Sunday, 6 September 2020

జ్యోతిర్లింగముల కథ-2వ భాగము (7వ జ్యోతి ర్లింగము మొదలు 12వ జ్యోతిర్లింగము వరకు)

 జ్యోతిర్లింగముల కథ-ద్వితీయ ఖండము

(7వ జ్యోతి ర్లింగము మొదలు 12వ జ్యోతిర్లింగము వరకు)

https://cherukuramamohanrao.blogspot.com/2020/09/2-7-12-7.html

7-రామేశ్వర జ్యోతిర్లింగము

సుతామ్రపర్ణీ జలరాశి యోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః |

శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి ||

భారతదేశం యొక్క దక్షిణ సముద్రతీరంలో, రామేశ్వరాలయముఉన్నది. రామేశ్వరము సముద్రమట్టానికి 10 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ద్వీపము. ప్రధాన భూభాగం నుండి ఈ ద్వీపాన్ని పంబన్ కాలువ వేరుచేస్తోంది. ఈ ద్వీపము శంఖాకారమున ఉన్నది. దీని విస్తీర్ణం 61.8 చదరపు కి.మి.

సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయము తూర్పున 126 అడుగుల ఎత్తు మరియు పడమటి వైపు మిక్కిలి ఎత్తైన రాజ గోపురముల గొప్ప నిర్మాణ వారసత్వ సంపదను కలిగియుంటుంది, మిక్కిలి ఎత్తయిన గోడలు, 18 అడుగుల ఎత్తు మరియు 22 అడుగుల పొడవు కలిగిన నంది,  మరియు 4000 అడుగుల పొడవైన మండపము, ఇరువైపులా ఎత్తయిన అరుగులపై 4000 చెక్కిన గ్రానైట్ స్తంభాలు- బహుశా ప్రపంచంలోనే అతి పొడవైనది.

ఈ దేవాలయ ముఖ్య విగ్రహాలు జఫాన రాజ్యానికి చెందిన జయవీర చింకైరియన్, ఆయన తర్వాత వారైన గుణవీర చింకైయన్ లచేత పునరుద్ధరింపబడినట్లు తెలియవస్తూవున్నది. ఈ దేవాలయం మిగిలిన భారతదేశంలోని హిందూ దేవాలయాల కంటే అతిపెద్ద వసారా,వరండా లేక నడవ (Corridor) కలిగియుంది.

 హనుమంతుడు కైలాసము నుండి తెచ్చిన విశ్వలింగమునకు, సీతమ్మవారు చేసిన ఇసుక లింగముకన్నా  ముందు పూజ జరుగావలేనని రాములవారు ఆదేశించినారు.  ఈ సాంప్రదాయము, నేటికినీ ఆనాటి నుండి కొనసాగుతూ వుంది.

దక్షిణ భారత దేశంలోని ప్రాచీన దేవాలయాల వలెనే ఈ దేవాలయమునకు  కూడా అతి పెద్ద ప్రహరీ గోడ నాలుగు వైపులా ఉన్నాయి. తూర్పు నుండి పశ్చిమ ప్రాకార గోడల మధ్య దూరము 865 అడుగులు, దక్షిణం నుండి ఉత్తర ప్రాకార గోడ ల మధ్య దూరము 657 అడుగులు. దేవాలయానికి నాలుగు దిక్కుల పెద్ద పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి. ఈ దేవాలయం లోపలివైపు పెద్ద వరండాలు కలిగి, మధ్యలో  ఐదు అడుగుల పైన వేదికలపై భారీ మండపాలు ఉన్నాయి. ఇది మొదటి నడవా. బయటి నడవా సముదాయము 6.9 మీటర్లు ఎత్తు, 400 అడుగుల తూర్పు పడమరలకున్నూ , 640 అడుగులు ఉత్తర దక్షిణలకున్నౌ కలిగి ప్రపంచంలోనే పెద్దదిగా చరిత్ర సృష్టించింది. ఈ వరండాల మొత్తము పొడవు 3850 మీటర్లు ఉంటుంది. అందులో సుమారు 1212 స్తంభాలు బయటి వరండా లోనే ఉంటాయి.  వాటి ఎత్తు భూమినుండి పైకప్పు మధ్య భాగానికి సుమారు 30 అడుగులు ఉంటుంది. ముఖ్య గోపురం లేదా "రాజగోపురం: 53 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది ప్రపంచములోనే అతిపెద్ద నడవా గా చెప్పబడుతూవుంది.

రెండవ వరండా, ఇసుకరాయి స్తంభాలు, దూలాలు, పైకప్పుతోనూ తయారైనది. మూడవ వసారా యొక్క పశ్చిమ దిశన, పశ్చిమ గోపురం నుండి సేవుమాథవ విగ్రహానికి పోవు చదునైన మార్గం మధ్యలో ఒక  నిర్మాణము చదరంగపు అట్ట వలె ఉంటుంది. ఇది "చొక్కట్టన్ మండపం"గా ప్రసిద్ధి చెందింది. ఇచట ఉత్సవ విగ్రహాలను వసంతోత్సవంలో ఉంచుతారు. రామనాథుని సేతుపతి చే నిర్వహింపబడుతున్న ముఖ్య పండగలైన అయిన ఆది (జూలై-ఆగష్టు) , మాసి (ఫిబ్రవరి-మార్చి) తర్వాత ఆరవ రోజున కూడా ఈ మండపంలోనే విగ్రహాలను ఉంచుతారు.

ఇచట స్వామిని రామలిగేశ్వరునిగానూ, రామేశ్వరునిగానూ, రామనాతునిగానూ, శివరామునిగానూ పలు విధములగు పేర్లతో పిలుచుకొంటారు. అమ్మవారిని పర్వతవర్ధిని మాతగా పూజించుతారు. ఈ దేవాలయములు ‘విశాలాక్షి’ మాత విగ్రహముకూడా ఎంతో వాసికెక్కినది.

 

 

ఇంతకు మునుపే, శివునికి అంకితము చేయబడిన ఆలయము నందలి ఈ లింగమును సీత నిర్మించినది. హనుమంతుని, శ్రీరామ చంద్రుడు, తన బ్రహ్మహత్యాపాతకము పోగొట్టుకొనుటకు, కాశీకి వెళ్లి, విశ్వేశ్వర లింగ సాదృశమగు, లింగమును తెమ్మని చెప్పి పంపగా,  తెచ్చుటకు వెళ్లి వచ్చుటలో ముహూర్త సమయమునకు రాలేక  ఆలస్యము చేస్తాడు. అప్పుడు సీత సైకత లింగమును నిర్మించగా, శ్రీరామ దంపతులు కార్యక్రమునకు గడంగుతారు. తరువాత కొద్దిసేపటికి హనుమంతుడు లింగముతో రాగా, ఆయన ఖిన్నుడవకుండా సైకత లింగము ప్రక్కనే దీనిని కూడా ప్రతిష్ఠించి సమాన ప్రతిపత్తిని కలిగించి ఆలింగమునకు కూడా సైకతలింగముతోబాటూ, ఒకేవిధమగు పూజాది కార్యములను నిర్వహిపజేస్తారు సీతారాములు. ఆ ఆచారము నేటికినీ కొనసాగుతూ వున్నది.

 12 వ శతాబ్దం నుండి వివిధ రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు తెలియవస్తూ వున్నది. రామేశ్వరముపై ఎటువంటి ముస్లిం రాజుల దండయాత్రాలూ జరుగలేదు. ఈ ఆలయాన్ని శైవులు మరియు వైష్ణవులు సందర్శించుతారు. ఈ ఆలయంలోపల ఉన్న 22 బావుల నీటి రుచి ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. బయట ఉన్న 2 బావులతో కలుపుకొని ఈ 24 బావుల సంఖ్య,సీత దాహము తీర్చుటకు  రాముడుతన తూణీరము నుండి వేసిన బాణములను గుర్తుచేస్తాయని ఇచ్చటి స్థల పురాణము. అసలు, రామేశ్వరమునందు 64 తీర్థములు ఉన్నట్లు చెప్పుకొంటారు. వీనిలో, గణనీయమైన ఔషధీయ లక్షణములతో ముప్పై ఆరు తీర్థములు అనబడు బావులు ఉన్నాయని అంటారు. అవి అన్నీ ఎక్కడెక్కడో వున్నాయి. కానీ వానిలో  ఇరవై రెండు ఆలయము లోపలనే ఉన్నట్లు మనము పైన చెప్పుకొన్నాము.

ఈ ఇరవై నాలుగు బావులలో నుడి ఒక్కొక్కటిగా నీళ్ళు తోడి స్నానము చేయించే కర్మచారులుంటారు. వారికి కానుకగా కొంత డబ్బు ఇవ్వవలసి ఉంటుంది. స్నానం చేసే సమయములోనే భక్తులు చాలా మంది పరిసరాలన్నిటినీ చుడుతూ గర్భాలయము లోనికి ప్రవేశిస్తారు. రామేశ్వర ఆలయంలో పండుగలు 'ఆణి' మాసములో (ఇంచుమించుగా మన ఆషాఢమాసము)  (జూన్ 15- జూలై 15) శివునికి రాముడి విజయ ఆరాధనను సూచిస్తాయి మరియు స్థానిక ప్రకారం రెండు 'బ్రహ్మోత్సవాలు' లేదా వార్షిక ప్రధాన వేడుకలు 'ఆడి' మరియు 'మాసి' నెలల్లో జరుపుతూ ఉంటారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుండి ఆరాధనలు ప్రారంభమవుతాయి మరియు ప్రత్యేక ఆరాధనలు శుక్రవారం రోజున జరుగుతాయి.

గంగ నీటిని రామేశ్వరమునకు తీసుకు పోవుట, చాలా పవిత్రమైన మరియు ధర్మబద్ధమైన పనిగా పరిగణించబడుతుంది. వారణాశి లోని గంగానదిలో శిరస్నానం చేసిన తరువాత, ఆ పవిత్ర జలాన్ని తీసుకువెళ్ళి, రామేశ్వరములోని శివునకు అభిషేకము ఆ జలముతో చేస్తారు. దీని తరువాత ఇక్కడి నుండి కొద్దిగా ఇసుకను తీసుకొని, కాశీ వెళ్లి అక్కడ గంగలో  ఆ ఇసుకను కలుపుతారు. ఈ కర్మను పూర్తి చేయుటచే   తీర్థయాత్ర సఫలమైనదని భక్తులు నమ్ముతారు.ఇచట చూడవలసిన కొన్ని ముఖ్యమగు స్థలముల గూర్చి వ్రాయ ప్రయత్నిస్తాను.

మిగిలినది మరొకమారు.............

గంధమాదన పర్వతము-రామపథము

గంధమాదన పర్వతము ఎత్తయిన కొండ.. ఇది ఆలయానికి ఉత్తరమున 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. రామపథముఅనబడు ఆలయము ఇచట ఉన్నది, ఇక్కడ రాముడి పాద ముద్రలు చూడవచ్చు. లంకపై దాడి చేయడానికి అతి తక్కువ దూరము కలిగిన మార్గమును కనుగొనే ప్రణాళికను ఇచ్చటి ఈ ఎత్తైన ప్రదేశంలో ఆయన చర్చించినట్లు చెబుతారు.

పాంబన్ వంతెన (గూగుల్ సౌజన్యము)

పాంబన్ వంతెన ( తమిళం: பாம்பன் பாலம்) భారత దేశము లోని సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి వంతెన. ఇది శ్రీలంకకు భారత్ కు మధ్య గల పాక్ జలసంధి పై ఉన్నది. ఈ వంతెన పాంబన్ ద్వీపాన్ని, రామేశ్వరము పట్టణమునకు కలుపుతున్నది. ఈ వంతెన, రోడ్డు, రైలు మార్గములు రెండూ కలిగి యున్నది. ఇది 1914 లో ప్రారంభించబడినది.. ఈ వంతెన 2010 వరకు భారతదేశంలోని అన్ని వంతెనలలో పెద్దదిగా నిలిచింది. 2.3 కిలోమీటర్లు ఉన్న ఈ వంతెనను నిర్మించి 2014 ఫిబ్రవరి 24 నాటికి వందేళ్ళు పూర్తయినది.

ఈ రైలు వంతెన 6,776 అడుగులు (2,065 m) పొడవు కలిగి ఉంటుంది. ఇది 1914 లో ప్రారంభించబడింది. ఈ రైలు మార్గము వంతెన డబుల్-లీఫ్ బేస్కూల్ వంతెన. ఇది, ఈ మార్గంలో బ్రిడ్జి కింద నుండి వచ్చు ఓడలకు దారినిచ్చేవిధంగా వెసులుబాటు కలిగియున్నది.

 

చారిత్రాత్మకంగా కట్టబడిన  ఈ రైలు వంతెన మొదట మీటర్ గేజ్ రైళ్ళకు నిర్దెశింబడి ఉండినది. కానీ భారతీయ రైల్వేలు బ్రాడ్ గేజ్ రైళ్ళను దానిపై పోయేవిధంగా 2007 ఆగస్టు 12 న రూపొందించినారు. ఈ మధ్యనే రెండు భాగములుగా (టూ లీవ్స్) మనుషులు విడదీసే విధంగా రూపకల్పన చేయుట కూడా జరిగినది. 10 ఓడలవరకు, కార్గో కేరియర్స్, కోస్ట్ గార్డు షిప్స్, ఫినిషింగ్ వెసల్స్, ఆయిల్ ట్యాంకర్స్ ఈ బ్రిడ్జి క్రింది నుండి ప్రతినెలా వెళ్ళే విధంగా రూపొందించిన బ్రిడ్జి ఇది. అదే విధంగా రెండు వరుసలు గల రోడ్డు వంతెన ఈ రైలు వంతెనకు సమాంతరంగా ఉంది.

ఈ రైల్వే వంతెన మీటరు గేజ్ గా రూపొందిన తర్వాత పాంబన్ స్టేషను నుండి మండపం స్టేషన్ వరకు రైలు మార్గం ఉండి అచట రెండు భాగాలుగా విభజింపబడుతుంది. ఒక మార్గం సుమారు 6.25 miles (10.06 km)తో రామేశ్వరానికి కలుపబడితే రెండవ మార్గము 15 miles (24 km)తో ధనుష్కోటి వరకు విస్తరించబడి ఉన్నది. ఈ భాగము 1014 లో ప్రారంభమైనది. ఈ వంతెన క్రిందుగా పోవుచున్నపుడు, కాస్త నిలబడి చూస్తే సముద్రము వివిధ వర్ణములలో అగుపించుట మనకు నేత్ర పర్వము.

ఖండ్రిక

ఖండ్రిక లేక కండ్రిగ అనబడు ఈ ప్రాంతము రామేశ్వరమున  ప్రసిద్ధ శైవ క్షేత్రము. ఖండ్రిక, కండ్రిగ, తమిళములో కండిగై అన్నవి అన్ని వసతులు కలిగిన గ్రామములోని ఒక ఖండమును తెలుపుతుంది. ఇచట శ్రీ కృత కృత్య రామలింగేశ్వర స్వామి వారు ఉన్నారు. కాలక్రమేణ ఈ గుడి ఉన్న ప్రాంతం గుడిమూల ఖండ్రిక గ్రామంలో కలుపబడింది. ఈ గ్రామంలో రంగనాథ, శ్రీ రామ, ఎల్లమ్మ, గంటలమ్మ, ఆలయాలు ఉన్నాయి.

ధనుష్కోడి

రామేశ్వరానికి దాదాపు 19 కిమీల దూరంలో ఉన్న ధనుష్కోడికి ప్రయాణమంటే, నిజంగా సాహసయాత్రే. శ్రీలంకను కలిపే రామ సేతు చూడాలంటే తప్పకుండా ఈ పంబన్ దీవుల్లోని ధనుష్కోడికి వెళ్లాల్సిందే. ఒకప్పుడు ఇక్కడికి రావాలంటే సముద్రం నీటి మధ్యలో ఇసుక తిన్నెలపై బస్సులు లేదా జీపుల్లో చేరుకోవల్సి వచ్చేది. ప్రభుత్వం ఇటీవల ఈ మార్గంలో రోడ్డు సదుపాయం కల్పించడంతో ప్రయాణం సులభమైంది.

ధనుష్కోటి రామేశ్వరంలోని ఒక గ్రామము మరియు శ్రీలంక భూభాగం ఇక్కడి నుండి 31 కిలోమీటర్లు మాత్రమే. ఇతిహాసం ప్రకారం రావణ సోదరుడగు విభీషణుడు, రాముని సేతువును కూల్చమని కోరుటచే   రాముడు ధనుస్సుతో సేతువును పడగొడతాడు. ఇప్పటికీ ఆ సేతువు ఆనవాళ్ళను ధనుష్కోటిలో గమనించవచ్చు. ఇక ధనుష్కోటికి అంటే విల్లు కొనకు నారిఒ అనగా అల్లెత్రాడు సందిన్చానవసరములేదని రాముడు దానిని వింటి కోటి అంటే విల్లుయోక్క కొసనుండి విడదీస్తాడు. ఆవిధముగా ఈ ప్రాంతము ధనుష్కోటి అయినదని గతములో వినియుండినాను.  కాశీకి పోయి వచ్చినవారు ఇక్కడ స్నానాలు ఆచరించేవారు.

1964లో రామేశ్వరం వద్ద తీరం దాటిన తుపాను, 23 అడుగుల ఎత్తైన రాకసి అలలతో ధనుష్కోడిని మింగేసింది. ఈ విపత్తులో1800 మంది చనిపోయినట్లు అధికారిక ప్రకటనలోని అంచెనా. తుపాను సమయంలో  100 మందిప్రయాణికులు, 5గురు రైల్వే సిబ్బందిని తీసుకు  వెళ్తున్న రైలు ఉప్పెనలో కొట్టుకుపోయింది. అందరూ మరణించినారు. అప్పటి విషాదఛాయలు ఇప్పటికీ దనుష్కోడిలో కనిపిస్తూనే ఉంటాయి. అప్పటి చర్చ్, పోలీస్ స్టేషన్, పోస్టాఫీసు,రైల్వే స్టేషన్ల మొండి గోడలు అప్పటి విషాదాన్ని గుర్తు చేస్తుంటాయి. ప్రస్తుతం ఇక్కడ జాలర్లు మాత్రమే నివసిస్తున్నారు. 2004లో ఏర్పడిన సునామీ సైతం 1,600 అడుగుల ఎత్తైన అలలతో దనుష్కోడిని ముంచివేయుటతో తిరిగి అచట ఊరిని నిర్మించే ప్రయత్నమే చేయలేదు.

జలఖేచర నిక్షేపము (Water Bird Sanctuary)

ఇచట వలస పక్షులు ప్రతి సంవత్సరము అక్టోబర్ నుండి జనవరి వరకు  వచ్చి సందడి చేస్తుంటాయి. ఇక్కడ వలస పక్షులనూ, మరియు స్థానిక పక్షులనూ కూడా చూసి ఆనందించవచ్చు. దుర్భిణిని (binoculars)  తీసుకు పోవుట మరువకూడదు. ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రతిరోజూ ఇది తెరువబడియుంటుంది.

అది వేరొకమారు.........

3.

రామేశ్వర మహాత్మ్యముతో జోడింపబడిన నా అనుభవము ఇచ్చ ఉటంకించుట సందర్భాతిరిక్తము కాజాలదన్న ఉద్దేశ్యముతో మీ ముందు ఉంచుచున్నాను.

ఇంచుమించు 20 సంవత్సరములకే వివాహమయిన నాకు దాదాపు 20 సంవత్సరముల వరకు పిల్లలు లేరు. జీవితమంతా నిజమైన పురోహితునిగా నిలచిన, నాలాంటి ఎందరిచేతని ‘తాత’ గా పిలువబడిన, పూర్ణాయుష్కులగు  (101 సంవత్సరములు జీవించినారు)తిప్పాభట్ల కొరటమద్ది వెంకట సుబ్బయ్య గారు మాతండ్రి గారితో ‘నాయనా నాగదోష పరిహారము, నాగశాంతి, నాగ ప్రతిష్ఠ చేయించితే సంతాన ప్రాప్తి జరుగుతుంది, పైగా నాగదోష పరిహారము నేను సమగ్రముగా చేయిన్చుహాను కాబట్టి మీరు ఎపుడైనా పుణ్యక్షేత్రములకు వెళ్ళినపుడు అక్కడ కూడా ‘నాగ ప్రతిష్ఠ’ చేయిన్చుకోనవచ్చును అని చెప్పినారు. ఆ మహానుభావుడు తన జీవితకాలములో, ఈ కార్యమునకు ఇంత ఇస్తేనే చేయించుతానన్న పాపాన పోయినవాడు కాదు. తన జీవితాంతమూ విద్యార్థులకు అన్నము వసతి ఇచ్చి ఉచితముగా వేదవిద్య నేర్పిన మహనీయుడు.

ఆయన మాటను ఆజ్ఞగా ఔదలదాల్చి కడపలో ఆ కార్యక్రమమును సమగ్రముగా చేసి నాగప్రతిష్ఠ కూడా చేసినాము.

2,3 సంవత్సరముల పిమ్మట తీర్థయాత్రకు పోయినపుడు, రామేశ్వరమున

లో కూడా నాగప్రతిష్ఠ చేయ సంకల్పించినాము. సంతులేనివారు రామేశ్వరమున నాగప్రతిష్ఠ చేయిస్తే తప్పక సంతానము కలుగుతుంది అన్న బలమైన నమ్మకము ఆ రోజులలో ఉండేది.

మా తలంపునకు భగవంతుని అనుగ్రహము తోడగుటచే, మాకు రాజాశాస్త్రి అన్న తెలుగువాడగు వేదపండితుడు దొరికినాడు. ఆ మహానుభావుడు,  సమయము దొరికింది కదా అని మావద్ద దురాశతో డబ్బు గుంజకుండా, మామనసునకు తృప్తికరమగురీతిలో  క్రతువు నిర్వహించినారు. మిట్ట మధ్యాహ్నము సముద్ర స్నానము చేసి, పాదరక్షలు లేకుండా, ఇసుకలో తడిబట్టలతో నడుచుకొంటూ వచ్చి పట్టు వస్త్రములు కట్టుకొని నాగప్రతిష్ఠ గావించినాము. మేము దాదాపు పదిమందిమి. మాకు వారి కుటుంబసభ్యులకు ఆయన అర్దాంగియే వండి వడ్డించినది. ఆదంపతుల ఆశీస్సులతో, పర్వతవర్ధినీ రామలింగేశ్వరుల అనుగ్రహముతో, మాతీర్థయాత్ర సంపూర్ణమయి ఇల్లు చేరిన వెంటనే గర్భము నిలిచి అమ్మాయి కలిగినది. అసలు తీర్థయాత్రకు బయలుదేరబోతూ Apollo Hospital (అప్పుడు మద్రాసులో మాత్రమె ఉండేది) లో మేము Consult చేస్తున్న Dr. వాసంతి గారికి చూపిస్తే, అప్పుడే 2 నెలలు దాటినవి, గర్భము కాదు అయినాకూడా యాత్ర ముగించుకొని వచ్చినపుడు తిరిగీ పరీక్ష చేయించుకొని నిర్ధారించుకొందురుగానీ అని తెల్పినది. అంతా ముగించుకొని వచ్చిన పిదపకూడా అన్ని పరీక్షలు చేసి గర్భము కాదు అని తెల్చినది. మళ్ళీ Treatment ఎవ్వవలసిందే అంటే, అప్పుడు నేను ‘అమ్మా! ఇది తప్పక గర్భమే అన్న నమ్మకము నాకుంది, అందువల్ల ఆగుదాము అన్నాను. ఆరోజులలో ఆమె చాలా చాలా పేరుమోసిన డాక్టరు.’ ఆమె అట్లే అని చెబుతో ‘DUFASTAN’ అన్న Tablets (2 ఉంటాయి ఒక sheet లో) రాసి యిచ్చి వేసుకొన్న తరువాత వారము వరకు బహిష్టు కాకుంటే తనవద్దకు రమ్మన్నది. అప్పుడు కూడా నేను ‘ ఈ మాత్రలు ఏదయినా Reaction ఇచ్చే విధముగా ఉంటే వాడనని చెప్పినాను. ఆమె ఆ మాత్రలు చాలా మంచివి అనిచెప్పి మాకు ఎంతో భరవసా ఇచ్చి పంపింది. వారమునకు బదులుగా 15 రోజుల తరువాత పోతే అప్పుడు ఆమె Ultrasound తీసి Pregnency Confirm చేసింది. ఇది ఆ పరారాత్పరుని దయయే అన్న ధృడమైన నమ్మకముతో మనసారా పర్వతవర్ధినీ రామలింగేశ్వరులకు  నమస్కరించుకొని తిరుపతి చేరినాము (ఈ Treatment జరిగే రోజులలో నేను తిరుపతి SBI ప్రాంతీయ కార్యాలయములో Officer గా పనిచేసే వాడిని).

రామేశ్వర జ్యోతిర్లింగమును గూర్చిన ఈ వివరములు ఇంతటితో సమాప్తం.

స్వస్తి.

ఇక 8వ జ్యోతిర్లింగమయిన దారుకావనము లోని నాగేశ్వర జ్యోతిర్లింగమును గూర్చి తెలుసుకొందాము.

8వ జ్యోతిర్లింగము-దారుకా వనము-నాగనాథుడు

యామ్యే సదంగే నగరే‌తిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః |

సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ||

ఆధునిక ద్వారకా నగరము గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో ఉంది. ద్వారకా నగరం సముద్రమట్టానికి సమముగా 0 అడుగుల సముద్ర మట్టంలో ఉంది. 22.23 అక్షాంశం 68.97 రేఖాంశంలో ఉపస్థితమై ఉంది.

భారతదేశంలో ఉన్న హిందువుల ఏడు పవిత్రక్షే త్రాలలో ద్వారకాపురి ఒకటి. అయితే వీటిలో శివుడు ప్రతిష్ఠితమై ఉన్న వారణాశి అత్యంత పవిత్రమైనది. ద్వారకను ద్వారకాపురీ అనుట అనూచానముగా వస్తూవున్న విషయము. అట్లే అవంతికా పురి అనుట కూడా కద్దు. కావున పురీ ద్వారావతి అన్నది కానీ అవన్తికాపురి అన్నది కానీ  ఒకే పదముగా తీసుకొనవలెను. అప్పుడే మోక్షదాయక పట్టణములు 7 ఔతాయి. ఆ విషయమును ఈ క్రింది శ్లోకము తెలియజేస్తూవున్నది.

అయోధ్య మథుర మాయ కాశి కాంచి అవంతిక I

పురీ ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయకాః II

క్షేత్రం అంటే పవిత్రమైన ప్రదేశం. దైవిక శక్తికి కేంద్రం. జీవుడికి తుది గమ్యమైన మోక్షమును అందించే మోక్షపురి. గరుడ పురాణం పేర్కొన్న ఏడు మోక్షపురాలు వరుసగా అయోధ్య, మథుర, మాయా, కాశి, కాంచి, అవంతికా పురి, ద్వారకా పురి. కానీ పూరీ ఇందులో చేరే అవకాశము నాకు కనిపించలేదు.

నాగేశ్వర లింగము : శ్లోకములోని వరుస ప్రకారము ద్వాదశ జ్యోతిర్లింగాలలో 7వది "నాగేశ్వర లింగము". గుజరాత్ రాష్ట్రంలో ద్వారక నుండి గోపితలావ్(గోపికలు స్నానమాడిన కొలను)  వెళ్లే బస్సులో నాగనాధ్ వద్ద దిగి వెళ్ళవలసివస్తుంది. గోమతి ద్వారక నుండి సుమారు 14 కి.మీ. దూరము. చాలా చిన్న గ్రామము.

ఈ జ్యోతిర్లింగ క్షేత్రమును గూర్చిన కథ ఈవిధముగా వున్నది. గుజరాత్ లోని ద్వారకా పట్టణానికి 17 కి.మీ. దూరములో ఉన్న దారుకావనము లో కలదు. ఇది దట్టమగు అటవీ ప్రాంతము. నాగేశ్వరలింగము దారుకావనములో ఉన్నట్లు చెప్పబడినది. పర్లి వైద్యనాధ్ కు సమీపముగా మౌంట్ నాగనాధ్ లో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగమే నిజమైనదని అక్కడివారు చెబుతారు. ఈ రెండు క్షేత్రములతోబాటూ ఉత్తరాఖండ్ జాగేశ్వర్ లోని జాగేశ్వరలింగమే అసలయిన నాగేశ్వరలింగమని అక్కడివారు చెబుతారు.

 

తిరిగీ దారుకా వనమునకు వస్తే, ఈ వనములో దారుకుడు అన్న రాక్షసుడు అతని భార్యతో ఇక్కడ ఉండేవాడని పురాణ కథనము. దారుకి గౌరీదేవి భక్తురాలు.  ఆ తల్లి అనుగ్రహముతో దారుక అనేకమగు వరములను పొందింది. దారుకుడు కూడా అమిత శక్తివంతుడగుటచే వారు బల పరాక్రమము కలిగిన అనేక క్రూరసంతానమునకు జన్మనిచ్చినారు. వీరంతా కలిసి ఆ అరణ్యములో తపమాచరించుకొనుచున్న మునిజనమును, దారిన పోయే బాటసారులను భయంకరముగా హింసించేవారు. మునులిది భరించలేక చ్యవన మహర్షి కుమారుడు కౌర్కుడు అన్న ఋషి పాదములు పట్టుకొని శరణు వేడినారు. అప్పుడు ఆయన ఈ రాక్షసులు భూమిపై మానవులను హింసిస్తే, ఆ రక్కసులు మరణిస్తారని శాపమునొసంగినాడు. అదితెలిసిన ఆ రాక్షసమూక సముద్రములో తమ స్తావరమును ఏర్పరచుకొని నౌకాప్రయానీకులను హింసింపదొడగినారు. ఆ సమయములోనే సుప్రియుడను వర్తకుని బంధించి అతనిని అనుచరసమేతముగా చెరసాలలో బంధించినారు ఈ రాక్షసులు. ఆ చరసాలలో ఉన్న మట్టినే లింగముగా తయారుచేసి అనుదినమూ పూజించేవాడు ఆ అపరిమిత శివభక్తుడు.

అది గమనించిన రాక్షస సేవకులు తారకాసురునికి ఆ వార్తను చేరవేసినారు. తారకాసురుడు ఆగ్రహోదగ్రుడై కారాగారము చేరి, సుప్రియునితో "నీవు శివారాధన తక్షణం మానుము" అని చెప్పినా, శివ పంచాక్షరీ మంత్ర జపము చేయుచున్న సుప్రియుడు బదులు పలుకలేదు. తారకాసురుడు కోపము పట్టలేక తన చేతిలోని గదచే సుప్రియుని తలపై కొట్టబోవునంతలో,

భయము చెందిన సుప్రియుడు భ్రూమధ్యమున పరమేశ్వరుని ప్రతిష్ఠించుకొని త్రికరనశుద్ధితో రక్షింప ప్రార్థింప దలంచి  ఆ వైశ్యాగ్రణి ఇట్లు పలికెను-

పాహి శంకర దేవేశ పాహి శంభో శివేతి చ |

దుష్టాదస్మాత్త్రిలోకేశ ఖలహన్‌ భక్తవత్సల || 8

సర్వస్వం చ భవానద్య మమ దేవ త్వమేవ హి |

త్వదధీనస్త్వదీయో%హం త్వత్ర్పా ణస్సర్వదా ప్రభో || 9

ఓ శంకరా! దేవదేవా! రక్షించుము. ఓ శంభో! శివా! ఓ త్రిలోకాధిపతీ! దుష్టసంహారకా! భక్తవత్సలా! ఈ దుష్టుని బారినుండి రక్షించుము (8). ఓ దేవా! ఈనాడు నా సర్వస్వము నీవే. నీ ఆధీనములోనున్న నేను నీవాడను. ఓ ప్రభూ! నా ప్రాణములు సర్వదా నీ చేతిలోనున్నవి (9).

ఈవిధముగా ప్రార్థించినంతనే, శంకరుడక్కడ జ్యోతి రూపమున ఆవిర్భవించి, దారుకుని అతని రాక్షసమూకను భూమిమీదికి తరిమి సంహరించినాడు.

ఈ విధముగా ప్రార్థించబడిన శంభుడు అప్పుడు నాలుగు ద్వారములతో కూడియున్న ఉత్తమమగు భవనముతో సహా వివరమునుండి బయటకు వచ్చెను (10). మధ్యలో జ్యోతిస్వరూపముతోనున్నది, పరివారముతో కూడియున్నది అగు ఆ అద్భుతమైన శివరూపమును చూచి ఆతడు పూజించెను (11). అపుడు పూజించబడిన ఆ శంభుడు ప్రసన్నుడై పాశుపతాస్త్ర మును ఇచ్చి స్వయముగా ఆయుధములతో మరియు గణములతో, అచట చేరియున్న రాక్షసవీరులను అందరినీ వెనువెంటనే సంహరించెను. ఆ విధముగా దుష్టులను సంహరించి  శంకరుడు తన భక్తుని రక్షించెను (12, 13). అత్యద్భుతమగు లీలలను నెరపువాడు, యథేచ్చగా స్వీకరింపబడిన సుందరదేహము గలవాడు అగు శంభుడు అప్పుడు వారినందరినీ సంహరించి ఆ వనమునకు వరమును ఇచ్చెను (14). ఈ వనములో సర్వదా బ్రాహ్మణ క్షత్రియవైశ్య శూద్రుల వర్ణధర్మములు ప్రవర్తిల్లుగాక! (15). ఇచ్చటి మహర్షులు ఎన్నడైననూ తమోగుణప్రధానులు కాకుందురు గాక! వారు శివధర్మమును తాము పాటించి ఇతరులకు బోధించువారు అగుదురు గాక! (16). ఈ సమయములో దారుకుని భార్యయగు దారుక అనే పేరుగల రాక్షసి, పార్వతీదేవి భాక్తురాలగుటచే, దీనమనస్కయై పార్వతీదేవిని స్తుతించెను (17). అపుడా దేవి ప్రసన్నురాలై, ఏమి సాయము చేయవలెను? అని ప్రశ్నించగా, నీవు నా వంశమును రక్షించవలెనని ఆ రాక్షసి బదులిడెను (18). నేను నీ వంశమును రక్షించెదను. నేను సత్యమును పలుకుచున్నాను అని పలికి ఆమెకు అభయమిచ్చి,  సాక్షాత్తు శివునితో విరోధమునకు ఒడిగట్టెను (19). శివప్రభువు కోపముతోనున్న ఆ దేవిని చూచి, ఆమెను ఉల్లాసపరుపదలంచి, పరమప్రీతితో ‘నీకు తోచినట్లు చేయు’మని బదులు చెప్పెను (20). మరి ఆ తల్లి వరమును వ్యర్థము కానివ్వకూడదు కదా! తన భర్తయగు శంకరుని మాటను విని పార్వతి మిక్కిలి ప్రసన్నురాలై నవ్వి వెంటనే ఆయనతో ఇట్లనెను (21).

మిగిలినది మరొకసారి.....

8వ జ్యోతిర్లింగము-దారుకా వనము-నాగనాథుడు-2వ భాగము

పార్వత్యువాచ |

భవదీయం వచస్తథ్యం యుగాంతే సంభవిష్యతి |

తావచ్చ తామసీ సృష్టిర్భవత్వితి మతిర్మమ || 22

అన్యథా ప్రలయస్స్యాద్వై సత్యం మే వ్యాహృతం శివ |

ప్రమాణీక్రియతాం నాథ త్వదీయాస్మి త్వదాశ్రయా || 23

ఇయం చ దారుకా దేవీ రాక్షసీ శక్తికా మమ |

బలిష్ఠా రాక్షసీనాం చ రక్షోరాజ్యం ప్రశాస్తు చ || 24

ఇమా రాక్షసపత్న్యస్తు ప్రసవిష్యంతి పుత్రకాన్‌ |

తే సర్వే మిలితాశ్చైవ వనే వాసాయ మే మతాః || 25

పార్వతి ఇట్లు పలికెను-

మీ వచనము ఈ యుగముయొక్క అవసానమునందు యథార్థము కాగలదు. అంతవరకు తమోగుణ ప్రధానమగు సృష్టి కూడ ఉండవలెనని నా అభిప్రాయము (22). ఓ శివా! అట్లు గానిచో, ప్రలయము వచ్చును. నేను సత్యమును పలుకుచున్నాను. ఓ నాథా! నా వచనములకు నీవు ప్రామాణ్యమును కలిగించుము. నేను నిన్ను ఆశ్రయించుకొనియున్న నీ దానను (23). ఈ దారుకాదేవియను రాక్షసి నా భాక్తురాలగు శక్తి. రాక్షసస్త్రీలలో అత్యధికబలవంతురాలగు ఈమె రాక్షసరాజ్యమును పరిపాలించుగాక! (24). ఈ రాక్షసుల భార్యలు పుత్రులను ప్రసవించగలరు. వారందరు కలిసి వనములో నివసించవలెనని నా అభిమతము (25). అందులకు వల్లెయనుచూ పరాత్పరుడగు శంకరుడు ఈ విధముగా బదులు చెప్పెను.

శంకర ఉవాచ |

ఇతి బ్రవీషి త్వం వై చేచ్ఛృణు మద్వచనం ప్రియే |

స్థాస్యమ్యస్మిన్‌ వనే ప్రీత్యా భక్తానాం పాలనాయ చ || 27

అత్ర మే వర్ణధర్మస్థో దర్శనం ప్రీతిసంయుతమ్‌|

కరిష్యతి చ యో వై స చక్రవర్తీ భవిష్యతి || 28

అన్యథా కలిపర్యాయే సత్యస్యాదౌ నృపేశ్వరః |

మహాసేనసుతో యో వై వీరసేనేతి విశ్రుతః || 29

స మే భక్త్యాతివిక్రాంతో దర్శనం మే కరిష్యతి |

దర్శనం మే స కృత్వైవ చక్రవర్తీ భవిష్యతి || 30

శంకరుడు ఇట్లు పలికెను-

నీవు ఇట్లు పలుకుచున్నావు కదా! ఓ ప్రియురాలా! అట్లైనచో, నా మాటను వినుము. నేను భక్తులను రక్షించుటకొరకై ప్రీతి పూర్వకముగా ఈ వనములో స్థిరముగా నుండెదను (27) ఎవడైతే వర్ణ ధర్మమునందు వున్నవాడై నన్ను ఇక్కడ ప్రీతిపూర్వకముగా దర్శించునో, వాడు చక్రవర్తి కాగలడు (28). లేదా, కలియుగము పూర్తి అయిన తరువాత సత్యయుగము యొక్క ఆరంభములో వీరసేనుడు అనబడు  ప్రఖ్యాతిని చెందిన పేరుతో, మహాసేనుడను మహారాజు కుమారునిగా  పుట్టగలడు. అతడు పెద్ద సైన్యముతో గూడి భక్తితో నన్ను దర్శించి, దుష్ట సంహారము చేసి   నన్ను దర్శించిన కారణమున  చక్రవర్తి కాగలడు (29, 30).

ఈ విధముగా తెలిపి  జ్యోతిర్లింగమై "నాగలింగేశ్వర" నామముతో లింగరూపము ధరించి అచట  ప్రభవించినాడు.

మరి కలియుగములో దారుక యొక్క సంతతి మనకు కనిపించావలెను కదా! అన్న సందేహము రావచ్చును వారు భూమిపై ఉండకూడదన్న శాపము ఉన్నదికదా! అందువల్ల సమీపములోని సముద్రములో తమ నెలవును ఏర్పరచుకొనియుంటారు.

భక్తజన మనో విలాసుడగు పరమేశ్వరుడు ఆ విధముగా నాగేశ్వరలింగములో తన శక్తులను ఆవహింపజేసి  భక్తజన సంరక్షకుడై భక్తాభీష్ట ప్రదాయకుడై వెలసినాడని శివపురాణ కథనము. ఆయనతో బాటూ అమ్మవారు కూడా ఇచట నాగేశ్వరిగా వెలసినది. ఇచ్చటి శివలింగము మిగత శివలింగములకు భిన్నముగా చిన్న చిన్న చక్రముల వంటి గురుతులను కలిగియుంటుంది. మూడుముఖముల రుద్రాక్షవలె దర్శనమిస్తుంది ఈ శివ లింగము. దేవాలయమును పురాణకాలములో ఎవరు నిర్మించినారన్న దాఖలాలు తెలిసిరాలేదు కానీ చాళుక్యుల కాలములో దీనిని నిర్మించిన ఆధారములు దొరికినట్లు చదివియుండినాను. హిందూధర్మ వినాశకుడు వివిధ దేవాలయ విధ్వంసకుడు, వేదవిదిత విశ్వవ్యాప్త ధర్మునకు  అగు విపరీత విఘాతి యగు మొఘలు చక్రవర్తి ఔరంగజేబు గారు ఈ దేవాలయమును ద్వంసముచేయ తన వేలాది సైనికులను పంపగా వారు దాదాపు సగము భిన్నము చేసిన తరువాత తేనెటీగల దండ్లు దాడి చేయగా వారు పరుగెత్తి పోయినారని స్థానికుల కథనము. ప్రస్థుతమున్న దేవాలయమును T-Series అధినేత గుల్షన్ కుమార్ మరణానంతరము వారి వారసులు ఈ ఆలయమును 2కోట్ల ఖర్చుతో పునర్నిమించినారు. ఇక్కడ ఒక ఉన్నత పీఠముపై 25 ఆడుగుల వెడల్పు 125 అడుగుల ఎత్తు కల్గిన మహేశ్వరుని పాలరాతి విగ్రహము ప్రత్యెక ఆకర్షణ. ఇది దాదాపు 3 కిలోమీటర్ల దూరమునుండి కూడా కనిపించుతుంది. దేవాలయమునందు స్వామి లింగమును భక్తులు స్వయముగా తాకి అభిషేకాదులు చేసుకొనవచ్చును. స్వామితోబాటు అమ్మవారు నాగేశ్వరి దేవిని, విఘ్నేశ్వరుని, విష్ణువును, నాగ విగ్రహమును కూడా దర్శించుకోవచ్చును.

ఈ పుణ్యక్షేత్రమునకు సంబంధించి మరియొక కథ ఈ విధముగా వుంది. దక్షయజ్ఞమున, యజ్ఞవాటికన దూకి అగ్నికి ఆహుతియైన  సతీదేవి శరీరమును భుజముపై వేసుకొని తెలియని దూరాలకు బయలుదేరినాడు పరమేశ్వరుడు. తిరిగి తిరిగి దారుకావనమున ప్రవహించు గోమతీ నది వద్దకు వచ్చి నదిలో దిగినపుడు అమ్మవారి శరీరము జారి నదిలో పడినదట. స్వామికూడా నిస్పృహతో నదిలో మునిగిపోయినాడట. ద్వాపర యుగములో అరణ్యవాసము చేస్తూ ఆప్రాంతమునకు వచ్చిన పాండవులు ఆనదిలో నీరుపాలవలె యుండుటయే గాక మీగడ కూడా దానిపై తేలియాడుట చూసినారట. దానికి అసలుకారణము మేతకు అచటికి అనుదినమూ వచ్చే ఆవుల మంద ఆనీటిని త్రాగి పితుకనవసరము లేకుండానే ప్రతిరోజూ క్షీరధారాలు కురిపించేవట.

విషయము తెలియని భీముడు ఆతురత కలిగినవాడై ఆ నీటిపై ఒక గదాఘాతము వేసినాడట. దానితో ఆనది రెండుగా విడిపడి మధ్యన శివలింగము అగుపించినదట. నీరు ఎర్రబారుటయే గాక రక్తము కారుచున్న శివలింగము కనిపించినదట. అదే నాగానాథుని జ్యోతిర్లింగము. తెలియక చేసిన తప్పును క్షమించమని కోరి, అచట ఆ లింగమునకు పాండవులు మొదట గుడి కట్టించినారట. దేవదారు వృక్షములు ఈ అడవిలో ఎక్కువగా ఉండుటచేత దీనికి దారుకావనమను పేరు వచ్చినదని కూడా స్థలపురాణ కథనము.

తదుపరి బేట్ ద్వారకను గూర్చి మరొకమారు తెలుసుకొందాము.......

8వ జ్యోతిర్లింగము-దారుకా వనము-నాగనాథుడు-3 వ భాగము

 బెట్ ద్వారక అన్న పురాణ ప్రసిద్ధ పట్టణము ఇక్కడికి 20 కి.మీ. దూరములో ఉన్నది. దానిని గూర్చి తరువాత తెలుసుకొందాము. మోక్షదాయకములైన సప్తపురములలో ఒకటి అయిన "ద్వారక" శ్రీ కృష్ణ భగవానుని నెలవు. జరాసంధుని బారినుండి తన గోపీజనతతిని రక్షించుటకు సముద్రములో ద్వారకను నిర్మించినట్లు ఇంతకాలమూ పురాణ ప్రచురితముగా భావించుచున్న విషయము ఇపుడు వాస్తవముగా ప్రకటితమైనది. గుజరాత్ లోని ఈ దివ్యధామం శ్రీకృష్ణుని పాదస్పర్శతో పునీతమైనది. జరాసంధుని బారినుండి తన ప్రజలను రక్షించుటకు, అనవసరమగు యుద్ధములతో వారికి ప్రాణహాని కలుగకుండా ఉండుటకు, ఈ నగరాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి ద్వారకాధీశుని మందిరము అతి పురాతనమైంది. ఈ మందిరాన్ని పదో శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తూ వున్నది. అయితే శ్రీకృష్ణుని మనుమడు అయిన వజ్రనాధుడు ఈ మందిరాన్ని మొట్టమొదటి సారిగా నిర్మించినట్ట్లు పురాణాలలో ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణుని ద్వారకా నగరం సముద్రగర్బంలో ఇంకా వుందని పరిశోధకులు రుజువులతో కూడా లోకానికి చాటినారు. భారతదేశములో నాలుగు మూలల వున్న నాలుగు ధామములలో ద్వారక ధామము ఒకటి. మిగత మూడు రామేశ్వరము, పురీ జగన్నాధ్, బదిరీనాధ్ గా చెబుతారు.

బెట్ ద్వారక మహాభారతము, స్కాందపురాణములలో చెప్పిన ద్వారకా నగరంలోని భాగముగా కొందరు పరిశోధకులు భావిస్తారు. గుజరాతీ పండితుడు ఉమాశంకర్ జోషి, మహాభారతం సభాపర్వంలో ప్రస్తావించిన అంతర్ద్వీపం అంటే బెట్ ద్వారకయే అని చెప్పుట జరిగినది. ద్వారకకు చెందిన యాదవులు పడవలపై అక్కడికి వెళ్ళేవారు. ఈ ద్వీపంలో విస్తారంగా దొరికే శంఖాల కారణంగా దీనికి శంఖోదర్ అనే పేరు కూడా ఉన్నది. సముద్ర అంతర్భాగంలో దొరికిన పురాతత్వ అవశేషాలను బట్టి అక్కడ అంతిమ హరప్పా కాలం నాటిది కానీ తదనంతర కాలంనాటిది కానీ అయిన నివాస స్థావరం ఉండేదని తెలుస్తూ వుంది. దాన్ని మౌర్య సామ్రాజ్యం నాటిదిగా చెప్పగలిగే బలమైన ఆధారాలున్నాయి. అది ఓఖా మండలానికి లేదా కుశద్వీపానికి చెందినది. సా.శ. 574 నాటి సింహాదిత్యుని రాగి శాసనంలో ద్వారక ప్రసక్తి ఉంది. అతడు వల్లభికి మంత్రి, ద్వారక రాజైన వరాహదాసు కుమారుడు. ఇక్కడ నామనసుకు తోచిన ఒకమాట చెబుతాను. నేతి పురాతత్వ గుణనిధులు వారికి దొరకిన అధారాలాను బట్టి అంచనాలు వేస్తారు.మరి అపౌరుషేయము, అనంతము, అసాధ్య కాలమునుండి ఉన్న వేదములలోని వాస్తవములను ఆధారములు లేవని ఆవలికి త్రోసివేయగలమా! కొన్ని వాస్తవములను వేదములనుండి యథాతథముగా గ్రహించావలసియుంటుంది. ఇట్టి అంశములను Algorithams అని  Postulates అని Axiums అని ఆంగ్లములో పలు విధములుగా పలుకుతూ వుంటారు. మనకు అంది వచ్చిన ఆధారాలతో వేదం ప్రామాణికతను ఒప్పుకొంటే మన సంస్కృతిని బ్రతికించినవారమౌతాము.

పూర్వము ఈ బెట్ ద్వారక అన్న ఈ దీవి బరోడా రాష్ట్రములోని అమ్రోలీ విభాగమున 1909 సంవత్సరమున ఉండేది.

1857 నాటి మొదటి స్వాతంత్ర్య యుద్ధంలో వఘేర్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. తిరిగి 1859 లో గయక్వాడ్, బ్రిటిషు వారు, ఇతర సంస్థానాధీశులూ కలిసి ఈ ప్రాంతాన్ని వశపరచుకున్నారు.[ (Google సౌజన్యము)

స్వాతంత్ర్యము తరువాత, ఈ ప్రాంతము సౌరాష్ట్ర రాష్ట్రములో అంతర్భాగమైనది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో ఇది బాంబే రాష్ట్రంలో భాగమైయుండగాబాంబే రాష్ట్రము నుండి గుజరాత్ వేరు పడినపుడు, ఈ ప్రాంతము గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో భాగమైంది. 2013 లో జామ్‌నగర్ జిల్లా నుండి దేవభూమి జిల్లాను ఏర్పరచినపుడు ఈ ప్రాంతం కొత్త జిల్లాలో భాగమై ఉండిపోయిది.

పురాతత్వము

1980 లో చేసిన పరిశోధనలలో ఏదేవాలయమునో పడగొట్టించి కట్టించిన సిద్దీ బావా పీర్ దర్గా వద్ద అంతిమ హరప్పా కాలానికి చెందిన మట్టి పాత్రలు, ఇతర వస్తువులూ లభించినాయి. 1982 లో 580 మీటర్ల పొడవైన రక్షణ కుడ్యాన్ని కనుగొన్నారు. అది క్రీ.పూ. 1500 నాటిది. అది ఉప్పెన కారణంగా దెబ్బతిని మునిగిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. అక్కడ దొరికిన వస్తువులలో అంతిమ హరప్పన్ ముద్ర, లిపి లిఖించి ఉన్న ఒక జాడీ, రాగి పనివారి మూస, రాగి చేపల గాలం ఉన్నాయి. తవ్వకాల్లో దొరికిన ముక్కలైన పడవలు, రాతి లంగర్లు రోమన్లతో వాణిజ్య సంబంధాలుండేవని సూచిస్తున్నాయి. దీవిలో ఉన్న దేవాలయాలు 18 వ శతాబ్దాంతంలో నిర్మించినట్లు తెలియవస్తూ వున్నది. (Google సౌజన్యము)

ఆరాధ్య స్థలాలు

ద్వారకాధీశ, కేశవరాయ్‌జీ దేవాలయాలు శ్రీకృష్ణుని ఆలయాలు. హనుమాన్ దండి, వైష్ణవ్ మహాప్రభు బేఠక్‌లు ఇతర యాత్రా స్థలాలు ఇక్కడ ఉన్నాయి.

ఈ విధముగా ఎంతో ప్రశస్తి చెందిన దారుక, ద్వారకలను చూచుట వారి వారి పూర్వ పుణ్య ఫలితమని నాకు అనిపించుతూ వుంటుంది. ఆ అదృష్టము నాకు లేనందువల్ల నేను చూడలేదేమో అని అనుకొంటూ వుంటాను.

పాఠకులందరికీ నాగేశ్వరీ సమేత నాగేశ్వరుల అనుగ్రహము కలుగావలేనని ఆ పరాత్పరుని వేడుకొను చున్నాను.

స్వస్తి.  

9-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము

       సానందమానందవనే వసంతమానందకందం హతపాపబృందం |

           వారాణసీనాథ మనాథ నాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ||

గంగా నది ఒడ్డున నివసించిన ”కాస్య ,కాస ,ఖాసా ”అని పిలువ బడి చివరకు  ”కాశీ ”లయిన వారి నగరము ‘కాశి’ అయినది అని భాషా శాస్త్రజ్ఞులు చరిత్రకారులు చెబుతూ ఉన్నారు.. ఋగ్వేదం లో ”శున హోత్రుని మనుమడు” ”కాశి ”అనే వాని చేత నిర్మించ బడిన నగరం కనుక కాశీ అనే పేరు వచ్చి నట్లు వుంది .”హావెల్ ”పండితుడు క్రీ.పూ.1400 -1000  ప్రాంతం లో కాశీలు ఇక్కడే వుండే వారని వ్రాసినాడు. స్కాంద పురాణములో కాశీ పరమేశ్వరునిచే నిర్మింపబడినదని తెలియవస్తూ వున్నది. ‘కాశ్యాన్తు మరణాన్ ముక్తి’  "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" – అన్నది శాస్త్రవచనము. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైనది అని చారిత్రికులు భావిస్తారు. కాశి 5 క్రోసుల కైవారము కలిగిన క్షేత్రము.ఇందుకే దీనిని ‘పంచ క్రోశి’ అంటారు. ఇది నాటి పట్టణ వైశాల్యమును తెలుపుతుంది.

కవిసార్వభౌముడు శ్రీనాథుడు తన 'కాశీ ఖండమున -వివరించిన కాశి 'మాపన ప్రావిధి'

నేను శ్రీనాథుడు రచియించిన కాశీ ఖండమునుండి ఈ పద్యమును గైకొనుటకు ఒక ముఖ్య కారణము ఉన్నది. ఈ పద్యము కాశీని, విశ్వేశ్వరుని గూర్చి తెలుసుకొనుటకు ఇది ఒక కొలబద్ద. మాపన ప్రావిధి అన్న మాటకు కొలుచుట అనియే అర్థము. ఆ పద్యము ఏవిధముగా కొలబద్ద అన్నది గమనించుటకు ముందు పద్యము దాని భావమును చూద్దాము.

సీ. చక్రవాళ పరీత సర్వ సర్వంసహా

పరమ తీర్ధములలొ బెరువ కాశి

కాశికా పట్టణ క్రోశ పంచక తీర్ధ

సమితి లో సారంబు జహ్ను కన్య

జహ్ను కన్యా తీర్ధ సముదాయమున యందు

గడు బెద్ద మణికర్ణికా హ్రదంబు

మణికర్ణికా తీర్ధ మజ్జన ఫలము కం

టెను విశ్వనాధు దర్శన మధికము.

తే.గీ.    విశ్వపతి కంటె గైవల్య విభుని కంటె

గాలకంఠుని కంటె ముక్కంటి కంటె

దీర్ధములు దైవములు లేవు త్రిభువనముల

సత్యమింకను సత్యంబు సంయ మీంద్ర! (123)

తా. ఓ మహర్షీ! (సంయమము : అనుచితమైన, అహితమైన కోర్కెలకు ఆలోచనలకు కళ్ళెం వేసి ,ఉచితమైన వాటివైపు మనస్సును లగ్నం చేయడమే సంయమము . అది కలిగినవాడు సంయమి. అటువంటి వారిలో ఇంద్రునివంటి వాడు సంయమీంద్రుడు.) లోకాలోక సర్వ భూమండలము నందలి పరమ తీర్ధములలో కాశీ పెరువ అనగా గొప్పది. కాశికా నగర పంచ క్రోశ మధ్యమునందుగల తీర్ధ సముదాయములలో జహ్నవి సారభూతమైనది. జహ్నవీ తీర్ధ కదంబములలో మణికర్ణిక మిక్కిలి గొప్పది. మణికర్ణికా తీర్ధ స్నాన ఫలము కంటే, శ్రీ విశ్వనాధుని దర్శన ఫలము గొప్పది.కైవల్య నాధుడైన విశ్వనాధుని కంటే, కాల కంఠుని కంటే, ముక్కంటి కంటే అధికమైన తీర్ధములు,దైవములు భూర్భువస్సువర్లోకములు మూడింటి యందును లేవు. ఇది సత్యము. మరియూ సత్యము.

మొదట కాశీనాథుడగు విశ్వేశుని గూర్చి కొంత గమనిచుదాము. ఈ పద్యమున వరుసగా ఒకదానికంటే ఒకటి, ఒకదానికంటే ఒకటి గా ఏదేది పెద్ద అని చెప్పుకొంటూ పోయి చివరకు అన్నింటికన్నా విశ్వపతి అధికము. అట్టి విశ్వపతి మరియు ఆ విశ్వపతిని పరివేష్ఠించి యున్న తీర్థములు దైవములు తక్క ఈ త్రిభువనములలో వేరు అధికమగు ప్రస్తాపనే లేదు. ఇక కాశీ పట్టణము యొక్క కొలతల గూర్చి మాట్లాడుకొందాము. ఈ ప్రమాణము వ్యాసమహర్షి ‘స్కాంద పురా’ణాంతర్గత  ‘కాశీ ఖండము’ న వర్ణింపబడిన కాశీని గూర్చి మాట్లాడుచున్నాము అన్న విషయము మనము జ్ఞాపకము ఉంచుకొనవలసినది. అంటే ద్వాపరమునకు పూర్వమే, పట్టణములు ఉన్నవి అన్నది మనకు తెలియుచున్నది కదా! మరి వ్యాసులవారు స్కాందపురాణము వ్రాసినది ద్వాపరమునందే కదా! దీనిని బట్టి మన నాగరికత ఎంత పురాతనమైనది అన్నది ఒకపరి ఆలోచించండి. ఇక విషయమునకు వద్దాము.

కాశికా పట్టణ క్రోశ పంచక...’ అని పద్యము యొక్క రెండవ పాదములో కాశీ వైశాల్యమును గమనించుతాము.

అంటే వ్యాసులవారి కాలమునకు ఈ కాశీపట్టణము ఎంత విస్తారము కలిగియున్నది అన్నది మనము గమనించవలసియున్నది.

మిగిలినది మరొకసారి............................. 


No comments:

Post a Comment