గీతా వాక్యము
https://cherukuramamohanrao.blogspot.com/2022/09/6-40.html
పార్థ నైవేహ నాముత్ర వినాశస్తత్య విద్యతే ।
న హి కల్యాణకృత్కశ్చిత్ దుర్గతిం తాత గచ్ఛతి ।।6 - 40 ।।
పృథ పుత్రా,(పృథ
అన్నది కుంతీదేవికి మరోకపేరు) శుభ కార్యాలలో నిమగ్నమైన సాధకుడు ఇహలోకంలో గాని
ఆధ్యాత్మిక ప్రపంచంలో గాని వినాశనానికి గురికాడు; నా మిత్రమా,
మంచి చేసేవాడు, చెడుచేత ఎప్పటికీ జయించబడడు.
తాత అన్న పదం అనురాగాన్ని సూచిస్తుంది. నిజానికి తాత అన్న సంస్కృత శబ్దమునకు ‘నాయన’ తండ్రి’ అని అర్థము. పెద్దలు గురువులు తమకన్నా చిన్నవారిని ‘తండ్రీ’ ‘నాయనా’ అని సంబోధిస్తారు కదా! దీనర్థం "పుత్రుడా" అని. అందుకే గురుస్థానములో ఉన్న పరమాత్మ అర్జునుని ‘తాత’ అని సంబోధించినాడు. ఆయన తన మార్గము లో ఉన్న వారి బాగోగులను తనే చూసుకుంటాడు అని చెప్పటానికి శ్రీ కృష్ణుడు సంకల్పించినాడు. వారు అత్యంత పవిత్రమైన కార్యములో నిమగ్నమై ఉన్నారు
కదా!. మరియు "మంచి చేసే వారు ఎప్పుడూ కూడా కష్టాల పాలు కారు." ఈ మాటకు అర్థము కష్టాలు రావనికాదు, అటువంటివి ఏవి కలిగినా భగవానుడు సహకరించి తన భక్తులను
కాపాడుతాడు. ఈ విషయమును ధృవపరుస్తూ జరిగిన నా జీవిత అనుభవము తెలియజేస్తాను. నన్ను
నా శ్రీమతిని బంగళూరు విమానాశ్రయము చేర్చుటకు నా బావమరదులు తేరు (Car) లో
పిలుచుకుపోతున్నారు. నా చిన్న బావమరిది చోదకుని (Driver) స్థానమును
ఆక్రమించినాడు. బండి సుమారగు దూరము పోయినతరువాత అనుకోని రీతిలో వేగముగా
వస్తూవున్న బండిని కట్టె ఊతతో నడిచే ఒక ముసలి ఆవిడ ఎంత వేగముగా దాటుకొన్నదో
చూసినవారు చెప్పుటకు మాటలు అందవు. ఆంగ్లములో ఒక సామెత ఉన్నది A
stitch in time saves nine’ అని. కానీ ఆ Stitch వేసిన వాడు పరమాత్మ.
ఆ ముదుసలిని, నా మరుదులిద్దరిని, మాయిద్దరిని,
బండిని, మా ప్రయాణమును, దారిలో జరుగు రాకపోకలను, రక్షకభట చెరను
తప్పించింది. చిత్త శుద్ధితో ఆయనను నమ్మినవారికి కీడు జరగదు. అసలు ఏమి జరిగినా
ఆయనే దిక్కు అన్న అచంచల విశ్వాసము మనలో అత్యంత అవసరము.ఇహపర సాధనకు భక్తునకు భగవంతుడే తోడునీడయై
ఉంటాడు అన్నఈ శ్లోకార్థము
ఇప్పుడు ఈ ఉదంతములో రుజువయ్యినది కదా!
భగవంతుడు వేద రూపములో మనకు ధర్మమును ఉపదేశించినాడు. సాధారణంగా మనుష్యుల్ని వేధించే ప్రశ్న ఒకటి ఉంది. “భగవంతుడు మనకు ప్రత్యక్షమవుతాడా? అతడు మన ఎదుట వచ్చి మనకేమయినా చెప్తాడా? మరి భగవంతుని అనుగ్రహము అంటే ఏమిటి?" అన్నది ప్రశ్న. ఈ ప్రశ్నకు కొందరు ఆధునికులు చెప్పే తప్పుడు సమాధానము
ఏమిటంటే "ఇదంతా సామాన్య జనులను మోసం చేయ కల్పించిన కథగా కనబడుతుంది" అని వారి సమాధానము. భగవంతుని అనుగ్రహము ఎలా ఉంటుందో మన ప్రాచీనులు ఒక తగిన సమాధానం చెప్పారు.
న దేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత్ |
యం హి రక్షితుమిచ్ఛంతి బుద్ధ్యా సంయోజయంతి తమ్ ||
***భగవంతుని అనుగ్రహం అంటే అతడు ఒక కర్ర చేతితో పట్టుకొని పశువుల కాపరి పశువుల్ని తోలుకొని వెళ్లినట్లు జనం చుట్టూ తిరుగుతాడని అర్ధం కాదు, దాని అర్ధం ఏమనగా భగవంతుడు మనకు మంచిపని చేసే బుద్ధి పుట్టిస్తాడు. మనం ఏ పని చేసినా అది బుద్ది ప్రేరణ చేతనే జరుగుతుంది. ఈ ప్రేరణ ఫలానా పని చెయ్యాలనే కోరికవల్ల కలుగుతుంది. అలాంటి ప్రేరణ లేకపోతే ఎవ్వడూ ఏపనీ చెయ్యడు. పని చెయ్యాలనే కోరిక, ప్రేరణ ఎక్కడ నుండి వస్తాయి అనే ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం ఒకటే. అవి భగవంతుని నుండే వస్తాయి. భగవంతుని ప్రేరణ లేకపోతే మనం మంచి పనులు చెయ్యాలనే బుద్ధి ఎలా కలుగుతుంది?
"పనులు చేయడానికి ప్రేరణ భగవంతుని నుండే వచ్చే పక్షంలో మంచి పనులు మాత్రమే చేయడానికి ప్రేరణ రావాలి కానీ, అలాంటప్పుడు చెడ్డ పనులు చెయ్యాలనే ప్రేరణ ఎక్కడ నుండి వస్తుంది" అని కొందరు ప్రశ్నిస్తుంటారు. దీనికి సమాధానం ఏమనగా, చెడ్డ పనులు చేయడానికి ప్రేరణ కూడా భగవంతుని నుండే వస్తుంది. అయితే భగవంతుడు మన చేత చెడ్డ పనులు చేయించాలనుకొంటాడా? అలాంటి భగవంతుడు ఏం భగవంతుడు? మన చేత అంత ఉన్నత స్థానంమీద ఉంచబడి, మన నుండి ఆరాధనలు అందుకొంటున్న ఆ భగవంతుడు మన చేత చెడ్డ పనులు చేయిస్తాడా అని ఒక ప్రశ్న. దీనికి శాస్త్రాలలో ఉన్న సమాధానం ఇది. నువ్వు పూర్వజన్మలో ఏవేవో పాపాలు చేసి ఉంటావు. వాటి ఫలాన్ని నువ్వే అనుభవించవలసి ఉంది. అందుచేత భగవంతుడు నీచేత ఆ పాప ఫలాన్ని అనుభవించడానికి దారితీసే పనులు చేయిస్తాడు. అందుచేత ఈ విషయంలో భగవంతుని బాధ్యత ఏదీ లేదు. ఆయనను దూషించడానికి అవకాశమేలేదు.
పూర్వజన్మ కర్మ ఫలాన్ని అనుభవించడం కోసం జన్మల చక్రం అనాది కాలం నుంచి తిరుగుతూ వస్తుంది. ఈ సంసారం అనాది అనే విషయాన్ని శ్రీవేదవ్యాసులు బ్రహ్మ సూత్రాలలోనూ, శ్రీభగవత్పాదులు ఆ సూత్రాలకు వ్రాసిన భాష్యంలోనూ స్పష్టంగా చెప్పి ఉన్నారు. అందుచేత అనాదియైన ఈ సంసారంలో ప్రతి ఒక్కడు తన పూర్వజన్మలకర్మ ఫలితాలను అనుభవించాలని చెప్పడంలో దోషం ఏమీ లేదు. అశాస్త్రీయం ఏదీ లేదు.
ఇపుడు
ఛాందోగ్యోపనిషత్తులోని, చిన్నదయినా రుజువర్తనను నిర్దేశించి ధర్మపథము వైపు నడుపు,
ఒక కథను విందాము. ఒకసారి బ్రహ్మదేవుడు దేవ మానవ దానవ కూటములను తాను చేయబోవు
ఉపదేశార్థమై రమ్మన్నాడు. మూడు వర్గములవారూ చెప్పినదే తడవుగా వచ్చి నిలచినారు.
ఉపదేశము తృటిలో ముగిసింది. బ్రహ్మ దేవుడు 'దదద' అని మూడుమార్లని సభచాలించి
వెళ్లిపోయినాడు. మూడు వర్గముల వారు కూడా తమ తమ నెలవులకు దీర్ఘ ఆలోచనా చిత్తులై వెడలినారు.
స్థావరము
చేరి దేవతలు బృహస్పతిని తమ సందేహ నివృత్తికై ఆశ్రయించగా ఆయన ‘దేవతలుగా మీకు అన్ని
సౌఖ్యములూ అమరినాయి. దుఃఖమన్నది మీ చాయలకు రాదు. అందుచే మీలో అహంకారము తావుచేసుకొంటుంది.
అందుచేత మీకు ‘దామ్యత’ అనగా మిమ్ముమీరు నిగ్రహించుకొనుట అవసరము.
అదేవిధముగా
మానవులు శ్రీరామునికే గురువైన వశిష్ఠుని వద్దకు పోయి తమ సందేహమును విన్నవించుకొన్నారు.
ఆయన వారితో ఈవిధముగా అన్నాడు. “ మీకు
పరమాత్మ కష్టసుఖాలనిచ్చినాడు. కానీ యోచన చేయగల బుద్ధిని ప్రసాదించినాడు. సుఖమయ
జీవితము గడుపుటకు వలయు సంపద సమకూర్చుకొను వనరులను ఒసంగినాడు, అనగా ఐశ్వర్యమును
సమకూర్చినాడు. కానీ మీలో స్వార్థము అసూయ పిశినారితనము ప్రబలి సాటిమనిషికి సాయము చేయరు. కావున మీకు ‘దత్త’అనగా విరాళము గా నొసగుట అన్న గుణము, అవసరము. అసలు
సంస్కృతపదమగు ‘దత్త’ కు అర్థము ఉదార గుణము. పరుల కష్టమును, పరుల అవసరమును తమ
అవసరముగా భావించి చేతనయిన సహాయము చేయుట. ఇది మీరు పాటించవలసినది. ఈ విధముగా
పాటించుతూ కొంతకాలము తరువాత మరుల రండి అని చెప్పినాడు. సరే యంచు వారు తమ
నిజవాసములకు వెడలినారు.
ఇక రాక్షసులు కూడా తమ గురువగు శుక్రాచార్యుని వద్దకు పోయి తమ యొక్క ‘ద’
కు అర్థము అడిగినారు. అందుకు శుక్రాచార్యుడు “మీలో కౄరత, కర్కశత్వము,
నిర్దాక్షిణ్యత ఎక్కువ. దయ, జాలి, సానుభూతి అన్నవి మీలో మృగ్యము. అందుకే మీరు ;దయధ్వం’
అనగా దయాగుణమును పెంచుకోవాలి అని చెప్పినాడు.
కొంత కాలము తరువాత వశిష్ఠులవారు చెప్పినట్లు మనుజ సమూహము ఆయన వద్దకు వెళ్ళినారు. ఆయన వారలనుద్దేశించి ఈ విధముగా చెప్పదొడగినాడు ‘దేవతలకు రాక్షసులకు భిన్నముగా, భగవంతుడు మీలో ఇటు సుగుణములు అటు దుర్గుణములు ఒసంగినాడు. ఒకప్రక్క దయ మరొక ప్రక్క దానవత్వము కూడా ఇచ్చినాడు. కానీ మీలో తర్కించుకొనుటకు గానూ బుద్ధి అన్నదానిని ఏర్పాటు చేసినాడు. ఈ బుద్ధి మంచిని గూర్చీ ఆలోచించవచ్చు చెడుగును గూర్చీ ఆలోచించవచ్చు. నిర్ణయము మీ మీదే అధారాడుతుంది. అందువల్ల మీకు ఈ మూడు ‘ద’లు అన్వయమౌతాయి. ఇప్పుడు కొంతమేరకన్నా దానగుణమును అలవాటు చేసుకొనియుంటారని తలచి మీకు ఈ ఉపదేశము చేయుచున్నాను. సరయిన అవగాహనతో మీరు మంచిని పెంచండి, మానవతను ఉంచండి, అహంకారమునకు అడ్డుకట్ట వేయండి. దయకు దాక్షిణ్యమునకు పెద్దపీట వేయండి, అహంకారమును దరికి రానీయకండి. మీకు శుభము కలుగుతుంది, పోయిరండి అని చెప్పినాడు.
అంతటి మహనీయుడు చెప్పినది ఆచరించమనితప్ప నేను నామాటగా వేరేమి చెప్పగలను. ఆయన ఉపదేశము మనకందరకూ శిరౌధార్యము.
స్వస్తి.