Monday, 18 April 2022

కూర్చుము సద్బుద్ధి కువలయాక్ష

 కూర్చుము సద్బుద్ధి కువలయాక్ష 

https://cherukuramamohanrao.blogspot.com/2022/04/blog-post.html

కేకయాత్మజ తాను కేకల కెరజేయ

తాంతుడై వనికంపె దశరథుండు 

రాక రాక నడుమ రామ చంద్రుడ నిన్ను

పదునాల్గు ముగియగా బడసి నట్టి

క్రూర రాక్షస హంత, కుంఠనము విడదీసి

గూర్చుము సద్బుద్ధి కువలయాక్ష

నానామునీన మాన నమన మనమున

నీనామ మననము నేను మాన

హీర హార విహార హే హేయ హార

వైరివీరాళి సంహార  వాసవేశ  

శ్రావ్య యశ సూర్య వైహాళి  సారసార

సూరి సారస సుర సేవ్య శూర వర్య                                                                                                                                                                                                  భావము: 

కైకేయి అలకబూని కేకలు వేసి దశరథుని నొప్పించి ఒప్పించ మిక్కిలి కలత  జెందినవాడయిన (తాంతుడు) దశరథుడు అరణ్యమునకు రాముని పంపినాడు. 14 సంవత్సరములు అరణ్యవాసము నెరపి రావణుని కూల్చి సీతను తోడుకొని రాక రాక వచ్చినాడు రాముడు అయోధ్యకు. ఈ పద్యపాదమునకు తరచి జూచినచో మరొక గోప్యార్థము ప్రకటిత మగుచున్నది. ‘రాక’ అన్న మాటకు పున్నమి అని ఒక అర్థము. రాముడు అయోధ్యలో ఉన్నపుడు అయోధ్యావాసులకు అది పున్నమియే! ఆయన 14 సంవత్సరముల అరణ్యవాస ప్రారంభము వారికి అమావాస్య. అదే 14 సంవత్సరములు ముగించుకొని అయోధ్యకు వచ్చుట వారికి తిరిగీ పున్నమి. ‘రాక’ అన్నమాటకు భూమి పైకి రాక,  అనగా అయోధ్య లో ఆయన పుట్టిపెరిగి పెళ్ళయి సుఖముగా ఉన్నంతవరకు వారికి పున్నమి. ఆయన లేని అయోధ్య వారికి అమావాస్య. 14 సంవత్సరములు ముగియగానే ఆయన సీతాలక్ష్మణ సహితుడై అయోధ్య చేరుట వారికి పౌర్ణిమ. అమావాస్యనుండి పున్నమి బడయుటకు 14 రోజులు. అప్పుడు చంద్రుడు రామచంద్రునిగా అంటే అత్యంత మొహనాకారుడై అగుపించుచున్నాడు. మరి రామచంద్రుడు కూడా 14 వత్సరముల కాలములో సకల రాక్షస సంహారము చేసి , గడువు పూర్తి అయినవెంటనే రెట్టించిన మొహనాకారముతో అయోధ్యావాసులకు అగుపించినాడు. అట్టి శ్రీరామచంద్రుడు మాయందలి అలసత్వమును (కుంఠనమును) ఎడబాపి సద్బుద్ధిని ప్రసాదించమని వేడికోలు. ఎందరెందరో మహా మహా మహర్షులు తమ మనోవానములో నిన్ను ప్రతిష్ఠించుకొని తపమాచారించుకొనుచున్నారు కదా  అట్టి నీవు నా మనసును ఆవహింపగా , మానకుండా నీ నామ మననము చేసుకొను విధి విధానమును నేను మానను  తండ్రీ! ఇందు మూడవ పాదము నందు పదములు కేవలము 'న, మ' అన్న రెండక్షరముల సంయోగము చేత ఏర్పడిన పదములను మాత్రమే ఉపయోగించుట జరిగినది.

పై సీసపద్యమునకు అనుబంధముగా రచింపబడిన తేటగీతికి ఒక ప్రత్యేకత ఉన్నది. అందు వాడిన పదములలోని అక్షరములు అన్నీ వర్గ రహితములు. అనగా ‘క, చ, ట, త, ప ’ వర్గములకు చెందని ‘య, ర, ల,ళ, వ, శ, ష, స. హ’ లను ఉపయోగించి మాత్రమే వ్రాయుట జరిగినది. ఇక భావమును ఒక పరి పరికింతము.

‘హీర’ అన్న మాటకు వజ్రము, మణి, రవ్వ అని అర్థము. ఒకవ్యక్తి సుగుణ సంపన్నుడయితే అతనిని వజ్రమునకు, మణికి. మనము పోల్చుట కద్దు. అటువంటి సుగుణ మణుల మాలను ధరించి విహరించు, నీచమగు ఆలోచనలను హరించునట్టి, మరియు సన్మతుల విరోధుల ఆట కట్టించు మహనీయుడు మరియు వాసవాదులు అనగా ఇంద్రాది దేవ పూజితుడు, వినుటకు ఎంతయో శ్రావ్యమగు సంభాషణ చేయువాడు,  యశస్సు అను కిరణములను జగద్వ్యాప్తముగా ప్రకటించుచూ విహరించువాడు,  ప్రతిపదార్థ సారమునకు సారమైనవాడు, అగు మహా పండితుడు, సరసమతులగు సకల దేవతలచే సేవింపబడు శూరవర్యుడు శ్రీరాముడు సద్బుద్ధిని ప్రసాదించుగాక!

స్వస్తి.

1 comment: