Saturday, 31 March 2018

యామునాచార్యుడు


యామునాచార్యుడు
https://cherukuramamohanrao.blogspot.com/2018/03/blog-post_31.html
జయభేరి సినిమా మా బాల్యములో వచ్చిన ఒక కళా ఖండము. అందులోని పాటలు అనర్ఘ రత్నములు. 'మది శారదాదేవి మందిరము' 'రసికరాజ తగువారముకామా' అన్నపాటలు విన్నవారెవరూ వానిని మరువరు. అసలు పాటలు అన్నీ సందర్భ సహితములు కాబట్టి ఏ పాటకాపాటే సాటి. ఈ పాటల నుండి ' సినిమా కాస్త నడుస్తూనే వచ్చే 'సవాల్సవాలను చిన్నదానా సవాల్ పై సవాల్' అన్న పాట నేను వ్రాయబోవు ఈ యామునాచార్య వృత్తాంతమునకు ఒక ఆలంబనము. ఈ పాటలో నాయకుడగు నాగేశ్వరరావు గారు నాయిక అంజలికి పాటలో ఈ ప్రశ్నను విసరుతాడు. 'ఓ రూపవతీ నీవు కురూపివి కాదు, నిను కన్న తల్లి గొడ్రాలు కాదు...' ఈ ప్రశ్నను ఆమె సహచరులు రేలంగి రమణారెడ్డి గార్లు తృణీకరిస్తారు. తరువాత వేరే ప్రశ్న అడుగుట జరుగుతుంది. మనకు దానితో పనిలేదు. ఇటువంటి ప్రశ్నలు మనకు యామునాచార్యులవారి చరిత్రలో కనిపిస్తాయి. సినిమాలో జవాబు దాటవేస్తారు గానీ నిజానికి ఇటువంటి ప్రశ్నలకు ఎంత చక్కని సమాధానాలున్నాయో ఒకసారి వారి చరిత్రతోబాటూ తెలుసుకొందాము.
క్రీ.శ. 1150 వ సంవత్సరప్రాంతమునందు  పాండ్యరాజులు దక్షిణభారతమున సువిశాల ప్రాంతమును మీనాక్షీ మాత అనుగ్రహముతో మధురా పట్టణమును  రాజధానిగా చేసుకొని న్యాయమార్గములో  పరిపాలించేవారు.  దేశమంతా సుభిక్షంగావుండుటయేగాక, రా రాజులు సకలకళా పోషకులై విద్యావంత, విద్వాంస,  గురుకుల, పండితపరిషత్ పోషకులై  పాలితులయందు ఉత్తమ సాంస్కృతికాభిలాషను కలిగించుతూ ప్రజారంజకముగా పరిపాలించేవారు.
ఆ విధముగా పరిపాలించిన రాజులలోని ఒకరి కాలములో విద్వజ్జనకోలాహలుడు (అక్కియాళ్వాన్) అన్న పేరుగల పండితుడు వారి ఆస్థానములో వుండేవాడు. ఆయన గర్వి.  తన శాస్త్రపాండిత్యముతో మరియు వాదనా పటిమతో, ఎందఱో పండితులను ఓడించి  వారినుండి  కప్పము వసూలుచేసేవాడు. ఇవ్వలేనివారిపై రాజుతో అవాకులు చవాకులు చెప్పి శిక్ష వేయించేవాడు. ఈ ఆకృత్యమునకు లోనయిన వారిలో భాష్యాచార్యులు అనే పండితుడు కూడా ఒకడు. ఈయన  తన ఇంట్లో  అనేకులగు  విద్యార్థులకు  పేదలకు ఉచితముగానూ,ధనికులకు దక్షిణల ద్వారాను విద్యాబుద్ధులు గరిపేవాడు. అసలు శాస్త్రమే ఏమని చెబుతుందంటే
గురు శుశ్రూషయా విద్యా పుష్కలేన ధనేనవాI
అధవా విద్యయా విద్యా చతుర్థం నోపపద్యతేII 
అంటే విద్యను అభ్యసించే విషయంలో 1.గురువును సేవించి,సపర్యలు చేసి ,2.ఆయనకు సమ్మతమైతే పుష్కలమైన ధనమును ఇచ్చి ,3.తన దగ్గర ఉన్న విద్యను ఆయనకు నేర్పి ఆయన దగ్గర ఉన్న విద్య ను నేర్చుకోవడం  ఈ మూడు రకాలుగా తప్ప నాలుగో రకము లేదు అని.
భాష్యాచార్యులవారి గురుకులంలో యామునాచార్యుడు అనే విద్యార్థి ౘదువుకునేవాడు. యామునాచార్యులు పుట్టుకతోనే మహాప్రజ్ఞాశాలి. గురుకులంలో బాగా చిన్న వయస్సులోనే భాష్యాచార్యుల వారి పర్యవేక్షణలో సర్వశాస్త్ర పారంగతుడైనాడు. గురువుగారు ఏదయినా  పనిమీద బయటకివెళ్ళితే, నిర్వహణబాధ్యతను  యామునాచార్యులకు  అప్పగించి వెళ్ళేేవారు. ఒకసారి గురువుగారు బయటి వెడలిన సమయములో యామునాచార్యులు గురుకులమును  నిర్వహించుచుండినాడు. అప్పటికి అతని వయసు 12 సంవత్సరముల లోపే! 
కోలాహలుడు కర్ణాకర్ణిగా భాష్యాచార్యులు ఆయన పాండిత్యమును గూర్చి వినియుండినాడు. అయినా తనతో ఆయన వాదమునకు దిగలేదు కాబట్టి ఆయన పాండిత్యమును తృణప్రాయముగానెంచినాడు. అంతటితో ఊరుకొనక తన ఆధిపత్యమును చాటుకొనుటకు తన బంటును భాష్యాచార్యులవారి నుండి కప్పమును వసూలుచేసుకు రావలసినదిగా పనిచినాడు. గురువు లేదని చెప్పినా ధిక్కార స్వరముతో మాటలాడి గురుకుల విద్యార్థులను ఖిన్నులగావించినాడు. అప్పుడు యామునాచార్యులు ఓడినతరువాతనే కదా మేము కప్పము చెల్లించవలసినది మీ పండిత శ్రేష్ఠునితో వాదించుటకు నేను చాలు పద పోదామన్నాడు. అసలు విషయమేమిటంటే సాత్వికోత్తముడగు భాష్యాచార్యులవారు వుంటే ఈ వాడమునకు ఒప్పుకొనక కప్పమే కడుతానని చెప్పియుండేవారు. కొంత సమయము అందుకుగానూ అడిగియుండేవారు.
ఈ వార్త నగరమంతా ప్రాకిపోయింది. పండ్రెండు సంవత్సరముల బాలుడు కోలాహలునితో వాదించనున్నాడని తెలిసి నాగరికులు తండోపతండములుగా వాగ్వాదసమయమునకు సభామండపము చేరుకొన్నారు. ఆశ్చర్య చకితుడైన రాజు అన్నివిధములా వాదము వలదని నచ్చజెప్ప ప్రస్యత్నించినా యామునాచార్యులవారు వినలేదు. ఆసమయములో వేదశాస్త్ర విద్వన్మణియగు యామునుడు మధ్యందిన మార్తాండుడై అగుపించినాడు సభాసదులకు, ముఖ్యముగా మహారాణికి. ఆవిడ రాజుగారితో, పుంభావ సరస్వతిగా దోపు ఈ బాలుడు సామాన్యుడు కాదని నాకనిపించుచున్నది. ఈ సంవాదములో  విజయము ఈతనిదే అని నొక్కి పలికినది. రాజుకు కొలహలునిపైనే నమ్మకము. అందుచేత ఆ బాలుడు గెలిస్తే తన అర్ధ రాజ్యమును ఆతనికి పట్టము కడతానన్నాడు. కోలాహలునికి తగిన దండన ఇచ్చే అద్శికారమును కూడా యామునాచార్యునికే ఇస్తానన్నాడు. రాణి కూడా ఆవేశముతో కోలాహలుడు గెలిస్తే తాను రాణి పట్టమును త్యజించి దాసిగా శేషజీవితమును అంతఃపురములో గడుపుతాననింది.
యామునుని సుఖాసీనుని కమ్మని ఆసనము చూపించినాడు మహారాజు. కోలాహలుడు యామునుని అహంకారపూరితుడగు ఒక మూర్ఖ బాలకునిగానెంచి వాదము వలదన్నాడు. యామునుడు ససేమిరా అనుటతో వాదము మొదలైనది. ఇరువురికి హోరాహోరీగా వివిధ శాస్త్రాలలో వాదోపవాదాలుజరిగినాయి. పండితపరిషత్తు ఇద్దరిలో ఏఒక్కరినీ విజేతగా నిర్ణయించలేకపోయింది. చివరిగా ఇరువురికి వారి ఇష్టానుసారం తమ ప్రత్యర్థికి మూడుప్రశ్నలు వేయుటకు అవకాశం యివ్వబడింది. చెప్పలేక పోతే ఓడిపోయినట్లే! ఆస్థాన పండితుడన్న భయంతో పండితపరిషత్తు  అవకాశం ముందు కోలాహలుడికి కట్టబెట్టింది. అతడిప్రశ్నలన్నింటికి యామునుడు అలవోకగా సమాధానం చెప్పినాడు. రాజుగారికి, పండితపరిషత్తుకి, సభాసదులకి, ఆఖరికి కోలాహలుడికి కూడా యామునుని అతులిత ప్రజ్ఞాపాటవాలను చూసి అవాక్కయినారు.  ఆ బాలుడి అద్భత, అప్రతిహత ప్రతిభకు అక్కడివారందరికి  ఆశ్చర్యము, ఆనందము, ఆప్యాయత, ఆదరము, అనురాగము, అభిమానము కలబోసిన గౌరవము ఏర్పడింది.
ఇప్పుడు యామునాచార్యుడికి, విద్వజ్జన కోలాహలుడిని మూడుప్రశ్నలు అడిగే అవకాశంవచ్చింది. అప్పుడు వారిద్దరికి జరిగిన సంభాషణ యిది.:
యా: పండితవరేణ్యా! నేను ఇప్పుడు ఒకవ్యతిరేకార్థ వాక్యాన్ని, తరవాత రెండు అనుకూలార్థ వాక్యాలని చెపుతాను. మీరు ఆ మూడింటినీ ఖండించినారంటే నేను ఒడినట్లే! అట్లు కాదేని మీరు  ఓడినట్లే!
వి: 'ఓ! అలాగే! మొదటి వాక్యం చెప్పుమరి.' (అన్నాడు కోలాహలుడు జంకుతూనే)
యా: మీ తల్లిగారు గొడ్రాలు కాదు.
(ఈ మాటను ఖండిస్తే  తనతల్లి వంధ్య అని అంగీకరించినట్లేకదా! మరి  అపుడు తన పుట్టుక ప్రశ్నార్థకమౌతుంది. ఏమీ తోచక ... ఇట్లన్నాడు.)
వి: ఈలోగా నేను ఆలోచిస్తూంటాను. నీ రెండవ ప్రశ్న చెప్పు.
యా: ఈ రాజుగారు పుణ్యాత్ములు.
వి:మరి  మూడో ప్రశ్న కూడా అడుగు?
యా: ఈ రాణిగారు పతివ్రత.
విద్వజ్జనకోలాహలుడు, మొదటి ప్రశ్నకు అవుననలేక తదుపరి రెండు ప్రశ్నలకు కాదనలేక,  నిర్వీణుడై అవనత శిరస్కుడై ఉండిపోయినాడు.  పండిత పరిషత్తు యామునాచార్యులను విజేతగా ప్రకటించింది.
రాజుగారు యామునాచార్యులను ఈ విధముగా అభ్యర్థించినాడు.
రా: యామునాచార్యా! నీ నాలుకపై నలువ రాణి నాట్యమాడుచున్నది. నీ బుద్ధిని బృహస్పతి స్వంతము చేసుకొొన్నాడు. విష్ణువు నీ చిత్తమును ఆవహించియున్నాడు. మీ పాండిత్యము నిరుపమానము. దయతో మీ  ప్రశ్నలకు మీరే  శాస్త్ర ప్రమాణములతో సమాధానమిచ్చి మమ్ము సంతోషపరచండి.
యా: అలాగే ప్రభూ!
మొదటిది: విద్వజ్జనకోలాహల పండితవర్యుల తల్లిగారు వంధ్యకాదు అనేవాక్యం నేను కాదంటున్నాను. అంటే ఆమె గొడ్రాలే యనుచున్నాను. కారణం ఆయన తన  తల్లికి ఏకైకసంతానము. “ఏకపుత్రవతీ వంధ్యా” అంటున్నది శాస్త్రము. అంటే ఒకే కొడుకు కొడుకూగాడు ఒకకన్ను కన్నూ కాదు అన్న నానుడి ఉండనే ఉన్నది.  మహాభారతమునందలి ఉద్యోగపర్వము నందలి 147 వ అధ్యాయంలోని 18 వ శ్లోకం ఈ విధముగా చెబుతూవుంది
“ఏకపుత్రం అపుత్రం వై ప్రవదంతి మనీషిణః”
“ఒకే కొడుకు ఉన్నవాడు కొడుకులు లేని వానితో సమానమని  పండితులు అంటున్నారు” అని కదా దాని దాని అర్థము.
ఇక రెండవవాక్యమగు  'మహారాజుగారు పుణ్యాత్ములు' అన్న మాటను కూడా నేను కాదంటున్నాను. ఎందుకంటే వ్యక్తిగతంగా మీరెంత పుణ్యాత్ములైనా, శాస్త్రము
రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహితః ।
భర్తా చ స్త్రీకృతం పాపం శిష్యపాపం గురుర్వ్ర జేత్ ।।
అని చేబుతూవుంది.
కావున తన దేశ ప్రజలు చేసిన పాపము రాజుదే !
రాజు చేసిన పాపానికి పురోహితునిది లేక  మంత్రిది కూడా కావచ్చు బాధ్యత.
స్త్రీ చేసిన పాపానికి భర్తదే బాధ్యత. శిష్యుడు చేసిన పాపానికి గురువుదే బాధ్యత. కావున రాజు పుణ్యాత్ముడు కానేరడు.
మూడవ వాక్యము మహారాణిగారు పతివ్రతా అనుట సమంజసము కాదు.  మహారాజా! ఋగ్వేదమునందలి వివాహమంత్రములలో ఒకటి ఇలాగ అంటోంది:
సోమః ప్రథమో వివిధే, గంధర్వో వివిధ ఉత్తరఃI
తృతీయాగ్నిష్టే పతిః తురీయప్తే మనుష్యచౌఃII
అని వివాహ సమయము లో వరుడు స్త్రీతో అంటాడు. అంటే
"నిన్ను ప్రారంభ కాలంలో సోముడూ, తరువాత గంధర్వుడూ, ఆ తరువాత అగ్నీ ఏలినారు. నాల్గవ వానిగా నేను నిన్ను ఏలబోవుచున్నాను." అని అంటున్నాడు.
 "ఈ విషయమును  కాస్త విశ్లేషించి చెబుతాను." అని అంటూ ఈ విధముగా చెప్ప మొదలిడుతాడు.
 "అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలనాచూడవలసినది సోముడు (చంద్రుడు). ఎన్ని సార్లు చూసినా చంద్రుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో అలానే పసిపాపనుచూసినప్పుడు కూడా అదే భావన కలగటానికి కారణం చంద్రుని పాలన. కొంత వయసు వచ్చిన పిదప  "గంధర్వుని"కి అప్పగించి చంద్రుడువెళ్ళిపోతాడు.  ఆమెను ఇప్పుడు చంద్రుని సాక్షిగా గంధర్వుడుస్వీకరించినాడు. "లావణ్యవాన్ గంధర్వః" అన్నట్లు "గంధర్వుడు ఆమెలో అందాన్నిప్రవేశపెడతాడు. గంధర్వులు గాన ప్రియులు కనుక అందమైన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు." ఆ విధముగా  అందచందములనిచ్చి, ఆమెను  అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు వెళిపోతాడు. ఇప్పుడు ఆమెను గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరించినాడు. "అగ్నిర్వై కామ కారకః" అన్నట్టు అగ్ని ఆమె శరీరంలోకి కామ గుణాన్ని (కామాగ్ని) ప్రవేశ పెడతాడు. ఇలా *ఒక కన్య "చంద్రుని" ద్వారా "ఆకర్షణను," "గంధర్వుని" ద్వారా "లావణ్యతను", "అగ్ని" ద్వారా "కామగుణాన్ని" పొందుతుంది. పిమ్మట ఆమె వివాహమునకు యోగ్యురాలని భావించిన అగ్ని, ఆమెను తగిన పురుషునికిచ్చి  వెళ్ళవలెను కనుక కళ్యాణ సమయములో ఆమెను వరునికి ఇస్తాడు. అలా ఆమెను “అగ్ని సాక్షిగా” వరుడు స్వీకరిస్తాడు.
ఈ వివరణ విన్న మాహారాజు  పరమానందభరితుడై, యామునాచార్యులవారిని కౌగిలించుకొని, రాజ ప్రాసాదమున వుండజేసి ఆయన తలిదండ్రి గురువులను రప్పించి  తానుచెప్పినరీతిగా, ఒక శుభముహూర్తమున  యామునాచార్యులకి అర్ధరాజ్యమిచ్చి పట్టాభిషిక్తుని చేసినారు. విద్వజ్జనకోలాహలుడి అహంకారమడగుటచే ఆ పండితుడిని  గౌరవించి పంపినాడు యామునాచార్యులు.

యామునాచార్యుల యవ్వనం రాజభోగాలతో గడిచిపోయింది. వివాహమై పిల్లలు కూడా కలిగగినారు. తన జీవిత లక్ష్యాన్ని ఆయన మరచి సుఖాలకు బానిసైనారు. దీనిని గ్రహించిన గురువు శిష్యుని తనతో శ్రీరంగమునకు వచ్చుటకు పురిగొల్పి తన జన్మ కారణమును గుర్తుచేసినాడు. తదాదిగా యామునులు రంగనాథుని దివ్య చరణారవిందములకే తన జీవితమును అంకితము చేసినాడు.
వీరు  1.శ్రీస్తుతి 2.స్తోత్రరత్నం 3.గీతార్ధసంగ్రహం 4.ఆగమ ప్రామాణ్యం.5.సిద్దిత్రయం అన్న ప్రసిద్ధగ్రంధములను రచించినారు. రచనలలో చిన్నదైన శ్రీస్తుతిలో విష్ణువు ధర్మపత్ని శ్రీదేవిని స్తుతించారు. స్తోత్రరత్నం-ఇది మహావిష్ణువు గురించి 65 శ్లోకాల గ్రంథం. వైకుంఠంలో విష్ణు వైభవం, ఆ భగవంతని కొరకు జీవుడు అన్వేషణ, చివరికి నీవే శరణు అంటూ శరణాగతి చేయడం మొదలైన విషయాలున్నాయి. గీతార్ధసంగ్రహంలో భగవద్గీత సారంసం ముఖ్యంగా ప్రస్తావించారు.

ఆగమ ప్రామాణ్యముగా  దేవాలయ నిర్మాణము, విగ్రహ ప్రతిష్ఠ, ఆరాధన విధానము, సమగ్రముగా వివరించినారు.  సిద్ధాంతగ్రంధము  ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయ, సిద్ధాంతాలు ప్రస్తావించినారు.  వైష్ణవ మతప్రచారమునకు యామునాచార్యులు చాలా కృషి చేసినారు.
యామునాచార్యుల వారి గూర్చి తెలుసుకున్న శ్రీరామానుజాచార్యులు వారిని కలవాలనుకున్నారు. అలాగే శ్రీరామానుజాచార్యులవారే తన తరువాత
ఆచార్యపీఠాన్ని అధిరోహించాలనుకున్నారు యామునాచార్యులు. దురదృష్ఠవశాత్తు యామునాచార్యులు జీవించివుండగా వారిని శ్రీరామానుజాచార్యులు కలవలేకపోయినారు. అప్పటికే శ్రీరంగం బయలుదేరిన శ్రీరామానుజాచార్యులు అక్కడకి చేరుకున్న కొన్ని ఘడియలకే యామునాచార్యులు పరమపదించారు. యామునాచార్యుల వయస్సు అప్పటికి సుమారు 120 సంవత్సరములు.

అశ్రునయనములతో యామునాచార్యుల విగత దేహమును గాంచుతూ, ముడుచుకొని వున్న కుడిచేతి మూడువ్రేళ్లను గమనించినాడు. అందులో ఏదో పరమార్ధం వుందని
శ్రీరామానుజాచార్యులు ఆత్మజ్ఞానంతో యామునాచార్యుల అంతరార్ధం గ్రహించి ఈ విధముగా తన నిశ్చయమును బహిర్గతపరచినారు.
1.నేను వ్యాసమహర్షి రచించిన బ్రహ్మసూత్రాలకు శ్రీ వైష్ణవ సిద్ధాంతపరమైన రచన చేస్తాను- అన్నారు శ్రీరామానుజాచార్యులు. అంతే, ముడుచుకొన్న ఒక వ్రేలు పైకి లేచింది.
2. నేను ఆళ్వార్ల సంప్రదాయన్ని కాపాడుతాను- అనగానే యామునాచార్యుల రెండవ వ్రేలు తెరుచుకుంది.
3. నేను నా తర్వాత సమర్ధుడైన శిష్యునికి ఆచార్యపీఠాన్ని అప్పగిస్తా-అనగానే మూడో వ్రేలు కూడా తెరుచుకుంది.
ఇదంతాచూసిన అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయినారు.

అన్నప్రకారం శ్రీరామానుజాచార్యులు తన జీవిత కాలంలో నెరవేర్చి యామునాచార్యుల ఆత్మకి శాంతిని ప్రసాదించినారు. యామునాచార్యులకు 'ఆళవందార్' అన్న నామాంతరము కూడా కలదు.
స్వస్తి.

Saturday, 24 March 2018

కాలనేమి - కంసుడు


కాలనేమి - కంసుడు
https://cherukuramamohanrao.blogspot.com/2018/03/blog-post_24.html
శీర్షిక చూచినవెంటనే రామాయణ భాగవతములు అంతో ఇంతో ఎంతో కొంత తెలిసినవారికి ఇది ఏమి వీరు ఇరువురు వేరువేరు యుగముల వారు కదా అన్న సందేహము పొడచూపక మానదు. మొదటిది రామాయణ సంబంధితమయితే రెండవది భాగవత సంబంధమైనది. కంసుడు, త్రేతా యుగమున మాయలేడియై రామాయణమును నడిపిన మారీచుని కుమారుడగు కాలనేమి.
ఒక పర్యాయము మారీచ వృత్తాంతమును పునశ్చరణ చేసుకొందాము. మారీచుడు పుట్టుకతో రాక్షసుడు. తాటక అనే యక్షిణికి, సుందుని వల్ల కలిగిన వాడు. రామ లక్ష్మణులు ధనుర్థారులై కౌశిక యాగ సంరక్షణ చేస్తున్న సమయములో తన అనుచరగణంతో యాగవిద్వంసానికి వచ్చిన మారీచుని శ్రీరాముడు మానవాస్త్రంతో కొట్టగా, మారీచుడు నూరు యోజనముల దూరంలోనున్న దక్షిణ సముద్రంలో పడతాడు. అంతటితో అతను రాక్షస ప్రవృత్తిని విడనాడి పర్ణశాల నిర్మించుకొని తపోనిరతుడై జీవితమును సాగించుతూ ఉంటాడు. లక్ష్మణునిచేత ముక్కుచెవులు ఖండింపబడిన శూర్పణఖ చేత ప్రేరేపింపబడిన రావణుడు మారీచుని సహాయమర్థించుతాడు. రాముని పరాక్రమును గూర్చి తెలుపుతూ
రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ
రత్నాని చ రథాశ్చైవ త్రాసం సంజనయన్తి మే      
*రాముడంటేనే కాదు, ‘ర’ అనే అక్షరంతో ప్రారంభమయ్యే రత్నాలు, రథాలు లాంటి  ఏ మాటవిన్నా భయం కలుగుతోంది. ఈ దండకారణ్యంలో ఏ వృక్షాన్ని చూసినా జటా వల్కలాలు ధరించిన శ్రీరామునిలా కనిపిస్తున్నాయి. ఆ రాముడు నన్నూ నిన్నేకాదు, మన పూర్వీకులైన బలి, నముచి వంటి మహావీరులను కూడా చంపగల సమర్థుడు. కనుక... సీతాపహరణ ప్రయత్నం మానుకో’ అంటూ హృదయపూర్వకమైన సలహా ఇస్తాడు మారీచుడు. పైగా
 రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమః ।
 రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ ॥ 13
శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు, సాధు మూర్తి, నిరుపమాన పరాక్రమశాలి. దేవతలకు ఇంద్రునివలె అతడు సమస్తలోకములకును ప్రభువు అని కూడా చెబుతాడు. రావణుడు ‘ సహకరించుతావా? చంపమంటావా?’ అనుటతో రాముని చేతనే చావనెంచి మాయలేడియై మరణించుఁతాడు రాముని చేతిలో!
ఆ మారీచుని కుమారుడే ఈ కాలనేమి.
అసలు ఈ కాలనేమి వృత్తాంతమునకు పూర్వము మన వేదములు ఏమి చెబుతున్నవో చూద్దాము. వేదములు కర్మ ప్రతిపాదనచేసి, దాని పరిపక్వత మోక్షము అని చెప్పినవి. నిష్కర్మ స్థితిని చేరేవరకు మానవుడు పునరపి జననం పునరపి మరణంఅన్న వాక్యమునకు కట్టుబడి ఉండవలసిందే! ఇది మానవులకే గాక రాక్షసులకు కూడా తప్పదు. అమృతము త్రాగేవరకు దేవతలు కూడా ఈ కోవకు చెందినవారే! 
ఈ కర్మ సూత్రమును మూలముగా కొని కాలనేమి మరియు కంసుని గూర్చి తెలియజేయుచున్నాను. మనకు హిరణ్య కశిపుని గూర్చి ప్రహ్లాదుని గూర్చి తెలుసును గానీ హిరణ్యాక్షుని గూర్చి, విష్ణువు వరాహావతారియై ఆతనిని మట్టు పెట్టింది తప్ప మిగతా వివరములు పెద్దగా తెలియవు. ఇపుడు ఆ విషయమును కాస్త తెలుసుకొందాము.
హిరణ్యాక్షుని కుమారులు కాలనేమి అంధకులు. అంధకుని ఇంద్రుడు వధించుతాడు. క్షీరసాగర మధన సమయమున విష్ణువు కాలనేమిని వధించుతాడు. కానీ రాక్షస గురువు శుక్రాచార్యుడు ఆతనిని తన సంజీవకరణి విద్యచే బ్రతికించుతాడు. పిమ్మట కాలనేమి బ్రహ్మను గూర్చి తపస్సుచేసి దేవతలచే చంపబడకుండా వరము పొందుతాడు. దేవీ భాగవతంలో ఈ రహస్యమును గూర్చి మనకు తెలియవస్తుంది.
కాలనేమికి ఆయన కుమారులకు ఒక లంకె వున్నది. అది ఏమిటి అన్నది తెలుసుకొందాము. పూర్వం మరీచి, ఊర్జా దేవి అనే యిద్దరు దంపతులు ఉండేవారు. మరీచి సప్తర్షులలో ఒకడు. వారిరువురికీ  ఆరుగురు పిల్లలు కలిగినారు. వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. ఈ ఆరుగురు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మ సభకు వెళ్ళటం తటస్థించింది
వారు బ్రహ్మ కూర్చుని ఉండగా నిష్కారణంగా  నవ్వటము  జరిగింది. బ్రహ్మ ఆ అకారణ హాస్యమునకు కుపితుడై  ‘మీరు రాక్షసుని కడుపున పుట్టండి’ అని శపించటము జరిగింది. అందువలన వారు ఆరుగురు  ‘కాలనేమి’కి కుమారులుగా జన్మించినారు.  కాలనేమి పుత్రులుగా వున్న కాలములో బ్రహ్మను గూర్చి తపమాచరించి తమ విరోధులగు ఇంద్ర ఉపేంద్రాది(ఉపెంద్రుడు అంటే విష్ణువు. కశ్యప అదితుల సంతానముగా ఇంద్రుని తమ్ముడగు వామనునిగా పుడతాడు) దేవతలచే మరణము లేనట్లు వరమును పొందినారు.  అపుడు హిరణ్యాక్షునికి కోపం వచ్చింది. తాను యింకా తపస్సు చేసి దీర్ఘాయువును పొందకమునుపే  తన మనవలు పొందుట సహించలేక వారికి నిద్దురలోనే మరణము సంప్రాప్తించునట్లుగనూ, తదనంతర జన్మలో (ద్వాపరములో) వారారుగురూ  తమ తండ్రి మేనల్లుళ్ళు గా జన్మించి, తండ్రి  కంసునిగా జన్మించి వారిని చంపునట్లును శపించుతాడు. ఆ శాప విమోచనం జరిగి, వారు తిరిగీ  బ్రహ్మజ్ఞానులైపోతారు. అందువలన  నారదుడు వారికి శాప విమోచన కర్తయగుతాడు. ఇది దేవీ భాగవతాంర్గతం. కృత ద్వాపరాలకు నడుమ త్రేతా యుగమున్నది. అందు కూడా కాలనేమి అదేపేరుతో రావణుని మేనమామ యగుతాడు. రావణ సంరక్షణార్థము హనుమంతుని మోసగించబోయి ఆయన చేతనే  వధింపబడుతాడు. తదుపరి జన్మమే కంసుడు. కంసుడు కృష్ణునిచేత ఏవిధముగా చంపబడినది అందరకూ తెలిసిన విషయమే. 
ఇపుడు కాలనేమిఅన్న పేరును గూర్చి కాస్త విశ్లేషించుదాము. నేమి అనగా చక్రము అన్న అర్థమును గ్రహించవచ్చును. కాలనేమి అనగా కాల చక్రము అని అర్థము చేసుకొనవచ్చును. దీనికి ఆకులు (spokes) వుంటాయి. మరి కాలచక్రమునకు ఆకులు ఋతువులే కదా! ఇక్కడ అంతరార్థము ఏమిటంటే పరమాత్మ యగు విష్ణువు కాలము ను తన అదుపులో వుంచుకొని యుంటాడు. అది ఆయనకే సాధ్యము. అందువల్లనే కాలమునకు ప్రతీకయైన ‘కాలనేమి’ శ్రీహరితో తలపడి జన్మ జన్మాన్తరాలలో అసువులు బాయుచునే వుండిపోయినాడు. ఇక్కడ కాలనేమి అన్న మాటను వేరొక విధముగా కూడా విశ్లేషించవచ్చును. ‘కాల’ అన్న మాటకు ‘నలుపు అన్న అర్థము కూడా కలదు సంస్కృతములో! కాల చక్రము అన్నపుడు నలుపును చేరబోవుచున్న చక్రముయొక్క భాగము. అంటే రానురనూ ద్వాపరము కలిలో ప్రవేశించ బోతున్నది అని అర్థము(అసలు కాలనేమిప్రతియుగాములోనూ జన్మమేత్తుచునే వచ్చినాడు కావున అతను కాలము తదుపరి యుగమును చేరుటకు సంకేతమై నిలచినాడు.). మరి కంసుడు కదా ద్వాపరములో వుండినది అన్న సందేహము వెంటనే కలుగుతుంది. అదే చెప్పబోతున్నాను. కంసము అంటే వెడల్పు మూతి గల గిన్నె. ఇది కూడా వృత్తాకారమే! మరి కంసుడు కాలనేమియే కదా! కావున కంసునిగా కాలనేమి, దేవకీ గర్భమున జనించిన, పూర్వ జన్మములోని తనకుమారులను సంహరించి వారికి బ్రహ్మత్వమును ప్రసాదించి తాను మానవ రూపధారియగు కృష్ణుని చేతిలో మరణించినాడు.
ఇందుమూలముగా మనకు తెలియవచ్చినది ఏమిటంటే కాలము పరమాత్మను అనుసరించవలసిందే! మనము కాలనుగుణముగా నడచుకొన వలసినదే! కానీ ఆ కాలాధిపతి కరుణ మనము పొందగలిగితే కాలము యొక్క వికృత రూపము మనము చూడనవసరము ఉండదు.
స్వస్తి.

Thursday, 15 March 2018

దక్షిణామూర్తి స్తోత్రము

 

దక్షిణామూర్తి స్తోత్రము

https://cherukuramamohanrao.blogspot.com/2018/03/blog-post_40.html

జగద్గురువులు ఆది శంకరులవారు సాక్షాత్తు శంకర స్వరూపులు. వారు కేవలము ధర్మ రక్షణము లోక హితమునకు అవతరించిన దక్షిణా మూర్తియే నేమో! ఆయన భూమిపైనున్న 32 సంవత్సరముల కాలములో ప్రస్తాన త్రయము అనగా బ్రహ్మ సూత్రములు ఉపనిషత్తులు
, భగవద్గీతలకు మనోహరము, సువిపులము నగు భాష్యమును వ్రాసినారు. సంసారబంధమును పోగొట్టుకొనుట, ఆనందరూపమగు మోక్షమును పొందుట ఆస్తికులందరికిని అవసరమే గనుక మందాధికారులకు గూడా సకల వేదాంత సిద్ధాంతసారం తెలియుటకు కొన్ని వేదాంతస్తోత్రములను కూడా రచించినారు. అందులో అతి ముఖ్యమైనది దక్షిణామూర్తి స్తోత్రము. దీనిని అద్వైతామృత కలశ స్వరూపముగా భావించ వచ్చును. పామరుడనైన నేను పరమ పావనులైన కామకోటి పీఠము వారు అనుగ్రహించి అందించిన ఈ స్తోత్ర సారము నా ప్రయత్నమునకు ఆలంబనము. మీకు  తప్పులేవి కనిపించినా అవి నావల్ల కలిగినవని తెలియ ప్రార్థన. దాసుని దోసము దండముతో సరి.

1.        మౌనవ్యాఖ్యాప్రకటిత పరబ్రహ్మ తత్వం యునానం

    వర్షిష్ఠాన్తే వసదృషి గణైరావృతం బ్రహ్మనిష్ఠైః l

    ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర మానందమూర్తిం

    స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే ll 

బ్రహ్మనిష్ఠా గరష్ఠులగు గురువుకన్నా వయోధికులు మరియు పరమ శ్రేష్ఠులైన ఋషి గణములచే,పరివేబ్రహ్మనిష్ఠా గరష్ఠులగు గురువుకన్నా వయోధికులు మరియు పరమ శ్రేష్ఠులైన ఋషి గణముల చేత, పరివేష్ఠితుడై, చేతి వ్రేళ్ళచే  చిన్ముద్రను కలిగి, అంతర్ముఖుడై తనయందే రమించుచున్న  ఆనంద మూర్తియై వికసిత వదనుడై, ప్రభవించు గురుశ్రేష్ఠుడగు దక్షిణామూర్తిని  స్తుతించుచున్నాను.

ఆ పరమాత్మకు, మనము పెట్టుకొన్నవే కానీ నిజానికి ఏపేరు లేదు. పేరు లేకపోతే సంబోధన ఎక్కడనుండి వస్తుంది. అందుకే గురువు గారికి ఆ మౌనము.

శబ్దములు 4 విధములు. అవి పశ్య, పర, వైఖరి, మధ్యమ. ఆ పరమాత్మను కీర్తించుటకివి చాలవు. పైగా శబ్ద-స్పర్శ-రస-రూప-గంధ-లింగ-అనుమానాది ప్రమాణములచే ప్రతిష్ఠించలేము. అందుకే మౌనము.

అందుచేత, అవాఙ్మానస గోచరమగు పరమాత్మను మౌనము చేతనే ప్రబోధచేయవలయునని , జ్ఞానముద్రను చూపించుచు మౌనముగా నుండిరి. ఆ మౌనస్థితియే శిష్యులకు పరబ్రహ్మతత్వమును ప్రబోధించుట. ఆ మౌనస్థితియే శిష్యులందరు గుర్వనుగ్రహము వలన పరబ్రహ్మతత్వమును స్పష్టముగా తెలిసికొని సంశయమును పోగొట్టుకొనుట.

జ్ఞానముద్ర జీవబ్రహ్మలకు ఏకత్వమునుచూపించును. ఈ యర్ధమునే :

శ్లో. చిత్రం పట తరోర్మూలే వృద్ధాశ్శిష్యా గురుర్యువాl

గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్నసంశయాఃll అను శ్లోకముకూడా చెప్పుచున్నది.

2వ శ్లోకమును గూర్చి రేపు తెలుసుకొందాము.......

22. శ్లో. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం|

పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా|

యస్సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మాన మేవాద్వయం |

తస్మై శ్రీగురుమూ ర్తయేనమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||

 

ఈ చరాచర ప్రపంచమునంతా , ఆత్మ చైతన్యమయిన తనలో లీలా మాత్రంగా, స్వానుభవంగా, స్వాత్మగా, అద్దంలో కనిపించే నగరంవలె, తన

కంటే భిన్నంగా ఉందన్న భ్రమకలిగించే విధముగా విశ్వమునే ఉదరమందు కలుగుతూ, మనకు దానిని వెలుపల ఉన్నట్లుగా తన మాయచే కనిపింపజేసే  జగద్గురువైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కృతులు అన్నది అతి సామాన్యార్థము.

సామాన్య మానవులమగు మనము, అద్దమునందు; ప్రతిబింబించగా చూడబడుచున్నపట్టణముయొక్క మిథ్యా బింబమువలె మన అంతర్గతమునందు ఏప్రకారముగా; నిద్రాదోషముచేత అనగా స్వప్నావస్థయందు; అనేక రకములగు ప్రాపంచవిషయములను కల్పితమైనను, బైటయున్నట్లుగా భ్రమపడుచున్నాము.

కానీ సకల ప్రపంచమునకు అధిష్టానము సచ్చిదానందరూపుడగు పరమాత్మయే గనుక అట్టి పరమాత్మయందే ఆరోపితమగు ఈ ప్రపంచ మున్నది యని అర్థము. అట్టి నిజాంతర్గతమగు విశ్వము భూతభౌతిక రూపమున సకల ప్రపంచముగను; ఆ ప్రకారముగా, పరమాత్మయందు; సత్వరజస్తమోగుణాత్మకమైన ఆవరణ, అజ్ఞానముచేత కల్పితమైన నప్రపంచమును; బైట; అవిర్బవించిన దానివలె (ఉన్నదానివలె); చూచుచున్నవాడై; ఎవడు; గురువులచేత ఉపదేశింపబడిన మహావాక్యముల వలన కలిగిన అఖండ బ్రహ్మ సాక్షాత్కారకాలమందు; రెండవది లేని అనగా అద్వితీయమగు, అనగా బ్రహ్మ పాక్షాత్కారముచే, అజ్ఞానము నశించును గనుక అద్వితీయమగును. అట్టి అద్వితీయమైన సచ్చిదానందరూపమగు; ప్రత్యగ్బ్రహ్మ స్వరూపమునే, సచ్చిదానందాత్మకమగు బ్రహ్మను నేనైతినని; అపరోక్షముగా తెలుసుకొనుచున్నాడో; అటువంటి; శ్రీ గురుమూర్తియే బ్రహ్మరూపుడై, దేశకాల వస్తు పరిచ్ఛేదరహితుడైన జ్ఞానమునుపదేశించుపురుషుడు, అట్టి స్వరూపుడై దక్షిణదిక్కుకు

అభిముకముగానున్న; అనగా దక్షిణదిక్కును చూచుచున్న శరీరముకల దక్షిణామూర్తికి  నమస్కారము.

శ్రీ గురుమూర్తయే, శ్రీ దక్షిణామూర్తయే అను పదములకు మరి యొక అర్థము-శ్రీఅనగా శ్రీమంతుడు అనగా సర్వ శుభములకు సకల సుఖములకు సిరి సంపదలకు  ఆలవాలమైన సచ్చిదానందరూపమౌ; గుర్వీ=అతి గొప్పదైన: మూర్తిః=స్వరూపము; యస్యసః = శ్రీగురుమూర్తిః, శ్రీ గురుమూర్తియనగా సచ్చిదానందస్వరూపుడని యర్థము. శ్రీ దక్షిణామూర్తయే శ్రీ- అనగా అనాదియగు, అచింత్యమగు, మాయాశక్తియని అర్థము; అట్టి మాయాశక్తిచేత; దక్షిణ=సృష్టి స్థితి లయముల యందు నిపుణుడు అని యర్థము. శ్రీ దక్షిణామూర్తయే అన్నపుడు అకారప్రశ్లేషచేత; అమూర్తయే అని అర్థము వచ్చును. అనగా సృష్టిస్తితిలయములకు కారణభూతుడై కూడా అమూర్తి యనగా మూర్తిలేని వాడు, అనగా నిర్వికారుడై యున్నాడు అని అర్థము.

శంకరులవారు ‘బ్రహ్మ సత్యం జగన్మిధ్య’ అని చెప్పనే చెప్పినారు. ఆ జ్ఞానమును రానురానూ సంపాదించితే మనము భ్రమ నుండి బయట పడగలము. 4,5 సంవత్సరముల వయసులో ఆడుకొన్న బొమ్మలు ఆటలు 14, 15 సంవత్సరముల వయసులో ఆడము. ఈ వయసులో ఆటలు అంటే బ్యాటులు (Bats) వస్తాయి చేతికి మరి పాత బొమ్మలతో ఆడవే అంటే అసేదో పిల్లతనము అంటాడు. 24,25 సంవత్సరములు వచ్చి పెళ్ళయిన తరువాత ఈ ఆటలు ఉండవు. అంటే పరిణతి పెరిగింది. సహజముగా పెరుగుతూ పోయే ఈ పరిణతికి హద్దు ఉంటుంది. అందుకే వయసు ఉన్నపుడే తత్వ జిజ్ఞాస ఏర్పడితే సాధనా బలముతో పరమాత్మ పరిచయము చేసుకొనవచ్చును.

మరొకమారు  మరియొక శ్లోకముతో.......

3.      బీజస్యాంత రివాంకురో జగదిదం ప్రాఙ్‌ నిర్వికల్పం పునః

       మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతమ్‌ l

       మాయావీన విజృంభయత్యపి మహా యోగీవ యః స్వేచ్ఛయా

       తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ll

ఈ అనుభవంలోనున్న ప్రపంచమంతయు, సృష్టి కంటె పూర్వమందు, నిర్వికల్పము అనగా భోక్త, భోగ్యము, కర్త, కార్యము అనువిషయములకు అతీతమై అనగా  వికల్పరహితమై (ఆకారము లేనిదై) పరమాత్మ స్వరూపముగానే, ఉండెను, మరి అది ఎట్లు సాధ్యము అంటే విత్తనములోపల, ఆకులు పుష్పములు, కాయలు, కొమ్మలు, ఊడలు మొదలగు ఆకారముతో కూడిన గొప్ప పరిమితిగల వృక్షమంతయు మొక్క రూపములో, పుట్టుటకు ముందు అనగా మనము గమనించుటకు ముందు, స్థూలాకారములేని కారణమగు బీజరూపముగా నుండెనని యర్థము. అటులనే ప్రపంచమంతయు సృష్టికి పూర్వమందు, ఈ  సృష్ఠికే కారణమగు పరబ్రహ్మ రూపముగా నుండెనని యర్థము. తిరిగి, సృష్టిసమయమందు, ‘మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం’, మాయా అనగా ఈశ్వరుని ఆశ్రయించిన మాయచేత, కల్పిత అనగా కల్పింపబడిన, దేశకాలముల ‘కలనా’ సంబంధము చేత, వైచిత్ర్య చిత్రీకృతం అనగా నానారూపమగు విచిత్రస్వరూపముతో; అనేక భేదములచేతను అనేక ఆకారములచేతను పరస్పర భిన్నముగా చేయబడినది. కుమ్మరి తనుగాక మట్టి మొదలగు సాధనములతో ఘటాది కార్యములను చేయుచున్నట్లు మనకు అనుభవసిద్ధమై యున్నది. ఇతర సాధనలులేని పరమేశ్వరుడు విచిత్రమగు ప్రపంచమును ఎటుల సృష్టించును అనే ప్రశ్నకు సమాధానం చెప్పుచున్నారు. ‘మాయావీవ విజృంభ యత్యపి మహాయోగీవయ స్స్వేఛ్ఛయా’ అనగా లోక ప్రసిద్ధమైన ఐంద్రజాలికునివలె; గొప్పయోగివలె; తన సంకల్పమాత్రము చేతనే; యః=ఏ పరమేశ్వరుడు, ఇదం=ఈజగత్తును; విజృంభయతి=సృష్టిస్తున్నాడో; తస్మై=ఆ; శ్రీగురుమూర్తయే=గురుమూర్తి అయిన; శ్రీ దక్షిణామూర్తయే=శ్రీదక్షిణామూర్తికి, నమః=నమస్కారము.

ఈ శ్లోకమునకు విశ్లేషణ మొదలుపెడితే తుదికి చేరేలోపే జీవితము తుది చేరుతుంది. అందుకు నా పరిపక్వత లేమి కూడా దోహదమైనది. అందుకే ఈ క్లుప్తతను అనుసరించినాను. మహా వాక్యములు నాలుగు ఉన్నవని అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ నాలుగు ఏవి అన్నది కొందరికి తెలిసియుండక పోవచ్చు. ఆ నాలుగు వాక్యాలు ఏవన:

1.  'ప్రజ్ఞానం బ్రహ్మ (प्रज्नानम ब्रह्म)' అనగా అత్యున్నత జ్ఞానమే బ్రహ్మము - ఐతరేయోపనిషత్తు -           ఋగ్వేదము

2.'ఆహం బ్రహ్మాస్మి (अहम ब्रह्मास्मि)' అనగా నేనే బ్రహ్మము - బృహదారణ్యకోపనిషత్తు -యజుర్వేదము

3. 'తత్ త్వమసి (तत्त्त्वमसि)' అనగా అదే నేను - ఛాందోగ్యోపనిషత్తు - సామవేదము

4. 'అయమాత్మా బ్రహ్మ (अयमात्मा ब्रह्म)' ఈ ఆత్మే బ్రహ్మము - మాండూక్యోపనిషత్తు - అధర్వణవేదము

ఇవి చూచుటకు నాలుగు వాక్యములు, కానీ ప్రతి మహావాక్యానికి ఒకదానికొకటి లంకె కలిగి చివరకు అన్నీ అహం బ్రహ్మస్మి లో లీనమైపోతాయి. ఆ స్థాయి చేరిన సాధకుడు, తానే పరమాత్మయౌతాడు. తరువాత ఏమున్నది, ‘సర్వం మిధ్య’ యే!

మొదటి వాక్యానికి ‘జీవాత్మయే బ్రహ్మ’ అని అర్థము. రెండవ వాక్యమునకు జ్ఞాన స్వరూపమే పరమాత్మ అని అర్థము. మూడవ వాక్యమునకు ‘నీవే ఆ బ్రహ్మము’ అని అర్థము. నాలుగవ వాక్యమునకు ‘నేనే ఆ బ్రహ్మము’ అని అర్థము.

ఎప్పుడయితే మనలోని బుద్ధి ఎంతగానో వికసించి జ్ఞాన వంతులమయినపుడు ఆ జ్ఞానమే పరబ్రహ్మ అని తెలుసుకొనగాలుగుతాము. అంటే బ్రహ్మముఅన్నది జ్ఞాన స్వరూపము. అప్పుడు అందులో జ్ఞాత అయిన జీవుడు జ్ఞేయమైన జగత్తు ఆ పదార్థము యొక్క రెండు కొసలు. ఈ రెండు కొసలు జ్ఞానములోనే ఉన్నాయి కదా.! ఒక పంచకు చివర  సరిగె అంచులు సమాంతరముగా ఉన్నా అవి పంచేలోని భాగమే! కావున ఈ రెండు కోసలూ పంచెలో లయమాయి ఉన్నాయి. అప్పుడు జ్ఞానమనే ఆ పంచె అఖండము. ఆ ఎరుకనే ప్రజ్ఞానము అన్నారు. 

ఇప్పుడు ఆయమాత్మానం బ్రహ్మ మరియు తత్వమసి అన్న రెండు మహావాక్యాలను తీసుకొందాము.

అయమాత్మా లో ఈ అయం అనగా జీవ భావము, ఆత్మానం అంటే ఆత్మ అంటే ఆత్మా రూపములో మనలోన ఉన్నదానిలో, లయమైపోతూ ఉంది.  అంటీ జీవ భావము ఆత్మలో లయమై పోయింది. కావున నశ్వరము లేని ఆత్మయే బ్రహ్మ. ఇక తత్వమసి అన్న మహా వాక్యమును తీసుకొందాము. ఈ వాక్యము 'స య ఏషోణిమా ఐతదాత్మ్య మిదగ్ం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి' అన్న మంత్రములోని చిన్న ఖండము. పై మంత్రము లోని 'ఐతదాత్మ్య మిదగ్ం సర్వం' అంటే ఈ సమస్త ప్రపంచమూ బ్రహ్మమేనని. జగద్భావమును త్రోసిపుచ్చుచున్నది. ఈ విధముగా జీవజగాత్తులు రెండూ అవాస్తవమే  అనియు, ప్రజ్ఞాన స్వరూపమైన బ్రహ్మమేయని ఈ మూడు వాక్యములు చెప్పుటతో, ఈ బ్రహ్మము పరోక్షమా! అపరోక్షమా! అన్న ప్రశ్న ఉదయించుతుంది. పరోక్షము అనుకొంటే అది కేవలము సిద్ధాంతమును ప్రతిపాదిన్చినట్లవుతుంది కానీ అనుభవము లోనికి రాదు. అనుభవమునకు రాకుంటే ఈ సమస్యకు పరిష్కారమేదీ! ఆ పరిష్కారమే నాలుగవ వాక్యమగు 'అహం బ్రహ్మస్మి' ని చాటుతూ ఉంది. కాబట్టి ఆత్మా అనయము కాదు 'బ్రహ్మమే' ! ఇక్కడ నేను వాదనాపూర్వకమైన వాస్తవమును తెలియజేసినాను కానీ అది అనుభవపూర్వకము కాదు. దానికి నిరంతర సాధన అవసరము. ఆ సాధనకు సోపానము ఈ శ్లోకము.

రేపు మరొక శ్లోకముతో..........

4.  యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్ధగం భాసతే

    సాక్షాత్తత్వ మసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్‌ l

    యత్సాక్షాత్కరణాద్‌ భవేన్న పునరావృతి ర్భవాంభోనిధౌ

    తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ll

 

స్వతః సత్తా ప్రకాశము లేని జడమైన జగము, ఎవని అనుగ్రహము చె సత్తాస్ఫురణలు కలిగి భాసించుచున్నదో, ఎవరు ‘తత్-త్వం-అసి’ అను మహావాక్యోపదేశమును

చేసి తనను ఆశ్రయించిన ముముక్షువులను కృతార్థులను చేయుచున్నాడో, ఎవరిని సాక్షాత్కరించుకొనుట వలన సంసారమున (జనన మరణములనొందుచూ

సుఖదుఃఖముల ననుభావిన్చుచూ గమనాగామనములను జేయుట) నుండ

నవసరము లేదో అనగా జన్మ రాహిత్యము ప్రాప్తమగునో ఆ సద్గురు దక్షిణామూర్తికి నమస్కారము.

ఈ సత్వ రూపుడగు ఏ పరమాత్మ సత్త (Existence Absolute) అసత్ కల్పములగు

నామరూప ప్రపంచములుగా భాసిన్చుచున్నదో, అనగా చైతన్యము నందే స్వీయ ప్రభావము చేతనే స్ఫూర్తిని పొందుచున్న నామరూపములు, తాత్వికముగా అసద్రూపములు గావు, అని ‘తత్వమసి’ యను వేదవాక్యమును,  విచారణ చేసిన తేలియునని, ఈ భావమును సాక్షాత్కరించుకొనిన (అపరోక్షానుభూతినంది) వానికి పునర్జన్మ కలుగదని బోధించు సద్గురు దక్షిణామూర్తికి నమస్కారము.

అద్వైతసిద్ధాంతమందు, జగత్తు మిధ్య.  ఆత్మ సత్యము. ఆత్మ ప్రకాశముచేతనే ప్రకాశము గోచరించుచున్నవని చెప్పెదరు. జగత్తుకు ఆ స్వయంప్రకాశక శక్తి లేదు. జగత్తుకు ఒకవేళ ఆ గుణమే ఉండి ఉంటే  అది కూడా ఆత్మవలె ఉత్పత్తినాశము రహితముగా ఉండిపోయేది. ఆత్మకు కారణములేనట్లు జగత్తునకు కూడా కారణము లేక యుండెడిది. ఆత్మ స్వయం ప్రకాశమానముగా అవస్థాత్రయము అనగా  జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలయం దున్నట్లు, జగత్తుకూడా స్వయంప్రకాశ మానముగా గోచరించియుండేది.  మరి జగత్తుకు ఆ గుణము లేదు కదా!

అయితే మరియొక ప్రశ్న. పరమాత్మయందు ప్రపంచము కల్పితమయినయడల ఇతర కారణసంబంధము లేకుండానే ప్రతివస్తువు తయారై కనిపించవలయును. స్వప్రకాశమాన మయిన ఆత్మయందే కల్పింపబడుచున్నది గనుక. ప్రపంచమునకు అధిష్ఠానగు పరమాత్మ సంబంధం యెల్లపుడు వుండును గనుక. అందరికిని సర్వకాలములయందు ప్రపంచం ఏల గోచరించదు. ఈ విషయములో సమాధనము,  అధిష్ఠానమనగా, ఆరోపితమునకు మూలమగు అజ్ఞానముచే నావరింపబడినది యని అర్థము. అంటే పరమాత్మ ప్రపంచమునకు మూలమగు అజ్ఞానముచేత ఆవరింపబడియున్నది. ఆ అజ్ఞానపు పొరలను, తెరలను చేదించిన గాని మనకు పరమాత్మ తత్వము బోధపడదు.

ఈ పరమాత్మ తత్వమును నేను అర్థము చేసుకొన్న రీతిలో మీముందుంచే ప్రయత్నము చేస్తాను. మొత్తం పరమేశ్వరునియొక్క లక్షణం ఐదువేళ్ళల్లో ఉన్నదని  పెద్దలు చెబుతారు. అవి ఏవంటే:

అస్తి భాతి ప్రియం రూపం నామ చేత్యంశ పంచకంl

ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయంll

అనగా అస్తి, భాతి, ప్రియం, నామం, రూపం ఈ ఐదింటినీ అంశ పంచకమంటారు. ఈ అంశ పంచకము పరమాత్మకు అనుబంధమైనది.

పరమాత్మ, స్వతహాగా నామ రూపములు లేనివాడయినా, మనము ఇష్ట పడిన ఒక పేరును, ఆయనను సంబోధించుటకు గానూ ఉంచుకొంటాము. తరువాత ఆ పేరుకు తగిన లక్షణములు గల విగ్రహము చూడ నిచ్చగించుతాము. విగ్రహము చూచుటతో మన తలంపు నెరవేరినది. వీటి వెనకాల ఉండే అస్తి, భాతి, ప్రియం అనేవి ఆ మూర్తి రూపములో ఉన్న బ్రహ్మవి. అంటే అస్తి భాతి ప్రియానువర్తి యైన ఆ పరబ్రహ్మము నామరూపములతో భాసిస్తూ ఉన్న జగత్తుయందు లీనమైయున్నాడు, నిజానికి ఆయనకు నామము, రూపములు లేవు. నామరూపాత్మకమైన జగత్తును చూస్తున్నాము కానీ దానికి ఆధారమైన అస్తి,భాతి, ప్రియం(సత్తు, చిత్తు, ఆనందం) అన్న లక్షణములకుఉనికియైన వాడు ఆ పరమాత్మ. ఆయన  ప్రకాశస్వరూపుడు, ఆనందస్వరూపుడు. అస్తి అన్నది ఆయన ఉనికిని తెలుపుతుంది. చిటికెన వేలునుంచి లెక్కిస్తే అస్తి, భాతి, ప్రియం, నామం, రూపం – (బొటన, చూపుడు). మన లక్ష్యం అస్తిభాతిప్రియములు. అందుకు నామరూపములను ఉపసంహరించి అస్తిభాతిప్రియములను(చిటికెన, ఉంగరంవేలు, మధ్య వేలు) చూడు. స్ఫురణశక్తియైన చైతన్యమే ఎదురుగా రూపం ధరించి అనుగ్రహంతో ఉన్నది. ఆయన స్వాత్మారాముడు. తనయందు తాను ఆనందించువాడు, రమించువాడు, క్రీడించువాడు.

"ఒకపరి జగముల వేలినిడి ఒకపరి లోపలి గొనుచు ఉభాయము తానై" అన్నాడు మహాభక్త పోతన. సర్వపరిపూర్ణునకు వెలి ఏడ? లోనేడ?” అన్నాడు అచంచల హరిభక్తుడు అన్నమాచార్యులు. అందుకే ఆయన పూర్ణుడు. అందువల్లనే ఆయన ఆత్మా రాముడు, ముదిత వదనుడు. అట్టి దక్షినామూర్తికి నమస్కరించి మరియొక శ్లోకము వద్దకు చేరుకొందాము.

రేపు మరియొక శ్లోకము.......

5. నానాచ్ఛిద్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం,

జ్ఞానం యస్యతు చక్షురా కరణద్వారా బహిస్పందతే

జనామీతి తమేవ భాన్తమనుభాత్యేతత్సమ స్తంజగత్‌

తస్మై శ్రీగురుమూర్తయేనమ ఇదం శ్రీదక్షిణామూర్తయేll

అనేక రంధ్రములతో కూడిన, కుండయొక్క, లోపల,ఉన్నటువంటి, పెద్దదీపముయొక్క, వెలుతురువలె, ప్రకాశించుచున్న, ఏపరమేశ్వరునియొక్క,  నవరంధ్రములతో కూడిన శరీరమందున్న అంతఃకరణయందు ప్రతిబింబించియున్న సాక్షిచైతన్యము,  నేత్రములు శ్రోత్రములు మొదలగు ఇంద్రియములద్వారా, బయటికి,  వెళ్ళుచున్నదని నేను  తెలుసుకొనుచున్నానని, వేరు ఎటువంటి ఆపేక్షలు లేకుండా విషయములను ప్రకాశింపచేయుచు స్వయముగా ప్రకాశించుచున్న, ఆ సాక్షిచైతన్యమునే, అనుసరించి, , సమస్తమయిన, ప్రపంచము, ప్రకాశించుచున్నది అని ఎరుకపరచుకొనుచున్నానని. దానికి కారణమగు ఏ పరమేశ్వరుని యొక్క స్వరూపభూతమయిన జ్ఞానము ప్రకాశించుచున్నదో, , శ్రీ గురుమూర్తియైన శ్రీ దక్షి ణామూర్తిస్వామికొరకు, , నమస్కారము.

ఇక్కడ నేను ణా స్వంత వ్యాఖ్యానము చేయకుండా పరమేశ్వర స్వరోపుడగు ఆది శంకరుడు ఒకే ఒక శ్లోకములో తన శిష్యుని చింతదీర్చి బ్రహ్మతత్వమును విశదీకరించిన ఉదంతమును మీ ముందుంచుచున్నాను.

 కిం జ్యోతిస్తవ భానుమాన హనిమే రాత్రౌ ప్రదీపాదికం

స్యాదేవమ్ రవి దీప దర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహిమేl

చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం ధీర్తియో దర్శనే

కిం తత్రాః మతో భవాన్ పరమకం జ్యొతిః తదస్మిప్రభోll-ఏకశ్లోకి

అన్వయము:

ఆ గురుశిష్య సంవాదము ఈ క్రింది విధముగా సాగినది:

గురువు: కిం జ్యొతిస్తవ? ---------- వస్తు ప్రకాశమైన జ్యోతి ఏది?

శిష్యుడు: భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం -----పగలు సూర్యుడు రాత్రి దీపము

గురువు: స్యాత్ ఏవం, రవి దీపదర్శన విధౌ కిం జ్యోతిః? ----------అపుడు సూర్యుణ్ణి

దీపాన్ని గుర్తించే జ్యోతి ఏది?

శిష్యుడు: చక్షుః ----------కన్నులు

గురువు: నిమీలనాది సమయే, కిం?----కళ్ళు మూసుకొన్నపుడు చూసే వెలుగేది?

శిష్యుడు: ధీః ----------బుద్ధి

గురువు: ధియః దర్శనే కిం?----------బుద్ధిని చూసేజ్యొతి ఏది?

శిష్యుడు: తత్ర అహః ----------అక్కడ నేను నా ఆత్మను చూస్తున్నాను

గురువు: అతః భవాన్ పరమకం జ్యొతిః ----------కనుక నీవే ఆ పరంజ్యోతివి

శిష్యుడు: ప్రభో తత్ అస్మి ----గురుదేవా ఆ నేనే (అహమే) పరంజ్యోతియని తెలుసుకొన్నాను.

ఇంతకంటే సులభంగా తత్వ బోధ చేసిన మహనీయులు లేరంటే అతిశయోక్తి కాదేమో. సభక్తీకంగా ఆయన పాదాలకు మానసిక నమస్కారము చేసి ప్రస్తుతమునకు మీ వద్ద శెలవు తీసుకొంటాను.

శివోహం

రేపు మరియొక శ్లోకముతో మీముందు ఉంటాను......

6. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః

స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః |

మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||

కొందరు వేదశాస్త్ర ఇతిహాస పురాణ విరుద్ధమగు పర మతములను ఆశ్రయించి మోక్షమార్గమునకు దూరమై జీవితమును వ్యర్థము చేసికొని నరకముల పాలగుదరని దయతో జీవులను వుద్ధరించు టకై శంకర భగవత్పాదులవారు ఆ మతముల నిరాకరించుచూ స్వమతస్థాపనమునకై ఈ శ్లోకమును ఉదహరించిరి.

ఆత్మతత్వమును తెలియజాలని కొందరు, ఆత్మ దేహమనియు, ప్రాణమనియు తప్పుగా గ్రహిస్తారు. బుద్ధిపరంగా స్త్రీలవలె, చిన్నపిల్లలవలె, మూఢులవలె, విషయాలనర్ధం చేసుకునే శక్తిహీనులు, మాయా ప్రభావానికి లోనై, శరీరమే సత్యమనీ, ప్రాణమే సత్యమనీ, ఇంద్రియాలనే సత్యమనీ, మనస్సే సత్యమనీ, నిత్యమూ మార్పు చెందే బుద్ధే సత్యమనీ, శూన్యమే సత్యమనీ శాస్త్రం నుండి తప్పుగా గ్రహిస్తారు. అట్టివారి భ్రమలను తొలగించగలిగే పరమగురువగు శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు.

అదే భావార్థమునే ఇంకా కాస్త విశ్లేషణతో ఈ దిగున ఉంచుచున్నాను.

ఆత్మా తత్వమును తెలియజాలని కొందరు, కాళ్ళు, చేతులు, శిరస్సు మొదలగు అవయవములతో కూడిన స్థూలశరీరమును; ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములను పేరుతో వ్యవహరింపబడుచు, శరీరముతోనే ఉంటూ, ముక్కునుండి, బైటికి లోపలికి సంచరించుచున్న ప్రాణవాయువును; ఆయా స్థానములయందుండి తమ బాధ్యతలు నిర్వహించు, నేత్రములు మొదలగు ఇంద్రియములను; చంచలము, క్షణికమగు బుద్ధిని; అభావమును; స్త్రీలు , బాలురు, అంధులు బుద్ధి మాంద్యులు; లేక పిశాచగ్రస్తులవలె, వివేకజ్ఞానము లేనివారు, ఒక విధముగా నున్న తత్వమును, అంటే తత్వమును తెలుసుకొనవలసిన రీతిలో తెలుసుకొనక, వేరు విధముగా తెలిసికొనినవారై; అదే గట్టిగా వాస్తవమని నమ్మి ఇతరులకు బోధించుచున్నవారై, శరీరమే నేనని, ఇంద్రియములే నేనని, ప్రాణమే నేనని, ఒక అవాస్తావికతను వాస్తవికతగా తెలిసికొనుచున్నారు.

సత్వరస్తమోగుణాత్మకమైన పరులను భ్రమింపచేయు మాయాశక్తి చేత, కల్పింపబడిన , మహావ్యామోహ వివశులై దేహేంద్రియాదులే ఆత్మయనే గొప్పభ్రమను వారిలో నశింపచేయు; శ్రీ గురుమూర్తియైన శ్రీదక్షిణామూర్తిస్వామి కొరకు ఈ నమస్కారము.

ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మద్వైతవాసనా|

పాపోపహత బుద్ధీనాం తద్వార్తాపి నరోచ తే||

అని ప్రమాణవచనమున్నది. అనగా పూర్వజన్మలయందుగాని, ఈ జన్మయందుగాని, అతిభక్తితో, భగవదర్పణబుద్ధితో శాస్తోక్తకర్మలను ఆచరించినవారికే ఈశ్వరానుగ్రహము కలుగును. అట్టి ఈశ్వరానుగ్రహము కలవారికే అద్వైతశాస్త్రమందు ఆదరము శ్రద్ధ కలుగును. అట్టి శ్రద్ద కలిగినపుడే శాస్త్రోక్తప్రకారము గా శ్రవణ మనములను చేయుదురు. నిది ధ్యానమును కూడా చేయుదురు. అట్టివారికే పరమాత్మ సాక్షాత్కారము కలుగును. అట్టి సాక్షాత్కారమువలననే మూలాజ్ఞానము. దానివలన ఏర్పడిన దేహేంద్రియములయందు నేను అను భ్రమ మొదలగు సర్వభ్రమలు నశించును.

అగ్ని నుండి దహనశక్తిని వేరుచేయలేనటుల, సాధారణ స్థితిలో, విత్తములనుండి మొలకెత్తు లక్షనమును వేరుచేయలేనటుల, మంత్ర, తంత్ర ఓషధులయందు నిర్దేశితమైన కార్యములను ప్రతిబంధించే శక్తియున్నటుల, సచ్చిదానందరూపమగు పరమాత్మయందు సత్వరజస్తమోగుణములతో కూడిన మాయాశక్తి ఆశ్రాయించియుండును. మాయాశక్తి పరమాత్మకంటే వేరుకాదు. అట్టి మాయాకూడా అనాదియైన అరోపమే గనుకను అదిష్ఠానమగు పరమాత్మకంటే వేరుకాదని పరమార్థము.

వ్యవహారదశయందు అనగా అజ్ఞానదశయందు మాయాశక్తియుక్తమగు పరమేశ్వరుని ఆరాధించవలసినదే. ఈశ్వరానుగ్రహమును పొందవలసినదే పరమాత్మ సాక్షాత్కారమును పొందిన తరువాత అజ్ఞానమువలన ఏర్పడిన జీవత్వము, ఈశ్వరత్వము కూడా అజ్ఞానముతో సహా నశించును గనుక, నిర్గుణమగు స్వప్రకాశానందస్వరూపమగు పరమాత్మే మిగులును. ఇట్టి మహా పరమార్థమును తెలిసికొనుటకు ఈశ్వరారాధన చేసి పెద్దలను సేవించి; నిష్కామకర్మానుష్ఠానముచేసి, ఈశ్వరానుగ్రహమును సంపాదించవలయును.

ఆధ్యాత్మికదృష్ఠి మనుష్యజన్మలో చాలా శ్రద్ధచే సాధించవలసిన విషయం. ఆధ్యాత్మిక విద్య చాలా కష్టమయినది. నాకున్న పరిధిలో  సులభముగా అందరికి అర్థముగునను నమ్మకముతో, వ్రాసిన విషయములనే కొన్ని విశేషములతో మరల వ్రాయవలసి వచ్చినది. తప్పుగా తలువ వద్దు.

రేపు మరొక శ్లోకముతో.............

7. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్

సన్మాత్రః కరణోప సంహరణతో యోభూత్సుషుప్తః పుమాన్ |

ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిఙ్ఞాయతే

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

అనృత జడమగు ప్రపంచముకంటే విలక్షణమగు పరమేశ్వరుడు; రూపాది విషయజ్ఞానములకు కారణమగు నేత్రములు మొదలగు ఇంద్రియములయొక్క ఉపసంహారమువలన అనగా ఇంద్రియములు పనిచేయకుండా ఆగినందువలన; ఏవిధమైన భేదములేకండా సచ్చిదానందరూపుడుగా నుండి, సుషుప్త్యవస్థను పొందినవాడు; ఆయెను; ముక్తుని కంటే; సుషుప్త్యవస్థయందున్న ఆత్మకు తేడా ఏమనగా; మాయ అనాది అయిన అజ్ఞానముచేత; అవరణ వలన, అందువలన సన్మాత్రుడయి యున్నాడు.

ఈ విషయములో దృషాంతము ''రాహుగ్రస్త దివాకరేందు సదృశః '' అనగా  రాహువుచేత; గ్రసింపబడిన అనగా ఆవరింపబడిన; సూర్యునితో ఇందు చంద్రునితో; సమానుడై సుషుప్తిని పొందియుండెను. గ్రహణము పట్టినప్పుడుకూడా సూర్యచంద్రులున్నారు. సుషుప్త్యవస్థయందు ఆత్మ వుండుటలో ప్రమాణమేమనా- ''ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిజ్ఞాయతే''- సుషుప్తిసమయమందు; సన్మాతృడుగా నున్న సత్మ; మెళుకువవచ్చిన సమయమందు; ప్రత్యభిజ్ఞను పొందుచున్నాడు; ఎటులగనగా ప్రాగస్వాప్సమితి, నేను, ఇంతకు ముందు సుషుప్త్యవస్థయందు సుఖముగా నిద్రపోతినో; ఆ నేనే ఇపుడు మేలుకొనుచున్నాను. అని ప్రత్యభిజ్ఞను పొందుచున్నాడు ఆ అయిన, శ్రీ దక్షిణామూర్తిస్వామికొరకు; ఈ నమస్కారము.

 

జాగ్రదవస్థయని, స్వప్నావస్థయని, సుషుప్త్యవస్థయని జీవునకు మూడు అవస్థలు కలవు. బాహ్యేంద్రియములతో జ్ఞానము కలిగే అవస్థ జాగ్రదవస్థ, అనగా బైటిఇంద్రియములతో ప్రపంచవిషయములను తెలుసుకొను సమయము, నిద్రాసమయమునందు ఇంద్రియములు పనిచేయవు. ఇంద్రియములు పనిచేయకపోయినను, అంతరాత్మయందు మనస్సుయొక్క పరిణాములవలన ఏర్పడు స్వప్నపదార్థములను తెలుసుకునే సమయము స్వప్నావస్థ. జ్ఞానేంద్రియములు మనస్సుకూడా పనిచేయక, అజ్ఞానమందు అంతయు లీనమయి అవిద్యావృత్తియందు ప్రతిఫలించిన ఆనందమును అవిద్యాకారావిద్యావృత్తియను అజ్ఞానానుభవమును పొందు అవస్థ, సుషుప్త్యవస్థ. సుషుప్తి అనగా కల కన్నా గాఢమైనది. కలలో వున్నా బయట జరుగుతున్నదేదో ఏదో కొంత శాతమైనా మనస్సు గ్రహించే అవకాశముంటుంది. కానీ సుషుప్తి వ్వస్తలో అలా వుండదు. పూర్తిగా లీనమైన స్థితి ఇది.

ఈ మూడు అవస్థలయందును ఆత్మ అనుగతమై, నేను జాగ్రద్దశయందు ఆయా విషయములను చూచితిని, స్వప్నదశయందు మంచి ఆశ్చర్యకరమగు దృశ్యములను చూచితిని. సుషుప్త్యవస్థయందు ఏమి తెలియదు. సుఖముగా నిద్రించితినని జాగ్రద్దశయందు అనుకొనుచున్నాడు. జాగ్రద్దశయందు స్వప్నము, స్వప్నదశయందు జాగ్రద్దశ, సుషుప్త్యవస్థయందు ఈ రెండును, అనుగతమై గోచరించకపోయినప్పటికిని తెలుసుకొను ఆత్మ, ఒకే వ్యక్తి మూడు అవస్థలయందును స్పష్టముగానున్నట్లు సర్వజనులకును అనుభవమున్నది. అందువలన సుషుప్త్యవస్థయందు కూడా ఆనందరూపుడయిన అత్మయున్నది.

ఏమి తెలియలేదన్నాడు గనుక ఆజ్ఞానముకూడా ఉన్నది. గనుక సుషుప్త్యవస్థయందు ఏమియు లేదు. శూన్యమేయని, శూన్యమే ఆత్మయని చెప్పుటకు అవకాశములేదు. శూన్యమని చెప్పినను శూన్యమును గుర్తించే జ్ఞానమున్నట్లే కదా. జ్ఞానమే ఆత్మజ్ఞానముంటే ఆత్మ వున్నదనియే చెప్పవలయును. ఇదియేగాక బంగారులోనుండి తయారయిన భూషణములు బంగారురూపముగానే యుండును. రాగినుండి తయారయిన పాత్రలు రాగి పాత్రలుగానే కనిపించుచున్నవి. వికారములన్నియు ప్రకృతికి సజాతీయములుగానున్నవి. గనుక శూన్యములోనుండి ప్రపంచం పుట్టినయడల అంతయు శూన్యముగా నుండవలసి వచ్చును. ప్రపంచమంతయు సత్యముగా కనిపించుచున్నది. అంతా శూన్యమని చెప్పినపుడే అంతా శూన్యమని గుర్తించి చెప్పువాడున్నాడు కదా వాడే ఆత్మ, అట్టి ఆత్మ శూన్యమని చెప్పుట యుక్తిలేని మాట గనుక శూన్యవాదమును భోదించు బౌద్ధమతము ప్రమాణ విరుద్ధమని, యుక్తివిరుద్ధమని వదిలివేయవలయును. గ్రహించతగినది కాదు. ఇట్లు ఏడవశ్లోక తాత్పర్యవివరణము సమాప్తము.

రేపు మరొక శ్లోకముతో .........

8. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వాస్వవస్థాస్వపి l

వ్యావృత్తా స్వను వర్తమాన మహమి త్యంతస్స్ఫురంతం సదాl

స్వాత్మానం ప్రకటికరోతిభజతాం యోముద్రయా భద్రయాl

తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ll

బాల్యము, కౌమారము, యౌవనము, ముసలితనము మున్నగు స్వరూపముగానున్నట్లే; జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ; జన్మ జరామరణాది రూపముగానున్న సమస్తమయిన; అవస్థలు అనగా నేత్రములతో చూచుట, చెవులతో వినుట మొదలగు భిన్నభిన్న జ్ఞానములు కలిగే అవస్థలయందును, ఆయా దశలయందుకూడా; పరస్పరం వేరుగానున్న అవస్థలయందు; అనుగతముగా వుంటున్న, ఎల్లపుడు మనలోన నేనను భావన భాసించుచున్న ప్రత్యగాత్మను ఏ పరమేశ్వరుడు సచ్చిదానందస్వరూమయిన, తన ఆత్మస్వరూపముగా, శుభరూపమయిన (మంగళప్రదమయిన) జ్ఞానముద్రతో, భక్తులకు; తెలియజేయుచున్నాడో అనగా భక్తులకువారిలో నేను నేను అని గోచరించుచున్న ఆత్మను , కర్తృత్వాది ధర్మరహితమైన సచ్చిదానందరూపమయిన పరమాత్మకంటే అభిన్నముగా ఏపరమేశ్వరుడు బోధించుచున్నాడో; ఆ శ్రీగురుమూర్తి రూపమయిన; శ్రీదక్షిణామూర్తి స్వామికొరకు, ఈనమస్కారము.

బాల్య యౌవ్వన కౌమార వార్ధక్య దశలు మనవ జీవితములో అందరికీ అనుభవమునకు వచ్చేవే! ‘యోహం దాల్యే పితరౌ అస్వభూవం, సోహమిదానీం, ప్రణప్తౄన్ అనుభావామి' . నేను బాల్యావస్తయందు తల్లిదండ్రులను జూచితిని. ఇపుడు మునిమనుమలను జూచుచున్నాను. అని తలచుచున్నాడు శరీరి.  పైన చెప్పిన అన్ని అవస్థలూ అనుభవించిన తరువాత ఇపుడు చివరిదయిన వార్ధక్యమున పైవిధముగా తలపోయుచున్నాడు. అంటే తాను అనుస్యూతముగానుండి మారనట్లు గుర్తించుచున్నాడు. అదేవిధముగా జాగ్రద, స్వప్న, సుషుప్తులు మారుచున్ననూ ఈ అవస్థలను అనుభావించుచూ, తాను అట్లే ఉండిపోవుచున్నాడు. అహం అహం అంటే 'ఏను' నేను' అని అనుక్షణమూ తలపోయుచునేయున్నాడు. జ్ఞాన ముద్రతో దేహాది వివిక్త (చర్మ చక్షువులకు కనిపించకుండా) సచ్చిదానంద ఆత్మ స్వరూపములను  భక్తులకు ప్రకటించుచున్న ఆ దక్షిణామూర్తికి నమస్కారము.

ఈ భావమును విశ్లేషించుకొనుటకు మునుపు వ్యావృత్తి అనగా flux లేక పరిణామ సత్యము, మరియు 'అనువర్తమాన’ మను పదములు ఏమి తెలుపుచున్నవి అన్నది మనము ఒక పరి పరిశీలించవలసియున్నది. ఈ విషయమును ఒకపరి పరిశీలించుదాము.  నిత్యవ్యవహారములో అనేక వృక్ష జాతుల నుండి, అనేక రూపములలో మనకు ఆహార పదార్థములు లభ్యమగుచున్నవి. అంటే ఆ వస్తువులయండలి పోషక పదార్థములు, ఇవి పంచ భౌతికములే గానీ అన్యములు గావు, మన శరీరమునందలి సప్త ధాతువులగు  రస, రక్త, మాంస,మేద,ఆస్తి,మజ్జ,శుక్రములు భౌతిక పదార్థము యొక్క సూక్ష్మరూపమగు, మనస్సుగా,  రజో  గుణ ప్రదానమగు ప్రాణ శక్తిగానూ పరిణామమును పొంది, ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులుగా మన లౌకిక పారమార్థిక వ్యవహారనిర్వహణకు, సాధనములగుచున్నవి.   ఈ ఆహారమే లేనియెడల మన శరీరమే గాక, సూక్ష్మమగు మనస్సు కూడా క్షీణించి కార్యనిర్వహణ చేయజాలదు. పదార్థమునకు స్వరూప నిత్యత్వము లేకపోయిననూ, ప్రరినామ నిత్యత్వము ఇక్కడ సాదిమ్పబడినది. అదే మనము గమనించవలసిన విషయము.  పదార్థము, రూపాంతరములు పొంది, నామరూపములుగా (flux) నామరూపములుగా స్పూర్తిని కలిగియున్నది కానీ నామరూపములు లేకుండా నశించుటలేదు.  ఈవిధమగు రసాయనిక మార్పులకే ( Chemical disintegration and molecular combination) మాయాశక్తి విలాస కార్యమని వ్యవహారము. 'విలాసము' అనగా సంతోషము కలిగించు కార్యము గాడు, ప్రయోజనకరమగు మార్పు (Purposeful Metamorphosis). దీనినే వ్యావృత్తి అంటారు.

  అనువర్తమానముగా ఈ వ్యావృత్తి ని సదా అనుసరించి ఆ మార్పులకు  అనువగు రూపముల బొందించు ఈ ప్రపంచము యొక్క అధిష్ఠాన దేవతలే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ వ్యావృత్తి  ఇంకనూ సూక్ష్మాతి సూక్ష్మమగు శక్తిగా (Energy)మాయాతత్వము యొక్క కార్య రూపముగ ఊదా పరినమించుచున్నది. ఇందుకు ప్రమాణము 'ప్రశ్నోపనిషత్తు’న 'ఆదిత్యోహవై ప్రాణో రయిరేవ చంద్రమా' అన్న శ్లోకములో మనము చూడగలము. ఇది జిజ్ఞాసువుల అభీష్టమునకు విదిచిపెట్టుచున్నాను.                                                                                                                                                                                                                             

ఇట్టి ఆత్మ శరీరేంద్రియములయందు బుద్ధి ధర్మములగు కర్తృత్వభోక్తత్వాదులతో బుద్ధివృత్తిలో గోచరించుచుండును. పూర్వపుణ్యవిశేషముచేత అంతఃకరణశుద్ధికలవారై, గురుసేవచేసి, ఈశ్వరారాధన చేసి, పరమపవిత్రులై, తమ సమీపమునకు పరమభక్తులై వచ్చినవారికి, తత్వబోధచేయుటకుగాను, అవతరించిన దక్షిణామూర్తి స్వామివారు మౌనముగా నుండి బొటనవ్రేలు, చూపుడువ్రేలు కలిపిన జ్ఞానముద్రతో మీలో నేను నేను అని గోచరించు ఆత్మ, సచ్చిదానందస్వరూపమగు నాస్వరూపమే నని జీవబ్రహ్మైక్యమును బోధించిరి. దక్షిణామూర్తి స్వామివారి యనుగ్రహమువలన ఇట్టి జీవబ్రహ్మైక్యసాక్షాత్కారమునుపొంది ముక్తులు కావలయునని తాత్పర్యము.

రేపు మరియొక శ్లోకముతో ...........

9. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః

శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః ।

స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయేll

ఏ ఉపనిషత్తులయందు ప్రసిద్థమయిన, పరిపూర్ణమయిన పరమాత్మ; తనకు ఉపాధిభూతముగానున్న సత్వరజస్తమోగుణాత్మకమయి ఆవరణవిక్షేపశక్తితోకూడిన శరీరేంద్రియరూపముగా పరిణమించిన , ఆవిద్యారూపమగు మాయాశక్తిచేత, భ్రమను పొందించబడినవాడై, సర్వులకు ప్రత్యక్షముగా నున్న జీవుడై. కర్తృత్వ భోక్తృత్వాది సంసారమును పొందినవాడై; ప్రపంచమును; అనేకభేదములతో, అనేక విధములుగా భ్రాంతుడై; చూచుచున్నాడు. అనగా ఒక్క మాటలో మానవుడు పరమాత్మచే మాయావివశుడై భ్రమ యందు తగుల్కొని ఈ ప్రపంచముచే ఆకర్షితుడాయి ఉన్నాడు.

భేదముగా చూచుట ఎటులననగా కార్యము, కారణము అనే స్వరూపముతో , హక్కుగల గృహము, ధనము, స్వామి వాటికి అధిపతి, రెంటికి గల సంబంధ స్వరూపముతోను, విద్యను నేర్చుకునే శిష్యుడు, విద్యనుచెప్పే గురువు అనే స్వరూపముతోను, అలాగే; తండ్రి, కుమారుడు, తల్లి, అనే స్వరూపముతోను, స్వప్నమందు గాని; జాగ్రద్దశయందుగాని, ప్రపంచమును చూచునో, ఆ శ్రీగురుమూర్తిఅయిన; దక్షిణామూర్తిస్వామి కొరకు; ఈ నమస్కారము.

పై విషయమును ఇంకా సులభతరముగా అర్థము చేసుకొనుటకు గాను భావమును ఇంకా సంక్షిప్తముగా మీముందు ఉంచుచున్నాను.

ఎవరి మాయవలన ఈ ప్రపంచమున చేతన స్వప్నావస్థలయందు, గురువు శిష్యుడు, తండ్రి కొడుకు మొదలగు అనేక రూపముల అనుభూతి కలుగుచున్నదో, అట్టి  శ్రీ గురుస్వరూపుడైన ఆ దక్షినామూర్తికి ఈ నమస్కారము.

ఈ శ్లోకము యొక్క తాత్పర్య వివరణ నా జ్ఞాన పరిధిలో ఉన్నంత మేరకు తేటతెల్లము చేయ ప్రయత్నించుతాను. ఈ జగతిలో కనిపించునది ఏదియూ ఆత్మ కాదు. అది అంతయూ అనాత్మ మాత్రమే! ఎందుకంటే, ఆత్మ అగుపించదు. దానిని ఒక్క బ్రహ్మవేత్త మాత్రమే తెలుసుకోనగాలుగుతాడు.అట్టి బ్రహ్మవేత్తకు ఆత్మానాత్మ విచారణతో పని లేదు. అతను అనాత్మలో కూడా ఆత్మను చూడగలడు. సాధారణ జీవికిది సాధ్యము కాదు. అతనికి అంటే మనలాంటి వారికందరకూ అది ద్రాక్ష పిండు, అరటి పండు, మామిడి పండు వంటిది కాదు, అది పనస పండు వంటిది. దేహమే తాను అని విశ్వసించుచున్నంతవరకూ మనిషి భ్రమలో ఉన్నట్లే!

అవిద్యా భ్రాంతిచేత కప్పబడి మాయామయమైన మానవుడు తన ఆత్మ వేరని తలచుటయే గాక, ఈ విధమగు కార్యకారణ ప్రక్రియ ద్వారా యజమాని-సేవకుడు, తండ్రి-కుమారుడు, గురువు-శిష్యుడు  అనబడు ఈ విధమగు అన్ని సంబంధములను వేరు వేరని తలచును. నిజమునకు  వారు వేరు అనుకోనుతయే భ్రమ. ఉదాహరణమునకు తండ్రి కుమారులను తీసుకొందాము. నిజామునకు కుమారునికి తండ్రి కారణము. అదేవిధముగా ఆ తండ్రి అయిన వ్యక్తి తండ్రియగుటకు కుమారుడే కారణము. లోతుగా పరిశీలించితే ఈ అనుబంధము కలిగియున్నది ఒకే ఆత్మ. ఇదే విధముగా గురువు శిష్యునకు కూడా ఈ ఆత్మీయతయే కారణము. అదేవిధముగా యజమాని తాపేదారుడు కూడా! దీనికి ఉదాహరణగా మానవుడు జాగ్రద్ స్వప్న సుషుప్తుల అనుభవములను తాను స్మృతిలో ఉన్నపుడు ఆయా అవస్థల అనుభవముల ఎరుక తానూ కలిగియే యున్నాడు. ఆ ఎరుకకు కారణము ఆత్మ. ఈ ఆత్మల సంకలనమే పరమాత్మ. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ తెలియజేస్తాను. ఒక పెద్ద మళిగె (Mall) ను తీసుకొందాము. అందులో ప్రతి విభాగమునకు, ప్రతిమూలన  ముకుళపరిపథ చిత్రదర్శిని(Closed Circuit Tele-Vision), ఉంటుంది. ఆ మొత్తము చిత్ర సముదాయమును అందుకు సంబంధించిన అధికారి చూచుటకు వీలుగా ఏర్పరుపబడి ఉంటుంది. బయట మనము చూచినా చోటల్లా వేరువేరుగా కనిపించినా అవి అన్నీ ఒకే యంత్రరచనకు (Mechanism) కట్టుబడి ఉన్నాయి అన్నది మనకు తెలిసిన విషయము. అంటే ఈ ఉదాహరణ వల్ల సకలాత్మ సంయోగమే పరమాత్మయని మనకు అర్థమగుట లేదా! ఆ ఎరుక కలిగినవాడు స్వయముగా పరమాత్మయే! అట్టి పరమాత్మ స్వరూపుడగు శ్రీ గురుమూర్తి శ్రీ దక్షిణామూర్తికి నమస్కారము.

రేపు మరొక శ్లోకముతో.........

10.  భూరంభాంస్యనలోఽనిలోంబర మహర్నాథో హిమాంశుః పుమాన్

ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం ।

నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో

తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥

భూమియు, జలము, అగ్నియు, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, కర్మకాండకు, జ్ఞానకాండకు అధికారి యైన జీవుడు, ఏపరమేశ్వరుడైన, సర్వజ్ఞుడైన, సర్వశక్తిగల సచ్చిదానందరూపుడైన సదాశివుని యొక్కయే, మూర్తులయొక్క, ఎనిమిదింటి యొక్క సముదాయము, అంతట ప్రకాశించుచున్నదో, అనగా_ఈ ఎనిమిది స్వరూపములుగల ఈశ్వర స్వరూపుడనే నేనని అహంగ్రహోపాసన చేయమని యర్థము. ఈశ్వరానుగ్రహమువలన కలిగే తత్వ సాక్షాత్కారమే మోక్ష సాధనమని శ్రవణాది విచారణ చేయువారికి, సర్వకారణమైన, అనేకరూపములుగల ప్రపంచరూపముగా వివర్తమానమైన, దేశ కాల వస్తు పరిచ్ఛేదరహితమైన, యేసకల ప్రపంచాధిష్ఠానమైన సచ్చిదానందరూపమైన పరమాత్మకంటే, వేరు, కొంచెము కూడా, కాదో, , శ్రీ గురుమూర్తి అయిన, శ్రీ దక్షిణామూర్తి స్వామికొరకు, , నమస్కారము.

నిత్యానిత్య వస్తువివేకము, ఇహామృతార్థ ఫలభోగ విరాగము, శమాది షట్కసంపత్తి, ముముక్షుత్వమను సాధన చతుష్టయ సంపత్తి కలవారై సూక్ష్మబుద్ధికలవారై సర్వకాలములయందు బ్రహ్మవిచారము చేసి, అనగా పరమాత్మయందే ప్రపంచమంతయు ఆరోపింపబడినదిగనుక ఆరోపింపబడిన ప్రపంచము అధిష్ఠానమైన పరమాత్మకంటే వేరుకాదు గనుక. అధిష్ఠానమైన బ్రహ్మయే సత్యం. ఆరోపిత ప్రపంచమంతయు మిధ్యయని భావించి శ్రవణ మనన నిదిధ్యాసనలు చేసి అహం బ్రహ్మస్మీ అని బ్రహ్మ సాక్షాత్కారమును పొంది ముక్తిని పొందువారు. ఉత్తమాధికారులు.

సాధనసంపత్తి సరిగాలేక, సూక్ష్మబుద్ధిలేక శ్రవణాదులు చేయలేనివారు మందాధికారులు, శ్రవణమనగా సమస్త వేదాంతములు అనగా ఉపనిషత్తులు. అద్వితీయమైన పరబ్రహ్మను తాత్పర్యముతో బోధించుచున్న వని విని, మనస్సులో నిశ్చయజ్ఞానం కలుగునట్లు చర్చచేయుట. మనన మనగా శ్రవణము చేసిన విషయమును అనేక హేతువులతోను, అనేక దృష్టాంతములతోను సంశయములేకుండా మనస్సులో దృఢపరచుకొనుట, నిదిధ్యాసనమనగా శ్రవణమననములతో సందేహములేకుండా నిశ్చయింపబడిన పర బ్రహ్మ స్వరూపమును నేను జీవుడను కాదు. పరబ్రహ్మ నేనే నని ధ్యానము చేయుట.

ఇట్టి కష్టతరమైన శ్రవణమనన నిదిధ్యాసలను సూక్ష్మబుద్ధి లేని వారు చేయజాలరు గనుక ఇట్టి రెండవరకమగు అధికారులకే ఉపనిషత్తుల యందు సగుణ బ్రహ్మోపాసనలుచెప్పబడినవి. ఆ సగుణ బ్రహ్మోపాసనల వలన పరిపక్వస్థితిని పొంది, దేహము పడిపోయిన తరువాత సగుణ బ్రహ్మలోకమునకు పోయి ఆ లోకమందు ఆ సగుణ బ్రహ్మ అనుగ్రహము వలన నిర్గుణ బ్రహ్మ విచారం చేసి, ఆలోకమందే నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారమును పొంది, ఆ సగుణ బ్రహ్మతోకూడా ఈ సగుణ బ్రహ్మోపాసకులు నిర్గుణ బ్రహ్మస్వరూపముతో ఐక్యమును పొందుదురు. ఇదియే క్రమముక్తి. ఈ క్రమముక్తి సగుణ బ్రహ్మోపాసనవలన కలుగును.

ఆ సంప్రదాయానుసారముగా శంకర భగవత్పాదులవారు ఈ శ్లోకమందు సగుణోపాసన చెప్పిరి. ఉపాసన ఎటులననగా, కొద్దిదాని యందు గొప్పదృష్టిని ఉంచుట ఇదియే ఉపాసనకు మొదటి లక్షణము; పృధివి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము ఈ పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, కర్మజ్ఞానాధికారియగు జీవుడు, ఈ ఎనిమిది అష్టమూర్తులు, ఈ అష్టమూర్తులతో కూడి అనగా ఈఅష్టమూర్తులు ఈశ్వరునికి శరీరమని అనుకుందాము. ఇట్టి ఈశ్వరుడు సమష్ట్యుపాధికుడు. ఇట్టి ఈశ్వరునితో తనకు ఐక్యమును భావించి ఉపాసన చేయవలయును.

ఎటులననగా! తన శరీరం పంచభూతములతో తయారైనది గనుక శరీరంలో పంచభూతములున్నవి. ప్రపంచంలో నున్న సమష్టి మహాపంచ భూతములను, తన శరీరంలోనున్న వ్యష్టి పంచభూతములను ఒకటిగా భావించవలయును. అష్టమూర్తులలోని సూర్యచంద్రులను, తన శరీరములోనున్న ప్రాణాపానవాయువులను ఒకటిగా భావించవలయును జీవుడు తనే అయియున్నాడు. గనుక వ్యష్టి శరీరము ఉపాధిగాగల తనకు అష్టమూర్తులనే సమష్టి ప్రపంచము ఉపాధిగాకల పరమేశ్వరునుకు, ఐక్యమును భావించవయును.

అనగా సర్వవ్యాపకమై అష్టమూర్త్యభిమానిఅయిన సదాశివుడనే నేనని అహంగ్రహోపాసన చేయవలయును. ఇట్టి ఉపాసనవలన, ఈశ్వర సాయుజ్యమును పొంది, ఆ ఈశ్వరానుగ్రహమువలన నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారమును పొంది, ముక్తిని పొందుదురు. ఇదియే క్రమ ముక్తి సాధనమని, శంకర భగవత్పాదులవారు అతిదయతో అనుగ్రహించిరి. ఇట్లు తాత్పర్యవివరణ సమాప్తం.

ఈ శ్లోకమును ఉపాసనా సూచకమని తరువాతి శ్లోకమును ఫలశ్రుతి యని పెద్దలు చెబుతారు. వారి మాటను కాదను అర్హత నాకు లేదు. కానీ ఈ శ్లోకము దీని తరువాతిది కూడా మనకు ఎంతో వేదాంతమునందజేయుచున్నది. కావున ఈ శ్లోకములు కూడా ఎంతో పారమార్థిక ప్రాధాన్యత కలిగియున్నాయి.

రేపు మరొక శ్లోకముతో ..............

 

11. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిం స్తవే,

తేనాస్యశ్రవణాత్త దర్థమననార్థ్యనాచ్చ సంకీర్తనాl

త్సర్వాత్మత్వ మహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతస్సిద్ధ్యే

త్తత్సునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతంll

ఇంతవరకూ పై శ్లోకములలో తెలిపిన రీతిగా ఈ దక్షిణామూర్తిస్తోత్రమునందు; శృతులయందు చెప్పబడిన; పరమాత్మ సర్వరూపస్థితి స్పష్టముగా తెలియచేయబడినది. ఆకారణముచేత; ఈ స్తోత్రమును యధావిధిగా గురువుచే వినుటవలన; శ్రవణంచేసి విషయమును చిత్తశుద్ధితో, అనేక దృష్టాంతములతోను, అనేక యుక్తుల తోను, మనస్సుతో చింతనచేసినందువలన ఆ పరమాత్మ తత్వమును గ్రహించాగాలుగుచున్నాము.  శ్రవణమననములతో నిర్ణయింపబడిన సర్వాత్మకమయిన సచ్చిదానందమయిన నిత్యసిద్ధ బుద్ధ ముక్తస్వరూపమయిన పరమాత్మనే నేనని తైలధారవలె ఇతర వృత్తితో వ్యవధానములేని, పరమాత్మాకారవృత్తి ప్రవాహరూపమైన నిది ధ్యాసనవలన; ఇతరులకు తెలియజేయుతవలన,  ఈ స్తోత్రమును చదివినందువలన; సర్వాత్మభావమనే మహదైశ్వర్యముతో కూడిన సత్యజ్ఞానానందరూపమైన తత్వము ఆ శృతుల యందు ప్రసిద్ధమైన పరమాత్మభావము సిద్ధమయినదే అని గ్రహించగలుగుచున్నాము. పరమాత్మభావము సిద్ధమేగాని ప్రయత్న సాధ్యము ఆనుకొన తగదు. ప్రయత్న సాధ్యమయ్యే దయినచో అనిత్యమగునని యర్థము; ఈ తత్వమును సాధించిన ముముక్షువు  అణిమాద్యైశ్వర్య సిద్ధిని పొందుచు పరబ్రహ్మైక్యత సాధించును. చును;

సకల వేదాంత సిద్ధాన్తమంతయు, ఈ దక్షిణామూర్తి స్తోత్రమందుండుటచేత ఈ దక్షిణామూర్తి స్తోత్రమును గురువుల వద్ద బాగుగా శ్రవణం చేసి, మననం చేసి శ్రవణమననములతో, నేను పరమాత్మను కాననే అసంభావనను, నేను జీవుడననే విపరీతభావనను పోగొట్టుకొని నిశ్చితమగు పరమాత్మతత్వమును ధ్యానం చేసి, ఆత్మ సాక్షాత్కారము పొందగలడు. అదియే మోక్షము. దీనినే మహావిభూతి యందురు.

ఆత్మను సంపాదించనవసరమలేదుకాదా! ఒక ప్రశ్న. మోక్షమనగా అవస్థాత్రయాతీతమగు ఆత్మయేకదా. అట్టి ఆత్మసిద్ధించి మన స్వరూపముగానేయున్నదికదా. అయితే అఖండానందరూపమగు మోక్షము మన కెందుకు గోచరించడంలేదు. అంటే అజ్ఞానము ఆ స్వరూపానందమును అవరించి మనకు గోచరించకుండా చేసింది. అయితే ఆ మోక్షము ఎంత దూరములో నున్నది. అంటే ఆత్మస్వరూపమే. మోక్షమని చెప్పితిమికదా. ఆత్మకంటే దగ్గరిది లేదుకదా. అయితే ఎంతోదూరముగా నున్నట్లు లభించనట్లు దేనినైనా సంపాదింపవచ్చును గాని మోక్షమును సంపాదించుట చాలాకష్టమని, దేనినైనా పోగొట్టుకొనవచ్చునుగాని, జన్మమరణ సంసార బంధమును పోగొట్టుకొనుట చాలా అసాధ్యమని, చాలా బాధపడుచున్నామే అంటే అజ్ఞానముకంటే దగ్గర ఉన్న దానినికూడా దూరంచేసేది మరియొకటి లేదు, అజ్ఞానంకంటే ఉన్నదానిని లేనట్లుచేసేది మరొకటిలేదు. ఇదియే కాదు అజ్ఞానంకంటే ఉన్నదానిని లేనట్లు చేయుటయేగాక ఎక్కడనోనున్నదని దానిని సంపాదించుటకు వెతికించేది. తిప్పేది, బాదపెట్టేది మరియొకటిలేదు. అజ్ఞాన ప్రభావమును గురించి ఒకసారి పెద్దల మాట వినండి:

ఈ అజ్ఞానము చాలా బలమైనది. అత్యంత శక్తి కలిగినది. ఆత్మను ఆవరించి జీవునిగా తయారుచేసి లేని ప్రపంచమును చూపించి సత్యమనిపించిందే, ఎంతటి శక్తివంతమయినదైతేగాని ఇంత పని చేయగలుగుతుంది. అంటే సందేహం లేదు. ఈవిషయమును సంక్షేపశారీరకంలో సర్వజ్ఞముని ఈ విధముగా చెప్పుచున్నారు.

ఏకశ్శతృ ర్నద్వితీయో స్తి శతృ రజ్ఞానతుల్యః పురుషస్య రాజన్‌ l

యేనావృతః కురుతే సంప్రమత్తో ఘోరాణి కర్మాణి సుదారుణాని ll

ఆ శ్లోక భావము ఇది. నాయనా! జీవునికి ఒక మహాశతృవు ఉన్నాడు. అజ్ఞానమే ఆ శతృవు. అట్టి అజ్ఞానమనే శతృవుతో సమానమైన శత్రువు మరియొకటి కానరాదు. ఎందుచేతనంటే జీఇయండు ఉండే ఈ సచ్చిదానందరూపుడు, అజ్ఞానమనే శతృవుతో నావరింపబడినవాడై యున్నందువల్లస్వరూపమును మరచి జీవుడ ననే భ్రాంతినిపొంది అహంకార మమకారములు కలవాడై చేయతగినది చేయకూడనిది తెలిసికొనలేక ఈ లోకమందు భయంకరమైన పనులను, పరలోకమందు నరకమును కలుగజేయు పాపకృత్యములనుకూడా చేయుచున్నాడు. ఇదంతయు అజ్ఞానప్రభావమే. అందువలన దూరముగా నున్న పుణ్యలోకములను పుణ్యకర్మలుచేసి పొందుట సులభంగాని, బాగుగా సమీపమైన తన స్వరూపమును తెలిసికొని అజ్ఞానమును పోగొట్టుకొనుట చాలాకష్టము. కర్మ ప్రతిబంధమును పోగొట్టుకొనుటకంటే అజ్ఞాన ప్రతిబంధమును పోగొట్టుకొనుట చాలా కష్టమని గ్రహించవలయును.

వేదాంతవిద్యను బాగుగా నభ్యసించినపండితులవద్ద అప్పుడపుడు వినుట చాలా అవసరము. అటులచేసినయడల గ్రంథములనుచూచినను చాలా బాగుగా నిస్సందేహముగా సిద్ధాన్తం తెలిసికొనవచ్చును.

నహి ప్రపంచో నచభూతజాతం నచేంద్రియం ప్రాణగణోనదేహః|

నబుద్ధిచిత్తం నమనోనకర్తా బ్రహ్మైవసత్యం పరమార్థరూపం||

అని స్వాత్మప్రకాశికయందు శంకర భగవత్పాదులవారు చెప్పిరి.

ప్రధానంగా ఆద్వితీయమగు బ్రహ్మ విచారముచేయువారు. ఆ రోపమును నిషేధించుచునే అధిష్ఠానమగు ఆత్మను తెలుసుకొనవలయును, గనుక ప్రపంచము ఆత్మకంటే, వేరుగాలేదు, భూతములేమియు లేవు, ఇంద్రియములులేవు, ప్రాణములేదు, దేహములేదు. వృత్తిభేదము చేత అంతఃకరణయే మనస్సనియు, బుద్ధియనియు, అహంకారమనియు, చిత్తమనియు నాల్గువిధములుగా వ్యవహరింపబడుచున్నది, గనుక అవి ఏవియులేవు. కర్తయని, భోక్తయని వ్యవహరింపబడుచున్న జీవుడుకూడా లేడు. అంతయు పరమాత్మయే అనగా బ్రహ్మయేయని. అదియే పరమార్థమని, అదియే నేనని తెలుసుకొని కృతకృత్యులు కావలయునని తాత్పర్యము.

 

నాకు చేతనగురీతి ఈ స్తోత్రమునకు నేను తెలుసుకొన్న మేరకు అర్థవివరణ తో మీ ముందు ఉంచినాను.

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్l

కరోమి యద్యః సకలం పరస్మైః నారాయణాయ ఇతి సమర్పయామి.

సర్వేపిస్సుఖినస్సంతు సర్వే సంతు సమాశ్రయాః l

సర్వ్ భద్రాణి పశ్యంతు మాకశిత్ దుఃఖ భాగ్భావేత్ ll

స్వస్తి.