వైదిక ధర్మము – 1
https://cherukuramamohanrao.blogspot.com/2023/06/blog-post.html
సూర్యుని చుట్టూ
గ్రహములు తిరుగుతాయన్నది మనకు తెలిసిన వాస్తవము. ఆ విధముగా తిరుగుట ఆయా గ్రహముల
ధర్మము. అదికూడా అవి ఎ పరిస్థితులలో కూడా తమ భ్రమణ కక్ష్యను అతిక్రమించవు. అది వాని
ధర్మము. రుజు మార్గ భ్రమణము ఒకటే వాని ధర్మము. ఒకవేళ అవి వాని ధర్మమును
అతిక్రమించితే ప్రళయమే! మరి మానవులమైన మనకు ఒకటి కాదు కొన్ని ధర్మముల సమముచ్ఛయము
మహా జ్ఞానులైన మన పెద్దలు నిర్దేశించినారు. దానిని ప్రమాణముగా తీసుకొని మన
మార్గమును ఏర్పరచుకొనవలసియున్నది.
ధర్మో విశ్వస్య
జగతః ప్రతిష్ఠా లొకే ధర్మిష్ఠం ప్రజా ఉపసర్పంతి ll
ధర్మేణ పాపమపూజతి
ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి ll
అన్నది వేదము
చెప్పిన మాట.
ఈ యావత్ జగత్తు
ధర్మము మీద ఆధారపడియున్నది. ధర్మాచరణ విశ్వమునే సుభిక్షముగా వుంచగలుగుతుంది.
ధర్మము దారి తప్పినపుడు లోకము అల్లకల్లోలమే! అట్టి ధర్మము తెలుసుకొనుటకు
జిజ్ఞాసువులు, జ్ఞానుల చెంత చేరుతారు. ధర్మము పాపమును ఎప్పటికీ దరిజెరనీయదు. భగవద్గీతలో పరమాత్మ
ఈ స్వధర్మము అన్న విషయమును గురించి నిర్దుష్ఠముగా ఈవిధముగ తెలియజేసినాడు.
శ్రేయాన్
స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।
స్వధర్మే నిధనం
శ్రేయః పరధర్మో భయావహః ।। 3 -35
శ్రేయాన్ — ఉత్తమమైనది
(మంచిది); తన స్వంత ధర్మము
లోపాలతో కూడి ఉన్నా; ఇతరుల ధర్మము
స్వధర్మము కంటే చక్కగా ఆచరింపబడిననూ; తన స్వంత ధర్మమును ఆచరించుట
శ్రేయస్కరము. నిజానికి, స్వధర్మాన్ని
నిర్వర్తించటంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల ధర్మాన్ని అనుసరించటం అత్యంత ప్రమాడకరమైనది.
ఈ శ్లోకము లో
వాడబడిన 'ధర్మ' అన్న పదము సనాతన ధర్మములో విరివిగా మనము చూడవచ్చు. దాని
నుండి, క్రీస్తుకు
పూర్వము 6వ శతాబ్ది లో
వచ్చిన బౌద్ధ మతము లోనూ తరచుగా
వాడబడుతుంటుంది. కానీ అది ఆంగ్ల భాషలోకి యథాతథముగా అనువదించటానికి అసాధ్యమైన పని.
వారు ధర్మము అన్న పదమునకు ప్రత్యామ్నాయముగా Righteousness, good conduct, duty, noble
quality, మొదలైన ఆంగ్ల
పదాలు వాడుతారు, ఎందుకంటే అవి మన ‘ధర్మము’ అన్న శబ్దానికి కొంత
దగ్గరి అర్థాన్ని వివరించగలుగుతాయి.'ధర్మ' అన్న పదం 'ధృ' అన్న ధాతువు
నుండి వచ్చింది, ధరించుటకు
యోగ్యమనది అని అర్థము. ఎల్లవేళలా అనుసరణీయ మైనది
అని అర్థము. అంటే ‘యోగక్షేమ మార్గములో మనకు తగిన భాద్యతలు, విధులు, కర్తవ్యములు, ఆలోచనలు మరియు చర్యలు’ పాటించవలెనని
అర్థము. ఉదాహరణకు, జీవాత్మ యొక్క
ధర్మము భగవంతుని ప్రేమించటమే. బాహిరమగు ధర్మములన్నీ ఈ ధర్మమునకు ఉపాంగములే! మన
అస్థిత్వానికి ఉన్న మూల సూత్రము ఇదే!
ఇక్కడున్న పూర్వప్రత్యయము ‘స్వ’ అంటే
‘స్వంత లేదా వ్యక్తిగత’ అని, ఆ ప్రకారంగా, ‘స్వ-ధర్మ’ అంటే
మన వ్యక్తిగత ధర్మము మనయొక్క పరిస్థితి, పరిపక్వత, మరియు వృత్తిని
బట్టి ఉండే ధర్మము. జీవన విధానము మారినప్పుడు, ఆధ్యాత్మికంగా
పురోగమించినప్పుడు లేక తిరోగమించినపుడు, స్వ-ధర్మ అనేది
మారవచ్చు. తన వృత్తి ధర్మాన్ని అనుసరించుట ద్వారా, ఒకవ్యక్తి తన
ధర్మమును సవ్యముగా అనుష్ఠించు చున్నాడని అర్థము. దారి తప్పినాడంటే అధోగతే! ఈ
సందర్భముగా ఈ భర్తృహరి సుభాషితమును గమనించండి:
శిరః శార్వం
స్వర్గాత్పశుపతి శిరస్తః క్షితిధరం
మహీధ్రాదుత్తుంగాదవనిమవనేశ్చాపి
జలధిమ్ ।
అధో గంగా సేయం
పదముపగతా స్తోకమథవా
వివేక భ్రష్టానాం
భవతి వినిపాతః శతముఖః ॥
ఆకాశంబున నుండి
శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు
శ్లోకంబైన
హిమాద్రి నుండి భువి, భూలోకంబునందుండి
య
స్తోకాంబోధిఁ, బయోధి నుండి
పవనాంథోలోకముం జేరె గం
గాకూలంకష! పెక్కు
భంగులు వివేకభ్రష్ఠ సంపాతముల్!
గంగానది
స్వర్గంనుండి మొదట శివుని తలపైకి దిగింది. తర్వాత అక్కడనుండి హిమాలయము మీదికీ, హిమాద్రినుండి
భూమి మీదికీ, భూమి నుండి
సముద్రము లోనికీ, అక్కడనుండి
పాళాళానికీ క్రమ క్రమముగా జారి పోయింది. తెలివిమాలిన వారు ఈ విధముగనే తమ ధర్మ
పథమును వదిలి ఉన్నత స్థితి నుండి అధః
పాతాళము చేరక తప్పదు. అదీ ధర్మమునకున్న ఔన్నత్యము.
ఒక చిన్న ఉదాహరణ
చెబుతాను. ఒక సంస్థలో జీతానికి ఒకవ్యక్తి పనిచేస్తున్నాడు. అందుకు తగిన విధముగా
పని చేస్తున్నాడా లేదా అనుటకు తన ఆత్మయే సాక్షి. ఆత్మను ఒప్పించి అతను అధర్మాచరణకు పాల్పపడితే దాని ఫలితము ఒక్కొకసారి తక్షణమే అనుభవిచుతాడు, ఒక్కొకపరి
ఆలస్యమౌతుంది. అంతేకానీ అనుభవించకుండా తప్పించుకోలేడు. ధర్మాచరణకైనా అధర్మాచరణకైనా ఇది సహజమే!
మిగిలినది
మరోమారు.....
వైదిక ధర్మము – 2
జగన్నాథుని
గీతాబోధన కాలానికి అన్య మతములు లేకపోయినా పైశ్లోకము నేటి పరధర్మావలంబనలో కూడా ఎంతో
ముఖ్య భూమికను పోషించుతుంది.
ఇక అన్యధర్మానుసరణ. ఒక బట్టలకొట్టులో ప్రదర్శిత కాచ కరండములో (Glass Show Case) ఒక అందమైన స్త్రీ యొక్క బొమ్మకు వేసిన gown చూసి చీర కట్టుకు అలవాటు పడిన స్త్రీ ఆ gown కట్టుకోవలెనని అనుకోదు కదా! ఒక ఉపన్యాసములో సామవేదం వారు పరధర్మాకర్షితురాలయిన స్త్రీని, తిరిగీ హిందుత్వమునకు మార్చ ప్రయత్నించుటకు వెళ్ళిన ఒక బృందమునకు చెప్పినట్లుగా ఈ మాటలు చెప్పినారు. ‘నా ఇంట్లో నా మత గ్రంధము లేదు. నా తలీదండ్రులకు పూజ చేసే తీరిక దొరకదు. నా అమ్మకు ఎప్పుడో ఒకసారి వచ్చే అత్త మామలు గిట్టరు. మరి వీరో, నా మతమును మార్చి నాకు ఒక గ్రంధము (ఖురాన్)ను చేతియందు ఉంచి, ఇది నీకు నడవడికను నేర్పుతుంది, 5 పూటలా నమాజ్ చేయమని చెబుతుంది. హిజబ్ పాటించమని చెబుతుంది’ అని మతపరమైన ఎన్నో విషయములను తనకు తెలిపినట్లు తెలిపినది. వే. షణ్ముఖ శర్మ గారు దిగజారుచున్న మన సాంప్రదాయమును, విలువలను, బాధ్యతలను గూర్చి తెలుపుతూ తన ప్రసంగమును కొనసాగించినారు. వారు చెప్పినది వాస్తవమే! కానీ ఆ పరధర్మము ఎడారిలో పుట్టినది వారి మతములో స్త్రీలకు ప్రాధాన్యత లేదు, అసలు వారిభాషలో స్త్రీకి ఉపయోగించే పదమే జుగుప్సాకరమైనది, స్త్రీకిప్రాతినిధ్యము లేదు. అసలు ఆడవాళ్ళు బురఖా వేసుకొని మగవారు తమను చూచుటకు నిరోధము కల్పించుచున్నారుగానీ తాము బయటికి వచ్చినపుడు మగవారిని జూచి లోలోపల భావోద్వేగానికి గురి కాకుండా ఉన్నారని వారి దేవునిపై ప్రమాణముచేసి చెప్పగలరా! స్త్రీలకు మసీదులో నమాజ్ చేసే సంప్రదాయమును ఖురాన్ లో ఎందుకు నిర్దేశింపబడలేదు? వారి గ్రంధము మహమ్మద్ గారిని రసూల్ (వార్తాహరుడు, Messenger, అని ఉన్నది కానీ దేవదూత అనగా Prophet అని ఉటంకింపబడిలేదని ఖురాన్ చదివిన అరబ్బీ పండితులు చెప్పగా విన్నాను.) గతించిన మూడు తరముల తరువాత వ్రాయబడినదని ఖురాన్ పండితుల తెలిపినారు. అందులో 4 వివాహాలు, స్త్రీలకు ఖతనా, హలాలా మొదలగు ఎన్నో జుగుప్సాకరము వర్జనీయము అయిన అంశాలున్నాయి. అసలు మహమ్మదుగారే 12 వివాహములు చేసుకొన్నట్లు వారి హదీసుల ద్వారా తెలియ వచ్చుచున్నది. వారు ఆయేషా అను 6 సంవత్సరముల అమ్మాయిని ఇంచుముంచు తన 57 సంవత్సరముల వయసులో పెళ్ళిచేసుకొన్నట్లు మనము google ద్వారా తెలుసుకొనగలము. మరి ఆ వెళ్ళిన బృందము ఆ అమ్మాయికి ఈ విషయములు ఇంకా ఇలాంటివి ఎన్నో మరి తెలిపినారో లేదో తెలియదు. క్రైస్తవము దీనికి తక్కువేమీ కాదు. అసలు ఇస్లాముకు మాతృక క్రైస్తవమే అని పండితులు తెలిపినారు.
వయసు వచ్చిన తరువాత, తల్లిదండ్రులు
నేర్పకున్నా తన ధర్మమును గూర్చి తాను తెలుసుకొనుటకు ఎన్నో వసతులు ఉన్నాయి. పలాయన
వాదము ఎప్పటికీ పరిష్కారమూకాదు, పనికీ రాదు.
మన మానసిక తత్వము
ద్వారా జనించిన విధులతో ఘర్షణ ఈ క్రొత్త ధర్మముతో కలుగుతుంది. ఇతరుల విధులు దూరం
నుండి చూడటానికి ఆకర్షణీయంగా ఉండవచ్చు, మనము ఆ ఆకర్షణకు
లోనూ కావచ్చు, కానీ అది
ప్రమాదభరితమైనది. అది మన స్వభావంతో పొసగకపోతే, అది మన
ఇంద్రియమనోబుద్దులలో ఘర్షణకు దారితీయిస్తుంది. ఇది మన అంతఃకరణానికి హాని కలిగించి, ఆధ్యాత్మిక
పురోగతికి అడ్డంకిగా మారుతుంది. అసహజమైన పరుల ధర్మమును అక్కున చేర్చుకొని పాటించుట
కన్నా స్వంత ధర్మములు నిష్ఠగా పాటించి మరణించినా మంచిదే అని శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని బలంగా
ఉద్ఘాటిస్తున్నాడు.
మిగిలినది
మరొకమారు.....
వైదిక ధర్మము – 3
ధర్మము ఒక్కటే
మనతోబాటూ పరలోకానికి కూడా ప్రయాణము చేసేది. అది ఒక్కటే మన నిజమైన మిత్రుడు. ఆది
శంకరులు ఒక జీవిత సత్యాన్ని వారి మోహముద్గరము (భజగోవింద శ్లోకములు)
యావద్-విత్తోపార్జన
సక్తః
తావన్-నిజపరివారో
రక్తః l
పశ్చాజ్జీవతి
జర్జర దేహే
వార్తాం కోఽపి న
పృచ్ఛతి గేహేll 5 ll
ధనము
సంపాదిన్చుచున్నంతవరకే నీ బంధు మిత్ర స్వజనము నిన్ను ఆశ్రయించుటయే గాక నీయందు
అనురాగము అనురక్తి చూపుతారు. ముసలితనముతో
నీవు శక్తి విహీనతచే మూడు కాళ్ళపై కూడా నిలువలేక నిలచినపుడు నీ దరిజేరువారు
నీ బాగోగులను గూర్చి యోచించువారు ఉండరుగాక ఉండరు. మహా అంటే భార్యకు భర్త భర్తకు
భార్య ఉంటారేమో! ఆవిధముగా ఉంటే అది జన్మాంతర సుకృతము. అదియే నీ ధర్మమూ నీకిచ్చు
ప్రతిఫలము.
మృగం శరీరముసృద్య
కాష్టలోష్ట సమంచితం l
విముఖా
బాంధవాయాంతి ధర్మస్తమనుగచ్ఛతిll
మృతో వ్యర్థం నమోక్ష్యామి బాధానేషయామి
మూర్ధని l
ఇతిచ్ఛేత్ సుధృడా
బుద్ధిః పాత్రేదేయమశజ్ఞ్గితమ్ll
మూర్ఖుడు
సంపాదించి కూడబెట్టిన ధనము అంతా చచ్చినతరువాత మూటకట్టుకొని పోవచ్చుననుకొన్నాడు. దానిని
మృతుడు ఎన్నటికీ తీసుకోపోలేడు పైలోకాలకు అన్నది తెలుసుకోలేక పోయినాడు. కానీ తాను
పాత్రత కలిగినవారికి చేసే దానము అక్షయమై
మనతోబాటే వస్తుంది. ఇది దానానికి మాత్రమే కాదు ధర్మానికి కూడా వర్తిస్తుంది. అసలు
దానము ధర్మములోని అంతర్భాగమే! నీతి శాస్త్రము ఈ విధముగా చెబుతూ వుంది.
ధనాని భూమౌ
పశవశ్చ గోష్ఠేl
నారీ గృహద్వారి
జనాః శ్మశానేl
దేహ శ్చితాయాం
పరలోకమార్గేl
ధర్మానుగో గచ్ఛతి
ఏకమార్గాఃll
ధనమును
భూమియందును, పశ్వాదులను కోష్టము
అనగా కొట్టముల యందును, భార్యను యింటి
గుమ్మము వరకునూ, బందుమిత్రాదులు శ్మశానము
వరకును, దేహము చితి వరకునూ
వస్తాయి. కానీ జీవుడు ఏకాకియై పరలోక
మార్గమున పోవునపుడు ధర్మ మొక్కటే అతనితో గూడ వస్తున్నది.
ఇదొక్కటి
గుర్తుంచుకుంటే చాలు,చాలావరకూ
మనుష్యులు పాపాలు చేయకుండా జీవించగలగటానికి. అదే
ధర్మపాలనాయొక్క గొప్పదనము.
మనకు ఆస్తిక్యము అత్యంత అవసరము. ఆస్తిక్యము అంటే వేరేమీ కాదు. శృతి స్మృతులయందు భక్తి శ్రద్ధ విశ్వాసము. అదిలేకుంటే నాస్తిక్యమే! నాస్తికునికి భగవంతునిపై విశ్వాసము లేదు. వేదశాస్త్రాలపై నమ్మకము లేదు. ఆచారాలు పాటించే ఆలోచన లేదు. వీరిని చార్వాకులు అంటారు. చర్వము అంటే నములుట . వీరికి తిండి పై యావ ఎక్కువగా ఉండేదట. ఒకవిధముగా కట్టుబాటు లేని జీవితమేమో!లోకాయుత అన్నది వీరికి మరొకపెరు. శ్రీరాముని సలహాదారుల సంఘములో చార్వాయకుడగు జాబాలి ఒకడు. శ్రీరాముడు జాబాలి మాట పాటించకున్నా వినేవాడు. చాణక్యుడు కూడా వీరివాదన వినుటలో తప్పులేదన్నాడు. కానీ ఈ చార్వాకులకు నిర్దేశ సూత్రములు బలముగా లేవు. తాను వలచినది రంభ తాను మునిగినది గంగ అన్నది వారి సాంప్రదాయము గామోసు. ధర్మ పాఠమును నమ్మినవానికి కొన్ని మౌలిక సూత్రములు అనుసరించవలసియుంటుంది. అవి అతని, అతని కుటుంబపు బాగును శాసించుతాయి. జైనులు బౌద్ధులు, జగద్గురువులగు శంకరులు చార్వాకమును తృణీకరించినారు. ధర్మమార్గమును అవలంబించినవారి జీవితమును మనము పరిశీలించితే వారు ఎన్నో అద్భుతములను చవి జూచినవారు. అది తనను ఆశ్రయించినవారికి అనుభవైకవేద్యము. ‘వెదరపాక GOD’ గా వ్యవహరింపబడే ఒక మహనీయుని గూర్చి నేను తెలుసుకొని యుండినాను. నాకు సోదర సమానుదాగు వ్యక్తికి వారిని గూర్చి తెలిపి, ముందువెనుక యోచించకుండా ఆయన శరణు వేడమన్నాను. అతను నామాటపై గురుత్వముంచి ఆయనను ఆశ్రయించి సత్ఫలితమును పొందినాడు. అతడు అసలు తనకు మంచి జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. కావున ధర్మానుసారులు పరమ భాగవతులునగు మహనీయులు నేటికీ లోకకళ్యాణదీక్షా దక్షులయి ఉన్నారు. ఒకేఒక ఉదాహరణ చెబుతాను. ఒక చార్వాకుడు వ్యాధిగ్రస్తుడయినాడని అనుకొందాము. అతను నసమ్ముకోగలిగినది నేటికీ పరిపక్వత లేని Alopathi ని మాత్రమ కదా! అతనికి దేవుని తలువడు. మాటకు, వెంకటేశ్వరునికి ముడుపు కట్టడు, ‘వేదరపాక GOD’ వంటి నిజమైన మహనీయుల వద్దకు పోడు. చివరకు తనజీవితమును crematorium లో ముగించుకొంటాడు. తనకు ధర్మబద్ధమగు అంత్యక్రియలు జరుగుతాయన్న సంతృప్తిని కూడా అతను పొందలేడు. కావున ఎప్పటికీ ధర్మ మార్గమే మనము అనుసరించ తగినది.
మిగిలినది
మరోమారు ........
వైదిక ధర్మము – 4
ఏనాస్తి
పితరోయాతాః ఏనా యాతాః పితామహ l
తెనాయాయా
సకామర్త్మా ఏనగచ్ఛన్నవిష్యతి ll
మన తండ్రి, తాత, ముత్తాతలగు పూర్వీకులు ధర్మ
మార్గమూనందు నడచి ఆబాటలో ఎటువంటి ఆటంకములు లేకుండాజేసి మనమార్గమును సుగమముజేసి
భద్రపరచినారు. మనము వేరుదారి వేదుక నవసరమే లేదు.
సంధిగ్ధేతి
పరేలోకే కర్తవ్యో ధర్మధీవహిl
నాస్తికిన్ననాస్తినో
హానిః ఆస్తికిన్ననాస్తికో హతః ll
ఈ శ్లోకార్తమును
ఒక ఉదాహరణ రూపములో చెబుతాను. ఒకే గమ్యము చేరుటకు రెండు దారులున్నాయి. ఒకడు ఎటువంటి
పచ్చదనము లేని బాటను ఎన్నుకొని ఆ దారిన నడక సాగించ దలచి తన మిత్రునికి కూడా అదే
సలహా ఇచ్చినాడు. కారణం అది పదుగురు నడచిన దారి. కానీ ఆ మిత్రుడు వినక పచ్చిక ఉన్న
మార్గమును ఎన్నుకొన్నాడు. నిజానికది పచ్చిక కాదు. అంతా పల్లేరు గాయాల మొలకలే. అవి
భూమిని అంటుకొని ఉంటాయి. వాటికి ముళ్ళు విరివిగా ఉంటాయి. అవి కనిపించనివి.
రెండవవాడు పైమేరుగులకు బేలుపోయి ఆదారిని ఎంచుకొని గమ్యము చేరలేక పోయినాడు. కావున
పెద్దలు చూపిన ధర్మమార్గామను దారిన వెళ్ళితే పుణ్యలోకాలు ఒక వేళ ఉంటే అక్కడికి
చేరగలుగుతాము. లేకుంటే మన ధర్మదీక్ష వల్ల మన పేరు కొంతకాలమైనా, మన తదనంతరము, భూమిపై ఉంటుంది.
అదే పాపకర్ముడు ఒకవేళ పైన నరకము ఉంటె తప్పక అక్కడికే చేరుతాడు. అదిలేకున్నా వీడు
చేసిన దుష్టకార్యములకు సంఘము చే ఛీకొట్టబడుతాడు. ఈ మాట ఒకపరి గమనించండి:
అత్యుత్కటైః
పుణ్యపాపైః ఇహైవ పరమశ్నుతేll
మనము చేసిన
పుణ్యము గానీ పాపము గానీ మరు జన్మలో
అనుభవించుట సామాన్యము. కానీ ఆపుణ్యము లేక పాపము అసాధారణమైనది అయితే ఆయా
ఫలితములు ఈ జన్మలోనే అనుభవమునకు వస్తాయి. ఎందరినో నిర్దాక్షిణ్యముగా స్వలాభము
కొరకు హత్య చేయించి పబ్బము గడుపుకొన్న ఎందఱో నాయకులుఈ జన్మములోనే ఎంతో దుస్తితిలో
మరణించుట చూసినాము. ఈ ధర్మము ఈ వైదిక ధర్మము, ఈ సనాతన ధర్మము, ఈ హిందూ ధర్మము
అత్యంత పుర్రాతనమైనది. ఎందఱో ఋషులు, మునులు యోగులు వారి వారి స్వీయ అనుభవములను
జోడించి వేద నిధులను శాస్త్ర రూపములో ప్రామాణికముగా మనముందు ఉంచినారు.
తెలుసుకొనుటకు బద్ధకమగుటచే ఈ సనాతన ధర్మమునే నిర్వీర్యము చేయుచున్నారు నేటి
హైందవులు. ఈ సనాతన ధర్మపరిరక్షణను కర్తవ్యముగాభావించి, సంఘములో తమ హోదాతో సంబంధము
లేకుండా నడుము బిగించి పాటుపడవలేనన్నది భారతీ తీర్థులవారి ఆదేశము.
మిగిలినది
మరోమారు........
వైదిక ధర్మము – 5
దయతో ఈ
వాస్తవమును అర్థము చేసుకొండి.
నీదగు ధర్మమువీడక
మది నిండిన ప్రేమ
తోడ మసలితివంటే
తుది వరకు నిలుచు
శ్రీహరి
వదలక నీతోడ సతము
వరలును రామా!
పరోపకారః పుణ్యాయ
పాపాయ పరపీడనమ్l
ఏతద్విద్యా
సమశ్రేన లక్షణం పుణ్యపాపయోఃll
పరోపకారాయ
ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి నద్యః ।
పరోపకారాయ
దుహన్తి గావః పరోపకారార్థమిదం శరీరమ్ ॥
మంచిని, ఆచరణ యోగ్యమైన విషయాలను గూర్చి
ఎవరు చెప్పినా పరోపకారము చేయండి పాపము చేయవద్దండి అని చెబుతారు, వారి మాటలకు మూలము
ధర్మశాస్త్రములే! ఈ ముఖ్యమైన మాట వినండి.
శరీరమాద్యం
ఖలు ధర్మ సాధనమ్
‘కుమారసంభవం’
కావ్యంలో కనిపించే పై సూక్తికి అర్థం ఏంటంటే.. శరీరమే ముఖ్యమైన ధర్మసాధనం అని!
సాధనం అంటే పనిముట్టు. కర్మలు చేసేది శరీరం. ధర్మాన్ని అభ్యాసం చేసేది, సాధించేది శరీరమే. చతుర్విధ
పురుషార్థాలు సాధించడానికి కావాల్సిందీ దేహమే. దేహమే దేవాలయం అన్నారు. అట్టి
దేహంలో ఉన్న దైవాన్ని సందర్శించాలన్నా ఉపయోగపడవలసింది దేహమే. కాబట్టి శరీరం
ఆరోగ్యంగా చైతన్యవంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే శరీరానికీ
మనస్సుకూ సమన్వయం కుదురుతుంది. ఆధ్యాత్మిక సాధనలో మొదట శరీరం, తర్వాత మనసు కుదుటపడి ఉండడం ముఖ్యం.
అందుకోసం ఆహారనియమాలు, యోగాభ్యాసం, సత్యవంతమైన జీవనవిధానాన్ని ధర్మయుట
మార్గాన్ని అలవరచుకోవాలి.
ఈ
ధర్మ స్థాపన కొరకే అద్వైత సిద్ధాంతమును ప్రచారము చేయుటకు వెయ్యి సంవత్సరములక్రితమే
32 సంవత్సరములకే మూడు మార్లు దేశమును సంపూర్ణముగా తిరిగి దేశము నాలుగు చేరుగులా
నాలుగు పీఠములను స్థాపించి ధర్మ ప్రచారము చేయ నిర్దేశించినారు. ఆ అపర శంకరుల ధర్మ
నిష్ఠా తత్పరత, దూరాలోచన, మానవ సౌభాగ్య చింతన ఒక్కసారి
అవగాహనకు తెచ్చుకొని ఆలోచించండి. ఈ వ్యాసమునకు వ్యాసులవారు చెప్పిన మాటతో భరత
వాక్యము పలుకుచున్నాను.
శ్లోకార్డేన
ప్రవక్ష్యామి యదుక్రం గ్రంథకోటిభిః |
వరోవేకారః
పుణ్యాయ పాపాయ పరపీ డనమ్ Il
ఇది వ్యాసులవారు
నొక్కి వక్కాణించుతూ మనకిచ్చిన సందేశం.కోటి గ్రంధాలయ సారాంశాన్ని ఈ ఒక్క శ్లోకములో
పొందుపరచుచున్నాను.
ఇతరులకు ఉపకారం
చేస్తే పుణ్యం కలుగుతుంది అదే అపకారం చేస్తే పాపం వస్తుంది.
ఈ వ్యాసమునకు
మూలము శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానము వారి అనుగ్రహ భాషణము,
పాహి భారతీ తీర్థ
- తవ చరణం – మమ శరణం
వేదవదన శ్రిత భక్త కరుణ మమ
దురిత దమన అను నిత్యం
దురిత దమన అను నిత్యం
భవ తాపహర గురుదేవ
మమ పాపహర గురుదేవ
1. జ్ఞాన కుసుమ వని శాస్త్ర దివ్య ఖని
ఆర్ద్ర హృదయ సదన
స్వామీ - ఆర్ద్ర హృదయ సదన
భవ తాపహర గురుదేవమమ పాపహర గురుదేవ
2. రాగ నేత్ర యతి పాణి వేత్ర ఘన
సాంప్రదాయ సూత్ర
సాంప్రదాయ సూత్ర
భవ తాపహర గురుదేవ
మమ పాపహరా గురుదేవ
3. సకల చారుగుణ చపల హారణ
శారదేందు కిరణ
శీతల శారదేందు కిరణ
భవ తాపహర గురుదేవ
మమ పాపహర గురుదేవ
4. భస్మ ధారణ పాప దారణ
భక్త వంద్య చరణ
శరణం భక్తవంద్య చరణ
భవ తాపహర గురుదేవ
మమ పాపహర గురుదేవ
5. చంద్ర శీర్షధర చారు శారద
నిత్యపూజ నిరత
స్వామి - పాహి భారతీ తీర్థ
భవ తాపహర గురుదేవ
మమ పాపహర గురుదేవ
స్వస్తి.
Good information. Thanks sir
ReplyDelete