Monday, 4 November 2019

భీష్మ జాతకము - భీష్మార్జున యుద్ధము

                     భీష్మార్జున యుద్ధము

https://cherukuramamohanrao.blogspot.com/2019/11/blog-post_18.html

శీర్షిక పేరు చూస్తూనే ఇది మాకు తెలిసిందేలే! ఏముంది దీనిలో చదివేది అని పాఠకులు తలచుట ఎంతో సహజము. తెలిసినది కాకుండా వేరేమయినా యున్నదా అన్న జిజ్ఞాసతో నైనా చదువండి. భారతము ఇతిహాసము (History) అని మన పూర్వులు ముద్ర వేసి చెప్పినామనము విశ్వసించే పాశ్చాత్యులు ఆ విషయమును తేటతెల్లము చేసేవరకూ మనము ససేమిరా నమ్మలేదు. మనవారు రామాయణ భారతములను 'ఇతిహాసములు అనే కదా మన తండ్రి తాత ముత్తాతలు అన్నారు. మన సంస్కారము, మన గ్రంధములు, మన సంస్కృతము, మన సంస్కృతి, మన ఐకమత్యము అన్న విషయములను ఇకనైనా పరిగణన లోకి తీసుకోకుంటే ఈ దేశము పరమతములకు ప్పజెప్పినట్లే!

భారతేతిహాసములో ధర్మజ , భీష్మ, కృష్ణ దుర్యోధన, విదుర వంటి విభిన్న పాత్రల నియమ నిష్ఠలను మనమెంతో ఆకళింపు చేసుకొనవలసినది ఉంది. నేను పై శీర్షిక కల్గిన ఈ వ్యాసములో బ్ర.శ్రీ. రేమేళ్ల అవధానులవారి సహకారముతో, భీష్ముని జన్మ కుండలిని తీసుకొని కొంత విశ్లేషణ చేయుట జరిగినది. నా వ్యాసములో నేను వాడిన రెండు బింబములు (Images) నా తమ్ముడు మండెం కృష్ణ మూర్తి తన ఉద్యోగము నుండి అలసివచ్చి కూడా రాత్రి 11.30, 12గం. లకు నేను చేతి వ్రాతగా పంపిన కుండలిని చక్కగా తయారుచేసి పంపినాడు. తాను నా ధన్యవాదములు కోరడు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే నేను వ్రాసే ఒక వ్యాసానికి, ఫలాపేక్ష లేకుండా, నాపై గౌరవముతో ఉన్న వారిని కూడా ఉపయోగించుకొని కొన్ని వ్యాసములు తయారు చేయవలసివస్తుంది. మ్నారి ఇంతటి సహృదయుల సహాయ సహకారముతో ప్రచురించే అపురూపమయిన వ్యాసములు పాఠకులుగా మీరు చదువక పోతే నా శ్రమ 'బూడిదలో పోసిన పన్నీరే!

అసలు ఇటువంటివి చదివి మన పూర్వుల ప్రతిభ, మన చరిత్ర గుర్తించుటకుగానూ,చదువుట అన్నది మన ప్రాథమిక కర్తవ్యము. కొంతమంది మిడి మిడి జ్ఞానముతో మన వేద శాస్త్ర పురాణేతిహాసాలను దుయ్యబడుతూ ఏవేవో వ్రాస్తూవుంటారు. ఆ వ్రాతలకు ప్రాధాన్యతనిచ్చేవారు కొందరైతే పట్టించుకోని వారు కొందరు.  కానీ మన దేశములోని పరమతస్తులు తమ తమ మతగ్రంధములను తాము దుయ్యబట్టక పోగా, అట్లు ఎవరయినా మాట్లాడితే తలలు తెంచుతారు.  

అంత దాష్టికమునకు మనము పాలుబదనవసరము లేదు. అసలు మన పురాణేతిహాస శాస్త్ర గ్రంధములు ఏమిచేబ్యుతున్నాయో కాస్త శ్రద్ధబూని చదువుదాము.

మన సనాతన ధర్మము పగలు రాత్రి లేకుండా ప్రకాశించే దివ్యమణి. దానిని కాపాడుకొనుట మన పని.

భీష్మ జాతకము - భీష్మార్జున యుద్ధము
నేటి చరిత్రకారుల అంచనాలకు అందని కాలములోనే అనంత సృష్టి పై దృష్టి సారించి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యజనకమైన విషయములను సాదికారికముగా గుర్తించి మనకు అందించిన ఆ ఋషి ముని వరేణ్యులకు మనసా పాదములంటి సాష్టాంగ దండప్రణామములాచారించి నాకు తోచిన నాలుగు మాటలు చెబుతాను. అనంతమైన మన పూర్వుల సకలశాస్త్ర విజ్ఞాన సంపద ఇంత అని మన కొలమానమునకు అందనిది.
ఖగోళ శాస్త్రము అన్న సంస్కృత పదమునకు Astronomy సమాంతర నిర్వచనము కాదు. మొత్తము విశ్వాంతరాళమును ఖగోళముగా నిర్వచించినారు మన పూర్వులు. పాశ్చాత్యుల Astronomy ఆకాశములో అగుపించే తారాతోరణాల వరకే పరిమితము. వారి ఈ మాటే మన భూమి ఆకాశము అన్నీ చద్ఫరముగా ఉన్నట్లే సూచిన్చుచున్నాయి తప్పించి గోళాకృతిని నిర్వచించవు. ఇక Astrology అన్న మాటకు అర్థము ఆంగ్ల నిఘంటువులో ఈ విధముగా వుంటుంది.
Astrology is the study of the movements of the planets, sun, moon, and stars in the belief that they can influence people's lives.
అదే మన జ్యోతిషము అన్న పదమునకు వివిధ, నక్షత్ర, గ్రహ, వివిధ గ్రహకూటముల వెలుగు యొక్క ప్రభావము మానవులపైనే గాక సకల చరాచర సృష్టిపై ఏర్పడు ప్రభావమును తెలుపుతాయి. ఈరోజు గ్రహస్థితిని ఒక ప్రమాణముగా తీసుకొని కొన్ని వేల సంవత్సరముల గ్రహ గమనమును గూర్చి, గ్రహణముల గూర్చి నిర్దుష్టముగా చెప్పగలిగిన శాస్త్రములను మనకు అందించిన ప్రజ్ఞాశాలురు మన పూర్వులు. ఇట్లు మనము వారి ఘనతను గూర్చి ఎంతయో చెప్పుకొంటూ పోవచ్చును.
ఇక అసలు విషయమునకు వద్దాము. బహిరంగాముగానూ, మన పిల్లలకు ఆంగ్లము అనర్గళముగా వస్తుందన్న ఆశతో చేర్పించిన మిషనరీ స్కూల్స్ లోనూ మన రామాయణ భారతములు మైత్\మిత్ అని పదేపదే చెప్పి, ఇటు మన బుర్రల్లోనూ, అటు అమాయకులైన పసిపిల్లల బుర్రల్లోనూ ఈ ఇతిహాసములు జరిగినవికాడు. అన్నీ కట్టుకతలే! అని నమ్మించినారు. నిజము నిప్పు అన్న వాస్తవమును విస్మరించినారు. వారిలోనే నిష్పక్షపాతులగు చరిత్రకారులు అవి చరిత్రయే అని రుజువులతో సహా నిరూపించినారు. వారు చెప్పినదగుతచే దానికి ఇప్పుడు వంత పాడుట మొదలు పెట్టినాము.
ఈ వ్యాసములో భీష్మార్జున యుద్దమును తీసుకొని ఇటు చరిత్రను అటు జ్యోతిషమును అనుసంధించి నాకగుపించినది, నాకనిపించినది వ్రాయుచున్నాను.
నక్షత్రములు 27 అన్నది మధ్యవయస్కులకు తెలిసిన విషయమే! యువతలో ఎక్కువ మందికి తెలిసే అవకాశము తక్కువ. ఒకప్రక్క చెప్పేవారి సంఖ్య తరిగిపోతూ వుండగా మరొక ప్రక్క వినే ఉత్సాహము యువతలో కూడా రాను రానూ కుంచించుకొని పోతూ వుంది. అసలు విషయానికొస్తే అప్పుడపుడు జ్యోతిశ్శాత్ర వేత్తలు 28 వ నక్షత్రమును గూర్చి చెబుతూ వుంటారు. దానిపేరు అభిజిత్తు. ఇది ఆ 27 నక్షత్రములవలె పూర్ణ మండలము కలిగిన నక్షత్రము కాదు. అశ్వని భరణి ఆదిగా గల పేర్ల నక్షత్రములు చర్మ చక్షువునకు ఒకటిగా కనిపించినా అవి కొన్ని తారకల గుంపును తమలో కలిగి ఉంటాయి. అభిజిత్తు ఉత్తరాషాఢ లోని నాలుగవ వంతు శ్రవణములోని మొదటి 15వ వంతు కలిగి ఉంటుంది. పై విషయములు అసంగతములు అని అనుకొంటుంటారు. పనిలో పనిగా ఇప్పుడు చెప్పకపోతే వానిని గూర్చి తెలియని పాఠకులు తెలుసుకొనే అవకాశము ఎగిరిపోతుంది.
అసలు విషయమునకు వద్దాము. భీష్ముని నక్షత్రము ‘ధనిష్ఠ’. ధనిష్ఠ 8 నక్షత్రములు కలిగిన మండలమని ఖగోళ శాస్త్రము చెబుతూ వుంది. 8 అష్టవసువులకు సంకేతము. అంటే వీరు ధనిష్ఠకు అధిష్టాన దేవతలన్నమాట. అష్ట వసువులు అనగా దేవలోకం లో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం సాక్షాత్తూ బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధృవులు అను వీరలను అష్ట వసువులు.
ఒక సారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్టుని ఆశ్రమంలో ఉండే నందిని  అనబడు కామధేనువు యొక్క బిడ్డ. దానిని వారు దొంగతనంగా తీసుకుని వెళతారు వారు. అందులో ఆవును పట్టుకొని తోలుకుపోయినవాడు 8 వ వాడు. వశిష్ఠుడు తన దివ్యదృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్టుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడుగురు వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని కానీ కామధేనువుని తీసుకుని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెబుతాడు.
వారు ఆ శాపం గురించి ఆలోచిస్తుండగా గంగాదేవి వారి వద్దకు వస్తుంది. వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనిచ్చి, పుట్టిన వెంటనే నదిలో పారవేయ వలసిందిగా కోరతారు. గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది. తరువాతి కథ మీకు తెలిసినదే! దేవవ్రతుడన్న నామధేయము గలిగి భీషణ ప్రతిజ్ఞ చేయుటచే మహాభారత సంగ్రామము ముగిసి తానూ ప్రాణత్యాగము చేసేవరకూ భీష్మునిగానే నిలిచిపోయినాడు. తన ప్రతిజ్ఞ మేరకు పెళ్లి చేసుకోనూ లేదు రాజ్యాధికారమును పొందనూ లేదు. మరి ఆయన జన్మపత్రిక ఏమి తెలుపుచున్నదో చూద్దాము.



జాతక చక్రమున మీనము తరువాత నుండి వచ్చే ఖాళీ గదులలో వరుసగా, మేషం, వృషభం,కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ఊహించుకోనేది. 12 గళ్ళలో 12 రాసులు ఉన్నాయి. మనకు అవసరమైనవి ఆయా గదులలో వ్రాసుకొన్నాము.
ప్రతి నక్షత్రమూ నాలుగు పాదాలు కలిగియుంటుంది. ప్రతి రాశీ ప్రతి మూడు వరుస నక్షత్రములనుండి, వరుసగా, 9 పాదములు కలిగియుంటుంది. పైన కనపరచిన కుండలిలోని ధనుస్సు, మకరం, కుంభం, మీనం అన్న రాశులను తీసుకొందాము. ధనుస్సు: మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదము కలిగియుంటుంది. దానితరువాత వచ్చే మకరం: ఉత్తరాశాధలోని మిగిలిన 3 పాదాలు,శ్రవణం లోని 4 పాదాలు, ధనిష్టలోని 1,2 పాదాలు కలిగి వుంటుంది. అదేవిధముగా మిగిలిన రాసులు కూడా! ధనిష్ఠ యొక్క మొదటి రెండు పాదాలూ మకరం లోనూ మిగతా రెండు పాదాలూ కుంభం లోనూ ఉన్నాయి.



నాలుగు పాదాలూ కలిపి చూసుకొన్నా ధనిష్టకు ఇటు కన్య గానీ అటు మిధునము కానీ చాలా దూరములో ఉన్నట్లు పై చిత్రము చూస్తే మనకు తెలుస్తుంది. అందుకే భీష్ముడు బ్రహ్మచారియై అవివాహితునిగా ఉండిపొయినాడు. ఇది ప్రసిద్ధ జ్యోతిష్కులైన దువ్వూరి అవధానిగారు చెప్పిన మాట. ఇక ఎదే జాతక రీత్యా ఇంకొక విషయమును చూద్దాము. ప్రతియొక్క యోధుని స్వంత రథమునకూ ఒక జెండా కలిగి యుంటుంది. అంటే దానివల్ల ఆ రథము ఎవ్వరిది అన్నది చూపరులకు అర్థమౌతుంది. మనకందరకూ తెలిసినది పార్థుని రథము యొక్క జండా పై కపిరాజు. మరి భీష్మునికో?
భీష్ముని ధ్వజకేతము తాటి చెట్టు. మరి జాతకలో దీనికి కూడా అన్వయము లభ్యమౌతుందేమో చూద్దాము.
ధనిష్ఠ 1,2 పాదాలు మకరం లో వుంటే 3,4 పాదాలు కుంభములో వున్నాయి. అంటే ధనిష్ఠ కుంభములోనికి విస్తరించి ఉన్నది అన్నమాట. ఆ లంకె ఏమిటి అన్నది చూద్దాము. కుంభమునకు అధిష్టాన దేవత వరుణుడు. వారుణి అన్న శబ్దము ‘వరుణ’ శబ్దము నుండి పుట్టినదే! ‘వారుణి’ అన్న మాటకు అర్థము ‘కల్లు’ అని. ‘కల్లు’ లో మొదటిస్తానము తాటి కల్లుది. దానిని తాతిచేట్టునుండి తీస్తారు.
మనము ఇపుడు ధనిష్ఠ 1,2 పాదములు రథము పై ఉన్నాయంటే 3,4 ధ్వజము జండాలను గుర్తు చేస్తాయి. కాబట్టి జెండా పై తాటిచెట్టు వెలసింది. ఇటువంటి విషయములు తెలుసుకొనుటకు సహేతుకమగు తర్కము ఎంతయో అవసరము.
ఇక భీష్మార్జున యుద్దమును గూర్చి తెలుసుకొందాము. మహా భారతమును చదివితే, భీష్మునికి అర్జనునికి యుద్ధము, రెండు పర్యాయములు జరిగినట్లు తెలియవస్తూ వుంది. 1. ఉత్తర గోగ్రహణ సందర్భము. ఇక్కడ జరిగిన యుద్ధము ప్రానాన్తకము కాదు. ఎందువల్లనంటే ఇక్కడ అర్జనుని ధ్యేయము గోవులను మరలించుటయే! తిక్కన భారతము ప్రకారము దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని, ద్రోణ, అశ్వత్థామాది కురువీరులను మూర్చిలజేసిన తరువాత భీష్ముడొకడూ మిగులుతాడు. తాతకు తన ప్రతాపమును చూపనెంచి, శివుని నుండి పొందిన పాశుపతాస్త్రము మరియు దేవదానవ యుద్ధములో దేవతలకు సహాయమోనర్చి తానూ బహుమతిగా పొందిన వివిధ అస్త్ర శస్త్ర పటుత్వమును చూపనెంచి
ఆయనపై అలుగులనొదులుతాడు.  హోరాహోరీగా జరుగుచున్న ఆ యుద్ధములో భీష్ముడు వేసిన ఒక బాణము అర్జనుని భుజమున నాటినది. చలించని అర్జనుడు తాను రెండు బాణములను సంధించి భీష్ముని గుండెను తాకునట్లు వదలినాడట.  ఆయన తూలి పడబోతూ రథము యొక్క స్థంభమును పట్టుకొని నిలువగాలిగినాదట. భీష్ముడు యోధానుయోధుడు. అర్జనుడూ సమాన శౌర్య సంపన్నుడు.
ఇక్కడ మనము గమనించవలసినది ఏమంటే భీష్ముని అంతగా నిలువరించగల యోధుడు కురుపాండవ బలగములలో వేరెవరూ లేరు. దేవతలను మెప్పించి అస్త్రశస్త్రములను భీష్ముడు సాధించితే, దేవతలు మేచ్చుటచే అస్త్రశస్త్రములను సాధించినవాడు అర్జనుడు. అర్జనుని విలువిద్యా కౌశాలును గూర్చి ఒక్క మాట ఇక్కడ చెబుతాను.
వీక నెదిర్చి ఇట్లు కురువీరులకున్ ప్రమదంబొనర్చుచున్
తాకిన క్రోధవేగ సముదగ్రత నెర్రని చూడ్కి జూచి పే
రాకలి తోడనున్న జమునాకృతి భీషణ రేఖ యొప్పగా 
వ్రేకని నారసంబు దొడి క్రీడి కరిన్ దృఢ ముష్టి వేసినన్
ఫాల కుంభ సంధి బడి వాలమున వెస
నుచ్చి పోవుటయును నుర్వి యద్రువ
గూనె నగ్గజంబు కువిశచండాహతి
పడు మహా నగంబు భంగి దోప
మహాభారత యుద్ధము తీవ్రముగా జరుగుతూ వుంది. అర్జనుని ముందు కౌరవసేన నిలువలేక వెన్నుజూపి పారిపోతూ వుంది. వారికి ధైర్యము చెబుతూ మదించిన సుశిక్షితమైన మరియు కౌరవ గజబలములో శ్రేష్ఠమైన ఏనుగునెక్కి అర్జనుని ఢీకొన, వికర్ణుడు బయలుదేరినాడు. కౌరవ సేన ధైర్యము పుంజుకొని వికర్ణుని వెంట నడిచింది. ఇదిగామనించి, వికర్నుడా నన్నేదిరించేవాడని, అర్జనుడు ఆగ్రహోదగ్రుడై విడిచిన బాణము, ఏనుగు కుభస్థనుండి లము నడుమనుండి దూసుకొని పోయి తోకవైపు నుండి బయల్వెడలినదట. అంతబలము బాణము వదిలే ఆయన ముష్టి అంటే పిడికిలికి ఉండినదంటే ఆయన ఎంత బలవంతుడో అర్థము చేసుకొండి.
అంతటి మహా బలశాలి బాణము వేసినాడు కాబట్టే భీష్ముడు తూలినాడు. మరి అంతటి బలశాలి వేసిన బాణమునకు ఎదురొడ్డి నిలువగలిగినాడంటే భీష్ముడెంత బలశాలియో గ్రహించండి.
ఇక మహాభారత యుద్ధానికి వస్తాము. కురుక్షేత్ర సంగ్రామములో ప్రథమ సైన్యాధ్యక్షుడు భీష్ముడు అన్నది మనకు తెలిసినదే! ఆయనకు సైన్యాధ్యక్ష పదవిని కట్టబెట్టినంతనే తాను 10,000 రథికులను మట్టుబెట్టిన తరువాతనే నేల వాలుతాను అని దుర్యోధనుని ముందు శపథము చేస్తాడు. యుద్ధము ప్రారంభమయిన 9 రోజులలోనే మాట నిలబెట్టుకొంటాడు. కృష్ణుడు ధర్మరాజు సమేతంగా ఆ రోజు రాత్రి భీష్మునివద్దకు వెళ్లి ఆయన మరణ రహస్యము అడుగుతాడు. తనది ఇచ్చా మరణమే అయినా నేలకు ఒరగాలంటే అర్జనుని, శిఖండిని ముందుంచుకొని, యుద్ధము చేయమంటాడు. వారు ఆయనకు తమ కృతజ్ఞత చాటుకొని తమ శిబిరమునకు వెళ్ళిపోతారు. తెల్లవారి యుద్ధములో శిఖండి అర్జనుని ముందు నిలబడతాడు. సమారా శంఖములు పూరించిన వెంటనే యుద్ధము ప్రారంభమవుతుంది.
ఒకసారి మనము పైన ఉన్న కుండలిని పరిశీలించినట్లయితే కన్య గదికి పైన ఒక చుక్క గుర్తు కనిపిస్తుంది. అది ఉత్తర ఫల్గుణీ నక్షత్రము. ఆ గదికి ఎదురుగా మకరం, దానిపై కుంభం రాసులలో ధనిష్ఠ ఉన్న 1,2 మరియు 3,4 పాదాలుగా ఉన్నదికదా!  అయినాకూడా అవి 180 డిగ్రీల కోణములో లేవు. మరి ఇద్దరు పోరుతున్నపుడు వారి మధ్య కోణము 180 డిగ్రీలు ఉంటుంది కదా!  ఇప్పుడు కుండలిని భీష్మార్జున యుద్ధముతో సమన్వయపరిస్తే ఆయుద్ధములో భీష్మార్జనులు ఎదురెదురుగా కాక కొంచెము ఏటవాలుగా వున్నారు. అంటే ధనిష్ఠ ఉత్తరఫల్గుణీ నక్షత్రములు ఒకదానికొకటి 180 డిగ్రీలలో లేవు. మరి ధనిష్టతో ఆ కుండలిలో మరొక నక్షత్రము ఎదురుగా వున్నదన్నమాట. ఆ నక్షత్రమే శిఖండిది. అదే శిఖండిని ముందుంచుకొని భీష్మునితో యుద్ధము చేయుటకు సంకేతము. ఆయుద్ధములో భీష్ముడు అర్జనునితో తనపై బాణ వర్షము ఇంకా ఇంకా కురిపించమని చెబుతూవుంటాడు. ఆయన తన సారధితో ఈవిధంగా అంటాడు. నాశరీరానికి కొన్ని బాణములు పూవులు తాకినట్లుగా ఉన్నాయి. కొన్ని అలుగులు  గుంతను త్రవ్వే పలుగులవలె  క్రుచ్చుకొంటున్నాయి.  పూలతాకిడి కల్గినవి శిఖండి బాణాలయితే  పలుగుల బోలినవి అర్జనుని బాణాలు అని భీష్ములవారు చెబుతున్నారు.
అర్జునస్య ఇమే బాణాః నేమే బాణాః శిఖండినః l
కృదంతి మమ గాత్రాణి మాఘమాసే గవామివll   
పై శ్లోకము వ్యాస భారతమునందు ఎంతో ప్రముఖమైనది. ఆ ప్రాముఖ్యత ఏమిటో చూద్దాము. భీష్ముడు సారధితో చెబుతున్నాడు. “ ఈ బాణాలన్నీ అర్జనునివే. ఇవి శిఖండివి కావు. ఈ బాణముల తాకిడితో నా శరీరములోని భాగాలు తునాతునియలైపోతూవున్నాయి. ఏ విధముగా అంటే ‘మాఘమాసే గవాం ఇవ’ అని పోల్చినాడు. ఇక్కడ విషయమునకు కాస్త దూరము జరిగి వ్యాస గణేశ సంవాదమును గూర్చి చెప్పవలసియున్నది. భారతము చెప్పు నా వాగ్వేగమునకు నిలిచి,  వ్రాయుటకు నీవే తగిన వ్రాయసకానివని గణేశునికి చెప్పి తనకు సహకరించమన్నాడు. అప్పుడు గణేశుడు కూడా నా వ్రాత వేగమునకు దీటుగా నీవు చెప్పలేకపోతే వ్రాయుట చాలించి వెళ్లిపోతానన్నాడు. సరే అట్లయితే నా శ్లోకార్థమును తెలుసుకొని నీవు వ్రాయవలెనన్నాడు వ్యాసుడు. గణేశుడూ వల్లె యన్నాడు. ఈవిధముగా అక్కడక్కడ సంస్కృత భారతములో కొన్ని శ్లోక పాదములలో చూస్తాము. వీనిని వ్యాస ఘట్టములు అని అంటారు. అటువంటి ఒక వ్యాస ఘట్టమే ‘మాఘమాసే గవాం ఇవ’. మరి ఇందలి సామాన్యార్థము గూడార్థము చూద్దాము. ‘మాఘమాసే గవాం’ అంటే మాఘమాసపు వాతావరణము గోవులకు పట్టదు కాబట్టి ఆ మాసములో వాటి సంఖ్య బహుళముగా క్షీణించుతుంది. ఆవిధంగా ఆయన శరీరావయవాలు క్షీణించిపోతున్నాయి అని సామాన్యమగు అర్థములో చెప్పుకోనవలసి ఉంటుంది. ఇక గూఢార్థమేమిటో చూద్దాము. ఇప్పుడు ఆ సమాసములోని పదవిభజన మారుద్దాము. ‘మాఘమా+సేగవాం ఇవ’  
‘మాఘమ’ అంటే ఎండ్రకాయ అని అర్థము. సేగవాం అంటే సంతానము ఇవ అంటే వలె. ఈ విశేషార్థాన్ని విపులీకరించితే ప్రసవ కాలములో నరకములోని యాతనలన్నీ ఒక్కచోట చేరి ఒక్కరే అనుభవించవలసి వస్తే ఎంత దుర్భరముగా వుంటుందో కర్కాటకము పిల్లలను కనే సమయమున కూడా అట్లే ఉంటుంది. ఆ ఎండ్రి కడుపు చీలడము, పిల్లలు బయల్పడడము ఒకేసారి జరుగుతాయి. అంతటి హృదయవిదారకముగా ఉన్నదట అర్జనుని అలుగుల వల్ల భీష్మునికి కలిగే బాధ.  ఇంతటి చారిత్రిక వాస్తవాన్ని తెలుపుతుంది భీష్సముని జాతకము. సక్రమమగు కుండలికి తపోతత్పరుని వాక్కు కలిస్తే తప్పకుండా జాతకము చక్కటి ఫలితాలను తెలియజేస్తుంది. ఇపుడు జాతకములు చెప్పుట వ్యాపారమైపోయినది.
స్వస్తి.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              









ఈ నక్షత్రాలను చుక్కలుగా (Points) గా అనుకొంటే అవి ఈ ధనిష్ట మండలములో ఏ ఆకారములో వున్నాయి అంటే అవి ‘మద్దెల’ ఆకారములో ఉన్నవట.


1 comment: