Monday, 23 September 2019

సౌందర్య లహరి 28వ శ్లోకము


సౌందర్య లహరి-28వ శ్లోకము
https://cherukuramamohanrao.blogspot.com/2019/09/28.html
సుధామప్యాస్వాద్య ప్రతి-భయ-జరమృత్యు-హరిణీం
విపద్యన్తే విశ్వే విధి-శతమఖాద్యాదివిషదః |
కరాళం యత్క్ష్వేళం కబళితివతః కాలకలనా
న శమ్భోస్తన్మూలం తవ జననితాటఙ్క మహిమా || 28 ||
ఈ శ్లోకార్థమును విస్తరించుటకు పూర్వము ఈ భాగవత పద్యమును ఒకపరి పరికించుదాము.
మ్రింగెడి వాఁడు విభుం డని
మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో! (అష్టమ స్కందము 241 పద్యము)
ఆమె సర్వమంగళ కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే
మ్రింగెడిది కాలకూట విషము, అది అన్యులకు అసాధ్యము అని తెలిసి కూడ లోకులకు మేలు జరుగుతుందను సదుద్దేశ్యముతో, కట్టుకొన్న భర్తకు గల సామర్థ్యము తెలిసినదగుటయూ అంతకన్నా తన మాంగళ్య బలముపై అపారమగు నమ్మకము కలిగినదియై యుండుటచే పార్వతీదేవి శివుని  హాలాహల భక్షణకు సమ్మతించింది.
ఈ పద్యమున శబ్దార్థసౌందర్యము అపారము. తాను తన భర్త శరీరంలో సగభాగమును పంచుకొన్నది.  మరి ఆ జగజ్జనని ఎట్లు ఒప్పుకొన్నది అని  పరీక్షిత్తునకే సందేహము కలిగి  అడిగితే శుకుడు చెప్పిన సమాదానము ఈ పద్యము. మ్రింగ్ మ్రింగ్ (పూర్ణానుస్వరపూర్వక గకార ప్రాస) అన్న ఈ ధ్వని అటు కఠమునకు, ఇటు గరళమునకు సంబంధించినది కాగా అదే కంఠమునకు మంగళ మంగళ అంటూ అమ్మ మంగళ సూత్రము సమాధాన పరచుచున్నట్టి తీరును ప్రదర్శింపజేస్తూ వ్రాసిన ఈ పద్యము ఎంతటి భావ గర్భితమో! గరళంఅన్న పదమునకు మధ్యలో ‘ర’ ఉన్నది. ‘ర’ అన్న అక్షరమునకు ఎకార్థ నిఘంటువులో అగ్ని అన్న అర్థము ఉన్నది. దహించుట దీని గుణము. మరి గరళం యొక్క గుణము కూడా దహించడమే కదా! ఆ ‘ర’ గళమును దహించకుండా గళమును కాపాడినది మంగళ. అటువంటి ‘మంగళ’ కలిగినటువంటి శక్తియే ‘మాంగళ్యము’. మాంగళ్యమును గల్గిన స్త్రీని ముత్తైదువ అంటారు. ముత్త+ఐదువ= ముత్తైదువ.
నాకు తెలిసి ముత్త అన్న మాటకు ముదుసలి లేక వయసు మీరినది అన్న అర్థమును చెప్పుకొనవచ్చును. అంటే పూర్వము బాల్యములోనే వివాహము జరిగేది కాబట్టి ఒక 35 సంవత్సరముల యువతిని ముత్తయిదువ అనవచ్చునని నా అభిప్రాయము. ఎందుకంటే ఆమెకు అప్పటికి తమ పరివార ఆచారవ్యవహారాలనీ అవగతమై ఉంటాయి. ఇక ఐదువ అంటే ఐదు వన్నెలు కల్గినది. వన్నెలు అన్నమాట ఎంతో మంచి అర్థముతో కూడినది. ఈ ఐదు వన్నెలు ఏవేవంటే
1.    పసుపు, 2. కుంకుమ, 3. గాజులు, 4. కాటుక, 5. చెవ్వాకు.
మొదటి నాలుగూ తెలిసినవే. మరి చెవ్వాకు అంటే ఏమిటి? ఇది ఒక సందేహము. రెండవది ఏమిటంటే మరి తాళిబొట్టు ఉంటేనే కదా ముత్తైదువ అంటారు? ఈ రెండు ప్రశ్నలకూ సమాధానము ఒకటే! చెవ్వాకు అన్నది వేరేమీ కాదు ‘తాటియాకు’. దీనిని తాళపత్రము అంటారు. తాళము అన్న మాటనుకూడా పర్యాయముగా వాడుతారు. ‘తాళ’ శబ్దము నుండి పుట్టినదే ‘తాళి’. పూర్వము ఈ తాళమును చెవికి కమ్మలుగానూ, ముక్కుకు నత్తు గానూ, కంఠానికి తాళిబొట్టుగానూ వాడేవారు. చెవ్వాకు అన్న పదము అక్కడ ‘తాళము’ అన్న అర్థములోనే వాడబడింది. అందుకే మగలసూత్రము పేరు ఐదువలో చేర్చబడలేదు.
ఇప్పుడు మనకు మాంగళ్యగరిమ అంటే ఏమిటో తెలిసినది.
ఇక తాటంకముల గూర్చి తెలుసుకొందాము.
లలితా సహస్ర నామములో ఒకనామము ‘తాటంక యుగళీ భూత తపనోడుప మండలా’ అని అనటం జరిగింది.
తాటంక యుగళి + భూత=కుండల ద్వయము కల్గిన, తపన ఉడుప మండల= వెలుగు వేడిమినిచ్చే నక్షత్రమండలము అంటే సూర్యచంద్రులు కల్గిన సమస్త ఆకాశము అని అర్థము. అంటే ఇక్కడ కుండలములు ఒకటి సూర్యుడయితే మరియొకటి చంద్రుడు. అంటే ఆ రెండుతాటంకములూ గరళములోని ‘ర’ ను తాముగ్రహించివేస్తాయి. అందువల్ల పరమేశుడు కాలకాలుడైనాడు. ఇది ఎందువల్ల అంటే 'ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్' అన్నది శాస్త్ర వచనము. అట్లే వనస్పతులకు, వనౌషధములకు అధిపతి చంద్రుడు. అంటే ఆరోగ్య దాత సూర్యుడు ఔషధనేత చంద్రుడు. మరి వారిరువురి చూపు కాలకంఠుని కంఠము పై నుంటే  గళము లోని 
గరళము ఆయనేమిచేయగలదు. ఇంకా కొంత సందేహము ఉండిపోయే అవకాశము ఉంది. అసలు సూర్యచంద్రులు తాటంకాలేమిటి అని? అమ్మవారు విశ్వరూపిణి. ఆకాశమంతా నిండిన ఆతల్లికి అటువైపు సూర్యుడు ఇటువైపు చంద్రుడు ఉంటారు కదా! ఆకాశారూపినియైన అమ్మకు ప్రతీకాత్మకముగా సేడురేడురుగా ఉండే సూర్య చంద్రులను తాతంకములుగా జగద్గురువులు వర్ణించుట జరిగినది.
కంచిలో కామాక్షి అమ్మవారు ఆకాశ స్వరూపిణిగా కొలవబడుతున్నది.  విశ్వాంతరాళమంతటా వ్యాపించిన ప్రకాశ స్వరూపిణియే కామాక్షి. అందుకే ఆమె సిద్ధాసనములో కూర్చున్న పీఠము నేలను అంటదు అని ప్రశస్తి. పైగా ఆకాశం శబ్దగుణయుక్తము. శబ్దము తెలిసేది చెవిద్వారానే, అంతేకాకుండా  ఆ ఆకాశంలోనే కదా సూర్య చంద్రులు కూడా ఉండేది. అక్కడ శబ్దగుణకమైన ఆకాశానికీ, శబ్దాలను వినే చెవులకూ, వానికి పెట్టుకునే ఆభరణాలకు సామ్యము ఇక్కడ కుదిరుతుంది. ఆకాశంలో ఒక వేపు సూర్యుడు మరోవేపు చంద్రుడు రెండు వేపులా రెండు, కాబట్టి ఆ ఆకాశస్వరూపంగా ఉన్న అమ్మవారికున్న శబ్దాన్ని గ్రహించే చెవులకు ఆభరణములుగా సూర్యచంద్రులను చెప్పినారు భగవత్పాదులు. ఇప్పుడు సందేహము సమసిపోయి ఉంటుంది.
ఇప్పుడు శ్లోకము యొక్క అర్థమును అన్వయమును చూద్దాము.
 భావము: తల్లీ! భయంకరమైన జరామృత్యువులను సరకు చేయని సుధ అంటే  అమృతమును త్రావి కూడా బ్రహ్మేంద్రాది దేవత లందరూ కల్పాంతమున మృతి చెందుతున్నారు. కానీ నీ భర్త అయిన పరమేశ్వరుడు కాలకూటము భుజించి కూడా మృత్యువునకు మృత్యువై నిలచియున్నాడు. దానికి కారణము నీ కర్ణాభరణములగు తాటంకములే కానీ అన్యథా కాదు.
మనము పైన చెప్పుకొన్న తాళి తాటంకముల బలమే ఈశ్వరుని రక్షగా, మహా ప్రళయములో కూడా నిలిచి క్ష్వేళ అనగా హాలాహలము నుండి ఇసుమంత ఆపద కూడా పొందనీయక కాపాడుతూ వుంది.
కాళిదాసు ఒక శ్లోకంలో “తాళీ పలాశ తాటంకామ్” అని వాడినారు. తాళ, తాళి అంటే తాడిచెట్టు. పలాసమంటే మోదుగ చెట్టు అన్న ప్రసిద్ధార్థము ఉండగా, పచ్చియాకు అన్న అర్థం కూడా ఉన్నది. కాబట్టి తాళీ పలాశమంటే పచ్చి తాటియాకు అని అర్థము.
కాలము మారి తాళమును తాళముతో బంధించి బంగారునాకు తాళము వేయుచున్నాము. సాంప్రదాయబద్ధమైనటువంటి జీవన విధానమును వదులుకొని బంగారు వెనుక పరిగెత్తుచున్నాము.
సుధామప్యాస్వాద్య ప్రతి-భయ-జరమృత్యు-హరిణీం

విపద్యన్తే విశ్వే విధి-శతమఖాద్యాదివిషదః |
కరాళం యత్క్ష్వేళం కబళితివతః కాలకలనా
న శమ్భోస్తన్మూలం తవ జననితాటఙ్క మహిమా || 28 ||

జగద్గురు ఆదిశంకరులవారు పైనాలుగు పాదముల ఈ శ్లోకములో చిన్ని బుర్ర కలిగిన అపండితుడనైన  నాతో ఇంత వ్రాయించినాడు. మరి పాండితీ మేరువులైతే ఎంత గొప్పగా చెప్పే వారో కదా!
స్వస్తి.

1 comment:

  1. Sir yentho vivaramga suluvugaa artham ayye tugas telipina atu
    Muthaiduva ante kooda vivaramgaa telipina aru
    Yentha srama teesukuni maaru nijamgaa
    Meeku yelaa kruthagnathalu telapaalo teliya kunnadhi

    ReplyDelete