Friday, 18 September 2020

చాటువు- శివకేశవ స్తుతి శ్లోకము

  చాటువు-శివకేశవ స్తుతి శ్లోకము

https://cherukuramamohanrao.blogspot.com/2020/09/blog-post.html


ఈ శ్లోకమును ఒకపరి పరికించండి. చూడండి:

పన్నగధారి కరాగ్ర: గంగోమా లక్ష్మితో గదాగ్ర భుజ: l

శశి ఖండ శేఖర ఉమా పరిగ్రహో ముహురనాది రవతు త్వామ్ll

ఈశ్లోకములో కవి శివ పరమయిన అర్ధమూ, విష్ణు పరమయిన అర్ధమూ  వచ్చే 

విధముగా  రచన చేసినాడు. ముందుగా శివ పరమయిన అర్ధమును చూద్దాము. శివ పరముగా అర్ధం చెప్పుకునే సమయములో శ్లోకము లోని పదచ్ఛేదము ఈవిధముగా ఉంటుంది:

పన్నగధారి,  కరాగ్ర:,  గంగా, ఉమా లక్షిత:,   గదా, అగ్ర భుజ:,  శశి ఖండ శేఖర:,   

ఉమా పరిగ్రహ:,  అనాది:, ముహు:, త్వామ్ , అవతు. అన్వయ క్రమం ఇలా 

ఉంటుంది: పన్నగధారి:, గంగా ఉమా లక్షిత:, అగదోగ్ర భుజ:, శశిఖండ శేఖర:

ఉమా పరిగ్రహ:అనాది: , మహు:, త్వామ్ అవతు !

కవి ఈ శ్లోకంలో శివునికి  అన్వయించుతూ  ఈ విశేషాణములను వాడుట జరిగింది. 

పన్నగధారి = పామును ధరించిన వాడు

గంగో మా లక్షిత: = గంగ + ఉమా లక్షిత: = గంగా పార్వతులచే కోరబడిన వాడు

అగదోగ్ర భుజ: = భుజాల మీద బాహుపురులు, స్వర్ణాభరణాలు ధరించిన వాడు        

శశిఖండ శేఖర:   =    చంద్ర రేఖను అలంకారంగా ధరించిన వాడు.

ఉమా పరిగ్రహ:  =  పార్వతిని భార్యగా స్వీకరించిన వాడు

అనాది: = పుట్టుక లేని వాడు

మహు:, త్వామ్ అవతు =  సదా   మిమ్ము కాపాడు గాక !  

   భావము: చేతులకు పాములను కంకణములుగా ధరించినవాడు అని అన్వయము, 

గంగా, పార్వతుల ప్రియ నాథుడూ, భుజాలకు చక్కని భుజ కీర్తులు, బంగారు 

ఆభరణాలూ ధరించిన వాడూ, చంద్ర రేఖను తల మీద అలంకారంగా ధరించిన 

వాడూ , పార్వతీ దేవిని తన శరీరమున సగ భాగముగా కలిగిన వాడూ, పుట్టుకే లేని 

వాడూ అయిన పరమేశ్వరుడు ఎల్లప్పుడూ మిమ్ములను చల్లగా కాపాడు గాక !

ఇక, ఈశ్లోకము లోని అర్ధాన్ని విష్ణు పరంగా చెప్పు కొనవలెనంటే, కవి శివునికి 

వాడిన విశేషణములలోని తొలి అక్షరములను తొలిగించి చదువుకొనవలసి 

ఉంటుంది. అప్పుడు  పదచ్ఛేదము ఈవిధముగా ఉంటుంది:

నగధారి, కరాగ్ర: ,  గో, మా లక్షిత: , గద: , అగ్ర భుజ:, శిఖండ శేఖర:,  మా

పరిగ్రహ: , అనాది: , ముహు:, త్వామ్ , అవతు. అన్వయ క్రమం ఇలా ఉంటుంది: 

కరాగ్ర:, నగధారి, గో,మా లక్షిత:, అగ్ర భుజ: గద:, శిఖండ శేఖర:, మా , పరిగ్రహ:

అనాది: , త్వామ్, ముహు:, అవతు.

కరాగ్ర: నగధారి  =       గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడు

గో = ఆవుల చేత,

మా = లక్ష్మీదేవి చేత

లక్షిత: = కోర బడిన వాడు ( అంటే, గోవులకు , లక్షీ దేవికి ప్రభువు అయిన వాడు )

గద: అగ్ర భుజ: = భుజం మీద కౌమోదకి అనే గదను ధరించిన వాడు

శిఖండ శేఖర:  =  శిరసున నెమలి పింఛం ధరించిన వాడు

మా = లక్షీ దేవిని

పరిగ్రహ: = భార్యగా స్వీకరించిన వాడు

అనాది: = ( న+ఆది అంటే మొదటి అక్షరాలు తీసివేయగా మిగిలిన పదము)

విష్ణువు =సర్వ వ్యాపకుడు

ముహు: , త్వామ్, అవతు =      సదా మిమ్ము కాపాడు గాక !

భావం:  గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడూ,  గోవులకూ, లక్ష్మీ దేవికీ ప్రభువూ, భుజాన 

గదనూ, తల మీద నెమలి పింఛాన్నీ ధరించిన వాడూ, రమాపతి అయిన వాడూ

పుట్టుక లేని వాడూ అయిన శ్రీ మహా విష్ణువు మిమ్ములను ఎల్లప్పుడూ కాపాడు గాక !

స్వస్తి.

Tuesday, 8 September 2020

శంభు నటనము పతంజలి విరచిత చరణ శృంగ రహిత స్తోత్రము (పర చిదంబరనటం హృదిభజ)

 


శంభు నటనము

పతంజలి విరచిత చరణ శృంగ రహిత స్తోత్రము

పర చిదంబరనటం హృదిభజ
https://cherukuramamohanrao.blogspot.com/2019/05/blog-post_11.html


మొట్ట మొదట పతంజలి, శివుని వాహనమైన నంది వీరిరువరికి సంబంధించిన ఒక 

చాటుకథను చెప్పాలి. పతంజలి మహర్షి యోగశాస్త్రమును రచించిన మహాముని. 

అతనికి ఒకనాడు పరమేశ్వరుని సందర్శించాలనే అభిలాష కలిగినది. ప్రదోషకాలమున 

పరమేశ్వరుని తాండవము చూడ సంకల్పించి కైలాసము వెళ్ళినాడు. నంది ద్వారము 

వద్ద నిలచియున్నాడు. ఎవరు ఈశ్వరుని చూడవలయు నన్నను, నంది అనుమతి 

తీసికొని వెళ్ళవలసినదే. నేటి పరిభాషలో నంది, ఈశ్వరునికి పీ. ఏ. అని అనుకోవచ్చు. 

ఎందుకో తెలియదు గానీ ఆ రోజు నంది పతంజలికి శివుని దర్శనమునకు 

అనుమతినివ్వలేదు. పతంజలి అప్పుడు ఆశువుగా ఈశ్వరుని రూపమైన నటరాజును 

ఉద్దేశించి ‘పరచిదంబర నటం హృదిభజ’ అన్న మకుటముతో ఆశువుగా ఒక స్తోత్రము 

తో స్థుతించినాడు. ఆ స్తోత్రము యొక్క గోప్పదనమేమో గమనించండి. దేవనాగరి లిపిని గుర్తుకు తెచ్చుకొంటే , का అన్న అక్షరాలలో ఈ సంకేతములను చరణములు(కాళ్ళు) అంటారు. అదేవిధముగా , లలో ोौ పైన వంపుతో ఉన్న 

గీతలను శృంగములు (కొమ్ములు ) అంటారు. నిజముగా ఈ కవనము చిత్రకవిత్వపు 

కోవకు చెందినది. ఆకార, ఏకార, ఐకార, ఓకార, ఔకారములతో ఉండే దీర్ఘాక్షరములు 

లేవు. అనుస్వారము, విసర్గము, సంయుక్తాక్షరములు, మాత్రమే ఇందులో గురువులను 

కలిగిస్తాయి. ఇకార, ఈకార, ఉకార, ఊకారములు అంగీకృతములు. దీనిని 

చరణశృంగరహిత స్తోత్రమని, నటరాజ స్తోత్రమని, శంభు నటనమని పలు పేర్లతో 

పిలుస్తారు. అనగా కాలు కొమ్ము లేని నటరాజ స్తోత్రము అని అర్థము. కాళ్లతో నడిచే 

కొమ్ములుండే జంతువు వృషభము గదా! పతంజలి సర్పాకృతి. ఆయనకు కాళ్ళు 

కొమ్ములు ఉండవు.  అందువల్ల పతంజలి, నందిని అవహేళన చేస్తూ ఈ స్తోత్రమును 

రచించినాడు అని మనము అర్థము చేసుకొనవచ్చును. ఇది విన్న శివుడు ముదావహుడై 

పతంజలికి స్వయముగా స్వాగతము పలికినాడని చెబుతారు.

ఇక్కడ ఒక తర్కము ఉన్నది. మరి వేద కాలములో లిపి లేదు కదా, లిపి వచ్చిన వచ్చిన 

తరువాత, అందునా బ్రాహ్మీ లిపి తరువాత వచ్చిన దేవనాగరి లిపి లో కదా ఈ విధమగు 

అన్వయము కుదుర్తుంది. కాబట్టి ఈ స్తోత్రము అధునాతనము అంటే పతంజలి 

ఆధునికుడు అనేవాళ్ళున్నారు. కానీ ఒక్కసారి శబ్ద ఉత్పత్తిని పరిశీలించుదాము. ఒక 

వ్యక్తి నోరుదెరచి ‘అ’ అనబోయేటంతలో ఎవరయినా కాలు బట్టుకొని లాగినాడని 


ఊహించుకొందాము. అప్పుడు వాని నోటి నుండి అప్రయత్నముగానే ‘ఆ’ అన్న 

శబ్దము వస్తుంది. కాబట్టి చరణము యొక్క ప్రమేయము లేదు,  లేక దీర్ఘము రాదు అన్న విషయము తెలియవస్తూవుంది. ఇక శృంగములు. ఏ, ఓ లను వక్రములని ఐ

ఔ లను వక్రతమములని అంటారు సంస్కృతములో మరియు మనదేశ సకలభాషలలో! మరి 

‘వక్రములు’ అంటే వంపుగా ఉండేవి కొమ్ములే కదా! కావున ‘చరణ శృంగ  

రహితము’ అన్న మాట, లిపి లేని కాలమునకు కూడా ఈ పేరు సార్తకమౌతూ వున్నది 

కాబట్టి పతంజలి మహర్షి కాలమును నిర్దేశించుట అంత సులభమైన పనికాదు.  

 ఈశ్వరుడు నృత్యంచేసేది  సంధ్యా సమయం . ఆ సంధ్యా సమయంలో ఈశ్వరధ్యానము మనసుకు ఏకాగ్రతను అలవరచుతుంది. ధ్యానముద్రాగతుడగు పతంజలి  తదేకముగా తన మనసును లగ్నముచేసి ఈ స్తోత్రమును రచించుట జరిగినది. శంభునటనమన్నది దీనికి నామాంతరము.  పతంజలి, వ్యాఘ్రపాదుడు ఇరువురూ మహర్షులు. నంది, భృంగి  ప్రమద ప్రముఖులు.  వీరు ఎల్లవేళలా ఈశ్వరుని అనువర్తించి ఉండేవారు. 

పతంజలి, వ్యాఘ్రపాదుడూ మాత్రము నర్తనసమయములో ఉండేవారు.

 శివనర్తనపు లయ, తాళగతుల ననుసరించి పతంజలి ఈ స్తోత్రమును రచించుట

జరిగినది. ఈయనను  మానవ శీర్షము కలిగిన సర్పదేహునిగా, పురాణములలో

తెలిపిన రీతిగా, శిల్పులు చిత్రిస్తారు. వ్యాఘ్రపాదులకు పులికాళ్ళు, మానవ ముఖము

ఉంటాయి. వీరు శివతాండవము నందే తమ మనసును లయింపజేసియుంటారు.

 నంది తాండవమును  చూసే సమయమున శ్రద్ధ నటనముపై నుంచితే కళ్ళతో

చూడగలరు కానీ వినికిడి మీద ధ్యాస తగ్గుతుంది. అదేవిధముగా  చెవులతో

వినేటప్పుడేమో ధ్యాస దృశ్యముపై తక్కువగా ఉంటుంది. పతంజలి సర్పాక్రుతి

కాబట్టి వీనులూ, కన్నులూ ఒకే ఇంద్రియం కావడంవల్ల రెంటిపైనా ధ్యానము

సంపూర్ణముగా వుంటుంది. అందుకే సర్పమునకు ‘వీనుకంటి’ అన్నపేరు

అచ్చతెనుగులో ఉంది. పాణిని వ్రాసిన వ్యాకరణమునకు మహాభాష్యము వ్రాసిన

మహానుభావుడు పతంజలి. పై మాటలకు ఆలంబన కంచి కామకోటి మహాగురువు

చంద్రశేఖర భారతి వారి ప్రవచనము.

సంస్కృత ఛందస్సులోని వృత్తజాతిలో శంభునటనము అన్నది ఉత్పలమాల,

చంపకమాల మొదలగువానివలె ఒక వృత్తము. ఇందులో మొత్తము 26 అక్షరములు లేదా 33 మాత్రలు వుంటాయి. ప్రతి పాదములోనూ

, , , , , , , , వ(లగ) గణములు వస్తాయి.

శివ తాండవమును 9 శంభు నటన శ్లోకములద్వారా చెప్పుట జరిగినది.

9 శ్లోకాలు లో 108 శివనామాలు ఉన్నాయి. ఇప్పటికీ చిదంబరంలోని నటరాజ

స్వామికి ఈ నామాలతోటి అర్చన జరుగుతుందని విన్నాను. ఇది ప్రతి రోజూ ప్రదోష

సమయంలో చాడుయ్వుకొంటే సత్ఫలితము సమకూరుతాయని పెద్దలు చెప్పగా

విన్నాను.


రేపటి నుండి 

వినాయక ప్రార్థనతో ప్రారంభించి  స్తోత్ర శ్లోకార్థములతో, ఒక్కొక్కటిగా మీ ముందు

ఉంచుతాను.

వినాయక స్తుతి

శ్రీకాంతో మాతులోయస్య

జననీ సర్వమంగళ

శంకరః పితరో యస్య

తం వందే కుంజరాననం

విఘ్నేశుని గురించి ఎంతో సులభమైన రీతిలో వ్రాయబడిన శ్లోకము ఇది. శ్రీకాంతుడు 

అంటే శ్రీవిభుడు అంటే శ్రీ కి భర్త అంటే సమస్తమగు మంగళమయ కార్యములకు 

అధిపతి, కేవలము లక్ష్మీదేవి భర్త అన్న అర్థములోనే కాకుండా! అట్టి సర్వవ్యాపియైన 

శ్రీమహావిష్ణువుకు మేనల్లుడు. మేనమామ కన్నతండ్రితో సమానమంటారు. పిల్లవాని 

పోలికలను  మేనమామతో పోలుస్తారు. కావున వినాయకుడు మంగళుడు. ఆయన 

ఎవరికుమారుడయ్యా అంటే ‘సర్వమంగళ’ కుమారుడు. సర్వవిషయములను 

మంగళమయము చేస్తుంది ఆతల్లి. సర్వులకు మంగళము చేకూర్చుతుంది ఆతల్లి. ఆమె 

తలపే మంగళమయము. మరి ఆమె కుమారుడు అంతకంటే తక్కువవాడు కాడు గదా! 

కావున ఆవిధంగా ఆయన సర్వమంగళానుశాసకుడు. ఇక శంభుడు,శంకరుడు 

శివుడు అంటే అంతా మంగళమునే కలిగించువాడు. ఆయన కుమారుడు ఈయన. ఈయన ఒక్కనీ తలచుకొని పని ఏది ప్రారంభించినా అంతా మంగళమయమే! అట్టి వినాయకునికి మనసా నమస్కరించుతూ ఇప్పుడు కాస్త వినాయకుడు అన్న ఆ పరాత్య్పరుని పేరును పరిశీలించుదాము. ప్రమద గణాధిపతి ఈయన. ‘వినయము’ అనగా శిక్షణ. వినయమునకు నాయకుడు కాబట్టి వినాయకుడు. ఈయనకు పైన ఎటువంటి నాయకుడు లేదు కాబట్టి ఈయన వినాయకుడు. అసుర సంపదను ఆయన నియంత్రించుతాడు గనుక వినాయకుడు. ఆయనను శ్లోకములో కుంజరాననుడు అని సంబోదించుట జరిగినది. కుంజరాననుడు అంటే గజ ముఖుడు. గజము అహంకారమునకు ప్రతీక. దాని అహంకారమంతా తన దేహమును చూసుకోనియే కదా! అందుకే ఆ దేహము నుండి దానిని విడుదలజేసి ’వినయమున’కు ప్రతీకనుజేసినాడు కాబట్టి ఆ అహంకారమును మనము విడనాడితే అసురీ శక్తుల నన్నింటినీ నిగ్రహించినవారమౌతాము. అప్పుడు మనము పొందలేని సిద్ధి లేదు కదా!

ఈ చిన్న శ్లోకము ఇంత అర్థవంతము ఇంత శక్తివంతము.

 

 ఇక ‘శంభు నటనము’ను లేక ‘శివతాండవము’ను చూద్దాము.

 

 

శంభు నటనం

ఈ స్తోత్రమును సాధకుడు తన్ను తాను సంబోధించుకొంటూ దేవుని ప్రార్థించుచున్నట్లు 

భావింపవలెను.

1.సదంచిత ముదంచిత నికుంజిత పదం ఝలఝలంచలిత మంజు కటకం

పతంజలి దృగంజన మనంజన మచంచల పదం జనన భంజన కరం

కదంబరుచి మంబర వసం పరమమంబుద కదంబక విడంబక గళం

చిదంబుధి మణిం బుధ హృదంబుజ రవిం పర చిదంబర నటం హృది భజ

సాధకుడా! సదా నీ హృదయమునందు ఆ నటరాజ స్వరూపమునే భజించుచుండుము. 

అది సత్పురుషులందరిచేతనూ కీర్తింపబడినది.  ఆలీఢ (అంటే కుడికాలును ముందు 

మోపియుంచిన) పాదముతో, మువ్వల ఝళంఝళనినాదముతో నర్తించు మనోహర 

మూర్తి, పతంజలి మనోనేత్రమును వికసింపజేయు దివ్యాంజనము ఆ పరాత్పరుడు. 

మనస్సునకు గల సంసార బంధమను మలినము అంటనివాడు. ఆయన 

జననమరణభయభంజకుడు. చలించుచూ అచంచలమైన పదములు కలిగినవాడు

కడిమిపూవుల కాంతితో భాసిల్లుచుండెడివాడు. దిక్కులనే తన అంబరముగా 

కలిగినవాడు. పరమోత్కృష్ఠమైనవాడు, నల్లని మేఘ పంక్తులను పరిహసించు 

నీలకంఠము కలిగినవాడు. భక్త హృదయకమలములను వికసితము చేయగల 

చిదాకాశమున వెలుగందు అభినవ సూర్యమండలము ఆయన. ఏవం విధ అంటే 

ఈవిధమగు విశేషణ విశిష్ఠమైనది ఆ నటరాజ స్వరూపము. అట్టి చిదంబర నటుని 

హృదయమున ఉంచి భజింపుము.


2.హరం త్రిపుర భంజన మనంతకృత కంకణ మఖండ దయ మంత రహితం 

విరించి సుర సంహతి పురందర విచింతిత పదం  తరుణ చంద్ర మకుటం

పరం పద విఖండిత యమం భసిత మండిత తనుం  మదన వంచన పరం

చిరంతర మముం ప్రణత సంచిత నిధిం పరచిదంబరనటం హృది భజ

హరుడు అంటే హరించే వాడు అంటే రూపు మాపే వాడు. దేనిని రూపు మాపుతాడు. 

దేనిని అపహరిస్తాడు. తాపత్రయాలు, కష్టములు దుఃఖములు, ఈతి బాధలు మరియు 

జన్మ సంసార బంధనాలను తప్ప. త్రిపురములను భంజించు వాడు అంటే స్థూల సూక్ష్మ 

కారణ శరీరములను సమయించు వాడును, అనంతుడు అంటే ఆదిశేషుని చేత 

ధరింపజేయబడిన కంకణములు గలిగిన వాడునూ  అంటే  ఆదిశేషుడు నాగులకు రాజు 

ఆయన, తలపైన మణులు గలిగిన నాగులను కరకంణములుగా అమర్చినాడేమో!

అసలు అంతకన్నా విశేషమయిన గుప్తార్థము ఇందులో ఇమిడి యున్నదని నా ఉద్దేశ్యము. కాలమును పెద్దలు అనంతము అని అంటూ దానిని సర్పముతో పోలుస్తారు. పాములపై గల మణులు మనము తీర్చుకోదలచిన కోరికలు కానీ అవి పాముల పడగలపైవుంటే మనము చేయి వేయగలమా! అది కాకుండా అవి నిరంతరమూ మన మనస్సులో పాములవలేనే తిరుగాడుతూ మనలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ వుంటాయి. మరి వాటిని తనవైపునకు ఆకర్షించుకొని అణచి తన ఆధీనములో ఉంచుకోనగలిగినవాడు ఆ పరమేశ్వరుడే! ఇదంతా ఆయన నటనలోని భాగమే! నాట్యము అన్న మాటకు నృత్యము అన్న అర్థమే కాకుండా నాటకము అన్న అన్వయముకూడా వుంది.

ఆయన అపార దయా సంపన్నుడు మరి భోళాశంకరుడు మరియు ఆశుతోషుడు.  

అంత రహితుడు అంటే అంతము లేని వాడు. మరి అదేకదా శివపురాణములో 

నిరూపింప బడినది. వారిజ భవుడు, వారిజ నాభుడు ఆయన  ఆది అంతము 

కనుగొనలేక పోయినారుకదా! తాను అంతరహితుడయ్యునూ 

అంతరించువారలనాదుకొనువాడు ఆ శంభుడు. బ్రహ్మేంద్ర సురగణ సంసేవిత 

పాదద్వయము కలిగిన వాడును, శుక్ల షష్టి సప్తమి తిథుల నాటి చంద్రకళను కలిగిన 

మకుటమును ధరించిన వాడునూ, పరమాత్ముడగు వాడునూ,  యముడు అంటే 

యమింపజేయువాడు అంటే అణచివేయువాడు అంటే ప్రాణాంతకుడు, అట్టి 

యమధర్మరాజునే, కాలద్రోసినవాడునూ (అంటే తనను శరణన్న వారికి 

అపమృత్యుభయము లేకుండాచేసి, దోసపండును తొడిమ విడిచినంత సులభముగా 

పరిపక్వత చెందిన మనసును పండుబారిన శరీరమునుండి వేరుచేయు 

మహానుభావుడు ఆయన. మహామృత్యుంజయ మంత్రము ఈ మాటే చెబుతుంది.)

ఆసాంతమూ, కాముని దహించి, అంటే సర్వవిధములగు కామములను అంటే 

కోరికలను దహించి, ఆ భస్మమును విభూదిగా  నలదిన మేను కలిగిన వాడునూ, (సకల 

కామములను దహించి తన మేనికి అలదుకొని, కామమును జయించండి నన్ను 

పొందుటను మాత్రమే కామితముగా ఉంచుకొనండి అని సాంకేతికముగా లోకానికి 

చాటుచున్నాడు పరమేశ్వరుడు)  తనలో కోరిక రగుల్ప వచ్చిన మన్మధుని వంచించిన 

అంటే, మోసము చేయుట కాదు, మదమణచినవాడును (పైన సంకేతార్థమును 

వివరించినాను.), చిరంతనుడును అంటే కలకాలమూ తన ఉనికిని చాటు వాడునూ

భక్తుల హృదయ కుహరములలో పెన్నిధియై దాగి యుండెడు వాడునూ నగు అట్టి 

చిదంబర నటుని హృదయమున ఉంచి భజింపుము.

  3. అవంత మఖిలం జగదభంగ గుణతుంగమమతం ధృతివిధుం  సురసరిత్

తరంగ నికురంబ దృతి లంపట జటం శమన దంభ సుహరం భవహరం

శివం దశ దిగంతర  విజృంభితకరం కరలసన్మృగ శిశుం పశుపతిం

హరం   శశి ధనఙ్జయ పతంగ నయనం పరచిదంబరనటం హృది భజ

 

భక్తజన రక్షకుడగుటచే సకల లోక పాలకుడు, భంగురము అంటే నశించునది అని 

అర్థము.జీవితము క్షణ భంగురము అని మనము వింటూనే ఉంటాము. ఈయన 

అభంగురుడు అంటే నాశము లేనివాడు. సృష్టి స్థితి లయములకు అతీతుడు, అభంగుర 

గుణములు కలిగినవాడు. అవి సత్వరజస్తమోగుణములు కావు. ఎందుకంటే వానికి 

నాశము కలదు. గుణము వ్యక్తిని లేక పదార్ధమును ఆశ్రయించి ఉంటుంది. కావున అది 

లేకపోతే ఇది లేదు. మరి శాశ్వతగుణములు ఏవి అంటే అవి సత్య జ్ఞానానందములు. ఇవి 

శుద్ధములు, నిత్యములు, శాశ్వతములు. ఆయన గుణరహితుడయ్యు సగుణ రూపుడై 

భక్తులకు సాక్షాత్కారించుచున్నాడు. అర్ధచంద్రమలంకరించిన కిరీటము, గంగాలంకృత 

జూటము ఆ సగుణ రూపుని ఆభరణములు. ఈ సగుణ నిర్గుణ తత్వము గ్రహించిన 

యోగులకు, జ్ఞానులకు జనన మరణ సంసార భయములు దరిజేరవు. వారిది 

‘శివోహం’ అన్న స్థితి. అట్టి వ్యక్తికి శంభునటనము దశదిశలా కర విన్యాసముతో 

సాక్షాత్కరిస్తుంది, ఇక ఆయన చేతిలో మృగశిశువు అంటే జింకపిల్ల వుంటుంది. అది 

చపలతకు సంకేతము. దానిని పట్టుకొని ఉన్నాడు అంటే చపలతను తన అదుపులో 

ఉంచుకొన్నాడు అని అర్థము. ఆయన పశుపతి. మానవుడు కూడా ఒకవిధముగా 

పశువే! ఆయనను యజమానిగా నమ్మితే తన రక్షణ ఇస్తాడు, మనకైనా పశువులకైనా! 

మనము విచ్చలవిడిగా వుంటే, మన కర్మ పరిపక్వమగువరకు మన ప్రక్కగూడా 

చూడదు. ఇక శశి ధనంజయపతంగ నయనం అన్న సమాసమునకు అర్థమును 

తెలుసుకొందాము. శశి అంటే చంద్రుడు మనకు తెలిసీనదే!, ధనంజయుడు అన్నపేరు 

అర్జనునికి ఉన్నదని కొందరికి తెలిసియుండవచ్చును. కానీ ధనంజయుడు అన్న పేరు 

అగ్నికి కూడా వుంది. ఇక పతంగ శబ్దమునకు పక్షి, శలభము అన్న అర్థము కొందరికి 

తెలిసియుండవచ్చు కానీ పతంగుడు అన్న మాటకు సూర్యుడు అన్న అర్థము కూడా 

వుంది. కావున శివుని నేత్రములను సోమసూర్యాగ్నులని చెప్పుట జరిగినది.  ఇవి 

మనోబుధ్యహంకారములకు ప్రతీకలు. వీటిని నియంత్రించమంటున్నాడా త్రినేత్రధారి.  

అట్టి చిదంబర నటుని హృదయమున ఉంచి భజింపుము.

 

4వ శ్లోకము

 4. అనంత నవరత్న విలసత్కటకకింకిణి ఝలం ఝలఝలం ఝలరవం

ముకుంద విధిహస్తగత మద్దలలయ ధ్వని ధిమిద్ధిమిత నర్తన పదం

శకుంత రథ బర్హిరథ దంతిముఖ నందిగణ భృంగిరిటి సంఘనికటం

సనంద సనక ప్రముఖ వందిత పదం పర చిందంబర నటం హృది భజ         

 

నటరాజు నాట్యము చేయుచుండగా ఆయన పాదములకు ధరించిన అందియల యొక్క 

గజ్జెలు ఝలంఝల ఝలంఝల రవముల సవ్వడి చేయుచుండును. ఇక్కడ పతంజలి 

మహర్షి ‘అనంత నవరత్న విలసత్కటకకింకిణి’ అన్న సమాసమును వాడినాడు. 

అనంతములగు నవరత్నములు అన్న అర్థమును తీసుకొనవచ్చు. ఇది మనకు చూసిన 

వెంటనే స్ఫురించే అర్థము. కొంచెము లోతుగా చూస్తే అనంతుడు కాలానికి ప్రతీక అని 

ముందే చెప్పుకొన్నాము.  ఆయన సహస్ర ఫణములు కలిగియుంటాడన్నది పురాణ 

వచనము. సహస్రము అన్న మాటకు కూడా అనంతము అన్న అర్థము ఒకటి ఉన్నది. 

పురుష సూక్తములో ‘సహస్రశీర్షా పురుషః’ అంటే అనంత శీర్షములు కలిగినవాడనియే 

అర్థము. కావున ఫణములు అనంతములైనపుడు మణులు కూడా అనంతములే కదా! 

అందుకే పై సమాసమును ప్రయోగించినారు మహర్షి. అట్టి అనంతుడు కడియమై 

పరమేశుని కాలికి ఆధానమై ఉన్నాడు అంటే తొడగబడియున్నాడు. కాలము 

సృష్టిస్థితిలయాన్వితము. మరి ఆ మూడూ అనంతుని రూపములో పరమేశ్వరుని 

అడుగులకు మడుగులొత్తుతూ వున్నాడు. ఆశలు అన్న మణులు కాలసర్ప రక్షణలో 

ఉన్నాయి. వాటిని తన పాదముల ఆధీనములో ఉంచుకొన్నాడు పరమేశ్వరుడు. సృష్టికి 

బ్రహ్మకర్త. స్థితికి విష్ణువు. వారిరువురూ లయకర్తయగు శివునికి అటు ఇటు కూర్చొని 

లయబద్ధముగా మద్దెలలు వాయించుచున్నారు. ఇది పరమేశుని నట్టువాంగమై 

లయకారకుడగు శివుని పదచలనములకనుగుణముగా ఆ మద్దెలల ధిమిద్ధిమి 

ధ్వానములతో రంజింపజేయుచున్నారు  అంటే ఆమువ్వురి ఉద్యోగములెంత 

అవినాభావసంబంధము కలిగియున్నాయో గమనించండి. అసలు వీరిరువురే కాదు 

గజానన, షడానన, నంది భృంగి ఆదిగాగల సకల భూతగణములూ ఆ నటరాజును 

సేవించువారే! అంతేనా బ్రహ్మమానస పుత్రులు సకల కామ విరక్తులు, సనక 

సనందనాదులు కూడా ఆయోగీశ్వరేశ్వరుని పాదసేవానురక్తులే! అట్టి పర చిదంబర 

నటుని హృదయమున ఉంచి భజింపుము.

5వ శ్లోకము

5. అనంత మహిమం త్రిదశవంద్య చరణం మునిహృదంతర వసంతమమలం

కబంధ వియదింద్వవని గంధవహ వహ్నిమఖబంధు రవిమంజువపుషం

అనంత విభవం త్రిజగదంతరమణిం త్రినయనం త్రిపురఖండనపరం

సనందముని వందితపదం సకరుణం పర చిదంబర నటం హృది భజ   

 

ఆ పరమేశ్వరుని మహిమ చెప్పనలవికానిది. ఇక్కడ మళ్ళీ అనంత మహిమం అని 

వాడబడినది. క్షణక్షణమూ పరమేశుడు అనంత రూపుడు, అనంత మూర్తి, అనంత 

మహిమాన్వితుడు, అనంత గుణ సంపన్నుడు, నిర్గుణ సహితుడు, ఆయన లక్షణములను 

ఇట్లు చెప్పుకొంటూపోతే నా భాష చాలదు. అజరామరులైన దేవతలకు కూడా ఆయన 

చరణమే శరణము. నిష్కాములై నిరంతర ధ్యాన తత్పరులైన మునుల 

హృదయాంతరాళములను వేదికలగా చేసుకొని నర్తించుచున్నది ఈ నటరాజే! 

పృథివ్యాపస్తేజోవాయురాకాశసూర్యచంద్రాగ్నులగు అష్టమూర్తులచేత మరియు వారి 

లోన భాసిల్లుచున్నది ఆ చిదంబర నటశేఖరుడే! సకల జగద్వ్యాప్తమగు విభూతి అంటే 

ఇదే కదా! ఈ విభూతి బాహిరముగానే గాక ఆంతర్యమున కూడా వ్యాపించియున్నది. 

అనంత విభవము కల్గి త్రిజగములయందు వ్యాపించియున్నది. త్రినయనములగూర్చి 

ఇదివరలో చెప్పుకొన్నాము. ఇప్పుడు ‘త్రిపురఖండన పరం’ అన్న మాటను 

విశ్లేషించుకొందాము. అసలు మనము తెలుసుకొనవలసిన ఒక ముఖ్యమైన విషయము 

ఏమిటంటే ఈ త్రిపురములు ఏవి. బంగారు వెండి రాగితో ఆకాశమున నిర్మించిన రాక్షస 

నగరములేనా! అన్నది అట్లుంచి  ఈ త్రిపురములు మానవునికి సంబంధించినవి 

ఉన్నాయా అన్న విషయమును గూర్చి కాస్త తెలుసుకొందాము. ఈ త్రిపురములు 

ప్రతిమానవునియందూ వున్నాయి. మొదటిది వపుషము  అంటే దేహము. 

సాధారణముగా దేహచ్ఛాయను బంగారుతో పోలుస్తారు. మనకు మామూలుగా దానిపై 

మక్కువ ఎక్కువ. అందుకే అది బంగారమయ్యింది. ఇక రెండవ పురము మనసు. 



మనసు స్వచ్ఛతకు ప్రతీక. అంటే తెలుపు. అందుకే అది వెండి అంటే రజత పురము. మరి 

తెలుపు న ఏ చిన్న మసక ఏర్పడినా అది అట్లే నిలచిపోతుంది. అందుకే 

మచ్చలంటకుండా మనసును స్వచ్ఛముగా వుంచుకోనవలసిన సాధన మనము 

చేయవలసియుంటుంది. తెలుపు వెలుగునకు ప్రతీక. వెలుగు మంట అయ్యిందంటే 

అంతటినీ కాల్చివేస్తుంది. కావున ఆ వెలుగును మండనీయకుండా వుండే బాధ్యత 

మనమీద వుంటుంది. ఇక మూడవది హృదయము. హృదయము రక్తమునకు 

సంబంధించినది. రక్తము రాగి రంగులో ఉంటుంది కాబట్టి ఇది రాగి అనగా తామ్ర పురి. 

ఈ మూడూ నశ్వరమే! ఒక్క ఆత్మకే వీటిపై అధికారముంటుంది. ఆ ఆత్మే పరమాత్మ. 

ఆయనే త్రిపురారి. త్రిపుర భంజనుడు లేక త్రిపుర ఖండనుడు. ఇన్ని మహర్లక్షణములు 

కలిగినవాడగుటచేతనే పుట్టుకతోనే బ్రహ్మజ్ఞానులైన సనక, సనందన, సనాతన 

సనత్కుమారులచే వందిత పదములు గలవాడై ఆ శంభుడు ఒప్పుచున్నాడు. అట్టి పర 

చిదంబర నటుని హృదయమున ఉంచి భజింపుము. 

6వ శ్లోకము

 

6. అచింత్యమళిబృంద రుచిబంధుర గళస్ఫురిత కుందనికురంబధవళం

 ముకుంద బలహంతృసురబృంద కృతవందన లసంతమహి కుండల ధరం

 అకంప మనుకంపితరతిం సుజన మంగళ నిధిం గజహరం పశుపతిం

 ధనంజయనుతం ప్రణత రంజన పరం పర చిదంబర నటం హృది భజ 

గమనించితే ఈ నటరాజ స్వరూపము ఎంతో విలక్షణమైనది. మన ఊహలకతీతమైనది. 

ఆయన కంధరము అళి బృందరుచి బంధురము అంటే గొంతు వద్ద నల్లగా వుంటుంది

మరి కాలకూట విషము త్రావినాడు కదా! శరీరమా మొల్లల బోలె (మల్లె పూవులు) ధవళ 

కాంతులు విరజిమ్ముతూ వుంటుంది.తెలుపై నలుపు ఎంత ఆకర్షణీయముగా 

ఉంటుందో ఊహించుకొనగలరు. తెల్లని పుష్ప లతలపై నల్లని తుమ్మేద బారు నిలచితే ఆ 

సౌరు ఒక అద్భుత దృశ్యము. దీనిని అచింత్యము అంటున్నాడు మహర్షి. ఇది అచిన్త్యము 

ఎట్లయినది అన్నది ఒకపరి గమనించుదాము. నిజానికి ఇవి వర్ణములు కావు. తెలుపు 

స్వచ్ఛమైన చైతన్యమునకు ప్రతీక. నలుపు దానినావహించిన యోగమాయకు 

సంకేతము. మరి మాయాశబలిత (మాయ అన్న నల్లని రంగు చేత ఆవరింపబడిన) 

ఆరూపము సాధారణ మానవులమైన మనకు అచిన్త్యము అనగా చింతించుటకు శక్యము 

కానిదే కదా! దేవతలకు కూడా దురవగాహమే! అంటే అంతుచిక్కనిదే! ముకుంద 

పురందరాది పరబృందము కూడా అంటే విష్ణువు ఇంద్రాది దేవతలు కూడా ఆయన 

పాదములకు అభివందనము జేసి తరించేవారే! ఆయన అహి కుండలధరుడు. అహి 

అంటే పాము. కుండలము అంటే కర్ణాభరణము. అది సామాన్య అర్థమైతే, పామువలె 

చుట్టుకొనియున్న కుండలినీ శక్తిని తన అదుపులోనుంచుకొన్నవాడు. తాను 

ఎప్పుడనుకొంటే అప్పుడు దానిని ఉద్దీపింప జేయగలడు. మరి స్తోత్రము వ్రాయుచున్నది

యోగశాస్త్రమునకు’ మూలపురుషుడు కదా! కావున ఆ విషయమై ఆయనకు 

తెలియనిది లేదు. ఇంకొక విధముగా ఆలోచించితే, మనము ఆ శక్తిని 

ఉద్దీపింపజేయుటకు ఆయనను శరణుజొచ్చవలెనన్నది అంతరార్థము. ఇంకాస్త తరచితే 

ఆహికుండలమనగా  కుండలాకారముతో ఆవరించియున్న మాయాశక్తి. దీనిని కాళి 

అని అంటారు. ఒక్క మహాకాలుడైన పరమేశ్వరుడు తప్ప ముకుందాదులెవరునూ 

దానిని నియంత్రించలేరు. ఆయనే సర్వ నియామకుడు అందుకే ఆయన అకంపనుడు 

అంటే ఆయన నిశ్చలుడు. నిరాకారుడు సర్వవ్యాపకుడైనవాడు చలించుటెట్లు? అందుకే 

ఆయనకు స్థాణువు. ఆపేరు ఆయనకు మాత్రమె సార్థకము. ఇక ‘అనుకంపితరతిం’ 

అన్న మాటను అర్థము చేసుకొన ప్రయత్నిద్దాం. అనుకంప అంటే కనికరము. పైకి 

మనకు కనిపించే అర్థము రతీదేవి అభ్యర్ధన వల్ల ఆమెను కనికరించి బూడిదయైన 

మన్మధుని తిరిగీ బ్రతికించినాడు అన్నది. కానీ ఈ మాటను కాస్త తరచి చూద్దాము. రతి 

అన్న పదమును కేవలము స్త్రీపురుష సంగమమునకు పర్యాయముగా వాడుతారు, కానీ 

నిజానికి రతి అంటే అనురాగము. మన్మథనము అంటే ఈ అనురాగమన్నది దేనిపై 

కలిగినదో దానిని అనుభవింపవలెనను ప్రగాఢమైన కోరిక. మన్మథనము యొక్క 

నామాంతరమే కామము, అంటే రతి కలిగిన మనసు యొక్క కంటిని ఆకర్షించిన దానిని 

సొంతము చేసుకొనవలెనన్న తపన. అది దొరకకుంటే  క్రోధము. దొరికిందా లోభము 

అంటే అది తనకు దక్క అన్యులకు లభింపరాదన్న స్వార్థము. ఆ స్వార్థము ప్రబలితే 

ఆవస్తువు తనతోనే ఉండిపోవలెనను మోహము.

ఆ మోహము ప్రబలితే ఆ వస్తువు తనవద్ద మాత్రమే ఉన్నదన్న మదము. ఒకవేళ తానూ 

అంతకుమించిన వస్తువును ఇతరుని వద్ద చూచినాడంటే ఓర్వలేనితనము అంటే 

మాత్సర్యము. అంటే రతి అన్నది ఉండుటలో తప్పులేదు కానీ అదివెర్రితలలు వేస్తే మనిషి 

'అరిషడ్వర్గములకు' బానిసౌతాడు. మాత్సర్యము ప్రబలింది అంటే మనిషి 

పర్యవసానమాలోచించకుండా ఆ వస్తువును సాధించవలెనను పట్టుదలతో,  సుగ్రీవుని 

ఓడించి వాలి తారను పొందిన విధముగానో లేక సీతకై ఆశపడి రావణుని వలె ప్రాణము 

పోగొట్టుకొన్నట్లుగానో అయిపోవలసి వస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన 

విషయము ఏమిటంటే దుర్మార్గముచేత దేనినయినా ఎవడైనా ఆ సమయానికి 

సాధించితే కూడా వాడు దానిని పోగొట్టుకొంటాడు లేక, దానిని కాపాడబోయి తన 

ప్రాణము వాలివలె వదలుకొంటాడు. కాబట్టి మనకు సాంకేతికముగా శివతత్వములోని 

విశిష్టతను పతంజలి మహర్షి తెలుపుతూ, అనురాగము కలిగియుండుటలో అంటే రతి 

కలిగియుండుటలో తప్పులేదుకానీ అది ప్రాణాంతకమగు కామమునకు 

దారితీయగూడదు అని తెలియజేస్తున్నాడు. శివుడు రతిని అనుగ్రహించుట అంటే అదే! 

సజ్జనులకు మగళకరుడా మంగళాకారుడైన శంకరుడు. ఆయన గజాసుర దమనుడు. 

గజము గర్వమునకు అనగా అహంకారమునకు సంకేతము. ఆ అహంకారమును 

తుదముట్టించినవాడే సాంబశివుడు. ఆయనే పశుపతి సమస్త భూతరాశికీ 

అధినాయకుడు. ‘ధనంజయనుతం’ అంటే పాశుపతమును ప్రసాదించి అర్జనుని 

విజయుని జేసి ఆతనితో నుతింపబడినాడు కదా! ఆవిషయమును తెలిపి  పరమేశ్వరుని 

భక్త సౌలభ్యతను మనకు పరిచయము చేస్తున్నాడు పతంజలి మహర్షి. ప్రణత 

రంజనపరం’ అంటే పరమేశ్వరుడు భక్తజన రంజకుడు భోళా శంకరుడు. ఆయనకు 

ఆయనే సాటి. అట్టి పర చిదంబర నటుని హృదయమున ఉంచి భజింపుము. 

7వ శ్లోకము

7. పరం సురవరం పురహరం పశుపతిం జనిత దంతిముఖ షణ్ముఖ మముం

మృడం కనకపింగళ జటం సనక పంకజ రవిం సుమనసం హిమరుచిం

అసంగ మనసం జలధి జన్మ గరళం కబలయంత మతులం గుణనిధిం

సమస్త వరదం శమితమిందు వదనం పరచిదంబర నటం హృది భజ            

ఆ చిదంబర నటుడే పరుడు అంటే పరమాత్మ. ఆయన సురలకు వరదాయకుడు. 

త్రిపురాసుర సంహర్త. గజముఖ షణ్ముఖ పితరుడు. వీరిరువురూ పృథివీ తేజస్సులు. 

మూలాధార చక్రము పృథివీ తత్వము కలిగినది. మహాగణపతిని వర్ణించుతూ 

ముత్తుస్వామి దీక్షితులవారు తమ ‘వాతాపి గణపతిం భజే.....’ అన్న కీర్తనలో 

'మూలాధార క్షేత్ర స్థితమ్' అంటే మూలాధార చక్ర స్థానం లో స్థిరమై, అందున్న 

త్రికోణపు మధ్య గల స్థానమందు వసించు గణపతీ! అని నుతించుతాడు. కాబట్టి ఆయనది పృథివీతత్వమయ్యింది. అదే ముత్తుస్వామి దీక్షితులవారు సుబ్రహ్మణ్యుని నుతించు ఒక కృతిలో ఈ విధముగా చెబుతాడు.

పల్లవి: గురుగుహాదన్యం న జానేఽహం

గుప్తాగమార్థ తత్వప్రబోధినో

అనుపల్లవి:  అరుణోదయానంత కోటిబ్రహ్మాండాకార

శివాది ధరాంత తత్వస్వరూపిణో          

నేను గురుగుహుని  తప్ప వేరు దైవమును ఎరుగను......అరుణోదయ అంటే, ఎర్రని 

కాంతి స్వరూపము, అగ్ని స్వరూపము కలవాడా అని అర్థము.

చరణము:

సహస్రదళ సరసిజ మధ్యనివాసినః

సకల చంద్రభాస్కర తేజః ప్రకాశినః ............

సహస్రదళములు కలిగిన పద్మము మధ్యలో నివాసము ఊండే వాడా అంటే   సహస్రార 

చక్ర మధ్యస్థితుడా! సూర్య చంద్రులను ప్రకాశింపజేయువాడా! అనగా 

సూర్యమండలాంతర్వర్తి యయి సూర్య సోమ ప్రకాశమునకు కారణభూతమైనవాడా! 

అని అర్థము.

పై రెండు కీర్తనలు గజానన షడాననులు పృథ్వీ తెజోతత్వ రూపులని మనకు 

తెలియవస్తూవుంది. అంటే ఆరెండూ విద్యావిద్య స్వరూపములు. విద్య అంటే 

బ్రహ్మతత్వము, అవిద్య అంటే పదార్థ తత్వము అంతేగానీ ‘చదువు లేమి’ కాదు. ఈ 

రెంటికీ తండ్రి పరమేశ్వరుడు. ఈ విషయమును గుర్తించినవారికి ఆయన మృడుడు 

అంటే ఇక్కడ ప్రీతిదాయకుడు అని అర్థము.ఆయన జటాజూటము పిగళ అంటే అగ్ని 

వర్ణము అంటే బంగారు వర్ణము కలిగియున్నది. సనకాదుల హృదయ పద్మ 

వికాసమునకు సూర్యునివంటివాడు ఆయన. సుమనస్కుడు ఆయన. ఆయనకు 

సుమనుడు అన్నది కూడా ఒక పేరు. ఆకర్షనీయమైన రూరూపలావణ్యములు 

కలిగినవాడు. మంచుకొండను మించు స్వచ్ఛమైన శరీర ఛాయగలవాడు

అసంగమైనది ఆయన చిత్తవృత్తి. ఆయన మనసు ఆయన మనసుతోనే కలుస్తుంది. ఇతర సాంగత్యమాశించదు. కడలి కన్నటువంటి గరళమును కడుసునాయాసముగా కబళించినవాడు ఆయన. అయిననూ ఇందుబింబము వలె కందని ముఖము కల్గినవాడు. ఆయన తులతూచ వీలుగాని గుణనిధి. భక్తగణ సకలవిధ వరదాయకుడు. వడిదుడుకులెన్నియున్ననూ స్వచ్ఛమైన పూర్ణ  చంద్రబింబము వలె నవ్వు

రాజిల్లెడు మోమువాడు. అట్టి పర చిదంబర నటుని హృదయమున ఉంచి భజింపుము. 

8 నుండి 10వ శ్లోకము వరకు

8. అజం క్షితిరథం భుజగపుంగవ గుణం కనక శృంగి ధనుషం కరలసత్

కురంగ పృథు టంకపరశుం రుచిరకుంకుమ రుచిం డమరుకంచ దధతం

ముకుంద విశిఖం నమదవంద్య ఫలదం నిగమబృంద తురగం నిరుపమం

సచండికమముం ఝటితి సంహృతపురం పర చిదంబర నటం హృది భజ   

ఆయన పుట్టుక లేనివాడు. త్రిపురాసుర సంహారసమయమున భూమిని రథముగను

మేరువు ధనుస్సుగను, వాసుకి అల్లెత్రాడుగను, శ్రీ మహావిష్ణువు బాణముగను, నాలుగు 

వేదములు నాలుగు గుర్రములుగను ఉపయోగించినాడు పరమశివుడు. ఆయన ఇంకా 

పరశువును, ధరించి త్రిపురములను భస్మీపటలము గావించినాడు. అంటే ఆయన 

అష్టమూర్తిగనుక బ్రహ్మాండమంతయూ వ్యాపించి ఉపాధులమీద ఏవిధమయిన 

వ్యామోహము లేనివాడుకావున త్రిపురంజయుడైనాడు. అట్టి పర చిదంబర నటుని 

హృదయమున ఉంచి భజింపుము. 

9. అనంగ పరిపంథినమజం క్షితిధురంధరమలం కరుణయంతమఖిలం

జ్వలంతమనలం దధతమంధకరిపుం సతతమింద్ర సుర వందిత పదం

ఉదంచదరవిందకుల బంధు శత బింబ రుచి సంహతి సుగంధి వపుషం

పతంజలినుతం ప్రణవపంజర శుకం పరచిదంబర నటం హృదిభజ

ప్రకృతికి అతడు అతీతుడు గనుకనే ఆయన ‘అనంగ పరిపంథి’ అయినాడు అంటే 

మన్మధుని శత్రువయినాడు. అంటే నిష్కాముడైనాడు. ఆయన అద్వితీయుడు. మరి వేరే 

వస్తువు ఏదయినా ఉంటేనేకదా ఆవస్తువు పై కామము ఏర్పడేది. కావున ఆయన కామ 

వర్జితుడు. కానీ తానూ సకాముడయినట్లు నటించుచూ,  ఈ సమస్త భూభారమునూ 

ధరించుచున్నాడు. ప్రాణులపై ఆయన అపార కరుణ అటువంటిది. ఆ మాటకొస్తే

ప్రాణికోటిని ఉద్ధరించుటయే కదా పరమాత్మ కర్తవ్యము. కాలుని రూపుమాపి

అనలమును అనగా అగ్నిని ధరించుటలోనే ఆయనకు గల ఆ గుణము 

ద్యోతకమగుచున్నది. అనలము జ్ఞానమునకు ప్రతీక అయితే అంధకుడు అజ్ఞాన వారాశి 

అంటే అజ్ఞాన సముద్రము. కావున ఆ శంకరుడు అజ్ఞానాంధకారమును  రూపుమాపి 

జ్ఞాన జ్యోతిని జీవులకు ప్రసాదించుతాడు. అందుకే నిరంతరమూ ఆయన పాదములను 

విడువక ఇంద్రాది దేవతలంతా వందారువులై ఉంటారు, అంటే భక్తులై ఉంటారు. సమస్త 

జ్ఞానమునకు అకరమగు ఆ పరమాత్మ శాత సహస్రకోటి భానుతెజాన్వితుడై 

ప్రభాసించుతూ ఉంటాడు. అట్టి వెలుగును పట్టుకొనగోరు భక్తులకనుగుణముగా 

ఓంకార పంజర శుకమై అనగా ప్రణవ పంజరమున చిలుకయై సంచరించు స్వభావము 

కలిగియుంటాడు. అందువల్లనే సులభుడై, సుగాముడై, పతంజలి నుతుడై 

భాసిల్లుచున్నాడు. అట్టి పర చిదంబర నటుని హృదయమున ఉంచి భజింపుము. 

 

10. ఇతి స్తవమముం భుజగపుంగవకృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః

సదః ప్రభుపద ద్వితయ దర్శన పదం సులలితం చరణ శృంగ రహిత

సరః ప్రభవ సంభవ హరిత్పతిహరి ప్రముఖ దివ్యనుత శంకరపదం

స గచ్ఛతిపరం న తు జనుర్జలనిధిం పరమ దుఃఖ జనకం దురితదం   

ఈ స్తోత్రము చరణ శృంగ రహితుడగు పతంజలి కృతి. అందువలన ఇదియూ 

చరణశృంగ రహితమై  వెలరారు చున్నది.  ప్రతిదినమూ ఏమానవుడు దీనిని అత్యంత 

శ్రద్ధతో పఠించునో అతడు బ్రహ్మవిష్ణు పురందరాది వందిత పదద్వయుడైన  ఆ 

పరమశివుని దివ్య పదమును పొందగలడు. అంతేకాక జనన మరణ రూపము దుఃఖ 

దురిత నిలయము అగు ఈ సంసార జలనిధిని తిరిగీ అందుకోడు.  

ద్యౌః శాంతి రన్తరిక్షం శాంతిః పృథివీ శాంతి రాపః శాంతి రోషధయః శాంతిః |

 వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతి ర్బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః 

సామాశాంతిరేధి||

 

ఊషరమైన నామదికిఊరట గా శివునాజ్ఞగొంచు శై

లూషసమాన శంభునట రూఢముపై తగు టీక వ్రాయగా

తోషణ తో గడంగితిని దోషములుండగవచ్చు  నాదియౌ

భాషయు భావమందు పద పాదములందున వ్యాఖ్యలందునన్

(చౌటినేల అనగా బంజరుభూమి అయిన నామదికి, అంటే  పండితుడనుగాని 

అన్వయము. నా మనసుకు ఊరటగా శివుడు ఒసంగిన ఆజ్ఞ గా తలచి ప్రసిద్ధి చెందిన 

పతంజలి కృత శంభునటనకు టీక వ్రాయ సంతోషముతో సంకల్పించినాను. నా 

భాష,భావము, పదము పాదము మరియు వ్యాఖ్యలలో దోసములుండ వచ్చును. 

దయతో మన్నించేది.)

అజ్ఞానాత్ విస్మృతే భ్రాంత్యా యన్యూనమధికం కృతం l

తత్ సర్వం క్షమ్యతాం దేవ పరమేశ్వర నమోస్తుతే ll

స్వస్తి.