Tuesday, 15 November 2022

మంత్రాలయము, గండి ఆంజనేయ క్షేత్రము, సర్ థామస్ మన్రో

 

మంత్రాలయము, గండి ఆంజనేయ క్షేత్రము, సర్ థామస్ మన్రో 

https://cherukuramamohanrao.blogspot.com/2022/11/blog-post.html

మొదట తెలిపిన రెండు క్షేత్రాలకన్నా ముందు అతి క్లుప్తముగా సర్ థామస్ మన్రో ను గూర్చి తెలుసుకొందాము. ఆపై  మంత్రాలయ రాఘవేంద్ర మహిమతో గండి ఆంజనేయ క్షేత్రముతో గల సంబంధమును గూర్చి తెలుసుకొందాము.

సర్ థామస్ మన్రో 27 మే, 1761-6 జూలై, 1827, స్కాట్లాండు లో జన్మించినాడు. ఈయన తండ్రి అలెగ్జాండర్ మన్రో గ్లాస్గో నగరంలో పేరుపొందిన వ్యాపారి. ఈయన తల్లి మార్గరెట్ స్కార్క్.  

థామస్ గ్లాస్గో విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. ఇతడు 1789 సంవత్సరంలో మద్రాసు పదాతి దళంలో కాడెట్ గా చేరినాడు.

ఇతడు హైదర్ఆలీ తోను (1780-1783) తరువాత టిప్పు సుల్తాన్ తోను (1790-1792) తలపడి వారి రాజ్య పతనమునకు కారకుడైనాడు. టిప్పు సుల్తాన్ పతనం తరువాత రాయలసీమ ప్రధాన కలక్టర్ గా నియమించబడినాడు.

మన్రో తన సైన్యంతో 1800-1807 మధ్య కాలంలో తిరుగుబాటుదారులను నిర్ధాక్షిణ్యంగా అణచివేసినాడు. రాయలసీమ తరతరాలుగా అనావృష్టికి గురియైన ప్రాంతం. ప్రకృతి వైపరీత్యానికి తోడుగా, పిండారీల దోపిడులు, పాళెగాండ్ర దురాగతాలు సీమ ప్రజలను నానా యాతనలకు గురిచేసేవి. అశాంతితో పరితపిస్తున్న ప్రజానీకాన్ని ఆదుకొని, సీమలో శాంతిభద్రతలను నెలకొల్పిన మహనీయుడు మన్రో. 1792లో జరిగిన శ్రీరంగపట్నం సంధి ప్రకారం కడప, అనంతపురం, కర్నూలు, బళ్ళారి నిజాం పాలనలోనికి వచ్చినాయి. నిజాం పాలనలో అరాచకం మరింత పెరిగింది. పాలెగాళ్ళ అక్రమాలకు అంతులేకపోయింది. కడపజిల్లాలోని వేముల పాళెగాడు తనను తాను రాజుగా ప్రకటించుకొన్నాడు. కొరవలు (కురబలు), యానాదులు, బేడర్లు, ఎరుకలు గ్రామాలపైబడి దోచుకోసాగినారు. అట్టి పరిస్థితులలో 12-10-1800న దత్త మండలాల ప్రధాన కలెక్టరుగా మన్రో నియమింపబడినాడు. అతని క్రింద నలుగురు సబ్ కలెక్టర్లు వుండేవారు. ఆదవాని, హర్పనహళ్ళి, కడప, కంబంలలో వీరి కార్యాలయాలూ వుండేవి. మన్రోకు సహాయంగా మేజర్ జనరల్ డుగాల్డ్ క్యాంబెల్ నాయకత్వంలో ప్రధాన కేంద్రాలలో సైనిక దళాలుండేవి. అనంతపురం డివిజన్ మాత్రం మన్రో అధీనంలో వుండేది.

సిద్ధవటంలో వున్న కడప జిల్లా కార్యాలయము 1812లో కడపకు మార్చబడింది. 1828లో కంభం, దూపాడు, కోయిల కుంట్ల ప్రాంతాలను కడప జిల్లా నుండి విడదీసి కర్నూలు జిల్లాలో కలిపినాడు. 1911లో మదనపల్లె, వాయిల్పాడు ప్రాంతాలను కడప జిల్లా నుండి విడదీసి చిత్తూరు జిల్లాగా ఏర్పాటు చేసినాఆ కాలంలో రాయలసీమలో 80 మంది పాలెగాళ్ళుండేవారు. వారిలో కడప జిల్లాలోని వేముల, చిట్వేలి, పోరుమామిళ్ళు, నరసాపురం, అప్పిరెడ్దిపల్లి, ఉప్పులూరు, కమలాపురం పాలెగాళ్ళు ముఖ్యులు. వీరు నిరంకుశులు. గ్రామాలను దోచుకునేవారు. బందిపోట్లుగా వారి అనుచరులుండేవారు. హైదరాలి, నిజాం, గోల్కొండ నవాబులు కూడా వారిని అరికట్టలేకపోయినారు. మన్రో తీవ్ర చర్యలతో వీరి ఆట కట్టించిననాడు. పాలెగాళ్ళను, కావలి వాళ్ళను కఠినంగా శిక్షించినాడు.

అరాచకంగా వున్న రాయలసీమ జిల్లాల్లో జిల్లా కోర్టులు, పోలీసు యంత్రాంగాలు ఏర్పాటు చేసినాడు. మన్రో కఠినచర్యల వల్ల సుస్థిరమైన పాలన ఏర్పడింది. పాలనాపరమైన సంస్కరణలను ప్రవేశపెట్టినాడు.

1813 లో ఛార్టర్ చట్టానికి సంబంధించిన పార్లమెంటు కమిటీ ముందు సాక్ష్యమిస్తూ, భారతదేశ సంస్కృతిని అనుసరించటం వల్ల ఇంగ్లండు లాభపడుతుందన్నాడు. భారతీయులు తయారుచేయు వస్తువుల నాణ్యత, ఐరోపాతో సమానమైనదన్నాడు. భారతీయ ప్రజల పట్ల, మేధావుల పట్ల, చేతి వృత్తుల వారిపట్ల ఆయనకు ఎంతో గౌరవముండేది.

భారతీయులు తెలుగు, ఇంగ్లీషు భాషలు నేర్చుకొని ప్రభుత్వ ఉద్యోగాలు పొందటానికి వీలుగా జిల్లా తాలూకా స్థాయిలో పాఠశాలలు నెలకొల్పినాడు. 1805 నాటికే మన్రో తెలుగు వ్రాయను, చదవనూ నేర్చుకొన్నాడు. రాయలసీమ రైతులతో ఆయన తెలుగులో మాట్లాడేవాడు. తన క్రింది అధికారులు కూడా విధిగా తెలుగులోనే వ్యవహరించాలని ఆదేశించినాడు. సి.పి.బ్రౌన్ ఆయన మాటలనెంతగానో గౌరవించేవాడు. గౌరవించుటయే కాదు ఆయన  ఆలోచనలను ఆచరణలోపెట్టి ఆంధ్రభాషకు తొలి తెలుగు నిఘంటువును, వేమన పద్య సంకలనమును, ఎన్నో తాళపత్ర గ్రంధపు నకళ్ళను ఆంధ్రులకు బహూకరించినాడు.

 థామస్ మన్రో రైతుల పట్ల ఎంతో ఉదారంగా వ్యవహరించినాడు. రైతువారీ విధానమును ప్రవేశపెట్టి తరతరాల నుండి పాలెగాండ్ర దోపిడీకి గురై అనేక ఇబ్బందుల పాలైన రైతులను ఆదుకున్నాడు. క్రీ.శ. 1804 లో కడప జిల్లాకు వరదలు వచ్చినప్పుడు చెరువులను, కాలువలను సకాలంలో మరమ్మత్తు చేయించి పుష్కలంగా పంటలు పండే ఏర్పాటుచేసినాడు. 1807లో మన్రో తన పదవికి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగివెళ్ళినాడు.

మన్రో1820 జూన్ 8 వ తేదీన మద్రాసు గవర్నరుగా తిరిగివచ్చాడు. అతడు పాలించిన ఏడు సంవత్సరాలు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషిచేశాడు. ఇతడు  కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ కలరా వ్యాధి సోకి 1827, జూలై 6వ తేదీన మరణించినాడు.

బ్రిటిష్‌ పాలనలో చిత్తూరు కలెక్టర్‌గా పనిచేసిన సర్ థామస్‌ మన్రో పెద్ద వెండి గంగాళాన్ని తిరుమల శ్రీ వేంకటేశస్వామి వారికి కానుకగా ఇచ్చినాడు. దీనినే మన్రోగంగాళం అంటారు. నేటికీ స్వామివారికి దీనిలోనే నైవేద్యం పెడతారు.

తాడిపత్రి లోని చింతల రాయస్వామి ఆలయ ఆస్థాన మంటపాన్ని, కళ్యాణ మంటపాన్ని మరమ్మత్తు చేయించినాడు. ఆలయంలో సక్రమంగా పూజలు జరిపే ఏర్పాటు చేయించినాడు. రాయదుర్గము లోని  ప్రసన్న వేంకటేశ్వరస్వామిని దర్శించి ఆలయానికి మాన్యాలిచ్చినాడు.

ఇక ఇపుడు మన్రో గారికి మంత్రాలయానికి, కడప జిల్లాలోని గండి క్షేత్రానికి గల సంబంధమును ఒక పర్యాయము తిలకించుదాము.

మరోసారి మంత్రాలయమున జరిగిన అద్భుథమును౭ గూర్చి తెలుసుకొందాము. 

సర్ థామస్ మన్రో మంత్రాలయ రాఘవేంద్ర స్వామి

ఆంధ్ర ప్రదేశ్, కర్నూలు జిల్లాకు చెందిన మంత్రాలయ గ్రామము ప్రసిద్ధ ద్వైత సాంప్రదాయానువర్తియగు రాఘవేంద్ర స్వామి కొలువై ఉన్న పుణ్యభూమి. 1800లో సర్ థామస్ మున్రో బళ్లారి కలెక్టర్‌గా ఉన్నప్పుడు, మద్రాసు ప్రభుత్వము మఠము మరియు మంత్రాలయ(మంచాల) గ్రామం నుండి వార్షిక శిస్తును సేకరించాలని ఆదేశించినా. ఈ ఉత్తర్వును రెవెన్యూ అధికారులకు అసాధ్యమగుటచే సర్ థామస్ మున్రోను నియమిస్తే, ఆయన విచారణ నిమిత్తం మఠాన్ని సందర్శించుట జరిగినది.

ఆయన రాఘవేంద్రునిపై భక్తి వినయములతో, తన టోపీ మరియు బూట్లు తొలగించి పవిత్ర ప్రాంగణంలోకి ప్రవేశించి శ్రీ రాఘవేంద్రస్వామికి నమమస్కరించి సమక్షమున నిలచినాడు. శ్రీ రాఘవేంద్రుడు  బృందావనం నుండి ఉద్భవించి, మన్రోకు మాత్రమే దర్శనమిస్తూ, దానమును  గురించి కొంతసేపు మాట్లాడినారు.

మంత్రాక్షతలు పొందిన మన్రోకు మాత్రమే యతిరాజు కనిపించేవాడు. ఆ మహనీయుని సంభాషణ మన్రోకు మాత్రమే వినిపించేది. కలెక్టర్ మన్రో వెనక్కి వెళ్లి మఠానికి, గ్రామానికి అనుకూలంగా ఉత్తర్వు జారీ చేసినాదు.

ఈ నోటిఫికేషన్ మద్రాసు ప్రభుత్వ గెజిట్‌లో చాప్టర్ XI మరియు పేజీ 213లో “మంచాలి ఆదోని తాలూకా” అనే శీర్షికతో ప్రచురించబడింది. ఈ వాస్తవము ఇప్పటికీ సెయింట్ జార్జ్ ఫోర్ట్(మద్రాసు) మరియు మంత్రాలయంలో భద్రపరచబడి ఉన్నది.

మూలం: శ్రీ రాఘవేంద్ర స్వామి కథ (మంత్రాలయం)

గండి ఆంజనేయ క్షేత్రము, సర్ థామస్ మన్రో 

గండి క్షేత్రము కడప జిల్లా పులివెందుల తాలూకా వేంపల్లె మండలమునకు చెందిన పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమునందలి వీరాంజనేయ చిత్రమును శ్రీరాములవారు తన అమ్ము ములికి తో చెక్కినట్లు ఐతిహ్యము.

పవిత్రమగు గండి క్షేత్ర మహాత్మ్యము మా పెద్దలు ఎంతో గొప్పగా చెప్పుకొనేవారు. ఈ దేవాలయము పాపాఘ్ని నది ఒడ్డున వెలసియుంది. నదికి కుడి ఒడ్డున  సుందర సురుచిర శోభలనందిస్తున్న ప్రకృతి. అందులోని భాగముగా  ప్రశాంత వాతావరణములో  వీరాంజనేయ దేవాలయం ఉంది. ఈ స్వామి విగ్రహము మరియు ఆలయము ఎలా ఏర్పడినవి అన్న పురాణం వినుటకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

త్రేతాయుగమున శ్రీ రామచంద్రుడు సీతమ్మను  వెతుకుతూ దక్షిణం వైపు వెళ్ళుచుండగా ఈ ప్రదేశమునకు వచ్చుట జరిగినది. అందమైన ఆహ్లాదమైన ఆ వాతావరణములో తనవైన పిల్ల తెమ్మెరలచే సేద తీర్చుకొంటూ వున్న వాయుదేవుడు శ్రీరాముని గాంచిఅవధి మీరిన ఆనందముతో ఎంతో నమ్రతను పాటించుతూ,  తన ఆతిథ్యమును స్వీకరించమని కోరగాశ్రీ రాముడు ‘నేను లంక నుండి అయోధ్యకు తిరిగి వెళ్ళుసమయమున స్వీకరించగలనుఇపుడు సీతా వియోగబాధితునిగా స్వీకరించలే’నని చెప్పినాడు.

శ్రీరాముడు రావణసంహారము గావించి  సీతాలక్ష్మణ ఆంజనేయ సుగ్రీవాది సమస్త వానర మూకతో  పుష్పకవిమానారూఢుడైవచ్చుచున్నాడని విని వాయుదేవుడు శ్రీరామునికి స్వాగతము పలికేందుకు  ఈ గండి ప్రదేశమును సిద్ధము చేసిలోయకు ఇటు అటు ఉన్న కొండ శిఖరములకు కాంచన పుష్ప పత్రయుక్తమగుతోరణమును కట్టిరాముడు దానిగుండా వచ్చులాగున తగినవిధముగా ఏర్పాటు చేసినాడు. బహుశ అచట విడిది చేసిన సమయములో శ్రీ రాముడు వాయుపుత్రుని చిత్రమును గీచియుండవచ్చును. ఆవిధముగా శ్రీరాముడు వాయుదేవునకు గూడా ప్రియమును చేకూర్చినాడు.కలియుగములో కూడా నిస్వార్థులై, అకళంకులై, భగవంతునిపై విశ్వాసం ఉన్నవారికి ఇది కనిపిస్తుంది అన్నది మా పూర్వులనుండి విన్నది. ఈ జన్మలో తమ కర్మలను సంపూర్ణంగా మరియు నిజంగా చేసిన వారు తమ చివరి రోజుల్లో బంగారు తోరణాన్ని చూస్తే ధన్యులని నమ్ముతారు. ఈ కాంచన పత్ర పుష్ప ప్రాలంబమును (బంగారు పత్రీ పూవులచేత తయారుచేయబడిన దండను) దర్శించిన వారికి పునర్జన్మ నుండి విముక్తి లభిస్తుందని కూడా నమ్ముతారు. సర్ మున్రో మద్రాసు ప్రెసిడెన్సీలో దత్తమండలం కలెక్టర్‌గా ఉన్నప్పుడుఈ బంగారు తోరణాన్ని కళ్ళారా చూసినాడు. ఈ అరుదైన సంఘటన కడప గెజిట్‌లో నమోదు చేయబడింది మరియు సర్ మన్రో డైరీలో కూడా నమోదు చేయబడింది. ఈ విషయమును గెజిట్ లోని ఈ క్రింది పుటలో యథాతథముగా ఆంగ్లములో చదువవచ్చును.అతి క్లుప్తముగా అందలి సారాంశమును తెలియజేస్తాను.మన్రో కు పదోన్నతి కలిగినపుడు బ్రిటీషు ప్రభుత్వము క్రొత్త అధికారి ఈయనను శమితుని (To be relieved) చేసేవరకూ యథాస్థానములోనే ఉండగోరినారు. ఊరక ఉండలేక తానూ అత్యంత ఆదరమునకునోచుకొన్న రాయలసీమ ప్రాంతము చూచుటకు చివరిసారిగా బయలుదేరి గండి కనుమ పాపాఘ్ని గుండా దాటుతూ వుండగా అత్యద్భుతమైన వసివాడని సువర్ణ పత్రపుష్పతోరణము రెండు కొండల శిఖరాగ్రములకు కట్టబడియుండుట చూసి అచ్చెరవందినాడు. కానీ అది తనకు మాత్రమే అగుపించిందని తెలుసుకొని ఆ విషయమును తన సేవకులతో చెబితే అది గాంచిన వ్యక్తి  భగవంతునికి ప్రియతముడౌతాడు అనిచెప్పగా తానూ అర్థముచేసుకొని సంతసించినాడు. ఈ ఉదంతమును కడప గెజిట్ లోతెలియబరచినయా ప్రతి యొక్క నకలును మీ ముందుంచుచున్నాను. ఆ ప్రయాణములో ఆయన గుత్తి వద్ద కలరాతో మరణించినాడు.


మహనీయుడయా మన్రో

ఆహమన్నది లేక తాను అన్యుండైనన్

ఇహసుఖము తుహినమనుకొని

గహనంబగు మోక్షపదము గాంచెను రామా!  (గహనము = చొచ్చుట మిక్కిలి కష్టమైనది)

మహనీయుల చరిత్ర విన్నా చదివినా మనసుకు  ఎనలేని ప్రశాంతత లభిస్తుంది.

స్వస్తి. 



2 comments:

  1. Thanks for posting such an interesting information. The lyrical excellence and the synchronization in the method of presentation is stupendous sir. Thanks to the pain taking efforts in publishing information which is beyond our reach. Words are inadequate to express my gratitude for such a wonderful thesis. Pranams Sir.

    ReplyDelete
    Replies
    1. Thank you very much Sukumar. If a few enthusiasts, like you, connect to this sort of litarature, I am confident, we can get people attached to Daivam and Desham, Neeti and Niyamam, shraddha and bhakthi. I thank You Very Much for Your Soulful Commnt\comments.

      Delete