Sunday, 13 March 2022

మరణము-పునర్జన్మ

 

మరణము-పునర్జన్మ

https://cherukuramamohanrao.blogspot.com/2022/03/blog-post_2.html

నిన్నటిరోజు ఒక పాఠకురాలు ఒక సందేహము వేలిబుచ్చినది. ఆత్మ ఒక చొక్కావిడిచి వేరొక చొక్కా తోడుగుకోనేటపుడు ఈ కర్మ కాండ అవసరము లేదుకదా అని. నాకు తెలిసినమేరకు , అందుకు సమాధానముగా ఈ మాట వ్రాస్తూవున్నాను. నాలోని అజ్ఞత ఏదయినా వుంటే మన్నిప వేడ్కోలు.

 అమ్మా ఒక విధముగా చూస్తే మరణానికి మరణానికి మధ్యగల విరామసమయమే జీవితము. చాలాకాలం పాటు పరలోక ప్రవాసంలో ఉండటమే చావు. ఇది ఆత్మకు విశ్రాంతి స్థలము. చావులో మొదట మనుష్య జ్ఞానాన్ని కోల్పోతారు.

ఇందువల్లే మరణ సమయంలో శరీరం వికృతం కావటం చూస్తాము. చనిపోతున్నవాడికి ఎంతకష్టం కలుగుతోందోనని అనుకొంటాము. కానీ అది పొరపాటు. నాలుగువైపులనుండి వచ్చే చైతన్యము ముడుచుకుపోయి మస్తిష్కంలో ఒకచోట కూడుతుంది . ఇందువల్ల చైతన్యంలేని మాంసకండరాలు వికృతమవుతాయి. మరణం తరువాత ఆత్మ, మనస్సునూ, బుద్ధిని కూడా తీసుకుని భౌతిక శరీరం లోనుంచి బయటకు వస్తుంది. ఆసమయంలో "వాయుభూతో నిరాశ్రయః" అది వాయువులో లీనమవుతున్నది కావున  దేనినీ  ఆశ్రయించకుండా కంపనాల సహాయంతో సూక్ష్మ శరీరాన్ని నిర్మించుకుంటుంది .   అటుపిమ్మట దాన్ని నిర్ధారిత లోకంలోకి తీసుకుని వెళ్ళుటకు సిద్ధముగా వుంటుంది. కొందరు పుణ్య పురుషులు మరణం తరువాత ఏలోకానికి వెళ్లవలసి ఉంటుందో ఆలోకమును తమ ఆత్మా చేరుటకు మునుపే చూడగలుగుతారు.

పుణ్యవంతుడికి సూక్ష్మశరీరం మరణంతో పాటే తయారవుతుంది. మొదటినుండియే ఈ శరీరాన్ని ఒక ఆవరణ కప్పియుంచి వుంటుంది. అది తేజోమయ శరీరము. దానిని ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరముగా కూడా 'కిర్లియన్ ఫోటోగ్రఫి' లో చూడ వచ్చును.'రేకీ' ని అనుసరించువారు కూడా ఈ 'ఔరా(aura)' ను చూడగలుగుతారు. దానికి  స్థూలశరీరంతో సంబంధము ఏర్పడి ఉంటుంది .మరణం సంభవించేవరకు ఇది ఉంటుంది. శ్రాద్ధకాలంలో పదిపిండాలవల్ల పది ఇంద్రియాలు ఏర్పడతాయి. ఉన్నత జీవుడి ఆత్మ త్వరగానే తయారవుతుంది. ఆత్మహత్య చేసుకున్నవాళ్ల శరీరం ఆలస్యంగా తయారవుతుంది. కానీ జ్ఞాననేత్రం తెరుచుకున్నవాడికి ఈ ప్రక్రియ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జన్మకు నాకా అదృష్టము లేదు.

లోకాలు క్రిందికి ఏడు పైకి ఏడు ఉన్నాయి. అవి వరుసగా  అతల, వితల, సుతల, తలాతల, రసాతలములని, భూ,భువ,సువ,మహత్, జన, తప,సత్య లోకములు. మన కర్మ ఫలాలు వానికి వేసే దారులుగా పోల్చుకొనవచ్చును.

ప్రతి ఒక్కలోకానికి మళ్ళీ ఏడేసి 'స్థర'లు(పొరలు అని అనుకొందాము)ఉంటాయి. వీటినే సాధారణంగా,నలభైతొమ్మిదివాయువులంటారు. చనిపోయిన తరువాత ఆత్మ,పరలోకానికి వెళ్ళి కూడా కర్మానుసారంగా ఒక్కొక్క స్థరంలో ఉండవలసి వస్తుంది . ఒకస్థరంలో ఉండవలసినది ముగిసిపోయినతరువాత కొత్తస్థరంలో కొత్త భోగశరీరం తయారవుతుంది. ఈ విధంగా మనిషి ఎన్నిసార్లు జన్మ ఎత్తితే అన్నిసార్లు చనిపోతాడు. దీనికి అంతంలేదు. ఈ లోకం ఏడేడు లోకాలకు కేంద్రం . ఈ కేంద్రం నుంచి ఆత్మ పైకి లేవనూ వచ్చు క్రిందకు పడనూ వచ్చు. అందుకే యమ నియమ నిష్ఠల నేర్పరచినారు పెద్దలు. మహర్లోకంలో అనుభవించవలసిన కారణము ఏదీ మిగలకపోయినట్లయితే అది క్రమముక్తి మార్గంలో ముందుకు సాగుతుంది. వీటికికూడా పైన ఒకలోకం ఉంటుంది.

ఇన్ని అవరోధాలు అధిగమించిన పిదపనే పునర్జన్మ. కావున శ్రాద్ధ కర్మలు అత్యవసరము. మనసున మంచి నింపుకొనుట కూడా అంతే అవసరము.

నేను నాకు తెలిసిన మేరకు విషయమును అతి క్లుప్తముగా చెప్పినాను.

స్వస్తి.

1 comment: