అర్జనుని సందేహం
https://cherukuramamohanrao.blogspot.com/2021/10/blog-post.html
కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ।
ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హవరిసూదన ।। 2-4 ।।
భీష్ముడు కురువృద్ధుడు, గుణవృద్ధుడు, జ్ఞాన వృద్ధుడు అందునా అర్జనునిపై అమితమైన
అనురాగము కలిగినవాడు.
ఇక ద్రోణుడో!
శ్లో. ప్రణవో ధనుః శరో హ్యాత్మా
బ్రహ్మ త ల్లక్ష్య ముచ్యతే !
అప్రమత్తేన వేద్ధవ్యం
శరవత్ తన్మయో భవేత్ || (ముండకోపనిషత్తు)
ఓం అనే ప్రణవ నాద మంత్రమే ధనుస్సు. జీవాత్మయే ప్రాణం. బ్రహ్మమే అక్ష్యం.
నిర్మలహృదయంతో ఏమరుపాటులేకుండా ఆ లక్ష్యాన్ని చేదించి తన్మయత్వం చెందాలి.
లక్ష్యాన్ని చేరాలంటే బాణం అవసరం కదా! ఆ బాణం సంధించడానికి ధనుస్సు అవసరం!
అటువంటి ధనుస్సే ఓంకారం. ప్రణవార్ధాన్ని తెలుసుకోవడమే జ్ఞానంగా చెప్పబడుతోంది.
అంటే ఇక్కడ ఏకాగ్రతను గూర్చి యోగమున దాని ప్రాధాన్యతను గూర్చి చెప్పబడినది.
,గురువు ద్రోణాచార్యునివద్ద నేర్చుకొన్నఈ యోగ సాధనను ధనుర్విద్యకు
అనుసంధించుటచే అర్జనుడు పక్షి యొక్క కంటిని మాత్రమే చూచి, బాణముచే గుడ్డును
మాత్రమే తాకునట్లు వేయగలిగినాడు.
అంటే విలువిద్య అనే వ్యాజ్యంతో అనేక విద్యలు నేర్పినవాడు గురువు
ద్రోణాచార్యుడు.
అర్జనుడంటూవున్నాడు
యోత్స్యమానాన వేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః ।
ధార్తరాష్ట్రస్య దుర్బుద్దేః యుద్దే ప్రియచికీర్షవః ।। 1-23 ।।
దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రుని సంతోషపెట్టుట కొరకు అతని పక్షాన యుద్ధానికి
వచ్చియున్న అందరిని ఒకసారి
నాకు చూడాలనిపిస్తున్నది.
పాపిష్టి బుద్ధి గలవారైన ధృతరాష్ట్రుని తనయులు రాజ్యాన్ని అన్యాయంగా లాక్కున్నారు.
వారు అధర్మానికి ప్రతీకలు కాబట్టి వారి పక్షంలో పోరాడే వారు కూడా దురుద్దేశంతో
ఉన్నవారే, దుష్టులే! అట్టి దుష్టులను ఒకసారి చూడదలచినాడు. నిజానికి మొదట్లో
అర్జునుడు పరాక్రమంతో యుద్ధానికి ఆతురతతో ఉన్నాడు. దుర్యోధనుడు ఎన్నో సార్లు
పాండవుల వినాశనానికి కుట్రలు పన్నినాడు అని సూచిస్తూ, పాపిష్టి బుద్ధి వారైన
ధృతరాష్ట్రుని తనయుల ను గుర్తు చేసాడు. అర్జునిడి దృక్పథం ఇలా వుంది. "మేము
న్యాయ బద్ధంగా రాజ్యం లో సగ భాగానికి అర్హులము, కానీ అతను దాన్ని లాక్కోవాలని
చూస్తున్నాడు. వాడు చెడు బుద్ది కలవాడు ఇంకా ఈ రాజులు వాడికి సహాయం
చేయటానికి ఇక్కడ గుమికూడినారు, కాబట్టి వారు కూడా దుర్మార్గులే. యుద్ధం కోసం
ఇంత ఆతురత తో ఉన్న యోధులని నేను పరికించి చూడాలి. వారు అధర్మం వైపు
మొగ్గుచూపుతున్నారు, కాబట్టి మా చేత నాశనం అయిపోతారు."
పార్థ అన్న మాటకు పృథ అంటే కుంతీ కుమారుడు అన్న అర్థమే కాక విశాల భావములు
కలిగిన వాడు అనికూడా ఒక అర్థము.
భగవద్గీతలో భగవంతుని ప్రోత్సాహక వాక్యములు
Decision tree, flow chart అన్న ఈ నేటిమాటలను వికల్పము అని సంస్కృతములో
అంటారు.
శ్రీభగవానువాచ:
శ్లో॥ కుతస్త్వా కశ్మల మిదం విషమే సముపస్థితం |
అనార్యజుష్ట మస్వర్గ్యం అకీర్తకర మర్జున! || (2)
శ్లో॥ క్లైబ్యం మాస్మగమః పార్థ! నైతత్త్వ య్యుపపద్యతే |
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప! || (3)
విషమసమయంలో ఈ కశ్మలం (మాలిన్యం) నీకు ఎక్కడి నుండి వచ్చింది? ఇది
ఆర్యులకుఅనగా శ్రేష్ఠులకు తగినది కాదు. స్వర్గాన్ని, కీర్తిని చెడగొట్టేది, పరంతపా!
నపుంసకుడివి కావద్దు. ఇది నీకు శోభనివ్వదు. నీచమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని
విడిచిపెట్టి లేచి నిలబడు.
వ్యాఖ్య :- ధనుర్బాణాలు పారవేసి, రథం వెనుక చతికిలబడి కూర్చున్న అర్జునుని,
పోటుమాటలతో, అతడిలోని దుర్బలత్వాన్ని పారద్రోలాలనుకున్న భగవానుడు,
తారాజువ్వల వంటి, పిడుగుల వంటి మాటలతో అర్జునునికి
చురుకు ముట్టిస్తున్నాడు.
1) అనార్యజుష్టం : ఆర్యులు, అనార్యులు అని 2 జాతులు. ఆర్యులంటే సన్మార్గంలో
నడిచేవారు, పవిత్రులు, తేజస్సు గలవారు, స్వధర్మాన్ని పాటించేవారు, ధర్మాన్ని
నిలబెట్టేవారు. ఈ లక్షణాలు లేనివారు అనార్యులు. నీవు క్షత్రియ కులంలో
జన్మించినవాడవు. ఆర్యపురుషుడవు. నీ పిడికిలిలో బలముంది, గుండెలో ధైర్యముంది,
బాణాల్లోపదునుంది, చేతిలో అద్భుత విద్య ఉంది. అయినా పామరుడిలాగా
ఏడుస్తున్నావు. చేతగాని చవటదద్దమ్మలా చేతులు ముడుచుకొని కూర్చున్నావు. నీకిదేం
బుద్ధి? ఇది ఆర్యులకు తగినదేనా?
2) అస్వర్గ్యం : యుద్ధంలో జయిస్తే రాజ్యం వస్తుంది. ఒకవేళ మరణిస్తే వీరస్వర్గం
లభిస్తుంది. యుద్ధం చేస్తే విజయమో - వీరస్వర్గమో ఏదో ఒకటి ఖాయం. కాని ఇలా
చేతులు ముడుచుకు కూర్చుంటే విజయమూ లేదు, వీరస్వర్గమూ
రాదు.
3) అకీర్తికరం : పోనీ రాజ్యసుఖం వద్దు, స్వర్గ సుఖం వద్దు. యుద్ధం మానేస్తే నీకేమైనా
కీర్తి ప్రతిష్ఠలొస్తాయా? కీర్తి రాకపోగా కావలసినంత అపకీర్తిని నెత్తికెత్తుకుంటావు.
ఇప్పటివరకు అర్జునుడంటే హడల్. ఈ దెబ్బతో అర్జునుడు ఒట్టి 'కాగితంపులి'
అనుకుంటారు. 'పిరికిపంద' అంటారు. ఎగతాళి చేస్తారు.
కనుక అర్జునా! జాగ్రత్తగా ఆలోచించు. యుద్ధం మానేస్తే (1) రాజ్యం రాదు (2) స్వర్గం
రాదు.
(3) కీర్తి రాదు (4) స్వధర్మం నుండి వెనుదిరిగిన వాడివవుతావు. (5) ధర్మరక్షణ జరగదు (6)
అందరూ నిన్ను చూచి పరిహాసం చేస్తారు. ఇదంతా నీకు అవసరమా?
క్లైబ్యం మాస్మగమః : అర్జునా! పేడివి కావద్దు. ఖాండవ వన దహన సమయంలో అపూర్వ
ధైర్యసాహసాలు ప్రదర్శించి దేవేంద్రుని జయించావు. దేవతలకే అసాధ్యులైన నివాతకవచ,
కాలకేయులనే రాక్షసులను హతమార్చిన వాడివి. భీష్మద్రోణాది మహావీరులతో కూడిన
కౌరవసేనను, ఉత్తరగోగ్రహణ సమయంలో నీవొక్కడివే అసహాయుడవై ఎదిరించి
జయించావు. పరమేశ్వరునే ఎదిరించి పోరాడి, పాశుపతాస్త్రాన్ని సంపాదించావు.
పరాక్రమం విషయంలోనే కాదు; నీవు స్వర్గలోకం వెళ్ళినప్పుడు, అప్సరస ఊర్వశి
తనంతతాను వలచివచ్చి, నీ చెంత చేరి, తన కోరికను వెలిబుచ్చింది. అయినా ఆ
సుందరిని తిరస్కరించి, ఇంద్రియనిగ్రహంలో మహామునులను, ఋషి పుంగవులను
తలపింపజేశావు. అందుకు ఆగ్రహించిన ఊర్వశి నపుంసకుడవు కమ్మని శాపమిచ్చింది.
ఆ శాపాన్ని విరాట నగరంలో వరంగా ఉపయోగించుకొని అందమైన అమ్మాయిలకు
ఆటపాటలు నేర్పుతూ నిన్ను నీవే మరచిపోయావు. ఇప్పుడా శాపప్రభావం పోయినా
ఇంకా నీకు ఆ లక్షణాలు పోలేదా? ఇప్పటికీ పేడిలాగానే భావించుకుంటున్నావా?
నీకన్నా మీ అన్న భీమన్న చాలా నయం కదా! విరాటరాజువద్ద వంటలవాడిగా ఉండి,
పప్పుదప్పళాలు వండి వార్చినా, ఇప్పుడు శతృవులపై పళ్ళు పటపట కొరుకుతున్నాడు.
మరి నీవేమిటో! ఇంకా ఆ నపుంసక లక్షణాలను విడవలేకపోతున్నావు. లే, లేచి నిలబడు.
హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టు - అని పిడుగులు కురిపిస్తున్నాడు
భగవానుడు.
పరంతపా! అంటే శతృవులను తపింపజేసేవాడా! అని. ఇలా ఒకవైపు ప్రోత్సాహాన్నిస్తూనే,
బాహ్య శత్రువులనే గాదు అంతః శతృవులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద,
మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను కూడా తపింపజేయాలి అనే హెచ్చరికను అంతర్లీనంగా
అందిస్తున్నాడు
భగవానుడు సర్వమానవాళికీ.
శిష్యుడు, భక్తుడు స్నేహితుడు, అర్జనుడు శ్రీకృష్ణునికి.
చేతగానితనము
వల్ల వచ్చిన దయ దయ కాదు.
బద్ధకము
వలన వచ్చిన వైరాగ్యము వైరాగ్యము కాదు.
In
his commentary on the text, Gandhi conceded, “I do not wish to suggest that
violence has no place at all in the teaching of the Gita.” He acknowledged the
ambivalence that “it is difficult to reconcile a few of the verses with the
idea that the Gita advocates non-violence” but “still more difficult to
reconcile the teaching of the work as a whole with the advocacy of violence.”
Gandhi blamed this ambivalence on the author of the Gita.
భగవద్గీతపై తన వ్యాఖ్యానంలో, గాంధీ ఈ విధముగా తెలిపినారు: "గీత బోధనలో హింసకు
అస్సలు స్థానం లేదని నేను తెలుపుదలచుకోలేదు." "గీత అహింసను
సమర్ధిస్తుంది అనే ఆలోచనతో కొన్ని శ్లోకాలను అన్వయించుట కష్టం" అని అతను
సందిగ్ధతను అంగీకరించినాడు, అయితే "మొత్తం గీతా బోధనను
హింసను సమర్థించుచున్నది అనుట ఇంకా
కష్టం." గాంధీ ఈ సందిగ్ధతను గీతాకారునిపై వ్యక్తము చేసినాడు. ఇది ఆయన
అవగాహనకు నిదర్శనము..
స్వస్తి.
Very neat presentation sir. Thanks for the post.
ReplyDelete