Tuesday, 13 March 2018

కాళిదాసు – భోజుడు


భారతదేశ వినీలాకాశములో సంస్కృతము, కవిత్వము  సూర్యచంద్రులు. ఆవెలుగులే మనకు లేకపోతే భారత భూమిపై వేలుతురేలేదు. అందునా భోజకాళీదాస కథలు కవనభవన సోపానములు. చదవండి. మన సంస్కృత సంస్కృతిని తెలుసుకొండి.
కాళిదాసు – భోజుడు
https://cherukuramamohanrao.blogspot.com/2018/03/blog-post_13.html
సంస్కృతము బాల్యములో నేర్చుకొనే అవకాశము లేకపోయినవాళ్ళు, ఆ భాష ప్రాశస్త్యమును, భగవత్ సాక్షాత్కారము పొంది మహాకావ్యములను రచించిన కాళిదాసాది మహాకవుల గొప్పదనమును, అలంకార సమలంకృతమై యొప్పారు కావ్య వైచిత్రిని తెలుసుకొనవలెనంటే ఆదిగా ఆ భాషపై మక్కువను ఏర్పరచుకోవలసియుంటుంది. అట్టి జిజ్ఞాసకు ఉపాధే భోజ కాళీదాసు కథలు.ఉడుతా భక్తిగా, నేను పండితుని గాకున్నా, పాఠకులలో  ఒక తపనను కలిగించు నెపముతో అప్పుడప్పుడు భోజ కాళీదాస కథలను అందిస్తూ వస్తూవున్నాను. అందులోని ఒక భాగమే ఈ కథ.
ఒకనాడు భోజరాజు కొలువు దీరి యుండగా,ఒక సన్యాసి  వచ్చి ఆయనను ఆశీర్వదించినాడు. రాజు ఆయనతో స్వామీ! కలికాలానికి తగని ఈ బ్రహ్మచర్య వ్రతం యింత చిన్న వయసులో ఎందుకు ఆరభించినారు. నిత్య ఉపవాసాలతో కృశించి ఏమిసాధించదలచుకొన్నారు. నేను చెప్పబోవు ఈ మాట మీకు తెలియనిదికాదు .
అగ్నిహోత్రం గావాలంబం సన్యాసం పలపైత్రుకంI
దేవేరాచ్చ సుతోత్పత్తిః కలౌ పంచ వివర్జయేత్II
కలియుగములో అగ్నిహోత్రము, (కొందరు అశ్వమేధం అనిగూడా అంటారు) గోమాంసము,సన్యాసము, తద్దినములందు మాంస వినియోగము,,కట్టుకొన్న భార్యకు సంతాన లేమి ( అంటే దత్తత గానీ ఆమె అనుమతిపై వేరొక స్త్రీని వివాహము చేసుకోనుటగానీ చేయవచ్చును అని శాస్త్రము.)కలియుగములో పాటింప నవసరములేదు అని విశదముగా తెలిపినారు కదా మరి మీరెందుకు పాటించుచున్నట్లు? అని అడిగినాడు.
 పైపెచ్చు “గృహస్తాశ్రమము స్వీకరించ రాదా? నేను నీ కొరకు ఒక మంచి బ్రాహ్మణ కన్యను వెతికి వివాహము జరిపిస్తాను.” అనికూడా అన్నాడు.
అందులకా యువసన్యాసి “రాజా!నీవు ఐశ్వర్య వంతుడివి నీకు సాధ్యం కానిది ఏముంటుంది? ‘లోకో భిన్న రుచి’ అన్న నానుడి తమకు తెలియనిది కాదు.
ఆహార నిద్రాభయమైథునం చ సామాన్య మేతత్‌ పశుభిర్నరాణామ్‌ ।
ధర్మో హి తేషామధికో విశేషో ధర్మేణ హీనాః పశుభిః సమానాః ॥
(హితోపదేశము, ప్రస్తావిక - 26)
శరీర పోషణకై ఆహారము తినుట, నిద్రా, భయము మరియు సంతానోత్పత్తి అను ఈ నాలుగు గుణములు పశువులలోను, మనుష్యులోను సమానముగ కనిపించు సామాన్య గుణము. మనుష్యులో ధర్మమనునది విశేష గుణము. ధర్మాచరణలేని మనుష్యుదు అపుడు పశువుతో సమానము కాదా! ఈ ధర్మమూ అతని వృత్తి ప్రవృత్తులబట్టి మారుతూ వుంటుంది. రాజధర్మము వేరు మరియు యిచ్ఛాపూర్వక సన్యాసమును స్వీకరించిన సన్యాసి ధర్మమూ వేరు.
ధర్మాచరణుడగుటకు మనుష్యుడు విద్యను - జ్ఞానమును సంపాదింపవలసి యున్నది. విద్యవలననే అతడు పదార్థముయొక్క యథార్థస్వరూపమును తెలిసికొనగలడు. తన ముఖ్యోద్దేశ్యమైన మోక్షమును కూడా పొందగలడు. ఇదియే మానవుని ఉత్కృష్టత. ఈ మానవశరీరమందే పరమాత్మను సాక్షాత్కారము చేసికొనుటకు మీన్నది. మనుష్యుని నరుడు అని కూడ అంటారు. నరయతీతి నరః అని నిర్వచనము. నరుడనగా ఇతరుకు మార్గదర్శకుడు.
న రమతే ఇతి నరః అని కూడ ఒక పరిభాష. ఇంద్రియములో రమించనివాడు. అనగా వాటికి దాసుడు కాక వాటిని తన వశములో ఉంచుకొనువాడు.
విజ్ఞానసారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః ।
సో-ధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదమ్‌ ॥ అని కఠోపనిషత్తు 3-9
విశేష జ్ఞానమును సారథిగా గలిగి మనస్సును తన వశమందుంచుకొన్నవాడు నరుడు. అతడు జన్మమరణరూపకమగు మార్గముయొక్క అంతమును, వ్యాపకుడగు పరమాత్ముని పరమపదమును - మోక్షానందమును పొందగలడు.
వైదిక సాహిత్యములో ఈ మానవశరీరము ఋషిభూమి, దేవపురి, బ్రహ్మపురి అని చెప్పబడిరది.  ఐదు జ్ఞానేంద్రియము, మనస్సు, బుద్ధి ఈ ఏడిరటిని ఋషులని అంటారు. ఇవి ఈ శరీరములో ఉంటాయి. కనుక ఇది ఋషిభూమి. ఇంద్రియముకు దేవతయని పేరు. అందుచే ఇది దేవపురి. ఈ శరీరములోనే పరమాత్మ సాక్షాత్కారమవుతుంది. కావున ఇది బ్రహ్మపురి. దానిని సాధించుటయే ధ్యేయముగా నేను ఈ సన్యాసాశ్రమమును స్వీకరించినాను. నన్ను సరియగు రీతిలో అర్థము చేసుకోనగలరని నానమ్మకము. దయతో ఈ మాటను కూడా ఆలకించండి:
సారంగాః-సుహృదః -గృహం -గిరిగుహ-శాంతి:ప్రియా గేహినీ
వృత్తి: వన్యలతాఫలై: నివసనం,వస్త్రం తరూణాం త్వచః
సద్వాక్యామృత పూర మగ్న మనసాం యేషాం -ఇయం నివ్వృతి:
తేషాం యిందు కళావతంస యామినాం మొక్షేపి నో నః స్పృహాII
లేళ్ళు మాకు మిత్రులు, కొండగుహలే మా ఇళ్ళు, శాంతికామిని శాంతిగామిని మా ఇల్లాలు, అడవులలో తీగెలతో,పండ్లతో సహవాసమే మా జీవన విధానము. చెట్టు పట్టలే మాకు వస్త్రాలు, సద్వచన ప్రవాహ స్నాతులము అంటే మంచి మాటలు అనుగంగా తరంగముల నోలలాడువారము , ఇటువంటి నిరంతర సుఖసౌఖ్యములు గల్గిన  మాకు నిజానికయితే స్వర్గము పై కూడా  కాంక్ష ఉండదు. బ్రహ్మైక్యమే మా ధ్యేయము అన్నాడు.
రాజు ఆ బ్రహ్మచారికి నమస్కరించి నా వల్ల మీకేదయినా సహాయము కావలసి వస్తే   
చెప్పండి అని విధేయతతో అడిగినాడు. అప్పుడు అతడు “రాజా! ఇంతగా సాదు సాంగత్యము పై అభిలాష చూపే మీ తీయనైన మాటలు తలదాల్చి ఒక్క కోరిక కోరుతాను.నేను సాటి సన్యాసగణముతో  కాశీయాత్రకువెళుతున్నాను. దయచేసి మీ సభలోని పండితులను భార్యా సమేతంగా మాతో పాటు యాత్రకు పంపించండి. త్రోవ పొడుగునా శ్రమ తెలియకుండా పండిత గోష్టులు జరుపుకుంటూ యాత్ర పూర్తి చేసుకుంటాము.” అన్నాడు ఆ సన్యాసి. రాజు అందుకు వల్లే యనగా  రాజ సభలో పండితులంతా సకుటుంబంగా కాశీ యాత్రకు వెళ్ళారు,ఒక్క కాళిదాసు తప్ప. మీరు ఎందుకు వెళ్ళలేదు?అని రాజు కాళిదాసును అడిగినాడు. కాళిదాసు ఈ విధముగా బదులిచ్చినాడు.
 తే యాంతి తీర్థేషు బుధాః/ యే శంభో దూర వర్తినఃI
యస్య గౌరీశ్వర: చిత్తే / తీర్థం,భోజ పరం హి సఃII
భోజరాజా!ఎవరైతే శంభుడికి దూరంగా వుంటారో వారు తీర్థ యాత్రలకు వెళతారుఎవరి మనస్సులో గౌరీశ్వరుడే నివాసం వుంటాడో ఆభక్తుడే ఒక శ్రేష్ఠమైన తీర్థం.
నిజానికి తను ఆజ్ఞాపించినా వెళ్లలేదని రాజునకు మనసులో ఒకప్రక్క ఎదో కినుక ఉన్నది. కానీ తెలియబరచలేదు బాహాటంగా!
కొద్దిరోజుల తర్వాత భోజరాజు బయటి దేశముల నుండి వచ్చిన పండిత సదస్సును ఏర్పాటుచేసి వారికి భూరి సంపదలను దానము చేసినాడు. కాళిదాసును మీ నుండి కూడా కవనమును వినగోరుచున్నామన, కాళిదాసు ఈ విధముగా పలికినాడు.

మేరౌ, మందర కందరాసు, హిమవత్సానౌ.మహేంద్రాచలేI
కైలాసస్య శిలా తలేషు, లయ ప్ర్రాగ్భార భాగేష్వపి
సహ్యాద్రా వపి,తేషు తేషు,బహుశః భోజ!, శ్రుతం తే మయా
లోకా లోక విచారి చారణ గణైః: వుద్గీయ మానం యశఃII
చారణులనే దివ్య గాయకుల బృందాల చేత, నీ కీర్తి గురించి  మేరు మంధర పర్వతపు గుహలలో,హిమాలయ మలయ పర్వత శిఖరాగ్రముల మీదా, సహ్యాద్రి మీదనేగాక  అనేకానేక ప్రదేశములయందు, కొనియాడబడుతున్న నీ కీర్తి వినబడినది.

అప్పుడు భోజుడు సంతోషముతో పులకరించిన శరీరము కలిగినవాడై, కాళిదాసు యాత్రలకు వెళ్ళివుంటే ఇలాంటి కవిత్వాన్ని నేను వినగలిగే వాడిని కాదు కదా! అని తలచుతూ, నిర్మొహమాటముగా మనసులోకలిగిన తన తప్పిదమును కాళిదాసు కు మనవి చేసుకొన్నాడు. ఎంతటి సౌశీల్యమో చూడండి. కవనములో ఎంతటి సౌందర్యమో చూడండి. భాష భావానికి ఎంతగా ఒదిగిపోతూవుందో  చూడండి. సంస్కృతముతో జీవితమునే సంస్కృతము చేసుకొందాము.
స్వస్తి.

No comments:

Post a Comment