Saturday, 10 February 2018

భార్యా భర్తల అనుబంధం


భార్యా భర్తల అనుబంధం
మూడు ముళ్ళకెపుడు ముసలితనము రాదు
పెరుగుచుండు ప్రేమ తరుగ బోదు

పెనము దోశపిండి ప్రేమతత్వము చూడు
రామమోహనుక్తి రమ్య సూక్తి
భార్య భర్తల అనుబంధము పెనము దోశపిండికి ఉన్న సంబంధము వంటిది. ఎన్ని వందల సంవత్సరములు గడిచినా, పెనము ఎంత వేడెక్కినా పెనమునకు పిండికి వున్న అనుబంధము తీరదు.
వయసు అందుకు ప్రతిబంధకము కాదు.

Sunday, 4 February 2018

మధుర మీనాక్షి -- కలెక్టరు పీటరు

మధుర మీనాక్షి -- కలెక్టరు పీటరు
మథుర (తమిళ్ నాడు) పట్టణానికి1812 మరియు 1828 మధ్య కాలములో రోస్స్ పీటర్ అన్న ఆంగ్లేయుడు కలెక్టరుగా ఉండినాడు. తానూ స్వర్తహాగా క్రైస్తవుడైనా మన సాంప్రదాయమునకు, ఆచారవ్యవహారములకు, దేవతారాధనమునకు ఎంతో ప్రాముఖ్యత నిచ్చుటయేగాక మీనాక్షి అమ్మవారి పై భక్తి విశ్వాసములు గలిగియుండినాడు.
తన బంగాళా నుండి ఆఫీసుకు పోవు మార్గ మధ్యములో మీనాక్షి అమ్మవారి ఆలయము వుండేది. సూటు బూటు వేసుకొని గుర్రముపై ప్రతిరోజూ ఆఫీసుకు పోయే పీటర్ గారు అమ్మవారి గుడికి  కొంచెము ముఇందుగానే దిగి తన బూట్లు మేజోళ్ళు విప్పి అవి గుఱ్ఱము యొక్క జీనునకు తగిలించి పాదచారియై పోయేవాడు. తిరిగీ ఇంటికి వచ్చుసమయములో కూడా అదేవిధముగా ప్రవర్తించేవాడు.
ఒకరోజు రాత్రి కుంభవృష్టి కురుస్తూ వుండినది. మంచి నిద్రలో వున్న పీటరుగారికి కాలి మువ్వల శబ్దము వినవచ్చింది. కాసింతసేపు కలయేమోననుకొని కదల లేదు. కొంతసేపు తరువాత పీటర్ పీటర్ అని పిలిచినట్లయినది. ఆతడు లేచి చూస్తే ఒక అమ్మాయి వీపు కనిపిస్తూవుంది. కాలి గజ్జెలు కనిపించుతున్నాయిగానీ ఆమె చెప్పులు వేసుకొని లేదు. ఆతడు లేచి ఆమెను చూడదలచాగా అక్కడినుండి ఆమె పరుగు తీసింది. ముందు వెనుక యోచించకుండా ఆమె వెంతబదినాడు ఆయన. ఇద్దరూ ఇల్లు దాటినారు. ఫెళఫెళ శబ్దము వెనుక వినిపిస్తే తిరిగి చూసినాడు ఆ కలెక్టరు. తన నివాస గృహము నేలమట్టమయిపోయింది. ముందుకు చూస్తే ఆ అమ్మాయి కానరాలేదు. ఇది అమ్మవారి మహాత్మ్యమేనని పీటరు గారికి అర్థమయిపోయింది.
మీనాక్షికి మనసారా కృతజ్ఞత చెప్పుకొన్నాడు. అచంచల మీనాక్షీ మాతృ సేవానురక్తుడైన అతను తన జ్ఞాపకార్థము అమ్మకు నవరత్నములచే పొదిగిన బంగారు పాదరక్షలను చేయించి వానిపై, అమ్మా పాదదాసునిగా తన పేరు పోదిగించుకొన్నాడు. ఆ రక్షలను పీటర్ పాదుకం (పీటర్ ఇచ్చిన పాదుకలు) అని అంటారు.
నేటికీ ఆ రక్షలను చైత్రమాసపు వేడుకలలో అమ్మవారి ఉత్సవమూర్తి పాదాలకు అవి అలంకరించుతారు. అమ్మను నమ్మిన అతనికి, మతము అడ్డము రాకపోగా , ఆ భక్తుని ఆ తల్లి కాపాడింది.  ఈ పురాతనమైన దేవాలయాలో విగ్రహ ప్రతిష్ఠ స్థాపత్య ఆగమము ప్రకారము వేదపండితులు చేస్తారు. విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అంటే ఆ విగ్రహములో దైవశక్తి పుష్కలముగా వుంటుంది. ఈ విగ్రహములు నేడు వీధివీధికీ వుండే దేవాలయముల వలె కాదు.  అందుకే మన పూర్వులు తీర్థయాత్రాలను ఏర్పరచినది. కావున హృదయకుహరములో మనము నమ్మిన దైవమును తలచుకొంటే చాలు దైవము మనకు అండ దండగా ఉండుట జరుగుతుంది.

స్వస్తి.

Saturday, 3 February 2018

చమత్కార శ్లోకము

చమత్కార శ్లోకము
 లక్ష్మీ దేవికీ, పార్వతీదేవి కీ మధ్య సాగిన ఈ సరస సంభాషణను సాదరముగా చదవండి.
శ్లోll భిక్షార్థీ ప్రయాతః సుతను?బలిమఖే, తాండవం క్వాద్య భద్రే?
జానే బృందావనాన్తే,క్వ చ స మృగ శిశు:? నైవ జానే వరాహం
బాలే,కశ్చిన్న దృష్ట:? జరట వృష పతి:?గోపా ఏవాస్య వేత్తా
లీలా సల్లాప ఏవం జలనిధి హిమవత్కాన్యయో త్రాయతాం వః
లక్ష్మీ దేవి చుట్టపు చూపుగా కైలాసానికి వెళ్ళిందట. పార్వతి ఆమెను సాదరముగా తోడుకోనివచ్చి ఉచితాసీనురాలిని చేసి కుశలప్రశ్నలు అడిగింది. పిచ్చాపాటి మాట్లాడుకోన్నతరువాట సరసము శ్రుతిమించి లక్ష్మీదేవి  ఎగతాళిగా పార్వతీ నీ భర్త భిక్ష మడుక్కునేందుకు ఎక్కడికి వెళ్ళినాడు?పార్వతి గడుసుగా బలిచక్రవర్తి యాగానికి వెళ్ళాడు సుందరీ అన్నది.
ఈ రోజు మీ తైతక్కలు ఎక్కడ ? అన్నది  లక్ష్మి , పార్వతి వెంటనే బృందావన ప్రాంతం లో అనుకుంటాను అన్నది. మీ అందాల మృగ శిశువు (వినాయకుడు ఏనుగు తల కలిగినవాడు కదా!) ఎక్కడ?అన్నది లక్ష్మి ఎగతాళిగా, అందుకు పార్వతి ఈ వరాహాల (విష్ణువు వరాహావతారం) సంగతి నాకేం తెలుస్తుంది అన్నది.  మీ ముసలి ఎద్దు ఏదీ  కనపడదే? అన్నది లక్ష్మి. ఎద్దులూ,ఆవుల విషయం  ఆవులు కాచే వాడికే తెలియాలి. ఇలా ఎకసక్కాలాడుకునే లక్ష్మీ,పార్వాతులు మిమ్మల్ని కాపాడుదురు గాక.

ఎంత సుందరమైన భాష ఎంత సుందరమైన భావము. ఇంతటి గొప్ప భాషను చేయి జార్చుకొన్నందుకు మనము సిగ్గుపడవలెనేమో!

Friday, 2 February 2018

చిచ్చొ ళుళుళు హాయీ

చిచ్చొ ళుళుళు హాయీ
ఈ రోజు తెలిపే ఈ విషయము చిన్నదే, కానీ ఇందలి అర్థము ఎంతో గంభీరమైనది. తెలుసుకోన్నవాళ్ళు ముక్కున వ్రేలు వేసుకొని తీరవలసినదే! పెద్దలనుండి గ్రహించిన ఈ విషయమును ఈ రోజు మీ ముందుంచుచున్నాను.
ఆంధ్రదేశమున మా కాలములో తల్లులు తమ శిశువులను లాలి లో పరుండబెట్టి జోల పాడేవారు. పాట 'చిచ్చొ ళుళుళు హాయీ' తో మొదలయ్యేది. ఎందుకు అన్నది నాకు అర్థమయ్యేదికాదు. నా అదృష్టము కొద్దీ ఒక సంస్కృత పండితుని నుండి నేను దీని అంతరార్థమును గ్రహించినాను. పూర్వులకు, ముఖ్యముగా తల్లులకు మనసారా పాదాభివందనము చేసుకొన్నాను. ఆంద్ర దేశములో అక్షరాస్యత ఆడవారిలో తక్కువ అన్న పడమట సంధ్యారాగము తీసే మహనీయులకు ఈ నాలుగు వాక్యములు అంకితము.
చిత్+చ = చిచ్చ = జ్ఞానము+ఏ = జ్ఞానమే ( మనము సంపాదించ వలసినది.
మిగతదంతా 'ళుళుళు' అంటే ఉత్తదే! ఆ జ్ఞానాన్ని తెలుసుకొంటే నీకు దక్కేదే 'హాయి'.
ఈ మాటలో ఇంత గంభీరమైన అర్థము దాగి వున్నందుకు ఆతల్లులకు, ఈ ముద్రణ చదివిన వారంతా నమస్కరించ వలసినదేకదా!

చెరుకు రామ మోహన్ రావు