కాలనేమి - కంసుడు
https://cherukuramamohanrao.blogspot.com/2018/03/blog-post_24.html
శీర్షిక చూచినవెంటనే రామాయణ భాగవతములు అంతో ఇంతో
ఎంతో కొంత తెలిసినవారికి ఇది ఏమి వీరు ఇరువురు వేరువేరు యుగముల వారు కదా అన్న
సందేహము పొడచూపక మానదు. మొదటిది రామాయణ సంబంధితమయితే రెండవది భాగవత సంబంధమైనది.
కంసుడు, త్రేతా యుగమున మాయలేడియై రామాయణమును నడిపిన మారీచుని కుమారుడగు కాలనేమి.
ఒక పర్యాయము మారీచ వృత్తాంతమును పునశ్చరణ
చేసుకొందాము. మారీచుడు పుట్టుకతో రాక్షసుడు. తాటక
అనే యక్షిణికి, సుందుని వల్ల కలిగిన వాడు. రామ లక్ష్మణులు
ధనుర్థారులై కౌశిక యాగ సంరక్షణ చేస్తున్న సమయములో తన అనుచరగణంతో యాగవిద్వంసానికి
వచ్చిన మారీచుని శ్రీరాముడు మానవాస్త్రంతో కొట్టగా, మారీచుడు నూరు యోజనముల
దూరంలోనున్న దక్షిణ సముద్రంలో పడతాడు. అంతటితో అతను రాక్షస ప్రవృత్తిని
విడనాడి పర్ణశాల నిర్మించుకొని తపోనిరతుడై జీవితమును సాగించుతూ ఉంటాడు.
లక్ష్మణునిచేత ముక్కుచెవులు ఖండింపబడిన శూర్పణఖ చేత ప్రేరేపింపబడిన రావణుడు
మారీచుని సహాయమర్థించుతాడు. రాముని పరాక్రమును గూర్చి తెలుపుతూ
రకారాదీని నామాని
రామత్రస్తస్య రావణ
రత్నాని చ రథాశ్చైవ
త్రాసం సంజనయన్తి మే
*రాముడంటేనే కాదు, ‘ర’ అనే అక్షరంతో ప్రారంభమయ్యే
రత్నాలు, రథాలు లాంటి ఏ మాటవిన్నా భయం కలుగుతోంది. ఈ దండకారణ్యంలో ఏ
వృక్షాన్ని చూసినా జటా వల్కలాలు ధరించిన శ్రీరామునిలా కనిపిస్తున్నాయి. ఆ రాముడు నన్నూ
నిన్నేకాదు, మన పూర్వీకులైన బలి, నముచి వంటి మహావీరులను కూడా
చంపగల సమర్థుడు. కనుక... సీతాపహరణ ప్రయత్నం మానుకో’ అంటూ హృదయపూర్వకమైన సలహా ఇస్తాడు
మారీచుడు. పైగా
రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమః ।
రాజా
సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ ॥ 13 ॥
శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు, సాధు మూర్తి, నిరుపమాన పరాక్రమశాలి. దేవతలకు ఇంద్రునివలె అతడు సమస్తలోకములకును ప్రభువు
అని కూడా చెబుతాడు. రావణుడు ‘ సహకరించుతావా? చంపమంటావా?’ అనుటతో రాముని చేతనే
చావనెంచి మాయలేడియై మరణించుఁతాడు రాముని చేతిలో!
ఆ మారీచుని కుమారుడే ఈ కాలనేమి.
అసలు ఈ కాలనేమి వృత్తాంతమునకు పూర్వము మన వేదములు
ఏమి చెబుతున్నవో చూద్దాము. వేదములు కర్మ ప్రతిపాదనచేసి, దాని పరిపక్వత మోక్షము అని
చెప్పినవి. నిష్కర్మ స్థితిని చేరేవరకు మానవుడు ‘పునరపి జననం
పునరపి మరణం’ అన్న వాక్యమునకు కట్టుబడి ఉండవలసిందే! ఇది
మానవులకే గాక రాక్షసులకు కూడా తప్పదు. అమృతము త్రాగేవరకు దేవతలు కూడా ఈ కోవకు
చెందినవారే!
ఈ కర్మ సూత్రమును మూలముగా కొని కాలనేమి మరియు
కంసుని గూర్చి తెలియజేయుచున్నాను. మనకు హిరణ్య కశిపుని గూర్చి ప్రహ్లాదుని గూర్చి
తెలుసును గానీ హిరణ్యాక్షుని గూర్చి, విష్ణువు వరాహావతారియై ఆతనిని
మట్టు పెట్టింది తప్ప మిగతా వివరములు పెద్దగా తెలియవు. ఇపుడు ఆ విషయమును కాస్త
తెలుసుకొందాము.
హిరణ్యాక్షుని కుమారులు కాలనేమి అంధకులు. అంధకుని
ఇంద్రుడు వధించుతాడు. క్షీరసాగర మధన సమయమున విష్ణువు కాలనేమిని వధించుతాడు. కానీ
రాక్షస గురువు శుక్రాచార్యుడు ఆతనిని తన సంజీవకరణి విద్యచే బ్రతికించుతాడు. పిమ్మట
కాలనేమి బ్రహ్మను గూర్చి తపస్సుచేసి దేవతలచే చంపబడకుండా వరము పొందుతాడు. దేవీ
భాగవతంలో ఈ రహస్యమును గూర్చి మనకు తెలియవస్తుంది.
కాలనేమికి ఆయన కుమారులకు ఒక లంకె వున్నది. అది
ఏమిటి అన్నది తెలుసుకొందాము. పూర్వం మరీచి, ఊర్జా దేవి అనే యిద్దరు దంపతులు
ఉండేవారు. మరీచి సప్తర్షులలో ఒకడు. వారిరువురికీ
ఆరుగురు పిల్లలు కలిగినారు. వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. ఈ ఆరుగురు
ఒకసారి చతుర్ముఖ బ్రహ్మ సభకు వెళ్ళటం తటస్థించింది.
వారు బ్రహ్మ కూర్చుని ఉండగా నిష్కారణంగా నవ్వటము
జరిగింది. బ్రహ్మ ఆ అకారణ హాస్యమునకు కుపితుడై ‘మీరు రాక్షసుని కడుపున పుట్టండి’ అని శపించటము
జరిగింది. అందువలన వారు ఆరుగురు
‘కాలనేమి’కి కుమారులుగా జన్మించినారు.
కాలనేమి పుత్రులుగా వున్న కాలములో బ్రహ్మను గూర్చి తపమాచరించి తమ విరోధులగు
ఇంద్ర ఉపేంద్రాది(ఉపెంద్రుడు అంటే విష్ణువు. కశ్యప అదితుల సంతానముగా ఇంద్రుని
తమ్ముడగు వామనునిగా పుడతాడు) దేవతలచే మరణము లేనట్లు వరమును పొందినారు. అపుడు హిరణ్యాక్షునికి కోపం వచ్చింది. తాను
యింకా తపస్సు చేసి దీర్ఘాయువును పొందకమునుపే
తన మనవలు పొందుట సహించలేక వారికి నిద్దురలోనే మరణము సంప్రాప్తించునట్లుగనూ, తదనంతర జన్మలో (ద్వాపరములో)
వారారుగురూ తమ తండ్రి మేనల్లుళ్ళు గా జన్మించి,
తండ్రి కంసునిగా జన్మించి
వారిని చంపునట్లును శపించుతాడు. ఆ శాప విమోచనం జరిగి, వారు
తిరిగీ బ్రహ్మజ్ఞానులైపోతారు. అందువలన నారదుడు వారికి శాప విమోచన కర్తయగుతాడు. ఇది
దేవీ భాగవతాంర్గతం. కృత ద్వాపరాలకు నడుమ త్రేతా యుగమున్నది. అందు కూడా కాలనేమి
అదేపేరుతో రావణుని మేనమామ యగుతాడు. రావణ సంరక్షణార్థము హనుమంతుని మోసగించబోయి ఆయన
చేతనే వధింపబడుతాడు. తదుపరి జన్మమే
కంసుడు. కంసుడు కృష్ణునిచేత ఏవిధముగా చంపబడినది అందరకూ తెలిసిన విషయమే.
ఇపుడు ‘కాలనేమి’ అన్న
పేరును గూర్చి కాస్త విశ్లేషించుదాము. నేమి అనగా చక్రము అన్న అర్థమును
గ్రహించవచ్చును. కాలనేమి అనగా కాల చక్రము అని అర్థము చేసుకొనవచ్చును. దీనికి ఆకులు
(spokes) వుంటాయి. మరి కాలచక్రమునకు ఆకులు ఋతువులే కదా!
ఇక్కడ అంతరార్థము ఏమిటంటే పరమాత్మ యగు విష్ణువు కాలము ను తన అదుపులో వుంచుకొని
యుంటాడు. అది ఆయనకే సాధ్యము. అందువల్లనే కాలమునకు ప్రతీకయైన ‘కాలనేమి’ శ్రీహరితో
తలపడి జన్మ జన్మాన్తరాలలో అసువులు బాయుచునే వుండిపోయినాడు. ఇక్కడ కాలనేమి అన్న
మాటను వేరొక విధముగా కూడా విశ్లేషించవచ్చును. ‘కాల’ అన్న మాటకు ‘నలుపు అన్న అర్థము
కూడా కలదు సంస్కృతములో! కాల చక్రము అన్నపుడు నలుపును చేరబోవుచున్న చక్రముయొక్క
భాగము. అంటే రానురనూ ద్వాపరము కలిలో ప్రవేశించ బోతున్నది అని అర్థము(అసలు
కాలనేమిప్రతియుగాములోనూ జన్మమేత్తుచునే వచ్చినాడు కావున అతను కాలము తదుపరి యుగమును
చేరుటకు సంకేతమై నిలచినాడు.). మరి కంసుడు కదా ద్వాపరములో వుండినది అన్న సందేహము
వెంటనే కలుగుతుంది. అదే చెప్పబోతున్నాను. కంసము అంటే వెడల్పు మూతి గల గిన్నె. ఇది
కూడా వృత్తాకారమే! మరి కంసుడు కాలనేమియే కదా! కావున కంసునిగా కాలనేమి, దేవకీ
గర్భమున జనించిన, పూర్వ జన్మములోని తనకుమారులను సంహరించి వారికి బ్రహ్మత్వమును
ప్రసాదించి తాను మానవ రూపధారియగు కృష్ణుని చేతిలో మరణించినాడు.
ఇందుమూలముగా మనకు తెలియవచ్చినది ఏమిటంటే కాలము
పరమాత్మను అనుసరించవలసిందే! మనము కాలనుగుణముగా నడచుకొన వలసినదే! కానీ ఆ కాలాధిపతి
కరుణ మనము పొందగలిగితే కాలము యొక్క వికృత రూపము మనము చూడనవసరము ఉండదు.
స్వస్తి.
No comments:
Post a Comment