Sunday, 21 August 2022


ముప్పై మూడు కోటి దేవతలు

https://cherukuramamohanrao.blogspot.com/2022/08/blog-post_21.html

ఈ సనాతన ధర్మమూ వేద చోదితమైనది. వేదము శాస్త్ర యుక్తము. శాసించునది శాస్త్రము. కావున వేద ప్రతిపాదితమైన ఏవిషయమైనా మనకు శిరౌధార్యము.  కొన్ని వేద ప్రతిపాదిత సూత్రములకు, లేక వాక్యములకు, లేక శ్లోకములకు ఎన్నో అర్థాంతరములు ఉంటాయి. సంస్కృత మరియు వేద పండితులు మాత్రమే అట్టి విషయములను విశదీకరించగలరు. మిడిమిడి జ్ఞానముతో ఆ విషయముల అర్థమును గ్రహించుట అనర్థము. అటు వేదమునకు ఇటు వైదిక ధర్మమునకు అపహాస్యమును ఆపాదించినవారమౌతాము.  ఆవిధముగా సనాతన ధర్మం పట్ల ప్రజలకు సందేహము కలిగించిన వారమౌతాము. నేను కూడా పెద్దలవద్ద నా యౌవ్వనదశలో తెలుసుకొన్నది మీ ముందు ఉంచుచున్నాను.

మనము ఈ సమస్యను చాలా క్లుప్తంగా పరిశీలిస్తాము. నేను Stephen Knapp గారి నుండి కొన్ని ఆలోచనలను తీసుకున్నాను.

నాలుగు వేదములూ మన అత్యంత అభివృద్ధి చెందిన నాగరికతకు ప్రతీకలు.

సనాతన ధర్మ పథ చారులుగా మనము ఈ సామాజిక వ్యవస్థను ఏర్పరచుకొన్నాము. సాంసారిక జీవనములో కొన్ని భౌతికమైన ఆవసరాలు కోరికలు, కొన్ని చిన్నచిన్న ఆశలు తీర్చుకొనవలసి వస్తుంది. అవి పరిమితముగా ఉంటే వ్యక్తి ధర్మ పథము పై నడువగలడు. అసలు ఆ కోరికలలో కూడా  కొన్ని దైవానుగ్రహముము చేతనే తీరగలవు. భౌతిక వాంఛల సాఫల్యము సంతృప్తిని ప్రోత్సహిస్తుంది.

దేవుడు ఒకడే అన్నది వేద వాక్యము. ఒక రాజుకు మంత్రి సామంత దండనాథులున్నట్లు

వేరు వేరు దేవతలకు వేరు వేరు బాధ్యతలు అప్పగించాబడియుంటాయి. ఉదాహరణకు అంబిక శక్తికి, లక్ష్మి సంపాదకు, వాణి సకల విద్యలకు, ఇంద్రుడు వర్షమునకు కుబేరుడు ధనమునకు, ఈ విధముగా ప్రతినిధిత్వమును కలిగియుంటారు. ఆయా దేవతల పూజ భక్తుల ఆశయ సిద్ధికి దోహదము చేస్తాయి. అంతే కాకుండా గ్రామదేవతలు ఉంటారు. వారు సర్వ కామితార్థ ప్రదాతలు. వారికి వేద మంత్రములకన్నా చిత్తశుద్ధి కల్గిన మూఢభక్తి ఉంటె చాలును.

ఒక కార్యాలయముతో పైన తెలిపిన  ఈ విధానము పోల్చుటకు చక్కగా సరిపోతుంది కదా! కార్యాలయములో అడుగుపెట్టినవాడు తన పని నెరవేర్చుకొనుటకు చప్రాసీ తో మొదలుపెట్టి చివరకు అత్యున్నతాధికారిని చేరుతాడు. ఇదీ అంతే! ఈ సనాతన ధర్మపరులు అనేక దేవతల పూజించుటకు కారణమిదే! ఎందఱో ఋషులు మునులు రాజులు రాకాసులు తమ అబీప్సిత సిద్ధి కొరకు ఒకదేవత కొరకు తపమాచరించి, ఆదేవత ప్రత్యక్షమై వేరొక దేవత ఆగ్రహము పొందవలెనని సూచించితే అట్లు ఆ భక్తుడు చేసి తన మనోభీష్టమును సిద్ధింపజేసుకొనుట మనకు తెలిసిన విషయమే!

ఇక్కడ మరొక విషయము చెప్పవలసి ఉంది. మనము శివ లేక విష్ణువిగ్రహములు వేరువేరు క్షేత్రనులలో వేరు వేరు రూపములలో కలిగియున్నాము. పురాతన దేవాలయములలో ప్రతిష్ఠిప బడిన విగ్రహములలో కొన్ని స్వయభువములు. కొన్ని దేవతలు, దైవజ్ఞులగు మహర్షులు ఆగమశాస్త్ర విధానముతో ప్రతిష్ఠింప బడినవి ఉన్నాయి. అందుచే అవి అలౌకిక మహత్తును కలిగియుంటాయి. అవి కూడా భక్తాభీష్టములను నేరవేర్చుతాయి. ఈ మూర్తి పూజ యొక్క సౌలభ్యము ఏమిటంటే దేవుని ఎప్పుడైనా ఎక్కడయినా చిత్తశుద్ధితో పూజించుకొనవచ్చును. ఏ ధర్మము లేక మతము నందు కూడా ఈ సౌలభ్యము కనిపించదు.

ఇప్పుడు ౩౩ కోటి దేవతలు అన్న మాటకు సంగ్రహమగు అర్థమును ప్రతిపాదించే ప్రయత్నము చేద్దాము. కోటి అన్న మాటకు అర్థమును శబ్ద కోశమున పరిశీలించితే ‘100 లక్షలు,అంచు, సమూహము అన్న అర్థములు కనిపిస్తాయి. అసలు కోటిగాడు అంటే కాపలాదారుడు అనికూడా అర్థము ఉన్నది.

 కోటి అన్న మాటను ‘వర్గము’ సమూహమునకు ప్రతీకగా బంధుకోటి, జీవకోటి కి  వాడుతాము. ఉచ్ఛకోటి అంటే ఉచ్ఛమైన వర్గమునకు చేరిన వారు అని అర్థము.

 వేదపురాణములు తెలుపునవి త్రయత్రింశతి కోటి (33 కోటి ) దేవతలు అంటే ముప్పది ముగ్గురు దేవతల సమూహము అని అర్థము. సంస్కృతమున సంఖ్యా ముందు సంఖ్యా వాచకమున ఏకవచన ప్రయోగము కద్దు. యజుర్వేద, అథర్వణ వేద, శతపథ బ్రాహ్మణులు మొదలైన ప్రాచీన కృతులందు 33 విధముల దేవతలను తెలియజేయుట జరిగినది.

హిందూ గ్రంధములేకాదు  బౌద్ధ, పార్శీ మొదలైన గ్రంధములలో కూడా ఈ  33 దేవతావర్గముల ప్రసక్తియున్నది. బౌద్ధుల దివ్యవాదము మరియు సువర్ణప్రభాస సూత్రములందు ఈ విషయప్రస్తావన ఉన్నది.

ఇపుడు ఈ 33 గురు దేవతల పేర్లను వారు ఏఏ సమూహములకు చెందినవారో చూద్దాము.

ఆ వర్గములు:- వసువులు 8, రుద్రులు 11, ఆదిత్యులు 12 మొత్తం కలిపితే ముప్పది ఒకటి. వీటితో పాటు ఇంద్రుడు , ప్రజాపతి (బ్రహ్మ) అనే ఇద్దరితో కలిపి 33 అవుతుంది. కొందరు ఇద్ర బ్రాహ్మలకు బదులుగా అశ్వినీ దేవతలను కలుపుతారు. అపుడు ప్రముఖులగు బ్రహ్మేంద్రులను విడువ వలసి వస్తుంది. నిజానికి వారు ప్రధాన దేవతలు కదా!

 వసువులకు ప్రాతినిధ్యము విష్ణువు వహించితే రుద్రులకు శివుడు ప్రాతినిధ్యము వహించుతాడు. అట్లే ఆదిత్యులకు సూర్యుడు. అంటే ఈ 33 మంది 3+2=5 మంది అగుచున్నారు. 

శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే l

శివష్య హృదయం విష్ణుః విశ్నిశ్చ హృదయం శివంll

కావున ఇద్దరూ ఒకటయితే  మనకు నిజానికి 1+2 అనగా హరిహర బ్రహ్మ ఇంద్ర అన్న ముగ్గురు దేవతలౌతారు. దేవాధిపతి ఇంద్రుడు. అతని ఆవాసము స్వర్గము. పుణ్యాత్ములు వారి పుణ్య ఫలము తీరేవరకూ స్వర్గ వాసము చేస్తారు. ఆయనకు ఊర్ధ్వ లోకము బ్రహ్మ విష్ణు మహేశ్వరులది.ఈ ముగ్గురి ప్రతిరూపమే పరబ్రహ్మము. ఆయనే విశ్వాత్మ, పరమాత్మ. అంటే దేవుడు ఒక్కడే! వర్గీకరణ అంతా భక్తజన సౌలభ్యము కొరకే!

ఇపుడు ద్వాదశాదిత్యులు అష్ట వసువులు ఏకాదశ రుద్రులు ఎవరెవరో చూదాము.

ద్వాదశాదిత్యులు :-  1. త్వష్ట, 2. పూష. 3.వివస్వాన్ 4. మిత్ర 5. ధాతా 6. విష్ణువు 7. భగ

8. వరుణ  \9. సవిత 10. శక్ర 11.అంశ 12. ఆర్యమ.

ఏకాదశ రుద్రులు :- 1. మన్యు  2.  మను  3. మహినస 4. మహాన్ 5. శివ 6. ఋతధ్వజ

7. ఉగ్రరేతా, 8 . భవ 9. కాల 10. వామదేవ 11. ధృతవృత. 

అష్టవసువులు :- 1. ధరా 2. పావక 3. అనిల 4. ఆప 5. ప్రత్యుష 6. ప్రభాస 7. సోమ 8.  ధృవ.

మిగిలిన ఇరువురు :- 1. ఇంద్ర,  2. ప్రజాపతి.

 వీరే త్రయత్రింశతి 33 కోటి దేవతలు.

మిగిలినది మరొకమారు.........

దైవము అంటే దివ్యత్వము కలిగిన వాడని అర్థము. అంటే ఆయనకు మనలాగ భౌతికముగా కనిపించే రూపాలు వుండవు. అయన దివ్యశక్తి సంపన్నుడు. ఈ చరాచర జీవ వస్తు సముదాయమునకు సృష్టికర్త ఆయనే! ఆ శక్తుల మూలమున సృష్టిలోని సమస్తాన్ని రక్షించుటయే కాదు తనలో లీనము

చేసుకొనుట కూడా ఆయన కర్తవ్యమే! అదేకదా పోతన తన ఆంధ్రభాగవతములో ఈ విధముగా తెలిపినాడు:

ఒకపరి జగములు వెలి నిడి

యొకపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ దానై

సకలార్థ సాక్షి యగు న

య్యకలంకుని నాత్మబూని అర్చి భజింతున్

సృష్టికాలమున సమస్త లోకములను దర్పణ ప్రతిబింబితము లైనటులు వెలికి జూపి ప్రళయకాల మందు తన లోనికి  లయము చేసుకొనుచు ఉభయము దానై, సకలవిషయములకు సాక్షియై, శుద్ధసత్వస్వరూపుడై, ఆత్మ స్వరూపుడగు ఆ పరమాత్ముని ధ్యానించెదను.

ఇందుగల గూఢార్థమును ఒకపరి పరికింతము.  ఒకపరిజగముల వెలినిడి అనగా "ముఖాభాసకోదర్పణేదృశ్యమానో ఖత్వాత్ప్రుధక్త్వే నైవాస్తివస్తుణతాదర్పణ" ప్రతిబింబము, తన ముఖముకంటె వేరువస్తువు కానటుల, “యథాదర్పణాభావ, ఆభాసహానౌ ముఖం విద్యతే కల్పనా హీనమేకం" దర్పణము పాయినచో ఆ అభాసము ఏవిధముగా మనకు కానరాదో, అదేవిధముగా భావాభావముభయము దానే యగుచున్నాడో, అట్టి సర్వసాక్షి "మనసః సాక్షీ బుద్థేః సాక్షీ - ప్రాణస్యద్రష్టాతమసోద్రష్టా" అను శ్రుతి ప్రకారము సూర్యునివలె సర్వసాక్షి యగుచున్నాడో ఆ పరమాత్మ ఏ జగత్ సృష్టి కర్త భర్త, హర్త. అది ఆయన కర్తవ్యము.

సరస్వతీ దేవి వాక్కునకు అధిష్ఠాన దేవతయై సమస్త వాఙ్మయమును రక్షిస్తుంది. లక్ష్మీ దేవి సంపదకు, పార్వతీదేవి సౌభాగ్యానికి, శక్తికి రక్షణకు అధిదేవతలు. కాబట్టి ఇంతమంది దేవతలా అనుకునే బదులు ప్రకృతిలో ఉన్న ఒక్కొక్క విభాగానికీ ఒక్కొక్కరిని అధిష్ఠాన దేవతలుగా తనను తాను విభజించుకొని మనకు ఆరాధనా సౌలభ్యమును ఏర్పరచినాడు ఆ ప్రత్యగాత్మ.  ఈఆరాధనా విధానమునే సనాతన ధర్మము మనకు నిర్దేశించినది. నిజానికివి వేరు రూపాలు కాదు. ఆవిధముగా ఏర్పరచి మనకు అనుష్ఠాన

ప్రదాన దేవతలుగా ఏర్పరచి సాధనా సౌలభ్యము కలిగించినారు. వేదాలు మనకు దేవతలు, ఊహాజనిత లేదా పౌరాణిక రూపములు కాదు. సార్వత్రిక వ్యవహారాల యొక్క వివిధ అంశాలను నిర్వహించే పరమ సంకల్పశీలురు వారు. వారు ప్రకృతి యొక్క వివిధ శక్తులను మనకు ఆరాధింప  సూచించుటయే కాక  వానిని నియంత్రిస్తారు. అందువల్ల, అవి మన ఉనికి యొక్క భౌతిక, సూక్ష్మ లేదా మానసిక స్థాయిలలో లోపల మరియు వెలుపల కనిపిస్తాయి. ఈ విధంగా, ఒక అతీంద్రియుడు ప్రతి అంశం వెనుక ఉన్న దానిని చూస్తాడు

ఈ దేవతల పేర్లు వారి నెలవు లేదా మన సౌలభ్యము కొరకు కార్యాలయము అనుకొందాము, దానికి అధిదేవత ను ఆపేరుతో పిలుస్తాము. ఉదాహరన్స్కు చంద్రుడు,. చంద్రుడు చంద్రలోకమునకు అధిదేవత అంతేకానీ మనకు కనిపించే చంద్రగ్రహము చంద్రుడు కాదు. ఒక దేశమునకు అధ్యక్షుడు, ప్రధాని (Premiar) ఇతనో అట్లు. ఈ పసవికి కొన్ని అధికారాలు, కొన్ని అనుగ్రహాలు చేతిలో ఉంటాయి. ఆయా ఈప్సిత సిద్ధులకు ఆయా దేవతలను పూజించుట జరుగుతుంది. ఒక కార్యాలయమును తీసుకోనా అంతే కదా! అన్నే ప్రధాన అధికారే చేయదు కదా!

కావున అవసరానుకూలముగా ఈ అధిదేవతా విభజన జరిగి వారివారి కి ప్రసాదించిన శక్తులను భక్తులకు ఉపయోగించుచుంటారు. వారు సార్వత్రిక వ్యవహారాల యొక్క వివిధ అంశాలను నిర్వహించే పరమ సంకల్పం యొక్క ప్రతినిధులు. వారు ప్రకృతి యొక్క వివిధ శక్తులను కూడా సూచిస్తారు మరియు నియంత్రిస్తారు. అందువల్ల, అవి మన ఉనికి యొక్క భౌతిక, సూక్ష్మ లేదా మానసిక స్థాయిలలో లోపల మరియు వెలుపల కనిపిస్తాయి. ఈ విధంగా, ఒక అతీంద్రియుడు ప్రతి అంశము వెనుక ఉన్న దానిని చూస్తాడు

మరొక ఉదాహరణ ఏమిటంటే, మీరు ఒక పెద్ద కర్మాగారంలోకి వెళ్లినప్పుడు, మీరు చాలా మంది కార్మికులు మరియు వారు చేస్తున్నదంతా చూస్తారు. ఫ్యాక్టరీలో ఏం జరిగినా ఈ కార్మికులే కారణమని మీరు మొదట్లో అనుకోవచ్చు. అయితే, కార్మికుల కంటే ఫోర్‌మెన్, మేనేజర్లు, ఆపై ఎగ్జిక్యూటివ్‌లు చాలా ముఖ్యమైన కార్య నిర్వాహక బృందము. వీరిలో మీరు వివిధ స్థాయిలలో అధికారము ఉన్న వ్యక్తులను కనుగొంటారు. ఉత్పత్తుల రూపకల్పనకు ఎవరో ఒకరు బాధ్యత వహిస్తారు. మరొకరు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లేదా ప్రధాన అకౌంటెంట్ కావచ్చు. మరొకరు సిబ్బందికి బాధ్యత వహించవచ్చు, మరొకరు నిర్వహణ బాధ్యతను కలిగి ఉండవచ్చు.

మిగిలినది ఇంకొకసారి.........

Friday, 19 August 2022

నిర్వాణ షట్కము (ఆది శంకరాచార్య)

 

నిర్వాణ షట్కము (ఆది శంకరాచార్య)

https://cherukuramamohanrao.blogspot.com/2022/08/blog-post_19.html

ఆది శంకరాచార్యులు రచించిన నిర్వాణ షట్కం సంస్కృతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన పరమార్థ సౌలభ్య బోధనా సంపుటి. నిర్వాణమునకు మోక్షము అన్న అర్థమును అన్వైన్చుకోన వచ్చును. అప్పుడు మోక్షము అంటే ఏమిటి? అన్న ప్రశ్న ఉదయిన్చుతుంది. తన అనిర్వచనీయమైన ఆత్మయే పరమాత్మ. ఆతాదాత్మ్యమే శివము. అడికలిగినవాడే శివుడు. ఈ జటిలమైన విషయమును ఎంత సుబోధకముగా కలితుగమున పరమ గురువు, ఆదిగురువు, జగద్ద్గురువాగు శంకరులవారు ఎంత సులభ హ్రాహ్యముగా చెప్పినాడో చూడండి.  

మనోబుధ్యహంకార చిత్తాని నాహం

శ్రోత్రం జిహ్వాన ఘ్రాణనేత్రం

నచార్వ్యోమ భోమిర్నతెజోనవాయుః

చిదానందరూపః శివోహం శివోహం

మనసు, బుద్ధి, నేను నాది అనే తపన అంటే అహంకారము, చిత్తము,ఇవి నేను కాను. కర్ణము,జిహ్వ,ఘ్రాణము ఇవియును నేను కాను.పృథివ్యాపస్తేజోవాయురాకాశములు నేను కాను.అంటే పంచ భూతాత్మకమైన పంచకర్మేంద్రియములకు పంచజ్ఞానేంద్రియములకు విధేయుడను కాను. చితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను. సచ్చితానందానికి సులభమైన నిర్వచనము ' సత్ అంటే సత్యము చిత్ అనిన జ్ఞానము -పర సుఖమే ఆనందము'.

నచ ప్రాణ సంగో నవి పంచ వాయుః

నవా సప్తధాతుర్నవా పంచ కోశః

నవాక్పాణిపాదౌ నచోపస్థ పాయుః

చిదానందరూపః శివోహం శివోహం

పంచవాయువులు:

ప్రాణ :    శ్వాస ద్వారా హృదయానికి తర్వాత అన్ని కణాలకు చేరే వాయువు

అపాన : ఊపిరితిత్తులు, విసర్జన అవయవాలద్వారా వ్యర్ధ పదార్దములు పంపే వాయువు

వ్యాన:  శరీరం యొక్క సంకోచ వ్యాకోచాలకు కారణం

 ఉదాన: వాక్కు రూపంలో ఉండేవాయువు

  సమాన:  జీర్ణమవటానికి ఉపయోగపడే వాయువు

ఉప ప్రాణములు:

 నాగ : త్రేన్పు గా వచ్చే గాలి

 కూర్మ : రెప్పవేయటానికి కారణమైన గాలి

 కృకల :  తుమ్ము

 నంజయ: హృదయ నాడులను మూస్తూ తెరుస్తూ ఉండే వాయువు.

 దేవదత్తము  : ఆవులింత లోని గాలి

ఐదు వాయువులు,ఐదు ఉపవాయువులు మన శరీరమును నిర్దేశించుతాయని శాస్త్ర వాక్యము. ప్రాణ వాయువు (శ్వాస) లేనప్పుడు చనిపోయినట్లు గుర్తిస్తారు.ధనంజయ వాయువు చనిపోయిన తర్వాత కూడా ఉండి శరీరం ఉబ్బటానికి కారణం అవుతుంది అని శాస్త్రము చెబుతుంది.

సప్త ధాతువులు:  రక్తమాంసమేధోస్థిమజ్జారసశక్రములు  (రక్తము, మాంసము, మేధ, అస్తి, కొవ్వు, మజ్జ, శక్రం). ఇందులో రక్తము మాంసము ఎముకలు క్రొవ్వు అందరికీ తెలిసినవే. మిగతావి ఆయుర్వేదపరముగా ఈ విధముగా విశ్లేశిన్చుకోనవచ్చును.

మజ్జ అంటే ఎముక లోపలవుండే గుజ్జు, దీనినే bone marrow అని ఆంగ్లములో అంటారు. పూర్వము 'నీ తస్సదీయ' అనేమాట సాధారణంగానూ సినిమాలలోనూ (రేలంగి వాడినట్లు గుర్తు) వాడేవారు. 'తస్స' అంటే 'మజ్జ'యే. రసము అనగా  మిక్కిలి పలుచగా ఉండును. చిన్న ప్రేగుకి సంబందించిన రసాయనుల ద్వారా హృదయముకి చేరి అచ్చట వడపోయబడి స్థూలసూక్ష్మ భాగములుగా విభజింపబడును . అందు స్థూలభాగము సర్వశరీరం నందు గల రసాయనుల ద్వారా వ్యాపించుతూ రక్తధాతువుని పోషించుచుండును. మేధస్సు అన్న మాటకు బుద్ధి, అసాధారణ ధారణా మొదలగు అర్థములు మనకు తెలిసినవే! ఆయుర్వదపరముగా సప్త దాతువులలోని మేధకు అర్థము విధముగా ఉన్నది  ఇది నెయ్యి వలే తెల్లగా ఉండును. ఇది కడుపులోను మరియు చిన్నచిన్న ఎముకలకు అంటియుండు కొవ్వుపదార్థం . మాంసము నందలి సూక్ష్మ భాగములచే ఇది పోషించబడును. ఇది కూడా స్థూల, సూక్ష్మ , మల భాగములుగా విభజించబడి ఎముకలను పోషించుచుండెను . ఇది మాంసధాతువు నుండి ఏర్పడును . ఆయుర్వేదము ప్రకారము అస్థి మేధోధాతువుచే పోషింపబడుచూ శరీరం యొక్క పటుత్వమునకు ప్రధాన హేతువుగా ఉంటుంది. ఇది 3 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఇది మజ్జా ధా తువుని పోషించుతూ ఉండును. ఇది మేధోధాతువు వలన ఏర్పడును . శక్రము అనగా తెల్లనిది. దీనినే శుక్రము అని కూడా అంటారు. ఇది శరీరం నందు అంతటా ఉండు మజ్జాధాతువు యొక్క సూక్ష్మభాగం . ఎముకలలో ఉండు అతి సూక్ష్మ రంధ్రముల ద్వారా పైకి వచ్చి రక్తముతో కలిసి సిరల గుండా ప్రవహించుచూ సూక్ష్మ శుక్రద్రవము ను పోషింపుచూ ధమనీ సహాయంతో బీజకోశములలోకి చేర్చబడును . ఇది స్థూల సూక్ష్మ అను రెండు భాగములుగా విభజింపబడును. అందు స్థూలభాగం శుక్రమును , సూక్ష్మ భాగం ఓజస్సు పోషింపబడును. ఇది మజ్జా ధాతువు వలన ఏర్పడును .

  పంచ కర్మేంద్రియములు : వాక్పాణిపాదోపస్థపాయువులు. అంటే మాట-వాక్కు, చేయి-చేత,పాదములు- కాళ్ళు,ఉపస్థ-అనగా, జననేంద్రియము, పాయువు-గుదము, ఉపస్థాపాయువు(గుదము)లు అంటే పురీష శౌచ ద్వారములునేను, పైన తెలిపినవేవీ కాను. చిదానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను.

రేపు మరి రెండు శ్లోకములథిఒ.....

నపుణ్యం నపాపం సౌఖ్యం దుఃఖం

మంత్రో నతీర్థం నవేదా నయజ్ఞ్యాః

అహం భోజనం నైవ భోజ్యం నభోక్తా

చిదానందరూప శ్శివోహం  శ్శివోహం

నాకు పుణ్య పాపములులేవు. సుఖ దుఃఖములు లేవు. మంత్ర తీర్థ దాన యజ్ఞాలులేవు. నేను భోజన క్రియనుగానీ ,భోజనమునుగానీ,బుజించేవాడినిగానీ కాదుచితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను. చిట్ అన్న మాటకు నేను జ్ఞానము అన్న మాతకనా ప్రజ్ఞానము అన్న అన్వర్తమును చెప్పుకొంటాను.చిత్అన్న పదమునకు రూపమునిస్తే రూపమే శివుడు. ఆరు శ్లోకముల సారమును గ్రహించి తదనుగుణముగా ఎంత త్వరగా  శివోన్ముఖులమైతే నిర్వాణమును అంత త్వరగా చేరువౌటాము. అసలు జనన మరణ రాహిత్యమే కదా నిర్వాణము.

నమేద్వేష రాగౌ నమేలోభ మోహౌ

మదోనైవ మేనైవ మాత్సర్యభావః

నధర్మోనచార్థోనాకామోనమోక్షాః

చిదానంద రూపం శివోహం శివోహం

నాకు రాగ ద్వేషములు లేవు.లోభమోహములు లేవు. మదమాత్సర్యములు లేవు.ధర్మార్థకామ మోక్షాలు లేవుచిదానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను. నేను శివుడను అనగా నేనే  చైతన్యము. ఆనంద స్వభావము యొక్క సర్వోన్నతమైన ఐశ్వర్యాన్ని. నేనే శివుడను అనగా  ఐశ్వర్యవంతుడను. నిజానికి ఐశ్వర్యము అన్న మాటను నేటి వాడుక భాషలో సిరి అనగా ధాన్యధనకనకవస్తువాహనసస్యకేదారాలకు వాడుతారు. ఐ సరికాదు. ఈ జగత్తున నిండియున్న సకల చరాహర సంపత్తియంతా ఐశ్వర్యమే! అసలు ఐశ్వర్యమంటే ఈశ్వరీయమే! దానికి అధిపతే ఈశ్వరుడు లేక శివుడు.

రేపు చివరి రెండు శ్లోకములు.......

నమృత్యుర్నశంకానమే జాతిభేదః

పితానైవమేనైవ మాతానజన్మాః

నబంధుర్నమిత్రంగురుర్నైవశిష్యః

చిదానంద రూపం శివోహం శివోహం

మృత్యువు,భయము లేక సందిగ్ధత,జాతిరీతులు,తల్లిదండ్రులు,అసలు జన్మమే, బంధువులు మిత్రులు,గురువు,శిష్యులు ఏమీ లేవు.చితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను.

మరి నేనెవరు ?

అహం నిర్వికల్పో నిరాకార రూపో

విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం

నవాబంధనం నైవ ముక్తిర్నబంధః

చిదానంద రూపం శివోహం శివోహం

వికల్పము : మతి భ్రమ, ఉల్లంఘనం జ్ఞాపకశక్తి, ఆలోచన తగ్గిపోవు లక్షణము కలిగిన మానసిక స్థితి

        అస్తవ్యస్తం, తారుమారు.

నేను వికల్పములకు అతీతుడను. ఎటువంటి వికల్పములూ నన్నంటవు.నేను సర్వవ్యాపిని. కావున నిరాకారుడను. నిరాకారుడనుకావున నేను నిరంజనుడను (దోషము లేని వాడిని).నాకు ఏవిధమైన ఇంద్రియ సంబంధము లేదు.నాకసలు బంధమూ లేదు మోక్షము లేదు.చితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను.

ఆత్మ ను గూర్చి ఇంత వివవరంగా విశదంగా విపులంగా విలేవారీగా విజ్ఞతతో అబుద్ధికి గూడా బోధపడు విధముగా చెప్పిన ఆది శంకరులకు అంజలి ఘటించుట తప్ప అన్యము చేయ నశక్తుడను.

భావము నందు దోషమును భాషన గల్గిన నాదులోటులున్ 

కేవలమంచునెంచి బహు కూరిమి తోడ పఠించి ప్రేమతో

దీవనలిచ్చుచున్ నిగుల దివ్యము భవ్యము దీప్తివంతమై

 జీవితధన్యతన్ గలుగ జేయు మహాత్ముల నాలకించుడీ

అజ్ఞానాత్ విస్మ్రుతే భ్రాంత్యా

యన్యూనమధికం కృతం

తత్సర్వం క్షమ్యతాం దేవ

పరమేశ్వర నమోస్తుతే

 స్వస్తి