భగవద్గీత 1వ అధ్యాయము 14వ శ్లోకము -ఒక విమర్శ
https://cherukuramamohanrao.blogspot.com/2022/10/1-14.html
తతః
శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ ।
మాధవః
పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ।। 1 - 14 ।।
ఆ
తరువాత, పాండవ సైన్యం మధ్య లోనుండి, తెల్లని గుఱ్ఱములు
పూన్చి ఉన్న ఒక అద్భుతమైన రథం లో కూర్చుని ఉన్న, మాధవుడు మరియు
అర్జునుడు తమ దివ్య శంఖాలని పూరించారు.
కౌరవ
సైన్య పక్షం నుండి వచ్చిన ధ్వని సద్దుమణిగిన తరువాత, శ్రీ కృష్ణ పరమాత్మ మరియు అర్జునుడు,
అద్భుతమైన రథంలో కూర్చొని వుండి, భయ రహితులై,
తమ తమ శంఖాలని శక్తివంతంగా పూరించారు. దీనితో పాండవ పక్షంలో కూడా
యుద్ధానికి ఉత్సాహం రగిలింది.
సంజయుడు
శ్రీ కృష్ణుడికి 'మాధవ' అన్న పేరు వాడినాడు. 'మా'
- సౌభాగ్య దేవతను సూచిస్తుంది; 'ధవ' - అంటే భర్త. శ్రీ కృష్ణుడు తన విష్ణు మూర్తి రూపంలో, అదృష్ట/సౌభాగ్య
దేవత అయిన లక్ష్మీ దేవికి భర్త. సౌభాగ్య దేవత యొక్క అనుగ్రహం పాండవుల పక్షాన
ఉన్నదని, వారు త్వరలో యుద్ధం లో విజయులై తమ రాజ్యాన్ని
తిరిగి పొందుతారు అని ఈ శ్లోకం అంతర్లీనముగా సూచిస్తున్నది.
పాండవులు
అంటే పాండు రాజు కుమారులు అని. ఐదుగురు అన్నదమ్ముల్లో ఎవరినైనా 'పాండవ' అని సంబోధించవచ్చు. ఇక్కడ ఈ పదం అర్జునుడికి వాడబడుతున్నది. అతను
కూర్చున్న అద్భుతమైన రథం అగ్ని దేవుడు ప్రసాదించినది. మరి ఆగమని దేవుని రథము అంటే
ఎంతో ప్రకాశవంతమైనది అని కదా అర్థము. దానికితోడు లక్ష్మీ దేవికే భర్త కావున ఎంతో
వెలుగు జిలుగులు కలిగిఉ ఉంటాడు వెంటనున్న అర్జునుడు పాండవుడు. అత్యంత ప్రకాశమైన
వాడు మరియు స్వచ్ఛమైన వాడు. తెల్లని గుర్రాలు పూన్చబడిన బ్రహ్మాండమైన రథము. అంటే
ఆర్థము పాండవులకు రాబోవు వైభవమును చాటుచున్నది.
‘శ్వేతైర్హయైర్యుక్తే
మహతి స్యందనే స్థితౌ’ అన్నది శ్లోకములోని మొదటి పాదము. తరువాత శ్లోకములోని రెండవ
పాదము ‘మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః’. ఇందులో ‘మాధవః’ అన్న పదము
ప్రత్యేకతను కలిగి ఉన్నది.
శుద్ధలక్ష్మిః, మోక్ష లక్ష్మీ, జయలక్ష్మీ,సరస్వతీl
శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదాll
అని
శ్రీ సూక్తములోని లక్ష్మీ స్తవము తెలియజేస్తూ ఉన్నది ‘మా’ అన్న మాటకు ‘లక్ష్మి’
అని అర్థము.
‘లక్ష్మి
పద్మాలయా పద్మా , కమలా , శ్రీహరి , ప్రియా l
ఇందిరా
లోకమాతా మా రమా మంగళ దేవతా ll
భార్గవి
లోక జనని క్షీరసాగర కన్యకాl
అని అమరకోశము. కావున
‘మాధవుడు మాధ్యందిన మార్తాండుడు, పున్నమి వెన్నెలరేని పోలిక అర్జునుడు. రథమును
గూర్చి మరికాస్త విశ్లేషించుకొందాము.
అర్జునుని
రథములో మధ్యన జ్వాలాయమాన ప్రభాసాంగుడై అర్జునుడు రథియై రథము మధ్యన కూర్చొని
భాసిల్లుచున్నాడు. క్రింద సారథియై శ్రీకృష్ణపరమాత్ముడు ధర్మచారునివైన నీకు ఈ
ప్రపంచమునే జయింపజేసి ఇప్పించగలనన్నట్లు కూర్చుని యున్నాడు, యుధా మన్యువు
ఉత్తమౌజసుడు అన్న, దుష్టద్యుమ్నునికి తమ్ముని వరుసయగు మహారథులు కుడిఎడమల చక్ర
రక్షకులుగా ఉన్నారు. తేరి టెక్కమున ఆంజనేయస్వామి యున్నాడు. ఇంతటి మహద్వైభవము
కలిగిన రథము ఈ జగతిన వేరెక్కడ ఉంటుంది.
కఠోపనిషత్తు
లో పై విషయమును, ఒక రథము ఉదాహరణ తీసుకొని ఆ ఉదాహరణ ద్వారా చాలా అద్భుతంగా వివరించబడిన
విషయాలను తెలుసుకొందాము.
ఆత్మానం
రథినం విద్ధి శరీరం రథమేవ తుl
బుద్ధిం
తు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చl
ఇంద్రియాణి
హయానా హుర్విషయాంస్తేషు గోచరాన్ ।
ఆత్మేంద్రియ
మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణఃll (1.3.3-4)
పై
కఠోపనిషత్ శ్లోకము ఈ విధముగా చెబుతూ వుంది.
ఐదు గుర్రాలను పూన్చిన ఒక రథం ఉంది; ఆ గుఱ్ఱాలకు పగ్గాలు కట్టబడి ఉన్నాయి;
ఆ పగ్గాల కొసలు రథ సారథి
చేతిలో ఉన్నాయి; ఆ రథము మధ్యలో రథి లేక రథికుడు కూర్చొని
ఉన్నాడు. అతడు సారధికి దిశా నిర్దేశం చేస్తే
సారధి పగ్గాలతో గుఱ్ఱాలకు దిశా నిర్దేశం
చేయగలడు. కానీ, ఈ విషయంలో, రథికుడు
నిద్రపోతున్నాడు, మరి సారధికి చెప్పేదెవరు. మరి సారధి
గుఱ్ఱాలకు ఏమి చెప్పగలడు. చెప్పేవాడు లేకుంటే గుఱ్ఱాలు గూడా ఏమి చేయగలవు.
కాసేపు
శ్రీకృష్ణార్జునులను మరచి రథము, రథికుడు, పగ్గముల గుఱ్ఱములు సారథిని గూర్చి
ఆలోచించుదాము.
ఈ
ఉపమానం లో, రథం అంటే శరీరం; గుర్రాలు అనేవి ఐదు ఇంద్రియములు. ఈ
ఐదు ఇంద్రియాలు రెండు రకములు. అవి కర్మేంద్రియ పంచకం: వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ
జ్ఞానేంద్రియ
పంచకం: త్వక్కు = చర్మం,
చక్షువు = కన్ను, రసన = నాలుక, శ్రోతం = చెవి, .ఘ్రాణం = ముక్కు, పగ్గాలు మనస్సు;
రథ సారధి బుద్ధి; వెనుక కూర్చున్న రథికుడు శరీరి.
ఇంద్రియములు (గుర్రాలు) భోగాలను కోరుతాయి. మనస్సు (పగ్గాలు) ఇంద్రియములపై
(గుర్రాలపై) నియంత్రణ చేయలేకపోతూ ఉంది. బుద్ది (సారధి) లాగవలసిన పగ్గాలు (మనస్సు) గుఱ్ఱముల
లాగుడుచే వివశమైపోపోతున్నాడు. కాబట్టి భౌతికంగా బద్ధుడైఉన్న స్థితిలో, అయోమయానికి గురియై ఉన్న శరీరి, బుద్ధిని సరియైన
దిశలో నడిపించలేక పోతున్నాడు. అప్పుడు, రథము పోకడను
ఇంద్రియములే నిర్దేశిస్తాయి. ఇంద్రియ సుఖములను శరీరి అనుభవిస్తూ ఉన్నాడు. కానీ సంతృప్తిని
పొందలేక మాయాజాల వంచితుడై ఎదో నిర్వేదమునకు గురియై ఉన్నాడు. అట్టివాడు సుఖదుఃఖాలకు
అతీతమై సాక్షీభూతమైయొప్పు జీవాత్మ లేక అంతరాత్మకు ఏమి సమాధానమునివ్వగలడు. ఈ రథంలో
కూర్చునిఉన్న శారీరి అనగా రథికుడు భౌతిక ప్రపంచంలో తిరుగుతూనే ఉన్నాడు. మనసుకు
శాంతీ లేదు. ఆకారణముగా అంతరాత్మ అనిర్వచనీయమగు ఆనందమును పొందలేదు.
కానీ, జీవి లేక శరీరి
తను ఉన్నతమగు స్వభావముతో మసలగలిగితే, బుద్ధి అప్పుడు, తక్కువ
స్థాయి అస్థిత్వాలయిన మనస్సు, ఇంద్రియములను సరిగ్గా
నియంత్రిస్తుంది. అప్పుడే రథం శాశ్వత ఆనందము దిశగా కదులుతుంది. ఈ విధంగా, తక్కువ స్థాయి స్వరూపాన్ని (ఇంద్రియములు, మనస్సు,
బుద్ధి) నియంత్రించటానికి ఉన్నతమైన ఆత్మ (జీవాత్మ)ను జాగృతము చేసుకొంటే రాతియగు శరీరి సకల సల్లక్షణ నిదానమై
నిలువగలుగుతాడు. పై భగవద్గీత శ్లోకములో ఆత్మా రూపియై శరీరములో వెలసితున్న పరమాత్మ
బుద్ధిని అనగా సారధిని నియంత్రించుచున్నాడు. ‘ధీయోయోనః ప్రచోదయాత్’ అనియె కదా మనము
పరమాత్మను సంధ్యావందనములో ప్రతిదినమూ వేడుకొనేది.
వాస్తవానికి
పై భగవద్గీత శ్లోకమునకు ఇప్పుడు మనము చెప్పుకొన్న ఈ కఠోపనిషత్తు శ్లోకము ఎంతగా
అతికినట్లు సరిపోతుందో చూడండి. ఇక్కడ శరీరి అనగా రథికుడు అర్జనుడు. సారధియగు
బుద్ధి స్వయంగా పరమాత్మ చే ప్రచోదితమగుచున్నది. ఆయన మనస్సును నియంత్రించుతూ
దానివలన పంచేంద్రియాలను కట్టడి చేస్తూ శరీరి యగు అర్జునుని ధర్మము తెలిపి
కార్యమునకు ఉన్ముఖుని చేస్తున్నాడు. అశ్వములు తెల్లనివి. అనగా స్వచ్ఛతకు చిహ్నము.
రథమా విశాలమైనది. అది శరీరము. రాబోవు సామ్రాజ్యమునకు ప్రతీకగా కూడా ఊహించుకొనవచ్చును.
మనము ఇపుడు దానిని శరీరముగానే భావించుదాము. సారధి సకల సంపత్స్వరూపమైన లక్ష్మీ దేవి
భర్త. అనగా ఆయన బుద్ధిని ఆవహించియున్నాడు ఇక
గెలుపునకు ధర్మ సంస్థాపనకు అడ్డమేమి ఉంటుంది.
మిగిలినది మరొక మారు.......
భగవద్గీత 1వ అధ్యాయము 14వ శ్లోకము -ఒక విమర్శ – 2
కఠోపనిషత్తు
తృతీయ వల్లి లోని 5, 6 శ్లోకములను చూడండి.
యస్త్వవిజ్ఞావాన్
భవత్య యుక్తేన మనసా సదా ।
తస్యేన్ద్రియాణ్యవశ్యాని
దుశష్టాశ్వా ఇవ సారథేః ॥ 5
యస్తు
విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా ।
తస్యేన్ద్రియాణి
వశ్యాని సదాశ్వా ఇవ సారథేll6
ఎక్కడ
విజ్ఞాన హీనుడైన సారధి ఉంటాడో, యుక్తము గాని కళ్ళెములు లేక పగ్గములు ఉంటాయో, వశము గాని గుఱ్ఱములుంటాయో,
ఆ రథికుడు సాధించదలచినదేదీ సాధించలేడు. అదే విజ్ఞానవంతుడగు సారధి, యుక్తమగు
కళ్ళెములు, వశము లోనున్న గుఱ్ఱములుంటాయో, ఆరథికునికి
రథమునకు
సంబంధించిన ఏ పనయినా హస్తామలకమే!
మరి
రథికుకుడగు అర్జునునికి అన్నీ అమరినట్లేకదా! మరి విజయము కరతలామలకమే కదా!
‘మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః’ అని తమ తమ
శంఖములగు పాంచజన్యము, దేవదత్తములను పూరించినారు అని బహువచనములో చెప్పబడినది. మరి
ఇంతవరకూ రథికుని గూర్చి ఏకవచనములో చెప్పి ఇప్పుడు బహువచనములో చెప్పబడుతూ ఉన్నది
ఎందుకు?
ఈ
విషయమును ఒకపరి గమనింతము.
ద్వా
సుపర్ణా సయుజా సఖాయా
సమానం వృక్షం పరిషస్యజాతే,
తయోరన్యః
పిప్పలం స్వాద్వత్త్య
నశ్నన్నన్యో
అభిచాకశీతి.
ఒక చెట్టును రెండు పక్షులు ఆశ్రయించి ఉన్నాయి. ఆ
రెండు పక్షుల్లో ఒకటి ఆ చెట్టు ఫలాల్ని ఆరగిస్తూ ఉన్నది. రెండవ పక్షి ఆ ఫలాల్ని
ఆస్వాదించకుండా, జరుగుతున్న దానినంతటినీ చూస్తూ ఉన్నది. ఈ చెట్టు- రెండు పక్షులు అన్న
ఉదాహరణ ద్వారా శ్వేతాశ్వతరో పనిషత్తు జీవేశ్వరుల స్థితిగతులను అభివర్ణించింది.
ఈ
విశ్లేషణనొకపరి గమనించండి.
చెట్టు అంటే మానవదేహం. ఆ చెట్టును ఆశ్రయిం చిన
రెండు పక్షుల్లో ఒకటి జీవుడు, రెండవది ఈశ్వ రుడు. జీవుడు ఈ దేహంతో ఉంటూ కర్మఫలాల్ని
అను భవిస్తూ, సుఖదుఃఖాలకు లోనవుతూ ఉన్నాడు. ఈశ్వ రుడు ఈ
దేహంలో ఉంటూనే, కర్మల, కర్మఫలాల
సంపర్కం లేక, సుఖదుఃఖాలకు లోనుకాక, కేవలం
సాక్షి స్వరూపంగా సర్వాన్ని దర్శిస్తున్నాడు.
ఖాదిత్య దీపితే కుడ్యే దర్పణాదిత్య దీప్తివత్,
కూటస్థ భాసితో దేహో ధీస్థ జీవేన భాస్యతే.
ఇదే విషయాన్ని విద్యారణ్యస్వామి ‘వేదాంత పంచ
దశి’లో ఒక మైదానంలోని గోడను తీసుకొని చెప్పారు. ఆ గోడపై ఎట్టి కప్పూలేదు.
ఆకాశంలోని సూర్యుని కాంతి సరాసరి ఆ గోడపై ప్రసరిస్తోంది. ఆ గోడకు ఎదురుగా ఎన్నో
అద్దాలు ఉన్నాయి. ఆ అద్దాల్లో సూర్యుడు ప్రతిబింబిస్తూ ఉన్నాడు. అద్దాల నేకం.
ప్రతిబింబాలనేకం. అద్దా ల్లోని సూర్య ప్రతిబింబాల నుంచి బయల్పడిన కాంతివలయాలెన్నో
ఆ గోడపై పడుతున్నాయి. ఇప్పుడు గోడపై రెండు ప్రకాశాలున్నాయి. ఒకటి గగనంలోని సూర్య
ప్రకాశం. రెండవది దర్పణాల్లోని సూర్య ప్రతిబింబాల ప్రకాశం. ఈ రెంటికీ ఆధారం
సూర్యుడే. తేడా అల్లా,
మొదటి ప్రకాశం సరాసరి సూర్యుని నుంచి గోడపై పడుతున్నది. రెండవ
ప్రకాశం సూర్యుడు అద్దాల్లో ప్రతిబింబించగా, ఆ ప్రతిబింబాల
నుంచి వెల్వడినది.
ఆ
గోడలాగే మానవ దేహంలో రెండు చైతన్యాలు ఉన్నాయి.
మొదటిది దేహంలో ప్రకాశించే పరబ్రహ్మ చైతన్యం. రెండవది బుద్ధి అన్న
దర్పణాల్లో పరబ్రహ్మ అన్న సూర్యుడు ప్రతిబింబంగా, ఆ ప్రతిబింబం నుంచి వెల్వడిన అభాస
చైతన్యం. ఇదే జీవచైతన్యం. ఈ రెంటికీ ఆధారం పరబ్రహ్మ చైతన్యమే. అయినా మొదట దానికి
మాధ్యమం లేదు. రెండవ దానికి బుద్ధి అనే మాధ్యమం ఉంది. బుద్ధి అన్న మాధ్యమం నుంచి
వెల్వ డిన జీవ చైతన్యం అభాస చైతన్యం, బుద్ధి వాసనలకు
అనుగుణంగా కర్మల్ని చేస్తూ, కర్మఫలాల్ని సుఖదుః ఖాల్ని
అనుభవిస్తుంది. పరబ్రహ్మ చైతన్యం కేవలం సాక్షిగా సర్వాన్నీ దర్శిస్తూ ఉంటుంది.
పైన
చెప్పిన ఆ రెండు విషయముల అనురూపమే శ్రీకృష్ణార్జునులు.
బుద్ధి అన్న మాధ్యమం ద్వారా వెల్వడుతూ, ‘నేను’ గా అభివ్యక్తమయ్యే
అభాస చైతన్యం, బుద్ధి వాసనలతో తాదాత్మ్యాన్ని పొంది, కర్మల్ని చేస్తూ కర్మఫలాల్ని, సుఖా ల్ని దుఃఖాన్ని
అనుభవిస్తూ ఉంటే, జీవ భ్రాంతిలో మిగిలి పోతాడు. అలాకాక శరీర
ఇంద్రియ మనః బుద్ధి చిత్త అహంకారాలనే తొడుగుల్లో ఉంటూనే, బుద్ధి
వాసన లతో కాక, పరబ్రహ్మ చైతన్యంతో నిశ్చయాత్మకమైన
తాదాత్మ్యాన్ని పొందితే, జీవన్ముక్తుడవుతాడు.
జీవరూపంలో ఉన్న ఈ జీవన్ముక్తుడే, కర్మల్ని చేస్తూ
కర్మఫలాన్ని పొందక, తన కర్మల ద్వారా లోకా లకు మహోపకారం
చేస్తూ, మహాత్ముడై ప్రకాశిస్తాడు.
కావున
ఆయతన తోడ్పాటు అంతర్బాహిరముగా పరమాత్మను కలిగిన ధనమ్జయునికి ల్భిమ్పని జయము
ఏముంటుంది. అందుకే ఆయన జయుదయినాడు. ఇంకొక్క విషయము చెప్పి ఈ వ్యాసమును ఇంతటితో
ముగించుతాను.
సాలు
పాంచజన్యము అంటే 5 జ్ఞానేద్రియముల అధిపతి ఈ 5 జ్ఞానేంద్రియములు మనసునకు ఆధీనము.
మనసునకు మరోపేరు హృషీకము. అంటే పైన తెలిపిన జ్ఞానేంద్రియములగు
త్వక్కు = చర్మం, చక్షువు = కన్ను, రసన = నాలుక, శ్రోతం = చెవి
ఘ్రాణం = ముక్కు అన్న ఈ 5 ను నియంత్రించే మనసును ఋషీకము అంటారు. దానిఅదిపతియే
పరమాత్ముడు. ఆయన సదా అర్జునుని ఆత్మయై కొలువున్నాడు. కావున పాంచజన్యము ఋషీ కేశుడు
పూరించినాదని చెప్పబడినది. ఇక దేవదత్తము ధనంజయునిచే పూరింప బడినది. ఖాండవదహన
కాలమున అది దేవతామూర్తియగు అగ్నిచే ఇవ్వబడుచే దేవదత్తమయినది.
దానిని పూరించిన వాడు
ధనంజయుడు. నిజానికి ఆయన సాధనంజయుడు. సమరమునకు, అది అంతః సమరము కావచ్చు, బాహ్యసమరమూ
కావచ్చు., దేనికయినా తపః సంపన్నుడయిన ఆయన సర్వదా సిద్ధముగా ఉంటాడు. అందుచే
ధనంజయుడైనాడు.
ఇన్నివిధముల ఆ ఒక్క
శ్లోకము మహాభారత విజయమును ఆదిలోనే సూచించుచు న్నది.
స్వస్తి.
No comments:
Post a Comment