Sunday, 16 April 2023

పాంచభౌతికమైన ఈ దేహమంతా

 

పాంచభౌతికమైన ఈ దేహమంతా

https://cherukuramamohanrao.blogspot.com/2023/04/blog-post_16.html

పాంభౌతికమైన ఈ దేహమంతా

భావహారి నీకు నే నర్పణము సేతు

అలసితిని ఈదుచూ ఆశ సంద్రమును

గస పెట్టుచున్నాను గతి గానలేక

శీతోష్ణముల బాధ చెలగి బాధింప

పృథివితత్వపు మేను పెనుబాధ పడెను

నీ పాద పీఠమై అది నిలువ చాలు

భూమియౌ నామేను పులకించు స్వామి llపాంచll

నాలోని ఉదకాంశఅజ నీ శిరమున 

ఆపాదమస్తకము అభిషేచనము చేయు

గంగలో కలుపుము గతి వేరు వలదు

జన్మ సార్థకమౌను  జగదీశ నాకు llపాంచll

 

నాలోని తేజస్సు నగజాదినాథ

నీదీప కళికలో నిలిపితే చాలు

రేపుమాపులు నిన్ను రెప్ప వాల్చక గాంతు

నీతేజమును కలిసి నిలుతు నిరతమ్ము

అంతకన్నా నాకు ఐశ్వర్యమేల  llపాంచll

 

నాలోని మరుదంశ  నందీశఈశా

కైలాస సీమలో కదిలితే చాలు

నీ మేను తాకుచూ నిజము పులకింతు

నీ సేవలో నేను నిలచిపోఎడను

వేరేమి కావలయు విశ్వేశ నాకు llపాంచll

 

కైలాస గగనాన కలిసి శబ్దముతో

నటనాన నేను నీ నట్టువాంగమున

నిరతమ్ము నాదమై నిలచి పోవుచును

లయలోన సాంతమ్ము లయమౌదు తండ్రి

నీ సేవలో నేను నిలుపుదల లేక  llపాంచll

Friday, 14 April 2023

 సద్గురువు  -  సదాశివ బ్రహ్మేంద్ర యతీంద్రులు 

https://cherukuramamohanrao.blogspot.com/2023/04/1.html

సద్గురువు  -  సదాశివ బ్రహ్మేంద్ర యతీంద్రులు - 1 వ భాగము 


 సద్గురువు  -  సదాశివ బ్రహ్మేంద్ర యతీంద్రులు 

https://cherukuramamohanrao.blogspot.com/2023/04/1.html

సద్గురువు  -  సదాశివ బ్రహ్మేంద్ర యతీంద్రులు - 1 వ భాగము 

 

సద్గురువగు సదాశివేంద్రులగూర్చి తెలుసుకొనే ముందు మూర్ఖులను గూర్చి తెలుసుకోవలసిన అవసరము ఎంతో ఉన్నది, కారణము వారికి ఎంత చెప్పినా, ఏమి చెప్పినా వారి పిడివాదమును మానరు. మొదట ఆ దిశగా ఒక అడుగు వేద్దాము. ఇది భర్తృహరి మహానుభావుడు చెప్పిన ఒక అనర్ఘ రత్నము.

ప్రసహ్య మణిముద్ధరేన్మకర వక్త్ర దంష్ట్రాంతరాత్‌

సముద్రమపి సంతరేత్ప్రచలదూర్మి మాలాకులమ్‌

భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ధారయేత్‌

న తు ప్రతినివిష్ట మూర్ఖ జన చిత్తమారాధయేత్‌

 మకర ముఖాంతరస్థమగు మాణికమున్ బెకిలింపవచ్చు బా

యక చలదూర్మికా నికరమైన మహోదధి దాటవచ్చు మ
స్తకమున బూవుదండవలె సర్పమునైన భరింపవచ్చు మ
చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తము దెల్ప నసాధ్య మేరికిన్

మొసలి నోట్లో చిక్కిన మాణిక్యాన్నైనా బయటకు తియ్యవచ్చు, నిరంతరం చలించే పెద్ద పెద్ద అలలతోకూడిన మహా సముద్రాన్నైనా దాటవచ్చు, పామునైనా తలలో పూదండలాగా ధరించవచ్చు. మూర్ఖుడి మనసుని మాత్రం ఒప్పించడం ఎవ్వరికీ సాధ్యం కాదు! (సంస్కృతంలో మొండిపట్టుపట్టిన మూర్షుడు అని ఉంటుంది). ఈ పద్ధతికే చెందిన ఒక మూర్ఖుని కథ మనము చెప్పుకొందాము. ఈ దిగువన ఒసగబడిన శ్లోకము చుట్టూ నేను ఈ కథను కల్పించినాను.

కస్వంభద్ర ఖలేశ్వరోహ మిహకిం ఘోరే వనేస్తీయతే l

శార్దూలాదిహి రత్ర హింస్త్రపశుభిః  ఖాద్యోహమిత్యాశయా l

కస్మాద్కష్టమిదం త్వయా వివసితం మద్దేహ మామ్సాశనః l

ప్రత్యుత్పన్న నృమాంస భక్షణ ధియః తేభ్యంతు సర్వానితి l

ఒక తల్లి దండ్రి వయసు కుమార్తె తమ పల్లెకు ప్రక్కనేయున్న పేట (పేటా అనగా పెద్ద ఊరు అని అర్థము) లో ఆరోజు జరిగే సంతకు బండి కట్టించుకొని వచ్చినారు. ఆ సంతలో అనామకుడైన ఒక బడుద్ధాయి ఆ అమ్మాయిని జూచి మోహించినాడు. చాటుమాటుగా, వారు తమ ఊరికి వెళ్ళు సమయమున, వారిననుసరించి వారి ఊరు చేరినాడు, ఆ కుటుంబమును గూర్చి తెలుసుకోకుండా వారి ఇంటివరకు అనుసరిన్చాకూడదనుకొన్నాడు. ఆ విధముగా తలచి ఆ కుటుంబమును గూర్చి తెలుసుకోన ప్రయత్నించినాడు. ఆదినము ఆదేశపు రాజు ఆజ్ఞ ప్రకారము ఒకరితోనొకరు మాట్లాడుకోరు. అట్లు కాదని మాట్లాడితే వారికి శిరచ్ఛేదమే! అది తెలియని అగుంతుకుడు ఎవరిని ఆ కుటుంబమును గూర్చి అడిగినా బదులు చెప్పలేదు. విరక్తుడై ముందు వెనుక ఆలోచించకుండా, ఆ గ్రామవాసులకు బ్రతుకే లేకుండాజేసే ఉద్దేశ్యముతో, ప్రక్కనే ఒన్న కీకారణ్యములోనికి పోయి ఆ రాత్రి ఎట్లోగడిపి తెల్లవారి ఆ దట్టమైన అసవిలో ఒకచోట నిలచినాడు. అంతలోనే ఆదారిన పోయే బాటసారి అతనిని చూసి ‘అంత దట్టమైన అడవిలో ఎటూ పోకుండా ఎందుకు నిలచినావు అని అడగినాడు. దీనితో ఆశ్లోకము ఆరంభమై ఆ మూర్ఖుడు చెప్పిన జవాబుతో అంతమయింది. ఆసారామ్శము ఇది.

బాటసారి : ఇంత దట్టమైన అడవిలో ఎటూ పోకుండా ఎందుకు నిలచియున్నావు. ఏదయినా పని ఉన్నదా?

అగున్తుకుడు : ఏమీ పని లేదు. ఈ అరణ్యములో పులులు ఎక్కువ అని నీ బోటివాడొకడు పేటలో చెప్పియుండినాడు. ఎదో ఒక పులు రాకపోతుందా అని చూపెట్టుకొని యున్నాను.

బాటసారి : ఎందుకు?

అగుంతుకుడు: నన్ను తినేందుకు.

 బాటసారి: జీవితముతో అంత విసిగి పోయినావా?శత యైన

అగున్తుకుడు: అదేమీ లేదు. అందరినీ ఈ ప్రక్కన ఒక పల్లెలో నాకు ఒక్కరంటే ఒక్కరు, నేనడిగిన ప్రశ్న కు సమాధానమివ్వలేదు. విసుగుచెంది వారిని చంప నిశ్చయించినాను. ముందు వెనుక ఎవ్వరూలేని నన్ను తిన్న పులి మానవ రక్తపు రుచి చూస్తుంది కాబట్టి ఈ అడవికి అతి దగ్గరిపల్లి కాబట్టి ఆ ఊరిపై బడి అందరినీ తినేస్తుంది. ఇక ప్రశ్నలతో విసిగించక నీదారిన నీవుపో అన్నాడు. తరువాత ఏమిజరిగి ఉంటుంది అన్నది మీ ఊహకు వదిలి మూర్ఖత్వమునకు పరాకాష్టయైన ఆ అగుంతుకుని మనస్తత్వమును మీ ముందుంచినాను.

నిదురకుపక్రమించనతి  నిక్కము జాగృతి గూర్చవచ్చు తా

నిదురను బొందినన్ మిగుల నిష్ఠను గూడుచు లేపవచ్చు నా

నిదుర నటింప జాగృతము నెవ్విధి  జేయగ సాధ్యమౌగనన్

కుదురుగ అర్ధమూర్ఖునకు కూరిమి బుద్ధిని గూర్చ శక్యమే!

బుద్ధిమంతుడు కాదు మూర్ఖుడు కాదు. అర్ధమోర్ఖుడు అంటే వాడు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న పిడివాది. వీడు పరమ మూర్ఖుడు కాక వేరేమిటి?

ఇప్పుడు సద్గురువు, అతని లక్షణాలను గూర్చి తెలుసుకొందాము.

మరొకమారు..

సద్గురువు  -  సదాశివ బ్రహ్మేంద్ర యతీంద్రులు - 2 వ భాగము 

స్కాంద పురాణములో గురువును గూర్చి పరమేశ్వరుడు పార్వతికి ఈ విధముగా తెలిపినాడు.

శాంతో దాంతో కులీనశ్చ వినీత శ్శుద్ధ వేషవాన్l

సదాచారః సుప్రసిద్ధః శుచిర్దక్ష సుబుద్ధిమాన్l

ఆశ్రయే ధ్యాన నిష్ఠశ్చ మంత్రతంత్ర విచాక్షనఃl

నిగ్రహానుగ్రహే శక్తో గురురిత్యభిధీయతేll

శాంతి అనగా గాంధీ గారు చెప్పినది కాదు. శాంతి అనగా అవసరము లేని చోట  ఆవేశమును అణచుకోనుట, శాంతి అనగా సాటి మానవాళిపై సహృద్భావము కలిగియుండుట, పెదాలఎడ గౌరవము, ఒకవేళ వారేదయినా పొరబాటు చేసినాకూడా సున్నితముగా తెలియజేయుట మొదలగు ఈ లక్షణములు శాంతికి నిదర్శనములు. దాంతి అనగా ఇంద్రియ నిగ్రహము, తపఃక్లేశమునోర్చుగుణము. ఇంద్రియములు రెండువిధములు

కర్మేంద్రియ పంచకం: వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ.

జ్ఞానేంద్రియ పంచకం: త్వక్కు = చర్మం, చక్షువు = కన్ను, రసన = నాలుక, శ్రోతం = చెవి

ఈ పది ఇంద్రియములపై నిగ్రహము కలిగియుంటే దానిని ఇంద్రయనిగ్రహము అంటారు. ఇక కులీనుడు అంటే ఉన్నతకులమున పుట్టినవాడు. మధ్య, మాస మాంసముల సేవించే బ్రాహ్మణుడు కులీనుడు కాలేడు. మాలకులజుడైనా మహావిష్నువులో ఐక్యమైన నందనుడు కులీనుడు కాకపోడు. కావున ప్రతి సజ్జనుడూ కులీనుడే!ఇక వినీతుడు అంటే వినయ విధేయతలు కలిగినవాడు అంటే అహంకారము లేనివాడు, శుద్ధ వేషవాన్ అంటే శుభ్రమైన ఉడుపులను కలిగియుండుటయే కాదు, ఆయా ఉపాధికి తగిన వేషమును కలిగియుండుట అనగా ఒక సన్యాసిని Pant and Shirt తో అన్వయిన్చుకోలేము అదేవిధముగా ఒక Office లో పనిచేసేవానిని గోచి గుడ్డ పెట్టుకొన్న సర్వసంగ పరిత్యాగిగా ఎదురుచూడబోము. ఇంకా గురువు అన్నవాడు సదాచార సంపన్నుడు, తన తత్వ విద్యలో ప్రసిద్ధుడు, అనగా సత్కర్మ కామనా విలసితుడు, శుచి శుభ్రత

గలిగినవాడు, సద్గుణ సంపన్నుడు,ఆశ్రయమునుసన్మతులకు,

నొసంగువాడుధ్యాన నిష్ఠాగరిష్ఠుడు,మంత్రంతంత్ర విశారదుడు,

అన్నిటికీ మించి ఆగ్రహానుగ్రహ దక్షుడు అయిన పై సర్వ లక్షణములు కలిగినవాడు గురువు, అంతేగాని జగద్గురువు శంకరులవారు, క్రీస్తుకు పూర్వము 6వ శతాబ్దములోనే వేషాల మోసగాళ్ళను గూర్చి చెప్పినట్లు

జటిలో ముండీ లుంఙ్చిత కేశః
కాషాయాంబర బహుకృత వేషః
 l
పశ్యన్నపి చ న పశ్యతి మూఢో
ఉదర నిమిత్తం బహుకృత వేషః
 ll

వీరు గురువులు కాలేరు.

ఇదే మాటను తన రీతిలో 17వ శతాబ్దము వాడైన యోగి వేమన ఇట్లు చెప్పినాడు.

కసువు కాయ దినుచు కాషాయములు గట్టి

బోడి నెత్తులు గలిగి బోరయుచుండ్రు

తలలు బోడులైన తలపులు బోడులా

విశ్వదాభిరామ వినురవేమ

అంటే మోసగాళ్ళు అన్ని కాలాలలోనూ ఉంటారని అర్థమౌతున్నది కదా!

కావున ఇట్టి గురువుల వలలో పడకుండుట మన బాధ్యత.

అసలు గురువు అన్న పదమునకు అర్థము ఏమిటంటే ‘‘గు. శబ్దస్త్వంధకారః- రు, శబ్దస్తన్ని వృత్తకః’’. ‘గు అన్న శబ్దము అంధకారమును ప్రతిపాదిన్చితే ‘ఋ అన్నశబ్దము ఆ చీకటిని మటుమాయము చేసేది. అట్టి గురువుల గూర్చి మనము మన పురానేతిహాసాలద్వారా మనము పొందిన  పరిజ్ఞానమును అనుసరించి సాందీపుడు, ద్రోణుడు విశ్వామిత్రుడు,వశిష్టుడు,శుక్రాచార్యుడు మొదలగు వారు సుప్రసిద్ధ సద్గురువులు. వారిని ఆశ్రయించిన శిష్యులు ధన్యులు.  ఈ కోవకు చెందిన, లోకానికి తక్కువగా తెలిసిన, మరొక గురువే వరతంతు మహాముని. ఆయన శిష్యుడు కౌత్సుడు సచ్ఛి ష్యునికి నిలువెత్తు నిదరర్శనము. వీరిరువురూ కోసల సామ్రాజ్యస్మును రఘు మహారాజు పాలించుకాలమున వనవాసమున గురుకులమున పర్ణశాలలో జీవనము గడిపినారు. ఎంతో ప్రీతితో గురు శుశ్రూష చేయుచు 14 విద్యలను సాకల్యముగా సమగ్రముగా నేర్చుకొన్నాడు. కానీ తన వినమ్రతను అణుమాత్రము కూడా విడువలేదు. గురువు వలదని ఎంతవారించినా గురుదక్షిణ తీసుకోవలసినదే అని పట్టుబట్టి గురువును విసిగించినాడు. ఆ పోరుబడలేక వరతంతు మహాముని పదునాలుగు విద్యలు గరుపుటచే, 14 కోట్ల ధనమివ్వమన్నాడు. ఎంతో సంతోషముతో గురుదంపతులవద్ద శెలవు తీసుకొని బయలుదేరి మార్గ మధ్యములో తన శ్రేయోభిలాషుల సలహా మేరకు రఘుమహారాజువద్దకు చేరి తనకు వలయుమేర అర్థమును అర్థించినాడు. ఆయన తాను నిర్వహించిన ‘విశ్వజిత్’ యాగమున తన సర్వస్వమూ దానముచేసి చిల్లి గవ్వ సంపద కూడా మిగిలించుకొనక పోవుటచే,  మట్టి పాత్ర తీసుకొని ఆవటువు కాళ్ళు కడిగినాడు. తనకు మూడు రోజుల సమయమడిగి కౌత్సుని తమ యాగశాలలో బసచేయుటకు తగినవసతి ఏర్పాటుచేసినాడు. మొదటి రోజు ముగియు సమయమున పూజా మందిరమునకు పోయి శ్రీహరిని ఈ గండమునుండి గట్టెక్కించమని వేడుకొన్నాడు. కుబెరునిపై దండెత్తుటే తగిన విధాయకముగా అపుడు తోచినది. రఘుమహారాజు భార్య ప్రభావతి పూజామందిరములోనే ఉండిపోయి శ్రీ మహావిష్ణువును ఈ గండమునుండి తన భర్తను కాపాడుమని ప్రార్థింప దొడగినది. విష్ణువు కుబేరునికి అలకాపురిపై రఘువు తెల్లవారితే దండెత్తు విషయమును గూర్చి తెలిపి బంగారు కాసుల వర్షము, రఘువుయొక్క ధనాగారములో కురిపింపజేసినాడు. ఆవిషయము కోశాధిపతి ద్వారా తెలుసుకొని విష్ణువుకు, కుబేరునికి కృతజ్ఞతాపూర్వకముగా నమస్కరించి ధనము సిద్ధముగా ఉన్నాడని కౌత్సునికి తెలియబరచినాడు. రఘువు మొత్తము పైకము తీసుకోమ్మనగా, ఆ బాలకుడు 14 కోట్లకు మించి కానీ కూడా ఎక్కువ తీసుకోనన్నాడు. చివరకు ఇరువురు రఘువు యొక్క కులగురువాగు వశిష్ఠమహర్షితో కూడి వరతంతు మహాముని వద్దకుచేరినారు. ఆ మువ్వురినీ చూసి ముని దంపతులు ఆనంద కందలితులై రాజునకు, రాజగురువునకు అర్ఘ్యపాద్యాదులిచ్చి నెమ్మదిగా వారి రాకకు కారణంబాడుగ జరిగిన వృత్తాంతమును జెప్పి మొత్తము సొమ్మును ఆ దంపతుల పాదాల చెంత యుంచ ఆ మొత్తము సొమ్ము రాజుదేననీ, వన వాసులగు తమకు ధనము ఎందుకూ కొరగాదని చెబుతూ రాజునకు సమంజసమని తోచితే 14 కోట్ల ధనము కౌత్సునకిచ్చి తక్కినదంతా ప్రజాసంక్షేమము కొరకై వాడు కొమ్మన్నాడు వరతంతు మహాముని. అంతేకాక ఇక మీదట వారి సూర్య వంశము ‘రఘువంశము అని ఆచంద్రతారార్కమూ పిలువబడుతుందని వరమోసంగినాడు. వశిష్ఠమహర్షి వెంటనే ‘తథాస్తుఅన్నాడు. అంతటి మహనీయుడు ఈ వరతంతు మహాముని. అంతటి మహనీయులు నేటి కాలమున దొరికేదారని ఊహించగలమా!

                 మన పూర్వీకులు భారతీయులుగా జన్మించడమే ఒక గొప్ప వరంగా భావించేవారు. సర్వదేవతలు కూడా ఈ భారత కర్మభూమిలో జన్మించాలని కోరేవారట. ఎందుకని అంటే “స్వర్గశ్చాపవర్గస్య” అన్న ఈరెండూ ఈ భూమిలో జన్మించిన వారికే సాధ్యమట. భారతభూమిలో జన్మిస్తే జపం, తపం ఇవన్ని నడుస్తాయి. అందువలన స్వర్గాన్ని సాధించుకోవచ్చు. “అపవర్గము” అంటె మోక్షాన్ని సాధించుకోవచ్చు. మానవుడు మోక్షాన్ని సాధించడానికి ఒక్క ఈ కర్మభూమిలోనే సాధ్యమవుతుంది. పుణ్యము సంపాదించదలచు వారికి ఒకే ఒక గమ్యం భారతదేశము మాత్రమే!

భారతభూమిలో ఉండేటటువంటివారు చాలా పుణ్యాత్ములు అనుకుంటారట దేవతలు (విష్ణుపురాణం)

ఈ సందర్భములో మరొక ముఖ్యమైన విషయమును గూర్చి ముచ్చటించుకొందాము. నేరుగా గురువు దొరకకుంటే ముందు తమ నడవడి మార్చుకొని ఋజు మార్గమున నడచుటకు తగిన విధముగా భర్తృహరి వంటి మహనీయులు అజరామరమైన నీతులు మనకు అందించినారు. ఆయన కాలమునకే ఈ మూడు విధములగు మూర్ఖ శిఖామణులు  ఉండినారని ఆయన తెలియజేయుచున్నారు.

వారు ఎవరు అన్నది భర్తృహరి గారు ఏవిధముగా నిర్వచించినారన్నది 

మరొకమారు.........

సద్గురువు  -  సదాశివ బ్రహ్మేంద్ర యతీంద్రులు - 3 వ భాగము 

మహనీయుడు భర్తృహరి తన నీతి, శృంగార, వైరాగ్య శతకముల mmముందుమాటగా ఏమి చెప్పినారో తెలుడుకొందాము,

 బోద్ధారో మత్సరః  గ్రస్తాః ప్రభవః స్మయ దూషితాఃl  

అభోధోప హతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితంll భర్తృహరి

విద్వాంసులు తమకన్నీ తెలుసుననే అహంకారముతో ఉన్నారు.  రాజులు విషయాలోలురయి సద్గురువులను దారిజెరానీయారు. మూర్ఖులు తమ వ్యాసంగమును మించినది లేదు అందుచే ఏమీ విననక్కరలేదు అనుకొంటారు. మరినేను

చెప్పదలచుకొన్న సుభాషితములు నాలోనే జీర్ణమై పోవలసినదేనా అని మాదనపడి భర్తృహరి గారు చివరకు ఒక నిర్ణయానికికి వచ్చి, “నేనుచెప్పేది నేను చెబుతాను, వినేవాడు విని బాగుపడనీ విననివాడు తన భవితను తానే వ్రాసుకొననీ” అనుకొంటాడు. అనుకొనుటమే గాక నీతి శృంగార వైరాగ్య శతక రచన చేసి లోకానికి బహూకరించినాడు.

సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు

కర్ణాటక సంగీత పరిజ్ఞానము కలిగిన ఎవరికైనా ‘పిబరే రామరసం’ కీర్తన  ఝంఝోటి - ఆది (యమునాకళ్యాణి -) తెలియనివారుండరు. కొందరు దానిని త్యాగరాయ స్వామి రచన అనుకొంటారు. నిజానికి ఆ కీర్తనకు కర్త శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి’ వారు. ఇప్పుడు వారిని గూర్చి నాకు తెలిసిన మేరకు తెలియజేయ ప్రయత్నిస్తాను.

వెల్నాటివారు మరియు శ్రీవత్స గోత్రోద్భవులైన సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు తెలుగు వారు. ఈ విషయము తెలియని తెలుగువారు నా ఉద్దేశ్యములో లెక్కింప సాధ్యపడరు. కారణము మన చిత్తము మొత్తము విత్తము మగువ మదములపపైనే  ఉంటుంది. 300 సంవత్సరములకు పైన జీవించిన మహాత్ముడు త్రైలింగ స్వామివారు కూడా తెలుగువారే! వారిని గూర్చి 'ద్వాదశ జ్యోతిర్లింగములు' అన్న  సహీరేషీక క్రింద క్షికాపురి లో విస్తారముగా వ్రాయుట జరిగినది. ఇక విషయానికొస్తే సదాశివ బ్రహ్మేంద్రులవారు  తెలుగు వెళనాటి బ్రాహ్మణ దంపతులైన మోక్ష సోమసుందర అవధాని మరియు పార్వతి గార్ల సుపుత్రుడు. ఈయన పుట్టినది మధురైలో. ఈయన జన్మ నామము  శివరామకృష్ణ. వెలనాడు తెలుగు దంపతులైన మోక్ష సోమసుందర అవధాని మరియు పార్వతి దంపతులకు శ్రీ సదాశివుడు మధురైలో శ్రీవత్స గోత్రంలో జన్మించినాడు. అతని తల్లిదండ్రులు రామేశ్వరంలోని రామనాథ స్వామిని సంతానం కోసం ప్రార్థించినందున అతనికి శివరామకృష్ణ అని పేరు పెట్టినారు.  తల్లి ఆయనకు మొదటి గురువై రామజపమును  కోటిసార్లు జపించమని  సలహా ఇచ్చినది, దానిని ఉపదేశముగా భావించి  శరీరంలోని ప్రతి కణమును  రామునితో నింపుకొన్నాడు.

కొంత కాలము తరువాత ఆయన  కుటుంబము  మదురై నుండి  తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని తిరువిసైనల్లూరుకు మారింది. తిరువిసైనల్లూరు (షాహాజీపురం)కు చెందిన శ్రీ శ్రీధర అయ్యవల్ వేదపాటశాలలో అతని సహవిద్యార్థి. అదే ఊరిలో రామభద్ర దీక్షితార్ వద్ద సాంప్రదాయక విషయాలలో ప్రాథమిక విద్యను అభ్యసించినారు.

ఆయనకు 17 సంవత్సరాల వయస్సులో వివాహము జరిగినా ఆయనను ఐహిక బంధములు  అడ్డుకోలేక పోయినవి. స్వామివారు  17 నుండి 18వ శతాబ్దంలో తమిళనాడులోని కుంభకోణము దరిదాపులలో  నివసించినట్లు తెలియుచున్నది. వారు  తిరువిసనల్లూర్‌లో సంస్కృతము, వేద  వేదాంగాలు అభ్యసించినారు.ఆయనకు  సమకాలీనులైన శ్రీధర అయ్యవాల్ మరియు శ్రీ భగవాన్ నామ బోధేంద్రలు ఆ సమయంలో సమీప ప్రాంతాలలో నివసించినారు.

సత్యాన్వేషణలో శివరామకృష్ణగా స్వామివారు  తన ఇంటి నుండి బయలుదేరి  శ్రీ పరమశివేంద్ర సరస్వతికి శిష్యుడయినా డు. ఆచినోతిః శాస్త్రార్థం  ఆచార్యే స్తాపయత్యపిl

స్వయం ఆచరతేయస్తు తమాచార్యం ప్రచక్షతేll

అన్ని చోట్లా వుండే అన్ని విషయములను సంగ్రహించి దానిని తాను పాటించుతూ  తన శిష్యులకు నేర్పుతారు.

తండ్రిని నిసర్గ గురువు అని చెబుతారు పెద్దలు. నిసర్గ గురువు అంటే భగవంతుడు మనకు ప్రసాదించినట్టి సహజమైన గురువు. అటువంటి గురువు ఆ మహానీయునికి తారాసపడినాడు.

   సన్యాసము  తీసుకున్న తర్వాత, వస్త్రధారణ ఆయనకు అసంగతమై పోయింది.ఆయన ఒక అవధూతగానే ప్రవర్తింపసాగినాడు.ఆయన జీవిత కాలములో  అనేక అద్భుతములను  చేసిన వాస్తవాలనేకములను గ్రంధస్తము చేయుట జరిగినది. వాటిలో కొన్ని ప్రముఖమైనవి క్రింద తెలియజేయబడినవి. వారి జీవ సమాధి జరిగిన స్థలమును గూర్చి , పరమహంస యోగానంద గారి  'ఒక యోగి యొక్క ఆత్మకథ' లోని 41వ అధ్యాయంలో ప్రస్తావించబడినది.

శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుల వారి గురువైన శ్రీ పరమశివేంద్ర సరస్వతి యొక్క జీవ సమాధి, తిరువెంగాడు (ప్రసిద్ధ బుధుని  దేవాలయమునకు  సమీపము ) లో ఉంది. ఈ తిరువెంగా డు  నాగపట్నం జిల్లాలో లోశ్రీ స్వేదారణ్యేశ్వర దేవాలయము - కుంభకోణం నుండి 59 కిలోమీటర్ల దూరములో ఉంది. శ్రీ బ్రహ్మేంద్రులవారి గురు నిర్యాణమునకు అనగా జీవ సమాధికి మునుపు జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల గూర్చి తెలుసుకొందాము.

సదాశివ బ్రహ్మేంద్రుల వారికి అపారమైన జ్ఞానము సమయస్పూర్తి ,  తెలివితేటల వలన వేదాంత విషయ చర్చలు  పండితులతో చేసి తాను నమ్మిన సిద్ధాంతమే సవ్యమైనదని వాదించేవారు. ఈవిధముగా  ఓడిపోయిన ఒక పండితుడు వెళ్లి శ్రీ బ్రహ్మేంద్రుని  ప్రవర్తనను  గురించి అతని గురువగు  శ్రీ పరమశివేంద్ర సరస్వతి గారికి ఫిర్యాదు చేసీనాడు.అప్పుడు గురువుగారు బ్రహ్మేండ్రులవారిని పిలిచి ఒక సాధారణ ప్రశ్న అడిగినాడు "నువ్వు ఇతరుల నోరు మూయిస్తున్నావు. మరి నీ నోరు ఎప్పుడు మూమూసుకొంటావు?"

మిగిలినది మరోమారు........

సద్గురువు  -  సదాశివ బ్రహ్మేంద్ర యతీంద్రులు - 4 వ భాగము 

  ప్రశ్న బ్రహ్మేంద్రులవారి వైఖరిలో పెను  మార్పును తెచ్చిపెట్టింది. ఆయన మౌన వ్రతాన్ని అవలంబింప నిశ్చయించుకున్నాడు. ఆయన క్రమంగా ప్రపంచ బంధములనుండి విడిపడనారంభించినాడు. ఆత్మపరిశీలన చేసుకొని అంతర్ముఖుడై తమస్సు వీడి తపస్సునాశ్రయించి ఘోరమైన తపస్సులో మునిగిపోయినాడు. ఆయన  కొండలలో మరియు కావేరి తీరము వెంబడీ వెంబడి లక్ష్యము  లేకుండా నగ్నంగా తిరుగసాగినాడు. తన శిష్యుని మానసిక అస్థిరతను గూర్చి ఎవరో బాధతో  గురువు  శ్రీ పరమశివేంద్రుల వారికి నివేదించినప్పుడు, క్షణకాలము ఆగి ఈవిధముగా అన్నాడు.

ఉన్మత్తవత్  సంచరతీహ శిష్యః తదేతి లొకస్య వచాంసి  క్షుణ్వన్  l

ఖిద్యన్ ఉవాచాస్య గురుః పురాహో ఉన్మత్తతా మే నహితాదృశీతి ll

అయ్యో! నా శిష్యునికి పట్టిన అదృష్టము నాకు పట్టకపోయునదే! సర్వసంగ పరీత్యాగియై

అంతర్ముఖుడై  ఆ పరమాత్మకు చేరువైనాడే!, నాకా మహద్భాగ్యము గురువై కూడా లభించలేదే అని విలపించినాడు.

తరచుగా అచేతన స్థితిలో తిరుగుటయే గాక, ఏకాంతములో  ధ్యానము  చేసేవారు శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులవారు. వారు 1738 AD లో తమిళ పండితుడు-కవి-భక్తుడు-తత్వవేత్త తాయుమానవర్ (1705 - 1742)ను కలుసుకొన్నట్లు ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కలయికకు  రఘునాథ రాయ తొండైమాన్ (పుదుక్కోట్టై రాజావారు ) (1730-1769) సాక్షియయి నిలచినాడు.

సదా శివ బ్రహ్మేంద్రుని ఆశీర్వాద శక్తికి నిదర్శనంగా ఒక లేఖ తంజావూరులోని “సరస్వతి మహల్ గ్రంధాలయములో భద్రపరచబడింది. ఈ లేఖను ఆస్థాన విద్వాన్ మల్లారి పండిట్ దీపంబాపురి నుండి రాజు శరభోజికి వ్రాసినాడు.

 బ్రహ్మేంద్రులవారు  అద్వైత వేదాంతంపై ఎన్నో పుస్తకాలు రాసినారు. శ్రీధర అయ్యావాలళ్ ను దర్శించుకున్నప్పుడు, అయ్యావాళ్ బ్రహ్మేంద్రులవారి  మౌనము  తనకు సంతోషాన్ని కలిగించిందని, అయితే భగవంతుని కీర్తిని గానముచేయకుండా ఆ  మౌనము ఆపింది కావున. ఆ మౌనము వీడి భగవద్ సంకీర్తనము జేయుచు జన్మను సార్థక్యము చేసుకొమ్మని సలహా యిచ్చినాడు. అప్పటి నుండి, ఆ మహానుభావుడు అనేక కీర్తనలను వ్రాయుట  ప్రారంభించినాడు, కానీ వానిలో 33 మాత్రమే ఈ రోజుకు అందుబాటులో ఉన్నాయి.

అతను సజీవంగా ఉన్నప్పుడు అనేక అద్భుతాలు చేసీనాడని తెలియవచ్చుచున్నది. వానిలో కొన్ని ప్రముఖమైనవి క్రింద పొందుపరుపబడినవి. 

1) మహాధనపురములో కావేరి నది ఒడ్డున, అతనిని కొంతమంది పిల్లలు 100 మైళ్ళ కంటే ఎక్కువ దూరంలో ఉన్న మధురైకి అమ్మవారి తిరుణాల కోసం తీసుకువెళ్లమని స్వామివారిని అడిగినారు. ఆయన వారిని కళ్ళు మూసుకోమని కోరి కొన్ని సెకన్ల తరువాత వారిని  కళ్ళు తెరువ మన్నారు. వారు మధురైలో ఉన్నట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయినారు. వారి కోరిక తీరిన వెంటనే మరులా అదేవిధముగా మహాధనపురము చేర్చినారు.

2) ఒకనాడు స్వామివారు ఒక ధాన్యరాశి  దగ్గర కూర్చొని అసంకల్పితముగానే ధ్యానము చేయ నారంభించినారు. ఆ పంట యాజమానియైన రైతు  సదాశివుల వారిని దొంగగా భావించి వారిని కొట్ట దలచి రైతు తన కర్రను ఎత్తినాడు, కానీ స్థాణువై నిలచిపోయినాడు. స్వామివారు మారుసటి  రోజుఉదయం ధ్యానము ముగించి రైతును చూసి చిరునవ్వు నవ్వేంత వరకు రైతు అలాగే ఉండవలసి వచ్చింది. రైతు తన తప్పును తెలుసుకొని  స్వామివారిని  క్షమించమని అడిగినాడు.

మొగిలినది మరోమారు.......

సద్గురువు  -  సదాశివ బ్రహ్మేంద్ర యతీంద్రులు 5వ భాగము

3) మరొక సమయంలో, కావేరి నది ఒడ్డున ధ్యానం చేస్తున్నప్పుడు,అకస్మాత్తుగా స్వామివారు  వరదలో  కొట్టుకుపోయినారు. కొన్ని వారాల తర్వాత, కొంతమంది గ్రామస్థులు మట్టి దిబ్బ దగ్గర తవ్వుతుండగా, వారి గడ్డపారలకు రక్తము అంటినది. అప్పుడు వారందరూ చేతులతో త్రవ్వగా స్వామివారు బయటికి వచ్చి ఏమీ పట్టించుకోకుండా తనదారిన తాను వెళ్ళిపోయినారు.

4) మహారాజా విజయ రఘునాథ తొండైమాన్, అప్పటి పాలకుడు (1730-68) స్వామివారి యొక్క గొప్పతనమును  గురించి విన్నాడు, శ్రీ బ్రహ్మేంద్రుల వారిని గౌరవించటానికి రాజభవనానికి తీసుకురాదలచి పరివార సమేతముగా . బ్రహ్మేంద్రుల వారి వద్దకు వచ్చి నమస్కరించి నిలచినాడు కానీ స్వామివారు ధ్యానములో ఉండటమేగాక  మౌనమును వీడలేదు. పాలకుడు తిరువరంకులంలో శిబిరాన్ని ఏర్పాటు చేసి స్వామివారికి సేవ చేస్తూ ఉండిపోయినాడు. బ్రహ్మేంద్రులవారు  ఇసుకపై శ్రీ దక్షిణామూర్తి మంత్రాన్ని వ్రాయడం ద్వారా రాజు యొక్క ప్రార్థనకు సమాధానమిచినట్లయినది.(క్రీ.శ. 1738). భిక్షందర్ కోయిల్‌కు చెందిన శ్రీ గోపాలకృష్ణ శాస్త్రిని తన రాజభవనంలో మంత్రిగా నియమించమని రాజుకు సూచించినాడు. రఘునాథ తొండైమాన్ తన అంగవస్త్రంలో ఇసుకను సేకరించి తన రాజభవనానికి తీసుక పోయినాడు. ఇది జరిగిన ప్రదేశాన్ని శివజ్ఞానపురం అని పిలుస్తారు, ఇది ఇప్పటికీ పుదుకోట్టై జిల్లాలోని అవుడయార్ కోయిల్ సమీపంలో ఉంది. ఈ ఇసుకను రాజు తన రాజభవనములోనే ఉంచుకున్నారు అది ఇప్పటివరకు పుదుకోట్టై రాజభవనములో  దక్షిణామూర్తి ఆలయంలో రాజ కుటుంబము యొక్క పూజకు  అనుదినమూ నోచుకొంటూనేవున్నది.ఈ ఆలయాన్ని గురువారం నాడు మాత్రమే ప్రజలకు తెరిచి ఉంచుతారు.

5) ఒకసారి శ్రీ సదాశివులవారు నాటి నవాబు యొక్క హరమ్ అనగా ఆయన కామ వాంఛలు దీర్చు స్త్రీల సముదాయమును కలిగిఉన భవనము ఉన్న వీధి గుండా వెళుతూ ఉండినాడు. ఎ క్కడయినా  పరబ్రహ్మాను తప్ప  అన్యము చూడని ఆ బ్రహ్మ-జ్ఞాని, తన దారిన ఎదురు  వచ్చే  మానవ రూపాల మధ్య తేడాను గుర్తించడు, ఆయనకు కనిపించే దృశ్యాలు లేదా శబ్దాలచే ఆయన చలించడు. నగ్న సన్యాసి యగు ఆ మహానీయుని, నవాబు అనుమాన దృష్టితో చూడ మొదలిడినాడు. స్వామమివారు నేరుగా ఆ హరమ్ లోనికి నడచినాడు. ఈ వార్త నవాబుకు చేరింది, అతని మనుషులు అతనిని వెంబడించినారు, ఆయనను పట్టి ఆయన రెండు చేతులను ఖండించినారు. చేతులు పడిపోయినా ఆయన  ఏమీ జరగనట్లుగా నిశ్శబ్దంగా తనదారిన తాను నడుస్తుపోతున్నాడు. విషయమునెరిగిన నవాబు భయపడి, తెగిపోయిన చేతులను ఎత్తుకుని, స్వామివారి వద్దకు పరుగెత్తి, పశ్చాత్తాపంతో ఆయన కాళ్ళపై బడి ఆ తెగిన చేతులను  భుజముల చెంతకు చేర్చగా  ఆ ఆత్మజ్ఞాని, తెగిపోయిన చేతులను నవాబుతోనే   తిరిగి యథాస్థానానికి చేర జేసుకొన్నాడు. ఆ బ్రహ్మజ్ఞాని సంభాషణ ఏమీ లేకుండా వెళ్ళిపోయినాడు. ఇక్కడ భగవద్గీత లోని రెండవ అధ్యాయమగు సాంఖ్య యోగములోని 15 వ శ్లోకము ఈవిధముగా చెప్పుచున్నది.  

యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ ।

సమదుఃఖసుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే ।। 2 - 15 ।।

యం ఎవరైతే; హి వాస్తవముగా; న వ్యథయంతి వ్యాకుల పడరో; ఏతే వీటి చే; పురుషం వ్యక్తులు; పురుష-ఋషభ శ్రేష్ఠమైన పురుషుడా, అర్జునా; సమ సమానముగా (సమత్వబుద్ధితో); దుఃఖ బాధ; సుఖం సంతోషము; ధీరం ధియం ఈరయతి ఇతి ధీరః,బుద్ధిని ప్రేరేపించువాడు,కష్ట సుఖాలలో స్థిరముగా నిలచువాడు. ; సః ఆ వ్యక్తి; అమృతత్వాయ మోక్షమునకు; కల్పతే అర్హుడు అవుతాడు.

 ఓ అర్జునా, పురుష శ్రేష్ఠుడా! ( దైనందిన చర్యలకు అతీతముగా ఆత్మ జ్ఞానముకి  తపించువాడు తద్వారా మోక్షమును పొండా దలచువాడు పురుషులలో శ్రేష్ఠుడు) , సుఖదుఃఖముల చే ప్రభావితం కాకుండా, రెండిటిలో చలించకుండా నిశ్చలముగా ఉన్నవాడు మోక్షమునకు అర్హుడవుతాడు. ఈ దుఃఖాలు మన పూర్వీకులు మూడు విధములుగా వర్గీకరించినారు. అవి 1. ఆధ్యాత్మికము: అంటే తన ఆరోగ్య అనారోగ్యములను నియంత్రించే  అంతర్గత అనగా తనలోని ఆవయముల రుగ్మతచే లేక బాహీరమగు కాలు చేతులు తల మొదలగు వాని నొప్పులచే పడు బాధలు. మానసికమగు బాధలు (Dipression) లాంటివిగూడా ఇందులోని భాగమే!

2. ఆధి భౌతికము:  అంటే ఈ శరీరానికి పంచభూతములగు పృథివి, ఆపస్సు, తేజస్సు, వాయువు ఆకాశము అనబుడు ఈ ఐదు శరీర మూలకములు (ఇవి మన సగహరీరమునకు బయట లోపల కూడా ఉన్నాయి) ఎ మాత్రము తమ తమ సహజస్థితిని మీరినా దేహమునకు బాధ కలుగాక తప్పదు.

3. ఆధిదైవికము: కొన్ని దుఃఖాలకు కరణమును ఊహించుకోలేము. అటువంటి బాధలను ఆధిదైవికములని అంటాము. ఒక వ్యక్తికి ఆధ్యాత్మికమైన గుండెనొప్పివస్తుంది. ఆయవ్యక్తిని వైద్యుని వద్దకు చేర్చు లోపలనే ఆ బాధయాడ గ్రస్తుని ప్రాణము పోతుంది. ప్రాణము పోయిన వ్యక్తికి ఏబయధా ఉండదు కానీ ఆతని చుట్టూ ఉన్నవారికి మాత్రము

 వైద్యశాల చేరులోపే ‘అయ్యో ఊహించని విధముగా (Unexpectedly) వైద్యాలయము చేరు లోపలే మరణించినాడను బాధకు గురియౌతాము. మొదటి  రెండుబాధలు ఎప్పటికయినా మూడవదగు ఆధిభౌతికము లో లయము కావలసినదే!

తాపత్రయములతో కూడిన ఇటువంటి సూక్ష్మతమమగు విషయములను అర్థము చేసుకొని వానికి అతీతమైన వారు మన సదాశివ బ్రహ్మేంద్ర యోగీశ్వరులు. అందుకే శరీరము నుండి చేతులు వేరేయినా నిర్వేదముతో ముందుకు సాగినారు.

6) 1732లో, సదాశివ బ్రహ్మేంద్రులవారు  పుదుకోట్టై అడవుల దగ్గర తిరుగుచున్నప్పుడు కొంతమంది సైనికులు అతనిని చూసి పొరపాటున ఏదో కూలివాడనుకొని కొన్ని కర్రలను తలపై పెట్టి  తమతోకూడ మోసుకొంటూ రమ్మన్నారు. సదాశివ బ్రహ్మేంద్రుల వారు మారు మాటాడకుండా మోసుకొంటూ వెళ్ళి ఆ కర్రలను వంటగదికి అనుబంధ  మైదానములో ఉంచినప్పుడు ఆ కట్టెలమోపు  కాలిపోయినది. అప్పుడు ఆ సైనికులు ఆయన గొప్ప మహానుభావుడని అర్థము చేసుకొని  ఆయనకు సాస్టాంగ ప్రాణామము చేయగా ఆయన ఏమీ పట్టనట్లు వెళ్లిపోయినాడు.

7) సదాశివ బ్రహ్మేంద్రులవారి  ఒక చదువుకోని మరియు పుట్టుకతో మూగవాడయిన భక్తుడు గురువుగారికి ఎంతో సేవ చేస్తూ వచ్చినాడు. ఒకరోజు, సదాశివ బ్రహ్మేంద్రులవారు  ఆతని తలపై చేయి ఉంచి, ఏమి ఇవ్వమని భగవంతుని ప్రార్థించినాడో కానీ  వాక్కు మరియు జ్ఞానము రెండూ అతనికి సదాశివ బ్రహ్మేంద్రులవారి దయతో ఆ మూగవాడు విద్యావంతుడగుటయే గాకమాట్లాడుట కూడా మొదలుపెట్టినాడు. అతను ప్రసంగాలు చేయడం ప్రారంభించుటయేగాక అతను "ఆకాశ పురాణ రామలింగ శాస్త్రి" గా ప్రసిద్ధి చెందినాడు. ఈ 20వ శతాబ్దం వరకు రామలింగ శాస్త్రి బంధువులు నెరూరులో ఉండేవారు. ఈ సంఘటన శ్రీ సదాశివేంద్ర స్తవ (22 & 26 శ్లోకాలు)లో కూడా ప్రస్తావించబడింది.

దేవాలయాలు

1) శ్రీ బ్రహ్మేంద్రులవారు తరచుగా పుదుకోట్టైలోని బృహదాంబాల్ దేవి మందిరానికి సమీపంలోని తిరుగోకరర్ శివాలయంలో ధ్యానం చేసేవారు. ఆయన ధ్యానము చేయడానికి కూర్చున్న ప్రదేశము నేటికీ చూడవచ్చు.

2) తంజావూరు సమీపంలో పున్నైనల్లూర్ మరియమ్మన్ దేవతను ప్రతిష్టించడానికి అతను బాధ్యత వహించినాడు.

3) తమిళనాడులోని తేని సమీపంలోని దేవదానవపట్టి కామాక్షి ఆలయంలో స్థాపనకు ఆయన మార్గదర్శకత్వము వహించినారు. పై రెండు సంఘటనలు "మహా శక్తి మరియమ్మన్" పేరుతో ఒక తమిళ చిత్రంలో చిత్రీకరించబడినాయి.

4) తంజావూరులోని నలు కాల్ (నాలుగు కాళ్ళ) మండపంలో ఉన్న ప్రసన్న వేంకటేశ్వర ఆలయంలో హనుమంతుని మూర్తిని కూడా ప్రతిష్ఠించినాడు.

5) ఆయన కుంభకోణంలోని తిరునాగేశ్వర రాహు స్తలం ఆలయంలో గణేశ విగ్రహ ప్రతిష్ఠయే కాక శక్తివంతమైన గణేశ యంత్రాన్ని కూడా ఏర్పాటు చేసినాడు. ఆలయంలోని ఒక శాసనం ఈ వాస్తవానికి సాక్ష్యంగా ఉన్నది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఈ మందిరమును ఇప్పటికీ చూడవచ్చును.

6) ఆయన కరూర్ సమీపంలోని తాంటోండ్రిమలై శ్రీనివాస పెరుమాళ్ ఆలయంలో జన ఆకర్షణ యంత్రాన్ని ఏర్పరచినాడు. తిరుపతి యాత్రకు వెళ్లలేని భక్తులందరూ ఈ క్షేత్రాన్ని సందర్శించుతారు.

7) పెరంబలూరు సమీపంలోని సిరువాచూర్ మధురకాళి ఆలయంలో శ్రీ చక్రాన్ని కూడా స్థాపించినాడు.

8) కరూర్ (నెరూర్) నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోహనూర్ అచల దీపేశ్వరర్ శివాలయంలో శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుల పవిత్ర పాదుకలు నేటికినీ మనము చూడవచ్చును.                                                                                                                                                       9) అసలు నెరూరులోని శివాలయాన్ని అగ్నీశ్వరర్ అని కూడా పిలుస్తారు. నెరుర్ అనే పేరు నెరుప్పూర్  అంటే అగ్ని నగరం నుండి వచ్చింది. సదాశ్వులవారు ప్రతి రోజూ అర్ధరాత్రి సమయములో ఈ అగ్నీశ్వరుని పూజించేవారట.

మిగిలినది మరోమారు....... 

సద్గురువు  -  సదాశివ బ్రహ్మేంద్ర యతీంద్రులు  6వ భాగము

ఆయన కొంతకాలము తిరువిసనల్లూర్ లో ఉండి అక్కడి నుండి బయలుదేరి నేరూర్ చేరుకున్నాడు, అచట కావేరి దక్షిణముఖియై ప్రవహించుతుంది.  మహనీయులు అటువంటి ప్రదేశమును తమ  తపస్సుకు ఎంతో విశిష్ఠమైనదిగా భావించుతారు. నది దక్షిణ దిశగా ప్రవహించే ప్రదేశమును కాశీ తో సమానంగా పరిగణించుతారు.

శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుడు క్రీ.శ. 1755లో మఖ నక్షత్రంతో కూడిన వైశాఖ శుక్ల దశమి నాడు మహాసమాధిని పొందినాడు, తన సమాధికి ముందు శివలింగము, తన సమాధిపై బిల్వ వృక్షము వస్తుందని పేర్కొన్నాడు. 10 రోజుల తర్వాత ఎవరైనా శివలింగాన్ని తీసుకువస్తారని, దానిని తన సమాధికి ముందు కొంత దూరంలో ప్రతిష్టించాలని కూడా ఆయన పేర్కొన్నారు. అదే విధంగా జరిగిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అతను 3 ప్రదేశాలలో సమాధి పొందినట్లు పరమహంస యోగానంద గారి ‘ఒక యోగి ఆత్మ కథ’లో  చెప్పబడింది: అవి

నెరూరు (తమిళనాడు)

మదురై నుండి మనమదురై 60 కి.మీ

కరాచీ, ఇప్పుడు పాకిస్థాన్‌లో ఉంది

ప్రతి సంవత్సరం నెరూర్ మరియు మానామదురైలో, అతని గౌరవార్థం సంగీత ఉత్సవాలు నిర్వహించబడతాయి. మానామదురైలో, ఆయన సమాధి శ్రీ సోమనాథర్ ఆలయంలో ఉంది, దీనిని కంచి పరమాచార్యులు గుర్తించారు. 1912లో ఒక సన్యాసి "లక్షార్చనై స్వామిగళ్" నెరూరులో శ్రీ బ్రహ్మేంద్రులకు ఆరాధనను ప్రారంభించగా, అప్పటినుండి అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి తమ్ముడు శ్రీ సదాశివ శాస్త్రిగారు. హిందూ ధర్మంపై "యెనిపడిగలిల్ మంథర్గల్" (తమిళం) పేరుతో ఒక గొప్ప రచన చేసినాడు.

ఈ గ్రంధములో, శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులకు అనేక పుటలను కేటాయించుట జరిగినది. వారు శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులు, పంచభూతాలకు ప్రతీకగా   5 స్థలములలో మహాసమాధిని పొందినట్లు పేర్కొన్నారు.

1) నెరూరు 2) మనమదురై 3) కరాచీ 4) కాశీ 5) పూరి

శ్రీ బ్రహ్మేంద్రలు ఇద్దరు ముస్లిం సోదరులకు (ఇరతై మస్తాన్) బ్రహ్మతత్వమును బోధించింట్లు వారా పొత్తములో పేర్కొన్నారు. వారి సమాధి (ధర్గా) తంజావూరులోని గాంధీజీ రోడ్డులో ఉంది.

స్వామిని స్తుతించిన మహనీయులు

శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి నెరూర్‌ను సందర్శించినపుడు శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుల వారిని నుతిస్తూ - సదాశివేంద్ర స్తవమును మరియు సదాశివేంద్ర పంచరత్నములను సంస్కృతములో రచించినారు. మరొక సిద్ధపురుషుడగు బాలసుబ్రహ్మణ్య యతీంద్రుడు సదాశివ స్తోత్రాన్ని రచించినాడు.

     శృంగేరి ఆచార్యులు నెరూరుకు రావటము ఒక ఎంతో  ఆసక్తికరమైన విషయము. స్వాములవారు తిరుచ్చికి సమీపంలో ఎక్కడికో ప్రయాణిస్తున్నప్పుడు (ఎప్పుడో 1890-1910 సమయంలో), పల్లకీ మోసేవారికి ఆయనను మోసుకెళ్లడంలో ఇబ్బంది ఏర్పడింది. వారిని విచారించగా, అదృశ్య శక్తి తమను నెట్టివేసిందని చెప్పారు. ఆచార్యుడు దిగి కాసేపు ధ్యానం చేసినాడు. తర్వాత చేతులు చాచి బలవంతంగా నడవడం ప్రారంభించినాడుడు. ఆ నడక శ్రీ బ్రహ్మేంద్రుల సన్నిధానము వరకూ సాగినది.

స్వామివారు అక్కడ, ఆహారము మరియు నీరు లేకుండా 3 రోజులు తీవ్రమైన తపస్సు చేసినారు. అక్కడ ఉన్నవారు, 3 రోజుల తపస్సు ముగిసిన అనంతరము, ఆచార్యులవారితో ఎవరో మాట్లాడుతున్నట్లు వినగలిగినారు కానీ వ్యక్తిని చూడలేకపోయినారు. అంటే శృంగేరి యతీంద్రులకు శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుల భౌతిక దర్శనం జరిగిందన్నమాట. ఆ తర్వాత ఆశువుగా  శ్రీ బ్రహ్మేంద్రులవారిపై  పైన తెలిపిన రెండు రచనలు చెసినారు.

పిన్నవాసల్ స్వామిగల్‌ణు గూర్చి క్లుప్తముగా ఈ దిగువ తెలియజేయుచున్నాను.

పిన్నవాసల్, తిరుచ్చి నుండి ఇరవై ఎనిమిది మైళ్ల దూరంలో ఉన్న ఒక ఊరు.లాల్గుడి కి సమీపంలో ఉంది. పిన్నవాసల్లో రామకృష్ణానంద అనే సిద్ధపురుషుడు ఉండేవాడు. ఆయన స్వస్థలం కల్లిడైకురిచ్చి. ఆయన అవదైయార్ ఆలయంలో చాలా సంవత్సరాలు ధ్యాన నిష్ఠ తో గడిపినాడు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత  ఏమిటంటే లింగం[మూర్తి] లేదు.  ఆవుడై యొక్క అసలు అర్ధము పానవట్టము అని.  ఇది సంపూర్ణ బ్రహ్మ తత్వమును ప్రతీక.  రామకృష్ణ గారు పెద్దల బాలవంతముతో ఇష్టానికి వ్యతిరేకముగా పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఆత్మజ్ఞానమునకై పరితపించుటచే సంసార బంధను త్రెంచుకొని  తన అన్వేషణను కొనసాగించినాడు. అనేక  సంవత్సరాలు ఆయన  తీవ్రమైన తపస్సు చేసినాడు.           ఆయన ప్రారంభమున స్వామి శివానందను గురువుగా ఎంచుకొని ఉండినారు.  ఒకసారి సన్యాస మార్గాన్ని ప్రసాదించమని తన గురువును ఆయన కోరినప్పుడు, శివానంద గారు  దానిని తిరస్కరించినారు. తరువాత తాను జీవించిన కాలానికి దాదాపు  200 సంవత్సరముల పూర్వము జీవ సమాధియైన  సదాశివ బ్రహ్మేంద్రునికి అంకితమైనాడు. ఆయన, స్వప్నమున, రామకృష్ణానందకు నవాక్షరీ మంత్రాన్ని (ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చై) ఉపదేశించినాడు. (ఈ మంత్రము వర్ణభేదము లేక ఎవరైనా గురుముఖతః ఉపదేశము తీసుకొని అనుష్ఠించవచ్చునని వినియుండినాను. ఇది వాణీ లక్ష్మీ కాళీ సంయుక్త త్రైమాతా మంత్రము. ఈ మంత్రమునకు ఓం చేర్చనవసరములేదని పెద్దలు చెప్పినారు). ఈమంత్రానుష్ఠానము తో రామకృష్ణానందులవారు ఎన్నో ఆధ్యాత్మిక శక్తులను పొందినాడు. రామకృష్ణానందకు బ్రహ్మైక్యము పొందవలెనన్నది తపన.   సదాశివ బ్రహ్మేంద్రుడు ఒకసారి ఆయనకు కలలో కనిపించి, మహా పతివ్రత యగు ఆయన భార్య శాపమునకు ఆయన గురియైనందున స్త్రీ జన్మ ఎత్తవలసియున్నదని తెలియజేసినారు బ్రహ్మేంద్రులవారు.  రామకృష్ణానందకు అది ఏవిధముగానూ ఇష్టము లేదు. అందుచేత సదాశివ బ్రహ్మేంద్రులవారు అతని జీవ సమాధి తదనంతరము సమాధికి రంధ్రము చేసియుంచమని సలహా ఇచ్చినాడు.  మోక్షము పొందు సమయము ఆసన్నమైనపుడు ఆయన ఆత్మను సంసార బంధము కలిగియుండియు భగవన్మార్గము ననుసరించు స్త్రీ శరీరంలోకి ప్రవేశపెడతానని మాట ఇచ్చి స్వప్నమునుండి అంతర్ధానమౌతాడు. రామకృష్ణానంద తన జీవితాన్ని కొనసాగించి నిధనము చెందిన తరువాత ఆయన భక్తులు వారిని సమాధిచేసి, చెప్పినట్లుగనే, సమాధికి రంధ్రము చేసియుంచినారు.

చెన్నపట్టణము అనగా చెన్నైలో, మరకతవల్లి అను ఒక స్త్రీ చాలా పవిత్రమైన కుటుంబంలో జన్మించి త్రికరణ శుద్ధితో సుబ్రహ్మణ్యస్వామిని సేవిన్చుతూ ఉండినది. ఆమె వాగ్గేయ కారిణి. కొన్ని సందర్భాలలో స్వామియే తనపై ఫలానా విధముగా కీర్తన వ్రాయమని అడిగితే ఆమె అటులనే చేసేదట. పరవశించి ఆ కీర్తనలకు ఆయన నృత్యము చేసేవాడట. 1949లో, మరకతవల్లిని ఆసుపత్రిలో, ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడముతో, చేర్చినారు. కాసేపు తరువాత ఆమె మరణించినట్లు ప్రకటించినారు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి రామకృష్ణానంద సమాధి వద్ద ప్రత్యక్షమై, ఆయన ఆత్మను రంధ్రము గుండా స్వచ్ఛమైన జీవితాన్ని గడిపిన మరకతవల్లి యొక్క పార్థివ శరీరము లోనుకి ప్రవేశ పెట్టినారు.  రామకృష్ణానంద వైకాసి మాసంలో మరియు విశాఖ నక్షత్రంలో మరగడవల్లి యొక్క దివ్య శరీరంలోకి ప్రవేశించినాడు. మళ్లీ ప్రాణం పోసుకున్న మరకతవల్లిని చూసి ఆస్పత్రిలో ఉన్న వారంతా అమిత ఆశర్యమునకు గురియైనారు. ఆమె కళ్ళు తెరిచింది మరియు ఇది వైద్యులను పూర్తిగా కలవరపెట్టింది. సంవత్సరాలు గడిచిపోయాయి మరియు మరకతవల్లి శరీరంలోని రామకృష్ణానంద ఆత్మ చేరిన తరువాత చాలా కీర్తనలను రచించినాడు.  రామకృష్ణానంద స్కందుని సేవలో ఆ దివ్య శరీరముతో చాలా సంవత్సరాలు గడిపి తన గురువు సదాశివ బ్రహ్మేంద్రుల ఆజ్ఞాను పాలించినాడు. మరకతవల్లి శరీరములో ఈయన చేరిన తదుపరి స్కండునిపై ఒక ఉన్మత్త జీవితమును గడిపినాడు. అందుచే దేవునిపై అమితమైన పిచ్చి కలిగియుండుటచే లోకులు ‘ఆండవన్ పిచ్చై’ గా పిలిచేవారు. గుహుడు ఆమె కలలో వచ్చి కీర్తనలు పాడమని కోరేవాడు. ఒక్కో పర్యాయము స్వామీ భావము కూడా తెలియజేసేవాడు. అటువంటి ఒక కీర్తనే "వాడద పుమలైయానా పమలైయా ఎన్ మేల్ పాడు"  ఎప్పుడూ వసివాడని కీర్తనలగూర్చి దండగా వేతును ప్రభో’ అన్న వసివాడని కీర్తన.

ఆండవన్ పిచ్చై మురుగ భగవానుడిపై చాలా కీర్తనలు రచించుట జరిగినది.  

చివరికి అతడు\ఆమె నవంబర్ 1990లో తన కుటుంబ గృహంలో మరణించుట జరిగినది. మరణించే సమయానికి ఆమె వయసు తొంభై సంవత్సరాలు.

మిగిలినది మరోమారు......

సద్గురువు  -  సదాశివ బ్రహ్మేంద్ర యతీంద్రులు 7వ భాగము

బ్రహ్మేంద్రులవారి ఆధ్యాత్మిక రచనలు

వారు సంస్కృతమున అనేక రచనలు చేసినారు. కొన్ని ఈ దిగువన పొందుపరచుచున్నాను.

• బ్రహ్మ సూత్ర వృత్తి లేదా బ్రహ్మ తత్వ ప్రకాశిక - బ్రహ్మ సూత్రాలపై వ్యాఖ్యానం

• యోగ సుధాకర - పతంజలి యొక్క యోగ సూత్రాలపై వ్యాఖ్యానం శ్రీ R.M.ఉమేష్ ఈ పుస్తకానికి "సైన్స్ ఆఫ్ మైండ్ కంట్రోల్" పేరుతో ఆంగ్ల అనువాదాన్ని వ్రాసినా రు. ఈ పుస్తకాన్ని శృంగేరి మఠం వారు ప్రచురించినారు.

• నవ మణి మాల బ్రహ్మేంద్రులవారు  తన గురువు శ్రీ పరమశివేంద్ర సరస్వతి గౌరవార్థం ఈ రచనను చేసినారు.

• ఆత్మ విద్యా విలాస అనేది సరళమైన, స్పష్టమైన సంస్కృతంలో 62 శ్లోకాలతో సాగే కవితా రచన. దాని ప్రధాన అంశం త్యజించడం.

• సిద్ధాంత కల్పవల్లి - ఇది వివిధ సాధువులచే కాలానుగుణంగా వివరించిన అడవి

తతత్వాన్ని వివరిస్తుంది. అప్పయ్య దీక్షితులవారి  అద్వైత సిద్ధాంతము  యొక్క వివరణ అయిన సిద్ధాంత-లేశ-సంగ్రహాన్ని రచించారు. బ్రహ్మేంద్రులు దానిని సరళీకరించి 212 శ్లోకాలతో సిద్ధాంత కల్పవల్లిని రచించినారు.

అయ్యావాళ్ భగవంతుని కీర్తిని గానముచేయకుండా ఆ  మౌనము ఆపింది కావున. ఆ మౌనము వీడి భగవద్ సంకీర్తనము జేయుచు జన్మను సార్థక్యము చేసుకొమ్మని సలహా యిచ్చినాడు అన్న విషయమును ముందే తెలియజేసినాను. మౌనము వీడిన తరువాత బ్రహ్మేంద్రులవారు పాడిన\వ్రాసిన

మొదటి పాట 'పిబరే రామరసం'. ఈ కీర్తనను youtube లో ఉత్సాహవంతులు వినవచ్చు. చదువదలచిన వారికి ఆపాటను ఇచట పొందుపరచుచున్నాను.

 పిబరే రామరసం రసనే పిబరే రామరసం ll పిబరేll

*చరణం 1*

 జనన మరణ భయ శొకవిదూరం.. సకల శాస్త్ర నిగమాగమ సారం..

 పిబరే రామరసం రసనే పిబరే రామరసం ll పిబరేll

 *చరణం2*

 శుద్ధ పరమహంస ఆశ్రయ గీతం.. సుఖ శౌనక కౌశిక ముఖ పీఠం

పిబరే రామరసం రసనే పిబరే రామరసం ll పిబరేll

 కీర్తనకర్థం

రామ నామములోని సారమును త్రాగుము, ఓ నాలుక.

ఇది జనన మరణ భయము అన్న శోకము అనగా చింత నుండి దూరము చేస్తుంది. ఇది సకల శృతి స్మృతి శాస్త్రముల సారము. ఈ తారకము పరమపద సోపానము. ఓ నాలుక ఈ రామరసమును ఆస్వాదించు.

 

పరమహంస అన్నది బ్రహ్మేంద్రులవారి 'ముద్ర' లేక ‘మకుటము. వారు త్రికరణ శుద్ధిగా జపించు 'రామ తారకము' యొక్క మహిమ ఇందు కొనియాడబడినది. ఈ మహాన్మంత్రమును శుక, శౌనక, కౌశికాది మహర్షులు సేవించినది ఈ మంత్రము.

ఈ కీర్తన సులభ గ్రాహ్యము, ఈ తారకము సులభాసాధ్యము.

క్షమాపరాధ విన్నపము

స్వామీ ఆంధ్రుడవయ్యు నీ రచనలా స్వాదించ లేరైరి మా

సీమన్నిన్నుతియించు వారలెటనో సంగీత వారాశిలో

సోమించేరు సుయోగిశేఖర, మహా సోమారి మూకల్ సదా    

కామాంధ్యంబున చింతజేయరు మిమున్  కర్మానుసంధాతలై

(సోమించుట = విజృంభించుట)

స్వస్తి.

ఓం శాంతి శాంతి శాంతిః.