాన్ని నాశనం చేస్తాయి. దేశానికి అరిష్టం. ఇది 

కలియుగము కదా! అసలు నాదృష్టిలో కలిపురుషుడు ఒకడే అయినా ఆయన అనేక 

నాయకుల రూపములో అనునిత్యమూ మనకు తన చేయిదములతో దర్శనమిచ్చుచునే 

యున్నాడు. కలిలో ధర్మము కలికమునకు కూడా కనబడనిరోజులు వస్తాయేమో!

ప్లవ నామ సంవత్సర పంచాంగ ఫలితములను ఎవరికి ఇష్టమగు పంచాంగమును చూసి 

వారు వారు తెలుసుకొనవచ్చును. అందువల్ల నేను ఆ విషయము జోలికి పోవుట లేదు.

మనము కోరుకొనవలసినదల్లా పరివర్తన. ఏవిధమైన పరివర్తన అంటే మనకు వేదము 

తెలియజేసిన పరివర్తన అదే:

అసతోమా సద్గమయ అంటే అసత్తు అనగా ఏది నిత్యమూ శాశ్వతము ఆచరణ 

యోగ్యము కాదో ఆ స్థితి నుండి ఏది సత్యము శాశ్వతము అనుష్ఠానయోగ్యము అయినదో ఆదారిన నడుద్దాము.

తమసోమా జ్యోతిర్గమయ, ఇక్కడ తమస్సు అంటే చీకటి అని మాత్రమే కాదు అర్థము అజ్ఞానములో మనము ఉన్నంతకాలము అంధకారములో ఉన్నట్లే. మరి వెలుగు ఎట్లు కనిపించుతుంది. అది మనము నడిచే దారినిబట్టి ఉంటుంది. అందుకే మొదటనే చెప్పుకొన్నాము కదా  అసత్ నుండి సత్ వైపునకు నడిపించమని పరమాత్ముని వేడుకొన్నాము కదా ఆ బాధ్యత ఆయనదే! అప్పుడే చీకటిలోనుండి వెలుగు లోనికి అడుగు పెట్టగలుగుతాము.  కానీ ఆయనకు గుర్తు చేసే బాధ్యత మాత్రం మనదే! అడగనిదే అమ్మయినా పెట్టాడు అన్న నానుడి మనకు ఎరుకనే కదా!

ఇక మృత్యోర్మా అమృతం గమయ అంటే ఎప్పుడయితే మన ప్రయాణము చీకటి నుండి వెలుగునకు సిద్ధపరుపబడినదో నశించే జీవిత తత్వమును దాటి అనశ్వరమగు పదమును చేరుటకు సిద్ధమయినట్లే! ఈ మర్త్యగుణమును దాటుకొని అమరత్వము వైపు నడక ప్రారంభించినట్లే!

భగవంతుని మన నాయకునిగా చేసుకొని ఆ కోరిక కోరుదాము. అచంచల ధర్మమార్గమున గతి తప్పక తాను నడుస్తూ మనల నడిపించగల ఏకైక నాయకుడు ఆయనే!

ఓం శాంతిః శాంతిః శాంతిః

స్వస్తి.

No comments:

Post a Comment