Tuesday, 21 February 2023

ఖాండవము-మయసభ-మయులు

           ఖాండవము-మయసభ-మయులు                https://cherukuramamohanrao.blogspot.com/2023/02/blog-post_21.html        

మహాభారత రచన చేసినది పరాశర మహర్షి కుమారుడయిన వేదవ్యాసుడు.  కృష్ణనిర్యాణము కలియుగము క్రీస్తుకు పూర్వము 3102 ఫిబ్రవరి 17 గురువారము రాత్రి 11-55 కు  ప్రారంభమైనదని చెబుతారు.   మహా భారత కథను వ్యాసుడు రచన చేసిన సమయం మూడు సంవత్సరాలు . వ్యాసులవారు మహా భారత కథను చెప్పుటకు స్వర్గలోకంలో నారద మహర్షిని, పితృ లోకములో దేవల మహర్షిని, గంధర్వ లోకములో శుక మహర్షిని, సర్ప లోకంలో సుమంతుడిని, మానవ లోకంలో చెప్పడానికి వైశంపాయన మహర్షిని నియమించినట్లు చెబుతారు. కురుక్షేత్రంలో మహాభారత యుద్ధము భీషణమైన దేవాసుర యుద్ధమునకు పోల్చుతారు. ఈ యుద్ధంలో భీష్ముడు 10 రోజులు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు అర్ధ రోజు సైన్యాధ్యక్షత వహించినారు. మిగిలిన సగం రోజు భీముడు ధుర్యోధనునితో యుద్ధం చేసి అతని తొడలు విరుగగొడతాడు. ఈ మొత్తము యుద్ధంలో కౌరవ పక్షం వహించి పోరాడిన వారి సంఖ్య 11 అక్షౌహిణులు. పాండవ పక్షం వహించి పోరాడిన వారి సంఖ్య 7అక్షౌహిణులు. మొత్తము 18 అక్షోహిణులు. అందరూ అసువులు బాసిన వారే, కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ, కృష్ణుడు, సాత్యకి, పంచ పాండవులు తప్పనిచ్చి.

ఈ యుద్ధం జరిగిన ప్రదేశము కురుక్షేత్రము. దీనినే బ్రహ్మక్షేత్రమని, భృగు క్షేత్రమని, శమంత పంచకమని అనేవారు. తన తండ్రిని అధర్మంగా చంపిన క్షత్రియ వంశాల మీద పరశురాముడు 21 పర్యాయములు భూమండలం అంతా తిరిగి దండయాత్ర చేసి క్షత్రియ వధ చేసిన సమయంలో క్షత్రియ రక్తంతో ఏర్పడ్డ ఐదు తటాకాలే ఈ శమంతక పంచకం. పరశురాముడు తన తండ్రికి ఇక్కడ తర్పణం వదిలి క్షత్రియుల మీద తనకు ఉన్న పగ తీర్చుకున్నాడు. రాజుల రక్తము ఆయన త్రవ్విన 5 మడుగులు నిండినదని అంటారు. ఇక భారతాన్ని గూర్చి వ్యాసులవారు చెప్పిన మాట:

ధర్మతత్త్యజ్ఞులు ధర్మశాస్త్రంబని

యాధ్యాత్మ విదులు వేదాంతమనియు

నీతి విచక్షణుల్‌ నీతిశాస్త్రంబని

కవి వృషభులు మహాకావ్యమనియు

లాక్షిణికులు సర్వలక్ష్య సంగ్రహమని

యైతి హాసికులితిహామనియుఁ

బరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్ఛ

యంబని మహి గొనియాడు చుండ

 

వివిధ వేదతత్వవేది వేదవ్యాసు

డాదిముని పరాశరాత్మజుండు

విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై

బరుగుచుండజేసె భారతంబు.

వినాయకుని ఆదేశానుసారం వేదవ్యాసుడు ఆగకుండా చెప్తుంటే వినాయకుడు తన దంతమును విరిచి ఘంటముగా చేసికొని మహాభారతకథను లిఖించినాడు. మనము ఇచట నుండి మనకు కావలసిన విషయమునకు నేరుగా వస్తాము.

 సుభద్రకు అర్జనునకు ఎంతో వైభవోపేతముగా వివాహము జరిపించినారు బలరామ కృష్ణులు. ఎనలేని గోధన గజధన ఆశ్వధనాదులతో కూడా  దివ్య వస్త్రాభరణములు, దాస దాసీ జనములతో శ్రీ కృష్ణ పరమాత్ముడు కొందరు యదు శ్రేష్ఠులతో  ఇంద్రప్రస్థమునకు బయలుదేరినాడు. ఆయనను ఎదుర్కొని ఎంతో గౌరవ మర్యాదలను నెరపి తగిన దివ్యమైన విడుదులు వారలకు ఏర్పాటు చేసి కృష్ణ పరమాత్మునికి ప్రత్యేకముగా విడిదిని ఏర్పాటు చేసినాడు ధర్మరాజు. ఆప్త మిత్రులగుట చేత కృష్ణుడు అర్జనునితో ఎక్కువ సమయమును గడిపేవాడు.

ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణునితో " బావా ! ఇక్కడ ఎండలు అధికంగా ఉన్నాయి. మనము యమునానది తీరమునకు  వెళ్లి జల విహారము చేసి వత్తమన్నాడు. ధర్మజుడు తగిన ఏర్పాట్లను చేయించినాడు. ఆ విధముగా వారిరువురూ విహరిస్తున్న సమయంలో అగ్ని దేవుడు బ్రాహ్మణ వేషంలో అక్కడికి రావటము జరిగినది. కృష్ణార్జునులు ఆయనను సాధారణ బాపనిగా భావించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరించి వచ్చిన కారణము తెలుసుకొన గోరినారు. అతడు " అయ్యా ! బాగా ఆకలి వేస్తుంది. తమరు భోజనము పెట్టించగలరా?"అని అడిగినాడు. అందుకు వారు " విప్రోత్తమా!  మీకు ఏది ఇష్టమో చెప్పండి అటులనే ఏర్పాటుచేస్తాము " అన్నారు. అగ్ని దేవుడు నిజస్వరూపం చూపి          "కృష్ణార్జునులారా ! నేను అగ్ని దేవుడిని. నేను ఖాండవ వనాన్ని దహించాలి. అందుకు ఇంద్రుడు అడ్డుపడుతున్నాడు. ఇంద్రుని యొక్క మిత్రుడగు తక్షకుడు   ఆ వనంలో తన కుటుంబ సభ్యులతో ఉండటమే అందుకు కారణం. ఇంద్రుడు చేసే ఆటంకం తొలగిస్తే నేను ఖాండవ వనాన్ని నిరాటంకంగా నాకాహుతి చేసుకొంటాను." అని అన్నాడు. అర్జునుడు అగ్ని దేవునితో " అయ్యా నీకు ఖాండవ వనాన్ని దహించాలన్న కోరిక ఎందుకు కలిగింది" అని అడిగినాడు.

అందుకు అగ్ని దేవుడు అర్జునునితో " శ్వేతకి అనే రాజర్షి 100 సంవత్సరాల కాలం సత్ర యాగం చేయ సంకల్పించినాడు. అంత దీర్ఘ కాలము జరపడానికి ఏ ఋత్విక్కు ఒప్పుకోలేదు. శ్వేతకి ఈశ్వరుని కొరకు ఘోరంగా తపస్సు చేసి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. దేవా నేను సంకల్పించిన సత్ర యాగానికి నువ్వు ఋత్విక్కుగా ఉండాలి " అని కోరుకున్నాడు. అందుకు ఈశ్వరుడు " శ్వేతకీ! యజ్ఞాలు చేయవలసిన బాధ్యత బ్రాహ్మణులది. అందుకని నీకు దుర్వాసోమహాముని యాజ్ఞికునిగా తగినవాడు. అతనికి నీవు నా మాటగా చెప్పి యజ్ఞము సమగ్రముగా సంపూర్ణముగా సాంతము జరిపించుకొనుము అన్నాడు.  నీవు నూరు సంవత్సరాలు ఎడతెగని నేతి ధారను అగ్నికి ఆహుతి చేసి  స్వర్గమునలంకరించుము " అని చెప్పి అంతర్ధానమయినాడు. ఆ ప్రకారము శ్వేతకి చేత నూరు సంవత్సరాలు నిరాఘాటముగా జరిగిన సత్ర యాగములో త్రాగిన నెయ్యి నాకు అజీర్ణ వ్యాధిని తెచ్చిపెట్టింది. ఖాండవ వనంలో ఉన్న ఔషధులను దహిస్తే కానీ ఈ వ్యాధి తగ్గదు అని బ్రహ్మ దేవుడు చెప్పినాడు. అందుకని ఖాండవ వనాన్ని దహించాలని అనుకుంటున్నాను " అన్నాడు. అర్జునుడు " అగ్నిదేవా ! నీకు మేము సహాయము చెయ్యవలెనంటే మాకు ఆయుధములు కావలెను కదా ! మా చేతిలో ప్రస్తుతము ఆయుధాలు లేవు " అన్నాడు. అగ్ని దేవుడు " అర్జునా ! మీరు  చి౦త పడవలదు . మీకు కావలసిన ఆయుధాలు నేను సమకూరుస్తాను " అని వెంటనే అగ్నిదేవుడు వరుణుని స్మరించగానే వారి ముందు వరుణ దేవుడు ప్రత్యక్షమయినాడు. అగ్నిదేవుడు " వరుణదేవా ! నీకు బ్రహ్మ దేవుడు ఇచ్చిన ధనస్సు, అమ్ముల పొది, రథము అర్జనునకు ఇచ్చి, చక్రమును, గదను శ్రీ కృష్ణునికి ఇవ్వుము" అని తెలుపుకొన్నాడు. వరుణుడు గాండీవమనే ధనస్సును, అక్షయ తుణీరాన్ని, కపిధ్వజముతో కూడిన రధాన్ని*** అర్జునునకు ఇచ్చినాడు. అలాగే సుదర్శనము అన్న చక్రాయుధమును, కౌమోదకి అనే గదను శ్రీ కృష్ణునికి ఇచ్చినాడు. ఆ అయుధముల సహాయముతో రక్షించమని చెప్పి వారి వద్ద అభయం తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో ఖాండవ వనమును దహించడం మొదలు పెట్టినాడు.

 కృష్ణార్జునులు ఇరువైపులా రక్షకులై నిలబడినారు. అడ్డగించిన వన రక్షకులనందరినీ సంహరించినారు. వనంలోని జంతువులు, పక్షులు, పాముల అగ్నిజ్వాలలో పడి మరణించసాగినాయి. దేవతల ద్వారా ఇది తెలుసుకున్న ఇంద్రుడు మేఘాలను సృష్టించి ఖాండవవనము పై కుంభవృష్టి కురిపించినాడు. ఇంద్రుడు కురిపించే కుంభవృష్టి ఖాడవ వనం మీద పడకుండా బాణాలతో ఒక కప్పు నిర్మించినాడు. అగ్ని జ్వాలల నుండి రక్షించుకోవడానికి తక్షకుని కుమారుడైన ఆశ్వసేనుడు తల్లి తోక పట్టుకుని ఆకాశంలోకి ఎగిరినాడు. ఇది చూసిన అర్జునుడు తన బాణములతో అశ్వసేనుని కొట్టినాడు కానీ ఇంద్రుడు అర్జునునిపై మోహినీ మాయను ప్రయోగించి అశ్వసేనుని, అతని తల్లిని కాపాడగలిగినాడు. ఇంద్రుడికి అర్జునునికి మధ్య ఘోరమైన యుద్ధము జరిగినది. కుమారుని పరాక్రమానికి ఇంద్రునికి సంతోషము కలిగినా తక్షకుని రక్షించడానికి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇంతలో ఆకాశవాణి " దేవేంద్రా! వీరు నరనారాయణులు. వీరిని జయించడం నీకు సాధ్యం కాదు. తక్షకుడు తప్పించుకొని కురుక్షేత్రం వెళ్ళినాడు" అని పలికింది. తన మిత్రునికి కొంతవరకునైనా సహాయము చేయగలిగినానన్న సంతసముతో ఇంద్రుడు తన సేనలతో దేవలోకమునకు వెనుదిరిగినాడు. ఖాండవము మాత్రము అనాథ గృహములాగా చిటపటలాడుతూ మండుతూనే ఉండిపోయింది.

ఇక లాభము లేదనుకొని మయదానవుడు ఒక్క ఉదుటున బయటికి పరుగిడుట శ్రీకృష్ణుడు చూసినాడు.  వెంటనే చక్రమును అతనిపై సంధించ బూనినాడు. కింకర్తవ్యతా విమూఢుడైన మయుడు ఒక్క తృటిలో తన కర్తవ్యమును గుర్తించి అర్జనుని పాదములపై బడి శరణు  జొచ్చినాడు. అర్జునుడు కృష్ణుని వారించగా ఇరువురూ కలిసి మయునికి ప్రాణభిక్షనొసగినారు. ఈ దమన కాండలో ఆహుతి కాకుండా బ్రతికిన వారు వాసుకి కొడుకగు అశ్వసేనుడు అతని తల్లి నాలుగు శార్ఙ్ఞపక్షులు మయుడు మాత్రమే!

మయుడు ఎటుదిరిగీ తన కృతజ్ఞత అర్జనునకు, ఆవిధముగా పాండవులకు, చాటదలచుకొన్నాడు. న భూతో న భవిష్యతి అన్నటువంటి సభాభవనమును ధర్మరాజునకు కట్టించుటకు ఒప్పుదల కుదిరినది.

మిగిలినది మరొకమారు.....

ఖాండవము-మయసభ-మయులు - 2వ భాగము 

   ఇక కట్టడమునకు వలయు వస్తు సంభారములను మయుడు ఏ విధముగా సమకూర్చుకొన కలిగినాడో ఒకపరి  పరికించ ప్రయత్నింతము.

కైలాసమునకు ఉత్తర దిశలో ఉన్న మైనాక పర్వతము నందున బిందుసరమను సరస్సు వద్ద రాక్షసులు యజ్ఞము చేసినారు వారి రాజు వృషపర్వుని ఆధ్వర్యమున. ఆ రాక్షస రాజునకు ఒక సభ నిర్మించుటకు తగిన ఉపకరణములను సమకూర్చుకొని యుండినాడు మయుడు. కారంణాంతరముల  వలన ఆ కట్టడమును నిర్మించ నవసరము లేకపోయినది. ఉపకరణములన్నిటినీ  అచ్చటనే బిందుసరములో దాచియుంచియుండినాడు. వాటితో  భవన నిర్మాణము చేస్తానని తెలియజేసినాడు మయుడు. అట్లే తాను, తన వద్ద  దాచిన  భౌమాదిత్యుని గద, శంఖము తెచ్చి  గదను భీమసేనునికి దేవదత్తము అను ఆ  శంఖమును అర్జనునికి ఇస్తానన్నాడు.

 మయుడు బిందుసరమునందలి  దూలములను, కంభములను ఉపయోగించి చిత్ర విచిత్రమైన భవనాన్ని నిర్మించినాడు. నీరు అను భ్రమ కలిగించుటకుగానూ  ఇంద్రనీల మణులను, పద్మరాగ మణులతో ఎర్రని పద్మములను, రజతముతో తెల్లటి తామరలను, రాజహంసలను, వజ్రములతో చేపలను, ముత్యములతో తెల్లటినురగలను, మరకతములతో నీటిలోని నాచును తయారు చేసినాడు. తయారు చేయుటలో అతని పనితనమును గూర్చి చెప్పవలసి వస్తే ఎంతటి జాగరూకులయినా అవి నిజమని భ్రమించే విధముగా నిర్మించినాడు. నీటి యంత్రాలు, చెట్లు, నీటీ పక్షులు, పక్షిగూళ్ళు మొదలైనవి వివిధ రత్న కాంతులతో శోభిల్లే భవనమును పదునాలుగు మాసములు శ్రమించి  ఎనిమిది వేల మంది బలిష్ఠులగు తన అనుచరులగు అసురులతో, నిర్మించి ధర్మరాజునకు బహూకరించినాడు.  ఈ భవన నిర్మాణము అంతా బిందుసరము వద్దనే జరిగి పోయినది. ఆవిధముగా దానిని పూర్తి గావించి ఆకాశ మార్గమున తన అనుచరుల సహాయముతో తెచ్చి ఇంద్రప్రస్థమున ప్రతిష్ఠించినాడు. అటుపిమ్మట ఆ భవనమునకు అక్కడే అభ్యంతర నివేశమును (Interior Decoration) తన అనుచరులతో చేయ దొడంగినాడు.

మిగిలినది మరొకమారు .......

ఖాండవము-మయసభ-మయులు - 3   

ముఖ్యమగు విషయమగుటచే అప్రస్తుతమైనా ధర్మరాజ నారద సంవాదమును మీ ముందు ఉంచుచున్నాను. ఎందుకనగా ఈ విషయమై మరొకమారు ప్రస్తావించకుండా ఉండుటకే! ఇదయిన  తదుపరి నా పరిధిలో విస్తారముగా మయులను గూర్చి చర్చించెదను.

ధర్మరాజు ఒక శుభ ముహూర్తమున పురోహితుడైన ధౌమ్యుని ఆశీర్వాదముతో భార్యతో తమ్ములతో పుణ్యఃవాచన జరిపించి, దేవతార్చనలను గావించి, గోదాన, గజదాన, భూదాన, హిరణ్య దానదులతో విప్రులను తృప్తులను జేసి, మయసభా ప్రవేశం చేసినాడు. సామంతరాజులు ధర్మరాజును దర్శించి అనేకానేక అపురూప కానుకలను సమర్పించినారు. ఆ రీతి ఆయన కొలువు నడుపు కాలమున, ఒకానొక రోజు నారద మహర్షి  ఆయనను చూడ వచ్చినాడు.

అర్ఘ్య పాద్యాదులు, అతిథి సత్కారములు ముగిసిన పిమ్మట ఉభయ కుశలానంతరము వేదవేదాంగ శాస్త్రాది నిపుణుడగు నారదుడు ధర్మజుని ఈవిధముగా అడుగజొచ్చినాడు.

ఏమడిగినాడు అన్న విషయమును తెలియజేయుటకు ముందు  ఒక విషయము మనవి చేస్తాను. సాధారణముగా నాకు తెలిసిన మేరకు పౌరాణికులు మయసభను గూర్చి తెలుపునపుడు మిగతా విషయములు విపులముగా వివరించుతారు కానీ ఈ నారద యుధిష్ఠిర సంవాద  విషయమునకు అంత ప్రాధాన్యతనివ్వరు. వ్యాసుడు అటు రాజ్యాంగ శాస్త్ర పరమైన విషయములను ఏవిధముగా సాధికారికముగా చెప్పినాడో అదేవిధముగా ఖగోళ, భూగోళ, ఆర్ధిక, సామాజిక, యుద్ధతంత్ర విషయముల గూర్చి కూడా విపులముగా విశధీకరించినాడు. ఈ సంభాషణలో సామ్రాజ్య నిర్వహణ గూర్చి ఎంతో సమగ్రముగా సంభాషించి ప్రత్యుత్తరము పొందుతాడు ధర్మరాజు. ఆ వివరములను సమగ్రముగా మనకు అందిస్తాడు వ్యాసమహర్షి. ఆయన అడిగిన ప్రశ్నలను ఈ కాలమునకు అనుగుణమైనవి  ఏర్చి మీ ముందు పేర్చ  ప్రయత్నిస్తాను. నారదుడు అడుగుచున్నాడు :

1.    మీ ధనము ప్రజాహిత కార్యములందు సక్రమముగా వినియోగింపబడుచున్నది కదా! నీ అర్థ ప్రియత్వము ధర్మమునకు గానీ, ధర్మ ప్రియత్వము అర్థమునకు గానీ నీ కామప్రియత్వము అర్థ ధర్మములకు గానీ ఆటంకము అగుట లేదు కదా! ఈ మూడు పురుషార్థముల సేవించుటకు వేరు వేరు సమయ నిర్ధారణ యున్నదన్న విషయము కాల రహస్యము తెలిసిన నీకు అవగతమే కదా!

2.  రాజుకు వ్యాఖ్యానశక్తి, వీరత్వము, విచక్షణా యుతమగు మేధస్సు, నీతి నిపుణత,  కర్తవ్యాకర్తవ్యవివేకము, అన్నవి అత్యంత ఆవశ్యకము.

౩. మంత్రము, ఔషధము, ఇంద్రజాలము, సామ దాన భేద దండ అన్న ఈ ఏడు ఉపాయములు తెలిసి యుంచుకొనుట ఆవశ్యకము.

4. నాస్తికత, అసత్యము, క్రోధము, పొరబాటు, దీర్ఘ సూత్రత అంటే ఎడతెగని ఆలోచన  లేక నిర్ణయము తీసుకొనుటలో జాప్యము, జ్ఞాని వర్గముతో సాంగత్య రాహిత్యము, సోమరితనము, ఇంద్రియలోలత, అనవరత అర్థ చింతన, మూర్ఖ వర్గ ఆలోచనానుసరణ, క్రియాలసత్వము అంటే చేయవలసిన పనిని చేయవలసినపుడు  చేయకపోవుట, దీనినే ఆంగ్లములో Procrastination అంటారు.

5. రహస్యములను బయట పెట్టుట, సమయానుసారుకూలముగా ఉత్సవాదులను ఏర్పాటుచేసి జరుపక పోవటము, ఒకేసారి పెక్కురు శత్రువులతో యుద్ధమునకు తలపడటము ఊహించావు గదా!

ఇప్పటివరకూ తెలిపిన ఈ పదునాలుగు లక్షణములు దూరముంచవలసినవి అనుటకంటే దరి చేరనీయ తగనివి.

6. ఇక ఎప్పుడూ ఒక రాజుగా నీతో ఉంచుకొనతగినవి: నీ శక్తిని గూర్చిన జ్ఞానము అట్లే నీ శత్రువును గూర్చిన బలము బలహీనత. ఈ రోజు SWOT అన్న పేరుతో మన మనస్తత్వ నిపుణులు చెప్పే మాట మనలో చాలామందికి తెలిసియుండవచ్చు. S అంటే STRENGTH, W అంటే WEAKNESS, O అంటే  OPPORTUNITIES మరియు T అంటే THREATS. పైన చెప్పినవీ అవే. భారతములో ఇటువంటి విషయములున్నాయని ఆధునికులమైన మనము ఊహించగాలమా!

నారదులవారు ఇంకా ఈ విధముగా అడుగుచున్నారు.

7. నీయొక్క ఏలుబడిలో పంటలు, పోలాలు వ్యాపారము, దుర్గములు, వంతెనలు, ఏనుగులు, రత్న రాశులు, ధన రాశులు, పన్నుల వసూళ్ళు, నిర్మానుష్య ప్రాంతములలో నీడలేని వారికి ఆవాసములు  మొదలగు విషయములన్నియు చక్కగా నీ నేతృత్వములో నిర్వహింపబడు చున్నాయి కదా!

8. నీ రాజ్యములో స్వామీ, మంత్రి, మిత్రులు, కోశాధ్యక్షుడు, రాష్ట్ర పాలకులు, దుర్గ రక్షకులు, నగరవాసులు అను రాజు యొక్క సప్తాంగములు సందేహాస్పదులు కారు గదా! ధనికులు దురభ్యాసమునకు దూరముగా వుంటున్నారు కదా!

9. శత్రుగూఢచారులు నీ విశ్వాసమును మరియు పైన ఎరుకపరచిన వారి విశ్వాసమును  సంపాదించి  రాజ్యమునకు సంబంధించిన రహస్యములు సేకరించకుండా వుండు విధమున తగు జాగరూకతతో మెలగుచున్నారు కదా!

10. రాజ్య క్షేమమునకు సంబంధించిన  విషయములో మీరు తటస్తులనుండి మీ సూక్ష్మ బుద్ధినుపయోగించి వారి అనుపానములను రాబట్టుచున్నారు కదా! ఈ తటస్థులు అంటే ఉదాసీనులను విషమ దృష్టి తో చూచుట లేదు కదా!

మిగిలినది మరొకమారు........

ఖాండవము-మయసభ-మయులు 4

11. నీయెడల నీ సప్తాంగములు అనురాగ విధేయతలు కలిగి యుండు లాగున చూచుకొనుచున్నావు కదా!

12. వేళ కాని వేళలలో విశ్రాంతి పేరుతో నిద్రించుట లేదు కదా!

12. ఆర్ధిక పరమైన ఆలోచనలు అపరాత్రి లోనే చేస్తున్నావు కదా! ఇక్కడ ఒక మాట తెలియజేస్తాను. అపరాత్రి ఎ రెండో రెండున్నర గంటల రాత్రి సమయము. ఎక్కడ లేని నిశ్శబ్దత, చక్కనైన ఆలోచనలకు ఆసమయము అత్యంత ఉపయుక్తము . ధనమే కదా పాలనకు మూలము. నిర్ధనుడు ధరాపాలుడైన దేశమునకు ఏమి   ప్రయోజనము సమకూర్చగలడు.

ఎప్పుడూ ఒక్కడివే కానీ, అందరితో కూడి కానీ మంత్రాంగము చేయుట లేదు కదా! ఎందుకంటే రెండూ మంచివి కానివే! సమయానుసారుకూలముగనే  సరియైన వ్యక్తులతో సంప్రదించవలసియుంటుంది. లేక ఏకాంతముగా కూడా అలోచించవలసి ఉంటుంది.

13. వ్యవసాయ దారులపట్ల ఉదాసీనత పనికిరాదు. ఎల్లపుడు వారి భాగ్యము దేశ సౌభాగ్యము సమసంబంధ సామ్యములో ఉంటాయి. అంటే ఆంగ్లములో DIRECTLY PROPORTIONAL అని అర్థము. వారి కృషియే దేశ ప్రగతికి సోపానము. రైతులెపుడూ విశ్వసనీయులు, కులీనులు లోభరహితులు అగు వ్యక్తులతోనే వ్యవహరించాలి. అపుడే  ప్రగతి దేశ క్షేమము సాధ్యపడుతుంది.

ఇదంతా పాలనను గూర్చియైతే ఇక రక్షణను గూర్చి కూడా తెలియజేస్తున్నాడు ఆ మహనీయుడు. ఆయన ధర్మజుని ఈ విధముగా అడుగుచున్నాడు:

14. మీ గురువులు ధర్మ విధులు యుద్ధవిశారదులు అయి మీ పిల్లలకు విద్య గరపుచున్నారు కదా!

15. నీ  సేన కు దేశ సేవ దేశ భక్తి ని గూర్చిన బోధన చక్కగా సాగుతూ వుంది కదా!  మీ దుర్గములు అన్నింటిలోనూ  ధన ధాన్యములు, అస్త్రశస్త్రములు, నీరు, రక్షణకు తగిన సకల యంత్రములు, చేతి వృత్తి నిపుణులూ, సైనికులు ఇత్యాదివన్నియు  పుష్కలముగా ఏర్పాటు చేసినారు కదా!  Have you accomplished all the wants and needs required for the bettalions? చూడండి ఆయన ఒక ఋషి . ఉదయము మొదలు పడుకునే పర్యంతము, ఒకవేళ పడుకునేటుగా వుంటే, భగవత్సంకీర్తన చేసుకొంటూ ఉండిపోయే మహానుభావుడు రాజ్య పాలనను గూర్చి ఎంత విమర్శనాత్మకముగా ప్రశ్నించుచున్నాడో గమనించండి. ఇవి నిజమునకు హితవు కోరే ఉపదేశములు.

16. చివరిగా ఇంకొక ముఖ్యమగు విషయమును మనవి చేసుకొంటాను. ఆయన ధర్మరాజుతో అంటూ ఉన్నాడు సూక్ష్మ బుద్ధి, మేధావి, చతురుడు, నిగ్రహవంతుడు, సేవానిరతుడు అగు  ఒక్క మంత్రిని నీవుంచుకొంటే ఎటువంటి ఆపదనుండి కూడా నిన్ను రాజ్యమును కాపాడ గలడు.

శత్రు పక్షమునకు చెందిన మంత్రి, పురోహితుడు, యువరాజు, సేనాపతి, ద్వారపాలకుడు, అంతఃపుర రక్షకుడు, కారాగారాధ్యక్షుడు, కోశాధ్యక్షుడు, ఉచితానుచిత కార్య నిర్ణయ నగరాధిపతి, కార్య కర్త, ధర్మాధ్యక్షుడు, సభాపతి, దండపాలుడు, దుర్గ పాలుడు, సరిహద్దు సంరక్షకుడు, వీరిపై, ఒక్కొక్కరికి ముగ్గురి వంతున గూఢచారులను ఏర్పాటు చేసినావు కదా! నీ పక్షమున కూడా మంత్రి పురోహిత యువరాజులను విడచి మిగత వారిపై గుప్తచరులను ఏర్పాటు చేసినావు కదా!

17. ఇక ఇవి యన్నియు కాక నిజ సేవా తత్పరులగు  అధికార బృందము తమతమ రంగములలో నిష్ణాతులే కదా యని ప్రశ్నించుతాడు. సముచిత భోజన వేతనములు సమయమునకు లభించకుంటే తాడే పామవుతుందని హెచ్చరిస్తాడు.

నీవు జితేంద్రియుడవైతేనే ఇంద్రియ లోలులగు శత్రువులను జయించగలవంటాడు.

రాజ కుటుంబీకులను, గురు జనులను, వృద్ధులను, ఆశ్రితులను, సరిపడు ధన ధాన్యాదులతో పోషిస్తున్నావు కదా! నీ దేశ వాసులకు రాణుల వలన గానీ, దురాశాపరులైన రాజ కుమారులవలన గానీ చోరుల వలన గానీ, దుఃఖము కలుగుట లేదు కదా! అని ప్రశ్నిస్తాడు.

18. యుద్ధ సామాగ్రి ని ఎప్పటికప్పుడు ఆధునీకరణ చేయుచున్నావు కదా! నీ శతృ బల, బలహీనతలను సరియైన అంచనా వేయుటకు తగిన గూఢచారులను ఏర్పాటుచేసి యుంచుటయే గాక తగిన సలహాదారులను నీ సమాలోచనా బృందమున కలిగియున్నావు కదా!

19. ఇక రైతుల అవసరములను గూర్చి ఏమి అడుగుచున్నాడో తెలుసుకొందాము. నారదుడు ఈ విధముగా అనుచున్నాడు. రైతులు ఆనందముగా ఉండవలెను. గట్ల అంచుల వరకు నీరు నిండిన చెరువులు నీ రాజ్యములో సంవృద్ధిగా ఉన్నవి కదా! వ్యవసాయమును వర్షాధారమునకు వదలి వేయుట లేదు కదా! వ్యవసాయదారులు విత్తనముల కొరతతో గానీ , అన్నము లేక గానీ యుండుట రాజునకు మహా పాపము. మరి నీవు వారి విషయములో జాగ్రత్త వహిస్తున్నావు కదా! పండించుటకు వారి ఆర్ధిక పరిస్థితి ని సానుకూలము చేసి పంటలు వేయు సమయమున  తక్కువ వడ్డీతో రుణ సదుపాయమును అందజేయుచున్నావు కదా!

20. నీ ఏలుబడిలో వ్యవసాయము, గోరక్షణ, ద్రోహచింతన లేని వ్యాపారము, అపారముగా జరుగుచున్నాయి కదా!

21. నీ రాజ్యములో న్యాయాధీశుడు, ప్రాంత పాలకుడు (తహశీలుదారుడు అని అనుకోవచ్చు) గ్రామాధ్యక్షుడు (సర్పంచ్ అనుకోవచ్చు) రాజ్య ప్రతినిధి (bureaucrats) సాక్షి  (Scribes) తమయొక్క విధి నిర్వహణలో ఎటువంటి లోపములను చేయుట లేదు కదా!

22. అపరాధుల పట్ల నిర్దయతో అమాయకులపట్ల దయతో వ్యవహరించుచున్నావు కదా! వారి గుణదోషములను గ్రహింప, తగిన యంత్రాంగమును కలిగి యున్నావు కదా!

23. జ్ఞానులగు మహనీయులను సేవించుటవల్ల నీ మనో వ్యథలు మనో వ్యాధులు దూరమౌతాయి. ప్రాలుమాలక ఆ పనిని చేస్తున్నావు కదా!

24. నీ దాన ధర్మ దయా విద్వద్ గుణములను సాదు సంతులు సద్బ్రాహ్మణులు ప్రశంసించుచున్నారు కదా! ఆ ప్రశంశలు ఆశీర్వాదములై నీ వల్ల తెలియక జరిగిన పాపములను ప్రక్షాళనము చేసి నీకు స్వర్గప్రాప్తిని కలిగిస్తాయి.

ఇవియే కాక  ఇంకా ఎన్నెన్నో ఉపదేశముల జేసినాడు ఆ మహానుభావుడు.

ఇది గమనించండి. పరీక్షిత్తు పాలనతో కలియుగము మొదలైనది. ప్రారంభమే కాబట్టి , శుక బ్రహ్మ నోటనే భాగవతము వినగల్గినాడు కాబట్టి ఆయన పరమపదమును పొందగల్గినాడు. అది కూడా ఎందువల్లనంటే ఆయన గర్భావస్థ లోనే శ్రీ కృష్ణ పరమాత్ముని అనుగ్రహము పొందినాడు కాబట్టి పూర్వ కర్మ ఫలముల నశింపజేసుకొని అపూర్వ మోక్ష పదమును అందుకో గలిగినాడు. ఇపుడు ఆయన కుమారుడు జనమేజయుడు రాజయినాడు. కలి కూడా బాగా కాలూనింది. కానీ ఆయనకు పరమ పవిత్రుడగు ఋషివరేణ్యుడు వైశంపాయనుని రూపమున దొరకినాడు. ఆయన జనమేజయునకు సమగ్ర భారతము చెబుతూ వున్నాడు సంగ్రహ భారతము కాదు. అది కూడా వ్యాస మహర్షి తాను సాక్షియయి నిలచిన రచించిన భారతము, అందులోనూ జనమేజయునకు ఈ కలియుగములో ధర్మమును కాపాడ వలసిన బాధ్యత గల్గిన చక్రవర్తికి, అందులో కూడా విశ్వ శ్రేయస్సునే తన వృత్తిగా గొన్న ఉపదేశములు, అందునా ధర్మమే తానయి వెలుగొందిన  ధర్మరాజునకు. అంటే ఈ ఉపదేశమునకు మనము అంటే ముఖ్యముగా పాలకులు ఎంతటి ప్రాముఖ్యత నివ్వవలెనో గమనించండి. అసలు ఈ ఉపదేశము యొక్క ప్రతిని పాలకులు తమ వద్దనుంచుకొని నిత్య పారాయణము చేయుట ఎంతో ఆవశ్యకము. అసలు తమ బుద్ధి మంచి మార్గములో నడచుటకు ఈ మాటలు ఎంత ఆవశ్యకములో గమనించండి.

ఇంతటి ఉద్గ్రంధము తాను ధారాపాతముగా చెబుతూ పోతూవుంటే గణపతికి వ్రాయుటకు మూడు సంవత్సరముల కాలము పట్టినదట. మరి లక్ష శ్లోకముల కావ్యము కదా! ఇందులోని కూర్పును గమనించితే అంతా వ్యాస ప్రోక్తమే అన్న నమ్మకము నావంటి ఒక సాధారణ పాఠకునికి కలుగుతుంది. పైన తెలిపిన ‘ధర్మ తత్వజ్ఞులు...’ అన్న పద్యానుసారము  ఈ గ్రంధము రచనా ప్రపంచ సామ్రాజ్యమునకు సార్వభౌమత్వము కలిగినది అని చెప్పక తప్పదు. అసలు వ్యాసుడే వినాయకునితో నేను చెప్పే ప్రతి అక్షరము అర్థము చేసుకొని వ్రాయమని శాసించుతాడు. 

ఇక తిరిగీ మయసభ కు వద్దాము.

మరొకమారు..  

ఖాండవము మయసభ - 5

ధర్మజుడు తన ఉత్కంఠతను ఆపుకోలేక నారదుని ఇంతకు మించిన భవనము ఏ లోకమున నైనా ఉన్నదా అని అడుగుతాడు. అందుకు జవాబుగా నారదుడు భూలోకమునందు మాత్రము లేదు అంటాడు. ఆ సందర్భములో  ఆయన ఇంద్రాది వివిధ లోకములలోని భవనముల గూర్చి కూడా ఎంతో విశదముగా వివరించుతాడు.

మయుడు సభను కట్టినాడు కదా అందులోని విపరీతాలు విడ్డూరాలను ఎట్లు సాధించినాడో చూద్దాము.

సురుచిర హరినీల కిరణ జాలంబుల 

పద్మ రాగారుణ పద్మములను

రాజిత రాజీవ రాజహంసావళి

నిర్మల సౌవర్ణ కూర్మములను

కమనీయ వైడూర్య కుముదంబులును వజ్ర

మీనమౌక్తిక నవ ఫేనములను

మరకత శైవలోత్కరముల విలసిల్ల

కొలనని సన్మణి స్థలము జూచి

పలుగు రాల కుడ్యముల రుచుల్ గప్పిన

జలములున్న ఎడలు వెలయ జూచి 

యననుపస్థలంబు లని జనులెరుగక 

యుండునట్లుగా మయుండు సేసె

మరియు సకలజన మనోహరంబులైన నానావిధ యంత్రంబులునూ, ననవరత కుసుమ ఫలభరితంబులైన .....

అని గద్యము సాగుతుంది. వెరశి మనకర్థమయ్యేదేమిటంటే ఇటువంటి భవన మీ భువనమున లేదు అన్నది. ఇక్కడ పైన తెలిపిన పద్యమును కాస్త విశ్లేషించుకొందాము: మయుడు తన వెంబడి అత్యంత అమూల్యమైన అందునా అత్యంత ప్రభాసవంతమైన అనేకములగు నవరత్నములను తనతో తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన నీరు లేకుండానే ‘నీరు’ అన్న భ్రమను ఏవిధముగా కలిగించినాడో చూద్దాము. మనము పాఠశాలలో చదివిన తెల్లని త్రిభుజాకార పట్టకమును ‘జ్యోతిచ్ఛక్తి’ (Light Energy) లో ఉపయోగించిన విషయమును గుర్తు తెచ్చుకొందాము. దానిగుండా ఒక సూర్య కిరణము పరావర్తనము చెందినపుడది ఏడు రంగులుగా  అది విడిపోయి మనకు తెరపై ఆ రంగులను ప్రతిఫలింపజేస్తుంది. ఇప్పుడు మయుడు నీలి వర్ణపు మణిని వాడినాడు. ఆయన శాస్త్రవేత్త కాబట్టి ఆ మణి పైబడి పరావర్తన చెందిన సూర్యకిరణము  నీటి రంగుగా భాసిల్ల జేయ గలడు. ఆయన ఇప్పుడు అదే చేసినాడు, తెరగా చంద్రశిలాఫలకములను పరచిన భూమిని ఉపయోగించి. అంటే నీరు లేని చోట నీరు వున్న భ్రమను కలిగించినాడు అన్నమాట. ఇక పద్మరాగ మణులను తీసుకొని వానిపై సూర్య కిరణములు  బడి పరావర్తనము చెందుట చేత పద్మమే, ఆ భ్రాంతి సరస్సులో, భాసిల్లు చందమున అమరించి భ్రమింప జేసినాడు. ఇందులో అతని శాస్త్ర విజ్ఞానము (Scientific Knowledge) తాంత్రిక శక్తి (Engineering Skill)ఎంత అన్నది మనకు తెలియ వస్తూ వున్నది. స్వచ్చమగు వెండి పై సూర్య కిరణములు పడి ఆ భ్రాంతి జలాశయము నందు రాజ హంసలను సృష్టించినాడు. ఈ ఆకారములను సృష్టించుటకు ఎంతటి ఊహా పటిమ అవసరము అన్నది ఊహించుటకు కూడా  నా ఊహ చాలదు. బంగారమును తగిన రీతిలో తగిన విధముగా తగిన చోట ఏర్పాటుచేసి దాని నుండి వచ్చు కిరణములతో మానస సరోవరము నందు నివసించు బంగారు రంగు తాబేళ్ల భ్రమను  ఆ భ్రాంతి జలాశయము నందు ఏర్పాటు చేసినాడు. వైడూర్యములు , ఇవి పిల్లి కన్నుల రంగులో ఉంటాయి, వానితో ఒక విధమగు రంగు గల్గిన కలువలను ఏర్పాటు చేసినాడు. వజ్రముల తాపి వానిపై సూర్య కిరణములు ప్రసరించు విధమున ఏర్పాటు చేసి మీనులను, సూర్య సాపేక్ష చలనమువలన అవి కదులు విధముగానూ ఏర్పాటు చేసినాడు. వజ్రము పై బడిన సూర్యకిరణము అతి త్వరగా పరావర్తనము చెంది చేపల కదలిక అను భ్రమను సులభముగా కలిగిస్తుంది. అదే వేరు లోహములపై గానీ వేరు విలువయగు రాళ్ళపై గానీ  ఇంత ఎక్కువ ప్రభావము వుండదు. నీటిపై నురగను ముత్యముల చేత ఆవిష్కరించినాడు. మరకతములను ఉపయోగించి నాచును గట్టుల వద్ద మాత్రమె కనిపించు లాగున ప్రతిఫలింప జేసినాడు. ఇక నిజమైన జలాశయమును ఏర్పరచి దానిపై కటిక చీకటి పడు విధముగా ఒక విధమగు, పరావర్తనకు గురికాని నల్లని మణి సముదాయమును ఏర్పరచి దాని నీడ నిజమైన కొలనుపై మాత్రమే పడునట్లు చేసి ఆ జలాశయమును సాధారణముగా ఇంటికి పరచిన ఆ బండల రంగుకు సమానము చేసినాడు. దానితో అది ఒక కొలను అన్న ఊహే కలుగనివ్వలేదు ఆ రాక్షస విశ్వకర్మ.

మిగిలినది మరొకమారు.... 

మరోమారు......

ఖాండవము మయసభ – 6 

శ్రీ కృష్ణునికి మయుడు సామాన్యుడు కాదనియు  మయసభ భారత యుద్ధమునకు నాంది కాబోతున్నదనియు  తెలుసు.  రాజసూయము జరుగక ముందే జరాసంధుని భీముని తో తన తంత్రముచే మట్టుబెడతాడు. యాగ సమయమున శ్రేష్ఠతముని గా పెద్దలచే గుర్తింపబడిన శ్రీ కృష్ణునకు  ధర్మజుడు పూజ సల్పు సమయమున శిశుపాలుడు పలురీతుల దానిని అధిక్షేపించి నూరు పర్యాములకు మించి తూలనాడ శ్రీ కృష్ణుడు, శిశుపాలుని తల్లి మరియు తన మేనత్తకు మాట ప్రకారము వంద తప్పులను సైచి అది దాటిన వెంటనే అతనిని తన చక్రాయుధమునకు బలిచేసినాడు.

యాగ సమయములో అహూతులు తెచ్చిన విలువైన అపురూపమైన వస్తువులను చూచుకొన వలసినదిగా దుర్యోధనుని నియమించినాడు. ఇది శ్రీ కృష్ణ తంత్రములోని భాగమే సుమా! పరమ భాగవతులు ఆత్మ సాక్షాత్కారులు నగు ఋషి మునులకు అర్ఘ్య పాద్యాదులనిచ్చి  ఆ తోయమును శిరసున జల్లుకొను కార్యమునకు తనను తానే నియమించుకున్నాడు. పరమాత్మ ఎంత భక్తజన పక్షపాతియో మనకు ఇచ్చట అర్థమౌతుంది. ఎంత తంత్రజ్ఞుడంటే భీమసేనుని అత్యంత ఉత్కృష్ఠమగు మాయామయమగు సభా ద్వారము వద్ద భీమసేనుని ఏర్పాటు చేసినాడు. అంతా దుర్యోధనుని దృష్టి లో నుంచుకొనియే సుమా! ధర్మ తత్పరుడగు ధర్మరాజు ఈ విషయముల అంతరార్థము గ్రహించక అంతా శ్రీ కృష్ణుడు చెప్పినట్లే అమర్చినాడు. పైపెచ్చు ఎంతో ఆదరముతో తానె వెంట వచ్చి మయసభనంతా చూపుతానన్నాడు. దురభిమాన ధనుడైన దుర్యోధనుడు ధర్మరాజు ప్రస్తాపనను త్రోసి పుచ్చినాడు.

ఆతడు రాజసూయము ముగిసి, వచ్చిన రాజన్యులు, శ్రీ కృష్ణుడు, బయలుదేరి వెడలిన తరువాత నింపాదిగా సభను చూడ బయలుదేరినాడు. అత్యంత ఆశ్చర్యమును గలిగించే ఆ సభను చూస్తూ కూడా  బాగున్నదని తన మేనమామయగు శకునితో కూడా అనలేదు. అంతలో నీరు లేని చోట ఉన్నట్లుగా భావించి అంగ వస్త్రమును సర్డుకొనుట, వున్న చోట ఏమీ లేదనుకొని అటులనే నడచి నీటిలో తడబడుట జరిగి పోయినది. భీముడు ఆ స్థితికి నవ్వకున్నా గూడా అతని ఉనికియే ఎక్కడ లేని మనఃక్లేశామును కలిగించింది దుర్యోధనునకు. ఇచట మనము గుర్తించ వలసినది ఏమిటంటే ఆసమయమున ద్రౌపది అచట లేనేలేదు, కావున ఆమె దుర్యోధనుని స్థితి చూసి నవ్వే ప్రసక్తే ఏర్పడలేదు. ఇది కేవలము కల్పితము. వ్యాస భారతములో లేదు కానీ ఇది ఆంధ్ర భారతమున కాన వచ్చుచున్నది. భీముడు అచటనే ఉన్నాడు కావున దుర్యోధనునకు దివ్య వస్త్రములు దివ్య భూషణములు తెచ్చి ఇచ్చుట జరిగింది. ద్రౌపది చూసినా చూడుకన్నా తన ప్రత్యర్థి భీముని ముందు తనకు అవమానము జరిగినది. అది చాలు  దుర్యోధనుని అసూయకు.

తెలుగు భారతములో ఆ సమయమును వర్ణించుతూ వ్రాసిన వచనము ఈ విధముగా వుంది.

‘ అట దుర్యోధనుండు శకునియుందానునూ జూడ వేడుక కలిగి, సభావిభవంబు చూచుటకు నందు గొన్ని దినంబులుండి యొక్క నాడు దాని యపూర్వ రమణీయతకు విస్మితుడగుచూ  నయ్యయి ప్రదేశములన్ గ్రుమ్మరువాడు వివృతమైన ద్వార దేశమును సంవృతంబుగా వగచి చొరనొల్లక సంవృతంబైన దానిని వివృతంబుగా వగచి చొరంబోయి తత్కవాట స్ఫటిక శిలాఘటిత లలాటుండై  సమప్రదేశంబున్నతంబుగా వగచి యొక్క సమకట్టి నీలాశ్మరశ్మస్థగితం బైనవిమలమణిస్థలంబు జలాశయంబుగా వగచి  పరిధానంబెగద్రోచికొని స్ఫటిక దీప్తి  జాల పరివృతంబైన జలాశయంబు స్థలంబు గా వగచి కట్టిన పుట్టంబు దడియంజొచ్చి  క్రమ్మఱిన వానింజూచి పాంచాలియు పాండు కుమారులు నగిరంత...

ఇది తెలుగు భారతమున నన్నయ చేర్చినది బహుశా కలుగబోవు కథాపుష్టికై యుండ నోపు.  ఇందులో పాండు కుమారుల తో బాటూ  ద్రౌపది ని కూడా చేర్చినారు నన్నయగారు. తనకు ప్రతిద్వంది యగు  భీముడు ఒక్కడు తన తొట్రుబాటును చూసిన చాలును తన హృదయ లోహితము కుతకుతలాడుటకు. వ్యాస భారతము ఈ విధముగా తెలియబరచు చున్నది.

జలేని పతితం దృష్ట్వా భీమసేనో మహాబలఃl 

జహాసజహసుశ్చైవకింకరాశ్చ సుయోధనంll

వాసాంసిచ శుభాన్యస్మై ప్రదదుః రాజశాసనాత్l

అర్జునశ్చ యమౌచో భౌ సర్వేతే  ప్రాహసంస్తదాll

ఆ నీటి గుంటను సమ తలముగా భ్రమించి దుర్యోధనుడు అందు తొట్రుపడుటచే  జారినాడు. అది చూచి అచ్చటికి వచ్చిన అర్జున నకుల సహదేవులు భీమునితో గూడి నవ్విరి. ఆ సభా నిర్మాణమునకు దోహద పడిన కింకరులగు రాక్షసులు కూడా నవ్విరి. కావున అచట ద్రౌపది ధర్మజ కృష్ణుల ప్రస్తాపన లేదు.  కృష్ణుడు మయసభలో దుర్యోధన పరాభవమునకు ముందే ద్వారకకు బయలుదేరినాడు. ధర్మరాజ ద్రౌపదులు  అచట లేరు. విషయము తెలిసిన వెంటనే పెద్దవానిగా భీమునికి  దివ్య వస్త్రాభరణములను తెచ్చియివ్వమని వారు పురమాయించి యుండవచ్చును. ఈ అవమానమే భారత యుద్ధమునకు నాంది.

మయుడు సభా భవనమును నిర్మించుటచే ఆ ప్రాంతమునకు ఖండవప్రస్థము అన్న

పేరు బోయి ఇంద్రప్రస్థము అన్న పేరు వచ్చింది. ఎందుకంటే మయసభ ఇంద్రసభకు దీటుగా భువి పై వెలసినది కావున. నేడు మనకు ఇంద్రప్రస్థము యొక్క చిరునామా ఇదమిద్ధముగా కనిపించదు. కానీ కొందరు పరిశోధకుల పరిశోధనల మూలముగా, ఈ ప్రాంతము సరస్వతీ నదికి తూర్పున యమునకు పశ్చిమమున వున్నట్లు తెలియవస్తూవుంది. పరిశోధకులు ఇంకా ఏమి తెలియజేసినారంటే రెండవ మొఘలు చక్రవర్తి యగు హుమయూను కట్టించిన దిన్ ఫనాహ్ అన్న  పట్టణమునకు ఆఫ్ఘాన్ పాలకుడగు   షేర్ షా సూరి కట్టించిన  షేర్ ఘర్ ప్రాంతములకు అనుబంధమై యుండియుండ వచ్చును అని. కాలక్రమములో కర్ణ వంశజుడైన రాజదిల్లు అనునాతడు నేటి డిల్లీ కి పునాది వేసి చుట్టుప్రక్కల గ్రామములను అందులో చేర్చినాడు అని చరిత్రకారులు చెబుతారు. ధుల్, ధలివాల్, ధిల్లోన్ మొదలగు వంశనామములు ఈ పేరు నుండి వచ్చినవని కూడా చెబుతారు. 

మిగిలినది మరోమారు ......

ఖాండవము మయసభ 7

 మయుని పుట్టుక మరియు ప్రతిభ

మయుని ప్రతిభా విశేషాలు మనకు మస్త్య పురాణములో తెలియ వస్తాయి. మయుడు త్రిపురములు  అను మూడు ఎగిరే పట్టణములను నిర్మించి వాటిని త్రిపురాసురులకు అప్పగించుతాడు. ఇవి ఒకవిధముగా చెప్పవలెనంటే ‘విమాన పట్టణములుగా’ పేర్కొనవచ్చు. మయుడు శివ భక్తుడగుటచే ముప్పురముల నుండి ఏ ముప్పు లేకుండా తప్పించుకొంటాడు. మయుని ప్రస్తాపన మనకు రామాయణములో కూడా కాన వస్తుంది. మయుడు మయ రాష్ట్ర అను పట్టణాన్ని నిర్మించి తన రాజధానిగా చేసికొన్నాడు. మయ రాష్ట్రను ఇప్పుడు మీరట్ అని పిలుస్తారు. లంకాధిపతి అయిన రావణుని అందమైన భార్య మరియు పట్టమహిషి యైన మండోదరి  మయుని కుమార్తె. మయుని గూర్చి రామాయణములో వేరొక చోట కూడా వింటాము. రామాయణము లో 4-50-7 లో దక్షిణా పథమున వింధ్యపర్వత శ్రేణి లోని ఒక విశాలమైన గుహలో వెండి బంగారముల నుపయోగించి ఒక మహా భవనమును కట్టించి సతీ సమేతుడై సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో  తులతూగుతూ  వుంటే సహించలేక ఇంద్రుడు అతనిపై యుద్ధము ప్రకటించి ఆతనిని సంహరించి సంతసించుతాడు. మరి ఈ మయుడు బహుశ మయ వంశీకుడైన మరొక వ్యక్తిగా తలచవలసి వస్తుంది. ఆయన మరణానంతరము ఆయన పత్ని ఆ వనమును మేరు సావర్ణి కుమార్తె స్వయంప్రభకు దత్తముజేసి వెళ్ళిపోతుంది.                

           పుష్పక సౌభాకాది విమానముల నిర్మించినవాడు మయుడు. ఈవిధముగా మనము గమనించుతూ పోతే మయుని పేరుతో వివిధ వ్యక్తులు మనకు పురాణేతిహాసములలో తారసపడుతారు.

 తిరిగీ మయసభ నిర్మాణము గావించి వెడలిన మయుడు తన పరివారముతో ఎచటికి పోయినాడన్నది మనకు భారతమున కనిపించదు. కారణం  ఆ తరువాత జరిగే వృత్తాంతములతో  ఆయనకు ఏ  సంబంధము లేకపోవుటయే! భారతీయులు పశ్చిమ దేశములకు కూడా వలస వెళ్ళినట్లు కోట వెంకటాచలము గారు వ్రాసిన పుస్తకముల చదివితే మనకు ఆ విషయము తెలియగలదు. భారతీయులు గ్రీసు దేశమునకు వెళ్ళినట్లు కూడా పోకాక్ గారు వ్రాసిన ‘India in Greece’ ద్వారా మనకు నిర్దుష్ఠముగా తెలియవస్తుంది. అదేవిధముగా వారు దక్షిణ అమెరికా మెక్సికో దేశములకు వెళ్లి యుండే అవకాశము పుష్కలముగా కనిపించుచున్నది.

 మెక్సికో, దక్షిణ అమెరికాలలోని మాయన్” ల లేక  మాయ” లేక  మయుల” సంస్కృతి వున్నట్టుండి చాలా వెలుగులోకి వచ్చింది.   కారణం కొన్ని వేల సంవత్సరాల క్రిందట వారు తయారు చేసిన కాలండరే!  క్రీ.పూ. ఆగష్టు 11, 3114  నాటి నుండీ క్రొత్త యుగం మొదలయ్యిందని వీరి కాలండర్ చెబుతోంది; అదేవిధముగా డిసెంబర్ 21, 2012 నాటితో, ఈ కాలెండర్ యొక్క ఆవృతం ముగుస్తుంది. ఆ రోజు సూర్యుడి వెనుక, మన గలాక్సీ గురుత్వాకర్షణ అతి గరిష్ట స్థాయిలో వుంటుందని శాస్త్రవేత్తలు చెప్పియుండినారు. ఈ నమ్మకం పైనే తీసిన “ 2012”  అనే హాలివుడ్ సినిమా కూడా పెద్ద హిట్టయ్యిది కూడా. మళ్ళీ కొత్త యుగం అక్కడి నుండీ మొదలవుతుందా? లేక అదే యుగాంతమా? అని సమాధానము తెలియక అందరూ ఆదుర్దాతో సతమతమయిపోయినారు. అందుకే మయులపై పరిశోధనలు జరిపి వారిని  వెలుగులోకి తెచ్చుట జరిగింది. దానితో వారిని గూర్చిన అనేక  కొత్త విషయములు బయటకు రావడం మొదలయినాయి.

జ్యోతిశ్శాస్త్ర అధ్యయనము చేసిన మహా శాస్త్రజ్ఞులు పాండవుల అరణ్యవాసం ప్రారంభం క్రీ.పూ. 4 సెప్టెంబరు 5574 అని నిర్ధారించినారు. క్రీ.పూ.6౦౦౦ కాలమున మేసో అమెరికా నివాసముగా ఏర్పరచుకొన్న మయులు క్రమేపి వ్యవసాయమును అభివృద్ధి చేసినట్లు తెలియవస్తున్నది. సజ్జలు(మైజ్), వివిధ రకములగు చిక్కుళ్ళు, పలువిధములగు గుమ్మడి వంటి తీగ కాయలు  (గూగుల్ సౌజన్యము తో) పండించే వారని తెలియవస్తున్నది. ఈ మేసోఅమెరికా ప్రాంతమును మనము పాతాళము అని పిలిచెదమన్న విషయము మనకు తెలిసినదే! పాతాళము నందు రాక్షసులు నివసించెదరు అన్న విషయమూ మనమెరిగినదే! రాక్షసుల గురువు శుక్రుడు అన్న విషయము మనము చదివినదే! క్రీస్తుకు పూర్వము 6౦౦౦ అన్నది ఒక ఉజ్జాయింపు మాత్రమె! మయసభ నిర్మాణము తరువాతనే కదా మయుడు పాండవుల వద్ద శెలవు తీసుకొని వెళ్ళినది. కావున మయుడు తన పరివారముతో ఇంచుమించు క్రీ.పూ. 56౦౦ ల కాలములో మెక్సికొ వెళ్లియుండవచ్చును అన్న మన ఊహకు ఊతము దోరికినట్లే కదా! అదియట్లుంచితే  గొప్పగొప్ప కట్టడాలను ఆ నాటికే కట్టినారనీ; వారికున్న వాస్తు నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానం అమితమనీ, అపారమనీ, వారికి సాటి ఎవరూ లేరనీ తెలుసుకున్నాము. యూరోపియన్ దేశాలకు ఇళ్ళు కట్టు కోవడమే తెలియని రోజుల్లో వీరు పెద్ద పెద్ద భవంతులను, ఆలయాలనూ, ఉద్యానవనాలనూ, పిరమిడ్లనూ నిర్మించుకున్నారు.  మరి మయుల భవన నిర్మాణ కౌశలము మయుడు మయసభ మూలమున మనకు చూపనే చూపినాడు కదా! ఈ పోలిక కూడా మయుడు అతని పరివారము అచటికి పోయివుండవచ్చును అన్న ఆలోచనను బలపరచుట లేదా! మయ సభ కట్టిన తరువాత మయుడు తన దారిన తాను పోయినట్లే చెప్పబడినది. పాండవులను తానూ తన పరివారము నిలుచుటకు స్థలమివ్వమని ధర్మజుని అతడు అడుగలేదు. మరొక విషయము ఏమిటంటే వీరికున్న ఖగోళ పరిజ్ఞానం కూడా చాలా ఎక్కువే. భూమి గోళాకారంగా వుందనీ, గ్రహ నక్షత్ర భ్రమణాలను గుర్తించి, వాటి ఆధారంగా కాలండర్లను తయారు చేసుకోవడమే కాకుండా, వాళ్ళ ఇళ్ళను కూడా ఆ భ్రమణాలను దృష్టిలో పెట్టుకునే కట్టుకున్నారని పురావస్తు శాస్త్రజ్ఞులు త్రవ్వకాల వల్ల, పరిశొధనల వల్లా తెలుసుకున్నారు. వీరికి శుక్రగ్రహం చాలా ప్రశస్తమైనదని ముందే చెప్పుకొన్నాము. ఆ శుక్రగ్రహ వివరాలు అతి క్లుప్తముగా ఒకసారి చూద్దాము. వారి పరిభాషలోని పదములను యథాతథముగా తెలియజేయుట సులభమని తలంచి నేను గ్రహించిన విషయమును ఆంగ్లమునే మీ ముందుంచుచున్నాను.

Venus was prominent in many ancient cultures but was especially important to the Mayans in Mexico and Central America. Even without telescopes, the Mayans were able to predict the movements of the spectacular object known popularly as the morning (or evening) star with great accuracy, thousands of years into the future. They may not have mapped a transit per se, but they knew where the planet was going to be, and when.

The Mayans venerated Venus as the basis of the god Kukulkan, elsewhere known as Quetzalcoatl. Unlike its modern, Western interpretation as the planet of love, the glittering orb was at that time associated with war. The Mayans even used its appearance to decide when to wage it. The evening version was especially related to war calculations, notes the website AuthenticMaya.com.

Venus held a particular attraction for the Mayans. It was considered to be connected with the major deity Quetzalcoatl. It was called Xux Ek, the "Great Star," and the Mayans knew that it is the same object that appears in both the morning and the evening at different times of the year. The priest-astronomers determined the synodic period of Venus (how long it takes to orbit the sun) to be 584 days, which is again incredibly close to the actual period of 583.92 days. When Venus rose in the mornings, it was considered bad luck, and everyone would stay inside their homes and block their chimneys so that the evil light from Venus could not enter. The Mayans also calculated the synodic periods of Mars as 780 days (actual = 779.936 days) and Mercury as 117 days (actual = 116 days), but they seemed uninterested in Jupiter and Saturn, the other bright planets. None of the planets were actually seen as objects different from the rest of the stars, which is unusual considering that they move significantly in relation to the fixed stars.

మిగిలినది మరోమారు.......

ఖాండవము మయసభ 8

 ముఖ్యంగా తెలుసుకొనవలసిన విషయాలు ఏమిటంటే మయులకు బాగా అభివృద్ధిచెందిన లిపి, క్రీస్తుపూర్వము నుండియే వున్నది. వీళ్ళ భాష ప్రాచీన భాషగా గుర్తింపబడినది కానీ ఎంత పురాతనమన్నది చెప్పుట కష్టమే!

వారు చెట్టు బెరడుతో పేపరు తయారు చేసి దానితో పుస్తకాలు కూడా ఏనాడో చేసుకున్నారు. వీరి మత నమ్మకం ప్రకారం వీరి పూర్వీకులు అంతరిక్షం నుంచీ విమానయానం చేసి భూమి పైకి వచ్చినారని తలుస్తారు. అలాగే వీరు కూడా తరువాత వున్నట్టుండి, వాళ్ళు కట్టుకున్న నగరాలను సైతం వదిలేసి  అదృశ్యం అయిపోయినారు. ఎక్కడికి, ఎందుకు  అన్నది మన ఊహకు అందని విషయమే! కాకపోతే వీరికి వైమానిక జ్ఞానం వుంది అనే విషయం మాత్రం నిర్వివాదాంశం. 

ఈ ప్రదేశాలలోని వీరి కట్టడములు  కంటికి అందనంత పెద్దపెద్ద ఆకారములు. వీటిని చూడవలెనంటే గగనతలము నుండి చూచుటకే సాధ్యమౌతుంది.  ఈవిధముగా దక్షిణ అమెరికాలో పెరూ వద్ద కనపడే  రేఖా చిత్రాలను నాజ్కా లైనులు అంటారు. ఇందులో అనేక పక్షుల బొమ్మలు, జంతువుల బొమ్మలూ, త్రిభుజాలు వంటి పెద్ద పెద్ద ఆకారాలు వుంటాయి. ఇవి సహజముగా ఏర్పడిన ఆకృతులు కావని ఎవరైనా చూడగానే చెప్పగలరు. అనేక మైళ్ళ దూరం వ్యాపించే ఈ ఒక్కొక్క చెక్కడములు, ఒక మానవుడు (అందులోనూ ఆదిమానవుడు) చేయగలిగిన పనులు కావు.  ఎందుకంటే నేలమీద నుంచుని చూస్తే కంటికి తెలియని దృశ్యమది. ఒక వేళ మనిషే చేసినా అది చూడాలంటే ఖచ్చితంగా ఆకాశంలోకి ఎగరగల సామర్ధ్యం వుండాలి. లేకుంటే తను వేసిన చిత్రాన్ని తానే చూసుకోలేడు, ఆనందించలేడు, ఒకరికి చూపించుకోలేడు. అందుచేత మయులకు విమానయానం తప్పక తెలిసి వుండవలెనని తెలియవస్తూ వున్నది.

అదే విధముగా ఆప్రాంతములను జిజ్ఞాస పూర్వకమగు  పరిశీలన చేసిన యెడల ఒక విమానాశ్రయము వలె అనిపిస్తుంది.  ఒక పెద్ద రన్ వేనేలపైన నిర్మించినట్టుగా వలె తెలియవస్తుంది. ఈ విధమగు రన్ వేలను ఇంకా ఎన్నింటినో ఇచట చూడవచ్చును.. అంతేకాదు. వీరి శిధిలాలలో విమానాలకు సంబంధించిన శిల్పాలు కూడా దొరికినాయి.

 విమాన యానమునకు సంబంధించిన చిత్రమును అచట చూస్తే మనకు అందులో ఒక అంతరిక్ష నావికుడు కనిపిస్తాడు. ముఖం పైన ఒక తొడుగు, ముసుగు(మాస్కు) వుంటుంది. అదేవిధముగా ముక్కులోనికి ఒక, బహుశ, ఆక్సిజన్ ట్యూబు జొనిపినట్లుంటుంది. ఒక కాలి క్రింద ఒక పెడల్ వుంటే రెండవకాలికింద ఫుట్‌ రెస్ట్ వుంటుంది. ఒక చేతిలో జాయ్ స్టిక్కు వుంటే మరొక చేతిలో ఒక బొత్తము (button) లేక మీట  వుంటుంది. ముఖం ముందు ఒక కంట్రోల్ పేనల్ వుంటుంది. మనిషి కూర్చునే విధానం కూడా ఒక రధంలో కూర్చున్నట్లు నిటారుగా వుండదు. పైకి చూస్తూ ముడుచుకుని ఉన్న ఒక రాకెట్‌లోని ఆస్ట్రోనాట్ లాగే వుంటుంది. ఇది మన రాకెట్టునో స్పేస్ షిప్పులనో చూసి వేసిన చిత్రం కాదు అన్నది చూస్తూనే తెలిసిపోతుంది. మనకు అంతరిక్ష యానం అంటే కూడా ఏమిటో తెలియని రోజులలో, ఒక కళాకారుని గుండె పొంగి, తాను చూసినది అందరికీ తెలియపరచాలి అన్న ఉద్వేగంతోచేసిన శిల్పం. ఈనాడు మనకు తెలిసిన రాకెట్‌ కాక్‌పిట్‌కు, దీనికీ ఏమీ తేడా లేదు. ఇవన్నీ చూస్తుంటే వీరికి వైమానిక జ్ఞానం వుందనే తెలుస్తోంది. 

 సౌభక, పుష్పక మొదలగు విమానములను మయుడు చేయించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పురాణములలో విమాన నిర్మాణ శాస్త్రజ్ఞులుగా బ్రహ్మ, విశ్వకర్మ, మయులను పేర్కొన్నారు. మొదటి ఇరువురు దేవతలకు సంబంధించిన వారయితే  మయుడు మాత్రము అసురుడు.  పై విమానములు ఏక కాలములో చేయబడినవి కావు. ఒక దాని నిర్మాణమునకు వేరొక దాని నిర్మాణమునకు కొన్ని వేల సంవత్సరముల వ్యత్యాసము ఉంటుంది. మరి దానిని బట్టి ఆలోచించితే  ఈ మయులిరువురూ ఒకరే కాకపోవచ్చును. ఈ విషయమే కాక మయసభ నిర్మించిన మయుడు మనము తార్కికముగా యోచించితే, వీరు కాక వేరొకనిగా గుర్తించ వలసి వస్తుంది. అప్పుడు మయ అన్నది ఒక తెగగా కూడా చెప్పుకొనవలసి వస్తుంది. మయుని మన ఇతిహాస పురాణాలలో మయాసురునిగానే చెప్పినారు. మయ రాక్షసునిగా కాదు. అమరము ఈ విధముగా చెబుతుంది.

అసురా దైత్య దైతేయ ధనుజేంద్రారి దానవాః

శుక్ర శిష్యాః దితిసుతాః పూర్వదేవా స్సురద్విషః

ఇక్కడ మనము గ్రహించవలసినది ఏమిటంటే అసురులు రాక్షసులు కాదు అన్నది. రెండవ విషయము ‘పూర్వ దేవాః’ అసురత్వమును పొందుటకు పూర్వము వీరు దైవత్వము కలిగి యుండినారు. అందుకే మయుని విశ్వకర్మ కుమారుడు అని పురాణములు చెబుతున్నాయి. మరి ఆయన అసురుడే విధముగా అయినది తెలుసుకొన నే జేసిన ప్రయత్నము ఫలించ లేదు.

ఇక రెండవ విషయము ‘అసురా --- శుక్రశిష్యాః’ అన్న మాటతో  అసురులు అంటే మయులు అసురులే కదా! వారు శుక్రుని తమ ఆరాధ్యునిగా తలచుతారు. కావున మయసభ నిర్మాణము తరువాత పాతాళముగా భావింపబడే తమ నెలవును మయులు చేరినట్లు మనము గ్రహించగలము. శుక్ర గ్రహమును ఆంగ్లములో Venus అంటారు. ఆంగ్లములోనే వ్రాయబడిన ఈ విషయమును యథాతథముగా మీ ముందుంచుతాను.

మిగిలినది మరొకమారు......

ఖాండవము మయసభ మయులు - 9 

The movements of the planet also held special meaning for them. Tables that mark Venus’ position throughout the year are recorded in ancient Maya books called codices and on monuments throughout the Maya kingdoms. Venus also seems to have influenced the architecture of the city Uxmal in the northwestern part of Yucatán, Mexico. Anthony Aveni, an archaeoastronomer at Colgate University, believes that the royal residence named the “House of the Governor” was designed with the observation of Venus in mind. Venus symbols decorate its façade and from its central doorway an observer can still see the planet align with monuments across the site that mark the northern and southern extremes of Venus’ migration along the horizon throughout the year.

అలాగే వీరి కట్టడాలు చూస్తే అవి కూడా భూమికి చెందిన సాంకేతిక పరిజ్ఞానం కాదు; ఈ అసాధారణ నైపుణ్యాన్ని ఆ రోజుల్లోనే ఎలా సాధించినారో మనకు అంతుపట్టడం లేదు!  వందలాది టన్నులు బరువు చేసే రాతి శిలలను ఆ రోజుల్లోనే తరలించినారు, ఒకదాని పై ఒకటి ఎత్తి పెట్ట గలిగినారు. గజిబిజి ఆకృతులగా కనిపించే కొండ రాళ్ళను చెక్కుకొని, ఆ రాళ్లను ఒక పజిల్‌లో ముక్కల్లా వింతగా పేర్చడం, వారి నిర్మాణ పరిజ్ఞానానికి ఒక చిన్న మచ్చు తునక. వివిధ ఆకృతులలో వున్న ముక్కలగా అవి కనిపిస్తున్నా, నిజానికి అవి ప్రణాళికా బద్ధమగు శిల్పములుగా మనము గ్రహింప వచ్చు. కారణము ఏమిటంటే అవి ఒకదానిలో ఒకటి కూరుకుని ఇరుక్కుని సరిగ్గా సరిపోయే విధముగా చెక్కబడినట్లు మనకు గోచరమౌతుంది. అంతేకాదు ఆ రాళ్ళు వివిధ ఆకారములలో వుండి ఒకదానినొకటి పట్టుకొని వుండుట వల్ల, సిమెంటు వంటి పదార్థం కూడా రాళ్ల మధ్య వాడవలసిన అవసరం రాలేదు. వందల  టన్నుల బరువుగల రాళ్లయినా వాటిని ఎత్తి పేర్చడం; పేర్చడమే కాదు వాటి మధ్యన కాగితపు ముక్క దూరే సందు కూడా  లేకుండా అమర్చగలగటం అన్నది, ఈనాటికి కూడా ఆశ్చర్య జనకమే! ఇన్నివేల సంవత్సరాలైనా చెక్కుచెదరక నిలచినది అంటే,  ఆ నిర్మాణ కౌశలాన్ని మెచ్చుకొనకతప్పదు. ఈ విధమగు నిర్మాణము మనము కూడా మన భారత దేశములో కలిగియున్నామా అంటే అవును అన్నదే జవాబు. 2౦13 జూను మాసమున కేదారమున  సంభవించిన జలప్రళయములో ఎంతో వేగముతో, ఎక్కడలేని ఉరవడితో ప్రవహించిన గంగ కేదారనాధుని గుడి వెనుక భాగమును ఎంతో గట్టిగా తాకి కూడా వెనుదిరగవలసి వచ్చింది. కారణము గుడి గోడ పైన తెలుపబడిన రీతిలో నిర్మింపబడి యుండుటయే. ఈ విషయములన్నింటినీ క్రోడీకరించితే మనకు మయులు ఇచ్చటి నుండి ఆ ప్రాంతమునకు వెళ్లినారని తెలియవస్తుంది.

మయులు వాస్తుశాస్త్ర నిష్ణాతులు. అసలు విశ్వకర్మ వాస్తుకు సమాంతరముగా మయవాస్తు మనదేశములో ప్రబలముగా వాడుకలో ఉన్నది. నా అనుభవము ఊనందు అసమాన పండితులు.లో 40 సంవత్సరముల క్రితము కడప జిల్లా కమలాపురము దగ్గర జంగంపల్లె అన్న ఊరికి చెందిన బ్రహ్మశ్రీ జంగంపల్లె ఆత్మారామయ్య గారు మయవాస్తు నందు అసమాన పండితులు. కడపలో నేను కట్టించిన ఇంటికి వారే ఆయమును నిర్ణయించియుండినారు. ఇక మళ్ళీ మయుల విషయమునకు వస్తే ప్రపంచ ప్రఖ్యాత పిరమిడ్లకు రూపశిల్పులు వారేననిపిస్తుండి. ఇక్కడ ఒక ఆశ్చర్యజనకమైన విషయమును తెలియజేస్తాను, ఈ పిరమిడ్ అన్న పదము తమిళ భాషకు చెందిన పెరుమ్+మేడు అన్న రెండు పదముల సంయోగామా అనిపిస్తుంది. పేరుం అంటే మిక్కిలి పెద్దదయిన అని అర్థము. మేదు అనగా రాశి లర్క గుట్ట అని అర్థము. మరి పిరమిడ్ ఆవిధముగానే ఉంటుంది కదా! మయుడు ఒకడు కాదుకాదు పలువురు అది ఒక జాతియై ఉంవచ్చును అని అనుకొన్నాము. వీళ్ళు మయసభ నిర్మాణానంతరము మెక్సికో లో స్థిరవాసము ఏర్పరచుకోన్నాము. వీరి భాష విలక్షణముగా ఉండేది.

మెక్సికొ లోని ఒక ప్రాంతము పేరు ‘యకాటన్. ఆంగ్లములో ‘త’ లేదు కావున అది ‘ట’ అయ్యింది. నిజానికి ఆ ప్రాప్రాంతానికి మయులు పెట్టు కొన్న పేరు యా అంటే వారిభాషలో దక్షిణ దిశా అని అర్థము . కాత్తన్ అన్న మాట బహుశ తమిళ పదమైయుండవచ్చు. కాత్తన్ అంటే కాపాడువాడు అని మనము అన్వయించుకోవచ్చు. కావున వీరి భాష తమిలమునకు దగ్గరగా ఉండేదేమో! అది రానురానూ యోకాటన్ అయిపొయింది.

ఇక అక్కడ ఉన్న ఒక ప్రాంతము పేరు ‘చిచెన్ ఇట్జా’, ఇక్కడ ‘ఈశ అన్నమాట కృతకమై ‘ఇట్జా’ అయ్యిందన్నమాట, మెక్సికో లో ఒక పెద్ద పిరమిడ్ ఉన్నది. దానిని పూర్వము మెక్షికనులు ఎల్ కాస్టిలో అనేవారు. ఇప్పుడది యల్ కాజిల్ అయిపొయింది. దీనికి నాలుగు దిక్కులా తొమ్మిది తొమ్మిది సోపానములుంటాయి. ఇవి నవగ్రహములకు ప్రతీకలుగా చెప్పుకొవచ్చును. ఇక ఆ పిరమిడ్ పైభాగము లోనికి పోవుటకు ఎక్కవలసిన మెట్ల సంఖ్యా ఒక్కొక్క పార్శ్వమునకు 91 ఉంటాయి. 4 ప్రక్కలకూ ఉండే మెట్ల సంఖ్యను కలిపితే 364 ఔతాయి. ఈ సంఖ్యా సంవత్సరములోని రోజులకు ప్రతీక అన్ని వైపులు కలిసిన తరువాత ఉండే ఒకమెట్టు లీప్ సంవత్సరానికి ప్రతీక. ఇక ఈ ఎల్ కాజిల్ ప్రక్కన ఉండే పిరమిడ్ పేరు ఎల్ కారకల్. తమిళములో కారి క్కల్ అంటే సున్నపురాయి. తమిళనాట ఒక ఊరే ఈ పేరుతో ఉంది. ఈ ఎల్ కారకల్ అన్నపిరమిడ్ పూర్తిగా సున్నపురాయితోనే కట్టబడి ఉంది. ఈ విషయములను గమనించినపుడు వీరి భాషకు తమిలమునకు ఏదయినా సంబంధము ఉన్నదేమో అనిపిస్తుంది, ఇక వీరు పూజించే దేవుని పేరు ‘ఎచ్చువ’ ఇది రెండు పదములు అనగా ‘ఎల్ మరియు ‘చ్చువ ‘శివ అన్న పదము వారు ‘చివ ఆపై ‘చువ గా మారియుండవచ్చు. తమిళములో ‘చ లకు ఒకే అక్షరము ప్రతినిధిత్వము వహించుతుంది. ఈ ఎల్+చివ రానురానూ ‘ఎచ్చువఅయి ఉంటుంది. ఈ ‘ఎల్కూడా అరబ్బీ లో ‘అల్ అన్న పదమును కొన్ని పదములకు ముందస్తుగా వాడుతారు. ఈ ‘ఎల్ కూడా అలాంటిదేనెమో! ఆకారము చూస్తే ఆ దేవుడు వాళ్లకు లభించే జాగ్వార్ చర్మమును వస్త్రముగా ధరించుతాడు . చేతిలోశూలము ఉంటుంది. మెడచుట్టూ పాములకు ప్రతీకగా మోకు(లావైన తాళ్ళు) లను ధరించి ఉంటాడు. ఈ లక్షణాలన్నీ శివునివే కదా! ఈ ‘ఎల్ కాజిల్ అన్న పిరమిడ్ లో ‘కుకుల్కన్ అన్న దేవుని విగ్రహముంటుంది ఇక్కడ విష్ణు వాహనమైన గరుడుడు విస్తరించిన రెక్కలతో కాళ్ళతో పామును పట్టుకోన్నట్లుగా దరిశానమిస్తాడు. గరుడునిపి మానవ రూపములో ఉన్న విష్ణువును వారు ‘కుకుల్కన్’ అంటారు.

ఇదంతా ఆలోచించితే మయులకు మనదేశాముతో సంబంధము మెండు అని వారు మన దేవతా మూర్తులనే ఆరాదిన్చిరానీ, తమ మూలపురుషుడు మయుని ఇష్టదేవత తమకు ఆరాధ్యమూర్తియని మనకు తెలియవస్తూవున్నది.

మిగిలినది మరోమారు......

ఖాండవము మయసభ మయులు - 10

మయుల (Mayans) పైన నాసాకూడా ఎన్నో రెమోట్ సెన్సింగ్ శాటిలైట్లతోపరిశోధనలు జరుపుతోంది. " జర్నల్ ఆఫ్ ఆర్కిలాజికల్  సైన్సెస్ " వివరణ ప్రకారం మయులు 1400 సంవత్సరాల క్రితమే " హై ప్రెజర్‌లో " నీటిని పైపులలో పలంకె నగరానికి  సరఫరాను చేసే వారని తెలియవస్తూ వుంది. పలంకె నగరం క్రీ.శ.100నుండీ వుందని, ఇందులో 1500 మందిరాలు, అందమైన హై ప్రెషర్ ఫౌంటెన్లు, 9 నీటి సరఫరా మార్గాలు, డ్రైనేజీ కాలవలు, వంతెనలు, ఆనకట్టలు, సుందరమగు ఈత కొలనులు  వున్నాయట.

మయుల దృష్టిలో సృష్టి అనేక భువనాలలో జరిగిందట (హిందువుల నమ్మకం ప్రకారం కూడా సృష్టి 14 భువనాలలో జరిగింది). ముఖ్యంగా భూమిపైన, పాతాళంలోనూ, పైన స్వర్గంలోనూ సృష్టి జరిగిందట.  మనిషి చనిపోయిన తరువాత ఆత్మ పాతాళంలోని షిబల అనే స్థానానికి చేరుతుంది. ఇది అతి భీకరమైన స్థానమట.

 

ఆశ్చర్యమేమిటంటే, వీరి పురాణాలలోనూ బయటి లోకాల నుంచీ వచ్చిన దేవతలున్నారు. వేయేళ్ళక్రితం, ఈ యుగంలో, ఈ లోకంలోకి వచ్చిన దేవుని పేరు క్విట్జక్వాటల్ (అనేక తలల మహా సర్పము). ఈ సర్పమునే " కుకల్కన " అని కూడా అని పిలుస్తారట. ఈ పేరుకు కూడా మళ్ళీ కలియుగపు విష్ణు అవతారమైన " కల్కి" నామముతో మనకు కొంత సారూప్యము  కనిపిస్తుంది.

ఒకసారి ఈ దేవుడే ఒక తెల్లని మానవ రూపంలో దర్శనం కూడా ఇచ్చినాడట. ఆ మానవ రూపాన్ని వర్ణించే చిత్రాలు ఎంకి అనే సుమెరియన్ దేవుని రూపమును పోలి వుంటుందట. ఈ సుమేరియన్ ఎంకి దేవుని కథ మన వెంకటేశునికి వర్తించుతుందా లేదా అన్న విషయము అటుంచితే, వెంకి అన్న పదం మాత్రం సంస్కృత జన్యము కాదని మనకు తెలుసును. ఇది అచ్చతెలుగు పదమో లేక తమిళము లోని వెంగడం” అన్న పదము నుండి పుట్టియుండవచ్చు, లేకపోతే మనకు ఏదో తెలియని సుమేరియన్ అనుబంధమేదయినా కూడా  వుండి వుండవచ్చునేమో! ఏది ఏమైనా ఎంకిఅనే మాట వినగానే మనకు కలియుగ దైవమైన వెంకటేశుని నామం లాగా తోస్తుంది. అది ఒక కాకతాళీయము అని సులభముగా కొట్టివేయుటకు మన మనసు అంగీకరించదు.  ఎందుకంటే మనకు తెలుసు, వెంకటేశుడు కూడా బయట లోకం నుంచీ (వైకుంఠం) వచ్చినవాడే, అతడి అంశ యగు ఆదిశేషునకు కూడా సహస్ర ఫణములే! (సహస్ర అన్న మాటకు వెయ్యి అనే అర్థము కాకుండా అనేకమయిన అన్న భావమును కూడా కలిగివుంది నిఘంటువులో!) మన కలియుగ దైవము పేరు కూడా ఎంకన్నే! అంతేకాదు, వీరి కాలండర్ ప్రకారం, కొత్త సృష్టి (అంటే యుగారంభం) క్రీ.పూ. 3114లో జరిగింది. హిందువుల లెక్కల ప్రకారం కూడా కలియుగం దాదాపు అప్పుడే మొదలయ్యింది.  కాని వీరి యుగం క్రీ.శ . 2012తో పూర్తి అవుతోంది. కానీ మన కలియుగంలో, ఇంకా మొదటి పాదమైనా  పూర్తి కాలేదు.

మరి ఈ తేడా ఎక్కడ వచ్చిందో తెలియడంలేదు. ఈ విషయాలకు సంబంధించిన ఆధారాలు ఇంతవరకూ అంతుపట్టుట లేదు. దానికి కారణాలు అనేకం. 5వ శతాబ్ధంలో (కొంతమంది 9వ శతాబ్ధం అంటారు) వారి సామ్రాజ్య పతనం మెదలయ్యిందట. వీరు అనేకులు అప్పటినుండి వారి నగరములను భవంతులనూ వదిలి ఎక్కడికో అదృశ్యమయినారన్న కధనం ఒకటి వుంది. వారి మత గ్రంధాలలో చెప్పినట్లు వారి పూర్వీకుల లాగా, వీరు కూడా అంతరిక్షంలోకి వెళ్ళిపోయినారని నమ్మకాలూ వున్నాయట. అలాగే 16వ శతాబ్దిలో కొలంబస్ తెచ్చిన స్పానిష్ క్రిష్టియన్ మిషనరీలు మిగిలిన కొంత మందినీ (లేక వారి వల్ల మిగిలిన సంతానాన్ని) తుదముట్టించి తుడిచి పెట్టి పుణ్యము కట్టుకొన్నాడు. ఈ మయుల మతాచారములు మనము తెలుసుకొనుటకు ఏమాత్రము తావునివ్వకుండా సమూలంగా రూపు మాపుటకై, వారి వేలాది గ్రంధములను  తగులపెట్టించి నారని  చరిత్రకారులు చెబుతున్నారు. ఇప్పుడు మయులము అని చెప్పుకునే మనిషి లేడు, భాషలేదు, మతమూ లేదు! కానీ మయుల అదృష్టమో మన అదృష్టమో  మూడు పుస్తకాలు, ఎదో ఒక విధముగా మన చరిత్రకారులకు లభించినట్లు తెలియవస్తూ వుంది. వాటితో పాటు కొన్ని శిలాశాసనాలు కూడా మిగిలి వున్నాయట. ఇప్పుడు మనము తెలుసుకున్న విషయములకు అవే ఆధారము. అంటే ఇక తెలియనివి ఎన్నో, ఎన్నెన్నో!

 ఈ మయుల సంస్కృతిని ఒక్క నిమిషం పక్కకి పెట్టి, మన శాస్త్రాలు ఏమి చెబుతున్నాయో చూద్దాం .

 వాస్తుశాస్త్రంలో మయ వాస్తు, విశ్వకర్మ వాస్తుశాస్త్రం, రెండూ ఉన్నాయి. వాస్తుశాస్త్రం అంటే మనకు ఆదిపురుషుడు విశ్వకర్మయే కావచ్చు. కానీ దేని గొప్పదనము దానిదే. పూర్వము రెండు వాస్తు శాస్త్రములలోనూ ఉద్దండులగు పండితులుండేవారు.

విశ్వకర్మ యొక్క ఒక కుమారుని పేరు మనువు. మనువు వంశంలోని వాడే భృగువు. భృగువు బిడ్డలలో ఇద్దరు శుక్రులు వున్నారట. రెండవ శుక్రుడు పులోమాదేవి సంతానమై, బ్రహ్మ మనుమరాలు ఊర్జస్వతిని వివాహమాడి దేవయానికి జన్మనిచ్చినాడు. దేవయాని యయాతిని వివాహమాడి యదు, దుర్వాసులకు జన్మ నిచ్చినదట. యదువు నుండి యదువంశము ప్రారంభము అయివుండవచ్చు. యదు వంశానంతరము కలియుగము ప్రారంభమయినది మనకు తెలిసినదే!

మొదటి శుక్రుడు దివ్యాదేవి వల్ల పుట్టిన వాడు. అతడు ఇంద్రుని కుమార్తె జయంతితో వివాహమాడి  కాబా లో స్థిరపడినాడట. ఇందుకు సాధికార ప్రమాణము కనిపించలేదు. అంతకు మించి వెదుకుటకు నా శక్తి చాలలేదు. ఈ కాబా అన్నమాట ఈ నాటి ఇస్లాం వారి మక్కా లోని మందిరం వలే అనిపిస్తోంది. కానీ ఆ రెండూ ఒకటి అని గానీ వేరువేరని గానీ  మనము నిర్దారించలేము.  ఇస్లాం మతమున కంటే ముందు కాబా ఒక శివాలయమని అచటి శివుని పేరు మఖేశ్వరుడని, కాబా అన్న పదమే ‘గర్భ’గుడి అన్న శబ్దమునుండి వచ్చినదని, అసలు మఖ అంటే యజ్ఞమని, అచ్చట ఆకాలములో యజ్ఞములు విరివిగా జరిగేవనీ, యజ్ఞమునకు అగ్నియే మూలమని, అగ్నికి సప్తజిహ్వుడు అన్న పేరుంది కాబట్టి, ఆ అగ్ని ఆరాధనలోని భాగముగా ఇప్పటికీ మహమ్మదీయులు ఆ గుడి చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తున్నారని  తెలియవస్తూవుంది. ఈ విషయముల గూర్చి శ్రీయుతులు P.N. ఓక్ గారు  తమ Was the Kaaba Originally a Hindu Temple? By P.N. Oak (Historian) చదివితే గాని కొన్ని నిజాలు తెలియవు. కానీ సుమేరియన్లకు, మనకు  వెంకి అనే ఒకే  పదం ఏవిధముగా వాడుకలోనికి వచ్చినది అనుటకు  అధారాలు దొరుకుతాయి

పోనీ మక్కా లోని కాబా కు  సుమేరియాకు ఏమీ సంబంధం లేదు అని అనుకుంటే మెక్సికోలో మయులు  నిర్మించిన కాబా అనే వూరు మరొకటి వుంది. మయులకు శుక్రగ్రహం చాలా ముఖ్యమైన గ్రహం అని ఇంతకు మునుపే చెప్పుకున్నాం కదా! అంటే మన కాబా ఏ కాబా అయినా కూడా, శుక్రాచార్యులతో బంధం మాత్రం ఖాయం అని తెలుస్తోంది.

 

మయుని పుట్టుక

విశ్వకర్మకు ఒక కుమారుడు మనువైతే వేరొక కుమారుడు మయుడు. మయుడు మహా శిల్పి. అతడు వాస్తు శాస్త్రములో విశ్వకర్మ అంతటి గొప్పవాడు. పురాణాలలో దాదాపు అన్ని కట్టడాలూ అతడివే. ఇతడు అనేక లోకాలను ప్రాసాదాలను, రథాలను, విమానాలను, మండపాలను, ఆయుధాలనీ నిర్మించినాడని ప్రతీతి. మయుని కట్టడాలలో ఇంద్రలోకం, వైకుంఠం, కైలాస కళ్యాణ మండపం, ఇంద్ర సభ, వరుణ సభ, అలకాపురి సభ(కుబేరుని పట్టణము), సత్యలోకం (బ్రహ్మ వుండేది), మయసభ (మహాభారతంలోనిది) అతి ప్రసిద్ధి గాంచినవి. ఇతడి త్రిపుర, సౌభక, పుష్పక విమానాలు కూడా చాలా ప్రసిద్ధి చెందినవి. త్రిపురాలు రాక్షసులకోసం చేయబడ్డవి. అవి బంగారంతో చేయబడ్డ గాలిలో ఎగిరే మహా నగరాలుగా వర్ణించబడ్డాయి.  సురాసుర యుద్ధంలో శివుడు వాటిని ఖండిస్తే అవి ముక్కలుముక్కలుగా భూమిపై పడి త్రిపురాంతకం వెలిసిందని అంటారు.

మయుడు సౌభక విమానంశిశుపాలుని సోదరుడు సాళ్వుని కొరకు ఉక్కుతో చేసినాడట. అలాగే కుబేరుడి కొరకు బంగారముతో పుష్పక విమానంచేసినాడు. రామాయణంలో వర్ణించినట్లుగా ఎంత మందికైనా సరిపొయే విధముగాగా పెరుగగల సామర్ధ్యం దానికి  వుంటుంది. అదేవిధముగా ఇంద్రుడి కొరకు మయుడు చేసిన విమానమును ఇంద్రుడు వసురాజునకు బహుమతిగా ఇచ్చినట్లు వసుచరిత్ర చెబుతోంది. అదేవిధముగా మయుడు వజ్రాయుమును కూడా దధీచి వెన్నెముకతో చేసినాడన్న కథ ఒకటి వుంది. సుదర్శన చక్రం, త్రిశూలం వంటి ఆయుధాలను కూడా మయుడే నిర్మించినాడంటారు.

 

మనువు, మయులతో పాటూ, విశ్వకర్మకు ఇంకా త్వష్ట, శిల్పి, దైవజ్ఞ అని మరొక ముగ్గురు కుమారులున్నారు. వారిని కూడా మయుని గానే పురాణాలలో వ్యవహరించారన్న వాదన వినిపిస్తుంది. అందుకేనేమో వారి గురించిన వివరములు పెద్దగా తెలియవు . అట్లే మరికొన్ని గ్రంధములలో, పైన చెప్పబడిన కట్టడాలన్నీ విశ్వకర్మే స్వయంగా కట్టినట్లు చెప్పబడి వుంది. ఏది ఏమయినా  మయుడు విశ్వకర్మ కుమారుడు అని మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది. అంటే అతడు  వాస్తు జ్ఞానం కలిగినవాడు అనుటలో సందేహమునకు తావు లేదు. అలాగే భారతంలోని మయసభ మయ నిర్మితమన్నది నిర్వివాదాంశము. అతడికి లేక ఆయన పరంపర యగు మయులకు విమాన నిర్మాణము, అస్త్ర  మరియు  వాస్తు జ్ఞానం అమితము అన్నది" సర్వ్ సర్వత్రా ఒప్పుకునే మాట.

 ఏమైతేనేమీ మయునికి ఎన్నో అసాధ్యమైన కట్టడాలను నిర్మించగలిగిన సామర్థ్యము తో పాటు, విమానాలనూ, అస్త్రశస్త్రాలనూ రూపొందించగల సాంకేతిక పరిజ్ఞానం కూడా వుందని, మన పురాణాలు ఘోషిస్తున్నాయి. కానీ ఎంత తండ్రీ, సోదరుల సాయం వుంటే మాత్రం  ఒక్కని వల్ల ఇన్ని నిర్మాణాలు సాధ్యపడతాయానిజంగా  మయుడు అన్నది ఒక మనిషి పేరా? లేక ఒక జాతి పేరా?

‘మరి మయుడు అని పురాణాలు చెబితే దాన్ని మయులు అని బహువచనంలోనికి ఏవిధముగా అన్వయించుకొనుట’ అన్న విషయమును ఇపుడు కాస్త తార్కికముగా చర్చించుదాము. ఉదాహరణకు మనం బ్రిటిషువాడు భారతదేశంలోని రైలుమార్గములనన్నీ నిర్మించినాడు అంటాము. అదేవిధముగా బ్రిటీషువాని విద్య విధానము కొనసాగుతూ వుంది   అంటాము. మరి ఇవి అన్నీ ఒకే ఒక బ్రిటీషువాడు చేసినట్లా? బ్రిటీషువాడు అన్నపుడల్లా ఎవరో బ్రిటిషు దేశస్తులు అనే కానీ ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ప్రస్తావించుట లేదు. అలాగే మయుడు అన్న పదము కూడా ఒకే ప్రాంతము లేక ఏలుబడి లోని ప్రజలకో లేక జాతికో వర్తించును అన్నది మనము ఇక్కడ అర్థము చేసుకొనవలసిన  విషయము.  మయుడు ఒక వ్యక్తి కాడు అది మయుని వంశస్తులు లేక మయులు అనే ఒక జాతి అని మనం నిర్ధారించుకొన గలిగితే  మయులన్నా, మయుడన్నా ఒకటే నని మనకు అవగతమౌతుంది.  అదేవిధముగా మనము పైన వివిధ కోణములలో చర్చించిన విధముగా మన మయసభ మయునికీ, మెక్సికో మయునికీ దగ్గరగా పరీక్షించి, పరిశీలించి పరీక్షించితే  ఇద్దరూ ఒకరే నని తెలుస్తుంది.  కనీసం ఒకే  జాతికి చెందిన వారు అన్నది నిర్వివాదాంశమని తెలియవస్తుంది.

దక్షిణ అమెరికాలో పురావస్తు శాస్త్రజ్ఞులు చెప్పినట్లుగా మయులకు వాస్తు జ్ఞానం, వైమానిక జ్ఞానం, ఖగోళ జ్ఞానం మన అందరికన్నా ఎక్కువే వున్నాయని తెలుస్తూ వుంది. హిందూ పురాణములలో కూడా, వీరికున్న అటువంటి వివిధములగు జ్ఞానములనే విశేషముగా ప్రస్తావించుట జరిగినది. మహాభారత కాలం నాటికి మయులు తప్పక వుండి వుంటారనటానికి అధారాలు  అనేకమగు శిధిలములలో, త్రవ్వకములలో పుష్కలముగా కానవస్తూ వున్నాయి. ఈ మయఅన్న శబ్ధం భారత, మెక్సికన్ దేశాలలోనే కాదు, టిబెట్ నాగరికతలోనూ (మాయ అని)ఈజిప్టు నాగరికతలోనూగ్రీకు నాగరికతలోనూ, అలాగే రోమనుల దేవత మయీ”  గా కూడా వినిపిస్తుంది. అసలు ఈ మయీశబ్ధం నుంచే మనకు  ఇప్పుడు "మే" అనే నెలకూడా వచ్చింది.

 

అయితే మయులు ఇండియా నుండీ మెక్సికో వెళ్ళి అక్కడ స్థావరమును ఏర్పరచుకొన్నారా? భారత  మరియు మెక్సికన్ సాంప్రదాయాలలోనూ మయులు అంతరిక్షం నుంచీ వచ్చిన దేవతలని చెప్పడం జరిగింది. అదే నిజమైతే, వారు రెండు ప్రాంతాలకీ చెందని, అప్పుడప్పుడు పైనుండీ భూమి మీదికి వచ్చి వెళ్ళిన  నిజమైన దేవతలా?   లేక అసుర, దానవ శబ్దము అంచున ఉండుటచే వీరు దైత్యులైనారా!

 సైన్సు లో ముందు ఒక పరికల్పన (Hypothesis) అంటూ లేకపోతే ప్రయోగమే లేదంటారు. కనుక నమ్మకం పూర్తిగా కుదరకపోయినా, ఈ మయ సిద్ధాంతాన్ని, అంటే  మెక్సికోలోని మయుడు మన పురాణాలలోని మయుడు ఒకరే అన్న సిద్ధాంతాన్ని, కనీసం ఒక హైపోథెసిస్ గా తీసుకోవచ్చు. ఈ పరికల్పనను (Hypothesis) ఆలంబనగా తీసుకొని మళ్ళీ మరిన్ని అధారములతో నిర్ధారించుకొనవలసి వుంటుంది.  మనకు ఇపుడు తెలిసినది ఇసుమంత తెలుసుకొనవలసినది కైలాసమంత. కష్టే ఫలి.

స్వస్తి.