Wednesday, 25 April 2018

కన్యాదానము


కన్యాదానము
https://cherukuramamohanrao.blogspot.com/2018/04/blog-post_25.html
తైత్తరీయ ఉపనిషత్‌(2.9.4.7)లో 'అథో అర్థో వా ఆత్మనః యత్పత్నీః'  అని ఉంది. అంటే 'ఏ పురుషుడైనా తనంత తానుగా సగమే. రెండవ సగం అతని భార్య' అని అర్థం. జీవితంలో అంతటి ప్రధానమైన పాత్రగా స్త్రీని వరుని అర్ధాంగిగా చేసేది వివాహం.  ఏ వర్ణమున కావర్ణము వారు వివాహ యోగ్యత వచ్చిన వరునికి యోగ్యమైన వధువును చూడటము, పరస్పర ఆమోదముతో కన్యక తండ్రి కన్యను దానము చేయటము ఆర్షధర్మము. నన్ను అపార్థము చేసుకొనకుంటే ఒక్క మాట. మన వేదమంత్రములలో కన్యను గూర్చి మాత్రమే చెప్పినారు. విధవలు, భర్తను వదలినవారు కన్యలనిపించుకోరు. 
వరుడు, వధువు లేకుండా తన వంశాంకురమును పొందలేడు. కావున మీ అమ్మాయిని దానము చేస్తారా అని అర్థించవలసినదే, లేక మా కన్యకను దానముగా గ్రహించుతారా అని వధువు తండ్రి అయినా అడుగవచ్చు అబ్బాయి గుణగణములు నచ్చితే! కొందరు ఈ కన్యాదానము అను మాటను కన్య+ఆదానముగా విభాజించుతారు. అప్పుడు కూడా కన్యకను గ్రహించుట అనే అర్థము. అంటే 'ప్రదానము' వుంటే 'ఆదానము' వుంటుంది. బహుమతి ప్రదానము అంటే బహుమతినిచ్చుట అన్న మాట గుర్తుంటుందనుకొంటాను. దానము వుంటే ఆదాన ప్రదానములు వుంటాయి.

ఒక దానం నిర్వహించవలెననుకుంటే దాత ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయవలసి వుంటుంది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదని శాస్త్రం చెప్తుంది. కానీ ఇక్కడ గమనించవలసిన విషయము ఒకటి వుంది. గ్రహీత, ఇచ్చేవాని అభిమతము మేరకు ఇచ్చినది పుచ్చుకోవలసినదేకానీ, ఇది కావాలి, అది కావాలి, ఇట్లు కావాలి అట్లు కావాలి అని అడిగే అధికారమునకు అతనికి అర్హత ఉండదు.

కన్యాదాత, అంటే తండ్రి, దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవారు వరుడు, అతని తలిదండ్రులు. సకలసద్గుణ సంశోభితునిగా వరుని తలచుటచేత వారి వంశమును నిలబెట్టుటకు కన్యాదాత  అంతవరకు అల్లారుముద్దుగా పెంచిన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. మరి వరుని తల్లిదండ్రులు కన్యాదాత  ఔదార్యానికి తలవంచాలిగదా! మరి గొంతెమ్మ కోరికలు కోరవచ్చునా?

కావున పెళ్లిని ఒక వేడుకగా జరుపదలచితే ఇరువైపులా ఆమోదయోగ్యమైన, దాతకు ఆర్థికముగా ఇబ్బంది కలుగని రీతి లో మెలగవలసివుంటుంది. అవసరమైతే ఆదుకోనవలసికూడా వుంటుంది. అంతేకానీ పెత్తనము చలాయించే అధికారము ఉండదు. ముఖ్యముగా వరుని వైపు పెద్దలు తమ ఇంటికి, అంత వరకూ అల్లారు ముద్దుగా పెంచుకొన్న తమ  లక్ష్మిని నిస్వార్థముగా, ఆమె తలిదండ్రులు, పరాయి ఇంటికి పంపుచున్నారు. అంతవరకు అమ్మాయి పేరును అంటిపెట్టుకొనియున్న తమ ఇంటిపేరునే త్యాగము చేయుచున్నారు.
అంతకన్నా ఇంకేమీ కావలయునో ఆలోచించడి? ఇంతకు మించిన త్యాగము ఉంటుందా తెలుపండి.

"సీతారాములలా ఉండండి!" అని వధూవరులను ఆశీర్వదించడం కాదు, అసలు నిజంగా సీతారామకళ్యాణ ఘట్టం చదివితే, మగ పెళ్ళివాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది. జనక మహారాజు, దశరథ మహారాజును అడుగుతారు "మీకు మా కుమార్తెని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా?" అని. అప్పుడు దశరథ మహారాజు "అయ్యా! ఇచ్చేవాడు ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది" అని. దశరథుడు ఎన్నో యజ్ఞయాగాదులను జరిపించిన మహారాజు. తన కుమారుడైన రామచంద్రుడు ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో గుణవంతుడు. అయినా దాత అయిన జనకునితో మాట్లాడేటప్పుడు తన మర్యాదలో, తన హద్దులో తాను ఉన్నాడు. ఇది మనము నేర్చుకోవలసినది.

అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారూ కూర్చుని సీతారామకళ్యాణ సర్గ చదవాలి. ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు! అసలు ఒక ఇంటి మట్టు మర్యాద ఏమిటో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది. ఇరువైపులా వారిని గూర్చీ తెలుస్తుంది. కుటుంబ సంస్కారాలు బయట పడే సమయము అదే!

తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? "పెళ్ళి బాగా గొప్పగా జరిపించండి!" అని మగపెళ్ళివారు ప్రత్యేకంగా చెప్పాలా? కన్యాదాత తనకు ఉన్నదానిలో  వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చినవానికి ఏర్పాట్లు ఎలా చెయ్యాలో చెప్పడానికి అధికారం ఉండదు.
కట్నాలు, ఎదురు కట్నాలు, పెళ్ళి వాళ్ళ అరుపులు, కేకలు, అత్తవారి చివాట్లు, ఆడపడుచుల దబాయింపులు - ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు.
'సాలంకారం మమ సుతాం కన్యాం దాస్యామి తే ద్విజః
పాణిం గృహీత్వా సాగ్నిస్త్వం గచ్ఛ స్వాగచ్ఛ మద్గృహమ్‌'

అంటే
 'నీకు సర్వాలంకార భూషిత అయిన మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేయిస్తాము. ఆమె చేతిని గ్రహించి, ధర్మపత్నీ సమేతుడవై, త్రేతాగ్నులతో వెళ్లగలవు. ఇప్పుడు మా ఇంటికి రాగోరుతున్నాం' అని అర్థం. ఈ వినతితో ఆ బ్రహ్మచారి, తన కాశీయాత్రను తాత్కాలికంగా పక్కన పెట్టి వివాహానికి అంగీకరిస్తూ, కల్యాణమండపం వైపు అడుగులు వేస్తాడు. ఇక్కడ అగ్ని యొక్క ప్రస్తాపన వచ్చింది కాబట్టి ఒక్క మాట చెబుతాను. శూద్ర అన్నది ఒక సంపూర్ణ సేవాసహకార వర్గమే కానీ దానికి ఎటువంటి న్యూనత కూడా వేదములలో ఆపాదించబడిలేదు. 
వారు పనిలోనే పరమాత్మను చూసే వర్గము. వారి కొరకు కూడా వేదమూర్తులగు బ్రాహ్మలు ఎన్నో క్రతువులు చేస్తారు. ముఖ్యముగా శంకరులవారి నాలుగు ఆమ్నాయ పీఠములు ఇటువంటి ఎన్నో కార్యములను నిర్వహిస్తూవుంటాయి. ప్రచారము వారి గుణము కాదు. ఈ విషయమును ఇప్పుడు ఎందుకు చెప్పినానంటే అగ్ని కార్యములు శూద్రులకు వుండవు కానీ వారు కర్తలుగా క్రతువులను చేయించవచ్చు. పై శ్లోకములో తెల్పిన  ఈ అగ్ని, దేహములోని అగ్నికి ఆహూతులను అంటే వంటకాలను తయారు చేయుటకు వధువు ఉపయోగిస్తుంది. మనము తినే ఆహారము నియమబద్ధముగా ఉండవలెను. మన శరీరమే పరమాత్ముని నివాసగృహము. అందువల్ల మనము తినే తిండి దేవునికి నైవేద్యముతో సమానము.
ఇక ఈ మంత్రమును గమనించండి.
కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాంI
దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగీషయాII
 అన్న వాక్యాలు పురోహితుడి నోటి వెంట వస్తాయి. దీని అర్ధం-"ఈమె బంగారం వంటి మనస్సు కలది. కుందనము వంటి శరీర చాయ కలది. శరీరమంతా ఆభరణాలు కలిగినది. నా పిత్రాదులు సంసారంలో విజయం పొంది శాశ్వత పరమపదప్రాప్తి పొందినట్లు పూర్వులచే విన్నాను. నేనూ ఆ శాశ్వత బ్రహ్మలోకప్రాప్తి పొందేందుకు విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానం చేస్తున్నాను" అని కన్యా దాత అంటారు. ఇది చతుర్వర్ణములకూ సమానమే! మన వివాహ మంత్రములు ఎంత ఉదాత్తభావములను కలిగి వున్నాయో గమనించండి.
పరమతములలో వివాహములు ఒడంబడికలతో కూడుకొన్న పత్రములు మాత్రమే.

ఇక ఇక్కడ అబ్బాయి తండ్రిగా ముందు దశరథుడు జనకునితో ఏమి చెబుతాడో చూడండి.
 ప్రతిగ్రహో దాత్రువశశ్రుతమే తన్మయా పురాI
యథా వక్ష్యసి ధర్మజ్ఞతత్కరిశ్యామహే వయంII (బాల కాండ 69/14)
దశరథుడు ఆనందముతో కన్యను ఒసంగుట అన్నది, ఆమెను దానము చేయుచున్న మీ ఆధీనములో వున్నది. మాలో ఏమున్నది? మీరు చెప్పినట్లే తప్పక చేయగలవారము. ఇది వరుడు శ్రీరామచంద్రుని తండ్రియగు దశరథుడు చెప్పిన మాట. మరి అంతటి మహానీయునిమాట మనకు ఆదర్శము కావలెనుకదా!
అందుకు జవాబుగా మనకు రామాయణము బాలకాండము లోని 73 వ సర్గ సీతా కళ్యాణ వైభోగమును గూర్చి తెలుపుతుంది. అందులోని 26, 27 శ్లోకములు అత్యంత ముఖ్యమైనవి. ప్రతి తండ్రీ తన బిడ్డను ధారా దత్తము చేయునపుడు ఈ రెండు శ్లోకముల నాలుగు పాదములలోని మొదటి మూడు పాదములూ చెప్పితీరవలసిందే!
ఇయం సీతా మమ సుతా సహధర్మ చరీ తవI
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినాII.
పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదాI
ఇత్యుక్త్వా ప్రాక్షిపద్ రాజా మంత్రంపూతం జలం తథాII .
కళ్యాణమును సప్తపది అని కూడా అంటారని అందరికీ తెలిసిందే!
జనకుడు సీతను గూర్చి ఏమేమి చెప్పినాడో చూడండి:
 1. ఈ సీత ….2. నా కుమార్తె … 3. నీకు సహధర్మ చరి
4ఈమెను స్వీకరించు …
 5నీకు మంగళమగు గాక…. 6. 
ఈమె చేతిని నీ చేతితో గ్రహించు.

7. పతివ్రతాశిరోమణియైన మహానుభావురాలు, అయిన ఆమె ఎల్లప్పుడూ నిన్ను ఛాయ వలె అనుసరించి నడుస్తుంది.
ఏడు మాటలే మాట్లాడేడు జనకుడు . సప్తపది అది . వివాహం అనేది జీవితాంతం ఉండే స్నేహం . 'సఖ్యం సాప్తపదీనం' అని ఏడు మాటలతో స్నేహితులై పోతారు .
ఇందులోని ప్రతి పదం అసలు ఎందుకు వాడి ఉంటారు మహర్షి అని కనుక మనము యోచించుట మొదలు పెడితే
 తెలియజేయుటకు నా మేధస్సు చాలదు, ఒకవేళ వుంటే!
ఒక్క విషయము చెప్పి ఈ వ్యాసమును ముగిస్తాను.
భార్యాభర్తల సంబంధం ఎట్లుండవలెనని మన పెద్దలు నిర్దేశించినారో చూడండి :--
వివాహ సమయంలో సప్తపది అనే తంతలో చదివే మంత్రాలలో 
ఒక మంత్రం:
సఖా సప్త పదాభవ, సఖావౌ సప్త పదా బభూవః,
సఖ్యంతే గమేయం,
 సఖాత్తేమాయోషంసఖ్యాన్యే మయోష్టా:
అనగా ఈ ఏడడుగల బంధంతో భార్య,
 భర్తలమైన మనం ఇకపై
స్నేహితులుగా ఉంటూ,
 పరస్పరం స్నేహ భావాన్ని విడవకుండా
పయనిద్దాం. ఎంత ఉదాత్తమైనభావన!
 ఆపత్స మిత్రం జానీమః 
కష్టాలలో ఆదుకొను వాడే మిత్రుడు. అట్టి మిత్రభావంతో భార్యాభార్తలు
ఉంటే,
 వారి మధ్య కలతలు, కార్పణ్యాలు , ఆవేశకావేశాలు,
అసమానతలు లేకుండా నిత్య వసంతంలా వారి జీవితం 
సాగిపోతంది. 
ఇంకా—
 సంతుష్టో భార్యయా భర్తా భర్తా భార్య తధైవచ/
యస్మిన్నేవ కులేన్నిత్యం కల్యాణం తత్రవైధృవం
  అనగా
భార్య
 ,భర్తలు పరస్పరం ఒకర్ని ఒకరు గౌరవించుకొంటూ ప్రేమానురాగాలతో సంతుష్టంగా ఉంటారో! ఆ ఇల్లు నిత్యకళ్యాణం పచ్చ తోరణంగా విలసిల్లుతుంది.
నేను తెలియజేసిన ఈ విషయములు సనాతన ధర్మమును పాటించే ప్రతిఒక్కరికీ సంబంధించినవి. ఇందులో సంకుచితత్వమునకు తావు లేదు.
స్వస్తి.



Thursday, 19 April 2018

ఆది శంకరులవారి కాలనిర్ధారణ

ఆది శంకరులవారి కాలనిర్ధారణ
    https://cherukuramamohanrao.blogspot.com/2018/04/blog-post_19.html
సనాతన ధర్మ  ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు . ఆది శంకరులు, శంకర భగవత్పాదులు, అపర శంకరులు అని కొనియాడబడే జగద్గురు శంకరాచార్యులవారిని గూర్చి ప్రతి సనాతన ధర్మావలంబికి తెలుసుకొనవలసిన బాధ్యత ఎంతైనా వున్నది. ఆయన  గురువేగాక, మహాకవి, మహా భక్తుడు, వేదాంతి,ఒక సన్యాసి రూపములో ఈ పుణ్యభూమి నాలుగు చెరగులు నడచి ధర్మ ప్రతిష్ఠ చేసిన మహనీయులు .
శంకరులు  ప్రతిపాదించిన అద్వైతసిద్ధాంతము సార్వజనీనము. శంకరులు సాక్షాత్తు పరమశివుని అవతారమని నమ్మకం ఉంది.
దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః
దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించినాడు. (శివరహస్యము అన్న గ్రంధము నుండి).
కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా
శ్రౌత,స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి,వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు, నీల లోహితుడు అనగా నీలి వర్ణపు రక్తము గలిగిన వాడు అని అర్థము. కాలకూట విషము మింగుట వలన ఆయన రక్తమునకు ఆ వర్ణము కల్గినది అన్నది అన్వయము. ఆయనే శివుడు.ఆయనే  స్వయంగా శంకరుల రూపంలో అవతరించినారు. (కూర్మపురాణం నుండి).ఈ సనాతన ధర్మముపై  శంకరుల ప్రభావం అసమానమైనది.
శంకరులు సాధించిన ప్రధాన విజయాలు:
బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, శంకరులు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పింపజేసినాడు. అసలు ఆయన బౌద్ధముకన్నా ఇతరములైన సనాతన ధర్మ శాఖలను తన వాదముచే సమన్వితము చేసి సంఘటిత పరచినాడు.ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామములకు భాష్యములు వ్రాసినారు. తరువాత శంకరుల అనుసరించినవారికీ, శంకరులతో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయుక్త మైనాయి.
శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలనుస్థాపించినారు. అవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేచేస్తూ వున్నాయి. వారు రచించిన అనేకానేక భక్తి వేదాంత గ్రంధములను పరిగణన లోకి తీసుకొని అందునుండి 'భజగోవిందము' అన్న అతి చిన్న పుస్తకమునకు  టిప్పణి వేదాంతులలో నిష్ణాతులైనవారు వ్రాస్తే 1000 పుటలకు తక్కువగాని గ్రంథమౌతుంది. శంకరులవారి
జీవితమును గూర్చి, అంటే కాలడి, పూర్ణానది, సన్యాసము, తల్లి ఉత్తరక్రియలు సన్యసించినా కూడా తల్లికి ఇచ్చిన మాట నిలుపుకొనుటకు కాలడికి సమయానికి వచ్చి జరపతము, నాలుగు ఆమ్నా య పీఠములు స్థాపించినది , ఈ సనాతన ధర్మమును పునః ప్రతిష్ఠించినది నేను విస్తారముగా తెలుపుట లేదు ఎందుకంటే ఇది ఎక్కువమందికి తెలిసినదే కాబట్టి. ఇప్పుడు ముఖ్యముగా ఆయన కాల నిర్ధారణను గూర్చి మాత్రమె తెలుపుచున్నాను.
శంకరులవారి కాలనిర్ధారణ 
'చరిత్ర' అంటే 'చత్తరా' అనే కాలము లో మనమున్నాము. తల్లి తండ్రుల చాయాచిత్రములు పదిల పరచుకొనే పిల్లలను ఇంకా మనము చూస్తూనే ఉన్నాము. మరి ఆ తల్లిదండ్రులు గతించినా చిత్తరువులు గోడనతుకు కొనియే   వున్నాయి కదా మరి అది చరిత్ర కాదా. ఆ చిత్రములు మాలలువేసి బొట్లు పెట్టి ధూపదీపములుసమర్పించి  మన భక్తీ ప్రపత్తులను చాటుకొంటాము . మన కుటుంబ అభివృధ్ధి కొరకు పాటు పడినవారినే గుర్తు పెట్టుకొని తరువాతి తరానికి ఆ పెద్దల గొప్పదనాన్ని అందజేస్తున్నామే , మరి విశ్వ శ్రేయస్సు కోసం నిస్స్వార్థంగా శ్రమించిన మహనీయుల చరిత్ర గుర్తు పెట్టుకోనవసరం లేదా. కాస్తో కూస్తో మేలుచేసిన కారణానికి జయంతులని, వర్ధంతులని ఆయా తేదీలు గుర్తుపెట్టుకొని కొందరు పెద్దలకు నివాళులర్పించుకొంటున్నామే మరి విశ్వ శ్రేయస్సే ప్రాధాన్యముగా , మరల భూమి పై ధర్మప్రతిష్ఠాపనకు కంకణం కట్టుకొని నెరవేర్చి అతిపిన్న వయసులోనే పరమపదించిన జగద్గురువులైన శంకరుల వారి కాలనిర్ణయము తెలుసుకోన వలసిన బాధ్యతా మనపై లేదా!

మనచరిత్ర పై మనకు భక్తీ, గౌరవము, శ్రద్ధ మనకుంటుంది. మన ప్రవర మన ప్రక్కన యున్నవాడు చెబితే మనకెట్లుంటుంది. మన చరిత్ర ఆంగ్లేయులు చెబితే మనకూ అట్లే వుండాలి కదా. ఒక సంస్థ తన కార్యాచరణ బేరీజు వేసుకోవాలంటే తన గత ప్రస్థుత పరిస్తితులను పరిగణనలోకి తీసుకొని భవితకు బాట వేసుకొంటుంది. మరి సంస్థలకే చరిత్ర అవసరమైతే దేశానికి అవసరం లేదా. గతము గుర్తుంచుకొంటే ఆ గుర్తులవెంట మనము నడవ వచ్చు.

మన చరిత్ర తమకన్నా ప్రబలమైనది కాకూడదనే దుర్భుద్ది తో మన చరిత్ర వ్రాసినవారు పాశ్చాత్యులు . అందులోభాగంగానే జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారి కాలాన్ని క్రీ.శ. 788 గా నిర్ణయించినారు.మన మొదటి ప్రధాని పుణ్యమాయని ఇప్పటికీ మనకు ఆంగ్లేయుల వుచ్చిష్టము మెసవక తప్పుటలేదు.

'విమర్శకాగ్రేసర''భారత చరిత్ర భాస్కర' మహామహులైన కోట వెంకటాచలం గారు శంకరులవారి కాలాన్ని సహేతుకంగా నిరూపించినారు. ఆ వెలుతురులో మన యానము ప్రారంభించుదాము.

శంకరుల కాలమునుండి అవిచ్ఛిన్నముగా గురుపరంపర గలిగిన జోషిమఠము,పూరి,ద్వారక,కంచి మఠములు కలి 2593(క్రీ.పూ. 509) శంకరుల కాలంగా నిర్ణయించినారు.

ఈ వాదమునకు నందన సంవత్సర వైశాఖ శుక్ల పంచమి ఆదివారం నాడు పునర్వసు నక్షత్రయుక్త ధనుర్లగ్నమందు శివగురు ఆర్యాంబ దంపతులకు జన్మించినట్లు ఈ క్రింది శ్లోకము తెలియబరచుతుంది. ఇది శంకరులవారి సహాధ్యాయులుగా వుండి పిమ్మట వారి శిష్యుడై సన్యసించి, వారి తదనంతరము గూడా బ్రతికిన చిత్సుఖాచార్యుల వారు వ్రాసిన 'బృహత్ శంకర విజయము' లోనిది.
"తిష్యే ప్రయాత్య నలసేవధి బాణనేత్రే |
యే నందనే దినమణా వుదగధ్వభాజి |
రాధే సితేరుడువినిర్గత మంగ లగ్నే ప్యా  |
హూతవాన్ శివగురుః సచ శంకరేతి ||
అనల =3(త్రేతాగ్నులు), సేవధి==9(నవ నిధులు),బాణ = 5(పంచ బాణుని
బాణములు) నేత్రే =2(కళ్ళు) (సంఖ్యా గణనములో 'భూత సంఖ్య ' అన్నది ఒక గణనా విధానము.)
మిగిలినది మరోమారు.........
ఆది శంకరులవారి కాలనిర్ధారణ - 2 వ భాగము 

'సంఖ్యాం దక్షిణతో వామః' అని శాస్త్ర వాక్యమని మన చంద్రశేఖర సరస్వతులవారి ఉవాచ.కావున ఆ సంవత్సరము కలి 2593 ఔతుంది. ఇపుడు ఈ మొత్తము శ్లోకము యొక్క సారాంశము ఏమిటంటే 'నందన సంవత్సర వైశాఖ శుక్ల పంచమి ఆదివారము పునర్వసు నక్షత్రయుక్త ధనుర్లగ్నమందు అనగా పై తిథి వార నక్షత్రములు కల్గిన కలి సం. 2593(క్రీ. పూ. 509)లో శంకరులవారు శివగురు దంపతుల శిశువు గా జన్మించినారు.
'జినవిజయ' మనెడు జైన గ్రంథము ఈ విధముగా చెప్పు చున్నది :తదనంతరము 15 సం. గడచిన తరువాత అంటే క్రీ.పూ. 494 లో,కర్మకాండను(పూర్వమీమాంస) కైవల్య మార్గముగా ప్రతిపాదించిన కుమారిల భట్టు, (శంకరులకన్నా 48 సం. పెద్దవారు), మహాశయులను, వారు కుమ్ము (వేరుసెనగ పొట్టు నివురు గప్పిన నిప్పు)లో ఆత్మాహుతి చేసుకొనుచున్నఅవసాన దశలో శంకరులవారు వారిని కలిసినట్లు ఈ క్రింది శ్లోకములో చెప్పబడినది.
ఋషి ర్బాణ స్తధా భూమి ర్మర్త్యాక్షౌ వామమేళనాత్|
ఏకత్వేన లభేతాంకం తామ్రాక్షా తత్ర వత్సరః|
ఋషి =7(సప్తర్షులు),బాణ(మన్మధ బాణములు)=5,భూమి=1,మర్త్యాక్షు (మానవుని కన్నులు)=2 ,తామ్రాక్ష =రక్తాక్షి నామ సంవత్సరము
విలోమముగా లెక్కించితే యుధిష్ఠిర శక (జైనులు ,బౌద్ధులు యుధిష్ఠిర శకమును పాటించుతారు. ఆయా మతములకాద్యులు క్షత్రియులు కావుననేమో.)2157 సం. న నిర్యాణమని చెప్పబడినది. యుధిష్ఠిర శకము
కలి.468 లో మొదలైనది. అంటే శంకరులవారి  నిర్యాణము కలి 2625 లో జరిగినట్లు రూఢి యగుచున్నది. అంటే
క్రీ. పూ. 477 అగుచున్నది. అంటే అప్పటికి శంకరులవారి వయసు 32 సం.లు.
వారిని గూర్చిన వివరము ఈ క్రింది శ్లోకములో వున్నది.
అష్ట వర్షే చతుర్వేది ద్వాదశే సర్వ శాస్త్రవిత్
శోడసే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మునిరత్యగాత్
8 సం. లో 4 వేదాలు నేర్చుకొని 16 ఏండ్లకు సకలశాస్త్రములను ఆకళింపు చేసుకొని 16 సం. లకు భాష్యములను వ్రాసి 32వ ఏట కైవల్యమును పొందినారు.
వారు 491క్రీ. పూ. లో ద్వారకా మఠమును,486క్రీ. పూ.లో జ్యొతిర్మఠమును 485క్రీ. పూ.లో గోవర్ధన మఠమును 484క్రీ. పూ. లో శృంగేరి మఠమును స్థాపించి వరుసగా హస్తామలక, తోటక ,పద్మపాద,సురెశ్వరులను పీఠాధిపతులనుజేసి కంచి పీఠమునేర్పరచి దానిని వారే అధిష్ఠించారు. ఒక్కశృంగేరి  ీపీఠము తప్పించి,మిగత పీఠములన్నియు, స్వల్ప వ్యత్యాసముతో క్రీ. పూ.5వ శతాబ్దమునే బలపరచుచున్నవి. ప్రముఖ చరిత్రకారులు డా.సర్ జడునాథ్ సర్కార్ గారు తమ 'HISTORY OF DASANAMI NAGAS' లో ఈ విధంగా తెలియబరచినారు : "No paper earlier than the 19th century has been preserved at sringeri mutt and the same list can be accepted as correct at the best from 19th century downwards but not earlier than that period."ఇదే పుస్తకములో వేరొకచోట ఆర్. యన్. ఘోష్ అను నతడు తనకు శివాభినవ నృసింహ భారతీ స్వామివారు ఈ విధంగా చెప్పినట్లు తెలియబరచుచున్నారు "At the request of modern archaeologist,my guru constructed this list......you may take it true or false" అని వ్రాసినారు. దీనిని బట్టి మనకు తెలియవచ్చుచున్నదేమిటంటే వారి వద్ద ఏకారణాంతరాలవల్లనో ఆ రికార్డులు అలభ్యములని తెలియవచ్చున్నది.

పండిత కోట వెంకటాచలం గారి 'మహా భారత యుద్ధ కాలము' అను పరిశోధనా గ్రంథములో 56పేజి నుండి 60వ పేజి వరకు సుధన్వ సార్వభౌముని శాసనమును గూర్చి తెలిపియున్నారు. ఈ శాసనము శంకరులవారికి యుధిష్ఠిరశకము 2663(క్రీ. పూ.477) రక్తాక్షి సంవత్సర ఆశ్వయుజ శుధ్ధ పౌర్ణమికి విజ్ఞ్యప్తి పత్రముగా సమర్పింప బడినది . అటుపిమ్మట కార్తీకములో జగద్గురువులు కైలాస యాత్ర చేసినారు. దీనితో శంకరులవారి కాలము రుజువౌతున్నది.

దీనిని మించిన ఇంకొక నిర్దుష్టమైన ఆధారము ఇక్కడ పొందు పరుప బడినది.
"PILGRIMAGES IN KASHMIR"
"Sankaraacharya"- The shrine is situated in the city of Srinagar. It is an ancient temple crowning
'Takht-i-Sulemaan’hill and standing 1000ft. above the valley. The temple as well as the hill take the name from Sankaraachaarya the great South Indian Teacher of Monoism, who came to Kashmir from
Travancore. The temple was built by king Gopaditya who reigned in Kashmir from 368B.C. to 308B.C. It was repaired by the liberal minded Muslim king Zain-Ul-Abdin" (The Hindu, dated 17th July, 1949, page15, 2nd column)    ఇంతకంటే సాక్ష్యాధారాలు అవసరమా. అయినా ఇంకా కొన్ని  ఈ పొందుపరచిన వివరాలను గమనించండి. 
ఆది శంకరులవారి కాలనిర్ధారణ - 3 వ భాగము 

 .ఆది శంకరులవారి కాలనిర్ధారణజ 1. పైనతెలిపిన శంకరుల జనన కాలము ఆ దినమున నాటి పంచాంగము ప్రకారమూ గ్రహగతి సరిపోవుచున్నది .
2. 'పతంజలి చరిత్ర' అన్న గ్రంథమాధారంగా గోవింద భగవత్పాదుల సిద్ధి క్రీ. పూ.493 గా నిర్ధారింపబడినది. శృంగేరి పీఠాధిపతులైన అభినవ విరూపాక్ష స్వాములవారు నిర్ణయించడము విశేషము. కావున ఇది కూడా శంకరులవారి జన్మ వత్సరమును బలపరచుచున్నది.
3. క్రీ.శ. 788 కన్నా ముందువారని చరిత్రకారులే ఒప్పుకొన్న మహేంద్ర వర్మ,భవభూతులవారి గ్రంథాలలో శంకరుల యొక్క అద్వైత సిద్ధాంత ప్రసక్తి వుంది. అంటే ఆయన ఆ కాలానికి చాలా ముందుకాలం వాడని మంకు చెప్పకనే అర్థమౌతుంది కదా.
4. బ్ర.శ్రీ. కోట వెంకటాచలం గారి నేపాల రాజుల వంశ చరిత్రలో శంకరులు, వృష దేవ వర్మ నేపాలును పరిపాలించే కాలంలో ఆ దెస పర్యటన చేసినట్లు చెప్పబడింది. ఆ రాజు పరిపాలనా కాలము కలి శకం 2555-2615 అని చారిత్రికులు నిర్ధారించినారని తెలియబరచి యున్నారు. అంటే ఆయన క్రీ. పూ. 547-487 కాలము వాడు . అంటే అప్పుడు కూడా శంకరుల వారు  క్రీ. పూ.509 - 477 మధ్యకాలము వాడే అని తెలియా వచ్చుచున్నది .
5.మాక్స్ ముల్లరు 'శంకర మందార సౌరభ ' మన్న గ్రంథమును పునాదిగా గైకొని శంకరులవారి జననము క్రీ.శ. 787-88 అని నిర్ధారించి యున్నారు. చిత్సుఖాచార్యులవారు రచించిన'బృహత్ శంకర విజయము'కంటే ఇది అధునాతనమైనది.పైగా  చిత్సుఖాచార్యులవారు శంకరులవారి సమకాలీనులు. ఆయన మాటను త్రోసిరాజని  'శంకర మందార సౌరభ ' మును గీటురాయిగా తీసుకొనుటెట్లు ?
6. డా. పోతక్ మొదలుగాగల కొంతమంది చరిత్రకారులు క్రీ.శ. 788 లో కంచి పీఠాధిపతియైన అభినవ శంకరులవారిని, ఆది శంకరులుగా భ్రమించి ఆదిశంకరులవారి కాలనిర్ణయము చేసినారు.
ఇన్ని సాక్ష్యాధారాలమధ్య శంకరులవారి కాలాన్ని పరిష్కరించుటవల్ల మనము పొందే లాభమేమి?
1.ఆ నాటి సాంఘీక ఆచార వ్యవహారాలూ తెలుసు కొనుట
2. వారి తదనంతరము దేశ కాల పరిస్థితిలను సమీక్షించుట
3. వారి తరువాత ఎందరు మహనీయులు ఉధ్భవించినారు మరియు వారి యోగదానము
4. వారి గోప్పదనములో అణు మాత్రమైనా మనము సాధింప ప్రయత్నించుట
5. వారి భాష్యముల,భాషణములద్వారా సచ్ఛీలత,తత్వ సాధనము మున్నగునవి గ్రహించి ప్రచలితము చేయుట మొదలగు వుపయోగము లేన్నోకలవు.
6.వాస్తవ కాలానికి మిధ్యా కాలానికి మధ్యన గల మహనీయులు మరుగై పోతారు.
సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామ్I
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాంII
నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ ।
వ్యాసం శుకం గౌడపదం మహాన్తం గోవిన్దయోగీన్ద్రమథాస్య శిష్యమ్ ॥
 అంతటి మహనీయునికి ఆయన జయంతి సందర్భముగా నేను ఈ విధముగా నా భక్తిని చాటుకొనుచున్నాను. దీనిని చదివి మీరూ యధోచితముగా మీ భక్తిని, మన పూర్వుల నిజ చరిత్రపై ఆసక్తిని, అట్టి పరిశోధనలపై అనురక్తిని, అందుకు తగిన శక్తిని అవసరమగు యుక్తిని ప్రసాదించమని పరమేశ్వరుని వేడుకొంటారని నమ్ముతూ శెలవు తీసుకొంటాను.
స్వస్తి. 


Tuesday, 10 April 2018

శుభ సుఖ్ చైన్ కి బరసే - आज़ाद हिंद फ़ौज कौमी तराना

మన సుభాస్ చంద్రుని నాయకత్వములో తయారయిన 
జాతీయము కాని మహత్తర గీతము
 (బాణీ: జనగణమన బాణీయే )


https://cherukuramamohanrao.blogspot.com/2018/04/blog-post.html

శుభ సుఖ్ చైన్ కి బరసే
భారత్ భాగ్య హై జాగా
పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా
ద్రావిడ్ ఉత్కల్ బంగా
చంచల్ సాగర్ వింధ్య హిమాలయ్
నీలా యమునా గంగా
తేరే నిత్ గుణ్ గాయేఁ
తుఝ్ సే జీవన్ పాయేఁ
సబ్ జన పాయేఁ ఆశా
సూరజ్ బన్ కర్  జగ పర్ చమ్కే
భారత్ నాం సుభాగా
జయ హో జయ హో జయ్ హో
జయ్ జయ్ జయ్ హో
భారత్ నాం సుభాగా

సబ్ కో మాన్ మే ప్రీత్ బసాయే
తేరీ మీఠీ వాణీ
 హర సూబే కే రహనేవాలే
 హర మజహబ్ కే ప్రాణీ
సబ్ భేద ఆర్ ఫక్ర్ మిటాకర్
 సబ్ గోద్ మేఁ తేరీ ఆగే
 గూంథే ప్రేమ్ కి మాలా
సూరజ్ బంకర్ జగ పర చమ్కే
భారత్ నాం సుభాగా
జయ హో జయ హో జయ్ హో
జయ్ జయ్ జయ్ హో
భారత్ నాం సుభాగా

సుబః సవెరే పంఖ్ పఖేరూ
తేరే హీ గుణ్ గాయేఁ
బాస్ భారీ భర్పూర్ హవాయేఁ
జీవన్ మే ఋతు లాయేఁ
 సబ్ మిల్కర్ హింద్ పుకారేఁ
 జయ ఆజాద్ హింద్ కే నారే
ప్యారా దేశ్ హమారా సూరజ్ బన్ కర్ జగ పర్ చమ్కే 
భారత్ నాం సుభాగా
జయ హో జయ హో జయ్ హో
జయ్ జయ్ జయ్ హో
భారత్ నాం సుభాగా
ఈ గీతము విన్నారా! ఇది నేడు మన జాతీయగీతముగా ఎన్నుకొనబడి పాడబడుచున్న రవీంద్ర నాథ్ ఠాకూర్ గారి 'జనగణమన అధినాయక జయహే' అన్న గీతమును ఆలంబనగా తీసుకొని 
ముక్త భారతదేశ తాత్కాలిక ప్రభుత్వము ( The provisional Government of Free India --  Ārzī Hukūmat-e-Āzād Hind) వ్రాయబడిన ఈ గీతమును జాతీయ గీతముగా ఆలపించుట జరిగినది. ఈగీతమునకు జాతీయ గీత స్థాయి దక్కవలసినదే కానీ దక్కలేదు. ఈ గీతము యొక్క భావము పూర్వాపరములు తెలుసుకొనుటకు పూర్వము 'జనగణ మన' ను గూర్చి కాస్త క్లుప్తముగా ముచ్చటించుకొందాము. 
ఈ గీతము జార్జ్ -5 గారు మనదేశమునకు వచ్చు సందర్భముగా నెహ్రూగారి మాటమేరకు రవీంద్రులవారు వ్రాసినట్లు చెప్పుకొంటారు. ఆ మాటను పుష్టి చేస్తూ అందలి సంబోధన కూడా పురుష వాచకమే అయి వుంది. మరి దేశమును సంబోధించేదయితే తల్లిగా పోల్చుకొంటాము కాబట్టి స్త్రీలింగ వాచకమై ఉండవలెను కదా! ఇదికాక ఈ గీతములోని పూర్తి పాఠములో ఒక చరణము స్త్రీ ని సంబోధించుతూ వుంటుంది. అది భారత మాత సంబోధన మాత్రము కాదు. అది జార్జ్ రాజు భార్యను సంబోధించినది అని మనకు సులభముగా అర్థమైపోతుంది. నేడు 'జనగణమన' 'వందే మాతరం' కన్నా ప్రాధాన్యత సంతరించుకొని దేశప్రజలచే కొనియాడబడుచున్నది. ఈ విషయమై విస్తారముగా గతములో వ్రాసియుండినాను. ఇప్పుడు పైన ఎరుకపరచిన గీతమును గూర్చి తెలుసుకొందాము. 

21 అక్టోబరు 1943 లో, రెండవ ప్రపంచ యుద్ధ సమయమున, జపాను దేశాధినేత ఆదరణతో Axis powers యొక్క సహకారముతో   British Rule కు విరుద్ధముగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వములో స్థాపింపబడినది. సంపూర్ణ స్వతంత్ర సముపార్జన తన ధ్యేయముగా, సంగీతాభిమానియైన బోసు తన సహచరులగు ముంతాజ్ హుస్సేన్ మరియు అబిద్ హసన్ సఫ్రాని (హిందువులకు గౌరవప్రదమగు కాషాయ వర్ణమును సమైక్యతా చిహ్నముగా తన పేరునకు చేర్చుకొన్నాడు) తో కలిసి పై గీతమును రచించుట జరిగినది. మరియిక కారణమేమిటంటే హైందవేతరులు ముఖ్యముగా ముస్లీములకు వందే మాతరం సంస్కృత ఉపమానములు శబ్దములు కలిగియుండుట చేత రుచించలేదు. అందుకే ఈ పాట బంగాలీ భాషలోగాక హిందుస్తానీ లో నడుస్తుంది అంటే ఉర్దూ పదాలు కూడా కలుస్తాయి. పైపెచ్చు ఇది యథాతథానువాదము కాదు. పరాయి పాలకులను పొగడలేదు. బానిసత్వ పోకడలు ఇందులో కనిపించవు. అయినా స్వాతంత్రము వచ్చిన తరువాత 24 జనవరి 1950 లో తర్జనభరజనల తరువాత బెంగాలీ గీతమగు 'జనగణమనకే' కే పట్టము కట్టినారు. ఈ గీతము సంపూర్ణముగా తెరమరుగైపోయినది. నేటి యువతకు అటువంటి ఒక దేశభక్తి గీతము ఉన్నట్లు కూడా తెలియదు.
ఇంకా ఈ గీతము ప్రత్యకత ఒకటి ఉన్నది. జనగణమన... లోని పదములను ఈ గీతములో వాడుకొన్నాగూడా వానిని దేశ ప్రజలు సవినయముగా భరతమాతను నుతించి నమస్కరించుటకు వాడుకొన్నారు. తమ జన్మభూమి గుణగానమును చేసినారు కానీ అన్యథా కాదు.
ఇక ఆ గీత భావము తెలుసుకొందాము.
 శుభ సుఖశాంతులు కురియజేసే భారత భాగ్యము  మేలుకొన్నది. పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ్ ఉత్కళము, బంగాళము, చంచల సాగరములు  వింధ్య హిమాలయాలు, నల్లని యమునా గంగా నీ శుభ గుణగణములే గానము చేస్తూవున్నాయి. మా ఆశలు ఆశయాలు నీ సౌభాగ్యముతోనే ముడిపడి వున్నాయి. సౌభాగ్యవంతమగు భారత భూమి సూర్యకాంతులు జగమంతా విస్తరిల్లవలె. సకల సౌభాగ్య దాతా మాతా జయ హో జయ హో జయ హో జయ జయ జయ జయ హో.
నీ మధురాతిమధురమైన వాణి అందరిలో ప్రేమను నింపవలె. ఏ ప్రాంతమునకు చెందినవారయిన, నీ వడిన, ఏ మతము వారయినా తమలోని భేదభవములను మరచి ప్రేమ మాలతో నిన్ను అలంకరించవలె. సౌభాగ్యవంతమగు భారత భూమి సూర్యకాంతులు జగమంతా విస్తరిల్లవలె. సకల సౌభాగ్య దాతా మాతా జయ హో జయ హో జయ్ హో జయ జయ జయ జయ హో.

సూర్యోదయముతో పక్షులు తమ కిలకిలారావములతో నీ గుణగానమే చేయవలెను. ఆగుణ సముదాయపరిమళ భరితమైన పవనము మాజీవితమును నిత్యవసంతము గావింపవలె. నీబిడ్డలమగుమేము స్వతంత్ర భారతమునకు జయము జయము అని జయజయ ద్వానములు చేయవలె. సౌభాగ్యవంతమగు భారత భూమి సూర్యకాంతులు జగమంతా విస్తరిల్లవలె. సకల సౌభాగ్య దాతా మాతా జయ హో జయ హో జయ్ హో జయ జయ జయ జయ హో.
ఇంత అర్థవంతమగు గీతమును ఆసాంతము విస్మరించి మనము దేశమాతకు న్యాయము చేసినామా అన్నది మిక్కిలి ఆలోచించదగ్గ విషయము.

స్వస్తి.

















Wednesday, 4 April 2018

శివాయ విష్ణురూపాయ - ఒక సంస్కృత చాటువు


శివాయ విష్ణురూపాయ - ఒక సంస్కృత చాటువు

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవేI
శివశ్చ హృదయం విష్ణుం విష్ణోశ్చ హృదయం శివంII
 యథా శివమయోర్విష్ణుః ఏవం విష్ణుమయః శివఃI
యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషిII
 అని చెప్పుచున్నది మనకు వేదార్థము. ఈ శ్లోకములు చాలా మందికి తెలిసే వుంటాయి. ఈశ్వరునికి కాలుడు అని ఒకపేరు. పైగా ఆయన లయుడు. తమోగుణ ప్రతీక అంటారు ఆయనను. కానీ ఆయన శరీరము అంతా తెలుపే. దానికి తోడూ తెల్లనైన భస్మము ధరిస్తాడు. వెండికొండలో ఉంటాడు. స్వచ్ఛమైన చంద్రుని కలిగియుంటాడు. ఆయన వాహనము నంది తెలుపు. ఎప్పుడూ చల్లదనము కలిగియుంటాడు. అభిషేక ప్రియుడు. ఈవిధముగా అన్నీ సత్వగుణ ప్రధానములగు గుణములనే కలిగియుంటాడు. మరి విష్ణువో సత్వగుణ ప్రధానుడు. కానీ ఆయన నలుపు. ఆయన పవళించే ఆదిశేషుడు నలుపు. ఆయన వాహనము గరుత్మంతుడు నలుపు. ఆయన స్థితి నిరత నిద్ర.
మనము కాస్త పరిశీలనాత్మకముగా ఆలోచించితే శివుని స్వరూప స్థితిగతులు సత్వగుణ సూచకములు. కానీ ఆయన లయ కర్త. మరి విష్ణువో బాహ్యలక్షణములన్నీ తామసికములు కానీ కర్తవ్యము మాత్రము దుష్ట శిక్షణ లోక రక్షణ. ఈ విధమగు ఆలోచన చేస్తే వారిది అభేద వ్యాజ్యము అని మనకు అర్థమైపోతుంది.
ఈ చాటువు గమనించండి. ఎంత చక్కగా మనకు ఆ అర్థము సార్థకమౌతుందో అర్థమౌతుంది.
వాసుదేవ ఇతి వామదేవ ఇతి ఆస్తి కల్పక మహీరుహద్వయం
యద్యపీహ సుమభేద సంభవః  నాస్తి తత్ర ఫలభేద సంభవః
వాసుదేవుడు అంటే విష్ణువు. వాసుదేవుని కొడుకైనందువల్ల వాసుదేవుడైనాడు కృష్ణుడు. మరి విష్ణువుకు మున్డునున్దియే వాసుదేవుడను నామము కలదు. ఆయన భూభారత. అందుచే భూమినుండి లభ్యమయ్యే వసువులకు కూడా ఆయనే నాథుడు. అందుకే వాసుదేవుడు. ఇక వామదేవుడు అంటే శివుడు. వామదేవ శబ్దానికి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. సులభమైన అర్థమును గ్రహించుదాము. మనము తూర్పును చూస్తూ నిలబడి ధ్యానాదులు చేయవలెను. అప్పుడు మన ఎడమచేయి ఈశాన్యమును చూపిస్తుంది. అక్కడ వున్నవాడు వామదేవుడు. 'వామము' అంటే ఎడమ అని అర్థము. శివునికి ఎడమవైపు పార్వతివుంటుంది. ఆమెకు దేవుడు అంటే ఆమె భర్త.

ఇక విషయానికి వస్తాము.
పై శ్లోకము యొక్క అర్థము ఏమిటంటే 'వాసుదేవుడు' 'వామదేవుడు' అనునవి రెండు కల్పవృక్షములట. ఆ వృక్షములకు పూవులు వేరట కానీ ఫలమేమో ఒకటేనట. ఇది చోద్యము కాదా! ఇందులో వున్న నిగూఢార్థమును తెలుసుకొంటే ఆశ్చర్యపోతారు. వాసుదేవ లో 'సు' వామదేవ లో '' అంటే సు-మ మాత్రమె తేడా. (సుమము అంటే పూవే కదా!). మిగతా అంతా ఒకటే. ఇరువురిలో ఎవరిని ఆరాధించినా ఫలమొకటే! ఎంత గొప్ప సందేశమును ఎంత చమత్కారముగా చెప్పినారో చూడండి. శంకరులవారు ఉపదేశించినది ఈ అద్వైతమే!

స్వస్తి