ఆరోగ్యము – పంచభూతములు
https://cherukuramamohanrao.blogspot.com/2019/01/blog-post_28.html
https://cherukuramamohanrao.blogspot.com/2019/01/blog-post_28.html
నేను వైద్యుడనుగాను. నాకు నాపెద్దలనుండి సంక్రమించిన చిట్కా వైద్యములేవయినా వున్నా అవి నాపై ప్రయోగించుకొనుటకు మాత్రమే పరిమితము. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే నేను వ్రాసే ఈ వ్యాసములో వైద్యమునకు సంబంధించిన సలహాలనిచ్చుట లేదు. మన పూర్వులు గతములో చెప్పగా, నేటి మన Science ధ్రువీకరించిన పంచ భూతములకు సంబంధించిన కొన్ని వాస్తవాలను మీముందు ఉంచుచున్నాను.
‘Health is not absence of disease. Health is enthusiasm to work. Enthusiasm to be compassionate.’
This is stated by a Padmabhushan awardee Belle Monappa Hegde often abbreviated as B. M. Hegde is a cardiologist, medical scientist, educationist and author. He is the former Vice Chancellor of Manipal University, Co-Chairman of the TAG-VHS Diabetes Research Centre, Chennai and the chairman of Bharatiya Vidya Bhavan, Mangalore.
This is stated by a Padmabhushan awardee Belle Monappa Hegde often abbreviated as B. M. Hegde is a cardiologist, medical scientist, educationist and author. He is the former Vice Chancellor of Manipal University, Co-Chairman of the TAG-VHS Diabetes Research Centre, Chennai and the chairman of Bharatiya Vidya Bhavan, Mangalore.
అదే మనము అతి గొప్పవాళ్ళగా భావించే పాశ్చాత్యులు ఏమన్నారో చూడండి.
Sigmund Freud says "Health is work and sex"
Medicine is a collection of uncertain prescriptions the results of which, taken collectively, are more fatal than useful to mankind.” Napoleon
"ఔషధము అన్నది అనిశ్చితమగు మందుల సంకలనము, దీని ఫలితములు, మానవజాతికి ప్రాణ రక్షణకంటే ప్రాణాంతకం."నెపోలియన్
ఈ sex పిచ్చితో parkinson disease తోనో alzimars తోనో బాధపడే వాళ్ళను మనము జాగ్రత్తగా గమనించితే ఎంతోమందిని చూడవచ్చు. అల్లోపతివైద్యము నెపోలియన్ కాలమునుండి ఎంతో మారినది అనుకొన్నా నేటికికూడా జబ్బు ఫలానా అని నిర్ధారించలేని ఎన్నో రుగ్మతలను మన చుట్టూ వున్న సమాజములో చూడవచ్చు. అటువంటప్పుడు తన ఆరోగ్యమును తాను రక్షించుకొనుటకు తనలోనూ, తన చుట్టూనూ వున్న పంచభూతములు ఒక వ్యక్తికి ఎంతగా సహాయపడుతాయో కొంత పరిశీలించుదాము.
ఒక వ్యక్తి "శారీరకంగాను, మానసికంగాను, చురుకుగా విధినిర్వహణలోను, ఆర్ధికంగాను, సామాజికంగాను తన దినచర్యను సమర్ధవంతముగా నిర్వహించ గలిగితే అతనిని ఆరోగ్యవంతుడు అనవచ్చును". వయసుతో నిమిత్తము లేకుండా, శరీర పటుత్వమును అనుసరించి ఒక వ్యక్తి తన దైనందిన విధులను తనకు తానుగా, నిర్వహించ గలిగితే ఆ వ్యక్తి ఆరోగ్యముగా ఉన్నట్లు కాదా!
పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే
తచ్చాంతిఃఔషధైఃదానైఃజపహోమ క్రియాదిభిః”
అంటూ శారీరక,మానసిక లోపాలకు శాంతిగా ఔషధులు,దానాలు,జపాలు,హోమాలు చేయడం ద్వారా రోగము నివారించ బడుతుంది అని ఆయుర్వేదములో చెప్పబడినది. ఇక్కడ ఒక విషయమును గూర్చి మనము కొంత విశ్లేషించుకొనవలసియుంటుంది. వ్యాధికీ దాన జప హోమములకు ఏమిటి సంబంధము అన్న సందేహము మనకు ఏర్పడుతుంది. అసలు వ్యాధికి కారణము పూర్వజన్మ కృత పాపమైనపుడు మరి దానిని నివారించే మార్గము ఔషధమునకు వుండే అవకాశము లేదు కదా! ఇక రెండవ ప్రశ్న ఈ జన్మలో వచ్చే వ్యాధికి పోయిన జన్మ కర్మఫలము ఏవిధముగా కారణము? అన్నది. కొన్ని వ్యాధులు పిల్లలకు పుట్టుకతోనే సంక్రమించుతాయి. సులభమైన ఉదాహరణ పుట్టినతరువాత ఒక సంవత్సరమునకు కూడా బిడ్డకు అమ్మ నాన్న అన్న మాటలు కూడా రాక పోవుట. రెండు మూడేళ్ళకు కూడా అదే పరిస్థితి కొనసాగుట. తల్లీ దండ్రులకు మాట్లాడ గలిగియుండి కూడా మరి బిడ్డకు మాటలు రాక పోవుటకు కారణము చెప్పగలరా! ఇటువంటి ఉదాహరణలు ఎన్నో చెప్పుకొనవచ్చును. కాబట్టి కొన్ని రుగ్మతలు నయమగుటకు మందులుకాక పైన చెప్పిన ఇతర విషయములను కూడా పరిగణనలోనికి తీసుకొనవలసియుంటుంది. పైగా జప హోమాదులచే రుగ్మతలను పోగొట్టుకొన్నవారు, ఉధృతము తగ్గించుకోన్నవారు ఉన్నారని నా అనుభవములో తెలుసుకొన్నాను. చేయించే వ్యక్తుల నిష్ఠ, చేసేవారి విశ్వాసమును బట్టి ఫలితము ఉంటుంది.
ఒక పర్యాయము ఆయుర్వేదము ఏమంటున్నదో గమనించండి.
క్రోధ శోక భయాయాసః విరుద్ధాన్న తపోన్నలాన్
లవణామ్లకటుర్మధురాత్ రక్త పిత్త ప్రకోపయేత్
అలవికి మించిన - కోపము, దుఃఖము, వ్యథ, భయము, అలసట, అనియమిత అనారోగ్య అపరిపక్వ ఆహారము, ఉప్పు, పులుపు, కారము, తీపి వలన రక్తము, పిత్తము(Liver) నుండి వచ్చు రసము కావున అది పైత్యము (a bitter greenish-brown alkaline fluid which aids digestion and is secreted by the liver and stored in the gall bladder.) ప్రకోపించుట జరిగి ఆరోగ్యమును అస్తవ్యస్తము చేస్తాయి. అట్లు అస్తవ్యస్తమైన ఆరోగ్యము అతిభయంకరమగు వ్యాధులకు దారి తీస్తాయి.
పరిష్కారము ఎంత సులభమో ఒకసారి గమనించండి.
నిత్య హిత మితాహార సేవీ సమీక్షకారీ దాతా సమాహార సత్యపరా క్షమావాన్ ఆప్తోపసేవీ ఆరోగ్య భాగ్యవాన్
అంటే హితమైన మితమైన ఆహారము, మంచిచెడ్డలనరసి మంచిని మాత్రమే చేయుట, పాత్రతనెరిగి దానము చేయుట, అను లక్షణములు కలిగినవాడై సత్యవాక్పరిపాలకుడై, క్షమాగుణము కలిగినవాడై, తనను నమ్మియున్నవారి బాగునకు పాతుపడువాడు ఆరోగ్యభాగ్యమును కలిగియుంటాడు. ఈ విధముగా ఆరోగ్యము కలిగినవాడు తనను తాను ఈ విధముగా గుర్తించుకొనవచ్చును:
‘సమదోషః సమాగ్నిశ్చ సమధాతుః మలక్రియః
ప్రసన్నాత్మేంద్రియమనాః స్వస్థయిత్యభిదీయతే’’
వాతపిత్తకఫములు సమస్థితిలో ఉండటం.. జఠరాగ్ని హెచ్చుతగ్గులు లేకుండా ఉండటం.. రసము , రక్తము, మాంసము, మేధస్సు, మజ్జ, అస్థి, శుక్రము అన్న ఈ ఏడు ధాతువులు శరీరమును పొషించుతాయి. ఇవి సరియైన స్థితిలో ఉండటం. మలమూత్రాదుల విసర్జన సక్రమంగా ఉడటం. ఆత్మ, ఇంద్రియాలు, మనసు ప్రసన్నమైన స్థితిలో ఉండటమే ‘చక్కటి ఆరోగ్యం.’ కోటి విద్యలూ కూటికొరకే! కూడు జానెడు పొట్ట కొరకే! ఆ జానెడు పొట్ట బాగున్నంత కాలం అంతా బాగానే నడిచిపోతుంటుంది. కానీ అది మొండికేసిన నాడు తెలుస్తుంది మనకు దాని ప్రాముఖ్యం ఏమిటో!
ఆసక్తికరమైన విషయమేమిటంటే సృష్టిలో ఏ జంతువైతే తక్కువ శ్వాస తీసుకుంటుందో ఆ జంతువు ఎక్కువ కాలం బ్రతుకుంది. ఉదాహరణకు కుక్కలు నిమిషమునకు 50-80 మార్లు శ్వాస క్రియను జరుపుతాయి. వాని సంపూర్ణ ఆయుర్ధాయము 11 సంllలు మాత్రమే బ్రతుకుతాయి. గుర్రములు నిమిషానికి 30 సార్లు శ్వాస క్రియను జరుపుతాయి. ఇంచుమించు 30 సంవత్సరాలు బ్రతుకుతాయి. ఏనుగులు ప్రతి నిమిషానికి 15-20 మార్లు శ్వాస క్రియను జరుపుతాయి. అవి ఇంచుమించు 100 సంవత్సరాలు జీవిస్తాయి. అదే విధంగా మనుషులు ప్రతి నిమిషానికి 12-25 శ్వాసలు తీసుకోవాలి – 120 సంవత్సరాలు జీవన ప్రమాణం కలిగి వుండాలి. ఇది ఆదర్శవంతమైన జీవితం కలిగినవారికే సాధ్యపడుతుంది. తాబేళ్ళు నిమిషానికి 5-10 శ్వాసలు తీసుకుంటాయి. – 500 సంవత్సరాలు బ్రతుకుతాయి.
మానవుడు తన జీవన ప్రమాణమును పెంచుకొనవలెనన్నా తన శ్వాస పై ధ్యాస ఉంచుట అవసరము. దానికి కావలసినది భూతశుద్ధి. భూతములు అంటే వేరేమీ కాదు.
పృథివ్యాపస్తేజోవాయురాకాశములే. అసలు మానవ శరీరమునకు బాహిరముగానేకాదు అంతరమున కూడా పంచభూతాత్మకము. శరీరము పంచాభూతాత్మకము అన్నది మన వేద వచనము. భూమి 12% నీరు 72% అగ్ని 4% గాలి 6% మిగిలిన 6% ఆకాశము. ఈ ఐదింటినీ సూత్రబద్ధము చేసేది ప్రాణము. దేహమును ప్రాణము వదిలితే ఈ అంతర్భూతాలు బాహ్యభూతములలో కలసిపోతాయి.
భూత శుద్ధి: యోగమునకు సంబంధించిన ఏవిధమయిన ప్రక్రియ అనగా అది ఆసనముల రూపమున కావచ్చు, సూర్యక్రియ లేక సూర్య నమస్కారములు కావచ్చు, ప్రాణాయామము కావచ్చు ఏదయినా అది భూత శుద్ధి అనియే అనబడుతుంది. గొప్పవారు చెప్పే ప్రవచానములను చిత్తశుద్ధితో వినుటచేత తాదాత్మ్యము చెందగలిగే భగవద్భక్తి మరియు సంగీతము వినుట చేత కూడా భూత శుద్ధి జరుగుతుంది. మోతాదు కొంచెము తక్కువగా వుంటుంది. కానీ నిరంతరమూ, అంటే 24 ఘంటలూ అని కాదు, ఒక నిర్ణీత సమయమును కేటాయించి పైన తెలిపిన దేనిని అనుసరించినా ఆరోగ్యము అందుబాటులో వుంటుంది.
మిగిలినది తరువాత......
మిగిలినది తరువాత......
ఆరోగ్యము – పంచభూతములు-2
పృథ్వి – నేల
ప్రపంచములోని అనేక దేశములలో ఒక్క భారతావని మాత్రమే ఆర్యావర్తముగా గుర్తించ బడినది. ఓషధులకు, తపోసాధనకు హిమాలయము మాత్రమే పేరెన్నిక గన్నది. అచటి నుండీ ప్రవహించే గంగా యమునాది నదులన్నీ ఔషధీగుణ సంయుక్తములు. అదేవిధముగా కాశీ దేశపు ఆధ్యాత్మిక కేంద్ర బిందువు. కాలకాలుని కలకాల నివాసము. అదేవిధముగా గయ ప్రయాగ, మథుర, బృందావనము, ఉజ్జయిని, పూరి, కామాఖ్య, చిదంబరము, కంచి, మధుర, శ్రీరంగము, శ్రీశైలము, కాళహస్తి, తిరుమల, శృంగేరి, కొల్లూరు, గురువాయూరు, చోట్టానిక్కర ఈవిధముగా చెప్పుకొంటూ పోతే అనేకానేక పుణ్య క్షేత్రములు అనేకానేక పుణ్య తీర్థములు, పుణ్య మూర్తులు కలిగి ప్రపంచమున ఒక విశిష్ట దేశముగా ఒప్పారు చున్నది. చరిత్రను ఒకసారి తిరుగవేస్తే పంజాము రాజస్థాన్ లలో వీర విక్రములు మనకు తెలియవస్తారు.గుజరాతు ఆదినుండి కూడా ఎందఱో వ్యాపార దక్షులను గాంధీ పటేల్ వంటి జాతీయ నాయకులను దేశానికి కానుకల జేసింది. మధ్యప్రదేశము విక్రమ, భోజ, శాలివాహనాది మహా ఆదర్శవంతమైన రాజులను, కాళీదాస, వరాహమిహిర, ధన్వంతరి మొదలగు నవరత్నములను మనకు అందించింది. కేరళకు శంకరాచార్యులవారు ఒక్కరుచాలు ఈ దేశ గౌరవమును అనంతకాలము నిలబెట్టుటకు. మరి ఒక్కొక్క ప్రాంతము ఒక్కొక్క ప్రత్యేకత సంతరించుకొన్నది కదా! అది ఆప్రాంతపు నేల స్వభావము కాదా! కాబట్టి
‘దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అని ఒక కవివరేణ్యుడు అన్నాడు కానీ నా దృష్టిలో ‘ప్రాంతమంటే మట్టియే నోయ్ ప్రజకు తన గుణమిచ్చునోయ్; ప్రాంత నామము ప్రబలపరచే ప్రకృతే ప్రాంతానిదోయ్’. కావున నేల లేక భూమి సారానుసారము మనుషుల గుణ గణములు ఆరోగ్యనారోగ్యములు ఆధారపడి వుంటాయి. అందుకే మహనీయులు తమకు తగిన ప్రదేశముల వెదకి తమ నెలవులుగా చేసుకొన్నట్లు మహర్షి రమణులు, అరబిందుల వారు, రామకృష్ణులవారు మొదలగు అనేకమందిలో మనము చూస్తాము. దానినే క్షేత్రమహిమ అంటారు. మహనీయులు తమ నిర్దేశిత ప్రాంతములను తాము తెలుసుకొనగలుగుతారు. సాధారణ మానవులమైన మనము అంత శ్రమ తీసుకోనవసరము లేదు. మనజన్మభూమి యందే ఉత్పత్తియగు పంటలను మనకు ఆహారముగా వాడుకొంటే చాలు. మన ఆరోగ్యమును మనము, కాపాడుకొన్నవారమవుతాము. అట్లని వేరేక్కడనో తయారయ్యే వస్తువులో, పండే పళ్ళో మనము తినకూడదనికాదు. వానిని అడప దడపా తప్ప నిత్య జీవిత ఆహారముగా వాడము కదా!
తరువాత నీటిని గూర్చి......
ఆరోగ్యము – పంచభూతములు-3
ఆపస్సు – నీరు
ఇక నీటిని గూర్చి కాస్త తెలుసుకొందాము.
ఆపోవా ఇదగుం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావాఆపః పశవ ఆపోన్నమాపోమ్రుతమాపః
సమ్రాడాపోవిరాడాప స్వరాదాపః చందాగుశ్యాపో జ్యోతీగుష్యాపో యజోగుష్యాపః సత్యమాపస్సర్వా దేవతాపో భూర్భువస్సువరాప ఓం.
ఈ ప్రపంచము నీటినుండి ఉద్భవించినదే!, విశ్వములోని సకల భూతములకు నీరు ఆధారము. నీరు మన ప్రాణాధారము, మన జీవితమంతా నీటి ఉనికిలోనే ఉంది. అన్ని జీవులు నీటి ద్వారానే వ్యక్తమగుచున్నాయి. ఆహారం నీటి నుండి వెలువడుతుంది. ఇది అది అనుట ఎందుకు? ఈ విశ్వము సర్వస్వము నీటికి ఆలవాలము. సకలదేవతలకూ ఆలవాలమైన, ముల్లోకములగు భూ, భువహ్ మరియు సువర్లోకముల, నీటికి కూడా నమస్కరించుచున్నాను. ఇది వేదము చెప్పిన మాట.
కృష్ణ యజుర్వేదము లోని తైత్తిరీయారణ్యకములో మహా మంత్రపుష్పము గా చెప్పబడే 'యోపాం పుష్పం' ఉన్నది. ఈ వేదమంత్రము పూర్తిగా నీటి ప్రాశస్త్యమును గూర్చియే చెబుతుంది .
జపానుకు చెందిన డాక్టర్ మసరూ ఎమోటో మానవులు మాట్లాడే మాటలు, పాడే పాటలు, నృత్య శబ్దాలు నీరు, ఆహారంపైన ఏ విధంగా ప్రభావాన్ని చూపుతాయో తన పరిశోధన ద్వారా తెలుసుకున్నారు. కొన్ని నీటి చుక్కలను తీసుకొని, వాటిముందు, వేరువేరుగా, కొని మంచిమాటలను, మంచి ప్రార్ధనలను, మంచి సంగీతాన్ని, మంచి సరళమైన నృత్య శబ్దాలను వినిపించారు. అలాగే, మరికొన్ని నీటి చుక్కలను తీసుకొని, వేరువేరుగా, కొన్ని చెడు/తీవ్రమైన మాటలను, భయంకర శబ్దములను, తాళగతిలేని నృత్య శబ్దాలను వినిపించి ఆ నీటి చుక్కలను గడ్డకట్టించి వాటిని సూక్ష్మదర్శినిలో పరిశీలించి, వాటి ఛాయా చిత్రములను తీసి పరీక్షించినారు. అనేక అణువుల(Molecules) సమాహారమగు ఈ రెండు నీటి రూపములలో, మంచి మాటలలు, మంచి ప్రార్ధనలు, మంచి సంగీతాన్ని వినిపించిన నీటి చుక్కల స్పటికాకృతులలో అణువుల సమాహారము యొక్క ఆకృతి అతి అందంగా, ముత్యాలు పేర్చినట్లుగా కనిపిస్తే, తీవ్రమైన మాటలను, తీవ్ర సంగీత శబ్దాలను వినిపించిన నటి చుక్కల స్పటికాల్లో అణువుల సమాహార ఆకృతి అందవిహీనంగా, చిందరవందరగా కనిపించిందట.
Under certain circumstances water can retain a "memory" of solute particles after arbitrarily large dilution. Water memory is the purported ability of water to retain a memory of substances previously dissolved in it even after an arbitrary number of serial dilutions. (From Google Wikipedia)
కొన్ని ప్రత్యెక పరిస్థితులలో నీరు తనలో విలీనమయిన వస్తువు యొక్క ద్రావణమయిన తర్వాత ద్రావణ కణముల యొక్క "జ్ఞాపకశక్తి" ను కలిగి ఉంటుంది. నీటి యొక్క స్మృతి అన్నది గతము నందు తనలోతనతో కలిసి ఏర్పడిన ద్రావణ గుణములను గుర్తుంచుకొంటుంది. (google wiki సౌజన్యముతో)
The German scientists believe that as water travels it picks up and stores information from all of the places that it has travelled through, which can thereby connect people to a lot of different places and sources of information when they drink this water, depending on the journey that it has been on. (From German Scientists discover that water has a memory, https://truththeory.com)
జర్మనీ శాస్త్రవేత్తలు, నీరు వివిధ ప్రాంతముల గుండా ప్రయాణిస్తున్న సమయమున ఆ స్థలముల నుండి సమాచారాన్ని సేకరించి నిలువ చేసుకొంటుంది, తద్వారా ఆ నీరు వివిధ స్థలాలను ప్రజలను, మరియు సమాచార వనరులను ఎంతో మందికి అనుసంధించ గలుగునని నమ్ముతారు. (From German Scientists discover that water has a memory, https://truththeory.com)
పై రెండు విషయములను పరిశీలించిన తరువాత నీటికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఏమిటి అన్నది మనకు అర్థమై వుంటుంది. త్రాగేనీటిని పరిశుభ్రముగా వుంచుటయే కాక పరిశుభ్రమగు స్థలములో వుంచి ఆహ్లాదకరమగు వాతావరణమును నెలకొల్పుట మిక్కిలి అవసరము. రాత్రి పడుకొను సమయమున రాగిచెంబులో నీరుంచి ఉదయము నిద్దుర లేచిన తరువాత ‘గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు’ అన్న మంత్రమును చెప్పుకొని త్రాగితే మంచిది. స్నాన సమయమున కూడా అంతే.
ఇక తేజస్సు, అనగా ముఖ్యముగా సూర్యుని గూర్చి తెలుసుకొందాము.......
ఆరోగ్యము – పంచభూతములు-4
సూర్యుడు - తేజస్సు
తేజస్సు మనకు ముఖ్యముగా సూర్యుని నుండి మరియు అగ్ని నుండి లభించుతుంది.
నా బాల్యములో మా తండ్రి గారు చండ్ర, చందనము, మద్ది, మొదలగు కలపనే ఆలపోయ్యి లో నీళ్ళు అండాలో కాచుటకు వాడేవారు. వంటకు కూడా అదే విధమగు కలప మా అమ్మమ్మ వాడేది. ఈ కలప చేత కాగిన నీరు, వండిన వంట ఎంతో ఆరోగ్యదాయకమని వారు చెప్పేవారు. హవనములలో కూడా రావి, మోదుగ, జివ్వి మొదలగు కాలనే వాడుతారు ఏదంటే అది వాడరు. ఆ హోమ ధూమము వాతావరణ కాలుష్యమును పారద్రోలుతూ ఆరోగ్యమును కాపాడుతూ వానలు కురియుటకు కూడా ఉపయోగ పడుతుంది. హవనములందు మంత్ర ప్రాధాన్యత ఎంతో వుంది. ఇక సూర్యుని గూర్చి కాస్త చెప్పుకొందాము.
‘ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్.
ధన మిచ్ఛేత్ హుతాశనః.
జ్ఞానం మహేశ్వరా దిచ్ఛేత్.
మోక్ష మిచ్ఛేత్ జనార్దనః’ అన్నారు పెద్దలు.
మనకు ఆరోగ్యదాత సూర్య భగవానుడు. సంపత్ ప్రదాత అగ్ని. జ్ఞాన దాత మహేశ్వరుడు కాగా మోక్ష దాయకుడు విష్ణువు అన్న అర్థమును తెలుపుతూ వుంది ఈ శ్లోకమున.
గాయత్రీ మంత్రమున, మంత్రపుష్పమున, సూర్యోపనిషత్తు(అధర్వణవేదము) నందు, ఆదిత్యహృదయమునందు, నీతి శాస్త్రమునకూడా సూర్యుని ప్రాముఖ్యత ప్రాశస్త్యము వివరించబడినది.
సూర్యోపనిషత్తులోని ఒక మంత్రము ఈ విధముగా వుంది.
ఆదిత్యాద్వాయుర్జాయతే, ఆదిత్యార్భూమిర్జాయతే, ఆదిత్యాదాపోజాయతే, ఆదిత్యార్జ్యోతిర్జాయతే. అంటే గాలి, భూమి, నీరు, వెలుగు అన్న ఈ నాలుగు సూర్యునివలననే ఏర్పడుతూ, మనకు లభించుతూ వున్నాయి.
ఈ సందర్భములో నీతి శాస్త్రములోని ఈ ఈ రెండు శ్లోకములను గమనించండి.
బాలార్క ప్రేత ధూమశ్చ వృద్ధ స్త్రీ పల్వలోదకంl
రాత్రౌ దధ్యన్న భుక్తశ్చ ఆయుః క్షీణం దినేదినేll
ఈ శ్లోకమును విశ్లేషించుకొనుటకు ముందు గీతలో భగవానుడు చెప్పిన ఈ మాటను గుర్తు చేసుకొందాము.
దేహినో స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరాl
తథా దేహాంతరప్రాప్తి: ధీరస్తత్ర న ముహ్యతిll 13-2 (భగవద్గీత)
దేహధారి దేహమునందు బాల్యము నుండి యౌవ్వనమునకు, యౌవ్వనము నుండి వార్ధక్యమును క్రమముగా పొందు రీతి మరణానంతరము వేరొక దేహమును పొందుదురు. అట్టి మార్పు విషయమున ధీరుడైనవాడు మోహ మునొందడు. ఇక్కడ మనకు కావలసినది మొదటి పాదము మాత్రమే! జీవితము ఒక పరావలయము (Parabola). అందు యౌవనము ఉన్నత శిఖరము. అక్కడికి చేరిన తరువాత తిరిగీ క్రిందికి దిగవలసినదే!అంటే మనము ఆ పరావలయము యొక్క అవతలివైపునకు దిగుచున్నాము. ఆవిధముగా మనము చేరే గమ్యము జర అంటే ముసలితనము. మనము దిగుత మొఇదలుపెత్తినాము అంటే జరా మనతో బాటు వున్నదన్నమాటే! కావున పై శ్లోకములో ‘బాలార్క’ అన్న పదమునకు యౌవ్వనాంతము వరకు అన్న అర్థమును తీసుకొనవలసి ఉంటుంది. భావమును ఒకే శ్లోకములో తెలియజేసినపుడు అర్థమును మనము కొంత అన్వయించుకొనవలసి వస్తుంది. అదేవిధముగా రెండవ శ్లోకములో ‘వృద్ధార్క’ అన్న శబ్దమునకు యౌవ్వనమునుండి దిగుట మొదలయినప్పటినుండి అని అర్థము. ఇప్పుడు శ్లోకార్థమునకు వస్తాము.
మధ్యాహ్నము అనగా 12 గంటల సమయము దాటువరకు బాలార్కుని కిరణములు మనపై ప్రసరించుతాయి. ఆ బాలార్క కిరణములు, శవములు కాల్చే సమయమున వచ్చే వాసన, వయసు మీరిన స్త్రీలతో సంభోగము, మురికి (పరిశుభ్రత లేని) నీరు, రాత్రి సమయమున పెరుగన్నము (పెరుగు రాత్రి సమయములందు అరుగుట కష్టమని Scientists చెప్పిన మాట) తినుట దినదినమునకు ఆయుక్షీణము పొందింపజేయునవి.
అదే విధముగా
వృద్ధార్క హోమధూమశ్చ బాలాస్త్రీ నిర్మలోదకం
రాత్రౌ క్షీరాన్న భుక్తశ్చ ఆయుః వృద్ధిః దినేదినే
మధ్యాహ్నము 12 గంటలతరువాత వచ్చే సూర్యకిరణములు, హోమ ధూమము, యౌవ్వనవతియైన స్త్రీ తో సంభోగము, శుభ్రమైన నీరు, రాత్రివేళల పాలు అన్నము తినుట ఆయుర్వృద్ధిని చేకూర్చును.
అంటే వెలుగు వేడి ఇచ్చే సూర్యునికి మనమెంతో రుణపడి ఉన్నట్లే కదా!
When your skin is exposed to sunlight, it makes vitamin D from cholesterol. The sun's ultraviolet B (UVB) rays hit cholesterol in the skin cells, providing the energy for vitamin D synthesis to occur.
అమెరికన్ మెడికల్ అసోసియేషన్ మొన్న జూన్లో విడుదల చేసిన ఒక నివేదికలో ఎక్కువ కాంతి ఉన్న ఎల్ఈడీ దీపాలను వాడటం వల్ల రకరకాల సమస్యలు ఉన్నాయంటూ పలు హెచ్చరికలు జారీచేసింది. చాలా సందర్భాలలో 5000-6000 మధ్య ‘కలర్ టెంపరేచర్’ ఉండే ఎల్ఈడీ దీపాలను వాడేస్తున్నారని ఆ కారణముగా కంటికి, మనసుకు, రాత్రి యందు నిద్రకు సంబంధించిన రుగ్మతలకు దారి తీస్తుందని చెప్పినది. అంటే నీలలోహిత కిరణములు(ultraviolet B), B తెగకు చెందనివి, మన శరీరముపై దుష్ప్రభావమును చూపునని విశదమగుచున్నది.
ఎముకల గట్టిదనమునకు, రాచ పుండు నివారణకు, మానసిక క్లైబ్యమునకు, చక్కటి నిద్రకు, రక్తమున ప్రాణవాయువును అధికము చేయుటకు, ఆస్తమాకు, అనేక చర్మవ్యాధులకు, బుద్ధిని వికసింప జేయుటకు, మొటిమలకు, వత్తిడి తగ్గుటకు, హృద్రోగము, మధుమేహము, గర్భస్త శిశుఆరోగ్యమునకు, జుట్టు పెరుగుట, వంటి ఎన్నో విషయమల సూర్యరస్మి మనకు మేలుచేయుచున్నది. అందుకే 'ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్' అన్నవి మన శాస్త్రములు. కానీ ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నది మరువకూడదు. కారణం నియమానుసారముగా వైద్యుల ఆదేశములకు అనుగుణముగా మాత్రమే, నూలు బట్టలను ధరించి తగిన సమయములలో సూర్య రశ్మిని పొందవలసియుంటుంది. (https://www.unitypoint.org)
దీనిని బట్టి మనపూర్వులు మన శరీరమునకు సంబంధించిన ఎన్ని జాగ్రత్తలు మనకు అందించినారో చూడండి. ఇక వాయు భూతమును గూర్చి తెలుసుకొంటాము.
ఆరోగ్య దాతయగు సూర్యుని స్తుతించుతూ నేను మనః పూర్వకముగా వ్రాసిన ప్రార్థనా శ్లోకము:
హేపూష భాస్కరాదిత్య సూర్య పృశ్ని విభాకరl
నమామి మిత్ర సర్వాణాం ఆరోగ్యం దేహిమేసదాll
నమ్మకమున్నవారు ప్రతిదినమూ పఠించవచ్చు.
మిగిలినది తరువాత..........
ఆరోగ్యము – పంచభూతములు-5
వాయువు
వాయువు – గాలి
భూమిపై గాలి పొర భూ ఉపరితలం నుంచి సుమారు 1000 కి.మీ వరకు ఉంది. ఈ గాలి పొరనే వాతావరణం అంటారు. వాతావరణంలో 78 శాతం నైట్రోజన్, 21 శాతం ఆక్సిజన్తోపాటు కార్బన్డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం, నియాన్, క్రిప్టాన్, జినాన్ వంటి జడవాయువులు కూడా ఉంటాయి. గాలిలో నీటి ఆవిరి కూడా ఉంటుంది. ఇంధనాల వినియోగం, అడవుల నరికివేత, వాహనాల నుంచి వెలువడే వాయువులు, పారిశ్రామికీకరణ, ఆధునిక వ్యవసాయ విధానాలు, అణుధార్మికత, మొదలగునవి ప్రాణుల ముఖ్యముగా మానవుల జీవితము పై మరియు ఆరోగ్యము పై అత్యంత దుష్ప్రభావమును చూపుచున్నవి. ప్రత్యేక వాతవరనములలో పనిచేసే వారికీ, అధికముగా ప్రయాణాలు సాగించే ఉద్యోగస్తులకూ యోగ సాధన ఒక విధముగా తమ ఆరోగ్యమును కాపాడుకొనుటకు పరిష్కారము. మరి దానికి ఎంత సమయమును కేటాయించా గలుగుతారు అన్నది కూడా ఒక సమస్యే. ఈ సందర్భముగా సద్గురు జగ్గి వాసుదేవ్ గారు చెప్పిన మాటను ఉటంకించుట సమంజసమని నాకు అనిపించినది.
"యోగసాధనకు ఎక్కువ సమయం కేటాయించలేని వాళ్ళు సులువుగా పనిచేయగల పరిమాణం వాయువు లేదా గాలి. పంచభూతాలలో వేరేవాటిని నియంత్రించడానికి చెయ్యవలసిన పరిశ్రమతో పోల్చినపుడు వాయువును ఉద్దేశించిన సాధన చాలా సులభం," అంటారు సద్గురు గా ప్రశస్తికెక్కిన జగ్గి వాసుదేవ్ గారు. కర్ణాటక రాష్ట్రం, మైసూర్ లో 1957 సెప్టెంబర్ 3 న తెలుగు కుటుంబంలో శ్రీమతి. సుశీల, డా. వాసుదేవ్ గార్లకు జన్మించినారు. తండ్రి Railway Doctor గా పనిచేయుట మూలముననో ఏమో ఆయనకు తెలుగు మాట్లాడుట అబ్బలేదు. ఆయన తెలుగువాడన్నది చాలామందికి తెలియదేమోని ఈ విషయము తెలిపినాను.
"యోగ" సంప్రదాయంలో గాలిని "వాయువు"గా ప్రస్తావిస్తారు. అయితే, ఈ వాయువు కేవలం నైట్రోజను, ఆక్సిజను, కార్బన్ డై అక్సైడు ఇతర వాయువుల మిశ్రమం మాత్రమే కాదు, అది ప్రగతి దిశలో ఒక పరిమాణము. ప్రకృతి ఉనికికి కారణమైన పృధ్వి, ఆపస్సు అనగా నీరు, అగ్ని, వాయువు, శూన్యం అనగా ఆకాశము, అనే మౌలికమైన పంచభూతాలలో, అన్నిటికంటే ఎక్కువ అందుబాటులో ఉండేదీ, దానిని స్వాధీనపరచుకునెందుకు సులువైనదీ వాయువే. కనుకనే, శరీరవ్యవస్థలో అది ఆక్రమించే భాగం అతి తక్కువశాతం అయినప్పటికీ, యోగసాధనకు ఉద్దేశించిన అభ్యాసాలలో ఎక్కువ భాగం వాయువు లేదా గాలి చుట్టూ అల్లుకోబడినాయి.
ఈ ప్రపంచంలో 99 శాతం జనాభా ఈ రోజు జీవితాన్ని సాధ్యమైనంతవరకు సుఖంగా, హాయిగా విజయవంతంగా గడపడానికే ప్రయత్నిస్తారు. జీవితముయోక్క మరొక పరిణామమును దర్శించడానికి ప్రయత్నించేవారు అతి తక్కువ. ఈ సందర్భంలో, వాయువు, ప్రాణవాయువు అన్న పదాలు ప్రత్యేకత సంతరించుకుంటాయి. కారణం "ప్రాణ" వాయువు మీద ఒక మోస్తరు నియంత్రణ సాధించగలిగినా మన మేధస్సు మరింత పదునెక్కుతుంది. అంటే, "శక్తిచాలనక్రియ" మనలను మునపటికంటే ఎక్కువ చురుకుగా చేస్తుంది. మన భావావేశములలో స్థిరత్వం కనిపిస్తుంది, క్రమశిక్షణ అంటే నియంత్రణ ఉంటుంది, మనము ముందుకన్నాగూడా ఎక్కువగా శారీరక శ్రమ చెయ్యగలుగుతాము. ఒక సాధారణ జీవితానికి కావలసినవి ఈ మూడే కదా! యోగాభ్యాసాలలో ఉఛ్ఛ్వాసనిశ్వాస (ఊపిరిపీల్చి వదలడమనే) ప్రక్రియలున్న అభ్యాసాలన్నీ ఈ "ప్రాణవాయువు"ను ఉద్దేశిస్తూ చేసేవే. వాయువు ఒక మూలకము. మన శరీరములో వున్న ఆ వాయువును విభజించితే అవి పంచప్రాణాలవుతాయి. ఒక్క క్షణము పంచప్రాణములు వాని విశిష్ఠత తెలుసుకొందాము.
పంచ ప్రాణములనగా 1. ప్రాణము, 2. అపానము, 3. వ్యానము, 4. ఉదానము, 5. సమానము. ఏది ఏ ఏ పని చేస్తుందో ఒకపరి గమనించుదాము.
1) ప్రాణము మన ముక్కు రంధ్రాల నుండి హృదయం వరకు వ్యాపించిఉన్న శ్వాశకోశాన్ని జ్ఞానేంద్రియాలని నియంత్రిస్తుందని చెప్పబడినది. మన వాక్కును, మ్రింగటాన్ని, శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతూ శరీరంలో ఊర్ధ్వచలనం కల్గి ఉంటుందని తెలియజేయబడినది.
2) అపానము... నాభి నుండి అరికాళ్ళ వరకు వ్యాప్తి చెంది అధోచలనం కల్గి విసర్జన కార్యకలాపాలకు తోడ్పడుతుంది. మల మూత్ర విసర్జన, వీర్యము, బహిష్టు మరియు శిశు జననము మొదలైన వాటిని ఇది నిర్వర్తిస్తుంది.
3) వ్యానము... ఇది ప్రాణ, అపానాలను కలిపి ఉంచుతుంది. శరీరంలో ప్రసరణ కార్యక్రమాన్ని జరిపిస్తుంది. నాడీమండలం మొత్తం పనులను నడిపిస్తుంది. మన ప్రాణమయ కోశంలో సుమారు 72,000 సూక్ష్మనాడులున్నట్లు చెపుతారు. ఇవిగాక వాటిని నియంత్రించే నాడీ కేంద్రాలూ ఉన్నట్లు పెద్దలు చెబుతారు.
4) ఉదానము... ఇది గొంతు భాగం నుంచి శిరస్సు వరకు వ్యాపించి ఉంటుంది. శరీరాన్ని ఊర్ధ్వ ముఖంగా పయనింప జేయడానికి ఇది సహాయపడుతుంది. మనలోనుండి శబ్దం కలగడానికీ, వాంతులు చేసుకునేటపుడు బహిర్గతమవడానికీ, మన దైనందిత కార్యాల్లో తూలి పడిపోకుండా సమతులనంగా ఉండటానికి దోహదపడుతుందన్నమాట.
5) సమానము... ఇది నాభి నుంచి హృదయం వరకు వ్యాప్తి చెంది ఉంటుంది. మనం తినే ఆహారాన్ని జీర్ణమయ్యేటట్లు చేసి, ఒంటబట్టడానికి సహకరిస్తుంది. దాని ద్వారా అవయవాలకు శక్తి కల్గుతుందన్నమాట.
ఇపుడు ఈ 5 విధములైన వాయువులు జీవించుటకు తప్పనిసరియైనా వీనిలో, ప్రాణవాయువు ప్రముఖ పాత్ర కలిగియున్నది. మనందరము ఈ ప్రాణవాయువు గర్భంలో ఉన్నాము. అదే వాతావరణంగా మనల్ని ఆవరించిన బుడగ. ఈ అనంత ప్రాణవాయువు 84 ప్రాణాలుగా విభజించబడుతుంది. అందులో 5 మానవుల దైనందిన జీవితావసరాలు తీరడానికి ఉపకరిస్తాయి. ఈ పంచప్రాణాలూ మన శరీరమూ, మనసూ ఆరోగ్యంగా ఉండడానికీ, ఆధ్యాత్మికంగా చైతన్యవంతులై ఉండడానికీ పనికొస్తాయి. మరొక 10 నిగూఢమైన ప్రాణములు సాధనలు చేసేవారికి ఉపకరిస్తాయి. మిగతా ప్రాణాలు శోధించడానికీ, సాధనచెయ్యడానికీ అతి సూక్ష్మమైనవి. ప్రాణవాయువు గొంతుక వద్ద ఉన్న ముచ్చెనగుంత నుండి నాభి వరకు లోపలకి ప్రవహించేది. శక్తిచాలనక్రియ అభ్యాసంలో కనీసం 60 శాతం ఈ ప్రాణవాయువును లక్ష్యంగా తీసుకునేవే. ఇందుకు కారణం, వ్యక్తుల జీవితపు ఉపరితల అనుభవాన్ని చాలవరకు నిర్ణయించేది లేదా నిర్దేశించేది, వారి శ్వాస ప్రక్రియ, వారు శ్వాసించే వాయువు యొక్క శ్రేష్ఠత.
ఒక వాస్తవాన్ని గమనించుదాము. సాధారణముగా ఒక ఆరోగ్యవంతుడగు వ్యక్తి 8 లేక 10 రోజులు శరీర వ్యవస్థకు భంగము వాటిల్లకుండా జీవించవచ్చు. నీరు లేకుండా 3½ రోజులు వుండవచ్చునని విజ్ఞులు చెబుతారు. సూర్యుడు లేకుండా కొంత కాలము కృత్రిమ వెలుగుతో జీవించ వచ్చును గానీ కలకాలమూ అదికూడా వీలు పడదు. ఇక గాలి ఒకటి రెండు నిముసములు పీలకుండా ఉండవచ్చును గానీ సాధకుడు 4, 5 నిముసములు ఉండగలుగుతాడు. ఇంకాస్త సాధన చేస్తే అదనపు ఒకటి లేక రెండు నిముసములు. కానీ మనము తీసుకొనే ఆహారమును నియంత్రించుట చేత, తద్వారా మన పచనక్రియ తగ్గించుకొనుట చేత మరికాస్త నియంత్రించవచ్చును. కానీ అప్పుడు చర్మము నందలి రంధ్రములు ఈ క్రియ చేయ మొదలిడుతాయి. అప్పుడు గాలిని ముక్కుతో పీల్చనవసరము లేకుండా మరికాస్త కాలము బ్రతుకవచ్చు. పూర్వము ఋషులు ఈ నియంత్రణను సాధించుట చేతనే ఎక్కువ కాలము బ్రతుక గలిగినారు.
మనము గాలిని లేక గాలితో ఏమి చెయ్యగలము? మలినము చెయ్యగలము లేక శుభ్రము చెయ్యగలము.
పంచభూతాలలో, ఎక్కువ వేగాన్ని సృష్టించగలిగినది వాయువే. అది బాహ్యప్రపంచంలోనూ
సత్యమే, శరీర వ్యవస్థలోనూ సత్యమే. మనకు దానిని మేల్కొలపగల శక్తి ఉంటే, మనల్ని చెప్పలేనంత బలవంతులుగా చెయ్యగలదు. శారీరికముగానేకాడు మానసికముగా కూడా!
ఈ ప్రాణవాయువును మేల్కొల్పుటకు కొంత సాధన అవసరం. శక్తిచాలనక్రియను ఒక యోగ్యుడగు గురువు దర్శకత్వమున చెయ్యగలిగితే, ప్రాణవాయువు ఒక మేరకు చైతన్యవంతమవుతుంది. దానివల్ల మనకు లభించే శక్తి మనలను అందరికంటే భిన్నంగా ఉంచుతుంది. జీవితము అన్నది కాలము - శక్తి యొక్క సమ్మేళనము. పొంగిపొరలుతుండే మీ సాధనచే పొందిన శక్తి వల్ల నెరవేరగలుగుతాయి.
ఈ రోజుల్లో రోజురోజుకీ చాలామంది విశ్రాంతి పేరుతోనో, మరో పేరుతోనో వాళ్ళు చేసే పనినుండి దూరంగా ఉండవలసి వస్తోంది. మన ప్రాణవాయువుని మనం జాగ్రత్తగా నిర్వహించలేకపోవడం వలన ఇటువంటి అవసరం ఏర్పడుతుంది. దానికి కారణాలు అనేకం. అందులో ఒకటి,మనము తీసుకునే ఆహారం ఎక్కువగా వాయువు ఉత్పత్తిచేసేదయితే, ముఖ్యంగా బొడ్డు దిగువన మణిపూరకానికి, అది బొడ్డునుండి గొంతువరకు ఉన్న నాళంలో గాలి ప్రసరణను చిందరవందర చేస్తుంది. బొడ్డునుండి గొంతు మధ్యవరకూ ఉన్న స్థలమే ప్రాణవాయువు చైతన్యవంతంగా ఉండే స్థలం. మనము సవ్యమైన ఆహారం తీసుకోకపోవడం, దాని వల్ల జరిగే వాయువు ఉత్పత్తి అధికమైతే, ఈ వ్యవస్థ బలహీనంగా ఉన్నట్లు మనము తెలుసుకొంటాము. కారణం అక్కడ ప్రాణవాయువు సరిగా పనిచెయ్యలేకపోవడమే. మనము తీసుకున్న ఆహారంవల్ల తప్పుడు ప్రదేశంలో వాయువు సృష్టించబడుతుంది.
యోగాభ్యాసములే కాదు, మన నియమ నిష్ఠలు మనము గాలిపీల్చే విధానము, నడక, నిలబడే, కూచునే తీరు మొదలయినవన్నీ మన ప్రాణవాయువుమీద మనము కొంత నియంత్రణ కలిగి ఉండే విధముగా తోడ్పడుతాయి. ప్రతి మనిషికి ఈ పంచభూతాల మీద కొంత నియంత్రణ చెయ్యగల శక్తి ఉంటుంది. లేకపోతే జీవించి ఉండలేరు. జీవితం అంతకంటే ఉన్నతమైన స్థితికి చేరుకోవాలంటే, ఈ పంచభూతాలపై నియంత్రణ కలిగి ఉండడం ముఖ్యం. గాలి లేదా వాయువు ఎక్కువ సమయం కేటాయించలేని సాధకులకి పనిచెయ్యడానికి అనువైన పరిమాణం. దానిపై నియంత్రణ సులువుగా సాధించగలిగే అవకాశం ఉండడమే దానికి కారణం.
ప్రాణవాయువు ప్రసరణ బొడ్డుకిందకి గాని జరిగితే, మన జీవితంలో ఉండవలసిన చైతన్యము హరించుకుపోతుంది. మనము సూపర్ మార్కెట్లలో కొనే ఆహారపదార్థాలు చాలాకాలము నిల్వచేసి ఉండడం వల్ల వాటిలో "ప్రాణ" శక్తి మృగ్యం అయిపోయి ఉంటుంది. దాని వినియోగానికి గడువు ఉన్నప్పటికీ, అది కుళ్ళిపోయేదిశవైపు ప్రయాణం చేస్తూ వున్నదన్నమాట. యోగ సంప్రదాయంలో తినే వస్తువులలో "ప్రాణ" వాయువును నియంత్రించడానికి పాటించే ఒక నియమము. వంట వండిన గంటన్నర నుండి నాలుగు గంటలలోపు దాన్ని భుజించడం ఆరోగ్యమునకు అవసరమైన లక్షణము. కొన్ని వస్తువులయితే ఇంకా తొందరగా తీసుకోవలసి వుంటుంది. లేకపోతే అవి వ్యవస్థలో వాయువును
సృష్టిస్తాయి. ఒకసారి వ్యవస్థలోకి వాయువు చొరబడితే, "ప్రాణవాయువు"ను మనము నియంత్రించుట కష్టమై పోతుంది.
గాలిని స్వాధీనం లో ఉంచుకొనగలిగితే అగ్ని అంటే జఠరము దాన్ని అనుసరించి వస్తుంది, ఇంచుమించు 25 నుండి 30 శాతం వరకు. మనకు ప్రాణవాయువు మీద కొంత నియంత్రణ ఉన్నపుడు, కొంతమేరకు అగ్నిమీద కూడా సమకూరుతుంది. చాలా మందిలో కావలసిన వేడి ఉండదు, అదే వాళ్ల జీవితాలలో పెద్ద సమస్య. శరీరము చురుకుగా ఉండుటకు వేడి అవసరము. వేడికి వాయువు అవసరము. అందుకు దుర్గంధభరితమైన కలుషిత వాతావరణము ఆరోగ్యమునకు అత్యంత హానికరము. అటువంటి ప్రదేశములను పని ముగించుకొని త్వరగా బయట పడుట మంచిది. ఇంటిలో కూడా రోజుకు ఒకసారి సహజ సుగందితములగు దంగము, గుగ్గులము, సాంబ్రాణి మొదలగునవి వెలిగించి కొంత సమయము ఆ పొగ ఇంటిలో నింపితే, ముఖ్యముగా పిల్లలున్న ఇంటిలో చాలా మంచిది.
వాయువునకు సంబంధించిన జాగ్రత్తలు మనిషియొక్క మేధోశక్తినీ, కార్యకారక శక్తినీ, ప్రభావితము చేసి తీసుకుపోగలవు. ఇక నింగి ని గూర్చి కాస్త తెలుసుకొందాము.
రేపు చివరి భాగము.........
ఆరోగ్యము – పంచభూతములు-6
నింగి - ఆకాశము
ఆకాశం అంటే 'ఈథర్' అన్న అర్థమును చెప్పుకొనవచ్చు. ఇది సరైన అనువాదం కాదు, కానీ ఇంచుమించుగా అంతే. ఈదర్ అంటే అంతరిక్షం కాదు. ఇది మన మనుగడకు సంభందించిన ఒక రకమైన అంశం.
Pertaining to the hypothetical upper, purer air, or to the higher regions beyond the earth or beyond the atmosphere (studysite.org - Google).
ప్రాథమికముగా ప్రాణుల రూపకల్పన అంతా ఒకటే. అన్నింటిలోనూ పంచప్రాణాలు ఉన్నాయి. కానీ మానవుని రూపకల్పన కొంత విశిష్ఠత కలిగియున్నది. అ నిజానికి మీరు మీలో ఏం జరుగుతోందో అది తప్ప మిగతా ఏమి గ్రహించలేరు అది కూడా అనుభూతి ద్వారా మాత్రమే!
మీరు తిన్న ఆహారాన్ని, పీల్చే గాలిని , చుట్టూ ఉన్న పరిసరములను మీ చుట్టూ ఉన్న బ్రహ్మాండాన్ని అనుభూతి చెందాలన్నా మీరు కేవలం అది ఎలా ఉంది అని ఊహించుకొంటే ఆ విధంగా మాత్రమే చూడగలరు.
మన శరీరములోని ఆకాశ తత్వమును ఒక విధముగా అద్దముతో పోల్చవచ్చును. తన ఎదుట ఆలోచన అన్న వ్యక్తిని ఉంచకపోతే అద్దము శూన్యము. లోకాన్ని చూసే కొద్దీ మన ఆలోచనల అనుమానముల అవగాహనల సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. వానితో మనము అద్దము ముందు నిలచినామంటే బయట కనిపించే ఆకాశము వలె ఎన్నో గ్రహాలూ, ఉపగ్రహాలు నక్షత్రాలు, నక్షత్రమండలాలు ఇంకా మనకు అర్థము కానివన్నీ చూస్తాము. కానీ మనకు అవసరమైనదానిని మాత్రమే గమనించుతూ పోతే మన కంటికి(అంటే జ్ఞాన నేత్రమునకు) అది తప్ప ఏదీ కనిపించక పోవచ్చు. ఒకవేళ అది దైవ చింతనే అయితే మనకు ఆయన పదము లభించవచ్చు. కానీ సంసార ఝంఝాటమున తగులుకొన్న మన మనసులో ఎన్నో దుఃఖములు, సుఖములు, ఆశలు, కోర్కెలు, ఆనందములు, అవకాశములు,
అవరోధములెన్నెన్నో కనిపించుతూ వుంటాయి. మనకు అవసరమగు ఒక్కటి మాత్రమే గ్రహించి మన స్మృతి అన్న ఆకాశములో ఉంచుకొంటే అది సాధించేవరకు వేరే ఆలోచనలు రానీకుంటే మనము ఆరోగ్యమును కాపాడుకోన్నట్లే. కారును నడిపే డ్రైవరు లక్ష్యము వైపేదృష్టి ఉంచుతాడు గానీ ఇటుఅటు చూడడు. మన ఏకాగ్రత కూడా అదే విధముగా వుంటే మన ఆరోగ్యమును కాపాడుకొనగలుగుతాము. అట్లు కాకుండా పలువిధములగు క్షణికసుఖములకు పరుగిడినామంటే పస ఉడిగిన ముసలితనములో పరిపరి విధముల బాధపడవలసియుంటుంది. అందుకే మనలో ఉన్న ఆకాశము అన్న అద్దము కూడా స్వచ్ఛమైనదిగానూ ప్రతిబింబమును యథాతథముగా చూపించునదిగాను ఉంచుకోవలసిన అవసరము ఎంతయో వున్నది. మూలాధార చక్రము స్వాధిష్ఠాన చక్రము మణిపూరక చక్రము అనాహత చక్రము విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము అన్న ఈ ఆరింటి పైన సహస్రారము వుంటుంది. యోగులై సాధనతో సహస్రారమును జయించమని నేను ఇచట చెప్పదలువలేదు కానీ సహస్రారము యొక్క ఉనికి గుణగణములు చెబుతూ వున్నాను.
తలనుంచి కటి భాగందాకా వెళ్లే చక్రాల్లో తలలో ఉండేది సహస్రార చక్రం. ఏడు చక్రాల్లో ఇది మకుటం లాంటిది. జీవ చైతన్యానికీ పూర్తి ఎరుకకు సంబంధించింది. ఇది సాధార ణ స్పృహకు, కాలానికీ, స్థలానికీ అతీతమైన ఒక అద్భుత ప్రపంచంతో ముడివడి ఉంటుంది. ఈ చక్రాలు ఎదిగినప్పుడు విద్వత్తును, విజ్ఞానాన్నీ, అవగాహనననూ పెంచుతాయి. ఆఽధ్యాత్మిక బంధాన్నీ, ఒక దివ్యానందాన్నీ కలిగిస్తాయి. సహస్రార చక్రం తల మీద ఉంటుంది. ఇక్కడ 20 పొరలు ఉంటాయి. ఒక్కో పొరలో 50 రేకుల చొప్పున మొత్తంగా 1000 రేకులు ఉంటాయి. మౌలికంగా ఇది వాయిలెట్ వర్ణంలా అనిపిస్తుంది. కానీ, వాస్తవానినికి ఇది పలు వర్ణాలతో ఉండి ‘ఓం’ అనే బిందువును ప్రతిబింబిస్తుంది. అంతే కాదు స్వీయ జ్ఞానమయమైన ఒక దివ్యానందపు అనుభూతిని, ఒక మహోన్నతమైన ఆలోచనను, విఽశ్వైక్య భావనను కలిగిస్తుంది. ఇది మన ఆకాశాముగా భావించితే దీనిని అందుకొనుట యోగులకు తప్ప అన్యులకు సాధ్యము కాదన్నది మనము గ్రహించవలసిన విషయము. కానీ మనము చేయగలిగినదల్లా దానికి చేరు గమ్యమును అయోమయములోనికి నెట్టక పరిశుభ్రమయిన ఆలోచనలతో వుంటే ఆరోగ్యమును కాపాడుకొన్నవారమవుతాము.
ఉపసంహారము
యోగులు తాము తలచినపుడు హటయోగముతో కపాల విచ్ఛేదము గావించుకొని అంటే సహస్రారము దాటి మోక్షమును పొందగలుగుతారు. అట్లు చేసిన వారిలో శృంగేరి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ తీర్థులు ఒకరు. మనము ఎటూ అంతటివారమగుట సాధ్యము కాదు కాబట్టి ప్రాణములు అపానము గుండా పోకుండా కాపాడుకోనవలసి యున్నది. దుర్మార్గము, దుర్వ్యసనము, దురాలోచన, దుష్ట సాంగత్యము, దురాశ మున్నగునవి కలిగినవారికి ఈ విధమగు మరణము ప్రాప్తించుతుందని పెద్దలు చెబుతారు. కావున సహృదయత, సహృద్భావము, సదాచారము, సచ్ఛీలము, సత్ప్రవర్తన అలవరచుకొంటే పంచభూతములు కూడా తమకు తామే మన నియంత్రణలో వుంటాయి.
స్వస్తి.
Pemmaraju Purnachandra Rao
బయటి ప్రపంచంతో పెనవేసుకున్న బంధాలు అనుభవమే కాని లోపలికి చూసుకొంటే ఈశ్వర ప్రసాదితమైన ఈ శరీర నిర్మాణము పంచభూతాల సమన్వయము మనలోనే ఉండి మన ప్రమేయం లేకుండా జీవచైతన్యవికాసము స్వయంసమృధ్ధంగా నిర్వహించబడుతున్న తీరు మీ వివరణ చాలా సంభ్రమానికి గురిచేసింది. అల్ప మనస్కులకి వైజ్ఞానికంగా దృక్పధంతో సమన్వయం చేసిన తీరు spiritual as well as scientific.angle Biological functioning of the body combined with psychological functiong of mind is really awesome.మీ రచనా ధోరణి విలక్షణ మైనది. సంప్రదాయాన్ని పాటిస్తూనే నలుగురూ తందానా తానా అనే గొర్రెదాటు వ్యవహారంలా ఉండదు.
ఉదాహరణకు గురజాడ వారి దేశమంటే మట్టీకాదోయ్ దేశమంటే మనుషులోయ్. వాక్యం తలచుకోని వారుండరు కాని మీరు దేశమంటే మట్టి కూడా అని సోదాహరణంగా ఢంకా బజాయించారు.
water memory: అద్భుతమైన వివరణ.నేల నీరు మానవ మనస్తత్వం పై ఎం త ప్రభావం చూపుతాయో మనకి తెలియనిది కాదు.కొత్తగా వచ్చిన ఒక సినిమాలో వాడు కడప వాడురా! ఇటు తీవ్రమైన వేడికి, పగవారిని చివరిదాకా ఎదుర్కోడానికి అలవాటు పడ్డవాళ్ళురా! అనడం విన్నాము. మా తమిళ స్నేహితుడు మీ గోదావరి కృష్ణా నీళ్ళు భూములను సారవంతం చేస్తాయి మా కావేరి నీళ్ళు మనుషుల తెలివితేటలను బలోపేతం చేస్తాయి. అందుకనే మా రాజకీయము మా ప్రాంతము మా భాషా
సంస్కృ తులను ప్రయోజనాలను ప్రత్యేకంగా నిలుపుకోగలుగుతాము.
ప్రాంత మంటే మట్టియేనోయ్ ప్రజకు తన గుణ మిచ్చునోయ్! ప్రాంతనామము ప్రబలపరచే ప్రకృతే ప్రాంతానిదోయ్* అని మీరు చెప్పినది ఎంతో సత్యము.Health is not absence of disease health is enthusiasm to work and to be compassionate* BMHegde.పంచభూతాలను ఒక్కొక్కటిగా సమగ్రంగా ప్రామాణికంగా విదేశీ మేధావుల నిర్వచనాలతో సహా ఉంచినారు. మనలోకోందరికి సంస్కృతమన్నా ఋషి వాక్యమన్నా సరిపడదు గదా!
మీ వివరణ చదువుతూవుంటే ఏక కాలములో బోలోగి భగవద్గీత అపరోక్షానుభూతి చదివినట్లున్నది. అందుకనే కన్యాశుల్కములో గిరీశం అన్నట్లు మీతో మాట్లాడడమే okavEDUCATION'
నమస్సులతో,
పెమ్మరాజు పూర్ణచంద్ర రావు.
Pemmaraju Purnachandra Rao
సమానము అనే వాయువు మరణ సమయంలో ఆఖరున శరీరం నుండి నిష్క్రమించుతుందని విన్నాను.ఆదికూడా తలి దండ్రులు లో ఎవరు కాలం చేసినా ఆఖరున కొడుకు వారి చెవిలో *మీ మనోభీష్టాలు అన్నీ నెరవేరుస్తాను తండ్రీ. తల్లీ మీరు ప్రశాంతిగా వెళ్ళండి* అన్న తదుపరి ఈ ఆఖరి శ్వాస శరీరం నుండి బయటకు వెళుతుందని ఓ ప్రవచనంలో విన్నాను చితికి అగ్ని సంస్కారం చేసే ముందు చెవిలో చెప్పమంటారు పోయినవారి అభీష్టము ఏమిటో. నిత్యపూజా విధానంలో పంచభూతారాధన అంతర్లీనంగా ఉండడం విశేషం. బయాలజీ నుండీ భగవద్గీతా సారం అపరోక్షానుభూతి మొదలగు విశేషాల మాలికలా అందించిన మీ పరిశోధనా ప్రతిభకు వందనములు
Pemmaraju Purnachandra Rao garu, ముందు మీకు నమస్కారము. నేను ఆస్య గ్రంధిలో నాకు తోచిన విషయాలను వ్రాయబట్టి 10 సంవత్సరములు దాటినది. కొంత కాలము మాత్రము Dr.VVS శర్మ, Dr. వనదీప్, MVS కిరణ్ మొదలగువారు ఎంతో ఇష్టముగా చదివి వివరముగా సద్విమర్శలు ప్రశంసలు ఎన్నో చేసేవారు. శర్మ గారు కాలమైనారు. మిగత వారు ఇపుడు నా పరిధిలో లేరు. కానీ దైవ వశాతు మీరు మరియు పార్వతీశం గారు ఆ లోటును సంవృద్దిగా తీర్చుచున్నారు. మీకు శాత సహస్ర ధన్యవాదములు.
ఇక మీ విమర్శను గురించి దాని ఔన్నత్యమును గురించి నేను ఎంత చెప్పినా తక్కువే! నాకష్టమును గుర్తించి మనఃపూర్వకముగా స్పందిన్చినారు. మీకు హృదయపూర్వక నమస్కారములు.
మీరు సమాన అన్న వాయువును గూర్చి ప్రస్థావించినారు. నాకు తెలిసిన రెండు మాటలు చెబుతాను.
పంచ ప్రాణాలు - ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులను పంచప్రాణాలు అంటారు. ఇవి ప్రాణమయ కోశంలో భాగం. ఈ 5 వాయువులు, వీటికి 5 ఉపవాయువులు ఉన్నాయి.
#ప్రాణ వాయువు - ఊపిరి (ఉచ్ఛ్వాస, నిశ్వాస) ప్రక్రియలకు సంబంధించినది. మనం నిత్యం లోనికి తీసుకునే గాలి. మన ఆలోచనలు, భావావేశాలు, మనస్సు దీనితో గాఢంగా ముడిపడి ఉంటాయి.
#అపానం - బొడ్డు నుంచి అరికాళ్ళ వరకు ప్రభావితం చేసే వాయువు. ఇది విసర్జన ప్రక్రియలను, కామోద్రేకాలను నియంత్రిస్తుంది.
#వ్యానం - శరీరమంతా వ్యాపిస్తూ, అన్ని భాగాలకు ప్రాణవాయువు ప్రసరణ జరిగేలా చూస్తుంది. రక్త ప్రసరణ చేస్తుంది. శరీరంలోని నాడీ వ్యవస్థ ద్వారా ప్రవహిస్తుంది. సమస్త శరిరాన్ని, ముఖ్యంగా నడులను ప్రభావితం చేస్తుంది. శరీరభాగాలకు పని చేయుటకు అవసరమైన శక్తినిస్తుంది.
#ఉదానం - తిరస్కరించడం, ఎగదన్నటం దీని పని. కన్నీళ్ళకు కారణమవుతుంది. ఇది కంఠంలో ఉంటూ, నోట్లో ఆహారాన్ని మిరింగటం అనే ప్రక్రియలో కీలకంగా వ్యావహరిస్తుంది. ఇది హృదయం నుంచి శిరస్సుకు, మెదడకు ప్రసరణ చేస్తుంది. మరణ సమయంలో ఉదాన వాయువు సహాయంతోనే సూక్ష్మదేహం స్థూల దేహం నుంచి విడువడుతుంది.
#సమానం - అరుగుదలకు (జీర్ణం చేసుకునేందుకు) కారకమవుతుంది. ఉదరంలో ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాల్లో వాయుప్రసరణ సమంగా ఉండేలా చూస్తుంది. ఆహారంలోని పోషక విలువలను దేహమంతటా పంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను కాపాడుతుంది.
ఉపవాయువులు -
1. #నాగ - తేపులు (త్రేనుపులు), ఎక్కిళ్ళు, వాంతులను కలిగిస్తుంది. ప్రాణ, అపాన వాయువులలో ఏర్పడిన దోషాలను తొలగిస్తుంది. ఉదరం నుంచి ఊర్ధముఖంగా వెళ్ళే వాయువులను నియంత్రిస్తుంది.
2. #కూర్మ - కంటి భాగంలో ఉంటూ, కంటి రెప్పలు తెరిచి, మూసే ప్రక్రియను నియంత్రిస్తుంది.
3. #కృకర - శ్వాసకోశ వ్యవస్థలో దోషాలను తొలగించేందుకు చీదడంలో తోడ్పడుతుంది. ఆకలి దప్పికలను కలిగిస్తుంది.\
4. #ధనంజయ - కండరాలు, ముఖ్యంగా హృదయ కవాటాల వ్యాకోచ సంకోచాలు నియంత్రణ దీని ఆధీనంలో ఉంటాయి. మరణ సమయంలో శరీరాన్ని క్షీణింపజేసి, పంచభూతాల్లో కలిపేస్తుంది.
5. #దేవదత్త - ఆవలింతలు కలిగిస్తుంది.
ఇవన్నీ శరీరంలో సక్ర్మంగా ఉన్నప్పుడే, వ్యక్తి ఆరోగ్యవంతుడిగా, సదాలోచనలతో ఆనందంగా ఉంటాడు.
ఇక మీరు సమాన వాయువును గూర్చి చెప్పినది వాస్తవము. అది సకల వాయువులనూ సమస్త శరీరాన్నీ నియంత్రిస్తుంది.
అమూల్యమైన మీ స్పందనకు అనేక ధన్యవాదములు.