Tuesday, 17 May 2022

బృహదారణ్యకోపనిషత్తు

 

బృహదారణ్యకోపనిషత్తు

https://cherukuramamohanrao.blogspot.com/2022/05/blog-post_17.html

బృహదారణ్యకోపనిషత్తులోని విషయమును గ్రహించేముందు దాని కర్తయగు యాజ్ఞవల్క్య మహర్షి ని గూర్చి తెలుసుకోవలసిన విషయము ఎంతో ఉంది. ప్రాతఃస్మరణీయులైన ఋషిపరంపరలో యాజ్ఞవల్క్య మహర్షి ఒకరు. మొదట ఆయన స్తుతితో మొదలుపెడదాము.   

యాజ్ఞవల్క్య స్తుతి (కవి పేరు తెలియదు)

సంయమితిలక ! నీ సరసవాక్యంబులు

పరికంప వేదాంత భాషణములు

పరమ ఋషీంద్ర ! నీ కరుణాకటాక్షంబు

లఖిలంబులకు జీవనౌషధములు

ధరణీ సురేంద్ర! నయురు తర క్రోధముల్‌

దావపాపక శిఖాధారణములు

సజ్జన శ్రేష్ఠ నీ సభ్య నైషికములు

సకల పురాణాను సమ్మతములు

దినము నీ వొసంగు దీవన్యనృపతుల

భూరిసంపదలకు గారణములు

నిన్ను సన్నుతింప నేనెట్లు నేర్తును

యాజ్ఞవల్క్య! మునికులాగ్రగణ్య !.

యాజ్ఞవల్క్య మహర్షి (వికీపీడియా సౌజన్యము)

అది  పాంచాల దేశము. అందు చమత్కార పురమను నగరం ఉన్నది. ఆ నగరమున యజ్ఞవల్కుడను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సునంద. ఆ దంపతులకు ధనుర్లగ్నమున ఒక కుమారుడు జన్మించాడు. అతడే యాజ్ఞవల్క్యుడు. తన కుమారునకు అయిదవ ఏట అక్షరాభ్యాసమూ, ఎనిమిదవ ఏట ఉపనయనము చేసి వేద విదుని గావించినాడు. ఇతను బాస్కలుని వద్ద ఋగ్వేదము, జైమిని వద్ద సామవేదము అరుణి దగ్గర అధర్వణవేదమును అభ్యసించినాడు. వైశంపాయనుని వద్ద యజుర్వేదాధ్యయనము కూడా చేసినతరువాత విద్యాహంకారము కలిగి గురుశాపానికి గురియై తాను నేర్చుకున్న వేదజ్ఞానముతా రుధిర రూపములో గక్కి శాపాన్ని బాపుకున్నారు. అతను గక్కిన పదార్థాన్ని తిత్తిరిపక్షులు తిని, అవి తిరిగి పలుకగా ఉపనిషత్తులయ్యాయి. అవే తైత్తిరీయోపనిషత్తులుగా ప్రసిద్ధికెక్కాయి. ఆతరువాత యాజ్ఞవల్క్యుడు సూర్యభగవానుని ఆరాధించి, శుక్ల యజుర్వేదాన్ని నేర్చుకొన్నాడు. సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలనూ సాధించినాడు. తరువాత కాత్యాయిని అను స్త్రీని  వివాహము చేసుకున్నాడు. గార్గి శిష్యురాలైన మైత్రేయి యాజ్ఞవల్కుని తప్ప మరొకర్ని వివాహము చేసుకోనని శపథముచేసి, కాత్యాయిని స్నేహము సంపాదించి ఆమె సమ్మతితో యాజ్ఞవల్క్యుని రెండవ భార్య అయినది. ఇతని ప్రథమ శిష్యుడు కణ్వుడు. వీరి శిష్య పరంపరను కాణ్వశాఖీయులు అంటారు.

జనకుడు యాగము చేయుచూ మహర్షులందరిని ఆహ్వానించినాడు. యాజ్ఞవల్క్యునకు కూడా వర్తమానం పంపాడు. వచ్చిన ఆ మహర్షిని ఉచితాసనం పై కూర్చుండబెట్టినాడు. యాగము పరిసమాప్తి కాగానే అక్కడున్నవారిని ఉద్దేశించి. 'మహానుభావులారా మీలో ఎవరు గొప్పవారో వారు ముందుకు వచ్చి ఈ ధనరాసులు స్వీకరించవచ్చు ' అని గంభీరంగా పలికినాడు. ఎవరూ సాహసించలేదు. ఎవరికి వారే సంశయంలో ఉండిపోయినారు. అంత యాజ్ఞవల్క్యుడు తన శిష్యులతో ఆ ధనరాసులను గృహమునకు పట్టుకువెళ్ళమని ఆజ్ఞాపించినాడు. విన్న విప్రకూటమి అతనితో వాదించి ఓడిపోయినారు. జనకుడు యాజ్ఞవల్క్యుని అందరికన్నా మిన్నగా భావించి పూజించినాడు. యాజ్ఞవల్క్యుడు జనకునకు అనేక ఆధ్యాత్మిక విషయాలు బోధించినాడు. ఒకనాడు విశ్వావసుడను గందర్వుడు యాజ్ఞవల్క్యుని కడకు అరుదెంచి తత్త్వముపదేశించమని అర్థింపగా యాజ్ఞవల్క్యుడు ఆ గంధర్వునకు అనేక విషయాలు తెలియజేగా విశ్వావసుడు ఆనందించి ఆ మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయినాడు.

ఆ మహర్షి అనుగ్రహంతో కాత్యాయిని చంద్రకాంతుడు, మహామేషుడు, విజయుడు అను ముగ్గురు కుమారులను కన్నది. బుషులందరూ యాజ్ఞవల్క్యునకు మాఘశుద్ధ పూర్ణిమ నాడు యోగీంద్ర పట్టాభిషేకం చేశారు. అతను బుషులకు తెలియజేసిన విషయాలే యోగశ్రాస్తమని యోగ యాజ్ఞవల్క్య మనీ ప్రసిద్ధికి ఎక్కినాయి. యాజ్ఞవల్క్యుడు ధర్మమార్గమున తానూ సంపాదించిన సంపదను పటులిరువురిని పంచుకోనమనగా కాత్యాయిని సరే అన్నా మైత్రేయి తనకా సంపద అవసరములేదని తెలుపుతూ తనకు బ్రహ్మతత్వమును బోధించమన్నది. వల్లె యనుచూ ఆమేకుఅటులనే బోధించి సన్యసించినాడు. అతని పేర ఒక స్మతి కూడా ‘యాజ్ఞవల్క్య స్మృతి’ యన్న పేరుతో ప్రచారంలో ఉన్నది. అందు కర్మ జ్ఞానముల వలన మోక్షము కలుగునని తెలియజేసినాడు. యోగమును గురించి చెప్పిన విషయాలు యోగ యాజ్ఞవల్క్యుమను పేర ప్రచారంలో ఉన్నాయి. ఈ బుషి ప్రాతఃస్మరణీయుడు.

 యాజ్ఞవల్క్యుడు ప్రాచీన వేద భారతావనిలో ప్రముఖుడు. ఉపనిషత్తుల్లో ముఖ్యంగా కనిపించే యాజ్ఞవల్క్యుడు శతపథ బ్రాహ్మణం (బృహదారణ్యకోపనిషత్తు సహా), యాజ్ఞవల్క్య సంహిత, యాజ్ఞవల్క్య స్మృతి రచించినాడు.

మిగిలినది మరొకమారు........

బృహదారణ్యకోపనిషత్తు – 2వ భాగము

ఇక విషయానికివస్తే, దీనికి ఆదిశంకరాచార్యులు భాష్యము వ్రాసినారు. ఇందు ఆత్మనుండి ప్రపంచము సృష్టి అయినట్లుకలదు. 2వ భాగమునందు వేదాంత చర్చలు కలవు. బ్రహ్మ, శాస్త్రములచే అగమ్యుడనియు, అభ్యాసము వలన బ్రహ్మను కనుగొన వచ్చునని తెలుపబడినది. యాజ్ఞవల్క్యజనకులకు జరిగిన చర్చ ఇందు కలదు. యాజ్ఞవల్క్యుడు బ్రహ్మ యనగ అచ్యుతుడు నిరంజనుడు, నిరాకారుడు, అచలుడు అని చెప్పియున్నాడు.

జనకునకును యాజ్ఞవల్క్యునకును ఆత్మను గూర్చి చర్చయు, మరియు ఆత్మకు  జాగ్రత్ స్వప్న సుషుప్త్యా వస్థలకు గల సంబంధమును గురుంచియు వివరింపబడినది. ఇట్టి గ్రంథము హైందవ వాజ్మయమందు లేదనుట అతిశయోక్తి కాదు. యాజ్ఞవల్క్యనకును ఆతని భార్య మైత్రేయికిని జరిగిన సంభాషణము నందు గృహమును త్యజించి వానప్రస్థమును స్వీకరించుటకు గల విషయములు వర్ణితములు. ఇందు పునర్జన్మ గురుంచి చెప్పబడియున్నది. శుక్లయజుర్వేదములో పెద్దది చాందోగ్యము, చిన్నది ఈశావాస్యోపనిషత్తు. ఇందులో ఉన్నవి 18 మంత్రములే!

ఇక ఈ బృహదారణ్యకము నందు మనము సాధారణముగా వినే ఏఏ మంత్రములు ఉన్నవో చూతము.

అసతో మా సద్గమయ – అసత్తునుండి సత్తునకు గొనిపొమ్ము.

తమసో మా జ్యోతిర్గమయ – తమస్సునుండి జ్యోతిలోనికి అనగా వెలుగు లోనికి తీసికొని పొమ్ము.

మృత్యోర్మా మమృతం గమయ – మృత్యువు నుండి అమృతత్వమును పొందింపజేయుము..

ఆత్మై వేద మగ్ర ఆసీత్ దేవ ఏవ ... సృష్టికి పూర్వం ఆత్మ

ఒకటియే కలదు అంటే ఆదియందు (మొదట) ఆత్మ ఒకటియే కలదు.

ద్వితీయద్వై భయం భపతి : రెండవ వస్తువు కాని వ్యక్తీకాని యున్నచో భయం కలుగును. (ఆత్మ తప్ప మరియొక వస్తువుకాని, వ్యక్తికాని ఈ ప్రపంచమున లేనందున ఇంక భయమేల కలుగును. (కలుగదని భావము.) ఈ ఆత్మనే మనము పరమాత్మగా అర్థముము చేసుకొనవలెను). ఈ ఆత్మ అన్నది శ్రేష్ఠతమము. పుత్రునికంటెను, ధనముకంటెను, ఇంకను ఏయే పదార్థములు శ్రేష్టములైనవి కలవో వానికంటేను ఆత్మ ఎంతో ప్రియమైనది. ఆత్మ మన సమీపమందే,మనలోనే,  మన స్వరూపమైయే యున్నది. అనాత్మను ప్రియమని చెప్పు మనుజునకు, అత్మజ్ఞుడు ‘అయ్యా!’ మీరు ప్రియమని తలంచు పుత్రాదులు నశ్వరము కదా! అని చెప్పెను. అనాత్మరూపమైన దానికి అస్తిత్వము లేదు. అవిద్యచే వున్నట్లు కన్పించును. కావున ఆత్మ యను ప్రియవస్తువునే ఉపాసించవలయును. ఆత్మను ప్రియమని ఉపాసించువాని ఆనందము ఎప్పటికిని నశించదు. సృష్టికి పూర్వము ఈ ప్రపంచము బ్రహ్మముగా నుండెను. బ్రహ్మము ‘నేనే బ్రహ్మమునై యున్నాను’ అని తలంచెను. కావున అది సమస్తమును అయినది. ఎవడు తన అత్మకంటే వేరైనా దేవత కలదనియు, అది వేరు, తానూ వేరు అనియు భావించి అన్యదేవతోపాసన చేయుచున్నాడో అతడు అవివేకి. ఎవడీ ప్రపంచమున తన స్వరూపమే అయియున్న ఆత్మ నెరుగక మృతినొందునో, అతనిని ఆత్మ (బ్రహ్మము) రక్షింపదు.

అధ్యయనము చేయబడని వేదము మనుజుని రక్షింపనట్లు ఆత్మ అతనిని రక్షింపదు. కాబట్టి ఆత్మ నెరుగని వాడెట్టి మహత్తర పుణ్య మాచరించినప్పటికిని అది ఫలానుభోగాంతమున నశించిపోవును. కావున ఆత్మను తన ప్రపంచమని ఉపాసించవలయును. అట్టివానికి కర్మము అంటదు. ఇట్టి అత్మజ్ఞాని ఏదేది ఇచ్చగించునో, అదంతయు ఆత్మచే ప్రాప్తమగును.

మిగిలినది మరొకమారు.......

బృహదారణ్యకోపనిషత్తు – ౩వ భాగము

కామము, సంకల్పము, సంశయము, శ్రద్ధ, అశ్రద్ధ, ధైర్యము, అధైర్యము, లజ్జ, బుద్ధి, భయము – ఇవి అన్నియు మనస్సే (మనో రుపములే) అయియున్నవి. (యాజ్ఞవల్క్యుడు – ఓ మైత్రేయి) భార్య తన భర్త యొక్క ప్రయోజనము నిమిత్తము ప్రియమైయుండుట లేదు. తన ఆత్మ యొక్క ప్రయోజనము నిమిత్తము ప్రియముగా నున్నది.

అట్లే భర్త తన భార్యయందును, తండ్రి కుమారునియందును ఆ విధముగా సమస్తమును ఆత్మకోరకే కాని వేరుకాదు. ఆత్మయే చూడదగినది; ఆత్మయే వినదగినది; ఆత్మయే తలంచదగినది;

ఆత్మయే ధ్యానింపదగినది. ఆత్మయొక్క స్మరణము చేతను, ధ్యానము చేతను, దర్శనము చేతను, సమస్తము బోధపడును. ఆ ఆత్మయే (విశ్వాత్మయే, బ్రహ్మమే) ఈ ఆత్మ (జీవాత్మ). అది సమస్త ప్రాణులకును అధిపతి. బండిచక్రముయొక్క నాభియందు అరములు (ఆకులు) (Spokes) గ్రుచ్చబడి యున్నట్లు ఈ ఆత్మయందు సమస్తప్రాణములు, సమస్త లోకములు, సమస్త దేవతలు, సమస్త భూతములు గ్రుచ్చబడియున్నవి, అనగా ఇవి ఆత్మకు అనుబంధములై ఉన్నవి. ఆత్మ జలమువలె స్వచ్చమై, ఏకమై, ద్రష్టమై, అద్వైతమై యున్నది. అదియే బ్రహ్మలోకము, అనగా పరబ్రహ్మస్థానము. అది జీవునకు ఉత్తమగతి. అదియే సమస్త సంపదలకంటెను శ్రేష్ఠమైనది. అదియే పరమానందము. ఈ ఆనందముయొక్క ఒక్క అంశమున ఆధారపరచుకొని సమస్త ప్రాణులును జీవించియున్నవి.

మనుజులలో ఎవడు సకల భోగములు అనుభావించుచు ఏదియు కొరతలేక యున్నాడో, అందరికిని యజమానుడై యున్నాడో అట్టివాని ఆనందము కేవలము జీవానందము, ఆత్మానందము కానేరదు. దానికి నూరు రెట్లు ఆనందము కలిగించగలిగినది ఒక పితరుల ఆనందము. దానికి నూరింతలు కలిగించగలిగినది ఒక కర్మ దేవతల ఆనందము. దానికి నూరింతలు కలిగించగలిగినది ఒక ఆజానదేవతల(దేవతలుగానే పుట్టినవారు) ఆనందము. వేదాధ్యనమును చేసినవాడును, పాపరహితుడును, కోరికలు లేనివాడును అజానుదేవతల ఆనందముతో సమానమైన ఆనందము కలవాడై యుండును. ఆ ఆనందమునకు నూరు రెట్లదికమైన ఒక ప్రజాపతి ఆనందము. దానికి నూరు రెట్లు అధికమైనది బ్రహ్మానందము. శ్రోత్రియుడును, అకాముడును, పాపరహితుడను అగు మనుజుడు అట్టి బ్రహ్మానందమును అనుభవించుచున్నాడు.

అదియే పరమానందము. ఈ పరమానదమే బ్రహ్మలోకము (పరబ్రహ్మ స్థానము) – అని యాజ్ఞవల్క్యుడు జనక మహారాజునకు బోధించెను. జీవులలో సాధుకార్యము చేయువాడు సాదువైయుండును, పాపము చేయువాడు పాపియై యుండును, పుణ్యము చేయువాడు పుణ్యశాలియై యుండును. కావున జీవుడు పుణ్యపాపములకు తగిన శరీరమును గ్రహించుటకు కారణమైనవాడుగా నున్నాడు. ఎపుడతనికి ఒక సంకల్పము కలుగునో అపుడు ఒక నిశ్చయబుద్ది కలుగుచున్నది. ఎపుడు నిశ్చయబుద్ది కలుగునో, అపుడు కర్మము చేయనారంబించెను. తదుపరి ఆ కర్మఫలము అనుభావించవలసియున్నది.

జ్ఞాని అకాముడు, నిష్కాముడు, ఆప్తకాముడు, ఆత్మ కాముడు (ఆత్మకంటె వేరుగా మరొకదానిని కోరనివాడు). అట్టి వాని ప్రాణములు ఎచటికిని పోవుటలేదు. అతడు ఇచటనే బ్రహ్మరూపు డగు చున్నాడు.

మిగిలినది మరొకమారు.......

 

 

బృహదారణ్యకోపనిషత్ - 4

ఎపుడు జీవుని హృదయమందు కోరిక లన్నియు నశించి పోవునో, అపుడు మనుజుడు అమృతుడగుచున్నాడు. ఇచటనే బ్రహ్మమును పొందుచున్నాడు.  అవిద్యను ఉపాసించువారు అంధకారబందుర్గమగు సంసారమును పొందుదురు.

మనము పాఠశాలలకు పోకుండా మన తరగతులకు ఏర్పరాచిన పాఠ్యాంశాలు చదువకపోవుట చదువలేక పోవుట అవిద్య కాదు. లౌకికమైన విద్యలన్నీ అవిద్యలే! ఒక్క పారలౌకిక సంప్రాప్తికై గురువులెడ అభ్యసిన్చునదే విద్య. ఈ విధమైన విద్య౭అ నేర్చుకొన ప్రయత్నమూ చేయని వారంతా అజ్ఞానులే!  సందర్భము వచ్చినది కాబట్టి ఇక్కడ ఈ శావాస్యోపనిశాత్తులోని 11వ శ్లోకమును ఉటంకించుచున్నాను:

విద్యాంచావిద్యాంచ యస్తద్వేదోభయం సహ |

అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయాఽమృతమశ్నుతే 11‖

 

ఈ శ్లోకము పై భావమును ద్రువీకరించుచున్నది. అవిద్య మనము జీవితమును కొనసాగించుటకు నేర్చుకోనవలసినదే! అది మృత్యువును దాటిన్చుతుంది అంటే అపమృత్యువు లేకుండా చేస్తుంది, అంతే కానీ అమృతత్వమును ప్రసాదించేది మాత్రము విద్య యే!

అజ్ఞానులు తమస్సుతోగూడిన లోకమున పొందుదురు. అత్మసాక్షాత్కారమును బడసినవాడు విశ్వకృత్తు. అనగా సమస్తము అతని లోకమే, సమస్త లోకములకూ అతను చెందినవాడే! (సమస్త లోకములు ఆత్మయందు కల్పింపబడి యుండుటవలన. ఈ ప్రపంచమున మనము సాధనచే బ్రహ్మత్వమొందినవారము. లేనియెడల మహాకష్టము కలుగును. బ్రహ్మవిద్యచే మోక్షము కలుగును. అదిలేనిచో దుఃఖము కలుగును.      

కలిగినట్టియు, కలుగబోవునట్టియు సమస్తమునకు అధిపతియైన పరమాత్మను ఎపుడు జీవుడు సాక్షాత్కరించుకొనుచున్నాడో అపు డాతడు ఇక దేనికిని భయపడవలసిన పనిలేదు.

 

నిర్మలమైన మనస్సుచేతనే ఆ బ్రహ్మము చూడదగును(సక్షాత్కారింపదగును).ఇచట అనేకత్వము

ఒకింతైనను లేదు. సమస్తము బ్రహ్మమే.ఎవడిచట అనేకత్వము చూచునో, అతడు ఒక  మృత్యువు నుండి మరియొక మృత్యువును పొందును.(జనన మరణ జాలములో దగుల్కొనును). ఈ బ్రహ్మమును ఈకముగా చూడవలెను. అది అప్రమేయము. ధృవమైనది; నిత్యమైనది; మాలిన్యరహితమైనది. ఆకాశము కంటే సూక్ష్మమైనది. జన్మము లేనిది. సర్వశ్రేష్టమైనది. నాశరహిత మైనది. ఇట్టి ఆత్మను (బ్రహ్మమును) ధీరుడగు బ్రహ్మజ్ఞాని ఎరిగి ప్రజ్ఞను బడయవలెను. అనేక శబ్దములను ధ్యానింపరాదు అనగా ఏకాగ్రత కొరకు ఎంత తక్కువ శబ్దములు ఉంటే అంతగా ఏకాగ్రత లభించుతుంది. ఓంకారము అతిచిన్న మాత్రా శబ్దము, నమశ్శివాయ శ్రీమాత్రే నమః, నమో నారాయణాయ మొదలగు మంత్రములు అనుష్ఠాతకు అందుబాటులో ఉన్న మంత్రములు.  ఎట్లనిన అధిక శబ్దములు వాక్కునకు శ్రమయే యగును. ఇట్టి ఆత్మనుగూర్చి వేదఋక్కుచే స్పస్టముగా చెప్పబడి యున్నది. ఆ ఆత్మ నిత్యమైనది. బ్రహ్మవేత్తయెక్క మహిమ అయి వున్నది. అది పుణ్య కర్మచే వృద్ధినిగాని, పాపకర్మచే క్షీణత్వమును గాని పొందుటలేదు. దాని మహిమ నెరింగినవాడు ఇక శాంతుడు. ఇంద్రియ నిగ్రహము కలవాడు, ఉపరతువు, తితిక్షువు, ఏకాగ్రచిత్తుడు. ఇతి సల్లక్షణములతో గూడి ఆ మహనీయుడు తనయందే ఆత్మను దర్శించుచున్నాడు.సమస్తమును ఆత్మగా చూచుచున్నాడు. అతనిని పాపపుణ్యములు అంటవు.అతడు పాపపుణ్యములను దాటుచున్నాడు. అతనిని కృత్యాకృత్య కర్మలు బాధించవు. అట్టి కర్మల నతడు భస్మముచేయగల శక్తిమంతుడు. అతడు పాపరహితుడై, విరక్తుడై, ఇచ్ఛారహితుడై, సంశయవర్జితుడై, బ్రహ్మము నేరింగినవాడై యుండును.  ఇదియే బ్రహ్మలోకము (అంటే ఇప్పుడు వున్నది మనము అంతయు పరమాత్మచే సృష్టించబడిన ఇహ లోకము) – అని యాజ్ఞవల్క్యుడు జనక మహారాజునకు బోధించెను.

మిగిలినది మరొకమారు .....

బృహదారణ్యకోపనిషత్తు  – 5వ భాగము

 

https://cherukuramamohanrao.blogspot.com/2022/05/blog-post_17.html

 

యాజ్ఞవల్క్య,బృహదారణ్యక పనిషత్తుల గూర్చి సంగ్రహముగా తెలుసుకోండి.,

 

బృహదారణ్యకోపనిషత్తు – 5వ భాగము

ఈ ఆత్మ మహత్తరమైనది, జన్మరహితమైనది,వార్ధక్యములేనిది, మరణము లేనిది, అమృతమైనది, అభయమైనది. ఇట్లేరుగువారు ఆ అభయ బ్రహ్మమే (ఆత్మయే) అగుచున్నాడు.

ధనము చేత (సంపదల చేత) అమృతత్వము (మోక్షము) లభింపదు. లభించునను ఆశ వ్యర్ధన. అది ఒక్క సాధన (ధ్యానము) ద్వార మాత్రమే లభింపబడుతుంది.

ఈ ఉపనిషత్తు (అన్ని ఉపనిషత్తులకంటే) పరిమాణంలో చాలా పెద్దది (బృహత్తు). అందుకే దీనిని బృహదారణ్యకోపనిషత్తు అని అంటారు. ఇది పరిమాణంలోనే గాక, విషయ విశిష్టత, సమగ్రత, వివరణ లన్నింటిలో కూడా విశేషమైనదే.

బృహదారణ్యకోపనిషత్తులోని మంత్రాలు 6 అధ్యాయాల్లో విస్తరించి ఉన్నాయి. 1, 2 అధ్యాయాలను మధుకాండ అంటారు. 3, 4 అధ్యాయాలను యాజ్ఞావల్క్యకాండ అంటారు. 5, 6 అధ్యాయాలను ఖిలకాండ అంటారు.

ఇందులో యాజ్ఞవల్క్యుడు, జనకుడు, గార్గి, మైత్రేయి – ఇలా అనేకమంది ఈ ఉపనిషత్తులో ప్రధాన పాత్రధారులు. ఒకరు ఋషిపుంగవుడు, బ్రహ్మజ్ఞాని, ఒకరు రాజు, ఒకరు బ్రహ్మవాదిని, ఒకరు గృహిణి అయినా జిజ్ఞాసువు. అందరు వారి వారి ధర్మాలను నిర్వర్తిస్తూనే సత్యావిష్కరణలో పాలు పంచుకోవడం భారతీయ చింతనలో ఒక విశిష్టతను తెలియజేస్తుంది – సత్యాన్వేషణకు అందరూ అర్హులే – జిజ్ఞాస ఉండాలంతే.

గార్గ్యుడను వ్యక్తికి విద్యాగర్వం మెండు. ఆతను అజాతశత్రువు అనే రాజు వద్దకు వెళ్లి అర్థించబడకుండానే ‘నేను నీకు బ్రహ్మ విద్యను ఉపదేశిస్తా’ నన్నాడు. సరేనన్నాడు నిగర్వి, జ్ఞాని అయిన అజాతశత్రువు. గార్గ్యుడు అజాత శత్రునివద్ద భంగపడతాడు. చివరికి అజాతశత్రువు దగ్గరే ఉపదేశం పొందుతాడు. విద్యాగర్వం పనికి రాదనీ, ఎదుటి వారి సత్తా తెలుసుకోకుండా అహంకరించ కూడదు అనే సందేశంతో ఈ ఉపనిషత్తు మొదలవుతుంది.

జనకుని యజ్ఞం, అక్కడ జరిగిన సభ, అందులోని వాదోపవాదాలు ఈ ఉపనిషత్తులోని పెద్ద ముచ్చట.

ఆత్మను ప్రత్యక్షంగా చూపమన్న ఉషస్తునికి, ***కహోలునికి, ఆత్మ బాహ్య ప్రపంచంలోని వస్తువు (object) కాదని అది మనలోనే ఉండే కర్త (subject) అని యాజ్ఞవల్క్యుడు బోధించిడు.

యాజ్ఞావల్క్యునితో గార్గి వాదోపవాదాలు అత్యంత ఆసక్తికరం, భారతీయ తత్త్వశాస్త్ర సారస్వతంలో ఒక మధుర ఘట్టం. మొదట హిరణ్య గర్భుడే మూలద్రవ్యం అని, ఆయన్ని ఆవరించేది ఇంకేది లేదని యాజ్ఞవల్క్యుడు ఉపదేశించాడు. గార్గి రెండవసారి వాదనకు దిగినప్పుడు సూత్రాత్మ అవ్యక్త ఆకాశంచేత వ్యాపింపబడిందని, ఆ అవ్యక్త ఆకాశం అక్షర బ్రహ్మం చేత వ్యాపింపబడిందని చెప్పి, ఆ అక్షర బ్రహ్మం మాటలకు, ఊహకు అందనిదని, దాని నుండే జీవజాలం ఉద్భవించి, మళ్ళీ దానిలోనే లయం అవుతుందని ఉపన్యసించాడు.

జనకుడికి ఆత్మజ్ఞానం మీద, దేహాత్మల మీద ఇంకా అనేక విషయాల మీద ఉపదేశం ఇచ్చాడు.

భోగలాలసత్వం (దేవతల ప్రకృతి), పరపీడన పరాయణత్వం (ఆసుర ప్రకృతి), లోభం (మానవ ప్రకృతి) – ఇవి మూడూ మన సమాజంలోనే ఉన్నాయని, అవి వరుసగా శమ దమాల వల్ల, దయ వల్ల, దానం వల్ల, నివారించుకోవాలని ఈ ఉపనిషత్తు ఒక చక్కని కథా రూపకంగా వివరించింది.

భార్య మైత్రేయికి, సంపదలు శాశ్వతానందాన్ని ఇవ్వలేవని, ఆత్మానందం అనుభవైకవేద్యమని, అది శ్రవణ, మనన, నిదిధ్యాసల ద్వారా మాత్రమే సాధ్యమని ఉపదేశించాడు.

ఈ ఉపనిషత్తులో లభిస్తున్న మహా వాక్యం “అహం బ్రహ్మాస్మి”. సంక్షిప్తంగా దీని అర్థం “నేను పరబ్రహ్మమును అయి ఉన్నాను”.

ఆసతో మా సద్గమయ

తమసో మా జ్యోతిర్గమయ

మృత్యోర్మా అమృతం గమయేతి (1.3.28)

నన్ను అసత్తు నుండి (చెడు నుండి లేక జడత్వం నుండి), సత్తు (మంచి లేక చైతన్యం) వైపుకునడిపించు . తమస్సు (చీకటి లేక అజ్ఞానం) నుండి జ్యోతి (వెలుగు లేక జ్ఞానం) వైపుకు నడిపించు. మృత్యువు (death) నుండి (అశాశ్వతమైన దాని నుండి) అమృతత్వం (శాశ్వతమైన దాని వైపు) (immortality) వైపుకు నడిపించు. అని ముముక్షువు ఆ పరమాత్మను వేడుకుంటున్నాడు. భారతీయ సంప్రదాయంలో, ధనంతో పొందగలిగే భోగాల కంటే చైతన్యంతో కూడిన సత్ ప్రవర్తన, జ్ఞాన సముపార్జన ద్వారా మోక్షం (అమృతత్వం) మాత్రమే ఉన్నతమైనవి.

ప్రతి జీవికి అన్నింటికంటే ప్రియమైనది ఏది?

ప్రతి జీవికి అన్నిటికంటే ప్రియమైనది – తానే.

తనకు అన్నిటి కంటే ప్రియమైనది తానే (ఆత్మయే) అని చెప్పే వాక్యం ఏది?

తదేతత్ప్రేయః పుత్రాత్ప్రేయో విత్తాత్ప్రేయో2

న్యాస్మాత్సర్వస్మాదన్తరతరం యదయమాత్మా (1.4.8)

ఈ ఆత్మతత్త్వం పుత్రుని కంటే, సంపద కంటే ఇతరములైన అన్నిటి కంటే ఉత్తమమైనది. కనుక దానినే ప్రేమతో ఉపాసించవలయును.

బ్రహ్మ వా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానమేవావే

దాహం బ్రహ్మాస్మీతి, తస్మాత్తత్సర్వమభవత్ (1.4.10)

సృష్టికి పూర్వం ఉన్నది పర బ్రహ్మమే. నేనే పరబ్రహ్మమని తనకు తానే ఆ పరబ్రహ్మమును తెలిసికొనెను. మానవుడు కేవలం ఈ జడ స్వరూపం కాదు. పుట్టుకకు ముందు, తర్వాత కూడా మానవుడు నిజానికి ఆత్మ స్వరూపుడే. తరువాత జ్ఞాన సముపార్జన చేత ‘అహం బ్రహ్మాస్మి’ నేను ఆత్మ స్వరూపుడను అని తెలిసికుంటాడు. అదే ముక్తి.

తాను బ్రహ్మము కంటే వేరనే భ్రమతో ఇతర దేవతలనారాధిస్తే ఆ దేవతలు అటువంటి వారి చిన్న కోర్కెలు తీర్చి తమ ఆధీనంలో పెట్టుకొని పశువులను చూసినట్లు చూస్తారు. అందుచేత అలాంటి దేవుళ్ళను ఉపాసించడం కంటే బ్రహ్మోపాసన మేలని చెప్తుందీ ఉపనిషత్తు.

సత్యం, ధర్మం వేరు వేరా?

సత్యం, ధర్మం వేరు కాదు. ధర్మంలో భాగమే సత్యం అని ఈ మంత్రం చెప్తుంది.

తస్మాత్సత్యం వదంతమాహుర్ధర్మం వదతీతి ధర్మం వా

వదంతం సత్యం వదతీత్యేతద్దేవైతదుభయం భవతి (1.4.14)

సత్యం పలికే వాడిని ధర్మం పలికే వాడుగాను, ధర్మం పలికే వాడిని సత్యం పలికేవాడు గాను అంటారు. అంటే సత్యం, ధర్మంలో ఒక భాగమే అన్నమాట. పురుషార్థాలలో సత్యాన్ని ప్రత్యేకంగా పేర్కొనక పోవడానికి కారణం ఇదే.

మిగిలినది మరొకమారు ..........

 బృహదారణ్యకోపనిషత్తు 6వ భాగము

కోరికలను పూర్తిగా త్యజించవలసిన అవసరం లేదు. ధర్మబద్ధమైన కోరికలుండటంలో తప్పు లేదు.

మొదట జీవాత్మ ఒకటిగానే ఉన్నాడు. తరువాత భార్య, సంతానం, సంపద కావాలనే కోరిక పుట్టి వాటిని పొందినాడు. తరువాత తన కోసమో తనవారి కోసమో కర్మలు చెయ్యాలనుకున్నాడు. ఈ విధంగా కోరికతోనే పరిపూర్ణత పొందినాడు. ‘అకామస్య క్రియానాస్తి’ అని మనుస్మృతి. కోరిక లేకపోతే కర్మలేదు, ప్రపంచం స్తంభిస్తుంది. కనుక ధర్మబద్ధమైన కోరికలు ఉండవలసిందే. అయితే ఈ కోరికలు దురాశకు దారి తీయకూడదు. ‘దురాశ దుఃఖమునకు చేటు’ అనికదా పెద్దలమాట. తెలిసిన కథను అతి క్లుప్తముగా నేను వ్రాసిన పద్యరూపములో చదువండి.

ఆశకుపోయి మూర్ఖుడొక అవ్యయ భూమిని పొందగోరుచున్

పాశముతోడ నీశ్వరుని బాయక ధ్యానము చేసి వరంబు కోరగా

ఈశుడు వల్లెయంచు తన ఇచ్చకు చుట్టిన మేర కొమ్మనన్

కోశపు శక్తి మించురికి కొల్పడె ప్రాణము ఆశ తోడుతన్

తస్మాత జాగ్రత.

పంచ భూతాత్మకమైన ప్రపంచం అంటే నామం, రూపం, కర్మ అని ఉపనిషత్తు చెప్పింది. నామములకు ముఖ్యకారణం వాక్కు. దీని నుండే నామాలన్నీ పుట్టుకు వస్తాయి.

‘సత్యస్య సత్యం’ అన్నదే ఆత్మ అని ఉపనిషత్తు ప్రవచించింది.

ఏ ఆత్మ వలన సృష్టి, స్థితి, లయాలు జరుగుచున్నాయో, ఆ ఆత్మను గూర్చి చెప్పేది ఉపనిషత్తు. అందుచేత ఉపనిషత్తును సత్యస్య సత్యం అంటారు. అట్లాగే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణం అన్నీ సత్యాలే. కాని వాటికి మించిన సత్యం, అంటే ఆత్మను సత్యస్య సత్యం అని చెబుతుందీ ఉపనిషత్తు. ఆత్మ కర్తగా హృదయకుహరంలో ఉంటుంది. గనుక దానిని చూడలేము.

ఉషస్తుడు ఆత్మను ప్రత్యక్షంగా చూపమని యాజ్ఞవల్క్య మహర్షిని అడిగినపుడు ఆయన ఆత్మ స్వరూపాన్ని ఈ విధంగా వివరించినాడు. కంటిలో చూచే శక్తి ఉంది. ఆ శక్తిని కన్ను చూడగలదా? అట్లాగే చెవి శ్రవణ శక్తిని, మనస్సు మానస శక్తులను చూడగలవా? ఆత్మ కర్త (subject) దానిని నీవు బాహ్య వస్తువుగా (object) చూస్తున్నావు. ఆత్మ నీలోని కర్త గనుక దానిని నువ్వు ప్రత్యక్షంగా బాహ్య వస్తువుగా చూడలేవు. అది సర్వాంతర్యామిగా ఉండే శక్తి. దీనిని తెలుసుకో.

ధ్యాన నిష్ఠ లో ఉండే వాడు మునిగా మారతాడు.

బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞాన సముపార్జన చేసి, జ్ఞాన బలముతో, ఆత్మ జ్ఞాన సంబంధిత విషయాల మీద మాత్రమే ఎకాగ్రచిత్తులయి మెలగాలి. కేవలము పాండిత్యం సరిపోదు. దాన్ని ప్రక్కన విడిచి పెట్టి అమాయక బాలునివలె, ధ్యాన నిష్ఠలో ఉండాలి. అంటే ఒక సంవత్సరము రెండేళ్ళ మధ్య వయసు గలిగిన బాలుడు తానూ చేపట్టిన పని మంచిదో చెడ్డదో, పూర్తి చేయువరకు తన ధ్యాసను ప్రక్కకు మరల్చడు.ఆ విధంగా పట్టువిడువక ప్రయత్నిస్తే క్రమంగా సాధకులు మునులుగా పరివర్తన చెందుతారు.

సూత్ర బ్రహ్మ అంటే ఎవరు?

సూత్ర బ్రహ్మ అంటే వాయువని ఉపనిషత్తు వివరించింది.

ఈ జన్మను, తరువాతి జన్మను, సర్వ భూతాలను పూలమాల వలే కలిపేది వాయువే. మన శరీర భాగాలను కూర్చి సంఘటితంగా ఉంచేది వాయువే. అది నిష్క్రమించిన తరువాత అవి విడిపోతాయి. అందుచేత వాయువే సూత్ర బ్రహ్మ.

‘అక్షర బ్రహ్మం’ అంటే ఎవరు?

అక్షర బ్రహ్మం అంటే నాశరహితమైన ఆత్మ.

అక్షరం (నాశనం లేని ఆత్మ) చూడబడదు గాని చూస్తుంది. వినబడదు గాని వింటుంది. మననం చేయబడదు గాని మననం చేస్తుంది. తెలియబడదు గాని తెలుసుకుంటుంది. ఆత్మ కర్తగా, అంతర్నిహితంగా ఉండేదే గాని మనచేత చూడ శక్యమైన బాహ్యవస్తువు కాదు, అది సర్వాంతర్యామి. సర్వ శక్తి శాలి.

శరీర త్యాగం ఎలా జరుగుతుంది?

శరీర త్యాగ క్రమాన్ని ఉపనిషత్తు ఈ విధంగా వివరించింది.

గరిక యందలి పురుగు తను ఉన్న గడ్డి పోచ చివర వరకు వచ్చి దాని నుండి మరియొక గడ్డిపోచ మీదకు ప్రాకి, దాని ఆధారం దొరికిన తరువాత వెనుకటి గడ్డిపోచను విడుస్తుంది. అదే రీతిలో జీవుడు ప్రాణోత్క్రమణ సమయంలో మరియొక దేహాన్ని ధరించి వెనుకటి శరీరాన్ని అచేతనం చేస్తాడు.

ఆత్మ సాక్షాత్కారం ఏ విధంగా చేసుకోవాలి?

శ్రవణ, మనన, నిధి ధ్యాసలు ద్వారా చేసుకోవాలి అని ఈ విధంగా ఉపనిషత్తు వివరించింది. ఓ మైత్రేయీ! చూడదగినది ఆత్మ మాత్రమే. ఆత్మావలోకనం చేసుకోవాలంటే ముందుగా సద్గురువు నాశ్రయించి, ఆయన ఉపదేశాన్ని శ్రద్ధగా విని దాన్ని మననం చేసుకుంటూ క్రమంగా దాని మీదే ధ్యాస ఉంచి ధ్యానం చెయ్యాలి. ఆ విధంగా శ్రవణ, మనన, నిదిధ్యాసల ద్వారా ఆత్మావలోకనం చేసిన తరువాత ఇంక తెలుసుకోవలసినదేమీ ఉండదు.

స్వస్తి.

భగవంతుని అనుగ్రహము ప్రాప్తించితే ఇదే విషయముపై మరొకమారు విమర్శ కొనసాగించుకొందాము.

స్వస్తి.

 

Sunday, 15 May 2022

శ్రీ శైల శిఖరం దృష్ట్వా

 శ్రీ శైల శిఖరం దృష్ట్వా

https://cherukuramamohanrao.blogspot.com/2022/05/blog-post_15.html

పద్మపురాణంలో ఉత్తరఖండంలో శివక్షేత్రాల గురించి చెబుతూ,

మల్లికార్జునుని ప్రశస్తిని చెబుూ ఈ వాక్యం చెప్తారు

కేదారే ఉదకం పీత్వా వారణాస్యాం మృతోధృవం!

శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే!! (పద్మపురాణం)

కేదారంలోని తీర్థం త్రాగినావారణాసిలో మరణించినా,

శ్రీశైల శిఖరాన్ని దర్శించినా పునర్జన్మ ఉండదు. అంటే "మోక్షం తప్పక లభిస్తుంది" అని అర్థం.

స్కాందపురాణంలో కాశీఖండం మరీ స్పష్టంగా వివరించింది.

"శ్రీశైల శిఖరం శ్రీమదిదం తద్యద్విలోకనాత్!

పునర్భవో మనుష్యాణాం భవేత్ర న భవేత్ క్వచిత్!

గిశ్చతుర శీత్యాయం యోజనానాం హి విస్తృతం!!

సర్వలింగమయో యస్మాత్..."

"శ్రీశైల శిఖరం శుభమయమైనది. దానిని దర్శించినంత మాత్రానమరి జన్మ ఉండదు. ఎనభై నాలుగు యోజనాల విస్తృతి కలిగిన శ్రీగిరి సర్వలింగమయం."

తిరుమలగిరినీశ్రీవేంకటేశ్వరునీదర్శించితే తప్పక శ్రీనివాస కృపాబలం చేత తరించుతాము. ముక్తి లభిస్తుంది. అయితే ఇది చెప్పడానికి శ్రీశైలాన్ని కాదనక్కరలేదు కదా! ఒకరి మంచిని చెప్పడానికి ఇంకొకరిని చెడుగా పేర్కొననవసరం లేదు కదా!

శ్రీశైలంలో ’శిఖరేశ్వరం’ అని చెప్పబడే శిఖరప్రాంతాన్ని చూడడం చాలు. అక్కడ నంది కొమ్ముల్లోంచి ఆలయశిఖరం చూడవలసిన అవసరం లేదు.

స్వస్తి.

Tuesday, 3 May 2022

సదయం హృదయం

సదయం హృదయం 

https://cherukuramamohanrao.blogspot.com/2022/05/blog-post.html

 सदयं हृदयं यस्य भाषितं सत्यभूषितम् ।

कायं परहितं यस्य कलिस्तस्य करोति किम् ॥

సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం |

కాయం పరహితం యస్య కలిస్తస్య కరొతి కిం ||

సదయమైన హృదయముండి సత్య భాష భుషణుడై

పర హితమే పరమావధి పరమాత్మను చేరుటకును

అని నమ్మిన వాని నేమి ఆ 'కలి' ఇక చేయగలడు

ఆలకించుడీ  సూక్తి అందుకోండి మీరు ముక్తి

ह्रदय कभी सदय हो

सत्यवचन भूषण हो

पर हित ही परमात्मा

का साया समझ गयो

करता क्या कलिपुरुष

वही तेरा महा धनुष

sadayaM hRudayaM yasya bhaaShitaM satyabhUShitam |

kaayaM parahitaM yasya kalistasya karoti kim ||

Heart with compassion

Free from any corruption

No hurting no flirting

Making word lethal sword 

With truth as the sharp blade

How can that KALI great

Dare to come to you to treat