Wednesday, 19 February 2014

ఇంతి- చేమంతి- పూబంతి


ఇంతి- చేమంతి- పూబంతి

కపిత్థస్యఫలంచైవయథా కుంజర భక్షితంl
తస్య సారంచ ఘృణ్ణీయాత్ తాతా హవిరసం ప్రభోll
ఈ శ్లోకము నుండి మనకు కావలసిన మేరకు అర్థమును గ్రహించితే, ఏ విధముగా వెలగ పండును మ్రింగిన కరి డొల్లను యథాతథముగా విసర్జించి అందులోని గుజ్జును తానూ గ్రహించుతుందో అదేవిధముగా ఏ దేశపు సంస్కృతి నుండియైనా మంచిని గ్రహించి చెడును విసర్జించమంటున్నది ఈ శ్లోక సారము. యజ్ఞకుండములో దేవతల కొరకు మనమెన్నో ధర్మబద్ధమైన వస్తువులను వేస్తాము. వాని సారమును ఆయా దేవతలు హవిస్సుల రూపములో గ్రహించుతారు. మరి దేవతలే కదా ......
నేను వ్రాసిన ఈ పద్యాన్ని శ్రద్ధతో కొంచెము మనసు పెట్టి చదవండి.
ఫ్రిజ్జి గృహము, పవరు ప్రియమైన భార్యౌను
భర్త అందులోని పాయసమ్ము
పవరు లేని ఫ్రిజ్జి పాయసమ్మునకెట్లు
ఉనికినిచ్చదెట్లు పనికి వచ్చు

పెద్దలీవిధంగా చెప్పినారు.
పుత్రపౌత్ర వధూ భ్రుత్యైః ఆకీర్ణ మాపి సర్వతః
భార్యాహీన గృహస్తస్య శూన్యమేవ గృహం భవేత్ (మహా భారతము)
కొడుకులు కోడళ్ళు మనమలు మనవరాళ్ళు దాసదాసీ జనము ఎంతమంది ఉన్నా భార్యలేని వారి బ్రతుకు దుర్భరము.ఎంత నిజమైన మాటో చూడండి. ఇది మన సంస్కృతి. దీనిని పునరుద్ధరించండి. ధర్మాన్ని కాపాడండి. వయసు ఒకే విధంగా వుండదు.నిన్నటి యువకులము నేటి వృద్ధులము. నేటి యువకులు రేపటి వృద్ధులు. అంతే తేడా. అనురాగము పెంచండి. ప్రేమ అను రాగము ఆలపించండి. ప్రేమానురాగాలను పంచండి.
స్త్రీ ని అర్థము చేసుకోండి.
కార్యేషు దాసీ కరణేషు మంత్రీ రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి
భోజ్యేషు మాతా శయానేషు రంభా షట్కర్మ యుక్తా సహధర్మ పత్ని
ఇన్ని గుణాలు కలిగినది స్త్రీ. ఒకవేళ తనలో తప్పులేవైనా వున్నా మచ్చికతో మార్దవముతో చెబితే అర్థము చేసుకొంటారు.
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
యత్రైతాస్తు అపూజ్యంతే తత్రైతా స్తఫలాక్రియాః
ఇది మనుస్మృతి లోని శ్లోకము.దీనివల్ల మాకు ఏమి అర్థమౌతుంది . స్త్రీలను మనము ఎంతగా గౌరవిస్తామన్న విషయము అర్థముకావటములేదా ! మరి మనము ఎందుకు స్త్రీలపై చిన్న చూపు చూస్తున్నామని నలుగురిచేత అభిశంసింప బడుతున్నాము. విష్ణుభక్తి పరాయణుడే కావచ్చు కానీ దైత్యుడై కూడా ప్రహ్లాదుడు తన దృష్టికి ఆడవాళ్ళు అడ్డుపడితే వారలను మాతృ భావముతోచూసి దృష్టి ప్రక్కకు మరల్చేవాడని తెలుగుభాగవతమున పోతన గారు శెలవిస్తారు. అదే స్త్రీలను నీచ దృష్టితో చూసిన రావణ దుర్యోధనుల గతి ఏమైనదో ఒకసారి మనము పరికిస్తే అర్థమౌతుంది. నేడిది గతమైనది. కొందఱు యువకులకు అసంగత  మైనది. 

చాటింగులతో మొదలై

మీటింగుల దాక వెళ్లి మీరిన మదమున్

డేటింగు చేసుకొనుచును 

చీటింగుల కంపవాత చిక్కిరి రామా!

ఒక ప్రఖ్యాత నటుని కుమారిత తండ్రిపాలనలో తానూ గోప్పనటియైనా తండ్రి యొక్క కాముక గుణ సంచయమును పుణికిపుచ్చుకొని నానా న్యూన విలాస కేళికలపై వ్యామోహ తీవ్రంబుచే ఈ రోజు తండ్రి వద్దకు పోలేక తండ్రిచే విడువబడిన తల్లిని చేరలేక, తమ ఘాతుక కామమునకేరజేసిన కాముకులలో ఏ ఒక్కరూ చేరదేయక ఒక మహానగరములో ఒంటరిగా ఒక చిన్న గదిలో ఉంటూ తన వద్తాద డబ్బు పుష్కలముగా ఉన్నా,   ఒక్కర్తెయే US పోలేక, ప్రాణాంతకమైన గర్భ రోగ వ్యాధిచే ఇచటనే ఉండిపోలేక సతమత మౌతూ సాన్త్వనకై ఆశతో ఎదురు చూస్తూవున్నది. ఇదీ విశృంఖలత, స్త్రీలకు అడగకుండానే ఇచ్చే బహుమానము.

 కొందరు పురుషుల దృష్టిలో స్త్రీ ఆటబొమ్మ. చాటింగులతో తో మీటింగులనుండి డేటింగులకు, ఆపైచీటింగులకు,  సెల్లు మాటలనే సొల్లు మాటలకు ఒక అడుగు ఇంకా ముందుకు పోయి 'LOVE JIHAD' లకు ఎరలను జేసి తమ  యువత విచ్చలవిడిగా సంచరిస్తూ,లేత వయస్సు లోనే బాలికలను విషయవాంఛలకు లోబడ జేసి మొగ్గ గా చిదిమేస్తున్నారు, మొక్కగా తుంచేస్తున్నారు. మరి లొంగకుంటే   స్త్రీలపై యాసిడ్ దాడులు, గొంతులు కోయడాలు, మానభంగాలు ఇలాఎన్నోదురాగాతాలు సమాజంలో జరగడానికి కారణం క్రమశిక్షణా లోపమే. ఎంత చదువు చదివినా,ఎంత విజ్ఞానం సంపాదించినా, ‘అరణ్యరోదన’ యై పనికి రాకుండా పోతూవుంది. అసమానతలు తొలగి, ఆభిజాత్యాలు మరచి, అందరు సుఖశాంతులతో జీవించాలన్నా, సమతా,మమతా, మానవతలు సమాజంలో వెల్లివిరియాలన్నా ఉన్నది  ఒక్కటే మార్గం. అది మన సంప్రదాయాలను పాటిస్తూ, పెద్దలుచేప్పిన మార్గంలో పయనించడమే! ఈ మాటలు కేవలము పురుషులకే కాదు స్త్రీలకు కూడా! ఈ నాడు వేషధారణలో కానీ, భారతీయ సంస్కార ఆచరణలోగానీ ఆవగింజంత గౌరవములేకుండా విశృంఖలముగా ప్రవర్తించుచున్నారు నేటి వనితా యువత. ఇది తమకు, తమ కుటుంబానికి, తమ బంధు వర్గానికి, తమ ధర్మానికీ, తమ దేశానికి ముప్పు వాటిల్లునని ఊహించక తప్పుచేయుచున్నారు.

ప్రతి ఇంట్లో అమ్మరూపంలో ఉన్నది ఆ పరాశక్తే! కనుకనే ‘మాతృదేవోభవ’ అని వేదాలు బోధించినాయి. తిరిగీ   మనుస్మృతిలోని ఈ క్రింది శ్లోకాన్ని  మరొక్కమారు మీ ముందుంచుచున్నాను.
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాఃl
యత్రైతాస్తు అపూజ్యంతే తత్రైతాస్తఫలాక్రియాఃll
ఎక్కడ స్త్రీలు పూజింప బడుతారో,అక్కడ దేవతలు నివసిస్తారని, ఎక్కడ పూజింపబడరో అక్కడ కార్యములన్నీ నిష్ఫలములనితెల్పి, 'స్త్రియః శ్రియశ్చ గేహేషు నవిశేషోస్తి కశ్చన' స్త్రీలు గృహానికి లక్ష్మీ సమానులే !, ఇంతకు మించిన  విశేషషణము స్త్రీకి వేరేదయినా కూర్చగలమా! నిజానికి ఇది విశేషణము కాదు, స్వభావోక్తి. అందుకనే వివాహ సమయంలో కన్యాదాత 'కన్యాం కనక సంపన్నాం' అని  “లక్ష్మీ నామ్నీం కన్యాం లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయదదాతి' అనిచెప్పి కన్యాదానం చేస్తారు. తమ ఇంట బుట్టిన ఆడపిల్లను, తండ్రి, సోదరులు, బాగాచూసుకోవాలని,అమ్మాయికి కావలసినవి సమకూర్చ వలెనని మనువు ఎంతో విపులంగా వివరిస్తాడు.
పితృభి: భ్రాత్రుభిశ్చైతాః పతిభిర్దేవరైస్తథా: l
పూజ్యా భూషయితవ్యాశ్చ  బహు కళ్యాణమీప్సుభి:ll
అనగా తండ్రి, సోదరులు, భర్త, మరదులు అందరు స్త్రీలని  గౌరవించాలని, వారుకోరిన భూషణవస్త్రాదులనిచ్చి సంతృప్తి పరచాలని చక్కగా వివరిస్తాడు. స్త్రీకి పురుషుడు సదా  అండగాఉండాలని మనుధర్మ శాస్త్రం బోధిస్తుంది. ఇదే అర్థంలో
పితారక్షతి కౌమారే/ భర్తారక్షతి యౌవ్వనే /
రక్షంతిస్తావిరే పుత్రా: / నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి.
బాల్యములో తండ్రి, యౌవ్వనంలో భర్త, వార్ధక్యంలో పిల్లలు రక్షణ కల్పించాలని, రక్షణ లేకుండా ఉంచకూడదని మనువు స్త్రీలకి అధిక ప్రాధాన్యతనిస్తే, మనువును, ప్రాచీన సంప్రదాయాలను ఇష్టపడని ఆధునిక వితండవాదులు కొందరు పైశ్లోకము యొక్క
అర్థమును  అవగాహనా రాహిత్యముతో  చివరి పాదము యొక్క చివరి వాక్యము అనగా  'నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి' అన్నది మాత్రంగ్రహించి,  మనువు స్త్రీలకు వ్యతిరేకి, స్త్రీలకి స్వేఛ్చ లేదన్నాడని వాదిస్తారు. అట్టి వారికి ఎంత నచ్చ చెప్పినా మహాబధిరశంఖారావమే! వారెన్నటికీ  తమ ప్రవర్తన మార్చుకోరు. ‘మూర్ఖుని మూర్ఖత మాన్పవచ్చునే’ అన్నాడు భర్తృహరి.

నేటి తలిదండ్రులకు డబ్బు మీద, పైకప్పు మేకప్పుల మీద, Star Hotel తిండ్ల మీద, తప్ప భావితరానికి తాము అందజేయవలసిన సాంస్కృతిక సంపద ఎంత వరకూ వారసత్వముగా అందివ్వగలుగుచున్నాము అన్న ఆలొచానకు తావివ్వరు. బాల్యంనుండియే మంచిఅలవాట్లు, సత్సాంప్రదాయాలు నేర్పిస్తే, భావితరాలు బాగుపడవా! మరి పై విధముగా మాత్రమే ఆలోచించేవారు భావితరాలకు ఏమివ్వగలరు.
 స్త్రీలను గూర్చి మనువు ఇంకా ఏమంటున్నాడో చూద్దాము.
శోచంతి జామయోయత్రl వినశ్వత్యాశు తత్కులంl
నశోచంతితు యత్రైతాlవర్ధతే తద్ధిసర్వదాll
అనగా ఆడపడుచులు ఏయింట సోదరులచే ఆదరించ బడతారో ఆయింట వంశం వర్ధిల్లుతుంది. లేదా నశిస్తుంది.
తస్మానేతాన్సదా పూజ్యాఃl భూషణాచ్చాదనాశనైl
భూతికామైర్నరైర్నిత్యంl సత్కారేషూత్సవేషుచll
తమ ఇంట పండుగలు శుభకార్యాలు జరుపుకొనేటప్పుడు, ఆడపడుచులను పిలచి మంచి భోజనం పెట్టి, వస్త్రాలు,భూషణాదులనిచ్చి సంతృప్తి  పరచాలని చాలా విపులంగా, చక్కగా మనుస్మృతి వివరిస్తుంది. కనుకనే పండగ రోజులలోకూతుళ్ళని, అల్లుళ్ళని పిలచి, ఉన్నంతలో వారికి కట్నకానుకలిచ్చి సంతృప్తి పరచే సంప్రదాయం మనం పాటిస్తున్నాం. ఇలా శృతి,స్మృతి,పురాణాలలో, వేదాలలో, ఉపనిషత్తులలో  స్త్రీకి ఎంతో ఉన్నత స్థానంకల్పించ బడింది.

ఇక భార్యాభర్తల సంబంధంగూర్చి ఎంతగోప్పగా చెప్పారో చూడండి.వివాహ సమయంలో సప్తపది అనే తంతులో చదివేమంత్రాలలో ఒకమంత్రం ఇలా తెలపుతుంది.
సఖా సప్త పదాభవ, సఖావౌ సప్త పదా బభూవః,
సఖ్యంతే గమేయం, సఖాత్తేమాయోషం, సఖ్యాన్మేమాయోష్టా:l
అనగా ఈ ఏడడుగుల బంధంతో భార్య,భర్తలమైన మనం ఇకపై స్నేహితులగా ఉంటూ, పరస్పరం స్నేహ భావాన్ని విడవకుండా పయనిద్దాం. ఎంత ఉదాత్తమైనభావన! 'ఆపత్సు మిత్రం జానీమః' కష్టాలలో ఆదుకొను వాడేమిత్రుడు. అట్టిమిత్రభావముతో భార్యాభర్తలు ఉంటే, వారిమధ్య కలతలు, కార్పణ్యాలు, ఆవేశకావేశములు, అసమానతలకుతావు లేకుండా నిత్య వసంతములా వారి జీవితం సాగిపోతుంది.
సంతుష్టో భార్యయాభర్తాl భర్తా,భార్యా తధైవచl
యస్మిన్నేవ కులేనిత్యంl కళ్యాణం తత్రవై ధృవంll
అనగా భార్యా,భర్తలు పరస్పరం ఒకరిని,ఒకరు గౌరవిచుకొంటూ,ప్రేమానురాగాలతో సంతుష్టులుగా ఉంటారో ఆయిల్లునిత్యకల్యాణం, పచ్చతోరణంగా విలసిల్లుతుంది అని చెబుతూనే  
యదిహ స్త్రీనరోచేతl పుమాంసంన ప్రమోదాయేత్l
అప్రమోదాత్ పునః పుంసఃl ప్రజనం నప్రవర్తతేll
అని చెబుతున్నాడు. భార్యను భర్త కష్టపెడితే, ఆభార్య భర్తకు సహకరించదు. అపుడు ఆ ఇంట వశం వర్థిల్లదు. అని వివరించి,

అనుకూల కళత్రోయఃl తస్య స్వర్గ యిహైవహిl
     ప్రతికూల కళత్రస్యl నరకో నాత్ర సంశయఃl

                                  స్త్రియాంతు రోచమానాయాంl సర్వం రోచతేకులంl
 స్త్రియామరోచమానాయాంl సర్వమేవ నరోచతేll
భార్యలు అనుకూలంగా ఉండి, సంతోషంగా ఉంటే ఆ గృహం స్వర్గమే. లేకుంటే నరకమే. ఇలా ఎన్నోవిధాలుగా వేలవేలసంవత్సరాలకు పూర్వమే స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది, అని మన ప్రాచీనసాహిత్యం తెలుపుతోంది.
 అహంకారానికి ఇరువురూ తావివ్వకుంటే జీవితము పూవులబాటే.Divorce, తలాక్ మన సాంప్రదాయము లో లేని విషయాలు. 'ప్రాణం వాపి పరిత్యజ్జ మానమే వాభి రక్షతుఅన్న సంస్కృతి మనది.

 మనము ఈకాలంలో స్త్రీలు అన్నిరంగాలలో ముందుకు దూసుకు వెళ్తున్నారని గొప్పగా చెప్పుకొంటున్నాము. ఆధునికులు కొందరు పిల్లలకు స్వేచ్చనిస్తే, దానిని 'బ్రహ్మకైనపుట్టురిమ్మతెగులు' అన్నభావన కలిగించే విపరీతవస్త్రధారణ, పాశ్చాత్యనాగరికతకు వర్తిస్తుందేమో కాని భారతీయ సంప్రదాయానికి, వర్తించదు. సెల్ ఫోనుసంబాషణ, చదువు పేరుతో ఇంటికి ఆలస్యంగా వస్తూ, బైకులపై షికారులు చేస్తూ  కాలాన్నిదుర్వినియోగ పరుస్తూ,పతనమే పరమావధిగా ప్రాకులాడే యువతను  మనము చూస్తున్నాము. ఇది ఆడపిల్లల్లో ఏర్పడిన వ్యసనముగా మనము తలువవచ్చు. ఈ విధానంలో ఆడపిల్లలే కదా ఎక్కువగా నష్టబోతున్నారు. విసుగు,కోపం, అలజడి, మానసిక అశాంతి, అసంతృప్తి, భార్యా,భార్తలమధ్య అవగాహనారాహిత్యం, పిల్లల్ని సరిగాపట్టించుకోనందున అధిక

స్వేఛ్చ వంటి అవగుణాలు సమాజంలో పెరుగుతూ,సంబంధ, బాంధవ్యాలను తెంచుతూ, వైదిక జీవన విధానాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కారణం ప్రాచీన సంప్రదాయాలను, పెద్దలమాటలను పట్టించుకోకుండా కొత్త వింత పాత రోత అనుకొనుటయేనని, గమనించినచో అనిపిస్తుంది.

ఉదయకాల ఉషోదయాలని తిలకిస్తూ, హరిత తరువులు, పక్షుల కిలకిలారావాలు, వికసించే పుష్పాలు, వాటిలోని పుప్పొడిపైనుండి వచ్చే చల్లని పిల్లగాలుల సుఖస్పర్శలు, వెన్నెల రాత్రులలో నదీ సైకత వేదికపై విహారాలు, పచ్చని కంబళ్ళు పరచినట్లుండే పర్వత సానువుల సోయగాలు తిలకిస్తూ, కదిలేమబ్బుల్ని,ఎగిరే కొంగలబారుల్నిచూస్తూ, దేవాలయాల మంగళ వాద్యాలను,ఘంటా నాదాల్ని, గుడి గోపురపు గూళ్లలోని పావురాయి కువకువలు వింటూ,
ఒడ్డును తాకి విరిగి, ఒరిగే సముద్రకెరటాలను, పసిపాపల నవ్వులను, పతంగాల(గాలిపటాల) విహారాలను, రంగు రంగుల సీతాకోక చిలుకలను, నీలిమేఘాలలో, గాలి కెరటాలలో దోబూచులాడే నిండు పున్నమి చంద్రుని, ఎలమావి చివురులు మెసవి కూసే పిక కూజితాలను, ఇంకా ఎన్నెన్నో ప్రకృతి పరమైన అందాలను ఆనందాలను అనుభవించమని పరమాత్మ మనకిస్తే,  ప్రకృతిని కలుషితంచేస్తూ,మనం ఇంకేదో కావాలని, లేనిదానికోసం,తెలియని దానికోసం పరితపిస్తూ,పరిభ్రమిస్తూ కాలాన్నిమేధస్సును,మన విజ్ఞానాన్ని వృధాపరుస్తూ నిస్సారమయిన బ్రతుకు బ్రతికుచున్నాము.

అలాకాకుండా శృతి,స్మృతి, వేదోపనిషత్తులలో చెప్పిన విషయాలకు సంబంధించిన 
వ్రాతలను చదివి ఆకళింపుజేసుకుని, మన సంప్రదాయాలని ఆచరిస్తే జగమంతా నిత్యకల్యాణం పచ్చతోరణంగా విలసిల్లుతుంది అనుటలో సందేహంలేదు. లేకుంటే నిత్యానందమన్నది గగనకుసుమ, అరణ్యరోదన, బధిరశంఖారావ, అజాగళ స్తన న్యాయములవలె కనరానిదై, వినరానిదై, జీవితము వ్యర్ధమైపోతుంది.
ఇదినిజము. ఇదేనిజము.
స్వస్తి.

















No comments:

Post a Comment