అన్యథా శరణం నాస్తి త్వమేవ చరణం మమ
అన్యథా శరణం నాస్తి త్వమేవ చరణం మమ
అన్యథా శరణం
నాస్తి త్వమేవ చరణం మమ
అని ఆత్మ సాక్షిగా శరణాగతిని ఆశ్రయించి
పరమాత్ముని పాదదోయిని పట్టుకొన్న ఎడల ఆయన అట్టి భక్తుని రక్షించుటకు ఎప్పుడూ
సిద్ధముగా ఉంటాడు. మరి ఆ పరమాత్ముడు శివుడా కేశవుడా!
జగద్గురువులైన
శంకరులవారు ఏమంటున్నారో చూడండి.
'మహేశాంశాజ్జాతః' వారు సాక్షాత్తు
శంకరాంశలో పుట్టినవారు. ‘మధుర ముపదిష్ట అద్వయనయః' అతికఠినమైన
అద్వైత వేదాంత శాస్త్రమును రుచ్యంగా ఉండేటట్లు ఉపదేశించి బోధించిన మహాగురువులు 'మహోమోహధ్వాంత
ప్రశమన రవిః' మనలను
ఆవరించుకొన్న మహామోహాలనే చీకటి తెరలను తొలగించే భాస్కరుడు, ఆయన ఉన్న చోట
ఎలాంటి మోహాలూ ఉండటానికి వీలులేదు. 'షణ్మతగురుః' అనేకులు
ఆచార్యులు, ఒకే
ఒక మతాన్ని, ఒకే
ఒక దైవాన్ని పెట్టుకొని అదే మార్గమని బోధించినారు,
అంతకు మునుపు శైవులు శివుడే దైవమని బోధించినారు.
బసవలు, ఆరాధ్యులు, లింగాయతులు
మొదలైన వారికి శివుడొక్కడే దేవుడు. అలాగే శ్రీవైష్ణవులు, మాధ్వులు కేవలం
విష్ణువునే ఆరాధిస్తారు. కానీ వైష్ణవుల వలె మాధ్వులు శివుని ద్వేషణ చేయరు. అదే
శక్తినిఉపాసకులు దుర్గ, లక్ష్మి, సరస్వతులను
వారు తలచుకొనే స్త్రీ రూపములలో పూజిస్తారు. ఆ పరాశాక్తి బ్రహ్మవిష్ణుశివాత్మికముగా
ఉంటుంది.. అన్ని స్వరూపాలూ ఒకే ఒక అద్వైతత్వమైన పరబ్రహ్మకు చెందినవే అని కంఠోక్తి
కావించారు. ఒకే పరమాత్మ నానా రూపాలు దాల్చినప్పటికీ, అందులో ఏ
రూపాన్ని మనం ఆరాధించినా,
పరమాత్మను చేరుత తథ్యము.విశ్వాసము ఏకాగ్రత ఉంటె చాలు..
వీనిలో ముఖ్యంగా ఆరురూపాలను ప్రధానంగా భావించి, షణ్మతములను
స్థాపించినారు. అవి శైవం,
వైష్ణవం, శాక్తం, గాణాపత్యం , సౌరం, సుబ్రహ్మణ్యం
అనేవి. ఇపుడు మనం గణపతి,
శక్తి, సూర్యడు, సుబ్రహ్మణ్యుడు
అని ఏఏ మూర్తులను ఉపాసిస్తున్నామో అవన్నీ కూడా ఒకే పరమాత్మ అని సమన్వయం చేసి. శంకరులవారు,
షణ్మత గురువులైనారు.
'ఫలే
స్వస్మిన్ స్వాయుష్యపిచ', శంకరులకు, తన ఆయుస్సుకు
తగిన ఫలం లభించింది. అంటే జీవితం చరితార్థమైంది. ప్రపంచం ఉన్నంతవరకూ, అద్వైతం
ఏకచ్ఛత్రంగా అధికారం చేయటమే ఆయన జీవిత లతకు ఫలం. ముందు ముందు ప్రపంచంలోని ఏ
దేశాలలోనైనా ఏ మతాలు తలెత్తినా, సరే నిజమైన తత్త్వం తెలుసుకోవాలి అంటే
ఆతత్త్వదర్శనం భారత దేశంలోనే లభ్యమయ్యేటట్లు చేసినఘనత వారిది.
కావున ఏ దేవుని కొలిచినా ఏ దేవుడు తెలిపినా సారము మాత్రము
‘ఎకమేవాద్వితీయం బ్రహ్మ’ అనియే!
ఇపుడు శ్రీమహావిష్ణువు యొక్క రామావతారమును గూర్చి మాట్లాడుకొందాము.
కారణము ఏమిటంటే ఆయన
11 వేల సంవత్సరాల పరిపాలా కాలములో తానూ దైవాంశ సంభూతుడనని ప్రకటించుకోలేదు. మహిమలు
చూపలేదు. ధర్మ నిష్ఠ, సత్యపాలనాను చేయి జార్చలేదు,
కానీ ఒకే ఒక్క పర్యాయము మాత్రము తన భగవద్గుణమును బయట పెట్టుకొన్నాడు. ఇది శ్రీ రామ మంత్రమని అని పెద్దలు చెపుతారు. రామాయణము
యొక్క అసలైన తత్త్వం అంతా ఈ వాక్యం లోనే ఉందని కూడా పెద్దలు అంటారు. సందర్భము ఈ
విధముగా ఉన్నది.
లంకపై దందయాత్రకు
వానరదండుతో శ్రీరాముడు సముద్రతీరాన్ని చేరుకున్నాడు. సీతాపహరణ కారణంగా రావణునితో
విభేదించి, ఆతని నిరాదరణకు లోని రాముని శరణుకోరి బయలుదేరుతాడు
విభీషణుడు. విషయము తెలుసుకొన్న శ్రీరాముడు,అప్పుడు అతనికి
అభయం ఇవ్వవలయునా వద్దా అనే చర్చనులేవదీస్తాడు శ్రీ రామచంద్రుడు. ఒక్క హనుమంతుడు
మాత్రము శరణు ఇవ్వవలసినదిగా సలహా ఇస్తాడు. ఆ సందర్భములో తన వ్రాతమేమిటో శ్రీరాముడు
తెలియజేస్తాడు.
సకృదేవ
ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే
అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ॥
ఎవరైనా
ఒక్కసారైనా నీవే దిక్కని త్రికరణశుద్ధిగా శరణుకోరితే సర్వభూతాల నుండి ఎటువంటి
ఆటంకము వచ్చినా అనగా విశ్వాంతరాళములోని ఏ శక్తి అడ్డువచ్చినా, ప్రతిఘటించి, అతనికి అభయం ప్రసాదిస్తాను అని
ఘోషించుతాడు.
ఈ మాటను
భగవంతుడు మాత్రమే చెప్పగలడు అది శివుడైనా విష్ణువైనా! (శివాయ విష్ణురూపాయ శివరూపాయ
విష్ణవే) ఆయనైతేనే ‘నా శరీరము భూమిపై నిలచే వరకు. నా బొందిలో ప్రానమున్నంతవరకు’ అన్న
మాటను వాడుట జరుగదు. ఆయన రూపములకు నాశము లేదు. అందుకే వాడబడదు. ఇక్కడ శ్రీరాముడు
కూడా అదే పంథాను అనుసరించి చెప్పకనే తన దైవత్వమును చెప్పుకొన్నాడు.
ఆవిధముగా అభయం ఇచ్చుట వల్ల ప్రయోజనము ఏమిటి? మనందరిలో అనంతమైన శక్తిసామర్థ్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని
చాలామందిమి కనీస స్థాయిలో కూడా వినియోగించుకోవడం లేదు. ఎప్పుడైతే ఏదో శక్తి
‘నీవెంట నేనున్నాననే‘ అభయం ఇస్తుందో అప్పుడిక సమస్త ఆపదలనుంచి విముక్తి
లభించినట్లుగా భావిస్తాం. మనలోని అనంత శక్తిని జాగృతం చేసుకునేందుకు సన్నద్ధమవుతాము.
ఉన్న స్థితి నుంచి ఉన్నతస్థితికి చేరుకునే ప్రయత్నం చేస్తాము. నిజానికి మనల్ని
ఎవరూ తీసుకువెళ్లరు… మనమే వెళ్తాం! కానీ, ఆ అభయం మనకు
ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది… దానినే ప్రేరణ అంటాం. ఫలితాల సాధనపై ఒత్తిడి లేని
ప్రయత్నంతో అసంభవం సంభవమవుతుంది.
‘అభయం’ అంటే భయం లేని స్థితి. కోరికలు
ఉన్నంత కాలం.. భయాలూ ఉంటాయి. భగవంతుడు అభయం ఇస్తున్నాడు అంటే మనలోని కోరికలను లయం
చేస్తున్నాడు. కోరికలు లేకపోతే ఏ భయమూ ఉండదు, బంధనాలూ ఉండవు.
అదే మోక్షం. మన సామర్థ్యాన్ని మించి ప్రయత్నించి కార్యాన్ని సాధించడాన్నే ‘ప్రతిభ’
అంటున్నాం. ‘కర్తను నేను కాననే’.. సర్వ సమర్పణ భావనతో కర్మఫలాన్ని ఆశించకుండా
ప్రయత్నించి అసాధ్యాలను సాధించడమే ‘ప్రజ్ఞ’. ఫలితం భగవంతుడే చూసుకుంటాడు. అదే
‘అభయం’. ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నించడమనే కర్తవ్య భావన కలిగి ఉండటమే భగవంతునిపై
‘విశ్వాసం’. అదే భక్తి, సర్వసమర్పణ భావన. అదే ఉపాసన.
ప్రయత్నం విరమించిన వారికి ఫలితం లభించదనే సత్యాన్ని విస్మరించకూడదు.మంచి ప్రవర్తనతో కూడి సత్ నిష్ఠ ఉన్నవారికి ,
రామభక్తులకూ శ్రీరామ రక్ష లభించడం వింతయేమి కాదు.
అటువంటి భక్తుల సాంగత్యమును ఒకవేళ విరోధులు
కోరి స్నేహ హస్తమును అందిస్తే, శ్రీ రామ రక్ష వారికి కూడా లభించుట విశేషము.
ఎప్పుడైతే రాముడు తన నిశ్చయమును తెలిపి
తనకు అభయమిచ్చినాడో అప్పుడు విభీషణుడు సంతృప్తి చెంది తన నలుగురు మంత్రులతో కూడి
శ్రీరాముని వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి 'శ్రీరామా! నేను రావణుడి తమ్ముణ్ణి! నా అన్న నన్ను
పరుషోక్తులతో తూలనాడి బహిష్కరించినాడు. నేను నా భార్యాపుత్రులను విడిచిపెట్టి
నిన్ను శరణుజచ్చాను.' అని విభీషణుడు
శ్రీరాముడికి విన్నవించుకున్నాడు. రాముడు విభీషణుణ్ణి ఆదరించి రావణుడి బలాబలాలను
గూర్చి తెలుసుకో గోరగా విభీషణుడు తన అన్న రావణుని బలము బలగమును గూర్చి అక్షరమక్షరమూ
నివేదించినాడు.
రాముడు ‘రావణుని పుత్రమిత్ర బంధుసైన్య సమేతంగా, సంహరిస్తాను. నిన్ను లంకారాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి
చేస్తాను' అని వాగ్దానం చేసినాడు.
విభీషణుడు రాముడికి మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేసి ''లంకను మీరు జయించటంలో నేను మీకు సాయపడతాను!'' అని చెప్పినాడు. రాముడు పరమప్రీతితో విభీషణుని
కౌగిలించుకున్నాడు. వెంటనే ''లక్ష్మణా! తక్షణము సముద్రజలాలను తీసుకొని రావలసినది. ఇప్పుడ
లంకారాజ్యానికి నేను విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తున్నాను'' అని చెప్పినాడు. వెనువెంటనే విభీషణుడికి సముద్రజలాలతో
పట్టాభిషేకం జరిపించినాడు. వానరసేన అంతా శ్రీరాముణ్ణి జయజయధ్వానాలతో అభినందించినారు.
ఇక రామాయణము మొత్తములో రాములవారి
కొప్కమును ఒకేఒక పర్యాయము మనము చూడగలుగుతాము. ఆ మర్యాదా పురుషోత్తమునికి కోపము తనకు
తానుగా రాదట, ఆయన తెచ్చుకొంటాడట. 3
దినములు ఎనలేని ఓర్పుతో సముద్రుని సహకారమునకై ఎదురుచూసినాడు. నాలుగవ రోజు ఆయన
తప్పనిసరిగా కోపము తెచ్చుకొనవలసి వచ్చినది.
ఆయన లక్ష్మణుడితో సముద్రుడి ప్రవర్తనను
నిరసించి' సముద్రుడు
అహంకరిస్తూ నన్ను పట్టించుకోనట్లు నాకు అనిపిస్తున్నది. క్షమాగుణమునకు ఈ లోకములో గుర్తింపులేదు.
శాంతస్వభావుని అసమర్థునిగా తలపోస్తుంది. కాబట్టి ఈ సముద్రుడి గర్వనిర్మూలనం
చేస్తాను. నా బాణాలతో ఇతణ్ణి శోషింపచేస్తాను' అని ఆగ్రహించినాడు. ''సామోపాయము కంటే
దండోపాయమే ఇట్టివారికి తగినది'' అని చెప్పి తన దివ్యధనుస్సు తీసుకొని శరసంధానానికి ఉద్యుక్తుడవుతుండగా
లక్ష్మణుడు అన్న కోపాన్ని శమింపచేసే ప్రయత్నం చేసినాడు. కోపంతోసముద్రుడిని శోషింపజేస్తే
నిరపరాధులైన కోటానుకోట్ల జలజీవులు ఏమైపాతారు? అని ఆ వింటిని పట్టుకున్నాడు. కాని రాముడు సముద్రుడికి గుణపాఠం నేర్పాలని
బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించటానికి ధనుస్సుకు నారి బిగించినాడు. అప్పుడు లోకాలు
సంక్షోభంలో కూరుకొనిపోయినాయి. సూర్యచంద్రులు గతులు తప్పినారు. ఆకాశం నుంచి పిడుగుల
వర్షం కురిసింది. ఉల్కలు రాలినాయి. ప్రచండవాయువు వీచింది. భూమ్యాకాశాల మధ్య
జ్వాలలు వ్యాపించినాయి. అప్పటికే రాముడు ప్రయోగించి వదిలిపెట్టిన దివ్యాస్త్రాలతో
సముద్రం మైళ్ళ పర్యంతం వెనక్కు వెళ్లి క్షీణించి పోయింది. ఇక ఆలసించక రాముడు బ్రహ్మాస్త్రం ఎక్కుపెట్టి, ప్రయోగం చేయాలా వద్దా? అని ఒక క్షణము ఆలోచనలో పడిపోయినాడు.
భయము చెందిన సముద్రుడు రాములవారి కట్టెదుట నిలచి ఈ విధముగా విన్నవించుకొన్నాడు.. ''పంచభూతాలు ఏవిధముగా సహజ ధర్మములను వ్యతిక్రమించలేవో, అదేరీతిగా భగవదనుజ్ఞ ప్రకారము నేను నా కట్టుబాటుకు బద్ధుడినై ఉన్నాను.
అంతేకాని శ్రీరామా! నీ పట్ల అగౌరవము చూపటానికి కాదు. సాగరము గడ్డకట్టుకొనిపోవడమో లేక
చీలిపోవడమో జరిగితే జలచరాలన్నీ నశించిపోతాయి. అయితే శ్రీరామా! నేను నీకు నా
చేతనైనంతగా తోడ్పడతాను. నీ ఆజ్ఞానువర్తినై, నీ అనుగ్రహం కోరి ప్రవర్తిస్తాను. నీ సైన్యాన్ని నాలోని మహాభయంకర జలచరాలు
పీడించకుండా, అవరోధం కలిగించకుండా
చేయగలను. నీవు లంకను చేరటానికి వానరులతో వారధి నిర్మింపచేస్తే అందుకు నేను
తోడ్పడుతాను. అందుకు కావలసిన మెరకను సృస్టిస్తాను,'' అని విన్నవించుకున్నాడు సముద్రుడు. అంతేకాక మరొక ప్రముఖమైన
సలహా కూడా ఇచ్చినాడు. ‘శ్రీరామా నీవద్ద ఉన్న వానర సైన్యములో నీలుడను వాడు నీటిలో
ఏమి వేసినా అది తెలికయై నీటి పైభాగము చేరుతుంది. అది అతని బాల్యమున పొందిన శాపము.
ఇపుడది నీకు వరము. తరువాత నలుడను వాడు విశ్వకర్మ కుమారుడే గాక సామర్థ్యములో కూడా ఆతనికి
సరిదీటు. నీవు వారధి ఏర్పాటు చేసుకొనే మేరకు సముద్రము లోతు లేకుండా నేను
సహకరించాగాలను. ఇక కార్యాచరణకు గడంగుము’ అని తెలిపినాడు.
ఆపై వారధి కట్టటము, రావణుని జయించడము,
విభీషణుని రాజ్యాభిషిక్తుని చేసి పుష్పకములో అయోధ్యను చేరటము అందరికీ తెలిసిన
విషయమే!
“అలాగయితే ఓ సముద్రుడా! నేను ఎక్కుపెట్టిన ఈ
బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించకూడదు కదా! అది ఇప్పుడు ఎవరిపై ప్రయోగించాలో చెప్పు'' అని శ్రీరాముడు సముద్రుణ్ణి అడిగాడు. అప్పుడు సముద్రుడు ''శ్రీరామప్రభూ! ఇక్కడికి ఉత్తరదిశలో ద్రుమకుల్యం అనే
సముద్రాంతర్గత ద్వీపం ఉంది. అక్కడ భయంకరులైన సముద్రపు దొంగలు, కౄరులు, పాపాత్ములూ అయిన జనులు నివసిస్తుంటారు. అక్కడ స్వాదుజలము లభించుటచే వారు వేరొక
చోటుణు గూర్చి తలచుట లేదు. ఆ ధృమకుల్యంపై నీ అమోఘాస్త్రాన్ని ప్రయోగించి దాన్ని
సర్వనాశనం చేయవలసింది' అని సముద్రుడు
శ్రీరాముని కోరుత జరిగినది. ఇదికాక సముద్రుడు మరొక ఉపయుక్తమగు ఆలోచనను
అందించినాడు.
ఆ మహాప్రభువు శ్రీరాముడు అట్లానే
బ్రహ్మాస్త్రాన్ని ద్రుమకుల్యంపై ప్రయోగించాడు. ఆ మహాస్త్రం రసాతలాన్ని చొచ్చుకొని
పోయే వేగంతో ఆ ద్రుమకుల్యాన్ని పూర్తిగా రూపుమాపింది. ఇట్లా ఆ మహాస్త్రం చేసిన
పెద్ద వివరం (కలుగు) నుంచి తియ్యని నీటిధార విజృంభించి పైకెగసి వచ్చింది. అట్లా
ఏర్పడిన గొయ్యి, తర్వాత ప్రణకూపం అని
ప్రసిద్ధికెక్కింది. క్కడనుంచి నిరంతరం మధురజలం పైకి ఉబుకుతూ ఉంటుంది. అక్కడ మళ్ళీ
ఒక ద్వీపం ఏర్పడి అది సర్వఋతుశోభిత ఫలపుష్ప మహారామంగా మరుకాంతారంగా విలసిల్లింది.
అక్కడ నివసించేవారికి ఏ కొరతా లేకుండా వరమిచ్చాడు శ్రీరాముడు.
సముద్రుడప్పుడు 'ఓ శ్రీరామా! నీ సైన్యంలో నలుడనే మహాకపి ఉన్నాడు, అతడు అద్భుతప్రజ్ఞాశాలి., మహాబలపరాక్రముడు. అతడు విశ్వకర్మపుత్రుడు. తన అంతటి
ప్రజ్ఞాశాలి ఆమె కడుపున పుడతాడని వరమిచ్చాడు. ఆ నలుడు అనుపమాన
శిల్పవిద్యావిశారదుడు. అతడిచేత సేతువును నిర్మింపచేస్తే నేను దానిని
పరిరక్షిస్తాను'' అని శ్రీరామునికి చెప్పినాడు.
ఇక ఇక్కడ సేతు నిర్మాణమును గూర్చి
కాస్త చెప్పుకొందాము.
నలుడు విశ్వకర్మ కుమారుడు మరియు
తండ్రికి తగ్గ తనయుడు. ఆయన సంపూర్ణవాస్తుజ్ఞాన మరియు సంవికల్పనా చతురుడు. నీలుదు అగ్ని
దేవుని అంశతో పుట్టినవాడు. బాల్యమున చిలిపి ఛేష్టలతో ప్రతి వస్తువునూ నీటిలో
వేయుచుండగా అతను నీటిలో ఏమివేసినా అది తేలుతుంది అన్న మునిశాపమును, సేతు నిర్మానమున్కకు వరముగా ఉపయోగించినవాడు. వీరిరువురు సేతు
నిర్మాణమునకు మూలకారకులు.
శ్రీ రామసేతువు నిర్మాణానికి సంబంధించి
నలుడు, నీలుడికి రాముడికి మధ్య ఒక
అద్భుతమైన సంవాదం రఘువంశంలో కనిపిస్తుంది. వానరసేనలో ఉన్న నలుడు, నీలుడు రాముడి వద్దకు వస్తారు. వీరీ ప్రపంచ చరిత్రలో తొలి అంభస
స్థపతులు(Hydraulic Engineer). వాళ్ళు రాముని సమీపించి "మీరేం భాధపడకండి. రాళ్ళ సహాయంతో సముద్రంలో
మేము వంతెన నిర్మిస్తాము". సముద్రంలో రాళ్ళు ఎలా నిలబడతాయి? అని రాముడు ప్రశ్నిస్తే, మీకు ఆందోళన ఎందుకు? అది మాకు సంబంధించిన విషయము. జలోపఛార విద్య (Hydraulics) -కోట్లాది వానరమూక సహకారముతో రాలను
తెప్పించి వానిని సముద్రంలో పడవేసి, ఒకదానిపై ఒకటి పేరుస్తాము. అవి పైవరకు వచ్చినతరువాత సేతువు నిర్మాణం
మొదలుపెడతామన్నారు నలుడు, నీలుడు. వారధి
పూర్తిచేసి,మనము లంకకు వెళ్లి
తిరిగి రాగలము కదా!, ఇంతమంది నడచి దాటి తిరిగి వచ్చినా వారధికి భంగము వాటిల్లదు
కదా! అని రాముడు తన సందేహాలను వ్యక్తం చేసినాడు. అప్పుడు నీలుడు ‘మీకు నేను ఒక
విషయం స్పష్టంగా చెప్పదలచుకొన్నాను. ఈ వంతెన మీద వెళ్ళిన మన సేన ఖచ్చితంగా తిరిగివస్తుంది. కాని రావణాసురిడి
సైన్యం రావలసి వస్తే మాత్రము ఈ వంతెన కూలిపోతుంది. ఎందువల్లనంటే, మేము కట్టవలసిన
సేతువు యొక్క , పొడవేడల్పులే కాకుండా ఎంత బరువును భరించగలదు అన్నది కూడా
అంచనా వేసినాము. మన సేనలో అన్ని వానరాలే(కోతులు)ఉన్నాయి. కోతులు నడిచే సమయంలో భూమి
మీద అతితక్కువ ఒత్తిడి(pressure) మాత్రమే పెడతాయి. పరమాత్ముడు వాటి శరీరాన్ని ఏ విధంగా రూపొందించాడంటే,అవి తమ చేతులు, కాళ్ళను అతి తక్కువ సమయం నేలపై పెడతాయి, ఒక వేళ వాటి చేతులు, కాళ్ళను భూమి పై
పెట్టిన వెంటనే అక్కడి నుండి దూకివేరే ప్రదేశానికి వెళతాయి. అలా చాలాదూరం అవి
దూకుతూ(jump) వెళ్ళగలవు. 1, 2 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరం అవి అలాగే వెళ్ళగలవు.ఈ వంతెన
డిజైన్ ఏ విధంగా చేసామంటే, దాని మీద
వానరాలుదూకుతూ దాటగలవు, కానీ రావణ సైన్యం
వచ్చిదంటే ఈవంతెన కుప్పకూలిపోతుంది. ఎందుకంటే రావణసైన్యంలో అందరూ రాక్షసులే
ఉన్నారు. వారి శరీరం చాలా పెద్దగా, బలంగా ఉంటుంది. వారూ నేలమీద తమపాదములను పూన్చుట ద్వారా తమ శారీరిక బలముతో భూమిని అధిక ఒత్తిడికి(pressure) గురిచేస్తారు. అందువల్ల ఈ సేతువు తెగిపోతుంది. వాళ్ళు
మునిగిపోతారు. మనమే గెలుస్తాము. ఓడిపోయే అవకాశమే లేదు అన్నారు నలుడు, నీలుడు.
వాల్మీకి రామాయణం : (6-22-51 TO
6-22-71)
సమర్ధచాపి సేతుం కర్తుంవై వరుణాలయే ||6-22-51
తస్మాతథైవ బంధంతు సేతుం వానర పుంగవఃll
నేను సేతువును నిర్మించడంలో సమర్ధుడను.
వానరులలో బలవంతులు ముందుకు వస్తే ఇప్పుడె నిర్మిస్తాను అన్నాడు నలుడు. రాముదు
సుగ్రీవునిద్వారా ఆజ్ఞాపింపజేసి కొన్ని వందల వానరాలుఅన్ని వైపులా వ్యాపించి ఉన్న
అడవులపైకి ఆనందంతో గంతులు వేస్తూ పరిగెత్తాయి. పర్వతాల వంటి శరీరం సౌష్టవం కలిగిన
వానరసేనాధిపతులుపెద్ద పెద్ద రాళ్ళను, కొండలను, చెట్లను విరగ్గొట్టి సాగరము
వద్దకు తీసుకువచ్చినారు. అశ్వకర్ణ, ధావ, అర్జున, మామిడి, అశోక, బిల్వ, శతపర్ణ మొదలైన చెట్లను సందురంలో పడేస్తున్నారు. మంచివానరాలు
కొన్ని చెట్లను వ్రేళ్ళతో సహా , కొన్నిటికి వ్రేళ్ళు లేకుండానూ భూమిని నుంచి పెల్లగించి, ద్వజస్థంభాలను ఎత్తుకొస్తున్నారా అన్నట్టుగా తీసుకువచ్చినారు.
ప్రక్కన ఉన్న ప్రదేశాల నుండి వేప, కొబ్బరి, దానిమ్మ మొదలైన
చెట్లను కొన్ని వానరాలు తీసుకువస్తున్నాయి.
హస్తిమాత్రన్ మహాకాయః పాశానాంచ మహాబలః||
వాల్మీకి రామాయయణము యుద్ధకాండలో 22వ
సర్గలోని 58 వ శ్లోకము
59వ శ్లోకము ఈ విధముగా తెలుపుతాయి.
కొండలవంటి శరీరంతో, ఏనుగులవలే ఉన్న కొండలను పెళ్ళగించి యంత్రాల(Machines/cranes) సహాయంతో తరలించి, ఒక్కసారిగా అన్ని వైపుల నుండి సముద్రంలో రాళ్ళను పడేయడంతో సముద్రంలో నీరు
ఒక్కసారిగా పైకిలేచి క్రింద
పడుతోందట.(యంత్రాలంటే క్రేన్లు మొదలైనవి. ఇవి ఆ కాలానికే ఉన్నాయి అన్నది వేరు వేరు
సందర్భములలో మనకు తెలియవస్తుంది కానీ ఆయా యంత్రములు ఏవిధముగా అందుబాటులోనికి
వచ్చినవి అన్నది నాకు అవగతము కాలేదు. ). ఈ విధముగా సేతువు యొక్క నిర్మాణము పూర్తిఅయినది.
ఈ అంశము నిజానికి నేను చేపట్టిన
వ్యాసముతో సంబంధము లేకున్నా సముద్రుని విషయములోగానీ, సేతు నిర్మాణ విషయములోగానీ శ్రీరాముడు తన దైవీక ప్రభాలను
చూపలేదు అని చెప్పుటకు మాత్రమే!
నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ ।
దండితాఖిలదైత్యాయ రామాయాపన్నివారిణే ll
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ ।
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్
\స్వస్తి.
Very interesting information given by you sir. Thanks
ReplyDelete