నాపై నమ్మకముతో శంకరులవారి ‘మాతృపంచకము’ను పద్యరూపమున తెనిగించు అదృష్టమును నాకు కలిగించిన వేదమూర్తులు శ్రీయుత రేమెళ్ళ అవధాన్లు గారికి మనఃపూర్వక కృతజ్ఞతలు. వారి అభిమానము ఆజన్మాంతము నాకు ప్రాతఃస్మరణీయము. నా రచనను ఎంతగానో మెచ్చుకొన్న వారికి మనఃపూర్వక ధన్యవాదములు మరొకమారు సమర్పించుకోనుచున్నాను.
జగద్గురు శంకరాచార్య విరచిత 'మాతృపంచకము' ను నేను అనువదించిన తెలుగు పద్య సహితముగా మీ ముందు ఉంచుచున్నాను.
https://cherukuramamohanrao.blogspot.com/2021/05/blog-post.html
మాతృపంచకం
1 .ముక్తామణిస్త్వం
నయనం మమేతి
రాజేతి జీవేతి చిరం సుతత్వమ్
ఇత్యుక్తవత్యాస్తవ వాచి మాతః
దదామ్యహం తండులమేవ శుష్కమ్.
నామాణిక్యమ నాదు రత్నమ సదా నా కొంగు బంగారమా
నా మార్తాండ యటంచు ఎంతొ ధృతితో నన్నాదరింపంగ నే
నేమాత్రమ్ము నుపావృతమ్ము ఎదియున్ నీకివ్వలేదెప్పుడున్
ఓ మాతా ఇపుడివ్వ వచ్చితి యవల్ ఓ ముష్టి శుష్కాదృశల్
ఉపావృతము=తిరిగి ఇచ్చుట,
తా:– అమ్మా! నీవు నా ముత్యానివిరా! నా రత్నానివిరా! నా కంటి
వెలుగువురా నాన్నా! నువ్వు చిరంజీవిగా ఉండాలి అని, నన్ను ప్రేమగా పిలిచిన నీ
నోటిలో ఈనాడు కేవలం యిన్ని శుష్కమైన యవలు వేస్తున్నాను. నన్ను క్షమించు.
2. అంబేతి
తాతేతి శివేతి తస్మిన్
ప్రసూతి కాలే యదవోచ ఉచ్చై :
కృష్ణేతి గోవింద హరే ముకుందే
త్యహో జనన్యై రచితోయమంజలిః.
ఎంతో బాధ భరించుచున్ కుములుచున్ ఏడ్పేమి రానీయకన్
అంతా గొంతుకలోనె మింగుచును నీవమ్మా హరా భార్గవీ
కాంతానాథ యటంచు నొప్పి పడుచున్ కన్నావు నీపాదముల్
ఎంతో దాంతము తోడ నింపి మదిలో ఇంపారగా
మ్రొక్కెదన్
తా:–పంటిబిగువున నా ప్రసవకాలములో వచ్చే ఆపుకోలేని బాధను
“అమ్మా! అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!” అనుకుంటూ భరించి నాకు జన్మనిచ్చిన
తల్లికి నేను నమస్కరిస్తున్నాను.
3. ఆస్తాం
తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథా
నైరుచ్యం తను శోషణం మలమయీ శయ్యాచ సంవత్సరీ
ఏకస్యాపినగర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమః
దాతుం నిష్కృతి మున్నతోపి తనయ: తస్యై జనన్యై నమః
శూలను పొందుచుండియును శుష్క శరీరివి యయ్యు నన్ను
నీ
చేలము తోడ జుట్టుచును చెంత పరుండగ జేసి ఎంతయో
తాలిమి తోడ నా మలము తక్షణ రీతిన శుద్ధిచేసితీ
లాలన నిల్చె నామదిన లాతము వీడి నమస్కరించెదన్
అమ్మా! నన్ను కన్న సమయం లో నువ్వు ఎంతటి శూల వ్యథను
అనుభవించావో కదా! శరీరం కళను కోల్పోయి శుష్కించి వుంటుంది. మలముతో శయ్య మలినమైనా ఒక
సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావో కదా! ఎవరూ అలాంటి బాధను భరించలేరు. ఎంత
గొప్ప వాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా? నీకు నమస్కారం చేస్తున్నాను.
4. గురుకులముపసృత్య
స్వప్నకాలే తు దృష్ట్వా
యతిసముచితవేషం ప్రారుదో త్వం సముచ్చె:
గురుకుల మథ సర్వ౦ ప్రారుదత్తే సమక్షం
సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః
నీ కలలోన నేను ఒక నీమపు భిక్షువు నౌచు
కన్పడన్
నీకగు బాధనంతయును నిర్గతిచేయక ఆతురాన నా
కాకరువైన గుర్కులము గాంచగ వచ్చిన
నిన్నుజూచుచున్
శోకము పొంగె ఛాత్రులకు శుభ్ర కృపామతి నీకు మ్రొక్కెదన్
తా:–కలలో నేను సన్యాసి వేషం లో కనబడేసరికి బాధపడి, మా
గురుకులానికి వచ్చి ఏడ్చావు. ఆ సమయం లో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది.
అంత గొప్ప దానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను.
5. న
దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా
స్వధా వా నో దత్తా మరణ దివసే శ్రాద్ధ విధినా
న జప్త్వా మాతస్తే మరణ సమయే తారక మనూ
రకాలే సంప్రాప్తిః మయి కురు దయాం మాతురతులామ్
కాలము మీరె నీకు మరి కాలము మీరెను నాదు రాకలో
జాలము చేత నే జలము చల్లగ పోయగనైతి నోటిలో
కీలక తారకమ్ము చెవి కెక్కగ చేయగనైతి నే స్వధన్
మేలిమి తర్పణాన మది మెచ్చగ దత్తము చేయనైతి నన్
తాలిమితోడ నీవు దయ తప్పక కావుము మాతృదేవతా!
తా:–అమ్మా! సమయం మించిపోయాక వచ్చాను నీ మరణ సమయంలో కొంచెం
నీళ్లు కూడా నేను గొంతులో పొయ్యలేదు. శ్రాద్ధ విధిని అనుసరించి “స్వధా ను”
యివ్వలేదు. ప్రాణము పోయే సమయము లో నీ చెవిలో తారకమంత్రాన్ని చదవలేదు. నన్ను
క్షమించి, నాయందు
దేనితోనూ సమానము కాని నీ దయ చూపించుము తల్లీ!
మొదటి పద్యములో ఆది శంకరాచార్యుల వారిని వారి తల్లిగారు నామాణిక్యమా నా రత్నమా నా కొంగు బంగారమా నా కంటి వెలుగా నీవు చిరంజీవి కావాలినాయనా అని ముద్దులాడినవిషయాలు గుర్తు చేసుకొంటూ ఆయన నాపై అంత ప్రేమ కురిపించిన నీకు యీ ఎండిన యవలను సమర్పించవలసి వచ్చిందమ్మా అని మీరు వ్రాసిన పద్యం మనసును కలచి వేస్తోంది.
ReplyDeleteరెండవ పద్యంలో
కాన్పు సమయంలో చాలా పురిటి నొప్పుల బాధ తో కృష్ణా,గోవిందా హరి శంకరా అని అంటూ సాధనను భావించి నన్ను కన్నా వామ్మో...నీ పాదములను మనసులో నిల్పుకుంటూ నీకు నమస్కరిస్తున్నాను తల్లీ అను భావనలోని కృతజ్ఞతను యెంతో లోతైన అనుభూతిని యిచ్చేలా వ్రాసేరండీ.
మూడవ పద్యంలో
అమ్మా...పురిటి నొప్పుల బాధతో నను కన్నాక నీవు శుష్కించి పోయి ఏడాది పాటు నేను మంచము పై విడిచిన మలమూత్రములనుండి నన్ను బయటకు తీసి శుద్ధి చేయడానికి యెంత శ్రమ పడ్డావోనమ్మా..
ఎంత గొప్ప కొడుకైనా తల్లి ఋణము తీర్చుకోలేడు కదా...
నేను నీ ఋణము తీర్చుకోలేనమ్మా అనే మీ పద్యము ఎంతో గొప్ప సంస్కారభావనలను అందిస్తుంది.
నాల్గవ పద్యములో
నీ కలలో నేను నీమపు భిక్ష చేస్తున్నట్లు కనిపించగా,నా గురుకులానికి వేగముగా వచ్చి నన్ను చూసి కన్నీరు పెట్టుకున్న
నిన్నుళచూసి నా తోటివారు, గురుకుల వాసులు కన్నీరు పెట్టుకున్నారు కదమ్మా.అంత గొప్ప దానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను అనే భావన యెంతో దృశ్యమానమైనది.
ఐదవ పద్యంలో
అమ్మా నీకు కాలం తీరిపోయి నీవు పోయాక, నేను సమయం మించి పోయాక నీ వద్దకు వచ్చేను. నీ ఆఖరి క్షణాల్లో నీకు గుక్కెడు నీళ్ళు నీ గొంతుకలో పోయలేకపోయాను.ఆఖరి ఘడియల్లో నీ చెవిలో తారక మంత్రమును చెప్పలేక పోయాను.
నీకు యేమీ చేయలేకపోయాను. నన్ను క్షమించు తల్లీ అనే భావనలతో
ఐదు పద్యములను ఆదిశంకరాచార్యులవారి మాతృపంచకమునకు అనువాదము చేసి భావార్థములను యెంతో గొప్పగా వివరించేరు.
పద్యరచన అతి సహజమై మూల శ్లోకభావములను చక్కని తెలుగు తనము ఉట్టిపడేలా రచించేరండీ రామ మోహన రావు గారూ....పాఠకు మనసులను కదిలించి కన్నీరు పెట్టించే మీ దివ్యమైన,భవ్యమైన రచనకు జోహార్లండీ.అనేక అభినందనలండీ.వందనములు.
శ్రీ రేమిళ్ళ అవధానులు గారు యీ మీ పద్యములను యెంతో మెచ్చుకోవడం....మీ పాండితీ ప్రకర్ష కు గొప్ప సన్మానము.
అనేకానేక అభినందనలండీ...
🌹🙏🙏🙏🙏🙏🌹