Monday, 31 May 2021

సౌభరి మహర్షి

 

సౌభరి మహర్షి

బ్రహ్మదేవుని పౌత్రుడగు ఘోరుని పౌత్రుడు సౌభరి మహర్షి. సౌభరి మహాతపస్వియగు కణ్వుని కుమారుడు. సౌభరి మహర్షి మహామాన్యులగు మహర్షులలో ఋగ్వేద వినియోగమునకు చెందినవారలగు బ్రహ్మ, అంగీర, ఘోర, కణ్వ, సౌభారులలో ఒకడు. ఈతని ప్రస్తావన మనకు భాగవత మహాపురాణములో తెలియవస్తుంది.

సౌభరి మహర్షిని గూర్చి మనకు శ్రీమద్ భాగవతం 9 వ స్కంధములో తెలియవస్తుంది. విశ్వనాథ చక్రవర్తి టి హకురా గారి ప్రకారము, సూర్య వంశపు రాజగు మాంధాత మధుర రాజ్యమును పరిపాలించే కాలములో తపస్సంపన్నుడగు ఈ మహర్షి, మధురకు సమీపములోని అరణ్యములో తపమాచరించుకొనేవాడు. ఈయన అత్యంత ఆయుష్మంతుడు. త్రేతా ద్వాపరములలో ఈయన ఉనికి తెలియవస్తూవుంది. ఆ ఋషి అడవులలో కఠోర తపమాచరించుకొను సమయమును ఇంద్రుడు,  ఆయన ఒకవేళ స్వర్గాధిపత్యమునకు ఈ తపమాచారించుచున్నాడేమోనని సందేహించి, ఆయన తపోభంగమునకై   దేవకాంతలను బంపి నృత్యగీత గోష్ఠులను ఏర్పాటు చెయించినాడు. చెక్కు చెదరలేదు మహర్షి. ఆ పిమ్మట ఇంద్రుడు ఎన్నోవిధములగు ప్రకృతి భీభత్సములను సృష్టించినాడు. సౌభరి ఋషి ఆ కడగళ్ళకు కూడా తలవంచలేదు. భూతలము అంతరాయముల నిలయమని భావించి  ఆయన తాను నేర్చిన జలస్తంభన విద్యతో,యమునా నదిలో లోతుగా మునిగి తపస్సాధనకు గడంగినాడు. అక్కడ  భూమిపై కలుగు ప్రళయములు సంభవించవు కదా! విషయమును అర్థము చేసుకొన్న ఇంద్రుడు ఆపైనెపుడూ ఆయనను పరీక్షించలేదు.  

ఒక సమయంలో, ఆయన తపోనిష్ఠ లేనపుడు, అతని దృష్టి ఆ నీటిలో తన భార్యా బిడ్డలతో సంతోషంగా ఉన్న ఒక చేపపై పడినది. అక్కడ ఆయన ఒక విషయమును  గమనించినాడు.

ఈ నీటిలో పెద్ద చేపలు, చిన్న చేపలూ పక్కపక్కనే తిరుగుతూ వున్నాయి. పెద్ద చేప చిన్న చేపను మింగటము ‘మాత్స్య న్యాయము’ అంటారు. మరి ఈ చిన్న చేపలు పెద్ద చేపలకు భయపడి దూరముగా వెళ్ళిపోవుట లేదు. తమ పని తాము చేసుకొంటూనే ఉన్నాయి. కావున సాధకుడనైన నేను ఇంద్రుని వంటివారు ఎన్ని ఆటంకములను అప్సరసల ద్వారా కానీ ఇంకేవిధముగానైనా కానీ ఏర్పరచినా కూడా తన సాధనలో తానుంటే అవేమీ చేయలేవుకదా! అన్న ఆలోచన వచ్చింది. తన తపఃశక్తితో దేవకాంతలను మించిన నాట్యకత్తెలగు సుందరీమణులను సృష్టించుకొని సుందర హర్మ్యమును నీటిలోనే నిర్మింపజేసి, అకుంఠిత తపస్సునకు పూనుకొన్నాడు.

ఒక సందర్భమున జరిగిన ఈ విషయమును చూడండి. దానిని తెలుపుతూ, నారాయణీయములో చెప్పబడిన ఈ శ్లోకమును ఒకపరి తిలకించండి. .

త్వత్పెవోత్కః సౌభారిర్నామ పూర్వం కాళింద్యంతర్వా ద్వాదశాబ్దం తపస్యన్ l

మీనవ్రాతే స్నేహవాన్ భోగలోలే తారక్ష్యం సాక్షాద్ధైక్షతాగ్రే కదా చిత్ ll

నీకు పరమ భక్తుడగు సౌభరి మహర్షి యమునా నదిలో జలస్తంభన విద్య సాయముతో తపస్సు చేసిన 12 సంవత్సరములలోని ఒక రోజు , ఎంతో ఆనందముగా అన్యోన్యముగా సంచరించుచున్న మీనముల పంక్తులను చూస్తూ సంతసించు సమయములో గరుత్మంతుడు అచట చేరి తినుటకు ఒక చేపను నోట కరచుకొన్నది చూచి మహర్షి యమునలో చేపలను గరుత్మంతుడు తిన ప్రయత్నించితే అతను మరణించును అని శపించినాడు.

కాళీయుడు ఒకసారి గరుత్మంతునికి చెందవలసిన హవిస్సులు తాను తినుటతో  ఆగ్రహావేశాములకు లోనయిన గరుత్మంతుడు కోపించి కాళీయుని విసరి వేసినాడు. ఆ విసరిన వేగామునకు కాళీయుడు వచ్చి యమునలో పడినాడు. ఒక విధముగా సౌభరి మహర్షి గరుత్మంతునికి ఇచ్చిన శాపము కాళీయునికి ఈ విధముగా మేలు చేసింది.

 

వేరొక సందర్భమున తన తపస్సుకు కాస్త విరామమునిచ్చి నీటిపైకి వచ్చి చేపల చలనమును చూడ దోడగినాడు. ఒక చేపల కుటుంబము ఆయన కంటబడింది. తనలో, అది చూసి చూసి వివాహేచ్ఛ కలిగింది.

ఆ ఆలోచన కలిగినదే తడవుగా అతను ఆ నీటిలోనుండి బయటకు వచ్చి,  మాంధాత వద్దకు వెళ్లి తనకు వివాహం చేసుకొనవలెననును తలంపు కలిగినది కావున ఆయనకున్న ఏబది కన్యకలలో ఒకరిని ఇవ్వమని అడిగినాడు.

శుష్కించిన శరీరం కలిగిన సౌభరి మహర్షిని తన పుత్రికలు వరించరు అన్న నమ్మకంతో, తన పుత్రికలలో ఎవరైనా తమరిని వరించినట్లయితే వారిని ఇచ్చి వివాహం చేస్తాను  అని సౌభరికి మాంధాత చెప్పినాడు. మాంధాత మనస్సులోని ఆలోచనను గమనించిన సౌభరి మహర్షి తన శరీరమును యౌవ్వనప్రాయముతో అలంకరించుకుని నవ మన్మధుడై అంతఃపురమున ఏరాజు వద్దకు వెళ్ళినాడు. అతనిని చూసిన మాంధాతయొక్క 50 మంది పుత్రికలూ అతనిని వరించినారు.

అతని తపః శక్తి తో వారంతా అత్యంత అనుకులమయిన భవనములు, భోగములు సమకూర్చుకున్నారు. ఎంతో వైభవమైన వస్త్రములు, తినుబండారములు, ఉద్యానవనములు ఏర్పరచుకుని సుఖంగా ఉన్నారు.

కొంతకాలం తరువాత సౌభరి మహర్షికి ఏకాంతంలో అతని ఈ పరిస్థితికి రాకముందు తాను ఎంత నిష్ఠగా తపస్సు చేసేవాడో గుర్తుకు వచ్చినది. ఒకనాడు, ఒక్కసారి సంసారముతో ఉన్న ఒక చేపల కుటుంబమును చుసిన తను ఇంతకాలము 50 మంది భార్యలతో, 5000 మంది బిడ్డలతో కాలక్షేపం చేయుట తప్పు అనిపించినది. కనుక వానప్రస్థఆశ్రమము స్వీకరించి అరణ్యమునకు వెళ్లి తపస్సు ప్రారంభించినాడు. అతని భార్యలు కూడా అతనిని అనుసరించినారు. అది నిర్జన కీకారణ్యము. అచట గురుకులమును గూడా ఏర్పరచి శిష్యులను విద్యావంతుల జేయదొడగినాడు. ‘విద్యాతురాణాం న సుఖం న నిద్రా’ అనికదా పెద్దల వాక్కు. అందుకే విద్యార్థులు కష్టమైనా ఆయన వద్ద విద్య నేర్చుకొనుటకు పుష్కలముగా వచ్చినారు.

మిగిలినది రేపు.....

సౌభరి మహర్షి - 2

ద్వాపరయుగము చివరిలో ధర్మరాజు  అశ్వమేధయాగ దీక్ష లో ఉన్నపుడు యాగాశ్వము వెంట అర్జనుడు పోవుట తటస్తించినది. శ్రీరిష్ణుని మాయచే అర్జునుడు గుఱ్ఱము మరుఇయు పరివారముతో సౌభరి మహర్షియున్న అటవీ ప్రాంతమునకు పోవుట తటస్తించినది. ఆ ప్రాంతములో ఉండే చండీశిలకు అతుక్కు పోయింది. అర్జునుడు సౌభరి ఋష్యాశ్రమమునకు వెళ్లి తనను పర్చయము చేసుకొని ఘర్మ రాజును గూర్చి చెప్పి, గుఱ్ఱము చండి శిలకు అతుక్కుపోయిన విషయము కూడా చెప్పిన పిదప, ఈ యాగమును ఎవరు చేయమని చెప్పినారు అని అడిగినాడు మహర్షి. అర్జునుడు శ్రీకృష్ణుడు చేయమన్నట్లు చెప్పినాడు. సౌభరి మహర్షి వెంటనే పరమాత్మ నీతో వచ్చినాడా అని అడిగినాడు. అందుకు అర్జునుడు అవును వెనకాల ఉన్నాడు అని చెప్పినాడు. ‘మరి పరమాత్మ తానే ప్రక్కన ఉంటూ మిమ్ము ఈ యజ్ఞమును చేయమన్నాడు అన్న విషయమును గూర్చి మీరు ఆలోచించినారా? అసలు ఈ యజ్ఞమునకు కర్తలు మీరు కాదు ఆ పరమాత్మయే కర్త. ప్రతిఫలాపేక్షతో కానీ, ఇంత మహా యాగమును చేస్తున్నామన్న అహంకారముతో కానీ చేయవద్దు. ఆయన పాదమును వీడవద్దు. ఈమాట ఆయన నాతో చెప్పించుటకే నిన్ను ఇచ్చటికి పంపినాడు. ఆయన లీలలు అంత సులభముగా అంతుపట్టవు’ అని తెలిపి తన మంత్రం శక్తితో యాగాశ్వమును విడిపించి పరమాత్మ దర్శనముతో అత్యంత సంతోషాంతరంగుడైనాడు.

ఈ విధముగా, తన తప్పులను తానూ తెలుసుకొని, మరణ సమయంలో అగ్ని ప్రవేశము చేసి, తపోదీక్షతో కలుషములను కడగివైచుకొని భగవంతుని అకుంఠితపదమునుచేరుకొన్నాడు. విశ్వనాథ చక్రవర్తి ఠాకుర్ గారు  సౌభరి ముని తన వైష్ణవ అపరాధ కారణంగా పడిపోయినాడని వ్యాఖ్యానించినాడు. ఎందుకంటే, గరుత్మంతుడు చేపను తినాలని అనుకున్నప్పుడు, సౌభరి ముని గరుడునికి  ప్రకృతి విరుద్ధమగు శాపము ఇచ్చి గొప్ప నేరం చేసినాడు. ఈ అపరాధ కారణంగా, సౌభరి ముని తన తపఃశక్తిని కొంత కోల్పోవలసి వచ్చింది. సౌభరి మునికి సంబంధించిన ఈ సంఘటన నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఇది. సౌభరి రిషి గొప్ప యోగి. ఆయన బఃవృచ(बह्वृच) అంటే ఋగ్వేదము ఆయనకు కరతలామలకము అని అర్థము. ఆయన అపార వేద సాధకుడు కాబట్టి తన పాండిత్యమును మరియు తపస్సును భౌతిక సంపద కోసం కొంత ఖర్చు చేసినాడు, ఈయన పేరుతో ఒక ఋగ్వేద సంహిత కూడా ఉన్నది. కానీ ఇది జీవితానికి పరిపూర్ణత కాదు అని తెలుసుకొనుటకు ఆలసించినాడు. కానీ కాలాంతరములో ఆ వాస్తవము తెలుసుకొన్నవాడై, అడవిని తిరిగి చేరి  అనితరసాధ్యమగు తపోనిష్ఠతో పరమపదమును సాధించినాడు. జీవితపు ఆధ్యాత్మిక విలువ తెలియని వారు, బాహ్య భౌతిక సంపదతో సంతృప్తి చెందవచ్చు, కాని ఆత్మ-తత్వ విచారమును ఎరుకలోనికి తెచ్చుకోన్నవారు ఐహిక సుఖములను తృణప్రాయముగానెంచి ఆముష్మికమును సాధించుతారు.  సౌభరి ముని జీవితం మరియు కార్యకలాపాల నుండి మనం పొందగల సూచన ఇది.

ఇక్కడ ఇంకొక ముఖ్యమగు విషయమును తెలుపుతాను. ఇది పురాణములు అబద్ధములు అను కొందరు భారతీయ ధర్మద్వేషులకు ఒక చురక వంటిది. సౌహరి మహర్షి ఇంచుమించు ద్వాపర యుగాంతము వరకు జీవించినాడు అనుటకు ఈ క్రింది యదార్థమును మనసు పెట్టి చదవండి.

జాగరణ్ సమన్వయకర్త యగు కమల్ మొరార్కర్ ఆర్ధిక సహయోగముతో, వ్రజ బృందావన్ (మధుర): మహర్షి సౌభరి ధ్యాన ప్రదేశమగు  సునరఖ్ కు చెందిన రామ్‌తాల్ కుండ్ భక్తుల ఆకర్షణ కేంద్రంగా మార్చినారు. అసలు ఎన్నో వేలసంవత్సరముల క్రితమే భూమిలోనికి కూరుకు పోయిన ఈ గుండమునకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పునరుజ్జీవనము కలిగించి సందర్శనాయోగ్యము చేసినారు.

సుమారు 2700 సంవత్సరాల పురాతనమైన ఈ కొలను యొక్క నిర్మాణాన్ని చూసి పురావస్తు శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయినారు. ఆ కోలనుకు వాడిన ఇటుకలు ప్రస్తుతపు ఇటుకల కన్నా చాలా రెట్లు పెద్దవి రియు ఆ కొలను పునాదిలో  రెండు అంగుళాల మందపాటి ఇనుప పలక కనుగొనబడింది, ఇది పురాతన నిర్మాణానికి అద్భుతమైన నమూనా.

బ్రజ్ ఫౌండేషన్ 2011 లో రామ్‌తాల్ కుండ్‌కు  పునర్వైభవమును సంతరింప  ప్రారంభించింది. సంస్థ ప్రతినిధి మన్సుఖ్ మాట్లాడుతూ, సుమారు ఆరు సంవత్సరముల కాలము మేము చేసిన ప్రయత్నములు ఫలించినాయి. సౌభరి ప్రార్థనా స్థలాన్ని అందంగా మార్చడానికి అన్నివిధములా శ్రద్ధాళువులు ప్రయత్నిస్తున్నారు.

భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గుండము చుట్టూ కూర్చునుటకు బెంచీలు, విడిదికి విశ్రాంతి గదులు ఏర్పాటు చేసినారు.

మహర్షి సౌభరి యొక్క యజ్ఞశాల యందు పురావస్తు అవశేషములకు మూలములు దెబ్బతినకుండా ఆధునీకరించుట జరిగినది. ఇది భారతీయ శాశ్వతమైన సంస్కృతి గురించి ఒక ఆలోచనను ఇస్తుంది.

ఈ విషయమును ప్రత్యేకముగా ఎందుకు వ్రాసినానంటే, ఈ భారత భూమి పసి ఇంకా కొందరు డబ్బును తృణప్రాయముగా చూసే మహనీయులు, ఈషణ్మాత్రపు స్వలభోపెక్ష లేకుండా, పేరుకు ప్రాకులాడకుండా 10వేల చందాయిచ్చి లక్ష రూపాయల ప్రకటనలు చేసుకోకుండా, వాడు తలపీట్టిన పని వాడే చేసుకొనీ, డబ్బు వాని వాడా ఉన్నదికదా అని నిమ్మకు నీరెత్తినట్లు ఉండకుండా ఉడుతా భక్తిగా తోచిన సహాయముచేసి తమవంతు బాధ్యతను తీర్చుకొనే పైన తెలిపినటువంటి మహానుభావులకు నమస్కరిస్తూ ఈ రచనను ఇచ్చట ముగిస్తున్నాను.

స్వస్తి.


Sunday, 16 May 2021

మాతృపంచకం - తెనుగున పద్యానువాదము

 నాపై నమ్మకముతో శంకరులవారి ‘మాతృపంచకము’ను పద్యరూపమున తెనిగించు అదృష్టమును నాకు కలిగించిన వేదమూర్తులు శ్రీయుత రేమెళ్ళ అవధాన్లు గారికి మనఃపూర్వక  కృతజ్ఞతలు. వారి అభిమానము ఆజన్మాంతము నాకు ప్రాతఃస్మరణీయము. నా రచనను ఎంతగానో మెచ్చుకొన్న వారికి మనఃపూర్వక ధన్యవాదములు మరొకమారు సమర్పించుకోనుచున్నాను.

జగద్గురు శంకరాచార్య విరచిత 'మాతృపంచకము' ను నేను అనువదించిన తెలుగు పద్య సహితముగా మీ ముందు ఉంచుచున్నాను. 

https://cherukuramamohanrao.blogspot.com/2021/05/blog-post.html

మాతృపంచకం

1 .ముక్తామణిస్త్వం నయనం మమేతి

రాజేతి జీవేతి చిరం సుతత్వమ్

ఇత్యుక్తవత్యాస్తవ వాచి మాతః

దదామ్యహం తండులమేవ శుష్కమ్.

నామాణిక్యమ నాదు రత్నమ సదా నా కొంగు బంగారమా

నా మార్తాండ యటంచు ఎంతొ ధృతితో నన్నాదరింపంగ నే

నేమాత్రమ్ము నుపావృతమ్ము ఎదియున్ నీకివ్వలేదెప్పుడున్

ఓ మాతా ఇపుడివ్వ వచ్చితి యవల్  ఓ ముష్టి శుష్కాదృశల్

ఉపావృతము=తిరిగి ఇచ్చుట,

తా:– అమ్మా! నీవు నా ముత్యానివిరా! నా రత్నానివిరా! నా కంటి వెలుగువురా నాన్నా! నువ్వు చిరంజీవిగా ఉండాలి అని, నన్ను ప్రేమగా పిలిచిన నీ నోటిలో ఈనాడు కేవలం యిన్ని శుష్కమైన యవలు వేస్తున్నాను. నన్ను క్షమించు.

2. అంబేతి తాతేతి శివేతి తస్మిన్

ప్రసూతి కాలే యదవోచ ఉచ్చై :

కృష్ణేతి గోవింద హరే ముకుందే

త్యహో జనన్యై రచితోయమంజలిః.

ఎంతో బాధ భరించుచున్ కుములుచున్ ఏడ్పేమి రానీయకన్

అంతా గొంతుకలోనె మింగుచును నీవమ్మా హరా భార్గవీ

కాంతానాథ యటంచు నొప్పి పడుచున్ కన్నావు నీపాదముల్

ఎంతో దాంతము తోడ నింపి మదిలో ఇంపారగా మ్రొక్కెదన్

తా:–పంటిబిగువున నా ప్రసవకాలములో వచ్చే ఆపుకోలేని బాధను “అమ్మా! అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!” అనుకుంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.

3. ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథా

నైరుచ్యం తను శోషణం మలమయీ శయ్యాచ సంవత్సరీ

ఏకస్యాపినగర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమః

దాతుం నిష్కృతి మున్నతోపి తనయ: తస్యై జనన్యై నమః

శూలను పొందుచుండియును శుష్క శరీరివి యయ్యు నన్ను నీ

చేలము తోడ జుట్టుచును చెంత పరుండగ జేసి ఎంతయో

తాలిమి తోడ నా మలము తక్షణ రీతిన శుద్ధిచేసితీ

లాలన నిల్చె నామదిన లాతము వీడి నమస్కరించెదన్

అమ్మా! నన్ను కన్న సమయం లో నువ్వు ఎంతటి శూల వ్యథను అనుభవించావో కదా! శరీరం కళను కోల్పోయి శుష్కించి వుంటుంది. మలముతో శయ్య మలినమైనా ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావో కదా! ఎవరూ అలాంటి బాధను భరించలేరు. ఎంత గొప్ప వాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా? నీకు నమస్కారం చేస్తున్నాను.

 

4. గురుకులముపసృత్య స్వప్నకాలే తు దృష్ట్వా

యతిసముచితవేషం ప్రారుదో త్వం సముచ్చె:

గురుకుల మథ సర్వ౦ ప్రారుదత్తే సమక్షం

సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః

నీ కలలోన నేను ఒక నీమపు భిక్షువు నౌచు కన్పడన్

నీకగు బాధనంతయును నిర్గతిచేయక ఆతురాన నా

కాకరువైన గుర్కులము గాంచగ వచ్చిన నిన్నుజూచుచున్

శోకము పొంగె ఛాత్రులకు శుభ్ర కృపామతి నీకు మ్రొక్కెదన్

తా:–కలలో నేను సన్యాసి వేషం లో కనబడేసరికి బాధపడి, మా గురుకులానికి వచ్చి ఏడ్చావు. ఆ సమయం లో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్ప దానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను.

5. న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా

స్వధా వా నో దత్తా మరణ దివసే శ్రాద్ధ విధినా

న జప్త్వా మాతస్తే మరణ సమయే తారక మనూ

రకాలే సంప్రాప్తిః మయి కురు దయాం మాతురతులామ్

కాలము మీరె నీకు మరి కాలము మీరెను నాదు రాకలో

జాలము చేత నే జలము చల్లగ పోయగనైతి నోటిలో

కీలక తారకమ్ము చెవి కెక్కగ చేయగనైతి నే స్వధన్

మేలిమి తర్పణాన మది మెచ్చగ దత్తము చేయనైతి నన్

తాలిమితోడ నీవు దయ తప్పక కావుము మాతృదేవతా!

తా:–అమ్మా! సమయం మించిపోయాక వచ్చాను నీ మరణ సమయంలో కొంచెం నీళ్లు కూడా నేను గొంతులో పొయ్యలేదు. శ్రాద్ధ విధిని అనుసరించి “స్వధా ను” యివ్వలేదు. ప్రాణము పోయే సమయము లో నీ చెవిలో తారకమంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి, నాయందు దేనితోనూ సమానము కాని నీ దయ చూపించుము తల్లీ!