Thursday, 19 April 2018

ఆది శంకరులవారి కాలనిర్ధారణ

ఆది శంకరులవారి కాలనిర్ధారణ
    https://cherukuramamohanrao.blogspot.com/2018/04/blog-post_19.html
సనాతన ధర్మ  ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు . ఆది శంకరులు, శంకర భగవత్పాదులు, అపర శంకరులు అని కొనియాడబడే జగద్గురు శంకరాచార్యులవారిని గూర్చి ప్రతి సనాతన ధర్మావలంబికి తెలుసుకొనవలసిన బాధ్యత ఎంతైనా వున్నది. ఆయన  గురువేగాక, మహాకవి, మహా భక్తుడు, వేదాంతి,ఒక సన్యాసి రూపములో ఈ పుణ్యభూమి నాలుగు చెరగులు నడచి ధర్మ ప్రతిష్ఠ చేసిన మహనీయులు .
శంకరులు  ప్రతిపాదించిన అద్వైతసిద్ధాంతము సార్వజనీనము. శంకరులు సాక్షాత్తు పరమశివుని అవతారమని నమ్మకం ఉంది.
దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః
దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించినాడు. (శివరహస్యము అన్న గ్రంధము నుండి).
కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా
శ్రౌత,స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి,వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు, నీల లోహితుడు అనగా నీలి వర్ణపు రక్తము గలిగిన వాడు అని అర్థము. కాలకూట విషము మింగుట వలన ఆయన రక్తమునకు ఆ వర్ణము కల్గినది అన్నది అన్వయము. ఆయనే శివుడు.ఆయనే  స్వయంగా శంకరుల రూపంలో అవతరించినారు. (కూర్మపురాణం నుండి).ఈ సనాతన ధర్మముపై  శంకరుల ప్రభావం అసమానమైనది.
శంకరులు సాధించిన ప్రధాన విజయాలు:
బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, శంకరులు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పింపజేసినాడు. అసలు ఆయన బౌద్ధముకన్నా ఇతరములైన సనాతన ధర్మ శాఖలను తన వాదముచే సమన్వితము చేసి సంఘటిత పరచినాడు.ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామములకు భాష్యములు వ్రాసినారు. తరువాత శంకరుల అనుసరించినవారికీ, శంకరులతో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయుక్త మైనాయి.
శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలనుస్థాపించినారు. అవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేచేస్తూ వున్నాయి. వారు రచించిన అనేకానేక భక్తి వేదాంత గ్రంధములను పరిగణన లోకి తీసుకొని అందునుండి 'భజగోవిందము' అన్న అతి చిన్న పుస్తకమునకు  టిప్పణి వేదాంతులలో నిష్ణాతులైనవారు వ్రాస్తే 1000 పుటలకు తక్కువగాని గ్రంథమౌతుంది. శంకరులవారి
జీవితమును గూర్చి, అంటే కాలడి, పూర్ణానది, సన్యాసము, తల్లి ఉత్తరక్రియలు సన్యసించినా కూడా తల్లికి ఇచ్చిన మాట నిలుపుకొనుటకు కాలడికి సమయానికి వచ్చి జరపతము, నాలుగు ఆమ్నా య పీఠములు స్థాపించినది , ఈ సనాతన ధర్మమును పునః ప్రతిష్ఠించినది నేను విస్తారముగా తెలుపుట లేదు ఎందుకంటే ఇది ఎక్కువమందికి తెలిసినదే కాబట్టి. ఇప్పుడు ముఖ్యముగా ఆయన కాల నిర్ధారణను గూర్చి మాత్రమె తెలుపుచున్నాను.
శంకరులవారి కాలనిర్ధారణ 
'చరిత్ర' అంటే 'చత్తరా' అనే కాలము లో మనమున్నాము. తల్లి తండ్రుల చాయాచిత్రములు పదిల పరచుకొనే పిల్లలను ఇంకా మనము చూస్తూనే ఉన్నాము. మరి ఆ తల్లిదండ్రులు గతించినా చిత్తరువులు గోడనతుకు కొనియే   వున్నాయి కదా మరి అది చరిత్ర కాదా. ఆ చిత్రములు మాలలువేసి బొట్లు పెట్టి ధూపదీపములుసమర్పించి  మన భక్తీ ప్రపత్తులను చాటుకొంటాము . మన కుటుంబ అభివృధ్ధి కొరకు పాటు పడినవారినే గుర్తు పెట్టుకొని తరువాతి తరానికి ఆ పెద్దల గొప్పదనాన్ని అందజేస్తున్నామే , మరి విశ్వ శ్రేయస్సు కోసం నిస్స్వార్థంగా శ్రమించిన మహనీయుల చరిత్ర గుర్తు పెట్టుకోనవసరం లేదా. కాస్తో కూస్తో మేలుచేసిన కారణానికి జయంతులని, వర్ధంతులని ఆయా తేదీలు గుర్తుపెట్టుకొని కొందరు పెద్దలకు నివాళులర్పించుకొంటున్నామే మరి విశ్వ శ్రేయస్సే ప్రాధాన్యముగా , మరల భూమి పై ధర్మప్రతిష్ఠాపనకు కంకణం కట్టుకొని నెరవేర్చి అతిపిన్న వయసులోనే పరమపదించిన జగద్గురువులైన శంకరుల వారి కాలనిర్ణయము తెలుసుకోన వలసిన బాధ్యతా మనపై లేదా!

మనచరిత్ర పై మనకు భక్తీ, గౌరవము, శ్రద్ధ మనకుంటుంది. మన ప్రవర మన ప్రక్కన యున్నవాడు చెబితే మనకెట్లుంటుంది. మన చరిత్ర ఆంగ్లేయులు చెబితే మనకూ అట్లే వుండాలి కదా. ఒక సంస్థ తన కార్యాచరణ బేరీజు వేసుకోవాలంటే తన గత ప్రస్థుత పరిస్తితులను పరిగణనలోకి తీసుకొని భవితకు బాట వేసుకొంటుంది. మరి సంస్థలకే చరిత్ర అవసరమైతే దేశానికి అవసరం లేదా. గతము గుర్తుంచుకొంటే ఆ గుర్తులవెంట మనము నడవ వచ్చు.

మన చరిత్ర తమకన్నా ప్రబలమైనది కాకూడదనే దుర్భుద్ది తో మన చరిత్ర వ్రాసినవారు పాశ్చాత్యులు . అందులోభాగంగానే జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారి కాలాన్ని క్రీ.శ. 788 గా నిర్ణయించినారు.మన మొదటి ప్రధాని పుణ్యమాయని ఇప్పటికీ మనకు ఆంగ్లేయుల వుచ్చిష్టము మెసవక తప్పుటలేదు.

'విమర్శకాగ్రేసర''భారత చరిత్ర భాస్కర' మహామహులైన కోట వెంకటాచలం గారు శంకరులవారి కాలాన్ని సహేతుకంగా నిరూపించినారు. ఆ వెలుతురులో మన యానము ప్రారంభించుదాము.

శంకరుల కాలమునుండి అవిచ్ఛిన్నముగా గురుపరంపర గలిగిన జోషిమఠము,పూరి,ద్వారక,కంచి మఠములు కలి 2593(క్రీ.పూ. 509) శంకరుల కాలంగా నిర్ణయించినారు.

ఈ వాదమునకు నందన సంవత్సర వైశాఖ శుక్ల పంచమి ఆదివారం నాడు పునర్వసు నక్షత్రయుక్త ధనుర్లగ్నమందు శివగురు ఆర్యాంబ దంపతులకు జన్మించినట్లు ఈ క్రింది శ్లోకము తెలియబరచుతుంది. ఇది శంకరులవారి సహాధ్యాయులుగా వుండి పిమ్మట వారి శిష్యుడై సన్యసించి, వారి తదనంతరము గూడా బ్రతికిన చిత్సుఖాచార్యుల వారు వ్రాసిన 'బృహత్ శంకర విజయము' లోనిది.
"తిష్యే ప్రయాత్య నలసేవధి బాణనేత్రే |
యే నందనే దినమణా వుదగధ్వభాజి |
రాధే సితేరుడువినిర్గత మంగ లగ్నే ప్యా  |
హూతవాన్ శివగురుః సచ శంకరేతి ||
అనల =3(త్రేతాగ్నులు), సేవధి==9(నవ నిధులు),బాణ = 5(పంచ బాణుని
బాణములు) నేత్రే =2(కళ్ళు) (సంఖ్యా గణనములో 'భూత సంఖ్య ' అన్నది ఒక గణనా విధానము.)
మిగిలినది మరోమారు.........
ఆది శంకరులవారి కాలనిర్ధారణ - 2 వ భాగము 

'సంఖ్యాం దక్షిణతో వామః' అని శాస్త్ర వాక్యమని మన చంద్రశేఖర సరస్వతులవారి ఉవాచ.కావున ఆ సంవత్సరము కలి 2593 ఔతుంది. ఇపుడు ఈ మొత్తము శ్లోకము యొక్క సారాంశము ఏమిటంటే 'నందన సంవత్సర వైశాఖ శుక్ల పంచమి ఆదివారము పునర్వసు నక్షత్రయుక్త ధనుర్లగ్నమందు అనగా పై తిథి వార నక్షత్రములు కల్గిన కలి సం. 2593(క్రీ. పూ. 509)లో శంకరులవారు శివగురు దంపతుల శిశువు గా జన్మించినారు.
'జినవిజయ' మనెడు జైన గ్రంథము ఈ విధముగా చెప్పు చున్నది :తదనంతరము 15 సం. గడచిన తరువాత అంటే క్రీ.పూ. 494 లో,కర్మకాండను(పూర్వమీమాంస) కైవల్య మార్గముగా ప్రతిపాదించిన కుమారిల భట్టు, (శంకరులకన్నా 48 సం. పెద్దవారు), మహాశయులను, వారు కుమ్ము (వేరుసెనగ పొట్టు నివురు గప్పిన నిప్పు)లో ఆత్మాహుతి చేసుకొనుచున్నఅవసాన దశలో శంకరులవారు వారిని కలిసినట్లు ఈ క్రింది శ్లోకములో చెప్పబడినది.
ఋషి ర్బాణ స్తధా భూమి ర్మర్త్యాక్షౌ వామమేళనాత్|
ఏకత్వేన లభేతాంకం తామ్రాక్షా తత్ర వత్సరః|
ఋషి =7(సప్తర్షులు),బాణ(మన్మధ బాణములు)=5,భూమి=1,మర్త్యాక్షు (మానవుని కన్నులు)=2 ,తామ్రాక్ష =రక్తాక్షి నామ సంవత్సరము
విలోమముగా లెక్కించితే యుధిష్ఠిర శక (జైనులు ,బౌద్ధులు యుధిష్ఠిర శకమును పాటించుతారు. ఆయా మతములకాద్యులు క్షత్రియులు కావుననేమో.)2157 సం. న నిర్యాణమని చెప్పబడినది. యుధిష్ఠిర శకము
కలి.468 లో మొదలైనది. అంటే శంకరులవారి  నిర్యాణము కలి 2625 లో జరిగినట్లు రూఢి యగుచున్నది. అంటే
క్రీ. పూ. 477 అగుచున్నది. అంటే అప్పటికి శంకరులవారి వయసు 32 సం.లు.
వారిని గూర్చిన వివరము ఈ క్రింది శ్లోకములో వున్నది.
అష్ట వర్షే చతుర్వేది ద్వాదశే సర్వ శాస్త్రవిత్
శోడసే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మునిరత్యగాత్
8 సం. లో 4 వేదాలు నేర్చుకొని 16 ఏండ్లకు సకలశాస్త్రములను ఆకళింపు చేసుకొని 16 సం. లకు భాష్యములను వ్రాసి 32వ ఏట కైవల్యమును పొందినారు.
వారు 491క్రీ. పూ. లో ద్వారకా మఠమును,486క్రీ. పూ.లో జ్యొతిర్మఠమును 485క్రీ. పూ.లో గోవర్ధన మఠమును 484క్రీ. పూ. లో శృంగేరి మఠమును స్థాపించి వరుసగా హస్తామలక, తోటక ,పద్మపాద,సురెశ్వరులను పీఠాధిపతులనుజేసి కంచి పీఠమునేర్పరచి దానిని వారే అధిష్ఠించారు. ఒక్కశృంగేరి  ీపీఠము తప్పించి,మిగత పీఠములన్నియు, స్వల్ప వ్యత్యాసముతో క్రీ. పూ.5వ శతాబ్దమునే బలపరచుచున్నవి. ప్రముఖ చరిత్రకారులు డా.సర్ జడునాథ్ సర్కార్ గారు తమ 'HISTORY OF DASANAMI NAGAS' లో ఈ విధంగా తెలియబరచినారు : "No paper earlier than the 19th century has been preserved at sringeri mutt and the same list can be accepted as correct at the best from 19th century downwards but not earlier than that period."ఇదే పుస్తకములో వేరొకచోట ఆర్. యన్. ఘోష్ అను నతడు తనకు శివాభినవ నృసింహ భారతీ స్వామివారు ఈ విధంగా చెప్పినట్లు తెలియబరచుచున్నారు "At the request of modern archaeologist,my guru constructed this list......you may take it true or false" అని వ్రాసినారు. దీనిని బట్టి మనకు తెలియవచ్చుచున్నదేమిటంటే వారి వద్ద ఏకారణాంతరాలవల్లనో ఆ రికార్డులు అలభ్యములని తెలియవచ్చున్నది.

పండిత కోట వెంకటాచలం గారి 'మహా భారత యుద్ధ కాలము' అను పరిశోధనా గ్రంథములో 56పేజి నుండి 60వ పేజి వరకు సుధన్వ సార్వభౌముని శాసనమును గూర్చి తెలిపియున్నారు. ఈ శాసనము శంకరులవారికి యుధిష్ఠిరశకము 2663(క్రీ. పూ.477) రక్తాక్షి సంవత్సర ఆశ్వయుజ శుధ్ధ పౌర్ణమికి విజ్ఞ్యప్తి పత్రముగా సమర్పింప బడినది . అటుపిమ్మట కార్తీకములో జగద్గురువులు కైలాస యాత్ర చేసినారు. దీనితో శంకరులవారి కాలము రుజువౌతున్నది.

దీనిని మించిన ఇంకొక నిర్దుష్టమైన ఆధారము ఇక్కడ పొందు పరుప బడినది.
"PILGRIMAGES IN KASHMIR"
"Sankaraacharya"- The shrine is situated in the city of Srinagar. It is an ancient temple crowning
'Takht-i-Sulemaan’hill and standing 1000ft. above the valley. The temple as well as the hill take the name from Sankaraachaarya the great South Indian Teacher of Monoism, who came to Kashmir from
Travancore. The temple was built by king Gopaditya who reigned in Kashmir from 368B.C. to 308B.C. It was repaired by the liberal minded Muslim king Zain-Ul-Abdin" (The Hindu, dated 17th July, 1949, page15, 2nd column)    ఇంతకంటే సాక్ష్యాధారాలు అవసరమా. అయినా ఇంకా కొన్ని  ఈ పొందుపరచిన వివరాలను గమనించండి. 
ఆది శంకరులవారి కాలనిర్ధారణ - 3 వ భాగము 

 .ఆది శంకరులవారి కాలనిర్ధారణజ 1. పైనతెలిపిన శంకరుల జనన కాలము ఆ దినమున నాటి పంచాంగము ప్రకారమూ గ్రహగతి సరిపోవుచున్నది .
2. 'పతంజలి చరిత్ర' అన్న గ్రంథమాధారంగా గోవింద భగవత్పాదుల సిద్ధి క్రీ. పూ.493 గా నిర్ధారింపబడినది. శృంగేరి పీఠాధిపతులైన అభినవ విరూపాక్ష స్వాములవారు నిర్ణయించడము విశేషము. కావున ఇది కూడా శంకరులవారి జన్మ వత్సరమును బలపరచుచున్నది.
3. క్రీ.శ. 788 కన్నా ముందువారని చరిత్రకారులే ఒప్పుకొన్న మహేంద్ర వర్మ,భవభూతులవారి గ్రంథాలలో శంకరుల యొక్క అద్వైత సిద్ధాంత ప్రసక్తి వుంది. అంటే ఆయన ఆ కాలానికి చాలా ముందుకాలం వాడని మంకు చెప్పకనే అర్థమౌతుంది కదా.
4. బ్ర.శ్రీ. కోట వెంకటాచలం గారి నేపాల రాజుల వంశ చరిత్రలో శంకరులు, వృష దేవ వర్మ నేపాలును పరిపాలించే కాలంలో ఆ దెస పర్యటన చేసినట్లు చెప్పబడింది. ఆ రాజు పరిపాలనా కాలము కలి శకం 2555-2615 అని చారిత్రికులు నిర్ధారించినారని తెలియబరచి యున్నారు. అంటే ఆయన క్రీ. పూ. 547-487 కాలము వాడు . అంటే అప్పుడు కూడా శంకరుల వారు  క్రీ. పూ.509 - 477 మధ్యకాలము వాడే అని తెలియా వచ్చుచున్నది .
5.మాక్స్ ముల్లరు 'శంకర మందార సౌరభ ' మన్న గ్రంథమును పునాదిగా గైకొని శంకరులవారి జననము క్రీ.శ. 787-88 అని నిర్ధారించి యున్నారు. చిత్సుఖాచార్యులవారు రచించిన'బృహత్ శంకర విజయము'కంటే ఇది అధునాతనమైనది.పైగా  చిత్సుఖాచార్యులవారు శంకరులవారి సమకాలీనులు. ఆయన మాటను త్రోసిరాజని  'శంకర మందార సౌరభ ' మును గీటురాయిగా తీసుకొనుటెట్లు ?
6. డా. పోతక్ మొదలుగాగల కొంతమంది చరిత్రకారులు క్రీ.శ. 788 లో కంచి పీఠాధిపతియైన అభినవ శంకరులవారిని, ఆది శంకరులుగా భ్రమించి ఆదిశంకరులవారి కాలనిర్ణయము చేసినారు.
ఇన్ని సాక్ష్యాధారాలమధ్య శంకరులవారి కాలాన్ని పరిష్కరించుటవల్ల మనము పొందే లాభమేమి?
1.ఆ నాటి సాంఘీక ఆచార వ్యవహారాలూ తెలుసు కొనుట
2. వారి తదనంతరము దేశ కాల పరిస్థితిలను సమీక్షించుట
3. వారి తరువాత ఎందరు మహనీయులు ఉధ్భవించినారు మరియు వారి యోగదానము
4. వారి గోప్పదనములో అణు మాత్రమైనా మనము సాధింప ప్రయత్నించుట
5. వారి భాష్యముల,భాషణములద్వారా సచ్ఛీలత,తత్వ సాధనము మున్నగునవి గ్రహించి ప్రచలితము చేయుట మొదలగు వుపయోగము లేన్నోకలవు.
6.వాస్తవ కాలానికి మిధ్యా కాలానికి మధ్యన గల మహనీయులు మరుగై పోతారు.
సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామ్I
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాంII
నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ ।
వ్యాసం శుకం గౌడపదం మహాన్తం గోవిన్దయోగీన్ద్రమథాస్య శిష్యమ్ ॥
 అంతటి మహనీయునికి ఆయన జయంతి సందర్భముగా నేను ఈ విధముగా నా భక్తిని చాటుకొనుచున్నాను. దీనిని చదివి మీరూ యధోచితముగా మీ భక్తిని, మన పూర్వుల నిజ చరిత్రపై ఆసక్తిని, అట్టి పరిశోధనలపై అనురక్తిని, అందుకు తగిన శక్తిని అవసరమగు యుక్తిని ప్రసాదించమని పరమేశ్వరుని వేడుకొంటారని నమ్ముతూ శెలవు తీసుకొంటాను.
స్వస్తి. 


1 comment:

  1. చరిత్ర గురించి శంకరుల గురించి చక్కగా చెప్పారు sir

    ReplyDelete