విగ్రహారాధన (మూర్తి, ప్రతిమ, విగ్రహము)
https://cherukuramamohanrao.blogspot.com/2021/01/blog-post.html
న తస్య
ప్రతిమా అస్తి యస్య నామ మహద్యశః |
హిరణ్యగర్భ
ఇత్యేషః |
మా మా
హింసీదిత్యేషా |
యస్మాన్న
జాత ఇత్యేష ||
శుక్లయజుర్వేదము - 32 అధ్యాయము- 3వ శ్లోకము
యస్య
అనగా ఏ పరమేశ్వరుని యొక్క నామము, మహా కీర్తిని
కలిగియున్నదో ఆ పరమాత్ముని స్వరూపమమునకు ప్రతి+మ అన్నది లేదు, అనగా
ఆయనకు సమానమగు బింబము (ప్రతి) లేదు(మ). నిరంజన, నిరాకార,
నిరంతర, నిత్యప్రభాసిత నిర్గుణ, నిఖిల విశ్వ వ్యాపకుడై అలరారుచున్న ఆ హిరణ్య గర్భునితో, సంకుచిత
స్వభావముతో, మరెవరినీ పోల్చవద్దు. మరి గుళ్ళలో ఇళ్ళలో కనిపించే ఈ దేవతా మూర్తుల
విగ్రహములేమిటి?
‘ప్రతి’
అన్న మాటకు మనము సాధారణ భాషలో వాడే ‘నకలు’ అన్నది అర్థము. ‘మ’ అంటే లేదు, కాదు అని
అర్థము. ‘మరి ‘ప్రతిమ’ అన్నా ‘విగ్రహము’ అన్నా దైవ రూపముతో పోలుస్తారు కదా! విగ్రహ రూపములో దేనినైతే చూస్తున్నామో దానికి ప్రతి అనగా నకలు 'మ' లేదు అని అన్వయము. కావున విగ్రహమును ప్రతిమగా మనము భావించుటలో తప్పులేదు. అది కూడా మన అంతర్దృష్టి
ఏకాగ్రతతో నిలచే వరకే! ఆతరువాత హృదయము వద్ద నీల శిఖ కలదు. ఇది అంతు తెలియని
కాలములోని వేదవాక్కు, ఈ విషయమును Science కూడా ఒక 3, 4 శతాబ్దముల క్రితము
గుర్తించింది. శంఖున పడినది కదా! ఇపుడది మనకూ తీర్థమే! ఆ నీలి జ్యోతికి చివర నీవార
శూకమై (నీవార ధాన్యము నాకు తెలియదు కావున వడ్ల గింజ అనుకొందాము.) ఆవడ్లగింజ యొక్క
సూక్ష్మమైన ముల్లు యొక్క కొస భగవంతుని స్థానము అని మంత్రపుష్పములో చెప్పబడినది.
అంతేకాదు దాని రంగు నీలము. అదేకాదు ఆ శిఖ మధ్యలో ఎవరున్నారయ్యా అంటే
పరమస్వరాట్టులగు ‘బ్రహ్మ, శివ, హరి’ ఉన్నారట. ఇందు ఒకరు పెద్ద ఒకరు చిన్న లేదు.
‘యద్భావం తద్భవతి’ ఎవరు ఏ రూపమును తలచుకొంటే ఆశిఖా మధ్యమునందు ఆ రూపమును ప్రతిష్ఠించుకొన
వచ్చును. ఇక్కడ దేవుడు ఒకడే! పైగా ఇక్కడ నీల వర్ణమునకు ప్రాధాన్యత ఇవ్వబడినది.
వివిధ అవతార మూర్తియగు విష్ణువు నీల మేఘశ్యాముడు. శివుడు నీల కంఠుడు. బ్రహ్మకు నీల
వర్ణము లేదు కానీ నీలి శిఖ యొక్క అంచున
వర్ణము మనకు అగుపించదు కదా! లౌకికముగా కూడా బ్రహ్మకు ఇంద్రునికి దేవాలయములు లేవు.
వారు పూజనీయులు, వరప్రదాతలు. మనము చలన చిత్రములలో చూచు విధముగా ఇంద్రుడు అసూయాపరుడు
అహంకారి విషయలోలుడు కాదు. మనము యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించునపుడు వచ్చు
హవిస్సులు మొదట ఇంద్రునికి తదుపరి మిగత దేవతాగణములకు చెందుతాయి. మరి మాత్రపుష్పము
ఇంత వివరముగా పరమాత్మ ఒకడే అని చెబుతుంటే కొందరు మతాచార్యులు, తాము పూజించకున్నా,
వినాయకునికి నామాలు పెట్టి వైష్ణవునిగా మార్చి, శివుని విష్ణువు యొక్క కింకరునిగా
మార్చుతారు. ఒక దేవతను మంత్రయుక్తముగా నిమీలిత నేత్రులై ఆహ్వానించునపుడు ఆ
మంత్రములో వర్ణించిన ఆ దేవతాస్వరూపము ద్రష్టలగు ఋషులకు తమ మనోఫలకముపై
సాక్షాత్కారించుతుంది. అది మనము చూసే ‘ప్రతిమ’ కానీ ఆ కనిపించిన రూపమును ఆ ఋషి
సమర్తుడగు శిల్పితో చెప్పినపుడు, ఆయన తనకు జ్ఞాపకము ఉన్నది చెప్పుటలోగానీ, శిల్పి
అవగాహనలో గానీ లేక ఆ మూర్తిని శిల్పముగా ఆవిష్కరించుటలోగానీ పొరబాటు దొరలే అవకాశము
వున్నది కాబట్టి ‘ప్రతి +మ’ అంటే ఈ శిల్పము యథాతథము కాదు కానీ పరమాత్మునికి అతి
సమీపరూపము అనుటకు ‘ప్రతిమ’ అని అన్నారు.
ఇక
విగ్రహమును గూర్చి తెలుసుకొందాము.
‘విశిష్ఠం
భక్తైః వందనాని గ్రాహ్యతే ఇతి విగ్రహం’ ‘విశిష్ఠం ఆకర్ష్యతి ఇతి విగ్రహం’ అని
పెద్దల మాట. అంటే భక్తుల వందనములను గ్రహించే విశిష్ఠ గుణము కలిగినది, లేక ‘విశిష్ఠమైన
ఆకర్షణ కలిగినది విగ్రహము. ఈ విగ్రహ ప్రతిష్ఠ సామాన్య విషయము కాదు. అత్యంత
పురాతనమగు దేవాలయాలు వాస్తు, ఆగమ శాస్త్ర విదానములలో, భగవంతునికి అంకితమైన
దార్శనికుల కృషిచే నిర్మింపబడినవి. ఆ తరువాత ఆయారాజులు తమ పరిపాలనా కాలములో
దేవాలయములను విస్తరించినారు. బృహదీశ్వరాలయము వంటి కొన్ని దేవాలయములలో రాజులు
విగ్రహములతో కూడా ప్రతిష్ఠించినా మహామహా వేదపండితుల సముచిత సలహాలతో అవి
నిర్మింపబడినవి. అందుకే ఎటువంటి విధ్వంసకాండకు గురిగాక నిత్యనూతనముగా
విలసిల్లుచున్నవి.
యజుర్వేదము లోని
పురుష సూక్తములోని ఈ మంత్రమును ఒకపరి తిలకించండి.
విశ్వకర్మణః
సమవర్తతాధి |
తస్య త్వష్టా విదధద్రూపమేతి | తత్పురుషస్య
విశ్వమాజానమగ్రే |
విశ్వకర్మణః =
సర్వమును సృష్టించిన ఆ భగవంతుడు; సమవర్తత + అధి = అంతటా సమానముగా వ్యాపించి
ఆక్రమించిన; తస్య = ఆ విశ్వ వ్యాపకుని యొక్క; త్వష్టా = పరబ్రహ్మ స్వరూపమే; విదధద్రూపమేతి
= ఈ విశ్వాంతరాళములోని సకల చరాచర జీవరాసులకు రూపములను విధించెను. అంటే ఇక్కడ మనము
తెలుసుకోవలసినది ఏమిటంటే ఈ విశ్వమంతా ఆ భగవంతుని చైతన్యమే ప్రతిఫలించుచున్నది
అన్నది. తత్ పురుషస్య = ఆ పురుషుని యొక్క; విశ్వమాజానమగ్రే = (స్వరూపమగు ఈ) విశ్వము నా కంటి ముందు
కనిపించుచున్నది. దీనిని బట్టి మనకు తెలియవచ్చేదేమిటంటే ఆయన ‘సకలుడు’ అంటే
రూపమున్నవాడు. మరి సృష్టిలోని ప్రతివస్తువూ ఎదో ఒక రూపమును కలిగియే ఉన్నదికదా! మరి
అవి అన్నీ దేవతా స్వరూపములైనపుడు వానికి మ్రొక్కవచ్చు కదా! జంగములలో ఆవుకు నందికి కాకికి
మ్రోక్కుచునే యున్నాము. ఎన్నో పక్షులు, జంతువులు దేవతల వాహనాలు. చాయా చిత్రములలో
చూసినపుడు వానికి శ్రద్ధతో నమస్కరించుతాము. కానీ రాళ్ళు రప్పలు మొదలగు నిర్జీవ పదార్థములకు
మ్రొక్కము. మరి విగ్రహము రాయే కదా! అందులో ప్రాణ ప్రతిష్ఠ జరిగినది. యా విగ్రహములు
శిల్ప ఆగమ విధివిధానములతో కట్టబడినవి. అందుచేత ఆ ప్రాంగణములో ధనాత్మక (Positive)
ప్రకంపనలు విరివిగా ఉండి దేహానికి మనసుకు ఎంతో మేలు చేస్తాయి.
ఇప్పుడు
స్వార్తపరులగు అన్యమతస్థులు ‘న తస్య ప్రతిమా నాస్తి’ – భగవంతునికి ప్రతిమ లేదు’.
అన్న అర్ధ పాదమును అందిపుచ్చుకొని
కొంతమంది ప్రతిమ అంటే విగ్రహం అని, భగవంతునికి విగ్రహారాధన లేదు అని
హిందూధర్మంలో చెప్పబడింది. విగ్రహారాధన మధ్యలో తెచ్చిపెట్టారు అంటారు. వెంటనే
కొంతమంది మంచి వాళ్ళు కూడా సరిగ్గా ఆలోచించకుండా పరిశోధించకుండా విగ్రహారాధన
మధ్యలో వచ్చింది అని వ్రాస్తున్నారు.
భగవంతుడిని
ఆరాధించే పధ్ధతి, విగ్రహ పధ్ధతి వేదమూలంగానే వచ్చింది తప్ప వేదాలలో
లేనిది కాదు.
వేదమూలాన్ని అందిపుచ్చుకొని ఆగమాలు విగ్రహ కల్పన చేశాయి.
విగ్రహమునందు
ఆరాధించడం కేవలం ఒక నమ్మకం కాదు.
‘న తస్య ప్రతిమా నాస్తి’ – భగవంతునికి ప్రతిమ లేదు’ అని కాదు. తరువాతి వాక్యం చూడాలి. తరువాతి
వాక్యం ఏం చెప్తున్నది అంటే ‘సమము, అధికము ఆయనకు లేవు’.
ప్రతిమ అంటే సమానము. వాటికి ప్రతి లేదండీ అంటారు. ‘ప్రతి’ - సమానము,
సరియైనది, సాటియైనది అని అర్థం.
న
తస్య ప్రతిమా నాస్తి’ అంటే ఆయనతో సమానమైనది లేదు అని చెప్పడం తప్ప ఆయనకు విగ్రహం
లేదు అని చెప్పడం కాదు.
విగ్రహాలుగా
భగవంతుడు తనను తాను వ్యక్తం చేసుకున్నటువంటి చోట్లున్నాయి. అట్టి క్షేత్రాలలో
భగవంతుడు భాసిల్లుతూ దివ్య తేజో రూపంలో
ఉంటాడు. కనబడితేనే కానీ మనకు భగవద్భావం కలుగదు గనుక ఆ క్షేత్రాలలో మహర్షులు
తరువాతి కాలాలలో దివ్యమైన విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసినారు. కొన్ని క్షేత్రాలలో
భగవంతుడే విగ్రహ రూపంలో తనను తాను వ్యక్తపరచుకున్నాడు. తిరుమల వేంకటేశ్వరుడు,
ద్వాదశ జ్యోతిర్లింగములలో అనేకములు స్వయంభువములు. ఇవి మానవ నిర్మితలు కావు. మూఢత్వముతో
త్రుణీకరించాకుండా పరిశీలన చేస్తే తెలుస్తుంది.
వృక్ష
రూపంలోనూ, పర్వత రూపంలోనూ భగవంతుడిని ఆరాధించడం కనబడుతుంది.
తులసి మొక్కను విష్ణు స్వరూపం గానూ, మారేడు
శివ స్వరూపంగ వృక్షమును, అశ్వత్థమును త్రిమూర్త్యాత్మక
దేవతగానూ ఉపాసిస్తున్నాం. రావి వేప సంయోగమును అశ్వత్థము అనుట కద్దు. కృష్ణపరమాత్మ,
వృక్షములలో తానూ ఆశ్వత్తవృక్షమని భగవద్గీతలో చెప్పుకొన్నాడు. వాటిలో ఒకానొక
దివ్యత్వం ఉంది. దానిని ఋషులు గ్రహించారు. అందివచ్చేలా ఆరాధనాపద్ధతిని ఏర్పాటు
చేశారు.
ప్రతిష్ఠ
చేసే విగ్రహాలు కేవలం నమ్మకాలు కావు. భారతీయుల విగ్రహారాధన వెనుక విజ్ఞానమున్నది. విగ్రహంలో
భగవచ్ఛక్తిని విశేషంగా గ్రహించి విగ్రహంగా ఆరాదిస్తున్నాం..
స్వస్తి.
No comments:
Post a Comment