తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయము
https://cherukuramamohanrao.blogspot.com/2022/10/blog-post.html
తాడిపత్రి బుగ్గ
రామలింగేశ్వరస్వామి ఆలయము
https://cherukuramamohanrao.blogspot.com/2022/10/blog-post.html
బుగ్గ రామలింగేశ్వర స్వామి
దేవాలయము భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో
పెన్నా నది డ్డున ఉంది. ఈ ఆలయము తాడిపత్రి రైల్వే స్టేషన్ నుండి 4 కి.మీ. దూరములో
ఉన్నది. ఈ ఆలయము 1490 మరియు 1509 మధ్య నిర్మించబడియుండవచ్చునని అంచనా! బ్రిటిష్ పాలనా కాలము వరకు ఈ ప్రాంతము ఎన్నియో
ఉడుదుడుకులకు గురియైనది. జిల్లాలో ముస్లిం సైన్యాలు కొల్లగొట్టని అతి కొద్ది
దేవాలయాలలో ఇదియును ఒకటి. వారి దాష్టికమునకు గురికాని గుడి బహు అరుదు. లింగము
ప్రతిష్ఠించబడిన ప్రదేశంలో గర్భగుడిలోకి నీరు ఎల్లప్పుడూ ధారగా పడుతూ ఉండే ఈ చోద్యము చూచి తీరవలసినదే! ఇటువంటి అద్భుతములకు
నిలయము ఈ భారత భూమి మాత్రమే! తురుష్కులు బహుశ ఎంత ప్రయత్నించినా స్వభావ సిద్ధమగు ఈ
అపురూప వాస్తవమును రూపుమాపలేకపోయినారు. ఈ జలధార కారణముగానే ఈ ఆలయానికి ఈ పేరు వచ్చింది. శ్రీ బుగ్గ రామలింగేశ్వర
స్వామి ఆలయాన్ని 16వ శతాబ్దంలో విజయనగర రాజుల సైన్యాధ్యక్షుడు రామలింగ నాయుడు నిర్మించినారని చెబుతారు. ఆలయాన్ని
నిర్మించడానికి శిల్పి ఎల్లంచారిని వారణాసి నుండి తీసుకువచ్చినట్లు వినిస్మృతులు(Records) సూచిస్తున్నాయి. పురాణాల ప్రకారం, ఋషి పరశురాముడు నివసించిన మరియు ధ్యానం చేసిన ప్రదేశముగా
చెప్పబడినది.
ఈ శివలింగము నిస్సందేహముగా
స్వయంభూలింగమే! పరశురాముని కాలమునకే ప్రాధాన్యత సంతరించుకొని ఉన్నదంటే ఇది అత్యంత
ప్రాచీనమైనదని చెప్పవచ్చును. ఈ దేవాలయము అనగా ఈ
స్వయంభూలింగము ఎంతో మహిమాన్వితమైనదని భక్తుల నమ్మకము. అందమైన శిల్పకళా నిలయము ఈ
దేవాలయము. జిల్లా కేంద్రమగు అనంతపురమునకు 57కిలోమీటర్ల దూరంలో కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులకు దగ్గరగా తాడిపత్రి ఉంది.
ఆ ఆలయ విశేషాలను గూర్చి
కాస్త తెలుసుకుందాం. ఇక్కడ పెన్నానది తీరంలో త్రేతా యుగంలో శ్రీరామ చంద్రుడి చేత
ప్రతిష్ఠింపబడిన లింగముగా చెబుతారు కానీ ఇది రామేశ్వర లింగము వలె సికతముతో అనగా
ఇసుకతో చేసినది కాదు. రాములవారు శిల్పులను రప్పించి నీటి ధారకు అనుకూలమగు లింగ
ప్రతిష్ఠ చేయించుటకు, ఆయనకు అయోధ్య చేర సమయము చాలదు. పైపెచ్చు ఈ లింగము
విలక్షణముగా ఉండుటచే ఇది రాములవారి ప్రతిష్ఠ కాకపోవచ్చును. రాములవారు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణములలో చెప్పబడి
లేదు. రాములవారు పరమేశ్వరుని లింగమును హనుమద్లక్ష్మణసీతా సహితముగా దర్శనము
చేసుకొని యుంటే యుండ వచ్చును.
విజయనగర రాజులు అంటే కళలకు
అత్యంత గౌరవమిస్తారు. వారి పరిపాలనా కాలంలో ఎన్నో కట్టడాలను కళాత్మకంగా నిర్మించిన
చరిత్ర వారిది. ఈ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని కూడా అంతే అద్భుతమైన
శిల్పకళతో నిర్మించిన ఘనత వారికే ఉంది. భక్తులు గర్భగుడిలోని ఆ పరమేశ్వరుని దర్శించినపుడు
ఎంతటి భక్తి పారవశ్యానికి లోనవుతారో అలాగే ఆలయ కుడ్యముల మీదున్న ఈ శిల్పాలకు అంతే
మంత్రముగ్ధులవుతారు. పైన తెల్పిన శిల్పకారుడు సుమారు 650 మంది సహాయంతో కొన్ని
సంవత్సరాల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు. ఈ ఆలయంలో శిల్ప
సౌందర్యంతో బాటు ఈ ఆలయానికున్న మరో ప్రత్యేకత ఇక్కడి శివలింగం. అన్ని చిన్న పెద్ద
దేవాలయాలలో ఉన్నట్లుగా కాకుండా, ఒక ప్రత్యేక ఆకారంలో ఉంది.
అలాగే ఏడాదిలో 365 రోజులు జలధార ఊరుతునే ఉంటుంది. బుగ్గ అంటే నీటి ఊట. వర్షాలు
లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా ఇక్కడ బుగ్గ ఊరుతూనే ఉంటుంది. ఈ
పుణ్యక్షేత్రం పూర్తిగా నల్లరాతితో నిర్మించబడినది.
పేరుకు పరమశివుడి దేవాలయమే
అయినా ఈ గుడిలో మిగిలిన దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. ఈ బుగ్గ రామలింగేశ్వర
ఆలయం పెన్నానది పడమటి తీరంలో ఉంది. ఆ ఆలయానికి శిథిలమైన మూడు ప్రాకార
గోపురాలున్నాయి. శిథిల బాగాలు ఆలయ ప్రాకారానికి వెలుపల బాగంలో చెల్లా చెదురుగా పడి
ఉన్నాయి. ప్రధాన ద్వారం నుండి లోపలికి వెళ్ళేటప్పుడు కుడిప్రక్కన గోపురంలో భాగంగానే
కోదండ రామ స్వామి ఆలయము, ప్రధాన గోపురానికి ఎదురుగా దక్షిణ ముఖ ద్వారంతో
రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం పడమటి దిశ ముఖద్వారం కలిగి ఉంది. వీరభద్ర స్వామికి
మరో చిన్న ఆలయం కూడా ఉంది. ఇక్కడ స్థానికంగా దొరకే నల్లరాతితో ఆనాటి శిల్పులు
అద్భుతమైన శిల్ప సంపదకు ప్రాణం పోసీనారు. కొంత ఖజురహో శైలిని మరికొంత హంపీ
శిల్పకళను చూడవచ్చు ఇచ్చట. ఈ దేవాలయమునకు మూడు ప్రవేశ ద్వారాలున్నాయి.
ఇక్కడ మండపం నాలుగు
స్థంభాలమీద నిర్మించబడి, ప్రతి స్థంభం తిరిగి నాలుగు చిన్న స్థంభాలమీద నిర్మించబడి
వున్నది. పెన్నా నదీతీరంలో వెలసిన ఈ దేవాలయం వెనుకన స్మశానం ఉంది. ఆలయ నిర్మాణం
జరిగే సమయంలో కాశీ మాదిరిగా ఇంకొక దేవాలయం నిర్మించటం అరిష్టమని పండితులు
చెప్పటంతో మాహాద్వారం మరియు గోపుర నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేసీనారు. ఇక్కడ
శివుడు స్వయంభువు అని ముందే చెప్పుకొన్నాము.
అందుకే నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఆపినా దోషం ఉండదన్నారు. ఆలయ
ప్రాంగణంలో ధ్వజస్ధంభం, ముఖమండపం, కళ్యాణ
మండపం, అంతరాళం, గర్భగుడి అనే ప్రధాన
విభాగాలున్నాయి. ఇంకా ఇదే ఆవరణలో కుడివైపున వీరభద్ర చండీ ఆలయాలు కళ్యాణమండపం, రామాలయం పార్వతీ దేవి ఆలయాలున్నాయి. ముఖమండపంలోని స్ధంభాలను
తాకితే సప్తస్వరాలు ప్రతిధ్యనిస్తాయంటారు. మండపాలపై రాతిపుష్పాలు, ఆలయ కుడ్యాలపై విజయనగర పాలకుల రాజముద్రిక అయిన వరాహం, సూర్యచంద్రులు, కత్తి
కనిపిస్తాయి. కుడ్యాలపై నాట్యకారిణల నృత్యభంగిమలు కనువిందు చేస్తాయి. మరియు
శ్రీమహావిష్ణువు దశావతారాలను మనోహరంగా మలచినారు శిల్పులు. ప్రతి సంవత్సరం మాఘమాసం
బహుళ అష్టమి మొదలు ఫాల్గుణమాసం శుద్ధ తదియ వరకు 11 రోజులపాటు రామలింగేశ్వరుని
బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
పెన్నకు నీధనుస్సునకు పెద్ద
నిబంధము కానవచ్చులే
ఎన్నగ నీ పినాకమది ఏర్పడె
చూడ పినాకినౌచు తా
తిన్నగచేర పెన్న దగు తీరము
లందున తిష్ఠ వేయుచున్
మన్నన పొందినావుభవ మాకగు కామన లెల్ల తీర్చుచున్
పెన్నా తీరమున కొన్ని
దేవాలయాలు: రామ తీర్థం, సోమశిల, ఘటిక సిద్దేశ్వరం, నెల్లూరు మూలస్థానేశ్వర ఆలయము, దానవులపాడు
దేవుని కడప,నందలూరు.పుష్పగిరి, ఈ విధముగా
చెప్పుకొంటూ పోతే చెంతాడే అవుతుంది. ప్రతి శివాలయమూ భక్త జన సందోహముతో రద్దీగానే
ఉంటుంది.
స్వస్తి.