Tuesday, 14 March 2023

పునర్జన్మ - సనాతన ధర్మము

పునర్జన్మ - సనాతన ధర్మము 

https://cherukuramamohanrao.blogspot.com/2023/03/blog-post_14.html

కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి కాలంలో వారి దర్శనార్థం ఒక  విదేశీ  వనిత వచ్చింది. మహాస్వామి అభిషేకం చేసి చంద్రమౌళీశ్వరుని పాదాల చెంతనే కూర్చొని ఉన్నారు. గడపకి అవతల ఆవిడ కూర్చుంది. ఆమె స్వామి వారికి ఒక ప్రశ్న వేసింది. "పునర్జన్మ వున్నది. సనాతనధర్మములో దానికి కారణము, గత జన్మలో చేసిన పాపపుణ్యములు అంటారు కదా! నిరూపించడానికి ఏదైనా ఆధారం వున్నదా?"

స్వామి అరగంట అయినా బదులు పలుకలేదు. ఆవిడ కూడా  అలాగే నుంచుంది స్వామి జవాబుకాయి ఎదురు చూస్తూ. ఆసమయాన ఆయన ప్రక్కన వున్న అంతేవాసితో ఇతలన్నాడు: “ఈసందు చివరలో ఒక ప్రసూతి వైద్యశాల వుంది. ఈవిడని ఇవాళ మధ్యాహ్నం వెళ్ళమనండి. ఆ వైద్యశాలలో ఎన్ని గదులున్నాయి? ఏ ఏ గదిలో ఎవరు ప్రసవం కోసం వున్నారు? ఏ గదిలో వున్నవాళ్ళు ఏవృత్తి ఉద్యోగాలు చేస్తున్న వారు, వారి  ఆదాయ పరిమితులు మొదలగు విషయములగూర్చి వ్రాసుకు రమ్మన్నారు. ఆ వేరు వేరు గదులలో ఉన్నవారికి పుట్టినది ఆడపిల్లా లేక మగ పిల్లవాదా, అప్పుడు ఆయా తలీదండ్రులప్రతిక్రియ ఏ విధముగా ఉండినది యన వివిధ అంశముల గూర్చి వ్రాసుకు రమ్మన్నారు. ఇట్టి వివరములన్నీ వ్రాసుకొని తనవద్దకు తరువాతి రోజు రమ్మన్నారు.

ఆవిడ ఆదేవిధముగా అన్నీ వివరములనూ వ్రాసుకొని వచ్చి, ఏమీ అడుకుండా ఉండిపోయింది. ఆమె మహాస్వామి వారికి కొంత దూరంలో నేలమీద మోకాళ్ళు వంచి నమస్కరించి, “స్వామీ! పునర్జన్మ సిద్ధాంతం ఎంత సత్యమైనదో నాకు తెలిసిపోయింది.” అన్నది.

‘ఎలా’ అన్నది ఆవిడ మాటలలోనే స్వామితోబాటూ మనమూ విందాము.  “ ఆ ప్రసూతి గృహములో పది గదులున్నాయి. 8 గదులు మామూలువి. 2 గదులు వాతానుకూలములు. మిగిలిన ఆ ఎనిమిది గదులలో నాలుగు కొన్ని ప్రత్యేకతలు కలిగినవి, నాలుగు సాధారణమైనవి. ఆమె గమనించిన సమయములో పుట్టినట్టి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల స్థితి, మానసిక స్థితి కూడా సేకరించింది. ఒక శిశువు తండ్రి జిల్లాకు  అధికారి. వాతానుకూల గదిలో ఆయన భార్య మొదటి సంతానముగా మగ శిశువుకు జన్మనిచ్చింది. ఎంతో మంది వచ్చి జిల్లా అధికారి చేతిలో పుష్పగుచ్ఛాలు. పళ్ళు పెట్టి శుభాకాంక్షలు తెలిపినారు.

ఇంకొకరికి సామాన్యమైన గదిలో తల్లి మగ శిశువును ప్రసవించినది, కానీ శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. వెయ్యి రూపాయలనుకున్నది పదివేలయినది. భర్త శిశువును చూచుటకు రాకపోగా  వైద్యాలయములో కట్టవలసిని డబ్బు అప్పుగా ఎవరిస్తారా అని వేదకుతూ పోయినట్లు తెలిసినది. ఇంకొక ఆవిడకి ప్రసవానికి వేళయిపోయింది. ఆవిడ గది కూడా తీసుకోలేదు. వరండాలో బల్లమీద పడుకోబెట్టి పురుడు పోసీనారు. నాలుగిళ్ళల్లో పనిచేసుకొనేటటువంటి వ్యక్తి. పుట్టడానికి ముందే ఎక్కడ పుట్టడానికి అనువుగా వుంటుందో ఎంత భోగకరమైన ప్రదేశంలో పుట్టవచ్చో ముందే నిర్ణయమైపోయింది కదా? అంటే పుట్టబోవుటకు ముందే ఎవడు ఎంత భోగమనుభవించాలి అన్నది  నిర్ణయింపబడినది. తదనుగుణముగానీ ఆయా పుట్టుకలు జరిగినాయి. మరి ఆ శిశువులంతా మొదటిపర్యాయమే భూమి పైకి వస్తూ ఉంటే ఒకే విధమగు అదృష్టమును అనుభవించవలెనుకదా! అంటే మనకు కనిపించని, ఆ శిశువుల జన్మకు కారణభూతుడైనవాడు, గతజన్మ పుణ్య పాపములను బట్టి వారికి ఆయా తలిదండ్రులను, ఆయా వాతావకారణములను ఏర్పరచినాడు. అలా చేసేటప్పుడు వాడి పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొనియే కదా అక్కడ పుట్టించినాడు.” ఇంతగా ఆవిడ ఆలోచించినది కావుననే ఆవిడ ఇక మాట్లాడలేదు. మాటలురాని ప్రసూతి కేంద్రానికి వెళితే పునర్జన్మ సిద్ధాంతమును  అరటిపండు ఒలిచి నోటబెట్టినట్లు చెప్పినది. అందుకే స్వాములవారివద్ద ఆమె నోరు తెరువలేదు.  

మోక్షము  కలుగడానికి భక్తికి ధర్మనిబద్ధతను జోడించి  గడుపగా అనువైన సమయమున అనువైన ఫలితమును అనుగ్రహించుతాడు పరమేశ్వరుడు. అందుకే వేమన సులభమైన పదాలలో సూక్ష్మముగా మనకు తెలియజేసినాడు.

ఆత్మశుద్ధిలేని యాచార మదియేల

భాండశుద్ధి లేని పాకమేల

చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా

విశ్వదాభిరామ వినురవేమ

స్వస్తి.

1 comment:

  1. Very explicitly explained and neatly coine dinformation sir. Thanks

    ReplyDelete