Showing posts with label అమ్మవారిపై ఒక పాశ్చాత్యుని భక్తి. Show all posts
Showing posts with label అమ్మవారిపై ఒక పాశ్చాత్యుని భక్తి. Show all posts

Sunday, 4 February 2018

మధుర మీనాక్షి -- కలెక్టరు పీటరు

మధుర మీనాక్షి -- కలెక్టరు పీటరు
మథుర (తమిళ్ నాడు) పట్టణానికి1812 మరియు 1828 మధ్య కాలములో రోస్స్ పీటర్ అన్న ఆంగ్లేయుడు కలెక్టరుగా ఉండినాడు. తానూ స్వర్తహాగా క్రైస్తవుడైనా మన సాంప్రదాయమునకు, ఆచారవ్యవహారములకు, దేవతారాధనమునకు ఎంతో ప్రాముఖ్యత నిచ్చుటయేగాక మీనాక్షి అమ్మవారి పై భక్తి విశ్వాసములు గలిగియుండినాడు.
తన బంగాళా నుండి ఆఫీసుకు పోవు మార్గ మధ్యములో మీనాక్షి అమ్మవారి ఆలయము వుండేది. సూటు బూటు వేసుకొని గుర్రముపై ప్రతిరోజూ ఆఫీసుకు పోయే పీటర్ గారు అమ్మవారి గుడికి  కొంచెము ముఇందుగానే దిగి తన బూట్లు మేజోళ్ళు విప్పి అవి గుఱ్ఱము యొక్క జీనునకు తగిలించి పాదచారియై పోయేవాడు. తిరిగీ ఇంటికి వచ్చుసమయములో కూడా అదేవిధముగా ప్రవర్తించేవాడు.
ఒకరోజు రాత్రి కుంభవృష్టి కురుస్తూ వుండినది. మంచి నిద్రలో వున్న పీటరుగారికి కాలి మువ్వల శబ్దము వినవచ్చింది. కాసింతసేపు కలయేమోననుకొని కదల లేదు. కొంతసేపు తరువాత పీటర్ పీటర్ అని పిలిచినట్లయినది. ఆతడు లేచి చూస్తే ఒక అమ్మాయి వీపు కనిపిస్తూవుంది. కాలి గజ్జెలు కనిపించుతున్నాయిగానీ ఆమె చెప్పులు వేసుకొని లేదు. ఆతడు లేచి ఆమెను చూడదలచాగా అక్కడినుండి ఆమె పరుగు తీసింది. ముందు వెనుక యోచించకుండా ఆమె వెంతబదినాడు ఆయన. ఇద్దరూ ఇల్లు దాటినారు. ఫెళఫెళ శబ్దము వెనుక వినిపిస్తే తిరిగి చూసినాడు ఆ కలెక్టరు. తన నివాస గృహము నేలమట్టమయిపోయింది. ముందుకు చూస్తే ఆ అమ్మాయి కానరాలేదు. ఇది అమ్మవారి మహాత్మ్యమేనని పీటరు గారికి అర్థమయిపోయింది.
మీనాక్షికి మనసారా కృతజ్ఞత చెప్పుకొన్నాడు. అచంచల మీనాక్షీ మాతృ సేవానురక్తుడైన అతను తన జ్ఞాపకార్థము అమ్మకు నవరత్నములచే పొదిగిన బంగారు పాదరక్షలను చేయించి వానిపై, అమ్మా పాదదాసునిగా తన పేరు పోదిగించుకొన్నాడు. ఆ రక్షలను పీటర్ పాదుకం (పీటర్ ఇచ్చిన పాదుకలు) అని అంటారు.
నేటికీ ఆ రక్షలను చైత్రమాసపు వేడుకలలో అమ్మవారి ఉత్సవమూర్తి పాదాలకు అవి అలంకరించుతారు. అమ్మను నమ్మిన అతనికి, మతము అడ్డము రాకపోగా , ఆ భక్తుని ఆ తల్లి కాపాడింది.  ఈ పురాతనమైన దేవాలయాలో విగ్రహ ప్రతిష్ఠ స్థాపత్య ఆగమము ప్రకారము వేదపండితులు చేస్తారు. విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అంటే ఆ విగ్రహములో దైవశక్తి పుష్కలముగా వుంటుంది. ఈ విగ్రహములు నేడు వీధివీధికీ వుండే దేవాలయముల వలె కాదు.  అందుకే మన పూర్వులు తీర్థయాత్రాలను ఏర్పరచినది. కావున హృదయకుహరములో మనము నమ్మిన దైవమును తలచుకొంటే చాలు దైవము మనకు అండ దండగా ఉండుట జరుగుతుంది.

స్వస్తి.